15, సెప్టెంబర్ 2020, మంగళవారం

*ధర్మం.*



అందరూ అంటుంటారు ధర్మమే గెలుస్తుంది అని.. అది తప్పు.. ధర్మం దానంతట అదే గెలవటం కాదు.. నువ్వు గెలిపించాలి, మనం కలిసి గెలిపించాలి.. అర్థం కాలేదా...

అయితే రండి... ఒక్కసారి నెత్తుటితో తడిసిన చరిత్ర పుస్తకాలలోకి తొంగి చూడండి..

త్రేతాయుగంలో రాముడి భార్యను రావణాసురుడు ఎత్తుకెళ్ళాడు, సరేలే ధర్మమే గెలుస్తుంది కదా, తన సీత తిరిగి వస్తుంది అని రాముడు చేతులు కట్టుకొని గుమ్మం వైపు చూస్తూ కూర్చోలేదు.. రావణాసురుడి మీదా ధర్మయుద్ధం ప్రకటించాడు. ఆ రాముడికి అఖండ వానర సైన్యం తోడై ధర్మం వైపుకు అడుగులు వేశారు, ఆ యుద్ధంలో రాముడికి సైతం గాయాలు అయ్యాయి. తన భుజాలను, తొడ భాగాల చర్మాన్ని బాణాలు చీల్చుకొని వెళ్ళాయి. నరాలు తెగి రక్తం చిందుతున్నా సరే తట్టుకొని నిలబడ్డాడు, పోరాడాడు, యద్ధంలో గెలిచాడు.. ధర్మం గెలిచింది...

ద్వాపరయగంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు తను దేవుడు కదా అని ఓక సామాన్య మానవుడు లా యుద్దాన్ని చూడలేదు.. ధర్మం చూసుకున్నాడు. పాండవుల పక్షాన నిలుచున్నాడు. అర్జునుడికి రథ సారధిగా మారాడు, గుర్రానికి గుగ్గిళ్లు పెట్టాడు, దాని పేడ ఎత్తేశాడు. స్నానాలు చేయించాడు.
ఆ యుద్ధంలో రథాన్ని నడుపుతూ ఆ వేగంలో వెనకాల అర్జునుడి మాటాలు వినపడవు గనుక అర్జునుడు తన కాలుతో కృష్ణుడి కటి భాగంలో ఎటువైపు తగిలిస్తే రథాన్ని అటువైపు తిప్పాలని ముందుగనే అనుకున్నారు.. అలా కాళ్ళతో కూడా తన్నించుకున్నాడు... అవన్ని ధర్మం కోసమే చేసాడు. ధర్మాన్ని గెలిపించడం కోసమే చేసాడు. అలా కురుక్షేత్ర యద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది..

కలియుగం ఇప్పుడు కూడా మనం ప్రతిరోజు సమస్యలతో పోరాడుతునే వున్నాం.. ప్రతి ఒక్కరి మదిలో మంచికి చెడుకి యుద్ధం జరుగుతునే వుంది.. నువ్వు నమ్మితే అది నిజం మాత్రమే అవుతుంది.. ఆచరిస్తే ధర్మం అవుతుంది. అది భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది.

అదే నువ్వు నా, ని, తన, మన భేదాలను పక్కన పెట్టి న్యాయం ఆలోచిస్తేనే ధర్మం అర్థం అవుతుంది..
అలా ఆలోచించి పోరాడిన రోజే ధర్మం గెలుస్తుంది, తెగించి అలా ధర్మం వైపుకు నిలబడిన రోజు నీ వెనకాల ప్రపంచమే నడుస్తుంది..

మన ధర్మాన్ని కాపాడుకుందాం. మన భావితరాలకు అందిద్దాము...

కామెంట్‌లు లేవు: