24, నవంబర్ 2020, మంగళవారం

కర్కశ కథ

  


కార్తీక మాసంలో అందులోనూ ప్రత్యేకించి సోమవారం నాడు ఆచరించిన వ్రతం ఎలాంటి వారికైనా ఎంతటి పుణ్యాన్నిస్తుందో వివరించి చెబుతుంది కర్కశ కథ. 


పూర్వం స్వాతంత్య్ర నిష్ఠురి అనే ఒక ఆమె ఉండేది. ఆమె ప్రవర్తనంతా అత్యంత హేయంగానూ, కర్కశంగానూ ఉండటంతో ఆమెను కర్కశ అని అంటుండే వారు. కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడని పెళ్ళాడింది. ఆమె తన దుర్మార్గ వర్తనంతో మంచి వాడైన భర్తను సైతం హింసించి జారిణిగా జీవితం గడిపి వృద్ధాప్యంలో భయంకరమైన వ్యాధి సోకి చివరలో ఎవరూ ఆదరించే వారు లేక దీనస్ధితిలో మరణించింది. పాప ఫలితంగా మరుసటి జన్మలో శునకంగా జన్మించిన ఆమెకు ఓ కార్తీక సోమవారంనాడు పగటిపూట ఎక్కడా ఆహారమే దొరకలేదు. చివరకు సాయంత్రం వేళ ఒక వేద పండితుడు సోమవారం వ్రతంలో భాగంగా ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో వ్రతం ముగించే విధానంలో భాగంగా ఆచారం ప్రకారం బలిని (అన్నం ముద్దను) తన ఇంటి ముంగిట ఉంచాడు. ఆహారం దొరకని ఆ శునకం ఆ అన్నం ముద్దను తింది. వెంటనే దానికి పూర్వజన్మ స్మృతి వచ్చింది. దాంతో మానవ భాషలో వేద పండితుడికి తన గతాన్నంతటినీ చెప్పింది.


అంతా తెలుసుకొని కార్తీక సోమవారం నాడు పగటి పూట అంతా ఏమీ తినకుండా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మాత్రమే శివుడి ప్రసాదం లాంటి బలిని తిన్న కారణంగా శునకానికి పూర్వ జన్మంతా గుర్తుకు వచ్చిందని గ్రహించాడు. అదే విషయాన్ని శునకానికి చెప్పాడు. దాంతో తనకెలాగైనా మళ్ళీ పుణ్యం లభించేలా అను గ్రహించమంది ఆ శునకం. ఎన్నెన్నో సోమవార వత్రాలను చేసి పుణ్యం సంపన్నుడైన ఆ పండితుడు పరోపకార దృష్టితో ఒక సోమవార ఫలాన్ని దానికి ధార పోశాడు వెంటనే కర్కశ శునక దేహాన్ని విడిచిపెట్టి దివ్వ శరీరంతో కైలాసానికి చేరింది. ఇది స్కంద పురాణం చెబుతున్న సోమవార వ్రత కథ. దీనిలో అంతర్గతంగా సందేశాలు ఉన్నాయి. జీవితంలో ఎవరూ చెడు తిరుగుళ్ళు తిరగకూడదని, అలాచేస్తే జీవితం చరమాంకంలోనైనా కష్టాలు తప్పవని, అలాగే మరుసటి జన్మలో శునకం లాగానో, మరొక నీచ జంతువు లాగానో జన్మించాల్సి వస్తుందనే హెచ్చరిక కనిపిస్తుంది. అలాగే పండితుడు సోమవార వ్రత పుణ్యఫలాన్ని దయార్ధ్ర హృదయంతో, పరోపకారబుద్ధితో ధారపోయటాన్ని మనుషులంతా ఆదర్శంగా తీసుకోవాలన్న ఓ సూచన కూడా ఇక్కడ గమనార్హం. పురాణ కథలలో ఇలా దైవభక్తి మాటున సామాజిక హితోక్తి కూడా ఇమిడి ఉంటుంది.

కామెంట్‌లు లేవు: