20, డిసెంబర్ 2020, ఆదివారం

ఆత్మవిద్య

 ఆత్మవిద్య


ముడిపదార్ధం గురించి మనకు తెలిసినట్లైతే ఆ పదార్ధంతో తయారయిన వస్తువుల గురించి తేలికగా తెలుస్తుంది. ఉదాహరణకు మట్టిని గురించి తెలిస్తే, మట్టితో తయారుచేసే

కుండలు, బాబాసలు, చట్లు, మొదలైన వస్తువులగురించి తెలుస్తుంది. అలాగే బంగారం గురించి తెలిస్తే దానితో తయారుచేసే నగల పేర్లు వేరయినా, వాటన్నింటిలో ఉండేది

బంగారమే అని తెలుస్తుంది. అదే విధంగా ఏ విషయం తెలుసుకోవటంవల్ల సర్వమూ తెలుస్తాయో, దాన్ని తెలుసుకోవాలి. ప్రతివిషయంలోనూ అంతర్గతంగా ఉండే తత్త్వాన్ని గనక తెలుసుకుంటే మిగిలిన విషయాలన్నీ తెలుస్తాయి.

నదులు తూర్పు నుంచి పడమరకు ప్రవహించినా, పడమర నుంచి తూర్పుకు ప్రవహించినా, చివరకు అవి సముద్రంలోనే కలుస్తాయి. సూర్యరశ్మికి నీరు ఆవిరిగా మారి మేఘాలరూపం ధరిస్తుంది. ఆ మేఘాలు మళ్ళీ వర్షించి నదులుగా ప్రవహిస్తాయి. ఆ నదులు మళ్ళీ సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసేవరకు వాటికి గంగ, గోదావరి, కృష్ణ అని వివిధరకాల పేర్లుంటాయి. కాని సముద్రంలో కలిసిన తరువాత ఆ • నదీజలాన్ని విడదియ్యలేము. అలాగే జీవించి ఉన్నంతవరకు మనిషి, పులి, సింహము, ఆవు, మేక ఇత్యాదినామాలుంటాయి. కాని మరణించిన తరువాత జీవి తన ఉనికిని కోల్పోతాడు. అన్ని జీవాత్మలూ ఆ పరమేశ్వరునిలోని భాగాలే. సృష్టి ఆరంభంకాకముందు, కృతయుగారంభంలో పరమేశ్వరుడు నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయి ఇతరులతో సంబంధం లేకుండా, తనకు సమానమైన వారుగాని,

తనకన్న అధికులుగాని లేకుండా ఏకాకిగా ఉండేవాడు. ఈ రకంగా ఉన్న పరబ్రహ్మ బిందు స్వరూపుడు. ఆ ఏకత్వం అనేకం కావాలని సంకల్పించింది. రకరకాల వస్తువులుగా, చిత్ర విచిత్ర సమ్మేళనాలతో రూపుదాల్చింది. ఘన ద్రవ, వాయు పదార్ధాలుగా మార్పు చెంది భిన్న రూపాలతో ఈ సృష్టి ఆకారం పొందింది. జీవరాశి ఉత్పన్నమయింది. సృష్టిలో భాగంగానే హకార సంజ్ఞ గలిగిన పరమేశ్వరుడు సకార సంజ్ఞ గలిగిన ప్రకృతితో

కలిసి శబళబ్రహ్మమై బ్రహ్మరంధ్రం ద్వారా మానవ శరీరంలో ప్రవేశించి, ఇంద్రియాల ద్వారా ప్రాపంచిక సుఖాలననుభవిస్తూ పంజరంలోని పక్షిలాగా, ఈ దేహంలో బంధించబడి, బయటకు పోయే మార్గం తెలియక, కొట్టుమిట్టాడుతున్నాడు. జీవాత్మ అనబడే ఈ హంసకు అగ్ని చంద్రమండలాలే - రెక్కలు

ఓంకారము - శిరస్సు

ముఖము -  జ్ఞాననేత్రము

హకారసకారాలే - పాదాలు


ఈ రకంగా పరమాత్మ అన్ని ప్రాణులలోనూ, పాలలో ఉన్న నెయ్యిలాగా ఆవరించి ఉన్నాడు. అన్ని జీవాత్మలూ ఆ పరమాత్మలోని భాగాలే. మర్రిచెట్టు చాలా పెద్ద వృక్షం. కాని దానికి కారణమైన విత్తనంలో చూస్తే ఏమీ కనిపించదు. అంటే విత్తనంలో అంత పెద్ద వృక్షానికి కారణమైనది, మనకంటికి కనిపించనంత సూక్ష్మంగా దాగి ఉన్నది. అదేవిధంగా ఆత్మ బయటకు కనిపించకుండా సూక్ష్మ రూపంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.

అత్మకు నాశం లేదు. ముసలితనం లేదు. ఆత్మకు పాపం అంటదు. శోకం తాకదు. ఆకలి దప్పికలు ఉండవు. స్వప్నప్రపంచంలో ప్రభువులాగా విహరించే చైతన్యమే ఆత్మ సుషుప్తిలో ఆనందాన్ని అనుభవించేదే ఆత్మ. ప్రకాశబిందువు పరబ్రహ్మస్వరూపమైన చంద్రమండలం. అకారబీజం. విమర్శ బిందువు శక్తి బీజం. అగ్నిమండలం హకార బీజం. ఈ రెండింటి సామరస్యమే అహం.

ఇదే పరబ్రహ్మ స్వరూపం. పరమేశ్వరుని ప్రతిబింబమే శక్తి. అదే మాయ. అందుచేతనే శక్తి లేకుండా శివుడుగాని, శివుడు లేకుండా శక్తిగాని ఉండవు. ఇక్కడ శివశక్తులు అంటే త్రిమూర్తి ద్వంద్వంలోని వారు కాదు. పరమేశ్వరీ పరమేశ్వరులు. వీరిద్దరి కలయిక

లేనిదే స్వరూప జ్ఞానం కలగదు. అహమనేది ఆత్మరూపం. ఇదే ఆత్మమంత్రం. ఆత్మమంత్రము, హంస మంత్రము రెండూ సమాన ధర్మాలు కలిగి ఉన్నాయి. శరీరం అశాశ్వతమైనది. శాశ్వతమైన ఆత్మకు అశాశ్వతమైన శరీరం ఆవాసంగా ఉంటుంది. శరీరం ఉన్నంతకాలము ఆత్మకు గుణదోషాలు, సుఖ దుఃఖాలు అంటినట్లు, వాటితో శతమతమవుతున్నట్లు అనిపిస్తుంది. ఆత్మ శరీరంతో సంబంధం ఏర్పరచుకోవటం వల్ల జీవులకు సుఖ దుఃఖాలతో సంబంధం ఏర్పడుతుంది. మానవుడు మాసిన వస్త్రాన్ని వదిలి నూతనవస్త్రాన్ని ధరించినట్లే ఆత్మజీర్ణమైన ఈ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని ఆశ్రయిస్తున్నది. ఆత్మ శరీరం నుంచి విడిపోతే భౌతిక బంధనాల నుండి విముక్తి కలుగుతుంది.

శ్రీవిద్య అనేది ఆత్మవిద్య. అదే బ్రహ్మవిద్య. అందులో షోడశి మహా మంత్రము మోక్ష కారకము. ఆ మంత్రాధిదేవత సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపము.


ఆత్మవిద్యయే శ్రీవిద్య. అదే మహాషోడశి అని చెప్పి 583 నుంచి 589వ నామం వరకు ఆత్మవిద్యను వివరిస్తున్నారు.


శ్రీమాత్రే నమః


ధర్మ ప్రచారం


వెంకటేశ్వర ప్రసాదు


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

కామెంట్‌లు లేవు: