13, జులై 2023, గురువారం

ప్రకాశం గారి వర్ధంతి

 శాలువా నాకెందుకు ఆరటి పళ్ళు ఇస్తే ఓక పూట గడిచేదిగా అన్న మాజీ ముఖ్యమంత్రి : 

 

నాలుగో క్లాస్ చదువుతున్న ఓ కుఱ్ఱాడు తన పరీక్ష ఫీజుకు మూడు రూపాయలు లేక, వాటి కోసం తన ఊరుకు 25 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళ బావ గారింటికి కాలి నడకన బయల్దేరాడు. 


తీరా చేసి బావ గారింటికి వెడితే 'నా దగ్గర మాత్రం ఎక్కుడ ఉన్నాయిరా' అన్నాడా బావ గారు. చేసేదేముం దనుకుంటూ కాళ్ళీడ్చుకుంటూ 25 మైళ్ళు తిరిగి నడుచుకుంటూ ఇంటికొచ్చేశాడు, ఆ కుఱ్ఱాడు. 


ఆ పరిస్థితికి తల్లడిల్లి పోయిన ఆతని తల్లి తన పెళ్ళినాటి పట్టుచీరను అమ్మి ఆ మూడు రూపాయల ఫీజు కట్టింది.  


ఆ తరువాత ఎన్నో ఎన్నెన్నో ఢక్కా మొక్కీలు తిని తన కిష్టమైన ప్లీడరీ పరీక్షలో నెగ్గి, అక్కడితో తృప్తి పడక 

ఇంగ్లండ్ పోయి, బారిష్టరయ్యి, మద్రాస్ మైలాపూర్ అరవ మేధావులతో పోటీపడి ఆ రోజులలోనే (1917-18 నాటికే) రోజుకు వెయ్యి రూపాయల ఫీజు తీసుకునే స్థాయిలో, కోస్తా జిల్లాలన్నిటిలో భూములు బంగళాలు కొనుగోలు చేసేటంతగా ఎదిగిన మన కాలపు మేరు నగధీరుడు శ్రీ టంగుటూరి ప్రకాశంపంతులు 🙏


గాంధీజీ పిలుపుతో తన ప్లీడరు వృత్తిని వదిలి, జాతీయ ఉద్యమంలోకి ఉరికాడు.  


తన సర్వస్వాన్ని ప్రజాసేవకే అంకితం చేశాడు. లాయర్ గా ఎంతోమందిని 

జైళ్ళ నుంచి బైటకు తెచ్చిన ఆయన ప్రజల కోసం తాను స్వచ్చందంగా జైలు శిక్షను అనుభవించాడు. 


గాంధీజీ ఆశయాల ప్రచారం కోసం 'స్వరాజ్య' పత్రికను స్థాపించి గాంధీజీ నిజమైన అనుచరునిగా ఆయన మెప్పును పొందాడు.  


అదే గాంధీజీ, కొందరి చెప్పుడు మాటలు విని ఆయనను తప్పు పట్టుకుంటే, గాంధీజీని సైతం నిలదీశాడు.  


సైమన్ కమీషన్ కు వ్యతిరేకంగా మద్రాస్ నగరంలో హర్తాళ్ జరిగినప్పుడు, తెల్లవాడి తుపాకీకి తన గుండెనే ఎదురు పెట్టాడు.  


ఆనాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవిన్యూ మంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు (1953) తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు.


దురాశాపరుల మూలంగానూ, అప్పటి శాసన సభ స్పీకర్ తెలివి తక్కువ తనం మూలం గానూ ఒకే ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వం పతనమైనప్పుడు, వ్యతిరేకంగా ఓటు వేసిన వారు తమ తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్ కు వెడదామని బ్రతిమాలుకున్నా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి తన రాజీనామాను సమర్పించాడు.  కేవలం 13 నెలల తన ప్రభుత్వ కాలంలో ఆ రోజుల్లోనే 14 నీటి పారుదల ప్రాజెక్టులు స్థాపించాడు.  


శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం స్థాపించాడు. తెలుగు వారికి ఓ హైకోర్టు స్థాపించాడు. 


తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహణకు కావలసిన మార్పులకు శాసనబద్దత కల్పించాడు.  సహకార రంగంలో తెలుగు రాష్ట్రాన్ని ప్రధమ స్థానంలో నిలిపాడు.  


బెజవాడలో కాటన్ దొర కట్టిన బ్యారేజి కొట్టుకుపోయే పరిస్థితి వస్తే, అప్పటి  కేంద్ర ప్రభుత్వం పైసా కూడ ఇవ్వలేమని స్పష్టం చేస్తే, రాష్ట్ర నిధులనన్నీ మళ్ళించి యుద్ధ ప్రాతిపదికన బ్యారేజిను బాగు చేయించి నిలబెట్టాడు. 


ఆ భారాన్ని పన్నుల రూపంలో ప్రజలమీద వెయ్యకుండా, ఆ లోటును సరిదిద్దాడు.  


అందుకే ప్రజలందరూ ఆ బ్యారేజ్ ను, ఆయన పేరునే ప్రకాశం బ్యారేజ్ గా పిలుచుకుంటున్నారు.  రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా, దేశంలోనే తొలిసారిగా ఖైదీలందరినీ విడుదల చేశాడు.


అంతటి మహనీయుడు తన చరమ దశలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించాడు.  


తనను శాలువతో సత్కరిస్తే 'ఈ శాలువ నాకెందుకురా! ఆ డబ్బుతో అరటి పళ్ళు కొని తెస్తే ఓ పూట గడిచేది కదురా!!' అని తన అనుచరునితో అన్నారంటే ఆయన పరిస్థితి అర్థం  చేసుకోవచ్చు..


ఆయన మూలంగా అధికారంలోకి వచ్చిన మహా నాయకులందరూ అధికారం కోసం ఆయనకు వెన్నుపోటు పొడిచినా, ఆయన అధికారం కోసం ప్రాకులాడలేదు. 85 సంవత్సరాల వయస్సులో రోహిణీ కార్తె మండు టెండలో వడ దెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళి తాను వడదెబ్బ తిని తెలుగు పౌరుషాన్ని పై లోకాలకు తీసుకుపోయిన "ఆంధ్రకేసరి"  టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్సులు..

🙏🙏🙏🙏🙏


ఈరోజు ప్రకాశం గారి వర్ధంతి

వీలయితే మీ పిల్లలతో చదివించండి ఇలాంటి నిస్వార్థ పరులు పుట్టిన పవిత్రభూమి మన భారత భూమి అని చెప్పండి..!!!

కామెంట్‌లు లేవు: