31, ఆగస్టు 2020, సోమవారం

ధార్మికగీత - 6*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
                           *
                                     *****
           *శ్లో:- వస్త్రేణ  వపుషా  వాచా* ౹
                  *విద్యయా  వినయేన  చ* ౹
                  *వకారై:  పంచభి   ర్హీనః*  ౹
                  *వాసవో౽పి న పూజ్యతే*  ౹౹
                                      *****
*భా:- లోకంలో రాణించాలంటే ప్రతి మనిషికి 1.వస్త్రము 2. వపు:(మేను) 3. వాక్కు 4. విద్య 5. వినయము అనే 5 "వ"కారాలు కావాలి. 1."వస్త్రము":- వృత్తి ప్రవృత్తులకు అద్దం పట్టి, వ్యక్తిత్వ వికాసాన్ని ప్రతిఫలింపజేసేవిగా దుస్తులు ధరించాలి. లాయర్లు, వైద్యులు, నర్సులు, గార్డులు, పోలీసులు నిర్ణీత ఆహార్యంలో కనిపిస్తుంటారు. సముచిత వేషం గౌరవం తెచ్చిపెడుతుంది.  2. "వపు:":- శుచి, శుభ్రత, ఆరోగ్యకరమైన అంగ సౌష్టవం ఉట్టిపడే దేశరక్షక దళాలు,వ్యాయామకారులు శ రీరపోషణలో జాగరూకులై ఉంటారు. చక్కని శరీరపోషణలో శ్రద్ధ వహించాలి.  3 "వాక్కు":- మృదుమధురమై,  సత్యము, ప్రేమ,  విశ్వాసము, ఆత్మీయత తొణికిసలాడే వాక్ నైపుణ్యము "హనుమ" నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రియంగా, మితంగా,హితంగా మాట్లాడాలి.4. "విద్య":-  ఇహమును, పరమును సాధింపగల, అర్థమును,పరమార్థమును   అందించగల  , జీవితాన్ని తరింపజేయగల విద్యా సంపత్తిని గడించాలి. 5. "వినయము":-   పూజ్యులు, వృద్ధులు, గురువుల పట్ల అపారమైన వినయము కలిగి, వారి నుండి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించాలి. ఈ ఐదు లక్షణములు సలక్షణంగా ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. ఆదరిస్తుంది. పైన చెప్పిన 5 "వ"కారాలు ఎవరికి లేవో, అతడు సాక్షాత్తు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడైనా సరే  పూజింపబడడు. గారవింప బడడు. ఇది ముమ్మాటికి నిత్యము. సత్యము. ప్రతి వారు వీటిని మెరుగుపరచుకొనడానికి నిరంతర సాధన చేయాలి*
                                 *****
                   *సమర్పణ :  పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: