27, అక్టోబర్ 2020, మంగళవారం

భీష్ముడి అంపశయ్య కథ.

 భీష్ముడి అంపశయ్య కథ. 

దుర్మార్గుడైన దుర్యోధనుడి ప్రాపకంలో ఉన్న పాపానికి, అతడి ఆగడాలు అడ్డుకోలేని అసమర్థుడయ్యాడాయన. నిండుసభలో కుల వధువు ద్రౌపదిని దుర్యోధన, దుశ్శాసనులు ఘోరంగా అవమానిస్తుంటే శక్తి ఉండీ, లోలోపల బాధపడుతూ మౌన సాక్షిలా ఉండిపోయాడు. ఆ అపరాధమే ఆయనను అంపశయ్యపైకి చేర్చిందన్నది రుక్మిణికి కృష్ణుడు చెప్పినమాట. కర్మలు మంచివైనా, చెడువైనా వాటి ఫలాలు అనుభవించక తప్పదని శాస్త్రవచనం.

లోకంలో సత్కర్మల కన్నా దుష్కర్మలు చేసేవారే అధికంగా కనిపిస్తుంటారు. తెలిసి చేసే తప్పుల్ని ప్రజ్ఞాపరాధాలు అంటారు. మహాజ్ఞాని అయినా రావణుడు తెలిసి చేసిన తప్పునకు సర్వనాశనమయ్యాడు.

రావణుణ్ని తెలిసిన మూర్ఖుడని, దుర్యోధనుణ్ని తెలియని మూర్ఖుడని చెబుతుంటారు. ఎందరు పెద్దలు ఎన్నివిధాల చెప్పినా తన నిర్ణయానికే కట్టుబడి కష్టాలు నెత్తికెత్తుకున్న మూర్ఖత్వం దుర్యోధనుడిది. పెద్దలు, విజ్ఞులు, అనుభవజ్ఞులు చెప్పిన సలహాలు పాటించాలి. ఒకరు నాకు చెప్పేదేమిటి, నేను వినేదేమిటి అనుకుంటే- అవస్థలు తప్పవు. అన్నీ స్వయంగా అనుభవించి తెలుసుకోవాలనుకుంటే మన జన్మ సరిపోదు. మంచి సలహాలను పాటిస్తే జీవన విజయాలు సాధ్యపడతాయి. నిత్యజీవితంలో మనం విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తులతో వ్యవహరించాల్సి ఉంటుంది. అందరూ మనం ఆశించినట్లు ఉండరు. మనం కూడా ఇతరులు ఆశించినట్లు ఉండం. దీనివల్ల కొందరు మనకు నచ్చుతారు, కొందరు నచ్చరు. నచ్చినవారు ఆత్మీయులవుతారు. అందరూ విశ్వసనీయ మిత్రులు కారు. ఎప్పుడైనా వారిలో ద్రోహబుద్ధి పడగ విప్పవచ్చు. స్వార్థం బుసలు కొట్టనూవచ్చు.

నెపోలియన్‌ ప్రార్థన గుర్తుందా? ‘దేవుడా! నా మిత్రుల నుంచి నన్ను రక్షించు. నా శత్రువులనుంచి నన్ను నేను రక్షించుకుంటాను’ అంటాడు. జూలియస్‌ సీజర్‌కి ఆప్తమిత్రుడనుకున్న బ్రూటస్‌ హంతకులతో పాటు కత్తితో పొడిచినప్పుడు ‘నువ్వు కూడానా’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.

మహాభారతంలో ద్రుపదుడు... తన సహవిద్యార్థి ద్రోణుడు వచ్చి ఒక్క ఆవును అడిగితే, రాజుగా ఉండీ ఇవ్వకపోగా- మాటలతో అవమానించాడు. అదే అతడికి మృత్యుపాశమైంది. విదురుడన్నట్లు- మహాత్ములు మహాసర్పాల వంటివారు. వారిని అవమానిస్తే ఘోర పరిణామాలు ఉంటాయి.

మాటలను మధురంగా ఉపయోగించాలి. ఎంత కోపంలో ఉన్నా నిగ్రహం చూపాలి. శ్రీకృష్ణుడు ఇందుకు చక్కని ఉదాహరణ. మాటలు ప్రియంగా, హితంగా సత్యంగా ఉండాలని అర్జునుడికి బోధించాడు. ఆయన స్వయంగా ఆచరించి చూపాడు.

బాణాలే కాదు... పదునైన మాటలు అంతకన్నా ఎక్కువగా బాధిస్తాయి. బాణాలు శరీరానికి చేసే గాయాలు చికిత్సతో మానిపోతాయి. మనసు కుతగిలిన దెబ్బలు జీవితకాలం సలపరిస్తూనే ఉంటాయి.

వాగ్బాణాల బాధ అంపశయ్య బాధతో సమానంగా ఉంటుంది. కొందరిది ఇతరులను మాటలతో గాయాలు చేసే స్వభావం. హేళనగా, చులకనగా, అతి తెలివిగా, ఎదుటివారిలో తమ దృష్టికి తోచిన లోపాలను ఎత్తి చూపుతారు. వాస్తవానికి వారిలోనే ఎన్నో లోపాలు ఉంటాయి. ఇలాంటి వారిగురించే ‘గురివింద గింజ’ సామెత వచ్చింది.

కాల పరీక్షలకు ఎవరూ అతీతులు కారు. ఈ రోజు పూలశయ్యమీద ఉన్నవారు తరవాతి కాలంలో అంపశయ్య అనుభవాన్ని పొందరని చెప్పలేం. అందుకే అందరితో ఆత్మీయంగా, ఆప్యాయంగా ఉండాలి. మంచి వ్యక్తిత్వానికి అదే పునాది!

(ఈనాడు అంతర్యామి)

✍🏻కాటూరు రవీంద్ర త్రివిక్రమ్

కామెంట్‌లు లేవు: