27, అక్టోబర్ 2020, మంగళవారం

నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు

 శ్రద్ధ (విశ్వాసం, భక్తి, దీక్ష), సబూరి (ఓర్పు, సాధన).

నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి, తన సహజ నైజమైన సచ్చిదానం దాన్ని మరిచి తానే శరీరం అనుకుంటాడు. ఆ భావనతో తానే అంతా చేసేవాడినని, అనుభవించే వాడినని అనుకుంటూ లెక్కలేని బాధల్లో చిక్కుకుని విముక్తిని పొందలేకున్నాడు. విమోచనం పొందటానికి మార్గం ఒక్కటే. అది భగవంతునిపై ప్రేమమయమైన భక్తిని కలిగి ఉండటం. 

భగవంతుని లీలలు  సకల సుగుణాల నిధి. అటువంటి సకల సుగుణాలను మాలలోని పుష్పాలనుకట్టి ఉంచే దారాల వంటివి శ్రద్ధ, సబూరి. ఎవరి జీవితంలోనైనా ఈ శ్రద్ధ, సబూరీలదే కీలకపాత్ర ఈ రెండు లక్షణాలను ఎవరెంత గట్టిగా అంటిపెట్టుకుని ఉంటారో, ఎవరెంతగా ఒంటబట్టించుకుంటారో వారే జీవితంలో ఆధ్యాత్మిక, మానసిక, భౌతిక, పారమార్థిక అంశాలలో శిఖరస్థాయికి చేరుకోగలుగుతారు. మనం చేసే పనిపై శ్రద్ధ చూపనపుడు ఆ పని ఫలించదు. అంకితభావం చూపనపుడు అది యాంత్రికంగా మారిపోతుంది. పనిని శ్రద్ధగాచేయకుండా ఫలితం అనుకూలంగా ఉండాలని ఆశించటం అత్యాశే అవుతుంది. మనం చేసే పనిని శ్రద్ధగా చేయటం ఎంత అవసరమో, ఫలితంకోసం అంతే సహనంతో ఎదురు చూడటం ముఖ్యం. చదువులో కావచ్చు, పనిచేసే రంగం కావచ్చు. వ్యాపారం... మరే రంగంలోఉన్నా పై రెండు లక్షణాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. అసలు దైవ చింతన ప్రకారమైతే పనిచేయటమే మన కర్తవ్యం. ఫలితం సంగతిని భగవంతునికే వదిలేయాలి. మనం చేసే పనిలో చూపే శ్రద్ధ, అంకితభావం ఉంటేచాలు ఫలితం మనకే అనుకూలంగా ఉండేలా భగవంతుడు చూసుకుంటాడు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న శ్రద్ధ, సబూరి ఈ రెండు లక్షణాలను అలవర్చుకోవటానికి శ్రద్ధ అనేది ఒక శక్తి , మనం ప్రతి పని శ్రద్ధగా చేస్తే కొన్ని రోజులో మనకి మనో శక్తి సిద్ధిస్తుంది అప్పుడు మన ప్రతి ఆలోచన వెంటనే కార్య రూపం దాలుస్తుంది, కార్య సిద్ధులగా తయారవుతాము

మన ఆలోచనలు భూత మరియు భవిష్యత్తులో తిరగకుండా ఎప్పుడు వర్తమానంలో ఉంటూ పక్షపాతధోరణితో ఆలోచనలు మరియు తీర్మానాలు లేకుండా, ఎప్పుడు ఓపికతో, ప్రతిదీ తీర్పులు ఇవ్వకుండా స్థిరంగా మరియు ఎప్పుడు లిజనింగ్ (వినగలిగే గుణం) స్పేస్ లో మన చుట్టూ ఉన్న పరిస్థితులు పరిస్థితులకు పైన చెప్పిన విధంగా వ్యవహరించగలిగితే సబూరి అంటారు.

ఏపుడైతే మనలో సబూరి ఉంటుందో మనలో అపరిమిత ఓర్పు, ఓపిక, ఏదైనా సాధించగల శక్తి వస్తుంది. జీవితంలో జరిగే ప్రతిదీ మనం అంగీకరించగలుగుతాము. కష్టపడే గుణం వస్తుంది, షార్ట్ కట్ లు వెతకం , దీర్ఘకాలిక ప్రణాళిక ఉంటుంది , పని అయ్యేంతవరకు ఎన్ని సంవత్సరాలు అయినా వేచి చూస్తాము.

'మీరు ఎవర్నీ నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగా నయినా కష్టపెట్టినా సరే, వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారమే చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడము, మనశ్శాంతిగా ఉండడమే కాదు, మీకు హాని చేసినవారు, లేదా మిమ్మల్ని నొప్పించిన వారిలో పశ్చాత్తాపం కలుగుతుంది కూడా. ''శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకూ కొరకాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి. ఎవరైనా, ఏ కారణంగా నయినా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా నొప్పించని విధంగా సమాధానం చెప్పి, అక్కడినుండి వెళ్లిపోండి.

''ఇతరులు మీపైన అనవసరంగా నిందలు వేసినా మీరు చలించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక, నిశ్చలంగా, నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాటకు దిగారంటే, మీరు కూడా వారితో సమానులే అవుతారు. ''దేవునిపట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటివారిలో ఉన్న మంచిని మాత్రమే చూడు. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. మనను మనం పరీక్షించుకుంటూ, సమీక్షించుకుంటూ సన్మార్గంలో సాగిపోవాలి. ఇతరులు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కలిగిస్తున్నా, పైన భగవంతుడు ఉన్నాడని నమ్మండి. దేవుడు మీకు తప్పక సాయం చేస్తాడనే విశ్వాసాన్ని ఉంచండి. దేవుడివైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే, దేవుడు మిమ్మల్ని కాపాడటానికి పది అడుగులు ముందుకు వస్తాడని తెలుసుకోండి..

భగవద్గితలో శ్రీకృష్ణుడి చెప్పిన శ్లోకం ( 5 th chapter, 20th slokam) 

“న ప్రహృశ్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం

స్థిర బుద్ధి రసముమూడో బ్రహ్మవిద్బ్రాహ్మణి స్థితః”

అర్ధము: స్థిర మైన బుద్ధి గల వాడును, మోహ వివశుడు కాని వాడును అయినా బ్రహ్మవేత్త ఇష్ట మైన దానిని పొందినపుడు సంతోషము గాని, అయిష్ట మైన దాన్ని పొందిన పుడు దుఃఖమును గాని పొందడు.

” ప్రాపంచపు నటనలలో ప్రావీణ్యమును పొంది

ఫల హీనుడై ఇపుడు పాటింతు నీ మాట “”

అంటే ఇప్పుడు నేను “నాకే ఎందుకు?” అనుకొంటే ఫలితం నన్ను సరిఅయిన మార్గానికి నడిపించుటకు వచ్చినది అని నాకు లభించిన సమాధానం.

అందుకే పెద్దలు అందరు చెప్పేది ” అంతా మన మంచికే అని”

భగవన్నామంలోని శ్రద్ధాభక్తులు మనుషుల చేత అద్భుతకార్యాలను చేయిస్తాయి. అయితే ఆ నామస్మరణలో భక్తిశ్రద్ధలు ముఖ్యం. అవి లేకుండా పవిత్ర నామాల్ని ఎన్నిసార్లు స్మరించినా కలిగే ఫలితం నిష్ఫలం. సాయినాథుడు తన భక్తులనుంచి శ్రద్ధ, భక్తి, విశ్వాసాన్ని దక్షిణగా కోరాడు. అవి తనకిస్తే బతుకుల్ని తీయబరుస్తానని అభయమిచ్చారు. మనం చేసే పనిలో కూడా మనం చూపే భక్తిశ్రద్ధలే ఆ పనిలో రాణించేలా చేస్తాయి. భక్తి, శ్రద్ధ– సబూరి...ఇవి రెండూ కలిస్తే కలిగేది మేలిమి విశ్వాసం.

ఇవే మనల్ని భగవంతునికి దగ్గర చేసే సాధనాలు. ఇందులో ఎటువంటి అనుమానానికి, అపోహలకు ఆస్కారం లేదు. ఉన్నదంతా విశ్వాసమే. ఇటువంటి శ్రద్ధాభక్తులు ఎవరికైతే ఉంటాయో, వారే మహనీయులుగా మారతారు. శ్రీ సాయి సచ్చరిత్రలో బాబా చెప్పినట్లు ... ఈ శరీరాన్ని ధర్మకార్యాచరణకే వినియోగించాలి. సత్కర్మలు ఆచరించాలి. పరమాత్మకోసం ఆరాటపడాలి. అదే నిజమైన భక్తి. అదే నిజమైన ఆధ్యాత్మిక దృక్పథం. అది అలవడాలంటే భక్తి, శ్రద్ధలను కలిగి ఉండాలి.  ఈ సాధనలో కావాలసిన రెండు ఆయుధాలు శ్రద్ధ, సబూరి. మనకు నమ్మకం దృఢంగా ఉంటే దాని వెనకే సహనము అంటే సబూరి కూడా వస్తుంది. ఈ రెండు మన జీవితంలో ఉన్నంత వరకు మనము ఎట్లాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవచ్చు.

ఒక ఉదాహరణ చెప్పుకుందాము. పాలను తీసుకొని దానిలో కొన్ని చుక్కలు నీళ్ళు కలుపుదాము. పాలు స్వభావం ఏమి మారదు. ఆ నీళ్ళను మనం గుర్తించలేము. తరువాత మరి కొంచం నీళ్ళు కలుపుదాము. అప్పుడు కూడా పాలు పాలుగానే కనిపిస్తాయి. చాలా నీళ్ళు కలిపాము అనుకొండి. అప్పుడు ఆ పాలు పలుచగా ఉంటాయి, నీళ్ళు కలిపినట్లు తెలుస్తుంది. అలానే మన నిజ స్వభావం పాల వలే స్వచ్చమై ఉంటుంది. అదే సచ్చిదానంద స్థితి. దానికి కొన్ని చుక్కలు నీళ్ళు కలపడం అంటే సత్వ గుణాన్ని జోడించడం. మరికొన్ని నీళ్ళు కలుపుకుంటూపోతే అవి పల్చబడి రజోతమో గుణాలు స్పష్టంగా బయటపడ్తాయి. కాని దుస్థితి ఏమిటి అంటే? మనము బాగానే ఉన్నామన్న భ్రమలో ఉంటాము. కాని ఎదుటి వాళ్ళకు మన లోని లోపాలు తెలుస్తాయి. వాళ్ళకు తెలుసు మన పాలు పలుచగా నీళ్ళు కలుపబడి ఉన్నాయని. ఈ రజో తమో గుణాలు మన దారికి అడ్డుగా నిలబడి మన జీవితంలో మనశ్శాంతి లేకుండా చేస్తాయి.

రాముడు కూడా మనిషి రూపంలో అన్ని రకాల బాధలను, సుఖాలను అనుభవించినట్లుగా మనకు కనిపించారు. చూసినవారు ఆయనను ఒక సామాన్యుడిగా లేదా పిచ్చి వాడుగా కూడా అర్ధం చేసుకున్నారు. కాని ఆయన ఎప్పుడు ఆయన నిజ, సత్యమైన సచ్చిదానంద స్థితిలోనే ఉన్నారు. భగవంతుడు  సర్వాంతర్యామి. భగవంతుడు  సకల కళా వల్లబుడిగా దర్శనమిచ్చారు. అలానే నిర్గుణ తత్వం కూడా చూపించారు. మన పూర్వ వాసనలను బట్టి మన ఆలోచనా విధానాన్ని బట్టి ఆయన వివిధ రూపాలలో దర్శనం ఇచ్చారు. రాముడుగా, విఠలుడుగా, గణపతిగా, హనుమగా, దత్తుడిగా ఇలా ఎన్నో రూపాలతో కనిపించారు. ఆయన ఎప్పుడు తన పేరు ఇదని చెప్పలేదు. మహాల్సాపతిచే సాయి అని పిలవబడి యావత్ ప్రపంచానికి సాయిబాబాగా ఉండిపోయారు. భగవంతుడ్ని ఏ పేరుతో పిలిస్తే మాత్రం ఏమి? అన్ని పేర్లు ఆయనవే. భగవంతుని  సర్వరూపాలలో భక్తినే  చూడమని బోధచేసారు. మోక్షమే  ఈ త్రిగుణాలకు అతీతమైన పరమేశ్వర స్వరూపము.

*తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు  క్రింది లింక్ ద్వారా చేరండి*

https://t.me/joinchat/AAAAAEqrF94avWw7JKUdgQ

కామెంట్‌లు లేవు: