తమిళనాడులో రామేశ్వరం నుండి 75 కి.మి. దూరంలో "తిరుఉత్తర కోసమాంగై" అని ఊరు ఉంది. మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరుడికి సొంత ఊరు ఇది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తురాలైన మండోదరి శివుడ్ని ప్రార్ధించి "నాకు ఒక గొప్ప శివభక్తుడ్ని భర్తగా ప్రసాదించు ఈశ్వరా!" అని వేడుకుంటే తన భక్తుడైన రావణబ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపారు. ఏ దేవాలయంలో కూడా పూజకు ఉపయోగించని మొగలి పువ్వును ఇక్కడ మాత్రమే స్వామి వారికి అలంకరిస్తారు. ఇక్కడ వెలసిన రేగిపండు చెట్టు 3000 సంవత్సరాలకు పూర్వమే ఉంది. ఇక్కడ శివుడు శివలింగరూపంలో, మరకతరూపంలో, స్పటికలింగంలో దర్శనమిస్తారు. నటరాజ రూపంలో 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుండి వచ్చే కిరణాలను మనం తట్టుకోలేం కాబట్టి స్వామివార్ని ఎప్పుడూ విభూది, గంధపుపూతతో ఉంచుతారు. కేవలం ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. అలాగే ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్పటికలింగానికి అభిషేకం చేసి తర్వాత లాకర్లో భద్రపరుస్తారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైన ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఈ ఆలయానికి సమీపంలో అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. భక్తులు పసుపు కొమ్ములను ఆ ప్రాంగణంలోనే నూరి, ముద్దచేసి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడిన తిరుఉత్తర కోసమాంగై ఆలయం గురించి మన ఆంధ్రులకు పెద్దగా తెలీదు. మీరెప్పుడైనా రామేశ్వరం యాత్రకెళ్తే తప్పక ఈ దేవాలయం దర్శనం చేసుకోండి.🌹🙏🌹
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి