1, అక్టోబర్ 2020, గురువారం

అప్పుడే మంచి జరుగుతుంది*

 *స్వార్థంతో మనిషి ఉన్నప్పుడు కలిసి రాదు* *ఏప్పుడైతే ఇతరులగురించి అలోచిస్తావో అప్పుడే మంచి జరుగుతుంది* 


 ఒకసారి శ్రీకృష్ణార్జునులు కలిసి వెళ్ళుచుండగా వారికి మార్గమధ్యమున పేద సజ్జనుడు యాచకుడుగా కనిపించాడు . జాలి పడిన అర్జునుడు ఒక సంచెడు బంగారు నాణెములు ఇచ్చాడు . సంతోషముగా ఇంటికి వెళ్ళుచుండగా మార్గమధ్యములో ఒక దొంగ ఆ సజ్జనుని కత్తితో బెదిరించి నాణెముల సంచిని లాక్కున్నాడు .


     మరలా ఆ పేద సజ్జనుడు యాచకుడిగా మారి భిక్షాటన చేయనారంభించాడు . ఓ రోజు అర్జునుడు అతన్ని చూసి ఆశ్చర్యపోయి , విషయము తెలిసికొని జాలిపడి , ఓ ఖరీదైన వజ్రం ఇచ్చి సుఖంగా జీవింపుమని చెప్పాడు . ఆ సజ్జనుడు ఈసారి జాగ్రత్తగా ఇంటికి తీసికొని వెళ్ళి గదిలో మూలన ఉన్న ఒక కుండలో వజ్రాన్ని దాచిపెట్టి నిద్రించాడు . తెల్లవారి చూస్తే ఇంట్లోభార్యలేదు . అంతేకాదు ఆ కుండ కూడా లేదు . పరుగెత్తుకుంటూ నదీ తీరం వద్దకు వెళ్ళాడు . భార్యను మరియు ఆమె చేతిలోని

కుండను చూసి హమ్మయ్య అనుకున్నాడు . కుండలో చూస్తే వజ్రం లేదు . నదిలో నీళ్ళకోసం ముంచినప్పుడు నదీ ప్రవాహములో కొట్టుకు పోయింది .తన దురదృష్టానికి ఎంతో చింతించిన ఆ సజ్జనుడు మళ్ళీ యాచకుడుగా వీధుల్లోకి వెళ్ళవలసి వచ్చింది .


      కృష్ణార్జునులు ఆతనిని చూసి ఏమైందని విచారించారు . ఇతనెవరో పరమ దురదృష్టవంతుడిలా ఉన్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణునితో అన్నాడు . లేదు . ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం అని సజ్జనుని చేతిలో రెండు బంగారు నాణాలు పెట్టారు . ఒకప్పుడు సంచెడు నాణేలు , విలువైన వజ్రం నా దగ్గర నిలువలేదు . ఈ రెండు నాణేలు నా తలరాతను మారుస్తాయా నా పిచ్చిగాని అనుకుంటూ ఇంటికి వెళుతున్నాడు ఆ సజ్జనుడు .


     దారిలో ఒక జాలరి వలకు చిక్కి విలవిల లాడుతున్న చేపను చూశాడు . అతని హృదయము ద్రవించింది . నా దగ్గరున్న రెండు నాణేలు నా తలరాతను మార్చలేవు కాబట్టి పాపం ఈ మూగజీవి ప్రాణాలైనా రక్షిద్దాం అని తన దగ్గరున్న రెండు నాణేలు ఇచ్చేసి ఆ చేపను తీసుకొని ఇంటికి వెళ్లి ఒక నీటి తొట్టిలో వేశాడు .


     కొద్ది సేపటికి ఆతని భార్య ఆ చేపను చూసి అయ్యో ! దీని నోటిలో ఏదో ఇరుక్కుంది అందుకు ఇలా గిలగిలా కొట్టుకొనుచున్నదని భర్తకు చెప్పింది . ఇద్దరు కలసి ఆ చేపనోరు తెరవగా నదిలో పోగొట్టుకొన్న ఆ వజ్రం చేప నోటిలో కనిపించగానే దొరికింది దొరికింది చిక్కింది చిక్కింది నాచేతికి చిక్కింది అని గావుకేకలు పెట్టారు .


      ఆ సయములో ఆతని ఇంటిలో దూరియున్న దొంగ ఆ సజ్జనుని చూసి భయంతో ఆ సజ్జనుడు నన్ను కనిపెట్టాడని వణికిపోయాడు . ఆ సజ్జనుని దగ్గరకు వచ్చి నీకు దణ్ణం పెడతాను ; నీ బంగారు నాణేలు సంచి నీవు తీసుకో ; నన్ను రాజభటులకు మాత్రం పట్టివ్వవద్దు అని బ్రతిమాలాడు . ఆ దంపతులు ఆశ్చర్యపోయారు . పోగొట్టుకొన్న రెండు విలువైన వస్తువులు తమకు చేరాయని ఆనందపడినారు . వెంటనే వెళ్లి ఈ విషయాన్ని కృష్ణార్జునులకు చెప్పారు .


      కృష్ణా ! నేను ఎంతో అమూల్యమైన బంగారు నాణేల సంచి , వజ్రం ఇచ్చినా అతని దశ తిరుగలేదు . నీ విచ్చిన రెండు నాణేలు అతని జీవితాన్ని మలుపు తిప్పినాయి . ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నించాడు అర్జునుడు .


     శ్రీకృష్ణుడు ఇలా సెలవిచ్చారు ....

     అర్జునా ! అతని వద్ద బంగారం , వజ్రం ఉన్నప్పుడు అతను తన అవసరాలు గూర్చి మాత్రమే ఆలోచించాడు . రెండు నాణేలు ఉన్నప్పుడు మరో జీవి మంచి - చెడు , 

కష్ట - సుఖములు గూర్చి ఆలోచించాడు . నిజానికి అది భగవంతుని పని . అతను దేవుని పనిని పంచుకున్నాడు కాబట్టి ఆతని కష్టములనన్నిటిని నేను పంచుకున్నాను .

*తెలుగు వెలుగు సమూహంలో చేరాలనుకుంటే క్రింద నంబర్ కు నన్ను చేర్చమని సందేశాన్ని పంపండి మీకు లింక్ పంపడం జరుగుతుంది. 9985831828*

కామెంట్‌లు లేవు: