1, అక్టోబర్ 2020, గురువారం

శ్రీమన్నారాయణీయం

 **దశిక రాము**


**


1-7-శ్లో.


కష్టా తే సృష్టి చేష్టా బహుతరభవఖేదావహా జీవభాజామ్

ఇత్యేవం పూర్వమాలోచితమజిత! మయా నైవమద్యాభిజానే।

నో చేజ్జీవాః కథం వ మధురతరమిదం త్వద్వపుశ్చిద్రసార్ధ్రం

నైత్ర్తేః శ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంభోధిపూరే రమేరన్|


భావము - అజితా! సంసార పరమైన కష్టములను అనుభవించి దుఖితుడనై భగవంతుని సృష్టి దుఃఖకరమైనదని భావించితిని. వాస్తవమునకు నీ సృష్టి లేనిచో జనులు నీ ఙ్ఞానందరూపము వలన కలుగు ఆర్ద్రతను, కనులతో చూచుటవలన చెవులతో వినుట వలన పొందు మాధుర్యమును, పరమానందము అను అమృతసాగరమును ఎట్లు అనుభవించెదరు? 

(telugu bhagavatam.org)


వ్యాఖ్య - మహారణ్య మధ్య ప్రాంతం. నారాయణుడైనా నరావతారంలోనే ఉన్నాడుగా.. శ్రీరాముడు ఆవేదనతో కూలబడ్డాడు. సీతా వియోగాన్ని తట్టుకోలేను అంటూ ఆత్మ త్యాగానికి సిద్ధపడ్డాడు.


కామ క్రోధాదయ స్సర్వే దహ్యంత్యేతే తనుం మమ!

అహంకారోపి మే నిత్యం జీవనం హంతుముద్యతః!!


అరిషడ్వర్గాలు నా దేహాన్ని దహించివేస్తున్నాయి. నా కర్తవ్య నిర్వహణకు అవసరమైన మార్గాన్ని ఉపదేశించండి అంటూ శివుడిని ప్రార్థించాడు. పరమేశ్వరుడు ఆవిర్భవించి ఆత్మవివేకం కలిగించాడు. 


రాములవారే అంత బాధపడాల్సి వస్తే ఇక గురువుగారి ఋగ్మతలను అనుభవించడానికి స్వీకరించి,తాళలేక ఈస్రృష్టి అంతా బాధామయం అని భట్టతిరిగారు ఒకప్పటి పరిణతి చెందని స్థాయిలో అనుకోవడంలో ఆశ్చర్యం లేదు.


దుమ్మూధూళి అంటుకున్న కారణంగా అద్దం ఏవిధంగా అయితే ప్రతిబింబాన్ని చూపించలేదో దుష్టభావనల కారణంగా మకిలిపట్టిన మనస్సు తనలోనే ఉన్న ఆత్మస్వరూపమైన దైవాన్ని దర్శించలేనపుడు జీవుడికి ఆభావం రావడం సహజమేమో.


అయితే తాను చేసిన కర్మలను బట్టి స్థావర, జంగమ దేహాల్ని జీవుడు పొందుతాడు అని తెలుసుకుని, అన్ని ప్రాణుల్లో అదృశ్యంగా ఉండే పరమాత్మను హ్రృదయ కుహరంలో దర్శించుకుని, జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అవస్థల్లో జీవుడి వేదనకి , శైశవదశ నుంచి వృద్ధాప్యం వరకు మానవుడి జీవన పరిణామ క్రమ విశేషాలు తెలుసుకున్న భట్టతిరికి విష్ణు భక్తి అబ్బింది. 


అప్పుడు సకల ప్రాణికోటికి శ్రీహరే ఆత్మీయుడు, పరమాత్మ, పరమేశ్వరుడు అని గుర్తించిన భట్టతిరి శ్రీమన్నారాయణుడి దివ్యమంగళరూప దర్శనమే భాగ్యంగా తలిచాడు. 


ఆనంద స్వరూపుడు అయిన ఆ ప్రభువు కేవలం అనుభవంచేత మాత్రమే తెలుసుకోగలం. ఆయనకు ఎట్టి మార్పు ఉండదు; ఇలాంటిది అని నిరూపించ గల రూపం ఉండదు; పరమ పురుషుడు సత్త్వ రజస్తమో గుణాలు నిండిన తన దివ్యమైన మాయ చేత అదృశ్యమైన శక్తితో వ్యాపించునట్టి, వ్యాపింప జేసేటువంటి రూపాలతో చూడబడేవాడు, చూసేవాడూ, అనుభవించబడు వాడు, అనుభవించే వాడు తానే అయి స్పష్టాస్పష్టమైన రూపంతో ఉంటాడు. 


అధోక్షజుడు, శాశ్వతమైన వాడు, పురాణ పురుషుడు శ్రీహరి అయిన ఆ విష్ణుమూర్తి తృప్తి చెందితే లభించనది ఏదీ ఉండదు. జనార్దనుడు అయిన హరి పాదకమల స్మరణ అనే అమృతం త్రాగి పరవశులం అయితే మనకు ఆ జనార్దనుని దయ వలన కోరకుండానే ధర్మం, అర్థం, కామం సమస్తం లభిస్తాయి. కాంక్షిస్తే మోక్షం కూడ లభిస్తుంది అని వేరే చెప్పనక్కరలేదు. 


అటువంటి భావం వల్లే భట్టతిరి వారికి ఆత్మతత్త్వం కరతలామలకం అయింది.


 స్వస్తి.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: