1, అక్టోబర్ 2020, గురువారం

*దేవుడు ఎక్కడుంటాడు ?* 🥀


      *విగ్రహారాధన ఎందుకు ?*



ఒక వ్యక్తి దైవం కోసం అన్వేషణ చేస్తూ ప్రపంచం అంతా తిరిగాడు. 

అలా తిరుగుతూ తిరుగుతూ ఎందరినో ఎన్నో సందేహాలు అడిగాడు. 

కానీ అతని మనస్సుకి వారి సమాధానాలు రుచించలేదు. 

ఇలా ఉండగా ఒకనాడు ఒక మహర్షి ఇతడికి తారసపడ్డాడు. 

అప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ ఇది.


స్వామి పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు ? 

ఎలా ఉంటాడు ? 

అప్పుడు మహర్షి చిరునవ్వు నవ్వుతూ.. 

నీ సందేహం త్వరలోనే తీరుతుంది నాయన.. అంటూ ఒక మహా వృక్షం చూపించి 

అది ఏమిటి నాయన అన్నాడు.


అది వృక్షం.


ఓహో వృక్షమా ! ఎలా వచ్చింది ?


విత్తనం ద్వారా వచ్చింది స్వామి.


సరే అక్కడ పలుగు ఉంది. తీసుకొని ఆ చెట్టు పునాది త్రవ్వు.


 అయ్యో ఎందుకు స్వామి ? వృక్షం కదా ! త్రవ్వితే చచ్చిపోతుంది.


చచ్చిపోతుంది, కానీ ఆ విత్తనం ఎలా ఉందో చూడాలని ఉంది !


అయ్యో స్వామి ! అదెలా సాధ్యం అవుతుంది ?


_విత్తనం నుండి చెట్టు వస్తుంది అన్నావు కదా ? విత్తనం చూడలేమా ?


 అదేంటి స్వామి విత్తనమే చెట్టు. చెట్టుకి విత్తనానికి తేడా లేదు. విత్తనం ప్రత్యేకంగా ఉండదు కదా అన్నాడు ఆ భక్తుడు.


 ఇదే నాయన నీ సందేహానికి సమాధానం.


అదెలా స్వామి ?

విత్తనం అనేది పరమాత్మ. ఆ పరమాత్మే వృక్షం. అనగా సృష్టి. సృష్టి వేరు పరమాత్మ వేరు కాదు. ప్రతి అణువులో పరమాత్మ ఉన్నాడు. సృష్టి నుండి పరమాత్మని వేరు చేసి చూడలేము.


మరి విగ్రహారాధన ఎందుకు స్వామి ?


పరమాత్మని తెలుసుకోవాలి అంటే సాధకుడికి ఒక ఆకారం కావాలి. 

సృష్టి మొత్తం వ్యాపించి ఉన్నాడు కనుక ధ్యానం చేయమంటే ఎలా చేస్తాడు ? 

ఏమి అర్థం కాదు.

 అదే ఆ పరమాత్ముడికి ఒక రూపం, ఒక వర్ణన కల్పితే సాధకుడు ఆ ఆకారాన్ని, ఆ వర్ణనని తన ధ్యానంలో చూస్తాడు. ధ్యానం నిలబడుతుంది. 

అంతేతప్ప శూన్యంలోకి చూస్తూ ధ్యానం చేస్తే సాధకుడికి చీకటి తప్ప ఏమి అర్థం కాదు. 

అందుకే పూర్వం మహర్షులు వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదం వర్ణించిన విధంగా పరమాత్మకి ఒక రూపం కల్పించి సృష్టిలో ఉన్న పరమాత్మ శక్తిని ఆ విగ్రహంలో నిక్షిప్తం చేశారు. కొన్ని చోట్ల ఆయనే స్వయంభువై వెలిసి భక్తులను అనుగ్రహించాడు. అంతేతప్ప ప్రత్యేకంగా అంటూ పరమాత్ముడు ఎక్కడా లేడు. సృష్టిలో ఉన్న ప్రతి అణువులో ఉన్నాడు.

సాధకులను ఉద్దరించే నిమిత్తం విగ్రహారాధన ఏర్పాటు చేయబడింది. భగవంతుడు నీలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. ప్రకృతిలో ఉన్నాడు అంటే సామాన్య భక్తుడు భగవంతుడిని దర్శించలేడు. సాధ్యం కాదు. 

అందుకే రూపం, దానికి దీపం ధూపం, నైవేద్యం, నివేదన, పుష్పాలంకరణ ఇలా అనేక సేవలు ఏర్పాటు చేసి భగవంతుడి దగ్గరికి భక్తుడిని, సామాన్య సాధకులని తీసుకెళ్ళే మార్గం చూపారు. 


మన పురోహితులు విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేసి అందులోకీ ఆ పరమాత్మను సూక్ష్మ రూపంలో తీసుకురాగలరు.

అప్పుడు విగ్రహంలో ఆ తండ్రి పరమాత్మ సూక్ష్మ రూపంలో దర్శనమిస్తారు. 

మనం స్వచ్ఛమైన మనసుతో పవిత్రమైన ఆలోచనలతో కోరుకున్న కోర్కెలు తీరుస్తాడు. 

విగ్రహారాధన అది ఒక మార్గం. దాని నుండి ముందుకి వెళ్ళాలి అంతేతప్ప విగ్రహారాధన దగ్గరే ఆగితే భగవంతుడిని ఎన్నటికి తెలుసుకోవడం సాధ్యం కాదు !


స్వామి ! భగవంతుడి ఆస్తులు భగవంతుడే రక్షించుకోలేకపోతే భక్తులని ఏమి రక్షిస్తాడు ?


భగవంతుడు నాకు ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఒకడు విగ్రహం పెట్టుకున్నాడు. మరొకడు గుడి కట్టాడు. మరొకడు తన దగ్గర ఉన్న డబ్బుతో వజ్రాలు కూర్చిన నగలు చేయించి దర్జాగా వచ్చి అలంకరించాడు. మరొకడు దొడ్డిదారిలో వచ్చి తీసుకెళ్ళాడు. భగవంతుడిని ప్రతిష్టించడం దగ్గర నుండి అలంకరిచడం వరకు అన్ని చేసిన మనమే వాటిని కాపాడుకోవాలి కాని భగవంతుడి మీద నిందలు వేస్తె మనకే అపచారం. పరమాత్ముడికి మట్టిగడ్డ అయినా వజ్రమైన తేడాలేదు. ఎందుకంటే రెండిటిలో ఉంది తనే కనుక.


తన భక్తులని ఎవరైనా బాధలకు గురి చేస్తే తప్ప మిగిలినవి ఏమి పరమాత్మ పట్టించుకోడు. 

అర్థమైంది స్వామి ధన్యోస్మి. 


*అతనికి అర్థమైంది మరి మీకు అర్థమైందా ?*

కామెంట్‌లు లేవు: