24, సెప్టెంబర్ 2020, గురువారం

*🙏🏼✍🏻కొడుకుకి లేఖ✍🏻🙏🏼*


అమ్మ దీవించి వ్రాయునది.


నేను క్షేమంగానే ఇల్లు చేరాను. కోడలు ,పిల్లలు కులాసా అని తలుస్తాను.


నా అంతవాడివి నువ్వైయ్యావు,

నీ కుటుంబం నీది.

మీ ఇంట్లో మీరు మీకు నచ్చినట్లు నడచుకొంటారు. కానీ,తల్లిగా నీకు ఇష్టంవున్నా లేకపోయినా కొన్ని విషయాలు చెపుదామనుకొంటున్నాను.

నచ్చితే విను.

నచ్చకపోతే వదిలెయ్ .


పిల్లలు మట్టి ముద్దల్లాంటి వాళ్ళు. వాళ్ళని మీరు ఎలా తయారుచేస్తేవాళ్ళు అలా తయారౌతారు.


ముఖ్యంగా మీ భార్యా భర్తలిద్దరూ ఒక విషయం గ్రహించాలి.

పిల్లలెదురుగుండా మీరు ఆర్థిక విషయాలు మాట్లాడుకొని, అసహనంగా మాటలు విసురుకోరాదు. వారి ఎదురుగా, నువ్వెక్కువంటే నువ్వు తక్కువ అనుకోకూడదు.

చుట్టాల గురించీ, బంధువుల గురించీ చులకన చేసి మాట్లాడకూడదు.

అలాగే,వాళ్ళు చదువుతున్న స్కూలు గురించీ, టీచర్ల గురించీ తక్కువజేసి మాట్లాడకూడదు.


ముఖ్యంగా పిల్లలకు సరైన అవగాహన ఏర్పడే వరకు,తల్లితండ్రుల పట్ల భయం, భక్తి, ప్రేమ కలిగేలా చూడాలి కానీ,అతి చనువు ఇవ్వకూడదు. బాల్యంలో అడిగినంత డబ్బులివ్వడమంటే

వారిని మనం మన చేతులారా పాడుచేసినట్లే. పిల్లలు తల్లితండ్రులను ఎదిరించి మాట్లాడుతున్నారంటే ,వారికి మీరు అతి స్వేఛ్ఛ ఇచ్చినట్లే. పిల్లలకు చిన్నప్పటినుండే డబ్బు విలువ, మాట విలువ, మనిషి విలువ నేర్పాలి.


మీరు మీ ఖాళీ సమయంలో లాప్ టాప్ లు ముందువేసుకు కూర్చొనేముందు, నాలుగు మంచి మాటలు ,కనీసం ఒక నీతి కథైనా చెప్పాలి.


పిల్లలకు చదువు ముఖ్యమే కానీ, చదువుతో పాటుగా

లోకజ్ఞానం వుండాలి. పదిమందిలో వున్నప్పుడు ఎలా వుండాలన్నది, ఇంటికి వచ్చిన బంధువులను ఎలా గౌరవించిలన్నది

తప్పకుండా నేర్పాలి.


అతి గారాబం అనర్థదాయకం, అలాగే అతిగా శిక్షించడం కూడా అనర్థమే!

అడగగానే కొండమీద కోతైనా వస్తుంది అనే భావన పిల్లలలో కలగ కూడదు.వారి పట్ల మీకు అతి ప్రేమవుందనే విషయం వారికి తెలిస్తే, దాన్ని వారు దుర్వినియోగం చేస్తారు. మనం చూస్తూనేవున్నాం అలా పెరిగిన పిల్లలు ఎలా తయారై, తల్లితండ్రులను ఎలా బాధ పెడుతున్నదీ చూస్తునేవున్నాం.


పిల్లల సరదాలు తీర్చటం తప్పులేదు. తీర్చాలి కూడా. అలా తీర్చలేనంత మాత్రాన వారుమిమ్మల్ని నిరసన చేేసే విధంగా వారు తయారు కాకుండా పెంచే భాద్యత కూడా మీదే!


ఈ విషయాలన్నీ పెద్ద చదువులు చదువుకొన్న మీ వంటి భార్యా భర్తలకు తెలియవని కాదు కానీ ,పిల్లల విషయంలో మీ భార్యా భర్తలది ఒకేమాట అన్న విషయం మీరు మీ పిల్లలకు కలిగించలేకపోతున్నారు నేటి మీవంటి భార్యాభర్తలు. అదే యీనాడుపిల్లలు పెడమార్గం పట్టడానికి కారణమౌతోంది. నేటి పిల్లలకు ,తండ్రంటే భయం లేదు, తల్లంటే గౌరవం లేదు.

ఇంటికి వచ్చిన చుట్టాలు బంధువులు గతిలేక వచ్చినట్లు, అనవసర బర్డెన్ గానూ భావిస్తున్నారంటే ,మీరు బంధువుల పట్లా,చుట్టాలపట్లా వారికి అవగాహన కలిగించడం లేదని అర్థం.


ఇక ఆఫర్లంటూ షాపులు ప్రకటిస్తే, అవి మనకు అవసరమా కాదా అన్న ఆలోచన లేకుండా కొనెయ్యడం.వాడే టైమ్ దాటిపోయిందంటూ నిర్లక్ష్యంగా పారేయడం.బట్టలు కొనడానికైతే హద్దేలేదు. ఇలా తొడగడం,అలా పారెయ్యడం. వేలరూపాయలు పెట్టి బట్టలు కొనేటప్పుడు ,అవి ఎన్ని రోజుల వరకూ పనికొస్తాయన్నది కూడా ఆలోచించి కొనాలి. 


చినుకు చినుకు చేరితేనే చెరువులో నీరుంటుంది. లేకపోతే చెరువెండిపోతుంది. డబ్బుకూడా అంతే, రూపాయికి రూపాయి కలిపితేనే పొదుపౌతుంది. పిల్లలు పెరుగుతుంటే ముందు ముందు అధిక ఖర్చులే, రూపాయి రూపాయి కలిస్తే పాపాయెత్తు డబ్బౌతుంది అని సామెత.


మనిషికి ఉన్నది బలము, గొడ్డుకు తిన్నది బలము అంటారు. అందుకని డబ్బు విషయంలో ముందు జాగ్రత్త అవసరం. 


నేను చెప్పిన విషయాలన్నీ మీ బాగుకోసం చెప్పినవే. కోపగించుకోవని తెలుసు.

ఎదురుగానే చెప్పకపోయావా అంటావేమో? నేను ఉత్తరంలో వ్రాసినట్లు ముఖా ముఖీ చెప్పలేను. నేను చెప్పినపుడు మీరు మొఖం

చిట్లించినా నా మనసు గాయపడుతుంది. ఆపై చెప్పాలన్న విషయాలు చెప్పలేక పోవచ్చు.

అవసరమనుకొంటే కోడలికి కూడా ఈ లేఖ చూపించు. ముందులోనే చెప్పినట్లు, అవసరమనుకొంటే ఆచరించు. లేదూ, అమ్మదంతా చాదస్తం అంటే చింపి పారెయ్ .


                       వుంటాను

   

సదా నీ క్షేమం కోరే......

                           *అమ్మ*

కామెంట్‌లు లేవు: