6, అక్టోబర్ 2020, మంగళవారం

15-15-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - సకల జీవుల హృదయములందును తాను వెలయుచున్నాడనియు, అన్నిటికిని తానే యాధారభూతుడనియు భగవానుడు తెలుపుచున్నారు-


సర్వస్య చాహం హృది సన్నివిష్టో 

మత్తః స్మృతి ర్జ్ఞాన మపోహనం చ | 

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో

వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్ || 


తాత్పర్యము:- నేను సమస్తప్రాణులయొక్క హృదయమందున్నవాడను; నావలననే (జీవునకు) జ్ఞాపకశక్తి, జ్ఞానము (తెలివి), మఱపు కలుగుచున్నవి. వేదములన్నిటిచేతను తెలియదగినవాడను నేనే అయియున్నాను. మఱియు వేదము నెఱిగినవాడనుగూడ నేనే అయియున్నాను.


వ్యాఖ్య:- ‘సర్వస్య’ - జాతిమతకులతారతమ్య మెద్దియులేక చరాచర ప్రాణికోట్ల యందు భగవానుడు నివసించుచున్నాడని చెప్పబడుటవలన ఇక నెవరును అధైర్యపడవలసిన పనిలేదు. మహాపాపియైనను చండాలుడైనను తనయందలి దైవసన్నిధిని స్మరించి పవిత్రాచరణద్వారా వారిని తెలిసికొనవచ్చును. అట్టి పాపియు తన వెనుకనున్న, తనకు ఆధారముగనున్న అఖండచైతన్యమును స్మృతియందుంచుకొనినచో తన నిజరూపమును చింతించినచో పుణ్యాత్ముడే అయి తరించును.

ఇట్టి అవకాశమును శ్రీకృష్ణపరమాత్మ గీతయందు సర్వులకును కల్పించియున్నారు. ఎటువంటివారికైనను తరించుటకు చక్కని అవకాశము నొసంగియున్నారు. తరంగము చిన్నదైనను, పెద్దదైనను రెండిటివెనుక మహాసముద్రమే కలదు. కాబట్టి చిన్నతరంగము (ప్రాణి) అధైర్యమొందవలసిన పనిలేదు.

తనయందలి అంతర్యామియగు పరమాత్మను తెలిసికొనిన చాలును. ఆ పరమాత్మ అందఱి యొక్కయు "జన్మహక్కు” అని గీతాచార్యులు "సర్వస్య” అను పదముద్వారా భేరి మ్రోగించి చెప్పుచున్నారు.


"హృది” (హృదయమునందు) - అని పేర్కొనుటవలన, భగవానుడు ప్రతివానికిని అతిసమీపమున హృదయమందే వర్తించుచున్నారని భావము. కావున శిక్షకుడు చెంతనే యున్నారని గ్రహించి, పాపకృత్యములనుచేయక భగవత్ప్రీతికరములైన కార్యములనే (ధర్మకార్యములనే) చేయవలెను.

"మత్తః స్మృతిర్జ్ఞాన మపోహనం చ" - స్మృతి, జ్ఞానము, మఱపు - ఇవి యన్నియు మనస్సు యొక్క వివిధరూపములు. పరమాత్మయో మనస్సునకు అధిష్ఠానముగ, ఆధారభూతుడుగ నున్నవారు. కావున వారివలననే యవి కలుగుచున్నవని చెప్పబడినది. దీనినిబట్టి కేవలము స్థూలవస్తువులనేకాక, అతిసూక్ష్మములగు జీవుని మానసిక ప్రవృత్తులనుగూడ భగవానుడు గమనించుచున్నట్లును, వారికి తెలియకుండ ఏదియు మనస్సునందు జరుగదనియు స్పష్టమగుచున్నది. కాబట్టి ప్రతివారును తమ మనస్సునం దేలాటి అపవిత్రత, మాలిన్యము, దుస్సంకల్పములు, విషయవాసనలు రానీయకుండ భద్రముగా చూచుచుండవలెను.

"వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః” - వేదములందు, శాస్త్రములందు అనేక దేవుళ్లు, దేవతలు చెప్పబడినప్పటికిని, తెలిసికొనదగినవాడు ఆ పరమాత్మ ఒకడే అయియున్నారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరాది వివిధదేవుళ్ళందఱును ఒక్క పరమాత్మ యొక్కయే వివిధరూపులైయున్నారు. ప్రపంచమున ఒకే చరమలక్ష్యము, ధ్యేయము, జ్ఞేయము కలదు. అది సచ్చిదానందపరబ్రహ్మమే (పరమాత్మయే) యగును.


"వేదాన్తకృత్” - వేదములన్నిటిని సృష్టించినది సాక్షాత్ పరమాత్మయేకాని మానవమాత్రుడుకాడని యిట స్పష్టముగ తెలుపబడుటవలన, ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు (‘ఇవి భగవత్ర్పోక్తములే’ అను) నమ్మకముగలిగి ప్రవర్తింపవలయును. అవి దైవనిర్మితములగుటచే వానియందు అఖండవిశ్వాసముంచవలెను. లోకమున గురు పరంపర చెప్పునపుడును ‘ఓమ్ నారాయణం పద్మభువం.....’ అని మొట్టమొదట ఆ పరమాత్మనే, శ్రీమన్నారాయణునే పేర్కొనుచుందురు.


ప్రశ్న:- భగవంతు డెచటనున్నాడు?

ఉత్తరము:- అందఱియొక్క హృదయమున వసించుచున్నాడు.

ప్రశ్న:- స్మృతి, జ్ఞానము, మఱపు ఎవనివలన గలుగుచున్నవి?

ఉత్తరము:- ఆ పరమాత్మవలననే.

ప్రశ్న:- వేదములన్నిటిచే తెలియబడదగిన వారెవరు? వేదాంతమును సృష్టించినదెవరు? వేదమును లెస్సగ దెలిసినవారెవరు?

ఉత్తరము:- ఆ పరమాత్మయే.

కామెంట్‌లు లేవు: