6, అక్టోబర్ 2020, మంగళవారం

రామాయణమ్.84

 

..

తలచుకుంటూ ఉంటే హృదయం బరువెక్కిపోతున్నది కౌసల్యకు.

తన పుణ్యాలప్రోవు ,తన వరాలమూట జగదేకవీరుడైన రాముడు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నాడనే ఆలోచన ఆవిడ గుండెల్ని పిండివేస్తున్నది ! 

దీనికి కారణం దశరథుడు !

.

తన భర్తయొక్క అనాలోచిత చర్య !

.

ఆవిడ బాధ అంతా దశరథుడి మీద కోపంగా మారిపోయింది..

.

రాజా నీకు మూడులోకాలలో కీర్తి ఉండిన ఉండవచ్చు కానీ నీవు చేసిన ఈ తెలివితక్కవ పనివలన అది అంతా తుడిచి పెట్టుకు పోయింది..

.

నీ కొడుకులిద్దరూ నీ పనికిమాలిన కోరిక వలన అడవులపాలైనారే !

కష్టమంటే ఏమిటో తెలియని రాకుమారులు అడవులలో క్లేశాలను ఎలా భరించగలరనుకొని పంపావయ్యా!

.

ఇంత వరకు భక్ష్య,భోజ్య,లేహ్య,చోష్య,పానీయాదులతో బహుపసందైన భోజనమారగించే ఆ జనకుడికూతురు అడవులలో దొరికే నివ్వరిధాన్యాలు,వెదురుబియ్యాలతో ఆకలి ఎలా తీర్చుకుంటుంది?

.

సుప్రభాతవేళలో మంగళవాయిద్యములను శ్రవణానందకరంగా వింటూ నిదురలేచే ఆ రాకుమారి నేడు అడవి అంతా ప్రతిధ్వనించే సింహశార్దూల గర్జనల భయంకరధ్వనికి ఉలిక్కిపడి నిదురలేవాలికదయ్యా! 

ఎంతటి దయమాలినవాడవయ్యా నీవు !  

.

పట్టుపరుపులమీద మెత్తని దిండ్లు తలగడగా పెట్టుకొని హాయిగా నిదురించే నా కుమారుడు నేడు పరిఘవంటి తన బాహువులనే తలగడగా పెట్టుకొని నిదురించాలి గదయ్యా! 

ఎంత తెలివిమాలినపనిచేశావయ్యా!.

.

నీవు సుఖం అనుభవించటానికి నాకొడుకులను సుఖానికి దూరంచేశావు కదా!.

.

రాముడు తిరిగి వచ్చినప్పుడు తన తమ్ముడు అనుభవించిన రాజ్యలక్ష్మిని తాను తిరిగి చేపడతాడా?

.

ఇంకొక మృగము ముట్టిన ఆహారము పెద్దపులి తాను ముట్టదు .

నరశార్దూలము నా రాముడు!

 వాడు ఇంకొకరిచేత ఎంగిలి చేయబడ్డ కూడు ఆశించడు.

.

ఆత్మాభిమానము కల రాముడు ఈ అవమానం సహించడు.

.

కేవలము తండ్రి అనే గౌరవముతో నిన్ను ఏమీ చేయలేదు.

వాడికోపము ముల్లోకాలను ముంచెత్తగలదు ! 

వాడి బంగరు బాణములు సకలభూతములను ప్రళయకాలములోని అగ్ని లాగా దహించివేయగలవు.

వాడి శస్త్రాస్త్రాలు మహాసముద్రాలనే ఇంకింపచేయగలవు,

వాడు కన్నెర్ర చేస్తే నీవెక్కడ ఉండే వాడివి?.

.

పెద్దపులి తోకను తాకితేనే తాకినవారిని నిలువునా చీల్చివేస్తుంది! ఈ అవమానము నా రాముడు భరింపగలడా?

.

చేపలు తమపిల్లలను తామే తింటాయి అలాగే నీ పిల్లల సౌభాగ్యాన్ని నీవే నాశనం చేశావుకదయ్యా!

.

వాడు ఏ నేరము చేశాడో చెప్పు ?

 ధర్మానికి కట్టుబడి నడుచుకోవటమే వాడి బలహీనత అయ్యింది నేడు !

 ధర్మమూర్తికి ఉత్తపుణ్యానికి రాజ్యబహిష్కరణ విధించి బికారిలాగ ఇంటినుండి వెడలగోట్టావు కదా! 

ఇది శాస్త్ర సమ్మతమేనా?! 

సనాతన ధర్మమేనా? !

.

పడతికి పతి,పుత్రుడు,జ్ఞాతి ఈ ముగ్గురే గతి ! 

మొదటి గతి, నీవా ఉండీ నాకు లేనట్లే

నా కొడుకును చూసుకొని ఉందామంటే వాడిని అడవులపాలుచేశావు! 

అన్ని విధాలుగా నన్ను గతిలేని దానిని చేశావు కదయ్యా అంటూ తన హృదయవేదనను బహిర్గతం చేసింది కౌసల్యామాత!

.

వూటుకూరు జానకిరామారావు 

.

కామెంట్‌లు లేవు: