8, అక్టోబర్ 2020, గురువారం

రామాయణమ్..86

 

.

కౌసల్యా! మూఢత్వము మూర్తీభవిస్తే అది దాల్చే రూపము నేనే !

.కౌసల్యా ! బాలుడు మూఢుడూ ఒకటే ! (పిల్ల చేష్టలంటామే అవి).

గురులాఘవమర్ధానామారమ్భే కర్మణాం ఫలమ్

దోషం వా యో న జానాతి స బాల ఇతి హోచ్యతే

.

ఒక పని చేసేటప్పుడు మంచి,చెడ్డలు ఎంచి చూడకుండా ,

దాని వలన కలిగే ఫలితాన్నిగానీ ,అందులో ఏదైనా దోషముంటే గ్రహించకుండా ఎవడు ప్రవర్తిస్తాడో వాడు "బాలుడు"(మూఢుడు)

.


 నాలాంటి వాడొకడు అందమైన పూలు పూస్తున్నదిగదా దాని పండ్లు ఇంకా బాగా రుచిగా ఉంటవేమో అని తలచి అప్పటికే ఉన్న మధురఫలాలనిచ్చే మామిడి తోట నరుక్కొని మోదుగ వృక్షాలను నాటి శ్రద్ధగా పెంచుకొన్నాడట.చివరకు దాని పళ్ళుచూసి హతాశుడైనాడట! అలాంటి వాడిని నేను.

.

నవయువకుడిగా ఉన్నరోజులలో నా విద్యమీద నాకు ఉన్న వల్లమాలిన గర్వంతో గాఢాంధకారమావరించి ,లోకులంతా నిదురిస్తున్న వేళ వర్ష ఋతువులో వేటకు బయలుదేరాను.

.

శబ్దవేది విద్యలో నా నైపుణ్యము చాలా గొప్పది అని జనులంతా పొగుడుతుంటే ఆ పొగడ్తల మాయలో పడి అడవిలో రాత్రివేళ ధనుర్బాణాలు ధరించి సంచరిస్తూ గమనిస్తున్నాను.

.

 ఎక్కడ నుండో ఒక శబ్దం వినపడ్డది.చెవులు రిక్కించి ఆ శబ్దాన్ని శ్రద్ధగా ఆలకించాను సందేహంలేదు అది ఒక ఏనుగు నీళ్ళు త్రాగే శబ్దం .

.

మనసును పూర్తిగా అటువైపే కేంద్రీకరించాను.

 ఆ శబ్దము దాని ఉత్పత్తి స్థానము నా మనోనేత్రం ముందు స్పష్టంగా కనిపించాయి.ధనుస్సు ఎక్కుపెట్టి ఆ దిశగా పదునైన బాణమొకటి సంధించి విడిచాను .

.

ఆ బాణం లక్ష్యాన్ని తాకిన మరుక్షణం అయ్యో అయ్యో అని మనిషి అరిచినట్లుగా ఉంది .దగ్గరకు పోయి చూద్దును కదా అది ఒక ముని బాలకుడి స్వరం ! నేను విడిచిన బాణం అతని గుండెలను చీల్చివేసింది .ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తూ కనపడ్డాడు .నేనెవరికి అపకారం చేశానని నన్ను బాణంతో కొట్టారు? అని అంటూ బాధతో మూల్గుతున్నాడు.

.

అతని వద్దకు వెళ్ళిన నన్ను చూసి ,చనిపోతున్నందుకు నాకు బాధలేదు కానీ ముసలి వారు,అంధులు అయిన నా తల్లితండ్రుల పరిస్థితి తలుచుకుంటే నాకు దిక్కుతోచటంలేదు అని బాధపడుతూ, దశరధా ఈ కాలిబాట వెంట వెళ్ళి వారిని తక్షణమే శరణు వేడు, లేకపోతే వారిచ్చే శాపానికి గురికావలసి వస్తుంది.అని పలికి నా చేతులలో ప్రాణాలు విడిచాడు.

.

భయము,భయముగా ఆ ముని బాలకుడి తల్లిదండ్రులను సమీపించి నా వలన తెలియక జరిగిన అపరాధము మన్నించమని వేడుకున్నాను. 

.

విషయము తెలిసిన ఆ తల్లిదండ్రుల శోకము వర్ణనాతీతము! .వారి కోరిక మీద వారి కుమారుడు పడిపోయిన ప్రదేశానికి తీసుకువెళ్ళగా వారు అతని దేహాన్ని స్పృశిస్తూ ,వారుకూడా మరణానికి దగ్గర అవుతూ ఉన్నవారివలే వణికిపోతూ ,రాజా ! మావలెనే నీవుకూడా పుత్రవియోగ దుఃఖముతో మరణించగలవు అని శపించి ప్రాణము విడిచిపెట్టారు.

.

కౌసల్యా ! నేడు ఆ సమయమాసన్నమైనది .

నాకు కళ్ళుకనపడటంలేదు దృష్టిమందగించింది 

యముని మహిషపులోహఘంటానాదం నా చెవులలో మారు మ్రోగుతున్నది.

ఇక అందమైన నా రాముని ముఖం చూడగలిగే అదృష్టం నాకులేదు..

.

అయ్యో రామా , అయ్యో మహాబాహూ,అయ్యో నా దుఃఖ నాశకా ,అయ్యో పితృప్రియా, అయ్యో మద్రక్షకా ,అయ్యో నా కుమారా ఎక్కడున్నావురా నీవు అంటూ గుండెలవిసేలా ఏడ్చిఏడ్చినిద్రలో తుదిశ్వాస విడిచాడు దశరథుడు.

.

హా రాఘవ మహాబాహో హా మమాయాసనాశన 

హా పితృప్రియ మే నాధ హాద్య క్వాసి గతః సుత.

.

హా కౌసల్యే నశిష్యామి హా సుమిత్రే తపస్విని

హా నృశంసే మమామిత్రే ( మమ +అమిత్రే) కైకేయీ కులపాంసని.

.

ఒక చక్రవర్తి అస్తమించాడు.

.

జానకిరామారావు వూటుకూరు

.

కామెంట్‌లు లేవు: