8, అక్టోబర్ 2020, గురువారం

🌹*కోరిక ?!*🌹

 


        మహాభారతం లోని ఆదిపర్వములో ఉటంకించిన యయాతి కథ మనిషి లోని కోరికలకు అంతము లేదని, దానిని మనిషి జయించ గలగాలనే సత్యాన్ని తెలియ చేస్తుంది.


        శివుడి కుమార్తె అశోక సుందరి నహుష చక్రవర్తుల కుమారుడు యయాతి మహారాజు. ఇతడు పాండవులకు పూర్వీకుడు. గొప్ప విష్ణు భక్తుడు. పరాజయం ఎరుగని పరాక్రమశాలి. ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. శుక్రాచార్యుని కుమార్తె దేవయానిని వివాహం చేసుకున్నాడు. 


        ఆ తరువాత వృషపర్వుడి కుమార్తె శర్మిష్ఠ పట్ల కూడా మోహం కలిగి దేవయానికి చెప్పకుండా రహస్యంగా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. దేవయానికి ఈ సంగతి తెలిసి తన తండ్రితో మొరపెట్టుకుంది. శుక్రాచార్యుడికి అల్లుడి మీద పట్టరాని కోపం వచ్చింది. 


        అంతే చేతిలోకి మంత్ర జలం తీసుకుని “నీకు తక్షణమే ముసలితనం వాటిల్లుగాక” అని యయాతికి శాపం ఇచ్చాడు. 


        నడి వయస్సులో అకస్మాత్తుగా ముసలి తనం రావడంతో యయాతి మహారాజు హడలి పోయి, గత్యంతరం లేక మామగారి పాదాలపై పడ్డాడు. 


        ఎంతైనా కూతురి భర్త కదా !... శుక్రాచార్యుడు జాలిపడ్డాడు. ”రాజా! నా శాపాన్ని ఉపసంహరించలేను. అయితే ఎవరైనా సమ్మతించే వారుంటే వారికి నీ మసలి తనం ఇచ్చి వారి పడుచు తనం నీవు తీసుకోవచ్చు” అని ఉపాయం చెప్పాడు. 


        యయాతికి ఐదుగురు కొడుకులు ఉన్నారు. అందరూ అందమైన వాళ్ళు. క్షత్రియోచితమైన విద్యలో ఆరితేరిన వాళ్ళు. కొడుకులలో ఎవరికైనా తన శాపాన్ని బదలాయించాలనుకుని, వాళ్ళను పిలిచి...


        “నాయనలారా! మీ తాతగారిచ్చిన శాపం వల్ల నాకు అకాల వార్థక్యం దాపురించింది. చూశారుగా నా అవస్థ!.... మీలో ఎవరైనా సరే నా ముసలితనం తీసుకుని మీ యవ్వనం నాకు బదులిస్తే మరి కొంత కాలం నేను పడుచుదనం అనుభవించవచ్చు. జీవిత భోగాలు తృప్తి తీరా అనుభవిస్తాను. ఎవరైతే నా ముసలితనం స్వీకరిస్తారో వారికి నా రాజ్యం ఇస్తాను” అన్నాడు. 


        పెద్ద కుమారుడు నావల్ల కాదన్నాడు.


        రెండవ కమారిడిని అడిగితే, “నాన్నగారూ! బలాన్నీ, రూపాన్నే కాకుండా తెలివిని కూడా నాశనంచేసే వృద్ధాప్యాన్ని తీసుకోమని అడుగుతున్నారు. అంతటి నిబ్బరం నాకు లేదు. క్షమించండి” అని మర్యాదగా తప్పుకున్నాడు.


        మూడవవాడు నిష్కర్షగా ముందే చేతులు అడ్డంగా తిప్పాడు.


        రాజుగారికి చాలా కోపం వచ్చింది. నాలుగవ వాణ్ణి పిలిపించారు. అతడు...


        “నాన్నగారూ! నన్ను మన్నించండి. ముసలితనమంటే నాకు అసహ్యం. వార్ధక్యంలో శరీరం ముడతలు పడి, చూపు ఆనక, మాట వినపడక స్వతంత్రం కోల్పోయి దుఃఖ పడాలి. మీ కోసం నేనంత కష్టాన్ని భరించలేను” అని స్పష్టంగా చెప్పాడు.


        ఇలా నలుగురు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు తన కోరిక కాదనేటప్పటికి యయాతి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాడు. ఎంతోసేపు విచారించాడు. చివరకు తన మాటకు ఎన్నడూ ఎదురుచెప్పని కడగొట్టు కుమారుణ్ణి పిలిపించాడు.


        ఆ కుమారుడిని చూడగానే కంట తడి పెట్టుకుని “నాయనా! ఇక నీవే నన్ను కాపాడాలి. ఈ ముసలితనం, ఈ ముడతలు, ఈ తడబాటు, ఈ నెరసిన వెంట్రుకలు ఇవన్నీ శుక్రాచార్యులవారి శాపం వల్ల నాకు అకాలంగా వచ్చి పడ్డాయి. ఈ దుస్థితిని నేను భరించ లేకుండా వున్నాను. కొంతకాలం నా ముదుమిని నీవు పుచ్చుకుని నీ యవ్వనం నాకిచ్చావంటే సర్వసుఖాలూ అనుభవిస్తాను” అని దీనంగా అర్ధించాడు.


        యయాతి ఆఖరి కుమారుడి పేరు పూరుడు. అంత దీనంగా తండ్రి ప్రాధేయ పడే సరికి అతనికి తండ్రి యెడల జాలి కలిగింది. 


        ”నాన్నగారూ! మీ కోరిక ప్రకారం మీ వార్ధక్యాన్నీ, రాజ్యభారాన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తాను. మీరేమీ దిగులు పెట్టుకోకండి” అన్నాడు.


        యయాతికి పట్టరాని ఆనందం కలిగింది కుమారుణ్ణి కౌగిలించుకుని అభినందించాడు.


        పూరుడి సమ్మతితో అతని యవ్వనాన్ని యయాతి తీసుకున్నాడు. తండ్రి మసలితనం పూరుడు స్వీకరించి, రాజ్యభారం వహించి చాలా కాలం జనరంజకంగా పాలన చేశాడు. గొప్ప కీర్తి పొందాడు. 


        యయాతి కుమారుడు ఇచ్చిన యవ్వనంతో వేల సంవత్సరాలు స్వర్గ సుఖాలు అనుభ వించాడు. కానీ తృప్తి కలుగలేదు. ఇంకా ఏదో కావాలనిపిస్తోంది. ఇలా ఎంత కాలం అనిపించింది. అప్పుడు పూరుడి దగ్గరకు వెళ్ళి... 


        “నాయనా! కుమారా! కోరికలు ఎన్నటికీ తీరవు. విషయానుభవం వల్ల కాంక్షలు ఇంకా వృద్ధి పొందుతాయే గాని అణగవు. కామినీ కాంచనాలూ, పాడిపంటలూ మనిషి కోరికలను ఎన్నటికీ తృప్తి పరచలేవు. ఈ సంగతి క్రమేపీ నాకు తెలిసి వచ్చింది. ఇష్టా అయిష్టాలకు అతీతమైన ప్రశాంత స్థితిని పొందాలని వుంది. ఇక నీ యవ్వనం నీవు తీసుకుని చల్లగా రాజ్యం పాలిస్తూ వర్థిల్లు నాయనా” అని అశీర్వదించాడు.


        తండ్రి కోరిన విధంగా పూరుడు తిరిగి తన యవ్వనం తను తీసుకుని తండ్రి ముసలి తనం తండ్రికి ఇచ్చాడు. యయాతి అందరి దగ్గర సెలవు తీసుకుని తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ చాలా సంవత్సరాలు తపస్సు చేసి, చివరకు స్వర్గం చేరుకున్నాడు.


        ఈ కథ ద్వారా అరిషడ్వర్గాలకు లొంగి పోతే ఎప్పటికీ తృప్తి తీరదనే విషయం అర్దమవుతోంది. అందుకే మన కోరికలను కుదించి ఆ పరమేశ్వరుడిని సదా మనసులో నిలుపుకుంటే జీవన్ముక్తులం కాగలము.


                             శుభం భూయాత్


                                  🌺🙏🌺

కామెంట్‌లు లేవు: