23, అక్టోబర్ 2020, శుక్రవారం

*శ్రీ చక్రార్చన

 





*శ్రీ చక్రార్చన*


శ్రీ చక్రం సమస్తములైన శ్రీ విద్యలకు సర్వోత్క్రుష్ట మైన పరమ సూక్ష్మమైన రూపం . తాంత్రికమతంలో ఉన్న మంత్రాలలో శ్రీ చక్రం చాలా ప్రసస్థమైనది . 


శ్రీ చక్రాన్ని మించిన యత్రం వేరొకటి లేదని శాస్త్రవేత్తల అభిప్రాయము . 


శ్రీవిద్య - పరంజ్యోతి - పరా - నిష్కళాశాంభవీ - అజపా అనే పంచ మాతృకలు పంచకోశాలుగా ఈ శ్రీ చక్రంలో పూజింపబడుచున్నారు . 


వీటిలో శ్రీవిద్య (ఆనంద స్వరుపిణి ) మధ్య బిందువు మిగిలిన పరంజ్యోతి - పరా - నిష్కళాశాంభవీ - అజపా చుట్టూ నలువంకల నిల్చి పూజలందుకొంటున్నారు .


చత్వారి శివచక్రాణి శక్తి చక్రాణి పంచ చ

నవచక్రమిదం జ్ఞేయం శ్రీ చక్రం శివయోర్వపుః


శివపరమైన చక్రాలు నాలుగు , శక్తిపరమైన చక్రాలు ఐదు . కలిసి మొత్తం తొమ్మిది .


త్రైలోక్య మోహన చక్రం 

సర్వాశా పరిపూరక చక్రం 

సర్వసంక్షోభక చక్రం . 

సర్వ సౌభాగ్య దాయక చక్రం 

సర్వార్థ సాధక చక్రం 

సర్వ రక్షాకర చక్రం 

సర్వరోగ హర చక్రం 

సర్వసిద్ధి ప్రద చక్రం 

సర్వానందమయ చక్రం 


అట్టి శ్రీ చక్రం పార్వతీ పరమేశ్వరుల శరీరమని తెలుసుకోవాలి . 


శివశక్తి సంభంధమైన ఈ తొమ్మిది చక్రాలను నవావరణ లంటారు . అట్టి నవావరణలతో కూడిన శ్రీ చక్ర సామ్రాజ్యానికి శ్రీ విజయదుర్గా దేవిని మహారాణిగా గుర్తించాలి . శ్రీ చక్రం యొక్క యంత్ర , తంత్ర , మంత్రాల విధానాన్ని శ్రీవిద్య అంటారు . 


ఈ శ్రివిద్యను ఉపాసించిన వారు పద్నాలుగుమంది . 


" విష్ణుః శివః సురజ్యేష్టః మనుశ్చంద్రో ధనాదిపః 

  లోపాముద్ర తధాగస్త్యః స్కందః కుసుమసాయకః 

  సురాధీశో రౌహిణేయః దత్తాత్రేయా మహామునిః 

  దుర్వాసా ఇతి విఖ్యాత ఏతే ముఖ్యా ఉపాసకాః "


విష్ణువు , శివుడు , బ్రహ్మ, మనువు , చంద్రుడు ,కుబేరుడు , లోపాముద్ర , అగస్త్యుడు , కుమారస్వామి , మన్మధుడు , ఇంద్రుడు , శ్రీకృష్ణుడు , దత్తాత్రేయుడు , దుర్వాసుడు అనే పద్నాలుగు మంది శ్రివిద్యోపాసకులలో ముఖ్యులు . 


శ్రీ చక్రారాధన చేసినట్టివారు సకలభోగ భాగ్యలను సుఖ సంతోషాలను ఆధ్యాత్మిక శక్తిని పొందగలరు . శ్రీ అంటే సమస్త సంపదలు . శ్రీ చక్రమంటే సిరులను ప్రసాదించే చక్రం . శ్రీ చక్ర నిర్మాణం భూ ప్రస్తారం , మేరు ప్రస్తారం ,


1వ ఆవరణ ను త్రైలోక్య మోహన చక్రం అంటారు. 

2వ రేఖ పై అష్టమాత్రుకలు కొలువై ఉంటారు.

3వ రేఖ పై ముద్రా శక్తులు కొలువై ఉంటారు.

ఈ ప్రధమావరణ చక్ర నాయకి "త్రిపుర".

ప్రకట యోగినులు పూజ అనంతరం చక్ర మధ్యం లో చక్ర నాయకి త్రిపుర ను మూల మంత్రం తో అర్చిస్తారు. సర్వసంక్షోభిణి ముద్ర ను ప్రదర్శించి నివేదనం సమర్పించాలి.


2వ ఆవరణను సర్వాశపూరక చక్రం అంటారు. ఈ చక్రం లోని దేవతలను గుప్త యోగినులు అంటారు. చక్ర నాయకి "త్రిపుర సుందరి".. ఈ ఆవరణ షోడశదళ పద్మం. ఈ ఆవరణలో ఈ యోగినులను అప్రదక్షిణంగా పూజించాలి. అనంతరం సర్వ విద్రావణి ముద్ర ను ప్రదర్శించి నివేదనం సమర్పించాలి


3వ ఆవరణ ను సర్వ సంక్షోభణ చక్రం అంటారు. ఇది అ‌ష్టదళ చక్రం. ఈ చక్రం లోని దేవతలను గుప్తతర యోగినులు అంటారు. చక్ర అష్ట దళాలలో వీరు కొలువై ఉంటారు. చక్ర నాయకి "త్రిపుర సుందరి". వీరిని పూర్వాదిగా యంత్రం లో చూపిన విధంగా పూజించాలి. అనంతరం సర్వాకర్షిణి ముద్ర ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


4వ ఆవరణను సర్వ సౌభాగ్య చక్రం అంటారు. ఈ ఆవరణ దేవతలను సాంప్రదాయ యోగినులు అంటారు. దీనిని చతుర్దశార చక్రం అంటారు. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. అనంతరం సర్వ వశంకరి ముద్ర ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


5వ ఆవరణను సర్వార్థ సాధక చక్రం అంటారు. దీనిని బహిర్దశార చక్రం అంటారు. ఈ చక్రం లోని దేవతలను కులయోగినులు అని అంటారు. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. చక్ర నాయకి "సర్వ సిద్ధిప్రద". ని ఛక్ర మధ్యం లో పూజించాలి. అనంతరం సర్వోన్మాద ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి


6వ ఆవరణను సర్వరక్షాకర చక్రం అంటారు. దీనిని అంతర్దశార చక్రం అంటారు.. ఈ ఆవరణ దేవతలను నిగర్భయోగినులు అని అంటారు. చక్ర నాయకి 'త్రిపుర మాలిని'. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. అనంతరం సర్వ మహంకుశ ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


7వ ఆవరణ ను సర్వరోగహర చక్రం అంటారు. దీనిని అష్టకోణ చక్రం అంటారు. ఈ ఆవరణ దేవతలను రహస్య యోగినులు అంటారు. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. చక్ర నాయకి 'సిద్ధాంబ'. సర్వ ఖేచరి ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి


8వ ఆవరణను సర్వసిద్ధిప్రద చక్రం అంటారు. దీనిని త్రికోణ చక్రం అంటారు. ఈ ఆవరణ దేవతలను పరాపర రహస్య యోగినులు అంటారు. చక్ర నాయకి 'త్రిపురాంబిక'. యంత్రం లో చూపిన స్ధానాల్లో పూజించాలి. అనంతరం సర్వబీజ ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


8వ ఆవరణ దేవతా పూజానంతరం నిత్యామండల దేవతలను పూజ చేయాలి. అమ్మకు గురువు కు అభేదం. లలితా సహస్రనామ స్తోత్రం లో అమ్మవారి ని గురుమండల రూపిణ్యై నమః,గురుమూర్తయే నమః అంటారు. గురు మండలం ని పూజించాలి


9వ ఆవరణ యే శ్రీ చక్రం లోని బిందువు. లలితా త్రిపుర సుందరీ పరాభట్టారిక కొలువై ఉంటారు. బిందు స్థానం లో లలితా త్రిపుర సుందరీ పరాభట్టారిక ను పూజించాలి. యోని ముద్ర ను ప్రదర్శించి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి.


పళ్ళు బెల్లం దద్ధ్యన్నం (దద్దోజనం) గుడాన్నం ( అన్నం పై బెల్లం వేసి) హరిద్రాన్నం ( నిమ్మ పులిహోర). ఏదేని అన్న ప్రసాదం అమ్మవారి కి దండి గా ఉంటుంది. అభిషేకం చేస్తే ఖచ్చితంగా అన్న ప్రసాదం ఉండాలి. మహా నివేదన శ్రేష్ఠమైనది.


లలితా సహస్రనామ స్తోత్రము పారాయణ చేయడం మంచిది.

గమనిక: పంచమ షష్టమావరణ ల యంత్రాలు ఒకటే. పేరు మారుతుంది అంతే. అంతర్దశారం మరియ బహిర్దశారం

ప్రతి ఆవరణ కు దేవతా పూజా విధానం గురుముఖతః నేర్చుకోవాలి.


*శ్రీ మాత్రే నమః* 

కామెంట్‌లు లేవు: