23, అక్టోబర్ 2020, శుక్రవారం

మహాలక్ష్మీ

 *దేవీ నవరాత్రులలో ఏడవరోజు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మరియూ కాళరాత్రీ దేవి అలంకారం*


*శ్రీ మహాలక్ష్మీ దేవి*

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మీ రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీ దేవి సర్వమంగళ కారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మి. ఈమె క్షీరాబ్ధి పుత్రిక. డోలాసురుడనే రాక్షసుడిని సంహరించిన దేవత మహాలక్ష్మి. శక్తి త్రయంలో ఈమె మధ్య శక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రంగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

"యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా" అంతే అన్ని జీవులలోను ఉండే లక్ష్మీ స్వరూపం దుర్గాదేవి అని చండీసప్తశతి చెబుతోంది. కాబట్టి శరన్నవరాత్రులలో దుర్గాదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. అమ్మవారికి వడపప్పు, చలివిడి నివేదన చేయాలి.

నైవేద్యం - వడపప్పు,క్షీరాన్నం.

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం 

దేవ్యువాచ

దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||

ఈశ్వర ఉవాచ

దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||

ధ్యానమ్

వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||

సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||

ఓం
ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||

వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||

అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||

అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||

నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||

పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||

పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||

చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||

విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||

భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||

ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||

శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||

విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||

నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||

మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||

త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||

భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||

భుక్త్వాతు విపులాన్ భోగాన్ నస్యా సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

***********************

ఏడవరోజు అమ్మవారి అలంకారము.

శ్రీ కాళరాత్రి దేవి.

'ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరాస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరిణీ
వామ పాదోల్లి, సల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ ' 

కాళరాత్రీ దేవి కాలవర్ణంతో , త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధబం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వసౌభాగ్యాలు లభిస్తాయి. ఈమెకు గల మరో నామం శుభంకరి.

దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతివహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద. ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.

కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందువలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరంలేదు.

దుర్గానవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోకప్రాప్తి కలుగుతుంది.

కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేతపిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.

కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.

ఈరోజు రాత్రి శ్రీశైలంలో స్వామి,అమ్మవారికి "గజవాహన" సేవ జరుగుతుంది.

*శ్రీ మాత్రే నమః* 

కామెంట్‌లు లేవు: