23, అక్టోబర్ 2020, శుక్రవారం

డా. మోహన్ భాగవత్

 పరమ పూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వివేక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ..


ప్ర; రామమందిర నిర్మాణం ప్రారంభం కావడంతో అయోధ్య వివాదం ముగిసినట్లే. దీనితో శ్రీ రామచంద్రుని గురించిన చర్చ కూడా ముగిసిపోతుందా?


జ. శ్రీ రామమందిర శిలాన్యాస కార్యక్రమం 1989లోనే జరిగిపోయింది. ఇప్పుడు ఆగస్ట్ 5న కేవలం మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణం కోసం అవసరమైన భూసేకరణ కోసం ప్రయత్నం సాగింది. దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ న్యాస్ కు అవసరమైన భూమి ప్రభుత్వం అందించింది. దానితో రామమందిర ఉద్యమం కూడా సమాప్తమయింది. కానీ శ్రీరామచంద్రుని గురించిన చర్చ ఎన్నటికీ సమాప్తం కాదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడిని ఈ దేశంలో అధిక సంఖ్యాకులు భగవంతునిగా పూజిస్తారు. భగవంతుడిగా భావించని వారు కూడా ఆదర్శపురుషునిగా మన్నిస్తారు. ఈ దేశపు వర్తమాన, భవిష్యత్తులపై ఎంతో ప్రభావాన్ని చూపే భవ్యమైన గతకాలపు గుర్తు ఆయన. రాముడు ఉండేవాడు, ఉన్నాడు, ఉంటాడు. శ్రీరామచంద్రుడు పుట్టినప్పటి నుంచి ఆయన గుణగానం జరుగుతూనే ఉంది. ముందు కూడా అలాగే సాగుతుంది. రామజన్మభూమి ఉద్యమం మాత్రం ఏ రోజున మందిర నిర్మాణ ట్రస్ట్ ఏర్పడిందో అప్పుడు పూర్తైంది.


ప్ర. రాబోయే రోజుల్లో కాశీ విశ్వనాధమందిరం, మథుర శ్రీకృష్ణజన్మభూమి ఉద్యమాలు జరుగుతాయా?


జ: మాకు తెలియదు. ఎందుకంటే మేము కేవలం ఉద్యమాలు చేసేవాళ్లం కాదు. రామమందిర ఉద్యమాన్ని కూడా మేము ప్రారంభించలేదు. అది చాలాకాలంగా ప్రజల ద్వారా నడుస్తోంది. అశోక్ సింఘాల్ జీ విశ్వహిందూ పరిషత్ కు వెళ్లడానికి చాలా కాలం ముందు నుంచే ఆ ఉద్యమం సాగుతోంది. ఆ తరువాత ఆ విషయం విశ్వహిందూ పరిషత్ దగ్గరకు వచ్చింది. కాబట్టి ఉద్యమాన్ని మేము ప్రారంభించలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ ఉద్యమంలో మేమూ భాగస్వాములమయ్యాం. ఏ ఉద్యమం ప్రారంభించాలన్నది మా కార్యప్రణాళికలో ఉండదు. మేము ప్రతి వ్యక్తిలో హృదయ పరివర్తన కోసం శాంతియుతంగా పనిచేస్తాము. హిందూ సమాజం ఏం చేస్తుందో నాకు తెలియదు. అది కాలమే నిర్ణయిస్తుంది. దీని గురించి నేను ఇప్పుడు ఏమి చెప్పలేను. మేము స్వయంగా ఎలాంటి ఉద్యమాలు ప్రారంభించమనే విషయాన్ని మరోసారి స్పష్టం చేయదలుచుకున్నాను.


ప్ర. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తరువాత అది కేవలం పూజాదికాలకు పరిమితమవుతుందా లేక అక్కడ ఇంకా ఏమైనా కార్యక్రమాలు జరుగుతాయా?


జ: కేవలం పూజాదికాలు నిర్వహించడానికి దేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. దానికోసం హిందూ సమాజం ఇంత సుదీర్ఘమైన పోరాటం చేయవలసిన అవసరం లేదు. ఈ దేశంలో ధర్మాన్ని అంతం చేయడం కోసమే ఈ ప్రముఖ దేవాలయాన్ని ధ్వంసం చేశారు. అందుకనే ఈ మందిరాన్ని తిరిగి నిర్మించుకోవాలని హిందూ సమాజం పోరాడింది. ఇంతకాలానికి ఆ పని పూర్తవుతోంది. అయితే కేవలం ప్రతీకాత్మకంగా ఒక మందిర నిర్మాణం జరిగిపోతే సరిపోదు. ఏ విలువలు, ఆదర్శాలకు ఆ మందిరం గుర్తుగా నిలచిందో వాటిని ఆచరించాలి. మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ మనం ఏం చేయాలన్నది ఆగస్ట్ 5నాటి కార్యక్రమంలో నేను గుర్తుచేశాను. “ఈ దేశాన్ని పరమవైభవ, సంపన్న, విశ్వగురువుగా చేయడానికి ప్రతివ్యక్తీ తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సులనే అయోధ్యగా మార్చుకునే కార్యక్రమం వెంటనే ప్రారంభించాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రతి భారతీయుని మనస్సులో అయోధ్య నెలకొనాలి.’’ మనస్సే అయోధ్యాగా మారడమంటే ఏమిటన్నది కూడా రామచరిత మానస్ ఉదాహరణగా నేను వివరించాను –


కామ్ కోహ్ మద్ మాన్ న మోహ | లోభ్ న చోభ్ న రాగ్ న ద్రోహ ||

జిన్హ్ కె కపట్ దంభ్ నహి మాయా | తిన్హ్ కె హృదయ్ బసహు రఘురాయ ||


రాముడే సర్వస్వంగా భావించే అయోధ్యవాసులు అలా ఉంటారు. కాబట్టి ప్రతి భారతీయుడు తన మనస్సును అలా మలచుకోవాలి.

రెండవ దోహా –


జాతి పాత్ ధను ధరమ్ బఢాయి | ప్రియ పరివార్ సదన్ సుఖదాయీ ||

సబ్ తజి తుమ్హహి రహయీ ఉర్ లాయీ | తెహి కె హృదయ రహహు రఘురాయి ||


కొన్ని విషయాలపట్ల అభిమానం ఉండడం తప్పు కాదు. కానీ వాటిని పట్టుకుని విభేదాలు, కలహాలు కలిగించుకోరాడు. `సబ్ తజి’ అంటే అన్నీ వదిలిపెట్టి హిమాలయాలకు వెళ్లిపోవాలని కాదు. ఏ విషయం పట్ల మనకు అవసరానికి మించి అభిమానం, ఆపేక్ష కలుగుతాయో దానిని వదిలిపెట్టాలి. మనసులో కేవలం రామనామాన్నే నింపుకోవాలి అని అర్ధం. రాముని ఆదర్శాన్ని ముందుంచుకుని నడవాలి అని. `తెహికే హృదయ రహహు రఘురాయి’ (హృదయంలో రాముడే ఉండాలి) అనే విధంగా జీవితాన్ని గడపాలి. అందుకోసం మందిరం కావాలి. దేశం మొత్తంలో ఈ భావన కలగాలి. అందుకు అందరూ ప్రయత్నించాలి. మనకు ఆదర్శమైన శ్రీరాముని మందిరాన్ని కూల్చి, అవమానపరచారు. ఆ ఆదర్శాన్ని పునః స్థాపితం చేసుకునేందుకు భావ్యమైన, దివ్యమైన రామమందిరం తిరిగి కట్టుకోవాలి.


ప్ర. శ్రీ రాముడు మన ఆదర్శం. కానీ ఇప్పటికీ ఈ దేశంలో అనేక మూఢాచారాలు, మూఢ విశ్వాసాలు చలామణిలో ఉన్నాయి. వాటిని అంతం చేయడానికి ఏం చేయాలి? ధర్మాచార్యులు ఇందుకు పూనుకోవాలా?


జ. ధర్మాచార్యులు ఏం చేయాలి? ఎలా చేయాలి అన్నది నేను చెప్పలేను. అయితే సమాజంలో నైతికత, ధర్మాచరణ ఉండాలన్నది నిజం. ఎలాంటి ఆచారాలు ఉండాలన్నది ధార్మిక వ్యవస్థ ద్వారా నిర్ణయమవుతుంది. ఆ ధార్మిక వ్యవస్థ ఏమిటి? సత్యం, అహింస, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, స్వాధ్యాయం, సంతోషం, తపం అనేవి శాశ్వత ధర్మాలు. అంటే ఇవి సదా, సర్వదా, సర్వత్ర ఆచరించవలసినవి. అయితే దేశాకాల పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి వీటి ఆచరణ ఉంటుంది.

శిబి చక్రవర్తి కధ ఒకటి ఉంది. ఒకసారి ఒక పావురం తనను తరుముకు వస్తున్న ఒక గద్ద నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు శిబి చక్రవర్తి సభలో ప్రవేశించి ఆయన శరణువేడుకుంది. ఆ పావురం ప్రాణాలు కాపాడటం తన కర్తవ్యమని శిబి కూడా భావించారు. అంతలోనే గద్ద అక్కడికి వచ్చి `పావురం ఎక్కడ ఉందో చెప్పండి. అది నాకు ఆహారం” అని అడిగింది. అప్పుడు రాజు `ఆ పావురం నా శరణువేడింది. దానిని కాపాడటం నా ధర్మం’ అన్నాడు. ప్రకృతి ధర్మం ప్రకారం ఆ పావురాన్ని తిని నేను జీవించాలి. కాబట్టి ఆ పావురాన్ని రక్షించడం ద్వారా నా ఆహారాన్ని నాకు అందకుండా చేస్తున్నావు. అది అధర్మం. ఇక్కడ రాజుకు ఒక ధర్మం ఉంది, పావురానికి ఒక ధర్మం ఉంది, గద్దకు కూడా ఒక ధర్మం ఉంది. ఈ ముగ్గురి ధర్మాలను దృష్టిలో పెట్టుకుని రాజు `కడుపు నింపుకోవడమే నీ ధర్మం, శరణు అన్న వారిని రక్షించాల్సిన నా ధర్మం నెరవేరేవిధంగా నీ కోసం నా శరీరంలో మాంసాన్ని ఇస్తాను’ అని అన్నాడు.

దేశ, కాల, పరిస్థితులు, వ్యక్తుల స్వభావం మొదలైనవాటి ఆధారంగా ఏర్పడే కర్తవ్యాలనే `ఆచార ధర్మాలు’ అంటారు. మనకు అనేక స్మృతులు ఉన్నాయి. అవి వివిధ కాలాలకు చెందినవి. వాటిలో చివరిది దేవల స్మృతి అని చెపుతారు. మహిళలకు విద్యార్జన, ఇతర అధికారాలు ఉన్నాయని దేవల స్మృతి పేర్కొంటున్నది. అయితే 10వ శతాబ్దంలో ఈ దేవల స్మృతి కూడా సమాప్తమయింది. ఆ తరువాత వెయ్యేళ్లపాటు ఎలాంటి స్మృతి రాలేదు. అందుకనే ప్రజలు తమ ఇష్టం వచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పటి పరిస్థితులకు తగిన, సరళమైన, ఆచరణ యోగ్యమైన కొత్త స్మృతిని రూపొందించడానికి ధర్మాచార్యులు పూనుకోవాలి. అలాంటి స్మృతి అవసరం ఇప్పుడు చాలా ఉంది.


ప్ర. మీరు స్మృతుల గురించి ప్రస్తావించారు. మన అనేక ధర్మ గ్రంధాల్లో విషయాలు కూడా ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు మార్పు చేసుకోవలసి ఉంది. వాటి గురించి ఏమంటారు?


జ. భారతీయులమైన మనం గ్రంధాల ఆధారంగా జీవనం సాగించం. గ్రంధాల ప్రకారమే నడుచుకునేవారమైతే ఏకనాధుడు రామేశ్వరంలో దాహంతో ఉన్న గాడిదకు గంగాజలం తాగించేవాడు కాదు. గ్రంధాల్లో కాలబాహ్యమైన(out of date) విషయాలు అనేకం ఉన్నాయి, ఉంటాయి. భారతీయ సమాజం ధర్మం పట్ల నిష్టను, శ్రద్ధను కలిగి ఉంటుంది. అందుకనే కాలబాహ్యమైన విషయాలను వదిలిపెట్టి ముందుకు వెళుతుంది. ఎందుకంటే గ్రంధాల్లో చెప్పిన విషయాలు దేశ, కాల, పరిస్థితుల ప్రకారం మారిపోతాయని ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ గ్రంధాల్లో ఉపయోగించిన పదాలు, వాటి అర్ధాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని, పునర్వ్యఖ్యానించుకుంటూ ఉండాలి. మన ధర్మ గ్రంధాల్లో ఏమాత్రం ప్రక్షిప్తాలు, కల్పితాలు లేనిది భగవద్గీత అని చెపుతారు. అలాగే ఒకరి నుంచి మరొకరు మౌఖికంగా నేర్చుకుంటూ నిలబెట్టిన వేదాలు, ఉపనిషత్తులలో కూడా ప్రక్షిప్తాలు, కల్పిత విషయాలు ఉండవు. ఇతర గ్రంధాల్లో మహాభారతాన్నే తీసుకుంటే ఆ గ్రంధపు ప్రస్తావన లోనే మొట్టమొదటసారి 800 శ్లోకాలలో మొత్తం కధ చెప్పారని ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు లభించే మహాభారతంలో లక్షకు పైగా శ్లోకాలు ఉంటాయి. అంటే 200 పైగా శ్లోకాలు తరువాత వచ్చి చేరాయన్నమాట. నేటి పరిస్థితులకు అనుగుణంగా లేనివాటిని తొలగించుకుని, అవసరమైనవి ఉంచుకోవాలి. ఏది ఉంచుకోవాలన్నది చెప్పే అధికారం కేవలం ధర్మచార్యులకు మాత్రమే ఉంటుంది. ఇతరులు ఎవరు అందులో జోక్యం చేసుకోకూడదు. కేవలం ఇలా చేస్తే బాగుంటుందని వాళ్ళు ధర్మాచార్యులకు విన్నవించుకోవచ్చును.


ప్ర. మన సమాజంలో అనేక పంథాలు, సంప్రదాయాలు ఉన్నాయి. అవన్నీ కలిస్తే సమాజం మరింత బలోపేతం అవుతుంది. ఆ విషయంలో రామమందిరం దారి చూపుతుందా?


జ. ఎందుకు చూపదు? రామాయణంలోగానీ, రామచరితమానస్ లోగాని ఎవరి పూజ చేయాలన్నది చెప్పలేదు. సత్యమార్గంలో వెళ్ళు, అన్యాయం, అత్యాచారాలకు పాల్పడకు, అహంకారంతో ప్రవర్తించకు అని మాత్రమే చెప్పారు. పూజా పద్దతులు అనేకం ఉండవచ్చును. ఎవరికి నచ్చిన పద్దతి వాళ్ళు అనుసరించవచ్చును. ఇతర పూజా పద్ధతిని తమ పద్ధతి మాదిరిగానే సత్యమైనదని భావించగలగాలి. అందరికీ వర్తించే, అందరినీ కలిపే అంశాలను గౌరవిస్తూ ముందుకు సాగితే దేశ కళ్యాణం నెరవేరుతుంది. మన రాజ్యాంగంలో మౌలిక విషయాలు ఇవే. రాజ్యాంగ పీఠిక (preamble)లో ఇవే ప్రస్తావించారు. రాజ్యాంగంలోని పీఠిక, పౌరుల విధులు, అధికారాలు, ఆదేశిక సూత్రాలు కూడా ఇవే విషయాలను చెపుతాయి. మన దేశంలో వైవిధ్యం మొదటి నుంచి ఉంది. శ్రీరాముని కాలంలో ఎలాంటి సంప్రదాయాలు ఉండేవి? ప్రధానంగా శైవం, వైష్ణవం అనే రెండు రకాలు కనిపిస్తాయి. శివుడు రామనామ జపం చేస్తాడు. రాముడు అనేకచోట్ల శివ పూజ చేశాడు. ఎవరి పద్దతి వారిది. కానీ కలిసి ముందుకు వెళ్ళే నిశ్చయం, పరస్పర ఆత్మీయత వంటివే రామాయణ సందేశాలు. అవే మన పరంపర మనకు అందించే సందేశం కూడా. మనుషులు రూపురేఖలలో వేరువేరుగా కనిపించవచ్చును. కానీ అందరిలో ఉన్నది ఆ సత్యస్వరూపమే. ఇదే ఈ దేశం ప్రపంచానికి ఇచ్చే సందేశం. రామాయణంలో కూడా అదే ఉన్నది. ఎన్ని పూజాపద్దతులు ఉన్నా అవన్నీ ఈ సందేశాన్ని అనుసరిస్తే అప్పుడు అందరికీ మంచి జరుగుతుంది, దేశానికి కూడా మంచి జరుగుతుంది. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు వెల్లివిరుస్తాయి.


ప్ర. రామమందిర సందేశాన్ని అనుసరించి అన్ని సంప్రదాయాలు, పూజాపద్ధతులకు చెందినవారు ఒకటిగా నిలబడటానికి, కలిసి పనిచేయడానికి వీలవుతుంది. కానీ ఈ దేశంలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. వారిలో కూడా ఈ ఏకత్వ భావాన్ని తీసుకురావడానికి ఏం చేయాలి?


జ: వాళ్ళని తీసుకురావడం ఏమిటి? తాము దూరంగా, వేరుగా వెళిపోకూడదని వారికి అనిపిస్తే చాలు. రసఖాన్ గురించి తెలుసుకదా. ఆయన ఇస్లాంను వదిలిపెట్టలేదు. అయినా కృష్ణునిపై ఎంతో అద్భుతమైన కావ్యాన్ని రచించారు. ఆయన కృష్ణ భక్తుడు. షేక్ మహమ్మద్ అనే విఠల భక్తుడు ఉండేవాడు. వీళ్ళంతా ఎప్పటివారో కారు. ఇస్లాం, క్రైస్తవ మత పద్దతులను స్వయంగా అనుసరించి, ఆచరించిన తరువాత అన్ని మతాలు ఒకే లక్ష్యాన్ని చేరుకుంటాయని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు. తాను హిందువుగా మారాలనుకుంటున్నట్లు పాల్ బ్రన్టన్ (paul Brunton) అనే విదేశీయుడు చెప్పినప్పుడు `లేదు నువ్వు క్రైస్తవుడిగా జన్మించావు. కాబట్టి మంచి క్రైస్తవుడిగా మారేందుకు ప్రయత్నించు. ఒక హిందువుకు మంచి హిందువుగా మారితే ఎలాంటి ఫలితం లభిస్తుందో అదే నీకూ దొరుకుతుంది’ అని రమణ మహర్షి చెప్పారు. కానీ కొన్నిసార్లు పిడివాదులు ఇందుకు వ్యతిరేకమైన దిశలో సమాజాన్ని తీసుకుపోవడానికి ప్రయత్నిస్తారు. వారి ప్రయత్నాలను శివాజీ మహారాజ్ వంటివారు నిరోధిస్తారు. ఆయన సైన్యంలో కూడా ముస్లింలు ఉండేవారు.

మహారాణా ప్రతాప్ సైన్యంలో కూడా ముస్లింలు ఉండేవారు. ఆయన హల్దిఘాటిలో అక్బర్ ను ఎదిరించాడు. ఎప్పుడెప్పుడు భారతీయ సంస్కృతి పట్ల భక్తి, పరంపర పట్ల గౌరవం జాగృతమవుతాయో అప్పుడు అన్ని రకాల భేదభావాలు సమసిపోతాయి. స్వప్రయోజనాలు నెరవేర్చుకోవాలనుకున్న వారు పిడివాదాన్ని, వేర్పాటువాదాన్ని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తారు. దీర్ఘకాలం ప్రజలంతా ఒకటిగా కలిసి జీవించిన దేశం ఏదైనా ఉందంటే అది మన దేశమే. ఇతర మతాలకు చెందిన వారికి కూడా పాలనా వ్యవస్థలో స్థానం కల్పించిన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారత్ మాత్రమే. ముస్లిం ఆక్రమణకు కొంత కాలం ముందు ముస్లింలు ఇక్కడకు వచ్చారు. ఆక్రమణకారులతోపాటు పెద్ద సంఖ్యలో ఇక్కడకు వచ్చారు. ఎంతో రక్తపాతం, సంఘర్షణ జరిగాయి. అయినా ఇప్పటికీ ఇక్కడ ముస్లింలు ఉన్నారు. అలాగే క్రైస్తవులు ఉన్నారు. వారిపట్ల ఎవరూ ఎలాంటి హాని తలపెట్టలేదు. ఇక్కడ వారికి కూడా సర్వాధికారాలు లభించాయి. కానీ పాకిస్థాన్ ఇతర మతస్తులకు ఎలాంటి అధికారాలు కల్పించడం లేదు. మతప్రాతిపదికన ముస్లింలు హిందూస్థాన్ ను ముక్కలు చేసి పాకిస్థాన్ ఏర్పాటుచేసుకున్నారు. అప్పుడు కూడా మీరంతా పాకిస్థాన్ కు వెళిపొండి. ఇక్కడే ఉండదలుచుకుంటే హిందువుల క్రింద అణగిమణిగి ఉండండి అని రాజ్యాంగం చెప్పలేదు. మన రాజ్యాంగ సభలో అన్ని రకాలవారు ఉన్నారు. జనాభా మార్పిడి జరగాలని అంబేడ్కర్ కోరుకున్నారు. కానీ ఇక్కడ ఉండిపోయినవారిని తరలించడం కోసం ఆయన రాజ్యాంగంలో ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలనుకోలేదు. వారిని కూడా ఈ దేశస్థులుగానే పరిగణించారు. ఇదే మన దేశపు తత్వం. ఇదే హిందూ స్వభావం. ఏ పూజాపద్దతిని అనుసరిస్తామో దానికి హిందూత్వానికి సంబంధం లేదు. ధర్మం అంటే కలిపేది, ఉన్నతిని తెచ్చేది, సమాజాన్ని ఏకం చేసేదిగా ఉండాలి. భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని తెచ్చేదిగా ఉండాలి. జాతీయతకు పూజాపద్ధతికి సంబంధం లేదు. పాకిస్థాన్ ఏర్పాటు ప్రతిపాదన మొదట వచ్చినప్పుడు జమాతే ఇస్లామి అధినేతగా మదాని ఉండేవారు. దేశానికి, మతానికి సంబంధం లేదని ఆయన తన పుస్తకంలో వ్రాసారు. ముస్లింలు హిందూస్థాన్ కు చెందినవారు కాదని కొందరు చేస్తున్న వాదన పూర్తిగా తప్పు.

అప్పుడప్పుడు పిడివాదం పెచ్చుమీరినప్పుడు మనం కూడా దారి తప్పకూడదు. మనది హిందూ రాష్ట్రం. పురాతన, చిరంతన దేశం. మనం ఏది మార్చుకోవలసిన అవసరం లేదు. కేవలం కొన్ని చెడు పద్దతులను వదులుకోవాలి. సంకుచితత్వాన్ని వదులుకోవాలి. ఇది సాధ్యమే. ఈ విషయాలను అంగీకరించేవారు కలుస్తూ ఉంటారు. బాగా విద్యావంతులైన, ఉన్నత పదవులలో ఉన్న ముస్లింలు, క్రైస్తవులు కలుస్తూ ఉంటారు.


ప్ర. మన దేశంలో 130కోట్ల మంది ఉన్నారు. వారిలో ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు. కానీ ఇది హిందూ దేశం అని అంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు?


జ. చూడండి, అది సత్యం. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం వారి ఇష్టం. కానీ అది సత్యం. సత్యాన్ని అంగీకరించి నడిచేవారికి ఎలాంటి ఇబ్బందులు రావు. కానీ ఎంతకాలం సత్యాన్ని అంగీకరించకుండా ఉంటారు? సత్యానికి శక్తి ఉంటుంది. ఎవరు ఏమీ చెప్పకపోయినా తాము హిందువులమని, భారతీయులమని అందరికీ అనిపిస్తుంది, తెలుస్తూ ఉంటుంది. ముస్లిములమైనా అరబ్బీలు, తుర్కీలము కాము, మేము భారతీయులం. భారతీయులంటే? ఎవరు అన్నది ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడు భారతీయులు అంటే హిందువులు అని స్పష్టమవుతుంది. కానీ ఈ విషయాన్ని ఎలా అంగీకరించాలి? అలా అంగీకరించేట్లు వారికి వివరించాలి. అది నచ్చచెప్పాల్సిన విషయమేకానీ బలవంతంగా ఒప్పించవలసింది కాదు. చేతిలో కర్ర పట్టుకుని ఇలాంటి విషయాలు ఒప్పించగలమా? అలా చేయకూడదు. చేయము. హృదయ పరివర్తన ద్వారా అది జరగాలి. అది జరగాలంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మా పూర్వజులు ఎవరు? ఏ నేలతో తమకు సంబంధం ఉంది? ముస్లిం దేశాల్లో కూడా లేని ఖవ్వాలీ ఇక్కడ ఎందుకు మిగిలింది? అఖండ భారత్ ప్రాంతాల అవతల నేటికీ ఖవ్వాలికి అనుమతి లేదు. అలాగే దర్గాల దగ్గర పూజలు కూడా ఇతర దేశాల్లో కనిపించవు. అలాగే మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఈద్ – ఏ –మిల్లద్ – ఉన్ – నబీ అనే వేడుకగా జరుపుకోవడం మరెక్కడా లేదు. అల్లా ఒక్కడే శ్రేష్టమైన దేవుడు కాబట్టి ప్రవక్త పుట్టినరోజు కూడా జరపడానికి వీలులేదన్నది ఆయా దేశాల్లో భావిస్తారు. అందుకని ఏ వ్యక్తికీ ఇలాంటి వేడుకలు జరపరు. అల్లాను మించి ఇంకెవరున్నారు అని వాళ్ళంటారు. కానీ మన దగ్గర అలా కాదు. ఎందుకంటే మనకు పరంపరాగతంగా కొన్ని పద్దతులు అలవాటయ్యాయి. మన పూర్వజులు ఒకటేనన్నది సత్యం. బయట దేశాల్లో మనల్ని భారతీయులుగానే గుర్తిస్తారు, గౌరవిస్తారు. అంతేకాని వేరువేరు గుర్తింపులు లేవు. ఈ దేశపు ప్రతిష్టే మన ప్రతిష్ట. బెంగళూరు వెలుతున్నప్పుడు ఒక టీసీ కలిశారు. `చనిపోతే శవపేటికపై స్వదేశపు మట్టి వేసి పూడ్చాల్సిందే. అప్పటివరకూ స్వర్గ ప్రాప్తి లభించదు. ఒసామాబిన్ లాడెన్ శవాన్ని అమెరికా సముద్రంలో విసిరి పారేసినప్పుడు చాలా చర్చ జరిగింది. అందుకు కారణం ఇదే. అతని శవాన్ని స్వదేశపు మట్టి వేసి పూడ్చలేదు. మేము చనిపోతే ఈ దేశపు మట్టి వేయకపోతే మాకూ పరలోకప్రాప్తి కలగదు’ అన్నాడు. నిజమే మనం ఈ నేలకు చెందినవాళ్లమన్నది సత్యం. ఇదే విషయాన్ని హిందువు చెప్పాలని చూస్తే అప్పుడు వాళ్ళు వెంటనే అడుగుతారు `ఇందులో మీకేమి లాభం’ అని. కాబట్టి హిందువు `మీరు ఈ సత్యాన్ని నమ్మినా, నమ్మకపోయినా మాకు ఏమీ తేడా పడదు. ఆ విషయాన్ని మీకు నచ్చచెప్పవలసిన అగత్యం కూడా మాకు లేదు. కానీ మనమంతా సహోదరులమన్నది మాత్రం సత్యం. అందుకనే ఆ విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంటాము’ అని చెప్పాలి. అలాంటి ధోరణి అవలంబించాలి. కాబట్టి హిందువుకు ఏదీ చెప్పాల్సిన, చేయాల్సిన అవసరం లేదు. స్వీయరక్షణ చేసుకోగలడు. అయినా మనసులో బంధుభావన, స్నేహభావనతో మనమంతా ఒకటని చెపుతాడు. ఈ విషయం అవతలివారు అర్ధం చేసుకున్నప్పుడే ఆ మాట చెప్పాలి. అప్పటివరకూ హిందువు వేచి ఉండాలి. ఎందుకంటే మనమంతా బంధువులమని హిందువు మాత్రమే చెపుతుంటే అలా చేయడంకంటే అతనికి మరో గత్యంతరం లేదనే భావం ఏర్పడుతుంది. లేదా బేరసారాలకు దిగుతారు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదు. రెండు వైపుల నుంచి సద్భావన, సమన్వయం ఏర్పడాలి. కాబట్టి హిందూ సమాజం సర్వశక్తివంతమైన, ఎవరు బెదిరింపులకు దిగలేని స్థితి సాధించాలి. ఇది ఎవరికో గుణపాఠం చెప్పడానికో కాదు. చెప్పిన మాటకు విలువ, గౌరవం సాధించేందుకు.


ప్ర. కరోనా సంక్షోభ కాలంలో ఆత్మనిర్భర భారత్ నిర్మాణానికి పిలుపు వచ్చింది. ఆత్మనిర్భర భారత్ ను సాకారం చేసుకునేందుకు ఏం చేయాలి?


జ. ఇందుకు ముందుగా మన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మన ఆత్మ ఏమిటి? మనం ఏమిటి? చాణక్య నీతి ఇలా చెపుతోంది –


కః కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ |

కక్షాహం కా చ మే శక్తి – రితి చిన్త్ర్యమ్ ముహూర్ ముహు ||


అభివృద్ధి సాధించదలుచుకున్న వ్యక్తి లేదా సమాజం ఈ 6 విషయాల పట్ల జాగ్రత్తవహించాలి. అవి – కాలం ఎలా నడుస్తోంది? నా మిత్రులు ఎవరు? ఆదాయం, ఖర్చు(ఆర్ధిక స్థితి) ఎలా ఉంది? దేశాల స్థితి ఎలా ఉంది? నేను ఎవరిని? నేను ఏమిటి? చివరి రెండు ప్రశ్నలు చాలా ముఖ్యమైనవి. వీటి పైనే మిగిలినవన్నీ ఆధారపడి ఉంటాయి. ఏ విషయాల్లో శాంతి లభిస్తుంది? అనే విషయం కూడా తెలియాలి. అందుకు భూతకాలం, వర్తమానం గురించి అవగాహన ఉండాలి. మనకు ఎందులో శాంతి సుఖం లభిస్తుందో ఆ విషయాలను కొనసాగిస్తున్నమా లేదా అని చూసుకోవాలి. ఆంగ్ల మాధ్యమంలో 12వ తరగతి చదువుకుంటున్న ఒక విద్యార్ధి నాతో `ఇప్పుడు మాకు సరైన చరిత్ర చెప్పడమే లేదు. ముఖ్యంగా భారత దేశ చరిత్ర గురించి మాకు ఏమి తెలియదు’ అని అన్నాడు. 1857 ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి ఒక వ్యాసం వ్రాయాలనుకున్నాడు. కాని అతనికి దాని గురించి ఏమి తెలియదు. ఆ విషయాన్నికి సంబధించిన పుస్తకాలు ఏమున్నాయో కూడా తెలియదు. గ్రంధాలయాల్లో కూడా అలాంటి పుస్తకాలు దొరకలేదు. అప్పుడు నేను అతనికి రెండు, మూడు పుస్తకాల గురించి చెప్పాను. మనం ఈ స్థితి నుంచి బయటపడాలి. ముందు మనమేమిటో తెలుసుకోవాలి. మనకు ఏముందో దానిపట్ల గౌరవాన్ని, మన్ననను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది. మనలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. వాటి నుంచి బయటపడాలి. మనలో ప్రత్యేకతలను గుర్తించి వాటి పట్ల గర్వించాలి. ఆత్మగౌరవం, స్వాభిమానం లేనివారు ఎన్నటికీ ముందుకు వెళ్లలేరు. అవి లేనివాళ్లు సంకుచితంగా, తగ్గువగానే ఆలోచిస్తారు. నేను పెద్ద ఉద్యోగం చేస్తాను అని ఆలోచించే బదులు నేనే ఉద్యోగాలు ఇచ్చే స్థితికి వస్తాను అని ఎందుకు ఆలోచించకూడదు? అలా చేయడానికి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇలాంటి ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని కలిగించే వాతావరణం ఏర్పరచుకోవాలి. అలాంటి విద్య లభించాలి. తల్లిదండ్రులు అలా పెంచాలి. కొన్ని వ్యక్తిగతంగా మనం సాధించాలి, కొన్ని సమాజం నుంచి వస్తాయి. అలా సామాజిక స్థితితో పాటు వ్యక్తిగత ప్రయత్నం ఉన్నప్పుడే విజయం సాధ్యపడుతుంది. ఇంగ్లండ్ గురించి చెపుతూ the battle of waterloo was won on the playground’s of Harrow and Eton (వాటర్ లూ యుద్ధ విజయం హారో, ఈటన్ ఆటస్థలాల్లో లభించింది) అని అంటారు. ఎందుకంటే ఇంగ్లండ్ లో ఇళ్ళలో, సామాజిక వాతావరణం, విద్య మొదలైనవాటిలో సంస్కారాలు సహజంగానే లభిస్తాయి. కాబట్టి అవి వ్యక్తుల స్వభావం అవుతాయి. అందుకనే నెపోలియన్, హిట్లర్ వాటి వారిని కూడా ఇంగ్లండ్ ఓడించగలిగింది. మనం కూడా అటువంటి సహజమైన, సంస్కారవంతమైన జీవన శైలిని అవలంబించాలి.


ప్ర. మీరు తరచుగా మూడవ ప్రత్యామ్నాయం గురించి ప్రస్తావిస్తూ ఉంటారు. మూడవ ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? దానిని ఎలా అమలు చేయగలుగుతాము?


జ. భారత్ కు తనదంటూ ఒక స్వభావం, ధోరణి ఉన్నాయి. వీటి ఆధారంగా ఏది చేసినా అది ఆత్మనిర్భరతను సాధిస్తుంది.

ఆత్మనిర్భరత అంటే కేవలం స్వావలంబన, విజయం మాత్రమే కాదు. `స్వావలంబన’లోని `స్వ’ చాలా ముఖ్యమైనది. మన దగ్గర చక్కెర బాగా ఉత్పత్తి అవుతోంది. దానితో మనం మద్యం తయారుచేసి ఎగుమతి చేయవచ్చును. కానీ అది ఆత్మనిర్భరత కాదు. ఎందుకంటే మద్యం తయారుచేసి లాభాలు గడించడం భారత్ స్వభావం కాదు. భారత్ మూల స్వభావం `ఏకాత్మత, సమగ్రత’. అంటే సంపూర్ణ విశ్వంలోని ఏకాత్మతను దర్శించడం. నాకు ఏదైనా కావాలి లేదా అవసరం ఉన్నది అంటే అది ప్రపంచానికి కూడా కావలసినదై ఉంటుంది. ప్రపంచానికి మేలు చేసేదే నాకు కూడా మంచి చేస్తుంది. కేవలం నాకు మాత్రమే మంచి జరిగితే చాలు ప్రపంచం సంగతి అవసరం లేదనే పద్దతి భారత్ ది కాదు. ఎందుకంటే మనమందరి మధ్య పరస్పర సంబంధం ఉంది. బయట నుంచి వేరువేరుగా కనిపిస్తున్న ఇది అంతా ఒకటే. అందుకనే మనం ముక్కలు ముక్కలుగా విడగొట్టి చూడము. అంతా ఒక్కటిగానే భావించి ఆలోచిస్తాము.

మరొక విషయం ఏమిటంటే మనం దేని గురించైనా సమగ్రంగా, కూలంకషంగా ఆలోచిస్తాము. అందుకనే మనం ఎప్పుడు అతివాదులం (extremist), పిడివాదులం అయ్యే అవకాశం లేదు. సంతులితమైన, మధ్యే మార్గంలోనే వెళతాము. ఈ సంతులిత మార్గాన్నే ధర్మం అన్నారు. అస్తిత్వం ఒక్కటే, కానీ బయటకు కనిపించడం వేరువేరుగా ఉంటుంది అన్నది సత్యం. ఇదే ధర్మబద్ధమైన ఆలోచన. నేడు ప్రపంచంలో బాగా చెలామణిలో ఉన్నది పాశ్చాత్య ధోరణి. ప్రతి వ్యక్తి వేరు. అతని శరీరం, మనస్సు, బుద్ధి అన్నీ వేరు. సమాజపు ప్రయోజనం వేరు, వ్యక్తి లాభం వేరు, సృష్టి మంచి మరింత వేరు. అందరికీ సుఖం కావాలి. ఇలా అందరూ సుఖం కోరుకుంటారని భారత్ కూడా చెపుతుంది. కానీ కావలసింది శారీరిక సుఖమా? మానసిక సుఖమా? అక్కడ శారీరిక సుఖానికి ప్రాధాన్యత. కానీ శారీరిక సుఖం ఎంత అవసరమో మానసిక, బౌద్ధిక సుఖం కూడా అంటే అవసరం. అందరికీ సుఖం కావాలి కాబట్టి అది సాధించడం కోసం అందరూ సంయమనంతో వ్యవహరించాలని మనం చెపుతాము. అలా అవసరం లేదంటారు వాళ్ళు. సుఖ సాధన కోసం ఎంతకైనా తెగించాలని(struggle for existence) అంటారు. దానివల్ల ఘర్షణ తలెత్తుతుంది. ఒకసారి పార్లమెంట్ లో మాట్లాడుతూ డా. అంబేడ్కర్ స్వాతంత్ర్యం, సమానత్వం ఒకేసారి సాధించాలంటే పరస్పర బంధుభావనే మార్గమని అన్నారు. మనమంతా ఎప్పుడూ ఒకటిగానే ఉన్నాము. కానీ మరచిపోయిన ఆ భావాన్ని గుర్తుచేయాలి. మన దేశంలో ఇదే ప్రధాన విషయం కావడం వల్ల మనం అభివృద్ధి చెందాము. 1000 సంవత్సరాలపాటు ప్రపంచంలో అత్యంత ధనిక దేశంగా విలసిల్లాము. ఈ విషయంపై అధ్యయనం జరగాలి. ప్రపంచంపై మన ప్రభావం ఎంతో ఉండేది. అలాగే మన సామ్రాజ్యం కూడా చాలా పెద్దగా ఉండేది. కానీ అంతటి స్థితిలో కూడా మనం ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తలేదు, దానిని నాశనం చేయలేదు. ఎంతో అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం మనకు ఉండేది. అయినా ఎప్పుడు పర్యావరణానికి హాని చేయలేదు.

ప్రపంచంలో సంఘర్షణ అంతమై, అందరూ ఉన్నతి సాదించాలని కోరుకుంటున్నారు కానీ అది సాధ్యం కావడం లేదు. ఇప్పటి వరకు రెండు రకాల మార్గాలలో ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. వ్యక్తికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చి చూశారు. ఫలితం లేదు. మరోసారి సమాజానికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చారు. అయినా లాభం లేదు. మూడవ ప్రత్యామ్నాయం ఎక్కడ ఉంది? ఇక్కడ, మనదగ్గర ఉంది. అర్ధ, కామాలను సాధిస్తూ మోక్షాన్ని పొందే ధర్మ మార్గం మన దగ్గర ఉంది. శరీరం, మనస్సు, బుద్ధిలను అదుపులో పెట్టుకుని ఆత్మను పరమాత్మ వైపు తీసుకువెళ్లడమే తీసుకువెళ్లడమే ఆ మార్గం. అందుకనే వ్యక్తి, సమిష్టి, సృష్టి మూడింటి ఉన్నతి, వీటిని మూడింటిని పరమాత్మ వైపు నడపడం అనేది ఇక్కడి ప్రధాన దృష్టి. దీని ఆధారంగా జీవన విధానాన్ని తిరిగి ఏర్పరచుకోవాలి. ఇది సనాతన కాలం నుంచి వస్తున్న విధానం. ఇది శాస్త్రం. దీనిని ప్రస్తుతం ఎలా ప్రకటికరించాలి, దీనిని అనుసరించడానికి ప్రణాళిక ఏమిటి అన్నది ఆలోచించాలి. ఇప్పటికే ఈ దిశగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇక ముందు కూడా జరగాలి.


ప్ర. మార్పు కోసం అనేక కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయని మీరు అన్నారు. ఇందులో విద్య కు కూడా చాలా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. విద్యలో ధర్మానికి ఎలాంటి స్థానం ఉండాలి? మీ అభిప్రాయం ఏమిటి?


జ. ధర్మం సర్వత్ర ఉంటుంది. అధర్మం ఎక్కడా ఉండకూడదు. విద్యలో ధర్మం ఉండాలని నేను అంటే చాలామంది గగ్గోలు పెడతారు. కానీ అదే నేను విద్యలో అధర్మం ఉండకూడదు అని అంటే పట్టించుకోరు. ధర్మం అంటే మతం కాదు, పూజా పద్దతి అంతకంటే కాదు. ధర్మం అంటే పౌర క్రమశిక్షణ, పౌర బాధ్యత. మన దేశంలో ప్రతి పిల్లవాడికి మన రాజ్యాంగంలోని 4వ అధ్యాయం తప్పక తెలియాలి. దాని గురించి న్యాయ విద్యార్ధులు వివరంగా తెలుసుకోవాలి. రాజ్యాంగంలోని పీఠిక, పౌరుల విధులు, అధికారాలు, ఆదేశిక సూత్రాలు అందరికీ తెలియాలి. ఎందుకంటే అవే ధర్మం. మనమంతా కలిసిమెలసి జీవిస్తూ ఉన్నతి సాధించాలి, అలా అభివృద్ధి సాధిస్తున్నప్పుడు ప్రపంచానికి నష్టం కలగకూడదు అనే దృష్టితోనే మన రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. రాజ్యాంగ రూపకల్పన చేసిన వారి ఆలోచన, ఆకాంక్షలు మొదటి ప్రతి లోని ప్రతి చిత్రంలో ప్రతిబింబించాయి. ప్రతి మాట గురించి జరిగిన కూలంకషమైన చర్చను ఇప్పుడు పరిశీలిస్తే సనాతన ధర్మపు విలువలు ఇలా ప్రకటితమయ్యాయని తెలుస్తుంది. ఆ విషయాన్ని మనం నేర్చుకోవాలి, నేర్పాలి. డబ్బు సంపాదన కోసం చడవకూడదు. అలాగని ఉపాధికి ఎందుకు పనికిరాని చదువువల్ల కూడా ప్రయోజనం లేదు. చదువుకుంటే జీవితం సుఖంగా గడపవచ్చన్న ఆలోచన మంచిదే కానీ జీవితం బాగా ఉండడం కోసం మాత్రమే చదువుకోవాలనే అభిప్రాయం మాత్రం సరైనది కాదు. మన చదువు ప్రపంచంలో నిలబడి మన జీవితం సజావుగా గడపగలను అనే విశ్వాసాన్ని కలిగించాలి. ఈ సమాజం నుంచి నేను ఎంతో తీసుకుంటున్నాను కాబట్టి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన కలిగించాలి. మూడవ విషయం జీవితంలో అనేక అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవాలి, జీవితంలో వచ్చే ఎత్తుపల్లాలు, ఎగుడుదిగుళ్ళను సహజమైనవిగానే భావించి ఆనందాన్ని పొందాలి అనే ఆలోచన మనకు విద్య ఇవ్వాలి. అప్పుడు జీవితమంటే సకారాత్మక, సానుకూల దృష్టి ఏర్పడుతుంది. విధ్య ఇలా ఉండాలి. నేడు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన విద్యావిధానం ఈ దిశగా అడుగులు వేసింది. అది ఆహ్వానించదగిన విషయం. అయితే ఇది సంపూర్ణమైనదని భావించకూడదు. అలాంటి సంపూర్ణమైన విధానాన్ని ప్రభుత్వం ఎప్పుడు రూపొందించి అమలుచేస్తే అప్పుడు చేస్తుందిగాని అప్పుడు కూడా అలాంటి విధానపు అమలు కేవలం విద్యావ్యవస్థ ద్వారా మాత్రమే విజయవంతం కాదు. అందుకు ధర్మం, సమాజపు పాత్ర చాలా ముఖ్యం. విద్యావిధానపు అమలుకు తగిన వాతావరణాన్ని అందరూ కలిసి నిర్మాణం చేయాల్సిఉంటుంది.


Source : VSK ANDHRAPRADESH : VSK, TELANGANA.

కామెంట్‌లు లేవు: