11, మార్చి 2025, మంగళవారం

14-18-గీతా మకరందము

 14-18-గీతా మకరందము

        గుణత్రయవిభాగయోగము


-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఆ యా గుణములు కలవారు మరణానంతర మేయేలోకములను బొందుదురో చెప్పుచున్నారు – 


ఊర్ధ్వం గచ్ఛన్తి సత్త్వస్థా  

మధ్యే తిష్ఠన్తి రాజసాః | 

జఘన్యగుణవృత్తిస్థా 

అధో గచ్ఛన్తి తామసాః || 

 

తాత్పర్యము:- సత్త్వగుణము గలవారు (మరణానంతరము) ఊర్ధ్వలోకముల కేగుచున్నారు. రజోగుణముగలవారు మధ్యమమగు మనుష్యలోకమున జన్మించుచున్నారు. నీచగుణ ప్రవృత్తిగల తమోగుణయుతులు (పాతాళాది) అధోలోకములకు (లేక, అల్పములగు పశ్వాదిజన్మలకు) జనుచున్నారు.


వ్యాఖ్య:- సత్త్వగుణముగలవారు ఊర్ధ్వలోకములను, ఊర్ధ్వగతినే పొందుదురని తెలుపుటవలన, ఆ

గుణము అవలంబనీయమనియు, రజోగుణతమోగుణయుతులు, మధ్య లోకమును, అధోలోకమును బొందుదురని చెప్పుటవలన ఆ గుణములు అభిలషణీయములు కావనియు స్పష్టమగుచున్నది. దీనినిబట్టి ఊర్ధ్వగతిగాని, అధోగతిగాని వారి వారి యధీనమునందే కలవని తేలుచున్నది. కాబట్టి ప్రయత్నపూర్వకముగ సత్త్వగుణసమాశ్రయముద్వారా ఊర్ధ్వగతినే పడయుటకు సర్వులును యత్నించవలెను.


ప్రశ్న:- సత్త్వగుణము కలవారు మరణానంతర మేలోకములకు పోవుదురు?

ఉత్తరము:- ఊర్ధ్వలోకములకు (లేక , ఊర్ధ్వగతికి) 

ప్రశ్న:- రజోగుణము కలవారు?

ఉత్తరము:- మధ్యమమగు మనుష్యలోకములకు (లేక, మధ్యమగతికి). 

ప్రశ్న:- తమోగుణము కలవారు?

ఉత్తరము:- అధోలోకములకు (లేక, అధోగతికి)

కామెంట్‌లు లేవు: