16, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్.78


...
ఆ రాత్రి కీకారణ్యములో మొదటిరాత్రి వారు మువ్వురికి.
.
సాధారణమానవుడై జరిగిన విషయాలు తలచుకొని దుఃఖితుడయ్యాడు మరలా రామచంద్రమూర్తి.
.
లక్ష్మణా నా తల్లి కౌసల్య పూర్వజన్మలో ఏ తల్లిబిడ్డలను విడదీసినదో కానీ ఆవిడకు పుత్రవియోగము ప్రాప్తించినది.అంతటి మహాధార్మికుడైన మనతండ్రికి ఈ వయస్సులో ధర్మము,అర్ధము కంటే కామమే ప్రధానమైనదికదా ! .
.
ఈ లోకంలో ఎవడైనా తనకు అత్యంత విధేయుడైన కుమారుడిని ఒక ఆడుదాని మాటమీద విడిచేవాడుంటాడా?.
.
ముదిమివయస్సులో నేను దూరమయ్యానన్న దిగులుతో రాజు మరణిస్తాడు,భరతుడు రాజ్యాన్ని నిష్కంటకంగా ఏలుకుంటాడు.
.
చూడబోతే ఈ కైక నన్ను అడవులపాలుచేయడానికి,దశరధుడినిచంపడానికి,భరతుడిని రాజు చేయడానికే మన ఇంట చేరినదేమో అని అనిపిస్తున్నది.
.
కైక తనకు కలిగిన ఈ సౌభాగ్యముతో కన్నుమిన్నుగానక కౌసల్యా,సుమిత్రలను కష్టపెడుతుందేమో!
.
 లక్ష్మణా నీవు రేపు తెల్లవారగనే తిరిగి అయోధ్యకు వెళ్ళిపో! అనాధ అయిపోయిన నా తల్లిని రక్షించుము .
.
ఇది అమ్మకు దగ్గర ఉండి సేవ చేయవలసిన సమయము.
తల్లికి అనంతమైన శోకము కలిగిస్తున్నాను నేను.
 ఏ ఆడుదీ నా వంటి కొడుకును కనకుండుగాక,
వ్యర్ధజన్ముడను నేను.
.
లక్ష్మణా నేను కోపిస్తే అయోధ్యనేమిటి,సమస్తభూమండలాన్నే స్వాధీనమొనర్చుకొనగలను .
,కానీ ఇది పరాక్రమము చూపే సందర్భముకాదు కదా!.
.
ఇలా అంటూ కంటినిండా నీరునింపుకొని దైన్యముతో ఇంకా ఏమీ మాటాడలేక అలాగే కూర్చుండిపోయాడు రాముడు.
.
 విలపిస్తున్న రాముడిని ఓదార్చాడు లక్ష్మణుడు.
.
అన్నా నీవే ఇలా దిగులుపడితే నేనూ ,వొదినగారూ ఏం కావాలి? నీవు దగ్గరలేక పోతే నేను గానీ ,సీతమ్మకానీ నీటినుండి బయటకు తీసిన మత్స్యములమైపోతామయ్యా!
క్షణకాలము కూడా భూమిపై మనలేము.
.
శత్రుసంహారకుడవైన ఓ రామా ! నిన్ను విడిచి నా తల్లి సుమిత్రనుకానీ,శత్రుఘ్నుని కానీ,తండ్రినికానీ ఆఖరికి అది స్వర్గమైనా కానీ నేను వెళ్ళను.
.
సర్వలోకాలను ఆనందింపచేయువారలలో శ్రేష్ఠుడైన రాముడు(రామో రమయతాం శ్రేష్ఠః) తమ్ముడి మాటలతో తేరుకొని మనస్సును దృఢం చేసుకొని వనవాసము పూర్తిగావించుకొనుటకు సంకల్పించుకొన్నాడు.
.
అప్పుడు ఆ అన్నదమ్ములిరువురూ పర్వతచరియలపై నిర్భయముగా సంచరించే రెండు సింహాలలాగ ప్రకాశించారు.
.
NB
.
ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఘట్టాలు దాదాపు గా ఏదో ఒక సందర్బంలో ఎదురవుతూనే ఉంటాయి .మనసు నీరవుతూనే ఉంటుంది అయినా ఎన్నుకున్న మార్గంలో ముందుకు నడిచే వాడే ధీరుడు...
.
అనుకోలేదాయన అడవులకు వెళ్ళాల్సి వస్తుందని కానీ పిడుగులాంటి ఆ నిర్ణయం తనకు తనే చేసుకున్నాడు . మార్పును ఆహ్వానించాడు .ఆ మార్పుకు అలవాటుపడే క్రమంలో రాముడి మనస్సుకు దర్పణమిది!
.
CHANGE MANAGEMENT!.

రామాయణమ్.79
..
రాత్రి గడిచి తెల్లవారింది. పక్షుల కిలకిలారావాలు,నెమళ్ళక్రేంకారాలు,అడవికోడి కూతలతో అరణ్యంలో సందడిసందడిగా ఉంది.సీతారాములు నిదురలేచారు.మరల నడక సాగించారు.
.
కొంతదూరము వెళ్ళగనే వారికి పెద్దపెద్ద జలరాశులు కలుసుకున్న చప్పుడు వినపడ్డది. ఆ జలతరంగ ఘోషను శ్రద్ధగా ఆలకించారు .వారికి అర్ధమయ్యింది అది గంగా యమునల సంగమక్షేత్రమని అతి దగ్గరలోనే ప్రయాగ కలదనీ.
.
వారు నడుస్తున్న ప్రాంతంలో మనుషులచే విరవబడినట్లుగా కర్రముక్కలు కనపడ్డాయి. తలెత్తి పరీకించి చూసారు. దూరంగా పొగ ఆకాశంలోకి వెడుతూ కనపడ్డది.
.
ఉత్సాహంగా నడక సాగించారు .ఒక ఆశ్రమ పరిసరప్రాంతాలలో తామున్నట్లు గ్రహించారు.అది భరద్వాజమహర్షి ఆశ్రమము.
.
ఆశ్రమంలో అడుగు పెట్టగానే ధనుర్ధారులైన వారిని చూసి ఆశ్రమంలోని మృగాలు భయపడ్డాయి.
.
వారు మువ్వురూ శిష్య గణంతో శోభిల్లుతున్న భరద్వాజ మహర్షికి వినయంగా నమస్కారములు చేసి తమను తాము పరిచయం చేసుకున్నారు.
.
మహర్షీ నన్ను రాముడంటారు దశరధమహారాజు పుత్రుడను,ఈ కల్యాణి సీత జనకరాజపుత్రి అనిందిత నా సహధర్మచారిణి.
.ఈతడు నా సోదరుడు లక్ష్మణుడు నా తండ్రి నన్ను అరణ్యములకు పంపగా తనంతతానే నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
.
మహర్షీ ! నా తండ్రి ఆజ్ఞమేరకు మేము అరణ్యవాసము చేస్తూ కందమూలఫలములములు స్వీకరిస్తూ కాలం గడిపెదము.అని పలికిన రాముని చూసి రామా నీ గురించి అంతా విన్నాను.
.
ఎంతో కాలానికి మా ఆశ్రమానికి వచ్చావు మా ఆతిధ్యం స్వీకరించు అని మధుర ఫలరసాలతో కూడిన కమ్మని ఆహారం ( తాపసులు భుజించేది,అరణ్యంలో లభ్యమయ్యేవి) వారికి అందచేసి వారుండటానికి బస ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి.
.
మరల రాత్రి రానే వచ్చింది .ఎంతో దూరము నడచిన అలసట వల్ల సీతారాములు గాఢంగా నిదురించారు.
.
ఆ రాత్రి తెల్లవారిన పిదప రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని మహర్షి సూచించిన చిత్రకూటపర్వతం వైపు నడక సాగించారు.ఆ పర్వతము మనోహరమై ఉండి క్రూరమృగ బాధలేని ,తాపసులు నివాసముండే ప్రాంతము .అక్కడికి పది క్రోసుల దూరంలో ఉన్నది.
.
అంతకు ముందు భరద్వాజుడు తన ఆశ్రమంలోనే వనవాసం పూర్తిచేసుకొమ్మని చెప్పినప్పటికీ అది తమ కోసల ప్రజలు తేలికగా రాదగ్గప్రాంతం కావున సున్నితంగా వలదని అనువైన ప్రదేశం చిత్రకూటమని తెలుసుకొని ఆ దిశగా శ్రీ రామ ప్రయాణం సాగింది.

కామెంట్‌లు లేవు: