16, సెప్టెంబర్ 2020, బుధవారం

చాణక్య నీతిచంద్రిక


          ( మంజరీ ద్విపద )

           ఒకటవ అధ్యాయము

శ్రీకరుండైనట్టి శ్రీమహావిష్ణు
త్రైలోక్యనాథుడై తరియింప జేయ :
నట్టి లోకేశుని నతిభక్తి తోడ
తలవంచి ప్రణమిల్లి తశ్శక్తి తోడ
బహుశాస్త్ర ధృతమై భాసిల్లు నట్టి
రమణీయ మైనట్టి రాజనీతులను
విబుధుల కొఱకునై వివరించ నుంటి 1-1

మూర్ఖశిష్యులకును ముదముజెప్పుటయు
నశ్లీలవనితను నాదరించుటయు
నదృష్టలేమిచే నలమటించేటి
మనుజులచెంతను మసలుటయున్ను
పండితు , బాధలో పడవేయు నెపుడు. 1-4

దుష్ట తత్వంబుతో దూషించు భార్య
కుట్ర తత్వంబుతో కూడు మిత్రుండు
అవిధేయ తత్వంబు నలరు భృత్యుండు
కన్నుల ముందుగా కదలు సర్పంబు
యుండెడి గృహములో నుండిన యెడల
మరణమే శరణంబు మనిషికి యెపుడు 1-5

ఆపదార్ధంబునై యర్ధార్జనంబు
నిరతంబు మనుజుండు నెఱపంగ వలయు.
అర్థంబు యున్ననూ నసలు లేకున్న
నతివను రక్షించ నావశ్య మగును.
ఆత్మరక్షణముకు యర్థ మంగనల
త్యాగంబు సేయుటే తగిన మార్గంబు
వర్జించ వలయును వరుసగా రెండు. 1-6

బ్రతుకంగవృత్తియు , బంధువర్గంబు ,
యాగమవిద్యయు , నాత్మగౌరవము ,
అభివృద్ధి కొఱకునై నవకాశములును ,
మేల్గోరు వారలు , మిత్రవర్గంబు ,
యే దేశమందున యెన్నంగ లేరొ
యా దేశమందున నావాస ముంట
నరయ చింతించంగ నవివేకమగును. 1-8

గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: