16, సెప్టెంబర్ 2020, బుధవారం

సమాజంలోని వ్యక్తులను

​సమాజంలోని వ్యక్తులను మూడు తరగతులుగా విభజిస్తే

పరహితం కోరేవారిని సజ్జనులని, పరహాని తలపెట్టేవారిని దుర్జనులని,
స్వలాభం చూసుకునేవారు తటస్థులని చెప్పవచ్చు. 
సజ్జనులకు క్షమ, దుర్జనులకు హింస బలమని పెద్దల మాట. 
​“ అహంకారం, క్రూరత్వం, స్వార్ధంతో ప్రవర్తిస్తూ, పరులకు నష్టం కలిగించే వారిని, పాముకి కోరల్లో, తేలుకు తోకలో విషమున్నట్టే శరీరమంతా విషమున్నట్టు ప్రవర్తించేవారే దుర్జనులని” చాణక్య నీతి తెలిపింది.

       “పూల సువాసన మట్టికి అందుతుంది కానీ మట్టి వాసన పూవుకి అంటుకోదని” కవుల వచనం. “మంచి వారి సహవాసంతో చెడ్డవాడు సజ్జనుడుగా మారవచ్చు కానీ దుర్మార్గుని దుర్గుణాలు మంచివానికి అంటవని , రాక్షసుల మధ్య సంచరించినా విభీషణుడు, ప్రహ్లాదుడు దుర్జనులు కాలేదని పురాణాలు లిఖించాయి.

​‘చేదు పుచ్చకాయ వండినా చేదు పోనట్టు’ ‘దుర్మార్గుడు వయోవృద్ధుడైనా బుద్ధి మారదని’ శాస్త్రాలు చెప్పాయి. దుర్యోధనుడికి కురువృద్ధులు, పాండవ రాయబారి కృష్ణుడి హితోక్తులు రుచించలేదని భారతం, నారాయణ మంత్రాన్ని ప్రహ్లాదుడు స్మరించడాన్ని హిరణ్యకశిపుడు జీర్ణించుకోలేదని భాగవతం, ఆప్తుల హితవుల్ని రావణుడు పెడచెవిన పెట్టినట్టు రామాయణం తెలిపాయి.   

​“గర్వంతో విర్రవీగే వారిని, విచక్షణ లేని వారిని , చెడు మార్గంలో నడిచే వారిని గురువైనా వదలక దండించాలని” శాంతి పర్వంలో చెప్పినట్టు, దుష్టుల ఆగడాలను సాగనివ్వక చరమ గీతం పాడేందుకు లోకబాంధవుడు అవతరించి జగాలకు వెలుగు ప్రసాదిస్తాడు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, రావణ కుంభకర్ణులు, కంస, నరకాసురాది అసురులను నరసింహ, రామ, కృష్ణావతారాలలో సంహరించి శిష్ట రక్షణ చేసినట్టు పురాణేతిహాసాలు లిఖించాయి. 

​ ‘సత్యమార్గము చేత శిష్టుడగును , దుష్ట మార్గము చేత దుష్టుడవునని’ సత్యసాయిబాబా గారన్నట్టు తల్లిదండ్రుల పెంపకం , ఎంచుకున్న మార్గాలే మనుషుల్ని మంచి, చెడులుగా విభజిస్తాయి.

 ​ ‘బొగ్గును పాలతో కడిగినా తెలుపుగా మారనట్లే,’ ‘సాయాలెన్ని పొందినా చెడ్డ గుణాలను నీచుడు మానలేడని‘ వేమన చెప్పినట్టు, ఆశ్రయమిచ్చిన నాడీ జంఘుని ప్రాణాలు తీసిన దుష్ట బ్రాహ్మణుడి కథ నిరూపించింది.

​‘చల్లని స్తితిలో మసిని అంటించడం, వేడిగా ఉన్నప్పుడు చేతులు కాల్చడం బొగ్గుల నైజమైనట్టు’ దుర్జనులతో విరోధం, స్నేహమూ నష్ట కారకాలని గ్రహించి మెలిగితే బాధలకు దూరంగా ప్రశాంతంగా నివసించగలరు.

కామెంట్‌లు లేవు: