11, నవంబర్ 2020, బుధవారం

సాక్షాత్తు భగవంతుడే

 సాక్షాత్తు భగవంతుడే


పూజ్యశ్రీ కంచికామకోటి పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖర సరస్వతి మహాస్వామిని మొట్టమొదటిసారి సందర్శించే భాగ్యం నాకు 1962 సంవత్సరంలో తమిళనాడులోని ఎలయత్తాంగుడి లభించింది.


”భవిష్యత్తులో నీవు ఉన్నతస్థితికి రాగలవు” అని శ్రీవారు నన్నప్పుడు అశీర్వదించారు. అది మొదలుకొని నేటి వరకు స్వామివారే నన్ను కంటికి రెప్పవలె కాపాడుతున్నారు. అంతేకాదు, నా ఆధ్యాత్మిక జీవితానికి గట్టిపునాది వేశారు.


భక్తులను అనుగ్రహించడంలో శ్రీవారి ప్రభావమెట్టిదో సూచించే నా అనుభవాలు కొన్నిటిని ఈ సందర్భంలో పేర్కొంటాను.


1968లో స్వామివారు హైదరాబాద్ మకాంలో ఉన్నప్పుడు స్కందగిరి, పద్మరావునగరులో కంచికామకోటి పీఠం పక్షాన శంకరమఠం ఒకదానిని నిర్మించడానికి సంకల్పించారు. హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో మహాభవనాలు నిర్మించే పేరుగల కాంట్రాక్టరులు ఎందరో ఉన్నారు. అయినా, స్వామివారు నన్ని పిలిపించి, ఒక నెలరోజులలో మఠం నిర్మాణం పూర్తికావాలనీ, వెంటనే ప్రతిష్ట జరగాలనీ ఆదేశించారు.


ఆ మరుదినమే శ్రీవారి కరకమలములతో మందిరానికి శంకుస్థాపన జరిగింది. నెలరోజులు కాదు సరికదా 21 రోజులలోనే ఆ స్థలంలో సుందరమైన మందిరం రూపు దాల్చింది. అంత స్వల్ప వ్యవధిలో అంతనేత్ర పర్వంగా ఆ మందిరం పూర్తి కావడం ఆశ్చర్యకరం. స్వామివారే అందరిచేతా అన్ని పనులూ తామే చేయించారనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు.


అనంతరం కొద్దిరోజులకే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తలు తాము సంకల్పించిన దేవాలయం నేలమట్టానికి కట్టుబడి చేసి తరువాత దానిని పూర్తి చేయలేక ఆపివేశారు. గత్యంతరం లేక ధర్మకర్తలు శ్రీ కంచి కామకోటి స్వామికి తమ పరిస్థితులు నివేదించుకొని తమ పని సానుకూలమయ్యే ఉపాయం అర్థించారు. వెంటనే శ్రీవారు నన్ను పిలిపించి 15 రోజులలో తాము హైదరాబాదు నుండి బయలుదేరుతున్నామని అంతకు లోపల ఆలయ నిర్మాణం పూర్తికావాలని ఆజ్ఞాపించారు. స్వామి ఆదేశం అనుసరించి పదునాల్గవ రోజున గర్భగుడితో సహా ఆలయం పూర్తికావడం విగ్రహప్రతిష్ట జరగడం తటస్థించింది. శ్రీవారి సంకల్ప సిద్ధికి మరొక నిదర్శనం.


1981 సంవత్సరంలో స్వామివారి మహదాశీర్వాదంతో నల్లగొండ జిల్లాలో కాకతీయ సిమెంటు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించాను. 1983 ఫిబ్రవరిలో ఆ పని పూర్తయింది.


బెంగళూరు ప్రభుత్వ సంస్థ కంపెని యన్.జె.యఫ్ వారు వారి వద్ద 600 హార్సుపవర్ మోటార్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. పన్నెండు లక్షలు ఇచ్చి డెలివరి తీసుకొనవలసిందిగా ఆ కంపెనీ వారు నాకు తెలియజేసారు. కాని నా వద్ద అంత మొత్తం లేదు. “ఫ్యాక్టరి మొదలుపెట్టిన తరువాత నెలరోజులలో మొత్తమంతా చెల్లించగలను మోటార్లు సరఫరా చేయవలసినదని” కోరుతూ వారికి లేఖ వ్రాసాను. అందుకు వారు సమ్మతించలేదు.


ఏమి చేయడానికి నాకు పాలుపోలేదు. మార్చి ఒకటవ తేదీన ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి కూడా ముహూర్తం నిర్ణయించాము.


ఇలాంటి క్లిష్టపరిస్థితిలో “శ్రీవారే నన్ను కాపాడాలి” అంటూ స్వామి వారిని గట్టిగా ప్రార్థించాను. రెండురోజులు గడిచినవో లేదో బెంగళూరు ప్రభుత్వ సంస్థ వారు తమ మనస్సు మార్చుకొని బాడుగకు లారీలు మాట్లాడి బాడుగ తామే చెల్లించి మేము ముందుగా 12 లక్షలు పైకం చెల్లించవలసిన షరతు రద్దుచేసి మోటార్లు రెండూ మా ఫ్యాక్టరీలో డెలివరి చేసారు. అటు తరువాత మొడు నెలలకు తమ బాకీ మొత్తం మా వద్ద వసూలు చేసుకున్నారు.


అత్యద్భుతమైన ఈ ఒక్క సంఘటన చాలు తమ్ము ఆశ్రయించిన భక్తులను శ్రీవారు తోడునీడయై ఎట్లా రక్షిస్తారో తెలుసుకోవడానికి.


స్వామివారు భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసికోజాలిన సర్వజ్ఞులనీ సర్వశక్తిమంతులనీ నా ధృఢ విశ్వాసం. స్వామి దయ అపారం.


1968లో హైదరాబాద్ అశోకనగరులో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ నిర్మాణానికి నేను పూనుకున్నాను. శ్రీవారి చేతనే ఆలయ శంకుస్థాపన జరిగింది.


కాని, అశోకనగరు కాలనీ వాస్తవ్యులు కొందరు ఆ మరునాడు స్వామివారిని సందర్శించి, ఆ స్థలంలో దేవాలయ నిర్మాణం జరిగితే గుడిగంటల మోతలవల్ల చుట్టుపక్కల ప్రజలకు నిద్రాభంగం కలుగుతుందనీ, ఆలయం చుట్టూ భిక్షకులు చేరుతారని కాబట్టి ఆలయ నిర్మాణం ఆపి వేయవలసినదిగా సలహా చెప్పవలసిందనీ, అట్లా జరగని పక్షాన తాము కోర్టుకు వెళ్ళగలమనీ కడు నిష్టూరంగా స్వామివారిని బెదిరించారు.


స్వామి వారు వారి ధోరణి చూచి నవ్వి, మౌనంగా ఊరుకున్నారు. వారికేమి బదులు చెప్పలేదు. ఆ తరువాత అనుకున్నప్రకారం అదే స్థలంలో సర్వాంగసుందరంగా ఆలయం పూర్తి అయింది. అది మొదలుకొని, నిత్యప్రవచనమూ సత్యనారాయణస్వామి వ్రతమూ నిరంతరాయంగా జరుగుతున్నవి. తెంపు లేకుండా అనుదినం ఆలయం భక్తులను ఆకర్శిస్తున్నది.


విశేషమేమంటే ఆలయనిర్మాణానికి అడ్డుపడి శ్రీవారిపట్ల నిష్ఠూరంగా మాట్లాడిన అశోకనగర వాస్తవ్యులు ముగ్గురూ తమ కర్మఫలం అనుభవింపక తప్పలేదు.


శ్రీకామకోటి మహాస్వామి వారు సాక్షాత్తు భగవంతుడేనని త్రికరణశుద్దిగా నేను విశ్వసిస్తున్నాను. ఇంతకుమించి నేను చెప్పవలసిన దేమున్నది?


--- శ్రీ పల్లెంపాటి వెంకటేశ్వర్లు, కాకతీయ సిమెంట్స్ అధినేత


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: