11, అక్టోబర్ 2020, ఆదివారం

15-18-గీతా మకరందము

  పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - పరమాత్మ పురుషోత్తముడని యేల చెప్పబడెనో తెలియజేయుచున్నారు - 


యస్మాత్ క్షర మతీతోఽహం

అక్షరాదపి చోత్తమః | 

అతోఽస్మి లోకే వేదే చ 

ప్రథితః పురుషోత్తమః || 


తాత్పర్యము:- నేను క్షరస్వరూపునికంటె మించినవాడును, అక్షరస్వరూపుని (జీవుని) కంటె శ్రేష్ఠుడను అయియున్నందువలన ప్రపంచమునందును, వేదమునందును "పురుషోత్తముడ”ని ప్రసిద్ధికెక్కియున్నాను. 


వ్యాఖ్య:- క్షర, అక్షరపురుషులు ఇరువురికంటెను అతీతుడై యుండుటవలన పరమాత్మ పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కెను. జీవుడున్ను తన పురుషత్వము (జీవత్వము)తో తృప్తి పడక పురుషోత్తమత్వమునకై అనగా ఆత్మస్థితికై యత్నశీలుడు కావలెను. అపుడే యతడు కృతార్థుడగుచు భవబంధవిముక్తుడై సాక్షాత్ భగవానునివలె లోకమున కీర్తింపబడగలడు.

ప్రశ్న:- భగవానుడు పురుషోత్తముడని లోకమున ఏల ప్రసిద్ధికెక్కెను?

ఉత్తరము:- ఆతడు క్షర, అక్షరపురుషులిరువురికంటెను అతీతుడుగనుక.

కామెంట్‌లు లేవు: