11, అక్టోబర్ 2020, ఆదివారం

సార్ధకత*

 *సార్ధకత*  


ఒక పక్షి ఆహారం కోసం వెతుకుతుండగా దానికి ఒక మర్రి పండు కనిపించింది. మర్రిపండుని నోట కరుచుకుని ఎగురుతుండగా అది పక్షి నోటి నుండి జారి పడింది. మర్రి పండు పడిన ప్రదేశం ఒక గ్రామం ప్రక్కన ఉన్న మైదానం. మర్రిపండు మైదానంలో పడిన రోజునే బలమైన గాలులతో వర్షం కురిసింది. గాలులకు మట్టి రేగి మర్రిపండును కప్పేసింది. 

రెండు రోజుల తరువాత మర్రి పండు విచ్చుకుని అందులో ఉన్న గింజలు బయట పడ్డాయి. 

మర్రి గింజలు వాటిలో అవిమాట్లాడుకున్నాయి. ఒక గింజ సంతోషంగా “మన పక్షాన అదృష్టం ఉండబట్టే మనమింకా బ్రతికి ఉన్నాము. లేదంటే పక్షి కడుపులో పడి జీర్ణం అయ్యేవారము అంది.  

 మరో గింజ “నిజమే. 

పక్షి కడుపులోకి వెళ్ళి చనిపోయే వాళ్ళం. ఇలా మాట్లాడే అవకాశమే ఉండేది కాదు అని చెప్పింది. మిగతా గింజలు కూడా అవునవును అని సంబరపడ్డాయి.  

మరో రెండు రోజులు గడిచేసరికి ఒక గింజ నుండి మొలక వచ్చింది.  

 ఆ మొలకను చూసిన గింజ సంతోషంతో గెంతులు వేసి మీరంతా చూడండి. నాకు మొలక వచ్చింది అని చూపించింది.  

మొలకను చూసిన మిగతా గింజలు ఆ మొలకను లాగి పడెయ్యి. మొలకెత్తావంటే నీ రూపం మారిపోతుంది. భూమి మీద కొత్త రూపంతో పెరుగుతావు. ఎదిగే క్రమంలో ఎన్నో కష్టాలు పడాలి. కొన్నిసార్లు మనుషులు మొక్కల్ని పీకి పడేస్తారు. 

మరికొన్ని సార్లు పశువులు తొక్కి చంపుతాయి. లేదా నమిలి మింగుతాయి. ఇవన్నీ దాటుకుని మొక్కగా పెరిగాలి. ఒకవేళ ఎదిగావనుకో, కావలసినంత నీరు అందాలి. అలా నీరు దొరకకపోయినా ఎండిపోయి చస్తావు. అన్ని కష్టాలు పడలేవు కానీ మాలాగా గింజ రూపంలోనే ఉండిపో. మనమంతా హాయిగా కలసి గడుపుదాం అన్నాయి. 

 మిగతా గింజల మాటలు ఆలకించింది కానీ మొలక వచ్చిన గింజ జవాబు చెప్పలేదు. తన మొలకను వేరు చేయలేదు. కొన్ని రోజులకు మర్రి మొక్క భూమి మీదకు వచ్చి ఎదగడం ప్రారంభించింది. దాని కాండం నిటారుగా ఎదిగింది. కొమ్మలు ప్రక్కలకు పెరిగాయి. ఎన్నో ఆకులు మొలిచాయి. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి పెద్ద వృక్షంగా ఎదిగింది.  

ఎండ వేడి నుండి రక్షణ కోసం రైతులు, బాటసారులు మర్రిచెట్టు నీడలో విశ్రాంతి తీసుకునేవారు. పశువులు, జంతువులు రాత్రి వేళల్లో, వర్షం కురిసినప్పుడు చెట్టు క్రింద తల దాచుకునేవి. పక్షులు చెట్టు మీద గూళ్ళు కట్టుకున్నాయి. మర్రి చెట్టు నిత్యం ఎందరికో ఆశ్రయం ఇస్తుండడం వలన అక్కడ సందడిగా ఉండేది. 

అప్పుడప్పుడు వైద్యులు మర్రి చెట్టు దగ్గరకు వచ్చి  

మర్రి బెరడు, 

పాలు , 

ఆకులు, 

మొగ్గలు కోసుకుపోయే వారు. 

వాటిని వైద్యం కోసం ఉపయోగించేవారు.  

మైదానానికి ఆడుకోవడానికి వచ్చే పిల్లల్లో కొందరు మర్రి ఊడలతో ఊయల ఊగి ఆనందించేవారు. అవన్నీ చూసి మర్రిచెట్టు సంతోషించేది.  

అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి.   

ఒక రోజు భయంకరమైన తుపాను వచ్చింది. చాలా బలమైన గాలులు వీచాయి. ఏకధాటిగా వానలు కురిసాయి. తుపాను ధాటికి ఎన్నో వృక్షాలు నేలకొరిగాయి. అప్పుడే మర్రి వృక్షం కూడా నేలకు ఒరిగింది. మర్రి వృక్షం అలా ఒరిగిపోయినందుకు ప్రజలు ఎంతగానో బాధపడ్డారు. మర్రిచెట్టు కొమ్మల మీద నివసించే పక్షులు , 

జంతువులు మూగగా రోదించాయి.    

మరికొన్ని రోజులకు మర్రి చెట్టు పచ్చదనం తగ్గిపోగానే గ్రామస్తులు గొడ్డళ్లతో నరికి చెట్టు కొమ్మలను, కాండాన్ని వంట చెరుకుగా, గ్రుహోపకరణాలుగా వాడుకున్నారు. కలప మోసుకు వెళుతున్న వారు బ్రతికినప్పుడే కాకుండా చనిపోయాక కూడా ఉపయోగపడిందని చెప్పుకున్నారు.  

స్వార్ధంతో గింజలుగా భూమిలోనే ఉండిపోయిన మిగతా గింజలు తమ సోదరుడికి లభిస్తున్న ప్రశంసలు విని సంతోషించాయి. మరో వైపు సిగ్గుపడ్డాయి.

వాటిలో ఒక గింజ మనమంతా దిద్దుకోలేని పొరపాటు చేసాము. ఎలా పుట్టామో అలాగే మిగిలిపోయాము. ఎవరికీ "ఉపకారం" చేయలేకపోయాము. మనల్ని గుర్తుపెట్టుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేకపోయాము. పుట్టిన ప్రతి జన్మకూ సార్ధకత ఉండాలి. మన జన్మ మాత్రం వృధా అయింది. పక్షి నోటి నుండి జారిపడి నందుకు మనం గొప్ప "అవకాశం" పొందినప్పటికీ వృధా చేసుకున్నాము . మన సోదరుడు మాత్రం మంచి పని చేసాడు. మరణించి కూడా జనం గుండెల్లో, వారి ఇళ్లల్లో నివాసం ఏర్పరుచుకున్నాడు. జీవితమంటే మన సోదరుడిదే అంది. 

అది విన్న మరొక మర్రి గింజ కొందరు పిరికితనంతో బ్రతుకుతారు. ఇప్పుడు మనం చేసిన తప్పే చేస్తుంటారు. ఇతరులకు మేలు చేసే జీవితం వలన తృప్తి కలుగుతుందని తెలుసుకోలేక జీవితాన్ని వృధా చేసుకుంటారు. ప్రక్కవారికి చేసే సేవల వలన చిరస్థాయిగా పేరు నిలుస్తుందని తెలుసుకుని ఒకరికొకరు సాయపడుతూ బ్రతికితే ఎంతో బాగుంటుంది” అంది. 

జరిగిపోయిన దాన్ని వెనక్కు తీసుకురాలేము కాబట్టి ఇతరులకు సహాయపడినప్పుడే ఈ జన్మ కు సార్థకత...

కామెంట్‌లు లేవు: