12, నవంబర్ 2020, గురువారం

రామాయణమ్..119

 రామాయణమ్..119

.

విరాధుడి భయం నుండి ఇంకా తేరుకోని సీతమ్మను ఊరడిల్లచేసి ,తమ్ముడు లక్ష్మణునితో ఇది చాలా దుర్గమారణ్యములాగ ఉన్నది మనము వెంటనే విరాధుడు చెప్పినట్లుగా శరభంగ మహాముని ఆశ్రమమునకు వెళ్ళి ఆయనను మనకు వాసయోగ్యమైన ప్రదేశము గురించి అడిగి తెలుసుకొనవలె అని పలికి ముని ఆశ్రమము వైపుగా నడక సాగించారు.

.

ముందు లక్ష్మణుడు ,ఆవెనుక సీతమ్మ వారివురినీ అనుసరిస్తూ రామయ్య ప్రయాణం సాగించారు.

.

వారికి అల్లంత దూరంలో శరభంగుడి ఆశ్రమం కనపడుతూ ఉన్నది.మునితో ఎవరో దివ్యపురుషుడు మాట్లాడుతున్నట్లుగా కనపడ్డది. ఆ దివ్యపురుషుడి కాళ్ళు నేలకు ఆనటంలేదు.ఆయన ఎక్కివచ్చిన రధం దివ్యమైన ఆకుపచ్చ వెలుగులు విరజిమ్మే గుర్రాలతో పూన్చబడి ఉన్నది.

.

అక్కడ ఉన్న లక్షణాలను బట్టి చూడగా అది దేవేంద్రుడి రధమని వచ్చినవాడు మహేంద్రుడని రాముడికి అర్ధమయ్యింది.

.

సీతా లక్ష్మణులను ఆశ్రమసమీపంలో బయట ఉండమని చెప్పి తానొక్కడే మునిని దర్శించడానికి లోనికి వెళ్ళాడు.

రాముని రాక గమనించిన దేవేంద్రుడు శరభంగునితో నేను ఇప్పుడే ఈయనకు కనపడ రాదు ఈయన వల్ల ఒక మహా కార్యము జరుగవలసి ఉన్నది ఆ తరువాత మాత్రమే మాట్లాడగలను అని పలికి అంతర్ధానమైనాడు.

.

రాముడిని చూసిన మహర్షి, రామా ! నీ కోసమే వేచి ఉన్నానయా ! ఇంద్రుడు తనతో రమ్మనమని అన్నా రాముడిని కలిసిన తరువాతే వస్తాను అని చెప్పాను.

నిన్ను చూశాను నాకు చాలా సంతోషంగా ఉన్నది ,ఇక ఈ శరీరాన్ని వదలి స్వర్గానికి పయనమవుతాను అని పలికాడు.

.

అప్పుడు రాముడు మునితో ,స్వామీ! మాకు వాసయోగ్యమైన ఏదైనా ఒకస్థలాన్ని చూపించండి అని అడిగాడు.

.

అప్పుడు శరభంగుడు ,రామా! నీవు ఈ అరణ్యంలోనే నివసించే సుతీక్ష్ణుడు అనేముని వద్దకు వెళ్ళు ఆయనే నీకు అందమైన వనప్రదేశంలో వసతి ఏర్పాటు చేయగలడు అని పలికి హోమము చేసి అగ్నిలో ప్రవేశించాడు శరభంగుడు.

.

అగ్నికి ఆహుతి అయిపోయంది ఆయన శరీరం అప్పుడు ఆ కుండమునుండి ఆయన దివ్యశరీరము ఊర్ధ్వలోకాలవైపు సాగిపోయి బ్రహ్మలోకంలో ప్రవేశించింది.

.

ఆ ఆశ్రమ వాటికలో ఉన్న మునులంతా రాముని చుట్టూ చేరారు.

.

NB 

శరభంగుడితో ఇంద్రుడు ఒక విషయం చర్చించాడు.అది రాముని గురించిన రహస్యము .ముందు ముందు వస్తుంది.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: