12, నవంబర్ 2020, గురువారం

రామాయణమ్ 122

 రామాయణమ్ 122

.

జనకరాజపుత్రి ఏ విధంగా మాట్లాడాలో ఆ విధం గానే మాట్లాడావు నీవు.

కానీ సీతా! వనములలో కందమూల ఫలములు తింటూతపస్సు చేసుకొంటున్నమునులతో రాక్షసులు అకారణంగా  వైరం పెట్టుకొని వారి తపస్సు భగ్నం చేసి వారిని హింసించి చంపి తింటూ వుంటే నిస్సహాయులైన వారు నా వద్దకు వచ్చి మొర పెట్టుకున్నారు. 

.

శరణు కోరిన వారిని రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ నుండి దూరంగా ఎలా జరిగేది? నీవేకదా చెప్పావు నాకు "పీడితులైన వారి దీనాలాపములు వినబడకుండా ఉండటానికే క్షత్రియులు ధనుస్సు పట్టుకుంటారు" అని. 

.

సీతా ,వారు అడగక పోయినా దుఃఖితులైనవారిని పాలించటం నా కర్తవ్యం.పైగా ఇప్పుడు మాట కూడా ఇచ్చాను.

.

నా ప్రాణాన్ని,నిన్ను,లక్ష్మణున్నిఅయినా వదులుకుంటాను గానీ ఇచ్చిన మాట తప్పను. అని స్థిర చిత్తంతో పలికాడు రాముడు.

.

అలా పలికి ముందు నడిచాడు రామచంద్రుడు ఆయన వెనుక సీతమ్మ  ఆవిడను అనుసరిస్తూ లక్ష్మణుడు నడుస్తున్నారు.

.

మునులందరితో కలసి ఆశ్రమ సముదాయమునకు చేరుకొని అక్కడ కొంతకాలము వారితో కలిసి జీవించారు .

.

ఆ ఆశ్రమ వాటికలోనే సీతారామలక్ష్మణులు పదిసంవత్సరాల కాలం గడిపేశారు.

.

ఒకరోజు రాముడు సుతీక్ష్ణ మహాముని చెంత కూర్చొని ,స్వామీ ఈ ఆశ్రమానికి దగ్గరలోనే అగస్త్య మహాముని కూడా ఉన్నారని మునులంతా చెప్పుకుంటూ ఉంటే విన్నాను .నాకు ఆ మహర్షిని దర్శించాలనే కోరిక కలిగింది.

.

ఆయన ఆశ్రమానికి దారి చూపండి అని అడిగాడు.

.

రామా నేనే ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను నీవే స్వయంగా అడిగావు.

.

ఇక్కడనుండి నాలుగు యోజనాల దూరం వెళితే అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది. అని అక్కడికి ఎలా వెళ్ళాలో వివరంగా చెప్పాడు సుతీక్ష్ణ మహర్షి.

.

జానకిరామారావు వూటుకూరు

కామెంట్‌లు లేవు: