4, డిసెంబర్ 2020, శుక్రవారం

సౌందర్య లహరి శ్లోకము - 5

  *దశిక రాము**


సౌందర్య లహరి శ్లోకము - 5


( **శ్రీ శంకర భగవత్పాద విరచితము** )


( **శ్రీ లలితాంబికాయైనమః** )


**హరిస్త్వామారాధ్య**

**ప్రణతజనసౌభాగ్యజననీం**


**పురా నారీ భూత్వా**


**పురరిపుమపి క్షోభమనయత్।**


**స్మరోఽపి త్వాం నత్వా**


**రతినయనలేహ్యేన వపుషా**


**మునీనామప్యన్తః**


**ప్రభవతి హి మోహాయ మహతామ్ ॥ 5॥**


అమ్మా! భక్తజనకల్పవల్లివగు నిన్ను ఆరాధించి, హరి పూర్వం స్త్రీ గా మారి త్రిపురాసురసంహారి అగు పరమేశ్వరునే కలతనొందించినాడు. మన్మధుడునూ నీకు నమస్కరించి రతీదేవి కన్నులకుమాత్రము అగపడు శరీరముతో మునులను సైతము మహామోహావేశులుగా చేయుచున్నాడు. 


జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను సైతము కామముతో కలతనొందింపచేసిన శక్తిగలదిగా అమ్మవారు స్తుతించబడుతున్నది. మనకు ’కామమునకు వశమవడము’ అనేది కూడా అనుగ్రహమా ? అనే సందేహము కలుగవచ్చు.

భగవంతుడు మనపై కరుణకురిపించాలన్నా, మనము భగవంతుడికి శరణాగతి చేయాలన్నా, పుట్టుక, కష్టాలు అనేవి ఉండాలి. 


బాధలూ, కష్టాలూ లేనప్పుడు మనం భగవంతుని స్మరిస్తామా ? (స్మరించము కదా) కష్టాలు ఎలా కలుగుతాయి ? కామక్రోధాలు మనలను పట్టి పీడించినప్పుడు. ఆ యాతన అనుభవించునప్పుడు మనం భగవంతుడిని స్మరిస్తాము, ప్రార్థిస్తాము. ఇలాంటప్పుడు, కామక్రోధాలు, ఈ జగత్సృష్టి అన్నీ అనుగ్రహమే అని గుర్తిస్తాము.


మరో జన్మలేకుండా ఉండాలని బాధపడటం మంచిదే. కానీ ఇంకా అనుభవించవలసిన కర్మ గుట్టలు గుట్టలుగా మిగిలి ఉన్నవాళ్ళు జన్మ వద్దనవచ్చునా ? ఆ కర్మ అనుభవించటానికి జన్మనెత్తవలసిందే, ధార్మికజీవనం గడపవలసిందే. కామమే లేకపోతే మనుష్యులు పుట్టి తమ కర్మభారం తగ్గించుకోవడమెలా ? మరలా జన్మనెత్తి, కర్మలను నాశనంచేసుకోవడం అనే అవకాశాన్ని వినియోగించుకోకుండా మరింత పాపం మూటగట్టుకుంటే అది ఎవరి తప్పు ? పుట్టుక అనునది మరుజన్మ లేకుండా చేసుకోవటానికి ఒక అవకాశం. ఈ నిజాన్ని గుర్తెరిగి మనం ప్రవర్తించాలి.


మరి జ్ఞానస్వరూపమైన పరమేశ్వరుడనూ, ఇంద్రియాలను జయించిన ఋషులను కలతనొందించటం ఎందుకు ? దానికి మనం అమ్మవారిని ఎందుకు స్తుతిస్తున్నాము ? వారు కలతనొందటముతో కథముగియలేదు. వారు మరలా పరిశుద్ధులయ్యారు. వారు ఒకానొక సమయములో కామమునకు వశపడినారంటే అది జగత్కళ్యాణము కొరకు. ’హరి, హరుల పుత్రునితో మాత్రమే మరణము’ అనే వరమున్న రాక్షసుని చంపుటకు అయ్యప్ప అవతరించాడు. వ్యాసులవారు ఘృతాచికి ఆకర్షింపబడకపోతే నైష్టిక బ్రహ్మచారి అయిన శుకమహర్షి ఉండేవారుకాదు.


నాణెమునకు రెండు పార్శ్వాలు ఉంటాయి. ఋషులను సైతం కామమోహితులుగా చేయగల శక్తి మన్మథుడికి అమ్మవారు ఇవ్వటము, నాణెమునకు ఒకవైపు. కొంతమందివైపు మన్మథుడిని వెళ్ళకుండా చేయటం నాణెమునకు రెండవవైపు. మన్మథుడు అమ్మవారికి సేవకుడు. మనంతటమనం కామమును జయించలేము. అమ్మవారి ఆజ్ఞతోనే అది సాధ్యమవుతుంది. మన్మథుని మనకు దూరంగా ఆమె ఉంచగలదు. 


శంకరులు ఈ శ్లోకంలో అంతర్లీనంగా అమ్మవారి అనుగ్రహంతో మనం కామమును జయించగలమని ఉపదేశిస్తున్నారు.


🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

కామెంట్‌లు లేవు: