24, ఆగస్టు 2024, శనివారం

దేవాలయాలు - పూజలు 20*

 *దేవాలయాలు - పూజలు 20*




*అర్చకో హరిస్సాక్షాత్ చరరూపీ సనాతనః*, 

*రూప ద్వయం హర స్యోక్తం బింబమర్చక ఏవచ*.

అర్థం:- దేవాలయ అర్చకుడు సాక్షాత్ భగవత్ స్వరూపమే. భగవంతుడు తనకున్న రెండు భౌతిక స్వరూపాలలో ఒకటి *విగ్రహ* రూపం కాగా, రెండు *అర్చక* స్వరూపం.


దేవాలయాలలో పూజాదికాల నిర్వహణలో అర్చకుల ప్రాధాన్యత అత్యంత ప్రశస్తమైనది. మహిమాన్వితము, శక్తివంతము మరియు ప్రభావవంతమైన మూల విరాట్ ను స్పృశించి, అవసరమైన పూజాదికాలు కొనసాగించడానికి కాలాదులతో

 (వర్ష, శీతా, వేసవి) నిమిత్తం లేకుండా, ప్రాతః కాలంలోనే శిరః స్నానాదులు ముగించుకుని శుచి, శుభ్రత, మడి ( ఉతికి ఆరే‌సిన పంచె, ఉత్తరీయం)మరియు ఇతర శుద్ధాచారాలను పాటిస్తూ అర్చన, అభిషేకాలు, అష్టోత్తరాలు జరుపుతూ 

ఆ ప్రాతః పూజాదికాలు ముగిసేవరకు తప్పనిసరిగా నిరాహారంగా ఒక స్వీయ నియమంతో ఉంటారు. అర్చక స్వాములు బాహ్య శుద్ధి మాత్రమే గాకుండా అంతః శుద్ధి కూడా కల్గి ఉంటారు.

 *అపవిత్రః పవిత్రోవా సర్వాsవస్థాంగతోపివా*

*యఃస్మరేత్ పుండరీకాక్షం*

*స బాహ్యాంభ్యంతరః శుచిః* అని తనని తాను, తన పరిసరాల శుద్ధిని తప్పక చేసుకుంటాడు.


జప, స్తోత్ర, ప్రదక్షిణా, నమస్కార ఆచరణలతో పాటు వేద పఠనం, మంత్రానుష్టానము లాంటి బహు సంప్రదాయ సంస్కారాల విధి విధానాలు *సర్వం* నేర్చుకుని, ఎన్నో సంవత్సరాల కృషితో అర్చకత్వం సాధిస్తారు, పొందుతారు. అర్చకులందరు *ఆచార హీనో న పునంతి వేదా:* అను జ్ఞానము కల్గి ఉంటారు. అర్థం: ఆచారాలను పాటించని వారిని వేదాలు కూడా రక్షించలేవు. 


ఈ మధ్యన కొంత మంది సాధారణ జనాలు అర్చక స్వాముల గురించి తేలికగా వదురుతూ ఉంటారు. *ఆ ఏముంది ఉదయం నుండి ఒక నాలుగు గంటలు దేవాలయంలో సుఖంగా ఉండడమే గదా అని*. అంతేగాక ఈ మాత్రం దానికి బ్రాహ్మణేతరులెవరైనా గుడిలో పూజలు చేయవచ్చు గదా... బ్రాహ్మణులే చేయాలా...అనే వితండవాదాన్నీ, కులాలకు వర్ణాలకు మధ్య బేధాన్ని తెలియక తమ నోటికొచ్చినట్లు మాట్లాడి చదువుకున్న నాగరికులమనే పేరుతో తమకుతాము హేదువాదులమనే హేతువాద  

పంథాన్ని చాటుకుంటుంటారు.


కాని, ఏదైనా ఒక శాస్త్రంలో నైపుణ్యం పొందాలంటే, బాల్యం నుండే జీవిత పర్యంతం ఆ నైపుణ్యం కల్గి ఉండాలంటే ఆ శాస్త్రంలోని చాలా సునిశితమైన, లోతైన అంశాలను అవగాహన చేసుకుని, అధ్యయనం చేసి, *సాధన* చేసి ఆచరణలో పెడ్తేనే శాస్త్ర జ్ఞానము అబ్బుతుంది, పరిపుష్టి చేకూరుతుంది. 


అర్చక స్వాములు తమ జీవితాలను నిరంతర భగవత్ కార్యాలకు అంకితం చేసి, ఇటు భక్తులకు అటు భగవంతునికి అనుసంధాన కర్తలుగా ఉంటూ *తమ కంటూ ఏమి మిగిల్చుకోకపోయినా, ఏమి దాచుకోకపోయినా, జీవితాంతం "సర్వే జనాః సుఖినోభవంతు, లోకాః సమస్తాః సుఖినోభవంతు"* అని ఆశీర్వదిస్తూ పురానికి హితుడుగా ఉండే అర్చక స్వాములను సాక్షాత్ భగవత్ స్వరూపులుగా భావించి గౌరవించాల్సిన బాధ్యత , విధి... మిగతా జనులందరిదీనూ. 


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: