31, మార్చి 2023, శుక్రవారం

సూక్ష్మక్రిమి పరిజ్ఞానం -

 ఆయుర్వేదం నందు గల సూక్ష్మక్రిమి పరిజ్ఞానం - 


     ఇప్పటివరకు మనం అనుకుంటున్నట్టుగా సూక్ష్మక్రిములను కనుగొన్నది పాశ్చత్య శాస్త్రజ్ఞులు మాత్రం కాదు. వారికంటే కొన్ని వేల సంవత్సరాల మునుపే మన పూర్వీకులకు సూక్ష్మక్రిముల పైన మరియు అవి కలుగచేసే వ్యాధుల పైన సంపూర్ణ అవగాహన కలదు. ఈ విషయాల గురించి నేను తెలుసుకొవడానికి కొన్ని అత్యంత పురాతన ఆయుర్వేద గ్రంథాలు పరిశీలిస్తున్నప్పుడు వాటిలో కొన్ని చోట్ల ఈ సూక్ష్మక్రిమి సంబంధమైన అనేక విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. ఆ విలువైన సమాచారాన్ని మీకు కూడా తెలియచేయుటకు ఈ పోస్టు పెడుతున్నాను .


         సుశ్రుతునకు సూక్ష్మక్రిములుకు సంబంధించిన పరిజ్ఞానం అపారంగా ఉన్నది అని చెప్పవచ్చు. రోగానికి కారణం అయ్యే సూక్ష్మక్రిములను గురించిన జ్ఞానమునకు "భూతవిద్య " అని పేరుకలదు . అష్టాంగహృదయములో ఇది ఒక ప్రత్యేక భాగముగా పరిగణించబడినది. భూతవిద్యా లక్షణమును చెప్పునప్పుడు దేవాసుర , గంధర్వ , యక్ష , రక్ష , పితృ , పిశాచ , నాగ అనే భూత గ్రహాలుగా సూక్ష్మజీవులను వర్ణించాడు. కొన్ని మంత్రగ్రంధాలలో పైన చెప్పిన పేర్లు కలవారు వేరే లోకమునకు సంభంధించినవారుగా దుష్టశక్తులుగా వర్ణించి వారు మానవులను పట్టి పీడించువారుగా ఉన్నది. కాని సుశృతుడు దీనికి ఒప్పుకోడు వారు దేవాసుర , గంధర్వులు ద్యులోక వాసులు వారు భూలోకమునకు వచ్చి మనుష్యులతో కలిసి ఎన్నటికీ నివసించరు అని ఆయన అభిప్రాయం .


       సుశ్రుతుడు సూక్ష్మజీవుల గురించి వివరిస్తూ వాటిని గ్రహములగా పిలుస్తూ ఈ విధముగా చెప్పుచున్నాడు. కోట్లకొలది అసంఖ్యాకముగా ఉన్న ఈ గ్రహములు రక్తము , మాంసములను భుజించి వృద్ది అగుచుండెను . అవి మహాపరాక్రమము కలిగినవి. అయినను అవి సూర్యుని వెలుగుకు జడిసి రాత్రుల యందు సంచరించుచుండును . చీకటి , నీడగల తావుల యందు పగలంతా ఉండును. ఈ సూక్ష్మక్రిములు నేలమీదను , అంతరిక్షము నందు , అన్ని దిక్కుల లోను పాడిపడిన చీకటి గృహముల యందు నివాసము ఉండును. ఈ సూక్ష్మక్రిములు ఒకొక్క కాలము నందు విజృంభించి జనులను పీడించునని సుశృతుడు తెలియచేసెను .


         వ్రణసంబంధ ఇన్ఫెక్షన్స్ గురించి సుశృతుడు వివరించుతూ ఈ సూక్ష్మక్రిములకు మాంస , రక్తం ప్రియం అగుటచేత గాయములలోకి తరచుగా ప్రవేశించి సమస్యలను కలుగచేయునని తెలుపుతూ ఈ రోగకారణమగు సూక్ష్మక్రిములను మూడు ప్రధాన గణములుగా గుర్తించారు. 


            ఇప్పుడు సుశృతుడు రోగహేతుకారణాలైన సూక్ష్మజీవులను మూడు రకాలుగా వర్గీకరించారు. వాటి గురించి మీకు వివరిస్తాను. అవి 


 1 - పశుపతి అనుచరులు .


 2 - కుబేర అనుచరులు .


 3 - కుమార అనుచరులు .


 * పశుపతి అనుచరులు -


      మనస్సు , ఇంద్రియములను వికలమొనర్చి భ్రమ , ప్రలాప , ఉన్మాదములను కలిగించును. 


 * కుబేర అనుచరులు - 


       ఇవి యక్షరక్షో గణములకు చెందిన క్రిములు . శారీరక బాధలను మాత్రమే కలిగించును.


 * కుమార అనుచరులు -


       పసిపిల్లలను వశపరుచుకొని బాధించును . వీటినే బాలగ్రహములుగా పిలుస్తారు . 


         పైన చెప్పినవిధముగా సుశ్రుతుల వారు సూక్ష్మక్రిములను మూడు రకాలుగా వర్గీకరించారు . మలేరియా జ్వరమునకు రురుజ్వరం అని తక్ష్మ జ్వరం అనియు అధర్వణవేదములో వ్యవహరించబడినది. ఈ జ్వరమును కలిగించే సూక్ష్మక్రిములు ఉండు నివాసస్థలము గురించి చెప్పుతూ గుడ్లగూబ , గబ్బిలము , కుక్క , తోడేలు , డేగ , గద్ద ఈ జంతుపక్షి శరీరాల్లో మలేరియా క్రిములు ఎల్లప్పుడూ ఉండి వాటి మలముతో బయటకి వచ్చి జనులు తాగే నీటిలో కలిసి మనుష్యులకు సంక్రమించునని ఉన్నది.


           ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో కొన్నింటిలో ఈ విధముగా ఉన్నది. క్రిములు శరీరం నందు ప్రవేశించినంత మాత్రాన రోగము రాదు . శరీరము నందు ఓజస్సు మిక్కిలిగా అభివృద్ధిచెందిన ఊర్జశక్తి అన్ని రకముల క్రిములను జయించుచున్నది. ఇక్కడ మనశరీరములోని రోగనిరోధక శక్తి గురించి వివరణ ఇవ్వడం జరిగింది. శరీరానికి హితమైన ఆహారం సేవించకుండా విరుద్ద ఆహారాలను సేవించువారికి , ప్రకృతివిరుద్ధ నియమాలు పాటించువారికి క్రిములు బాధించును గాని అగ్నిదీప్తి చక్కగా ఉండి యవ్వనంలో ఉన్నవారికి , స్నిగ్ధ శరీరులకు , వ్యాయమం చేయుచుండువారికి , శరీరబలం అధికంగా ఉన్నవారికి క్రిములు ఏమి చేయలేవు .


               క్రీ . శ 18 వ శతాబ్దములో మైక్రోస్కోప్ యంత్రము కనిపెట్టబడిన పిమ్మట సూక్ష్మజీవులను కనుగొన్నారు అని మన పాఠ్యపుస్తకాలలో చదువుతున్నాం .కాని కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే మన మహర్షులు ఈ సూక్ష్మక్రిమి విజ్ఞానం సంపాదించారు. మన మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు వారు తమ మనోనేత్రముతో అన్నింటిని దర్శించగలరు మరియు కనుగొనగలరు. మైక్రోస్కోప్ గురించి దానికి పాశ్చాత్యులు కనుగొన్నారు అని గొప్పగా చెప్పుకుంటాం కాని అధర్వణవేదము నాలుగోవ కాండ ఇరవైవ సూక్తములో పిశాచక్షయ మంత్రములో మైక్రోస్కోప్ వంటి "బిబిర్హిని " అను ఒక దివ్య ఔషధి లభించినట్టు కశ్యప మహాముని ఈ ఔషదీ సహయముతో భూమి మరియు అంతరిక్షంలో వ్యాపించి ఉన్న సర్వరోగ క్రిములను చూడగలిగెను అని ఈ మంత్రం చెప్పుచున్నది. క్రీ .శ మూడొవ శతాబ్దములో బింబసారుని ఆస్థాన వైద్యుడు అయిన జీవకునికి ఇట్టి మహత్తర ఔషధి లభించెనని గ్రంధస్థం చేయబడి ఉన్నది. దీని సహాయముతో నేటి ఎక్సరే యంత్రము వలే శరీర అంతర్భాగము నందలి శరీరభాగాలను చూస్తూ పేగులలో చిక్కుకున్న రాళ్లను తీసివేశారు అని ఎన్నో పురాతన గ్రంథాలలో కలదు.


               సమాప్తం 


    

      

ఏది ఉచితంగా రాదు

ఏది ఉచితంగా రాదు  

మనం ఉంటున్న ప్రపంచం ఒక చిత్రమైనదిగా తోస్తుంది. బాహ్యంగా కనపడేది ఒకటి ఉంటే అంతరంగికంగా ఇంకొక విధంగా ఉంటుంది. కొన్ని సమయాలల్లో బాహ్యానికి అంతర్యానికి పూర్తిగా వ్యతిరేకంగా భిన్నంగా వుండే సంఘటనలు కూడా లేకపోలేదు. 

ఒక వ్యాపార ప్రకటన ఇట్లా ఉంటుంది మీరు రెండు కొంటె ఒకటి ఉచితం అని వ్రాసి ఉంటుంది. విషయం ఏమిటంటే రెండు కొంటె ఒకటి అనే పదాలను చిన్న అక్షరాలలో పేర్కొని ఉచితం అనే పదాన్ని మాత్రం పెద్దగా వ్రాస్తారు. తీరా నీవు అక్కడికి వెళ్లి చుస్తే ఆ స్టాకు పూర్తిగా పాతది పారేయటానికి మాత్రమే పనికి వచ్చేదిగా వుండి వుంటుంది. చౌకగా వస్తుంది అని నీవు వస్తువు సామర్ధ్యాన్ని గణనలోకి తీసుకోకుండా నీకు సదరు వస్తువు అవసరమా కాదా అనేది కూడా ఆలోచించకుండా తీసుకొని వస్తావు చివరకు నీ భార్య ఆగ్రహానికి లోనౌతావు. తరువాత వాటిని తీసుకొని వాపసు ఇవ్వటానికి దుకాణానికి వెళితే సారీ సారూ క్లీరెన్సు సేలు వాపసు తీసుకోము అని చెప్పి పంపిస్తాడు. దీనిని బట్టి మనకు తెలిసేది ఏమిటంటే నిజానికి షాపువాడు ఒక్కటి కూడా నీకు ఉచితంగా ఇవ్వలేదు. ఒక తక్కువ నాణ్యత కలిగిన వస్తువును అమ్ముకోవటానికి వేసిన పధకం అని తరువాత మనకు తెలుస్తుంది. కాబట్టి ఏదయినా వస్తువు కొనేటప్పుడు దాని ధర చౌకగా వున్నదని వైపోచించకుండా దాని నాణ్యత అది ఎంతవరకు మనకు ఉపయోగకరం అనే విషయాలను కూడా అలోచించి కొనటం చాలా అవసరం. ఈ రోజుల్లో ప్రలోభాలకు గురిచేసే వ్యాపార ప్రకటనలు అనేకం మనం చూస్తున్నాము వాటి ప్రభావానికి లోనయి నష్టపోయిన సందర్భాలు ప్రతి మనిషికి అనుభవమే.

మనషులలోని మానసిక బలహీనతలను ముఖ్యంగా మధ్యతరగతి మనుషులను గురిచేసి వ్యాపారవేత్తలు ఇలాంటి ప్రలోభాలకు గురిచేస్తుంటారు.మధ్యతరగతి వారికి ఎన్నిసార్లు మోసపోయిన మరల మరల తెలియకుండా మోసపోతూనే వుంటారు. 

బజారులో చిన్న చిన్న సంచులలో కేవలం బత్తాయి పండ్ల బైటి వైపు మాత్రమే కనిపించే విధంగా ఉంచి అమ్ముతారు.  వాటిని చూసి ఆ పండ్లు మంచివని అనుకోని మనం కొనుక్కొని వస్తాము. ఆ సంచి చించి చుస్తే అన్ని పండ్లు క్రుళ్ళి పోయి ఉంటాయి. మన కళ్ళను మైమరిపింపచేసి చెడిపోయిన వస్తువులను అమ్మటం వాళ్ళు మోసం అనుకోవటం లేదు అది వారి చాకచక్యం అని తలుస్తూ విశేష లాభాలను గణిస్తున్నారు. 

మార్కెట్లో కూరగాయలు కొనటానికి వెళితే అక్కడ ఒక్కడు మిగిలినవారి కన్నా తక్కువ ధరకు అమ్ముతుంటారు. కూరలు చుస్తే తాజాగా కనిపిస్తాయి వాటిని చూసి నీవు తక్కువ ధరకు లభిస్తున్నాయని అక్కడ కొంటావు.  తీరా ఇంటికి వస్తే నీ భార్య ఏమండీ వంకాయలు కిలో తెచ్చారా అరకిలో తెచ్చారా అంటే కాయలు తాజాగా ఉన్నాయని కిలో తెచ్చాని నీవు బదులు ఇస్తావు.  మిమ్మల్ని కూరగాయలవాడు మోసం చేసాడు నిజానికి ఇవి కిలో లేవు అని ఆమె చెపితే ప్రక్కనే వున్న కిరాణాషాపుకు వెళ్లి తూకంవేయిస్తే 600-700 గ్రాములు మాత్రమే ఉంటాయి. అప్పుడు నీకు కళ్ళు తెరుచుకుంటాయి ఆ వ్యాపారి తక్కువ ధరకు ఎందుకు అమ్మాడో అని. 

వ్యాపారవేత్తలు వారి వారి లాభాలకొరకు ప్రజలను మోసం చేయటం పరిపాటే కానీ ఇతరులు అలా కారు అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. ప్రస్తుతం రాజకీయ నాయకులు కూడా మనకు ఉచితాలను చూపెట్టి తమ పబ్బం కడుపుకుంటున్నారు. ఒక సమర్ధమైన ప్రభుత్వం ప్రజలలో ఎలాంటి విభేదాలను చూడకుండా లేక చూపకుండా అందరిని తన కన్నా పిల్లలవలె పరిపాలించాలి అని కదా రాజనీతి తెలుపుతుంది. మరి ఆలా జరుగుతున్నదా అంటే లేదు అని ప్రతి మనిషికి తెలుసు పూర్తిగా స్వార్ధపూర్తితంగా, వోటురాజకీయంగా రాజకీయ నాయకులు తమ తమ స్థానాలను గెలవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల సంక్షేమం కన్నా స్వా సంక్షేమానికే వారు విలువని ఇస్తున్నారు. ఉచితంగా ఇవ్వాలి అంటే యెంత దానం ప్రభుత్వానికి కావలి అని మనం ఆలోచించకుండా ఉచిత పథకాలకు అలవాటు పది ఓటువేసి పన్నుల ఊబిలో కూరుకొని పోతున్నాము.  రాత్రి 8 గంటల సమయంలో ప్రతి కూడలిలో పోలీసువారు వాహనాలను అపి జరిమానాలు విధించటం మనమెరుగుదము. అవి ఉచిత పథకాల ప్రభావమే కావచ్చు.

కొందరు అనవచ్చు తల్లిదండ్రుల ప్రేమలో స్వార్ధం ఉండదు అది కేవలం ఉచితంగా లభిస్తుంది  అని. అట్లా అనుకుంటే పొరపాటే అవుతుంది  అదెట్లో పరిశీలిద్దాం. బాల్యంలో తల్లిదండ్రులు పిల్లలను ఏంతో ప్రేమగా చూసుకొని వేలు, లక్షలు ఖర్చు పెట్టి విద్యావంతులను చేస్తారు.  అదంతా ఉచ్చితమే అని పిల్లలు అనుకోవచ్చు కానీ నిజనికి తల్లిదండ్రులు వృద్దులు అయినప్పుడు వారిని ప్రేమతో చూసుకొని వారసంతోషానికి పాత్రులు కావలి. ఎంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులను ప్రేమతో చూసుకుంటున్నారన్నది మనం రోజు చూస్తున్నాము. ఎప్పుడో శతక కారుడు చెప్పాడు 

తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు 
పుట్ట నేమి వాడు గిట్టనేమి
పుట్టలోని జెదలు పుట్టవా? గిట్టవా?
విశ్వదాభిరామ వినురవేమా!

 చిన్నతనంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమకు పర్యవసానంగా వాళ్ళు వృద్దులు అయినప్పుడు పిల్లలు వారి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవటం కనీస బాధ్యత.  ఈ బాధ్యతను ప్రతివారు విస్మరించకుండా ఉండాలి. 

కొందరు తల్లిదండ్రులు బాల్యంలో వారి పిల్లలపట్ల ప్రేమాభిమానాలు సరిగా చూపకపోవటంతో వారు పెద్దవారైనాతరువాత పిల్లల్నుండి ప్రేమను పొందలేక బాధపడితే ప్రయోజనం ఉండదు. కాబట్టి తల్లి దండ్రులు ఎల్లప్పుడూ బిడ్డలను కంటికి రెప్పగా చూసుకోవాలి అప్పుడు మాత్రమే వారి పిల్లల ప్రేమను పొందటానికి అర్హులు అవుతారు. 

నిజానికి భూమి మీద మనకు గాలి నీరు కూడా ఉచితంగా లభించదు అది ఎట్లాగో చూద్దాం. పరిసరాలలో వున్న గాలిని మనం మన శక్తిని వుపయోగించి మాత్రమే పొందుతాము. ఊపిరితిత్తులు వాటి శక్తిని వాడకపోతే గాలి శరీరానికి వెళ్ళదు.  శక్తి కావాలంటే ఆహరం తీసుకోవాలి ఆహరం సంపాయిస్తేనే వస్తుంది అది మనకు తెలుసు.  ఇక నీటి విషయానికి వస్తే నీరు భావిలోనో లేక నదిలోనో వున్నాయనుకోండి అప్పుడు కూడా మీరు మీ శక్తిని ఉపయోగించి మాత్రమే నీటిని పొందగలరు. ఈ రోజుల్లో మనం త్రాగే నీటిని కొనుక్కొని త్రాగుతున్నామన్నది సర్వులెఱింగినదే. 

ఈ ప్రపంచంలో ఏది కూడా ఉచితంగా లభించదు మనం ఒకటి పొందాలంటే ఒకటి కోల్పవాలి అన్నది అనాదిగా వస్తున్న నానుడి. ఇది ముమ్మాటికీ నిజం. ఆహరం ఎక్కడ ఉచితంగా లభిస్తుంది అంటే ఎలుకల బోనులో అని ఒకడు అన్నదాత దాని అర్ధం బోనులోకి ఎలుకలను రప్పించటానికి ఆహారాన్ని ఉంచారన్నది విషయం.  కాబట్టి ఏదయినా ఉచితంగా వస్తున్నది అంటే నిజానికి అది ఉచితం కాదు దాని వెనుక నీకు తెలియని ఒక విషయం దాగి వున్నది అని తెలుసుకోవాలి.. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ భార్గవ శర్మ