5, జూన్ 2026, శుక్రవారం

పంచాంగము


 

శనివారం,జూన్.6,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,జూన్.6,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం

తిథి:షష్ఠి రా10.02 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:ధనిష్ఠ తె3.58 వరకు 

యోగం:ఐంద్రం ఉ7.26 వరకు

కరణం:గరజి ఉ9.43 వరకు తదుపరి వణిజ రా10.02 వరకు

వర్జ్యం:ఉ6.56 - 8.37

దుర్ముహూర్తము:ఉ5.28 - 7.12

అమృతకాలం:సా5.02 - 6.43

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:వృషభం చంద్రరాశి:మకరం   

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.28

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః ।

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి ।। 36 ।।



ప్రతిపదార్థ:



 అపి — అయినా సరే; చేత్ — ఒకవేళ; అసి — నీవు; పాపేభ్యః — పాపాత్ములు; సర్వేభ్యః — అందరిలో; పాప-కృత్-తమః — పరమ పాపిష్టి; సర్వం — అందరిలో; జ్ఞాన-ప్లవేన — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానమనే పడవతో; ఏవ — ఖచ్చితంగా; వృజినం — పాపము; సంతరిష్యసి — నీవు దాటిపోగలవు.



 తాత్పర్యము : 



పాపాత్ములందరి కంటే పరమ పాపిష్ఠి వారు అని పరిగణించబడిన వారు కూడా ఈ ప్రాపంచిక భవసాగరాన్ని ఆధ్యాత్మిక దివ్య జ్ఞానమనే పడవలో స్థితులై ఉండి దాటిపోవచ్చు.



వివరణ:


భౌతిక ప్రాపంచిక జగత్తు ఒక మహా సాగరం వంటిది, దీనిలో జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే అలలు మనలను అటూ ఇటూ త్రోసి వేస్తుంటాయి. భౌతిక శక్తి, అందరినీ మూడు రకాల క్లేశములకు (కష్టాలకు) గురి చేస్తుంది: ఆదిఆత్మిక: తన స్వంత శరీరం, మనస్సు పెట్టే బాధలు; ఆదిభౌతిక – ఇతర ప్రాణుల నుండి కలిగే బాధలు; ఆదిదైవిక – వాతావరణ మరియు పర్యావరణ సంబధిత పరిస్థితుల బాధలు. ఈ యొక్క భౌతిక బద్ద స్థితిలో, జీవాత్మకి ఎలాంటి ఉపశమనం ఉండదు, మరియు ఈ బాధలు భరిస్తూ అనంత జన్మలు గడిచిపోయినవి. మైదానంలో ఒక ఫుట్-బాల్ అటూ ఇటూ తన్నబడినట్టుగా, ఆత్మ, తన యొక్క పుణ్య, పాప కర్మానుసారం, స్వర్గాది లోకాలకు పంపబడుతుంది, నరకాది లోకాలలో వదిలివేయబడుతుంది, మరియు తిరిగి భూలోకంలోకి తీసుకు రాబడుతుంది.


ఆధ్యాత్మిక దివ్య జ్ఞానం ఈ భౌతిక భవ సాగరాన్ని దాటటానికి ఒక పడవని ఇస్తుంది. అవివేకులు కర్మలు చేసి వాటి బంధములలో చిక్కుకుంటారు. అవే కర్మలను భగవత్ యజ్ఞముగా చేయటం ద్వారా జ్ఞానులు ముక్తి సాధిస్తారు. ఈ విధంగా, జ్ఞానం అనేది భౌతిక బంధాలను త్రుంచివేయటానికి సహకరిస్తుంది. కఠోపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహవాన్ నరః

సోఽధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదం (1.3.9)


‘భవ సాగరాన్ని దాటటానికి మరియు భగవత్ ధామాన్ని చేరుకోవటానికి, నీ బుద్ధిని దివ్య జ్ఞానంతో ప్రకాశింపచేయుము; అప్పుడు ఆ ప్రకాశిత బుద్ధితో, చంచలమైన మనస్సుని నియంత్రించుము.’

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 02*


*గళగ్రాహీ పౌరందరపురవనీపల్లవరుచాం*

*ధృతప్రాథమ్యానామరుణమహసామాదిమగురుః॥*

*సమింధే బంధూకస్తబకసహయుధ్వా దిశి దిశి*

*ప్రసర్పన్కామాక్ష్యాశ్చరణకిరణానామరుణిమా॥*


*భావము :*


*అమ్మా! నీ పాదములనుండి వెలువడే ఎర్రని కాంతి సమూహము, దేవేంద్రుని ఉద్యానవనములోని కల్పవృక్షముయొక్క లేత ఆకుల వర్ణమును, అప్పుడే ఉదయిస్తున్న భానుని ఎరుపు కాంతిని, మంకెన పుష్పముల రక్తవర్ణమును త్రోసిరాజని అత్యంత ప్రకాశవంతముగా ఉన్నది.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

05-06-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


సన్నిహితులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవచింతన పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి.  

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. 

---------------------------------------


మిధునం


చేపట్టిన పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలించవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.

---------------------------------------


కర్కాటకం


సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారమున మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. 

---------------------------------------


సింహం


దూరప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఇంటాబయటా కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. ధన పరంగా చికాకులు తప్పవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. మిత్రులతో దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారతారు. నూతన వాహన యోగం ఉన్నది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


తుల


దీర్ఘకాలిక ఋణబాధలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.  

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులు మందగిస్తాయి. కొన్ని వ్యవహారాలు శ్రమతో గాని పూర్తి కావు. దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు తప్పవు. వ్యాపారాలు కొంత నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు.

---------------------------------------


ధనస్సు


వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

---------------------------------------


మకరం


సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్త్రుతమవుతాయి. గృహ నిర్మాణ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


కుంభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులను అధిగమిస్తారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులలో శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు మరింత చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

ఆనంద నిలయం....

 ఆనంద నిలయం.... 


కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న గర్భాలయాన్ని, దానిపై ఉన్న బంగారు శిఖరాన్ని "ఆనంద నిలయం" అని పిలుస్తారు. భక్తులు ఇక్కడికి రాగానే తమ కష్టాలన్నింటినీ మరచిపోయి పరమానందాన్ని పొందుతారు కాబట్టే దీనికి ఆ పేరు వచ్చింది.


ఈ దివ్యమైన ఆనంద నిలయ విమాన గోపురానికి సంబంధించిన కొన్ని అత్యంత విశేషమైన విషయాలు మీకోసం:


1. విమాన వేంకటేశ్వరుడు

ఆనంద నిలయం గోపురంపై రెండవ అంతస్తులో, ఉత్తర వాయవ్య దిశగా కొలువై ఉన్న స్వామివారి రూపమే "విమాన వేంకటేశ్వరుడు". గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలం లభిస్తుందో, ఈ విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా అంతే ఫలితం దక్కుతుందని భక్తుల నమ్మకం. 16వ శతాబ్దంలో శ్రీవ్యాసతీర్థులు ఈ మూర్తిని ఆరాధించి మోక్షం పొందారని ప్రతీతి.


2. ఏక బేర ఆలయం

ఆగమ శాస్త్రం ప్రకారం.. ప్రధాన గర్భాలయంలో మరే ఇతర దేవతా మూర్తులు లేకుండా, కేవలం ఒకే ఒక ప్రధాన దైవం (ధృవ బేరం) మాత్రమే ఉండే ఆలయాన్ని "ఏక బేర ఆలయం" అంటారు. శ్రీవారి ఆలయం ఈ కోవకే చెందుతుంది.


3. నిర్మాణ శైలి - కొలతలు:


మూడంతస్తుల కట్టడం: ఆనంద నిలయం పూర్తిగా మూడు అంతస్తులుగా నిర్మితమైంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటే, మూడవ అంతస్తు మాత్రం వర్తులాకారంలో (గుండ్రంగా) ఉంటుంది.


సుదర్శన చక్ర ఆకృతి: 

ఈ గోపురాన్ని పై నుంచి వీక్షిస్తే అది సుదర్శన చక్రం ఆకారంలో కనిపించడం ఒక గొప్ప శిల్పకళా రహస్యం.


కొలతలు: 

ఏకశిలా పునాదిపై నిర్మించిన ఈ గోపురం ఎత్తు 37 అడుగుల 8 అంగుళాలు. నేలపై నుంచి పైనున్న బంగారు కలశం వరకు మొత్తం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు.


శిల్పాలు: 

ఈ గోపురంపై సుమారు 64 హైందవ దేవతా మూర్తుల (హయగ్రీవుడు, యోగనరసింహుడు, లక్ష్మీదేవి మొదలైనవి) శిల్పాలు చెక్కబడి ఉన్నాయి.


4. సువర్ణ తాపడం (బంగారు పూత) చరిత్ర

ఆనంద నిలయానికి బంగారు పూత పూయించిన చరిత్ర వెనుక ఎందరో రాజుల భక్తి ప్రపత్తులు ఉన్నాయి:

తొలిసారి: యాదవ రాజైన వీరనరసింగ దేవ యాదవరాయలు తన తులాభార బంగారంతో 13వ శతాబ్దంలో మొదటిసారి ఈ గోపురానికి బంగారు పూత పూయించారు. పాండ్య రాజు జటావర్మన్ సుందరపాండ్యన్ దీనిపై బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు.

చారిత్రక ప్రముఖులు: ఆ తర్వాత సాళువ మంగిదేవుడు (1359), విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు, మరియు చంద్రగిరి రాజులు కూడా భారీగా బంగారాన్ని సమర్పించి దీనిని పునరుద్ధరించారు.


ఆధునిక కాలంలో: 1950లలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాత గోపురాన్ని సిమెంట్లు, ఆధునిక సాంకేతికతతో పటిష్ఠం చేసి, సుమారు 12 వేల తులాల బంగారంతో సరికొత్తగా ముస్తాబు చేసింది. 1964లో దీనికి 'అష్టబంధన మహాసంప్రోక్షణ' నిర్వహించారు.

ఒక ముఖ్యం విశేషం: స్వామివారికి సమర్పించే ఏ పూజా ద్రవ్యమైనా, తోమాల సేవకు వాడే పుష్పాలైనా, అభిషేకానికి తెచ్చే ఆకాశగంగ తీర్థమైనా సరే... ముందుగా ఆనంద నిలయం చుట్టూ విమాన ప్రదక్షిణం చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళ్తారు.


కలికాలంలో త్రికరణ శుద్ధిగా (మనస్సు, వాక్కు, కర్మ) భగవంతుడిని స్మరిస్తూ, జీవాత్మ పరమాత్మలో లీనమయ్యేలా చేసే అద్భుత ఆధ్యాత్మిక శక్తి కేంద్రం మన ఆనంద నిలయం.

చివరికి చివరికి

 🌀 *చివరికి మనిద్దరమే* ... *మిగులుతాం* ! 🌀


💖💖💖💖💖💖💖💖💖💖💖💖


 *జీవితం మొదలయ్యే రోజుల్లో మన చుట్టూ ఎంతమంది ఉంటారో* …

ఇల్లు నవ్వులతో, మాటలతో, సందడితో నిండిపోతుంది.


పిల్లల అల్లరులు…

బంధువుల రాకపోకలు…

స్నేహితుల సరదాలు…

పండుగల హడావిడి…

మన జీవితాన్ని రంగులతో నింపేస్తాయి.


కానీ… కాలం తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుంది.


👧 కూతుళ్లు...

పెళ్లి అయి మహాలక్ష్మిలా తమ కొత్త ఇంటికి వెళ్లిపోతారు.


👦 కొడుకులు...

చదువులు, ఉద్యోగాలు, బాధ్యతలు, పిల్లల భవిష్యత్తు అంటూ తమ జీవితాల్లో నిమగ్నమైపోతారు.


👥 బంధువులు, స్నేహితులు...

ఎవరి జీవితం వారిది అవుతుంది.

ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి…

కలుసుకునే సందర్భాలు అరుదవుతాయి…


🏠 ఒకప్పుడు సందడిగా ఉన్న ఆ పెద్ద ఇల్లు…

నెమ్మదిగా నిశ్శబ్దంతో నిండిపోతుంది.


అప్పుడు…


💝 ఒకరి అడుగుల శబ్దానికి మరొకరు ఎదురుచూస్తూ…

💝 ఒకరి దగ్గుకు మరొకరు కలవరపడుతూ…

💝 ఒకరి మందులు మరొకరు గుర్తు చేస్తూ…

💝 ఒకరి ఒంటరితనానికి మరొకరు తోడుగా నిలుస్తూ…


🫶 చివరికి మనిద్దరమే మిగులుతాం!

━━━━━━━━━━━

⏳ కాలం మిగిల్చే నిజాలు — ఇప్పుడే జీవిద్దాం!

🧠 1. మాట్లాడుకోవాల్సింది ఇప్పుడే మాట్లాడుకుందాం

మనసులో మాటలు దాచు కుంటూ కాలం గడిపేయొద్దు.

రేపు…

👂 చెవులు బలహీనపడవచ్చు

🧓 జ్ఞాపకాలు మసకబారవచ్చు

⏳ చెప్పాలనుకున్న మాటలు చెప్పకుండానే మిగిలిపోవచ్చు

కాబట్టి…ఈరోజే మనసు విప్పి మాట్లాడుకుందాం.నవ్వుకుందాం

గతాన్ని గుర్తుచేసుకుందాం మన ప్రేమను మాటల్లో పెట్టుకుందాం.

━━━━━━━━━━━

🫀 2. ఒకరికొకరం ఆసరాగా నిలుద్దాంఇప్పుడున్న బలం

ఇప్పుడున్న ఆరోగ్యం…

ఇప్పుడున్న సమయం…

ఇవి శాశ్వతం కావు.

🚶‍♂️ చేతిలో బలం ఉన్నప్పుడే కలిసి నడుద్దాం.

🌳 పార్కుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుందాం.☕ ఒకే కప్పు టీని పంచుకుందాం.

ఎందుకంటే…

రేపు:👓 ఒకరి కళ్లజోడు వెతికేది మరొకరే

🦯 ఒకరి చేతికర్ర అందించేది మరొకరే

━━━━━━━━━━━🌲3. కోపాలను ఇక్కడే వదిలేద్దాంజీవితం చాలా చిన్నది…అహంకారాలతో…

మాటల యుద్ధాలతో మౌనాలతో

మన మధ్య దూరాలు పెంచుకోవద్దు.

💞 నేను కోపంగా ఉంటే నువ్వు నన్ను శాంతింపజేయి

💞 నువ్వు అలిగితే నేను నిన్ను నవ్విస్తానుఎందుకంటే…

చివరికి:

క్షమించుకోవడానికి కూడా మనిద్దరమే ఉంటాం.

━━━━━━━━━━━

🏵️ 4. ప్రేమను ఇప్పుడే చూపిద్దాం

వయసు పెరుగుతుంది జుట్టు నెరుస్తుంది ముఖంపై ముడతలు పడతాయి…

కానీ…

నిజమైన ప్రేమ మాత్రం ఎప్పటికీ ముసలితనాన్ని అంగీకరించదు.

🤝 వణికే ఆ చేతులనుపట్టుకుని

🫂 “నేనున్నాను” అని చెప్పే ధైర్యం

💓 చివరి వరకు నిలిచే ఆప్యాయత అదే అసలైన దాంపత్యం.

━━━━━━━━━━━

💫 5. సేవ చేయగలిగే ప్రేమే గొప్పది

ప్రేమ అంటే కేవలం:

🌹 పూలు ఇవ్వడం కాదు

💌 మాటలు చెప్పడం కాదు

ప్రేమ అంటే…

🧴 తలకు నూనె రాయడం

💊 మందులు సమయానికి ఇవ్వడం

🛏️ జబ్బు పడితే మంచం పక్కన కూర్చోవడం

🦶 కాళ్లకు నొప్పి ఉంటే మర్దన చేయడంవృద్ధాప్యంలో సేవగా మారే ప్రేమే నిజమైన ప్రేమ.

━━━━━━━━━━━

💞 6. గుండె చప్పుడు వినే తోడుగాప్రతి ఉదయం…

☀️ కళ్లు తెరిచిన వెంటనే

“నువ్వు బాగున్నావా?”అని అడిగే మనిషి ఉండటంఅదృష్టం.

🤲 నుదుటిపై చేయి వేసి జ్వరం చూసేది

💓 గుండె చప్పుడు విని భయపడేది

😢 మన కన్నీళ్లను చూసి తట్టు కోలేనిదిజీవిత భాగస్వామి మాత్రమే.

━━━━━━━━━━━

☕ 7. సాయంత్రం ఏకాంతంలో నిజమైన బంధం కనిపిస్తుంది

పిల్లలందరూ తమ జీవితాల్లో బిజీ అయిపోయాక…

🏠 ఆ నిశ్శబ్దమైన ఇంట్లో

📸 పాత ఫోటో ఆల్బమ్‌లు చూస్తూ

😂 చిన్న చిన్న జ్ఞాపకాలు గుర్తుచేసుకుని నవ్వుకుంటూ

☕ఒకే కప్పు కాఫీని పంచుకుంటూగడిపే ఆ క్షణాలే జీవితంలో నిజమైన సంపద.

━━━━━━━━━━━

💔 8. ఆఖరి క్షణంలో కూడా తోడు నిలిచేది మనిద్దరమే

జీవిత ప్రయాణం ఎప్పటికైనా ముగుస్తుంది ఇద్దరిలో ఒకరు ముందుగా వెళ్లాల్సిన రోజు వస్తుంది.

ఆ రోజు…

😢 కన్నీళ్లు తుడుస్తూ

🤝 వణుకుతున్న చేతిని పట్టుకుని

💔 గుండె నొప్పిని దాచుకుంటూ

“ధైర్యంగా ఉండు.నేను వస్తున్నాను”అని చెప్పే మనిషి…

జీవిత భాగస్వామి మాత్రమే.

━━━━━━━━━━━

✨ జీవిత సత్యం

💰 సంపాదించిన డబ్బు…

🏠 కట్టిన ఇల్లు…

🚗 కొన్న కార్లు…

👨‍👩‍👧 పిల్లలు…

ఇవన్నీ జీవితంలో ఒక భాగమే.

కానీ…

🫶 చివరి శ్వాస వరకు

మన నవ్వులను, బాధలను, ఒంటరితనాన్ని పంచుకునే మనిషి…

“జీవిత భాగస్వామి” మాత్రమే.

━━━━━━━━━━━

💡 ఒక చిన్న విజ్ఞప్తి

❤️ మీ జీవిత భాగస్వామిని గౌరవించండి

❤️ ప్రేమను మాటల్లో చెప్పండి

❤️ సమయం కేటాయించండి

❤️ చిన్న చిన్న జ్ఞాపకాలను సృష్టించుకోండిఎందుకంటే…


⏳ కాలం వెనక్కి తిరిగి రాదు


🌷 🌷

కొడుకులు

 కొడుకులు స్వభావాన్ని బట్టి కాకుండా

పుట్టుకను బట్టి 12 (ద్వాదశ పుత్రులు) విధాలు.


1. ఔరసుడు - తనభార్య యందు తనకు పుట్టినవాడు.

2. క్షేత్రజుడు - పెద్దల అనుజ్ఞచేత భర్త అన్న, తమ్ముడు మొదలైన

                      వారికి పుట్టినవాడు (దీన్నే దేవరన్యాయము వలన అని కూడ అనవచ్చు.)

3. దత్తుడు - దత్తత తీసుకోబడినవాడు.

4. కృత్రిముడు - అభిమానించి పెంచుకోబడినవాడు

5. గూఢోత్పన్నుడు - తనకు తెలియకుండా ఱంకు మగనికి పుట్టినవాడు

6. అపవిద్ధుడు - తండ్రిచేతగాని తల్లిచేతగాని విడువబడగా, తెచ్చి పెంచుకోబడినవాడు.

7. కానీనుడు - తన భార్య యందు కన్యాత్వదశలో రహస్యముగా ఇతరునికి పుట్టినవాడు.

8. సహోఢజుడు - గర్భిణిగా ఉండగా, తెలిసిగాని తెలియకగాని

                              వివాహము చేసికొన్న భార్యకు పుట్టినవాడు.

9. క్రీతుడు - తల్లిదండ్రులకు ధనాన్నిచ్చి కొనుక్కోబడినవాడు

10. పౌనర్భవుడు - మారుమనువు చేసికొన్న స్త్రీకి పుట్టినవాడు

11. జ్ఞాతిరేతుడు - దాయాది కొడుకు (కొందరు పుత్రిక పుత్రుడు అని అంటారు.)

12. స్వయందత్తుడు - తల్లిదండ్రులు లేక గాని వారిచేత అకారణంగా విడువబడిగాని ,

                                   తనంతట తాను నీకు పుత్రుడనౌతానని వచ్చిన కొడుకు.


కొడుకులు ఇన్నిరకాలుగా ఉన్నారు.

వీరికి ఇతిహాసంలోగాని చరిత్రలోగాని

ఉదాహరణలు గుర్తించండి.



సేకరణ

దైవీసంపద

  1. భయం లేకపోవడం.

2. సత్వగుణం కలిగి ఉండటం, మనస్సు నిర్మలంగా ఉంచుకోవడం.

3. జ్ఞానమును సంపాదించడం.

4. విద్యాదానము, జ్ఞానదానము, భూదానము, అన్నదానము మొదలగు దానములు శక్తికొద్దీ చేయడం.

5. ఇంద్రియనిగ్రహము.

6. జ్ఞాన యజ్ఞము చేయడం.

7. పురాణములు శాస్త్రములు చదవడం.

8. ప్రతిపనీ ఒక తపస్సులాగా చేయడం.

9. మంచి ప్రవర్తన.

10. అహింస వ్రతమును పాటించడం. అహింసా పరమోధర్మః.

11. సత్యము పలకడం. సత్యమేవ జయతే.

12. కోపము విడిచిపెట్టడం.

13. దుర్గుణములను త్యాగము చేయడం.

14. ప్రశాంతంగా ఉండటం.

15. ఇతరులను విమర్శించకుండా ఉండటం.

16. భూతదయ కలిగిఉండటం.

17. ఇంద్రియలోలత్వము స్త్రీలోలత్వము లేకుండా ఉండటం.

18. మృదువుగా మాట్లాడటం.

19. చెడ్డ పనులు చేసినపుడు సిగ్గుపడటం.

20. చిత్తచాంచల్యము వదిలిపెట్టడం.

21. ముఖంలో మనస్సులో తేజస్సు కలిగి ఉండటం.

22. ఓర్పుకలిగి ఉండటం.

23. అన్ని వేళలలో ధైర్యంగా ఉండటం.

24. శరీరము మనస్సు శుచిగా ఉంచుకోవడం.

25. ద్రోహబుద్ధి లేకుండా ఉండటం.

26. స్వాభిమానము వదిలిపెట్టడం.


ఈ గుణములను దైవీసంపదగా పరిగణించారు

ధైర్యము

 “ధృతి” అంటే ధైర్యము. ఏ విషయమైనా మధ్యలో వదలకుండా, చివర వరకు సాధించాలనే పట్టుదల కలిగి ఉండటం, ఆత్మజ్ఞానము కలిగిన వాడు దేనికీ భయపడడు. మనకు అత్యంత భయంకరమైన సంఘటన చావు, రోగము, ముసలితనము. ఆత్మజ్ఞానము కలవాడు వీటికి దేనికీ భయపడడు. అవి కూడా అత్యంత సహజమైనవి అనుకుంటాడు. “విధి నా మొహాన అలా రాసాడు. నేనేం చేయలేను. నాకేమీ చేతకాదు” అనే నిరుత్సాహంతో ఉండకూడదు. ప్రతి దానినీ దైవం మీదికీ, విధి మీదికీ నెట్టకూడదు. మన కర్తవ్యం మనం ధర్మంగా నిర్వర్తిద్దాము, లాభనష్టాలను, సుఖదుఃఖాలను ధైర్యంతో సమానంగా చూడగలగడం అలవాటు చేసుకుందాము అనే భావనతో ఉండాలి. అందుకే ధృతి కూడా దైవీసంపద. ఈ ధృతికి ఉదాహరణలే భగీరథ ప్రయత్నంతో జరిగిన గంగావతరణం, అత్యంత పట్టుదలతో జరిగిన క్షీరసాగర మధనం, హాలాహలం పుట్టినా మానకుండా అమృతం వచ్చేదాకా సముద్రాన్ని మధించారు దేవదానవులు. ఇవి ధృతికి నిదర్శనాలు.

మానవ స్వభావము

 #దుర్యోధనుడు నిజంగా రాజ్యం కోసం ఆశపడ్డాడా? లేక అతని అసలు సమస్య వేరేనా?


"ఉన్నదానితో సంతోషపడటం కంటే, పక్కవాడికి కూడా అదే కష్టం ఉందని తెలుసుకోవడం వల్ల కొన్నిసార్లు మనిషి ఎక్కువ సంతోషపడతాడు."


నిన్న రాత్రి మా అపార్ట్మెంట్‌లో కరెంట్ పోయింది. కొద్దిసేపటి తర్వాత మా ఆవిడ బయటికి వెళ్లి వచ్చి, "మన ఫ్లాట్‌లో మాత్రమే కాదు, మొత్తం అపార్ట్మెంట్‌కే కరెంట్ లేదు" అంది.


ఆ మాట విన్న వెంటనే నాకు ఒక విచిత్రమైన భావన కలిగింది. కరెంట్ రాలేదు. చీకటి అలాగే ఉంది. ఫ్యాన్ తిరగడం లేదు. సమస్య యథాతథంగా ఉంది. కానీ మనసులో మాత్రం కొంత ఉపశమనం వచ్చింది.


ఎందుకు?


మనిషి తన పరిస్థితిని ఒంటరిగా అంచనా వేయడు. ఇతరులతో పోల్చుకుని అంచనా వేస్తాడు. నా దగ్గర ఎంత ఉంది అనే ప్రశ్న కంటే, ఇతరుల దగ్గర ఎంత ఉంది అనే ప్రశ్న చాలాసార్లు మన ఆనందాన్ని, బాధను నిర్ణయిస్తుంది.


మహాభారతంలోని దుర్యోధనుడి కథ చదివినప్పుడు నాకు ఇదే విషయం గుర్తుకు వచ్చింది.


చాలామంది దుర్యోధనుడిని రాజ్యాశతో కాలిపోయిన వ్యక్తిగా చూస్తారు. కానీ మహాభారతాన్ని లోతుగా చదివితే, అతని అసలు సమస్య రాజ్యం లేకపోవడం కాదు. అతనికి రాజ్యం ఉంది. అధికారం ఉంది. సంపద ఉంది. సైన్యం ఉంది. గౌరవం ఉంది. ఒక రాజకుమారుడికి ఉండాల్సినవన్నీ ఉన్నాయి.


అయినా అతను అసంతృప్తిగా ఉన్నాడు.


ఎందుకంటే అతను తన జీవితాన్ని చూసి సంతోషపడలేదు. పాండవుల జీవితాన్ని చూసి బాధపడ్డాడు.


ఇంద్రప్రస్థం వైభవాన్ని చూసిన తర్వాత అతని మనసులో అసూయ మొదలైంది. పాండవుల సభ, వారి సంపద, వారి ప్రజాదరణ, రాజుల గౌరవం చూసి అతను కలత చెందాడు. అతను బాధపడింది తన దగ్గర లేనిదాని కోసం కాదు; పాండవుల దగ్గర ఉన్నదాని కోసం.


ఇది దుర్యోధనుడి సమస్య మాత్రమే కాదు. ఇది మానవ స్వభావం.


ఈరోజు ఒక ఉద్యోగి తన జీతంతో సంతోషంగా ఉంటాడు. కానీ తన సహోద్యోగికి ప్రమోషన్ వచ్చిన క్షణం నుంచి అసంతృప్తి మొదలవుతుంది.


ఒక రైతు తన పంటతో ఆనందంగా ఉంటాడు. కానీ పక్క రైతు ఎక్కువ దిగుబడి సాధిస్తే తన పంట చిన్నదిగా కనిపిస్తుంది.


ఒక విద్యార్థి మంచి మార్కులు సాధిస్తాడు. కానీ తన స్నేహితుడు ఇంకాస్త ఎక్కువ మార్కులు సాధిస్తే తన విజయం విలువ కోల్పోయినట్లు అనిపిస్తుంది.


మన జీవితంలో చాలా బాధలకు కారణం కొరత కాదు. పోలిక.


దుర్యోధనుడి విషాదం కూడా అదే. అతను పాండవులను ఓడించాలని అనుకోలేదు. మొదట్లో వారిలా కావాలని అనుకున్నాడు. ఆ కోరిక నెరవేరకపోవడంతో అసూయగా మారింది. అసూయ ద్వేషంగా మారింది. ద్వేషం యుద్ధంగా మారింది.


అయితే దుర్యోధనుడిని పూర్తిగా దుష్టుడిగా చిత్రీకరించడం కూడా సరైనది కాదు. అతనిలో ధైర్యం ఉంది. స్నేహం ఉంది. కర్ణుడిపై అపారమైన విశ్వాసం ఉంది. తన నమ్మకాల కోసం చివరి వరకు నిలబడే గుణం ఉంది. అందుకే మహాభారతం గొప్పది. అక్కడ ఎవరూ పూర్తిగా మంచివారు కాదు, పూర్తిగా చెడ్డవారు కాదు.


నా దృష్టిలో దుర్యోధనుడు ఓడిపోయింది కురుక్షేత్రంలో కాదు.


అతను ఓడిపోయింది ఇంద్రప్రస్థ సభలో.


అక్కడ పాండవుల వైభవం చూసిన క్షణంలో అతని మనసులో పుట్టిన అసూయను జయించలేకపోయాడు. ఆ రోజు అతను తన మనశ్శాంతిని కోల్పోయాడు. యుద్ధం తర్వాత కేవలం తన ప్రాణాన్ని మాత్రమే కోల్పోయాడు.


అందుకే దుర్యోధనుడి కథను నేను ఒక రాజ్యం కోసం జరిగిన పోరాటంగా చూడను. అది ఒక మనిషి తన మనసుతో చేసిన పోరాటంగా చూస్తాను.


ఎందుకంటే బయట శత్రువులను జయించడం చాలా సులభం.


మనలోని అసూయను జయించడం చాలా కష్టం.


బహుశా మహాభారతం మనకు చెప్పదలచుకున్న గొప్ప పాఠం కూడా ఇదే కావచ్చు.


మన దగ్గర ఉన్నదాన్ని చూసి ఆనందపడే వరకు మనం స్వతంత్రులం. ఇతరుల దగ్గర ఉన్నదాన్ని చూసి మన ఆనందాన్ని కొలవడం మొదలుపెట్టిన క్షణం నుంచి మనం బానిసలమవుతాం.

🙏🙏🙏