14, నవంబర్ 2023, మంగళవారం

https://www.youtube.com/live/i46mSZ9gYjc?si=uYLmT3FPu4S7Sp0D 

పతంజలి కృత శంభు నటన స్తోత్ర విశిష్టత*

 *పతంజలి కృత శంభు నటన స్తోత్ర విశిష్టత*


ఒకసారి పతంజలి మహర్షి మహాశివ దర్శనానికి అనుమతి కోరగా, నందీశ్వరుడు అనుమతించక పోవడంతో పాటు పతంజలి మహర్షి సర్పాకారాన్ని చూసి హేళనచేసి నీకు నాకున్నట్లు కాళ్ళు, కొమ్మలు లేవని నవ్వాడట. అందుకు పతంజలి మహర్షి ఆగ్రహించి, ద్వారం వెలుపలి నుండే శంభు నటన స్తోత్రాన్ని చరణ శృంగ రహితంగా ఆశువుగా చెప్పాడట. ఆ స్తోత్రానికి పరవశుడై పరమశివుడు ప్రత్యక్షమైనాడట. 


ఈ స్తోత్రము యొక్క గొప్పదనమేమో చూద్దాము. దేవనాగరి లిపిలో आ, का అన్న అక్షరాలలో ा ఈ సంకేతములను చరణములు(కాళ్ళు) అంటారు. అదేవిధముగా ओ, औ లలో ोौ పైన వంపుతో ఉన్న గీతలను శృంగములు (కొమ్ములు ) అంటారు. నిజముగా ఈ కవనము చిత్ర కవిత్వపు కోవకు చెందినది. ఆకార, ఏకార, ఐకార, ఓకార, ఔకారములతో ఉండే దీర్ఘాక్షరములు లేవు. అనుస్వారము, విసర్గము, సంయుక్తాక్షరములు, మాత్రమే ఇందులో గురువులను కలిగిస్తాయి. ఇకార, ఈకార, ఉకార, ఊకారములు అంగీకృతములు. రండి మనమూ ఈ స్తోత్రాన్ని విని తరిద్దాము.


******************************

*పతంజలి కృత శంభు నటన స్తోత్రం*


సదంచిత ముదంచిత నికుంచిత పదం

ఝలఝలం చలిత మంజు కటకం

పదంజలి దృగంజన మనంజన

మచంచల పదం జనన భంజనకరం


కదంబ రుచిం మంబరవసం పరమ

మంబుద కదంబక విడంబక గళం

చిదంబుధి మణిం బుధ హృదంభుజ 

రవిం పర చిదంబర నటం హృది భజే


హరం త్రిపుర భంజన మనంత కృత

కంకణ మహంత దయ మంత రహితం

విరించి సురవంహతి పురంధర విచింతిత 

పదం తరుణ చంద్ర మకుటం పరం 

పద విఖండిత యమం భసిత 

మండిత తనుం మదన వంచన పరం 

చిరంతన మముం ప్రణవ సంచిత నిధిం 

పర చిదంబర నటం హృది భజే


అనంత మఖిలం జగద భంగ గుణ తుంగ

మమతం ధృత విధుం సుర చరీత్

తరంగ నికురుంబ ధృతి లంపట 

జటం శమనదం పశుహరం భవహరం

శివం దశ దిగంతర విజృంభిత కరం 

కరలసం మృగశశిం పశుపతిం

హరం శశి ధనంజయ పతంగ అయనసం

పర చిదంబర నటం హృది భజే


పరం సురవరం పురహరం పశుపతిం 

జనిత దంతిముఖ షణ్ముఖ మముం

మృదం కనక పింగళ జటం శనక పంకజ రవిం సుమనసిం హిమ రుచిం

అళంగ మనసం జలధి జన్మ గరళం 

కబలయంత మధుకరం గుణనిధిం

సనంద వరదం శమిత మిందు వదనం 

పర చిదంబర నటం హృది భజే


ఇతి స్తవం మముం భుజగ పుంగవ కృతం 

ప్రతి దినం పఠతి యః కృత ముఖా

సదః ప్రభు పద ద్వితియ దర్శన పదం

సులలితం చరణ శృంగ రహితం

సః ప్రభవ సంభవ హరిత్పతి హరి

ప్రముఖ దివ్య నుత శంకర పదం

సగచ్ఛతి పరం నతుజను ర్జలనిధిం

పరమ దుఃఖ జనకం దురితదం


                        - పతంజలి మహర్షి

              గానం - సిక్కిల్ గురుచరణ్

అదృష్టవంతుడు

 *60 దాటిన అదృష్టవంతులు వీరే. జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్‌లో, డాక్టర్ వాడా 60 ఏళ్లు పైబడిన వారిని 'వృద్ధులు' అని కాకుండా 'అదృష్టవంతులు' అని పిలువడాన్ని సమర్థించారు.*


*డాక్టర్ వాడా 60 ఏళ్ల వారికి సలహా ఇచ్చారు...*

*"అదృష్టవంతుడు" అవ్వడం యొక్క రహస్యం"34 వాక్యాలలో" ఇలా వివరించబడింది:*


*1. కదులుతూ ఉండండి.*

*2. మీరు చిరాకుగా అనిపించినప్పుడు, లోతైన శ్వాస తీసుకోండి.*

*3. వ్యాయామం చేయండి, తద్వారా శరీరం దృఢంగా అనిపించదు.*

*4. వేసవిలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఎక్కువ నీరు త్రాగాలి.*

*5. మీరు నమలడం వల్ల మీ శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి.*

*6. జ్ఞాపకశక్తి తగ్గుతుంది వయసు వల్ల కాదు, ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల.*

*7. ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు.*

*8. ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు.* 

*9. మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి.*

*10. ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా నడవండి.*

*11. మీకు కావలసినది తినండి, కానీ నియంత్రణలో ఉంచండి.*

*12. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.*

*13. మీకు నచ్చని వ్యక్తులతో అదే విధంగా ప్రవర్తించవద్దు.* 

*14. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి.* 

*15. వ్యాధితో చివరి వరకు పోరాడడం కంటే దానితో జీవించడం మంచిది.*

*16. కష్ట సమయాల్లో, ఇది ముందుకు సాగడానికి సహాయపడుతుంది.*

*17. ప్రతిసారీ, ఆహారం తిన్న తర్వాత, తప్పనిసరిగా కొన్ని గోరువెచ్చని నీరు త్రాగాలి.*

*18. మీరు నిద్రపోలేనప్పుడు, మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి.*

*19. సంతోషకరమైన పనులు చేయడం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య.* 

*20. మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి.*

*21. మీకు సమీపంలో ఉన్న "ఫ్యామిలీ డాక్టర్"ని త్వరగా కనుగొనండి.*

*22. ఓపికగా ఉండండి, కానీ అతిగా ఉండకండి, లేదా మిమ్మల్ని మీరు ఎల్లవేళలా చక్కగా ఉండేలా బలవంతం చేయండి.*

*23. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పాత అంటారు.*

*24. అత్యాశతో ఉండకు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా మంచిది మరియు సరిపోతుంది.* 

*25. మీరు మంచం మీద నుండి లేవవలసి వచ్చినప్పుడు, వెంటనే లేచి నిలబడకండి, 2-3 నిమిషాలు వేచి ఉండండి.*

*26. మరింత సమస్యాత్మకమైన విషయాలు, మరింత ఆసక్తికరంగా ఉంటాయి.* 

*27. స్నానం చేసిన తర్వాత, బట్టలు ధరించేటప్పుడు గోడ నుండి మద్దతు తీసుకోండి.*

*28. మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైనది మాత్రమే చేయండి.*

*29. ఈరోజు ప్రశాంతంగా జీవించండి.*

*30. కోరికలే దీర్ఘాయువుకు మూలం!*

*31. ఆశావాదిగా జీవించండి.*

*32. సంతోషకరమైన వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు.*

*33. జీవితం మరియు జీవిత నియమాలు మీ స్వంత చేతుల్లో ఉన్నాయి.*

*34. ఈ వయస్సులో ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించండి!*


*60 ఏళ్లు దాటిన మిత్రులందరికీ అంకితం...*


*_💐 నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి  🙂🙏_*

శివస్తుతి

 *పవిత్ర కార్తీక మాసం సందర్భంగా...*

*రోజూ శివస్తుతి*

*శ్రీ శివ మహాపురాణం నుంచి......*.


********

నమో నిష్కల రూపాయ

నమో నిష్కల తేజసే

నమస్సకల నాథాయ

నమ: ప్రణవ లింగినే

నమ: స్సృష్ట్యాది కర్త్రేచ

నమ: పంచముఖాయతే

పంచ బ్రహ్మ స్వరూపాయ

పంచకృత్యాయతే  నమ:

ఆత్మనే బ్రహ్మణే తుభ్యం

అనంత గుణశక్తియే

సకలాకల రూపాయ

శంభవే గురవే నమ:

ఇతి స్తుత్వా గురంపద్యై

బ్రహ్మ విష్ణుశ్చనేమతు

   ***

*శంకరా!*

 నిరాకారుడవైన నీకు నమస్కారం.

తేజోరూపుడవైన నీకు నమస్కారం.

సాకారుడవైన నీకు నమస్కారం.

ఓంకార వాచ్యుడవైన నీకు నమస్కారం,

ఓంకారం నీకు చిహ్నం.

సృష్ట్యాది పంచకృత్యములను ఆచరించు ఐదు ముఖములు గల (ఈశానుడు, తత్పురుషుడు,అఘోరుడు, వామదేవుడు, సద్యోజాతుడు అనే పంచముఖాలు)గల నీకు నమస్కారం.

పంచకృత్యములను చేయు పంచబ్రహ్మ స్వరూపుడవైన నీకు నమస్కారం.

ఆత్మస్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు, అనంత కళ్యాణగుణ శక్తియుతుడవైన నీకు నమస్కారం.

సాకార , నిరాకార రూపుడైన శివగురువునకు నమస్కారం. అంటూ పై  విధంగా బ్రహ్మ– విష్ణువులు ఇరువురూ గురువైన శంకరుని స్తుతించారు.


*****

*నమశ్శివాభ్యాం నవయవ్వనాభ్యాం*

*పరస్పరాశ్లిష్ట వపుర్థరాభ్యాం*

*నగేంద్ర కన్యాం వృషకేతనాభ్యాం*

*నమో నమశ్శంకర పార్వతీభ్యాం*

*నమో నమశ్శంకర పార్వతీభ్యాం*

*****

భక్తి - దైవ సాన్నిధ్య మార్గం

 🌸అమృతం గమయ - భక్తి యోగం🌸


భక్తి - దైవ సాన్నిధ్య మార్గం


అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ ।

నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ।। 


భగవద్గీత 12వ అధ్యాయం 13వ శ్లోకం


సంతుష్టః సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః ।

మయ్యర్పితమనోబుద్ధిర్యో మద్భక్తః స మే ప్రియః ।। 


భగవద్గీత 12వ అధ్యాయం 14వ శ్లోకం


ఏ భక్తులైతే, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావన లేకుండా, మైత్రితో/స్నేహపూరితముగా, మరియు కారుణ్యముతో ఉంటారో, వారు నాకు చాలా ప్రియమైన వారు. వారు ఆస్తి/ధనముపై మమకార/ఆసక్తి రహితముగా ఉంటారు మరియు అహంకారము లేకుండా, సుఖ-దుఃఖముల రెండింటి యందు ఒకే విధంగా ఉంటారు మరియు సర్వదా క్షమించే మనస్సుతో ఉంటారు. వారు ఎల్లప్పుడూ తృప్తితో, భక్తితో నాతోనే ఏకమై, ఆత్మ-నిగ్రహంతో, దృఢ-సంకల్పంతో, మరియు మనోబుద్ధులను నాకే అర్పించి ఉంటారు.


మానవ జన్మ పరమ లక్ష్యమైన మోక్ష సాధనకు తొలి మెట్టు భక్తి. దైవము పట్ల భక్తిని కలిగి నిష్కామ కర్మలను ఆచరిస్తూ జీవించడం దైవాన్ని సాధించడానికి అత్యంత విశేష మార్గం. కఠిన సాధకులు, మహర్షులు, యోగులు మరియు మునులు తమ తమ కఠిన సాధనా విధానాల్లో పరమపదం సాధిస్తే, సామాన్య మనుజులు తమ తమ నిత్య కర్మలని నిష్కామ భావంతో ఆచరించే సామర్థ్యాన్ని కలిగించేది భక్తి యోగం. అట్టి విశేష భక్తి తో పరమపదాన్ని చేరవచ్చు.


శ్రవణం కీర్తనమ్ విష్ణోః 

స్మరణం పాదసేవనం, 

అర్చనం వందనం దాస్యం, 

సఖ్యం ఆత్మ నివేదనమ్ 


శ్రవణం - భగవానుడి గూర్చిన గాథలు, భజనలు, కీర్తనలు వినుట.  


కీర్తనమ్ - భగవంతుడి గుణగణాలను కీర్తించుట.


స్మరణం - అనునిత్యం భగవన్నామాన్ని స్మరించడం.


పాదసేవనం - భగవానుడి చరణాలను సేవించడం. 


అర్చనం - భగవానుని సద్గుణ సంపన్నుడిగా విధిగా అర్చించడం. 


వందనం - త్రికాలాల్లో మనస్ఫూర్తిగా ప్రణామములను అర్పించడం.


దాస్యం - భగవంతుడికి ఎల్లప్పుడూ దాసులవటము.


సఖ్యం - భగవంతుడితో స్నేహభావం కలిగి ఉండటం.


ఆత్మనివేదనం -  తనని తాను భగవంతునికి సంపూర్ణంగా సమర్పించుకోవడం. 


ఇవి నవవిధ భక్తి మార్గాలని మనకి తెలియజేయబడ్డాయి. ఈ తొమ్మిది భక్తి మార్గాలలో ఏ ఒక్క మార్గాన్ని ఆచరించినా పరమ పదాన్ని చేరుస్తుంది.


అటువంటి భక్తిని కలిగి ఉండి పరిపుష్టిని సాధించటానికి ప్రధానమైనటువంటి మార్గము సజ్జన సాంగత్యం. భక్తికి సత్సాంగత్యం తోడైతే అది విశేష ఫలితాలు ఇస్తుంది. మానవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ ఆలోచనను సన్మార్గంలో నడిపించేది సజ్జన సాంగత్యం. ధ్యానం, ప్రార్థన మరియు సత్సంగ సభలు మొదలైనవి సామూహికంగా చెయ్యడంలో ప్రధాన ఉద్దేశం అదే. మానవుడి ఆలోచనా పరిధి అతి విస్తృతమైంది. మనసు ఏకాగ్రతతో ధ్యానం చేయడానికి అనేక అవరోధాలు వస్తాయి. ప్రవర్తనలో మరియు ఆలోచన సరళిలో మార్పులు వస్తాయి. లౌకిక మరియు ప్రాపంచిక విషయాలు ప్రభావం చూపుతూ ఉంటాయి. వీటిని అధిగమించి భగవంతుడి సాన్నిధ్యంలో గడపడానికి ముఖ్యమైన సాధనం  మంచివారిని కలవడం వారి మాటలు వినడం. దీనివల్ల సత్కర్మాచరణ అలవడుతుంది.

రోజుకు కొంత సమయం సత్సాంగత్యంలో గడపడం వల్ల క్రమక్రమంగా మనసు పరిశుద్ధమవుతుంది. ఒకరికొకరి దివ్య అనుభవం, జ్ఞాన జిజ్ఞాస ఇతరులకు చేరతాయి. దీనివల్ల ఇతరమైన ప్రాపంచిక ఆలోచనలు దూరంగా ఉంటాయి. నిజజీవితంలో ఏదైనా కర్మ చేసేటప్పుడు అందరికీ మంచి చేస్తుందా అనే ప్రశ్న వేసుకోవడం, ఆ కర్మను ఫలాపేక్ష లేకుండా భగవదర్పితం చేయడం వల్ల భక్తి దృఢమయ్యి మోక్షమార్గం సులువవుతుంది.


కుటుంబాన్ని పోషించడానికి సామాన్య జీవితం చాలుననే దృక్పథంతో కైవల్య పదం చేరడాన్ని నిర్ణయించుకున్న పోతన మరియు త్యాగరాజు లాంటివారు ఆచరణీయులు. తప్ప, ప్రాపంచిక నిత్య నైమిత్తిక వ్యవహారాల్లో మునిగితేలుతూ అనేకంతో మమేకమై ఉంటే క్రమేపీ దర్పంతో కూడిన జీవనం అలవడి సన్మార్గం, భగవచ్ఛింతనలు దూరమవుతాయి. అందుకే పేద ధనిక కులమత ప్రసక్తి లేకుండా సజ్జనులతోడి సాంగత్యం మన అంతరంగ శత్రువులైన అరిషడ్వర్గాదులను అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే  శత్రువులను అణచివేసి మనసుని నిర్మలం చేస్తుంది. నిర్మలమైన మనసు భక్తి బాటలో పయనిస్తుంది. సజ్జనులతోడి సాంగత్యం మనలోని లోపాలను గుర్తించేందుకు దోహదపడుతుంది. ఆత్మప్రక్షాళనకు దారిచూపిస్తుంది. భక్తి, జ్ఞాన, వైరాగ్యాల్లో ఇతరుల అనుభవాలు మనల్ని సన్మార్గం వైపు నడిపిస్తాయి. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని తగ్గిస్తాయి. సజ్జన సాంగత్యంలో ఉండే విశేషం ఇదే.


ఇతరుల బాధలను పంచుకోవడం, అనాథలకు ఆర్తుడవై ఉండటం, వృద్ధులకు చేయూత ఇవ్వడం, కర్మలను నిష్కామంగా భగవద్దత్తం చేయడం తద్వారా భగవద్భక్తి పరిపుష్టమవడం ఇవన్నీ పరమపదానికి సోపానాలు.


శుభం

శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత శివానందలహరీ

 శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత

                       శివానందలహరీ


                             01

కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం నిజతపః

ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే

శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున

ర్భవాభ్యా మానందస్ఫురదనుభవాభ్యాం నతి రియమ్                            

                                                              


సీ. శ్రీకరాన్విత లసత్ చిత్ సర్వ కళలతో

                విభవోన్నతంబుగా వెలుగు వారు

     శిఖలోన విధురేఖ చెలువమై  ధరియించి

                యత్యంత శోభతో నమరు వారు

     ఒండొరుల్ తపముచే నొనగూరు చుండియు

                నిజ తపః ఫలమున నెగడు వారు

     సకల జీవాళికి న్నకలంక  శుభమిచ్చు 

               మంగళాకృతులందు  మనెడు వారు 

     ధ్యాన హృత్  కుహరాన తాముండి సతతంబు

               ప్రకటిత రూపాన పరగు వారు

     విమలమౌ నానంద విస్ఫురణంబున

               స్వస్వరూపపు బోధ సల్పు వారు

తే. శ్రీయుమామహేశ్వరుల నాచిత్త మందు

     ధ్యాన మొనరించి యత్యంత తన్మయమున

     భవములను బాపి శాశ్వత శివములీయ

     ప్రణతులర్పించు చుంటిని భక్తి తోడ            01*


                            02

గళంతీ శంభో ! త్వచ్చరిత సరితః కిల్బిషరజో

దళంతీ ధీకుల్యా సరణిషు పతంతీ విజయతామ్

దిశంతీ సంసారభ్రమణ పరితాపోప శమనం

వసంతీ మచ్చేతో హ్రదభువి శివానందలహారీ. 



సీ. శంకరా ! భవదీయ సౌందర్య చరితమ్ము

          దేవనదీ భాతి దివిని సాగె ,

    దుస్సహ కిల్బిష ధూళి నణచి బుద్ధి 

        యను పెనుకాల్వగా నవని సాగె

    జనన మరణ చక్ర  సంసృతి భ్రమణాన

           సాగి హృత్ పరితాప శాంతి నిచ్చె

    మామక మనసను మడుగులో జేరి తా

            నవ్యయానంద భాగ్యమ్ము పంచె

తే. సర్వ జనులకు నధ్యాత్మ సంప దిచ్చి

     విభవ మొప్పంగ జగమునన్ వెల్గు చున్న

     సుందరంబైన శ్రీ "శివానందలహరి"

     యనుభవింతురు గాకిల నఖిల జనులు     02


గోపాలుని మధుసూదన రావు శర్మ 🙏

*14-11-2023* *భౌమ వాసరః {మంగళవారం}* *రాశి ఫలితాలు

 *14-11-2023*

*భౌమ వాసరః {మంగళవారం}*

 *రాశి ఫలితాలు*

*మేషం*

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులు శ్రమ వృధాగా మిగులుతుంది. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు. 

*వృషభం*

చిన్ననాటి మిత్రులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్థిరస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

*మిధునం*

ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో రుణ సమస్యలు నుండి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

*కర్కాటకం*

వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. 

*సింహం*

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపు తప్పవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వలన తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

*కన్య*

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులకు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. చాలకాలంగా వేదిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు.

*తుల*

నేత్ర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. గృహమున కొందరి ప్రవర్తన మానసిక అశాంతి కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగ విషయాల్లో అధికారూలతో జాగ్రత్తగా వ్యవహారించాలి. 

*వృశ్చికం*

ఆదాయ మార్గలు సంతృప్తి కలిగిస్తాయి. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థవంతంగా నిర్వహిస్తారు. 

*ధనస్సు*

సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

*మకరం*

ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలు పుంజుకుని మరింత ముందుకు సాగుతాయి. ధన వ్యవహారాలు ఆశజానాకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. 

*కుంభం*

నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. 

*మీనం*

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులుతో అకారణ వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టె విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి.

🕉️

తథాస్థు దేవతలు

 💐తథాస్థు దేవతలు అంటే ఎవరు💐?!


వేదాలలో ‘అనుమతి’అనే ఒక దేవత ఉంది. యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించే లాగ సహకరిస్తుందని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో తథాస్తు దేవతలు అంటున్నారు. సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు.  సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో సూర్యుడు, ఛాయాదేవి  మూలంగా వీరు జన్మించారు.


మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులుగా జన్మించారు. అంతేకాదు ఆయుర్వేదాన్ని దక్ష ప్రజాపతి నుంచి అభ్యసించి ఇంద్రునికి నేర్పించారు. వీరిసోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన.


ఏం మాట్లాడినా "తథాస్తు" దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఈ దేవతలు సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు వ్యక్తం చేస్తే అదే జరిగిపోతుందట. "తథాస్తు" అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అంటే దేవతలు వెంటనే "తథాస్తు" అనేస్తారు. వీరినే" తథాస్తు దేవతలు" అంటారు. 


సంధ్యా సమయంలో స్వవిషయాలను పలుమార్లు అంటే ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు "తథాస్తు" అంటూ ఉంటారు. ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు.


అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.


చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది

రామకోటి పై మార్గదర్శనం

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*రామకోటి పై మార్గదర్శనం..ప్రలోభపు ఆలోచన!..*


*(ఇరవై ఏడవ రోజు)*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


శ్రీ స్వామివారు రామకోటి వ్రాయడం గురించి వివరించిన తరువాత కూడా..తన ఉపదేశాన్ని కొనసాగించారు..


"రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదా తల్లీ!..నీకు అలా వ్రాయడానికి అర్హత వుందో.. లేదో..ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా..అసలు ఈ జన్మకు నువ్వు ముక్తిమార్గం వైపు పయనించే అర్హత లేదనుకో..భగవన్నామాన్ని చేత పట్టుకుని కూడా..చిన్నపాటి వ్యాధులొచ్చాయనో..లేదా..కుటుంబంలో సమస్యలు వచ్చాయనో..ఇవేవీ కాకుంటే..ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతనో..చేతిలోవున్న దివ్య నామాన్ని వదిలి..ఈ లౌకిక విషయ వాసనల్లో చిక్కుకుపోతావు..ఈ వ్యాధులు..ఈ కుటుంబ సమస్యలు..ఇవన్నీ..ప్రతి గృహస్తుకూ వుండేవే.. మానసిక అశాంతి అనేది అందరికీ వుంటున్నదే.. కొత్తగా రామకోటి వ్రాసినంతమాత్రాన అవి రావు..ఆ సమస్యల తీవ్రత తగ్గించి..మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం..రామనామం తల్లీ!.."


"వద్దు అమ్మా..వద్దు!..లేనిపోని శంకలు పెట్టుకొని..ఆ దివ్యనామాన్ని వదలకు!..నిష్ఠతో ప్రారంభించు!..చేత పట్టుకున్న ఆ రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు!..కోటి పూర్తి చెయ్యి!..అది ఒక్కటీ వున్నా..దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే!..దైవ కరుణ లేకుండా ఎన్ని అష్టైశ్వర్యాలు వున్నా వ్యర్ధమే తల్లీ!..రామనామం కోటి పూర్తయ్యాక..తిరుమంత్రం..అష్టాక్షరి కోటి ప్రారంభిద్దువు గానీ..ఈలోపు..అష్టాక్షరిని రోజుకు 108 సార్లు నియమంగా జపం చేస్తూవుండు!.." అని చెప్పారు..అప్పటికే దాదాపు రాత్రి 11గంటలు దాటి పోయింది..


"అమ్మా!..ఒక గ్లాసు పాలు ఇవ్వు..నేను వెళతాను.." అని స్వామివారు పాలు త్రాగి తన గది దగ్గరకు వెళ్లిపోబోతూ..అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు..ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు..వెన్నెల ఆ పారిజాతం చెట్టు ఆకుల మీద ఉన్న మంచుబిందువుల్లో వింతగా మెరుస్తోంది..


శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూరా పసి పిల్లాడు పట్టరాని ఆనందంతో తిరుగుతున్నట్టు ప్రదక్షిణగా తిరగసాగారు..కొన్ని పారిజాతపు పూలు కోసుకుని గదిలోకి వెళ్లి వాటిని అక్కడ ఉంచి..మరలా తిరిగివచ్చి..ఆ చెట్టు దగ్గర చాలా సేపు నిలబడి చూస్తూ..పచార్లు చేస్తూ..ఉండిపోయారు..ఆ తరువాత ఆ  ఆవరణ మొత్తం కలియతిరుగుతూ వున్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది..సత్యనారాయణమ్మ గారు కూడా శ్రద్ధగా ఆలకించారు.. భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకున్నారు..ప్రభావతి గారికి రామనామం గురించి..ఆవిడ మనసులో వున్న సందేహాలన్నీ మటుమాయం అయ్యాయి..ప్రక్కరోజే..కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలు తెప్పించుకున్నారు..శ్రీధరరావు గారు కూడా.."మళ్లీ మొదటినుంచీ ప్రారంభించు ప్రభావతీ!.." అన్నారు..అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా.."స్వామివారి ఆశీస్సులు..ఆ మాల్యాద్రి లక్ష్మీనారసింహుడి కరుణ..నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా..మొదలుపెట్టు!.." అన్నారు..


సద్గురువు (శ్రీ స్వామివారు) ఆదేశము..తన తోడూ నీడ గా వుండే భర్త అంగీకారము ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి..మంచిరోజు చూసుకొని రామకోటి వ్రాయడం మొదలుపెట్టారు..


శ్రీ స్వామివారు తాను ధ్యానం నుంచి లేచివచ్చిన తరువాత..ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధరరావు దంపతులకు బోధిస్తూ వుండేవారు..ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు..శ్రీ స్వామివారు తనంతట తాను నోరువిప్పి మాట్లాడితే తప్ప, వీరిద్దరూ ఏ విషయమూ ఆయనతో ప్రస్తావించేవారు కాదు..ఇలా ఒకటి రెండు రోజులు గడిచాయి..


ఒక సాయంత్రం వేళ..శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధరరావు దంపతులతో.."మీరిద్దరూ నిస్వార్ధంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు కనుక..మీకేమైనా బాధలుంటే చెప్పండి..నేను పరిష్కారం చెపుతాను.." అన్నారు..


వెంటనే శ్రీధరరావు గారు.."స్వామీ!..మేము గృహస్థులము..ఎన్నో సమస్యలుంటాయి..బాధలు..సంతోషాలూ అన్నీ ఉంటాయి..మా సమస్యలను మేమే తీర్చుకోవాలి..అది మా బాధ్యత!..మాకోసం, మీ తపశ్శక్తిని ధారపోయడం నాకు ఇష్టం లేదు!.." అని చెప్పారు..శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు..


నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారు అడిగినవెంటనే..తమకున్న ఆర్ధిక కష్టాలు చెప్పుకోవాలని ఉవ్విళ్ళూరారు..స్త్రీ సహజమైన ఆందోళన, బాధ్యతల తాలూకు భయమూ..కొద్దిపాటి ప్రలోభమూ ఆవిడను చుట్టుముట్టాయి..కానీ శ్రీధరరావు గారు ఆవిడ ఆలోచనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు.."లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు ప్రభావతీ!..మనం ఆయననుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేదు..ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి..అంతేకానీ మన బరువు బాధ్యతలు మోపకూడదు..మనం నమ్ముకున్న లక్ష్మీనృసింహుడి కి మన సమస్యలు తెలుసు..కాకుంటే స్వామివారి మనసులో మనకు మేలు చేయాలని ఉన్న ఒక్క భావనే చాలు మన పదితరాలు తరించిపోవడానికి.." అన్నారు..ప్రభావతి గారు అప్పటికి సరే అన్నారు గానీ..లోలోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తన కోరికను వెళ్లబుచ్చాలని గట్టిగా నిర్ణయించుకున్నారు..


అష్టైశ్వర్యాలు..అష్టసిద్ధులు..రేపటిభాగంలో..


*మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్రను ఆడియో రూపంలో ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా యూట్యూబ్ లో వినవచ్చు..*


https://youtube.com/playlist?list=PLZ3oJviTRayHLeRpuozyT55d-H-4xmTHs&si=xqCIrCAE0k1Rmrnx


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్:523114..సెల్..94402 66380 & 99089 73699).