8, అక్టోబర్ 2024, మంగళవారం

Panchang


 

రక్షణc గూర్చు దుర్గ నవరాత్రులc బూజ లొనర్చు వారికిన్*

 *రక్షణc గూర్చు దుర్గ  నవరాత్రులc బూజ లొనర్చు వారికిన్*

ఈ సమస్యకు నాపూరణ. 


అక్షయ సంపదల్ కలుగు నంబను గొల్చిన తక్షణంబుగా


లక్షణమైన కీర్తనలు లక్షిత మంత్ర జపంబు పూజలున్


దీక్ష వహించి చేయుదము దేవిని నమ్మిన వారి కెప్పుడున్


రక్షణc గూర్చు దుర్గ నవరాత్రులc బూజ లొనర్చు వారికిన్.


అల్వాల లక్ష్మణ మూర్తి.

శరన్నవరాత్రి వైభవంలో

 


శ్రీభారత్ వీక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🌹వినే అదృష్టం ఉంటే ఎన్ని మంచి విషయాలైనా తెలుస్తాయంటారు. షష్ఠీ దేవి, మంగళ చండీ దేవి గురించి తెలుసుకోవడం అటువంటిదే. అమ్మవారి అంశా మూర్తులలో ఈ ఈ ఇద్దరు మాతల మహత్యం తప్పక వినవలసిందే. షష్ఠీ దేవి పుత్ర దాయిని. మంగళ చండీ దేవిని మంగళ వారం అర్చిస్తే కలిగే ఫలితం అనంతం. పరమశివుడే ఆమెను పూజించి నట్లుగా చెబుతారు.శరన్నవరాత్రి వైభవంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు ఈ ఎపిసోడ్ లో వారిద్దరి గురించి వివరించారు. వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

రాజరాజేశ్వర్యష్టకం

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

       *రాజరాజేశ్వర్యష్టకం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

 *అంబా శాంభవి చంద్రమౌళిరబలాపర్ణా ఉమా పార్వతీ।*

*కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ।*

*సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 1 ||*


*అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ।*

*వాణీ పల్లవపాణి వేణుమురళీగాన ప్రియా లోలినీ।*

*కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 2 ||*


*అంబా నూపురరత్నకంకణధరా కేయూర హారావళీ।*

*జాతీపంకజ వైజయంతి లహరీ గ్రైవేయకైరాజితా।*

*వీణా గాన వినోదమండితకరా వీరాసనేసంస్థితా।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 3 ||*


*అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ।*

*బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా।*

*చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ పల్లవీ।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 4 ||*


*అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ।*

*వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా।*

*మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 5 ||*


*అంబా సృష్టివినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా।*

*గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా।*

*ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 6 ||*


*అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా।*

*యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యావై జగన్మోహినీ।*

*యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 7 ||*


*అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్।*

*అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్।*

*అంబా పావనమంత్ర రాజపఠనాదంతే చ మోక్షప్రదా।*

*చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || 8 ||*


*ఓం శ్రీ రాజ రాజేశ్వరీ దేవ్యై నమః।*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

ఆరవరోజు మహాలక్ష్మీ దేవి రూపంతో దుర్గమ్మ దర్శనం* 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఆరవరోజు మహాలక్ష్మీ దేవి రూపంతో దుర్గమ్మ దర్శనం*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్న కనకదుర్గ దేవి ఈ రోజు.. ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, శనివారం శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనం ఇస్తున్నారు.*


*ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, మంగళవారం శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమీయనున్న శ్రీ మహాలక్ష్మీ దేవి జగన్మాత మహాలక్ష్మీ స్వరూపంలో దుష్టరాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టమనే చెప్పాలి..*


*మూడు శక్తుల్లో ఒక శక్తైన శ్రీ మహాలక్ష్మీ అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోక స్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య , సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమిష్టిరూపమైన అమృతస్వరూపిణిగా శ్రీదుర్గమ్మ ఈరోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారు.*


*ప్రపంచాన్ని శాసించే ధనాన్ని ప్రసాదించే శ్రీ మహాలక్ష్మీ దేవి తనను ఎవరైతే భక్స్తి శ్రద్ధలతో పూజిస్తారో వారిని అనుగ్రహించి ఐశ్వర్యప్రాప్తి, విజయమును ప్రసాదిస్తుంది.*


*దసరా శరన్నవరాత్రులలో భాగంగా కనకదుర్గమ్మ తల్లిని శ్రీ మహాలక్ష్మి దేవి గా గులాబీ రంగు చీరతో అలంకరించి చక్కెర పొంగలి, క్షీరాన్నం నివేదిస్తారు.*


*ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే.. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్థాయని.. సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు…*


*శ్రీమహాలక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఏంచేయాలి?*


*“హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క,*

*చందురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్తో నాడు పూబోడి,*

*తామరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు,*

*భాసురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ ! ”*


*సంపదలకు అధినేత్రి శ్రీ మ‌హాల‌క్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై వుంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా వుంటాయి. సంపద వుంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి.*


*సాగరమథనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు, వ్రతాలు చేస్తుంటాం. శుచి, శుభ్రత, నిజాయతీ కలిగిన ప్రదేశాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీమహావిష్ణువును పూజించే వారిని అనుగ్రహిస్తుంది.*


*అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోధిక సేవలందించిన విభీషణుడు.. హనుమంతుడికి చిరంజీవులుగా వుండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు.*


*హనుమంతుడికి భవిష్యత్‌ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం.*


*గృహంలో ప్రశాంతత, మహిళలను గౌరవించడం, తెల్లవారుఝామునే లేవడం, పూజాధికాలను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు.* 


*ఇంటికి సిరి ఇల్లాలు. ఆమె మనస్సును ఎటువంటి పరిస్థితుల్లో నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడి పెడితే ల‌క్ష్మి వెళ్లిపోతుంది.*


*అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు ఐదేళ్ల వయస్సులో పఠించిన కనకధార స్తోత్రాం, లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి.*


*మనకున్న దానిలో దానం చేయాలి. కామలాత్మిక స్త్రోత్రాలు చదవాలి. ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ వుంటుంది.!*


*రోజూ ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. ఇలా చేస్తే ఇంట్లో దరిద్రం తోలిగిపోతుంది.*

.

*లక్షి దేవిని ఎప్పుడూ గణపతితో, శ్రీ మహావిష్ణువుతో పూజించాలి. ఇలా చేస్తే సిరుల తల్లి అనుగ్రహిస్తుంది.*


*ప్రతి ఇంట్లో తులసి మొక్క లేదా చెట్టు కచ్చితంగా ఉండాలి. తులసికి నిత్యం దీపం పెట్టి ప్రదక్షిణాలు చేస్తే ఆ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు. ఆర్థిక ఇబ్బందులు బాధపెడుతున్న వేళ నోరులేని మూగ జీవాలకు రోజు ఏదోక ఆహారం పెట్టాలి. ముఖ్యంగా ఆవు లేదా పాలు ఇచ్చే పాడి పశువులు, కుక్కలకి ఇలా మూగ జీవాలకి తిండి పెడితే చాలు మహాలక్ష్మి త్వరగా అనుగ్రహిస్తుంది.*


*గుమ్మం ముందు ప్రధాన ద్వారం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అలాగే ముందు వాకిలి శుభ్రం చేశాక ఇల్లు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే శ్రీమహాలక్ష్మి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది.*


*శ్రీ మహాలక్ష్మీ దేవీ నమోస్తుతే.।*


*ఓం శ్రీ మాత్రే నమః॥*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

మంగళవారం చేయవలసిన - చేయకూడని పనులు.......!!*

 🛐🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️

*మంగళవారం చేయవలసిన - చేయకూడని పనులు.......!!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*మంగళ వారం కొన్ని పనులు చేయాలి, మరికొన్ని చేయకూడదు..*


*మంగళవారం కుజునికి సంకేతం. కుజుడు ధరత్రీ పుత్రుడు, భూమిపై నివసించేవారికి కుజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.*


*కుజుడు ప్రమాదాలకు, కలహాలకు, నష్టాలకు కారకుడు. అందుకనే సాధారణంగా కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారం నాడు… శుభకార్యాలు తలపెట్టరు.*


*మంగళవారం చెయకూడని పనులు…*


*1.) మంగళవారం గోళ్ళు కత్తిరించడం, క్షవరం అలాంటివి చేయకూడదు.*


*2.) మంగళవారం అప్పు ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రావడం చాలా కష్టం.*


*౩.)అప్పు తీసుకుంటే అది అనేక బాధలకు, అనవసరమైన పనులకు ఖర్చు అయిపోయి, తీరకపోయే ప్రమాదం ఉంది.*


*4.)మంగళవారం కొత్త బట్టలు వేసుకోకూడదు.*


*5.)మంగళవారం అత్యవసరం అయితే తప్ప మంగళవారం ప్రయాణాలు పెట్టుకోకూడదు.*


*6.)మంగళవారం ఉపవాసం చేసిన వారు రాత్రి ఉప్పు వేసిన పదార్ధాలు తినకూడదు.*


*7.)మంగళవారం తలంటు స్నానం చేయకూడదు.*


*8.)దైవకార్యాలకు, విద్యా వైద్య రుణాలు ఎప్పుడైనా ఇవ్వవచ్చు.*


*మంగళవారం చేయవలసిన పనులు...*


*1.)మంగళవారం ఆంజనేయుడిని ద్యానించడం వలన ధైర్యం చేకూరి, అన్ని పనులు అవుతాయి.*


*2.)సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయడం వలన కుజగ్రహ ప్రభావం వలన కలిగే ప్రమాదాలను నివారించవచ్చు.*


*౩.)మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వలన శత్రువులపై జయం కలుగుతుంది.*


*4.)మంగళవారం ఎరుపు రంగు దుస్తులను ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని ప్రార్ధించడం చేస్తే మంఛి ఫలితం ఉంటుంది.*


*5.)జాతకంలో కుజగ్రహం వక్ర దృష్టితో చూస్తే ఎరుపు రంగు దుస్తులను ధరించరాదు.*


*6.)మంగళవారం అప్పు తీరిస్తే..ఆ అప్పు తొందరగా తీరిపోతుంది.*


*7.) మంగళవారం నాడు..మన బ్యాంకు అకౌంట్ లో ఎంతో కొంత మనీ వేయడం వలన అది వృద్ది అవుతూ ఉంటుంది.*


*8.)మంగళవారం రాహుకాలంలో..( మధ్యాహ్నం 3 నుండీ 4.30 వరకు) దుర్గాదేవి దర్శనం.. దుర్గా స్తోత్రాలు పారాయణము చేయడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది.*


*9.)హనుమంతుడికి సింధూరంతో పూజించడం వలన, సుబ్రమణ్యస్వామికి పదకొండు ప్రదక్షణలు చేయడం వలన దోష ప్రభావం తగ్గుతుంది.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

మనిషి విలువ

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

          *మనిషి విలువ*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఒకరోజు ఒక మనిషి గురు నానక్ దగ్గరకు వెళ్లి,  గరూజీ మనిషి  బ్రతుకు వెల యెంత? అని అడిగితే ఆయన తన దగ్గర ఉన్న ఓ రాయిని ఆ వ్యక్తికి యిచ్చి దాని వెల ఎంతో కనుక్కొని రమ్మని చెప్పి పంపించారు. ఐతే ఎట్టి పరిస్థితులోను దాన్ని అమ్మరాదని షరతు విధించారు.*


*ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని వెడుతుంటే, ఓ పళ్ల వ్యాపారి ఎదురుగా వచ్చాడు. వ్యాపారి రాయిని చూసి,  అది ఇస్తే 12 పళ్లు యిస్తానన్నాడు. ఆరాయి అమ్మకూడదు కాబట్టి, అతను ఇంకొంచెం ముందుకు నడిచాడు.*


*ఈసారి కూరల వ్యాపారి తారసపడ్డాడు. రాయిని పరీక్షగా చూసి, ఓ బస్తా బంగాళా దుంపలు యిస్తానన్నాడు.  ఆరాయి అమ్మకూడదు కాబట్టి, అతను ఇంకొంచెం ముందుకు నడిచాడు.* 


*ఈసారి  బంగారం వ్యాపారి ఎదురుపడ్డాడు. అతను రాయిని అటూ ఇటూ తిప్పిచూసి,  అయ్యా,  ఇది విలువైన వస్తువు. నేనిచ్చుకోలేను కానీ, కోటి రూపాయల పైవరకు తూగుతుంది. ఆరాయి అమ్మకూడదు కాబట్టి, అతను ఇంకొంచెం ముందుకు నడిచాడు.* 


*చివరకు ఓ రత్నాల వ్యాపారి దగ్గరకు వెళ్లి రాయిని చూపించాడు. అతను పరిశీలన చేసి, అయ్యా, దీనికి వెలకట్టగల వారు లేరు. అత్యంత విలువైన రాయి అని చెప్పాడు. ఆరాయి అమ్మకూడదు కాబట్టి, ఆ వ్యక్తి తిరిగి నానక్ గారి దగ్గరకు వచ్చి జరిగినదంతా వివరించాడు.*


*నానక్ గారు నవ్వుతూ, "పళ్ల వాడు 12 ఫలములు,  కూరల వాడు ఓ బస్తా బంగాళా దుంపలు, స్వర్ణాచారి కోటి రూపాయలు,  రత్నాల వ్యాపారి వెలకట్టలేమనీ నిర్ణయించారు.*


*ఈరాయి లాగే ప్రతీ మనషి ఓ రత్నం లాంటి వాడే. మనిషి విలువ ముందరగల వ్యక్తి తమ తమ అనుభవాలమేరకు,  తమ తమ స్థాయి మేరకు అంచనావేస్తారు. అందుమూలమున,  నిన్ను తక్కువ చేస్తే ఆందోళన చెందవద్దు. నీ విలువను గుర్తించగలవారు తప్పక తారసపడతారు. ఆరోజు వస్తుంది. నిన్ను నువ్వు గౌరవించుకో. ప్రపంచంలో ప్రతీ వ్యక్తి ప్రత్యేకం" అని బోధించి పంపారు.*


*శ్రీ గురుభ్యోనమః॥*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

హనుమంతుడు మాత్రమే చేయగలరు.

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*హనుమంతుడు మాత్రమే చేయగలరు.*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*హనుమంతుడు శివుని అవతారంగా శివ పురాణం చెబుతోంది. అదేవిధంగా శ్రీ రాముడు మహావిష్ణువు అవతారంగా ఉన్నాడని అందరికీ తెలిసిన విషయమే. హనుమంతుడు భూమిపై లోకకళ్యాణార్ధం, ధర్మాన్ని స్థాపించాలనే లక్ష్యంతో శ్రీరామునికి సహాయ సహకారాలు అందించే క్రమంలో జన్మించాడని శివపురాణంచెబుతుంది.*


*రామాయణం అంటే, రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం. అలాంటి హనుమంతుని కథలు వినడం, లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యo, ఆత్మ విశ్వాసం పెంపొందడానికి సహాయపడగలదని పెద్దల విశ్వాసం.*


*భారీ సముద్రాన్ని దాటడం:-*


*హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు తదితరులు, సీతా దేవిని వెతికే క్రమంలో సముద్రం వద్దకు వచ్చారు. వారు సముద్రం యొక్క తీవ్ర రూపాన్ని, పరిమాణాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. వీరిలో ఏ ఒక్కరికీ సముద్రాన్ని దాటడానికి ధైర్యం చాలలేదు. కానీ హనుమంతుని శక్తి యుక్తులపై నమ్మకం ఉన్న జాంబవంతుడు హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్లి, తిరిగిరాగల సమర్దునిగా సూచించాడు. క్రమంగా హనుమంతుడు తన సామర్ధ్యాలను అర్థం చేసుకున్నాడు. మొదట్లో తన సామర్ధ్యం మీద తనకే నమ్మకం లేని వ్యక్తిగా ఉన్నా, జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని సైతం దాటగలిగి, సీత జాడను కనిపెట్టగలిగాడు హనుమంతుడు.*


*సీతాదేవిని కనుగొనడం:~*


*హనుమంతుడు సీతా దేవి కోసం అన్వేషణలో భాగంగా లంకను చేరినప్పుడు, రావణ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న లంకిణీ అనే రాక్షసితో తలపడవలసి వచ్చింది. హనుమంతుడు దైవ బలాన్ని కలిగి ఉండడం చేత, లంకిణీ తలవంచక తప్పలేదు. మరియు హనుమంతుడు తప్ప ఎవరు కూడా అప్పటి వరకు ఆమెను ఓడించలేకపోయారు. ఈ పోరాటంలో హనుమంతుడు, తన మానసిక మరియు శారీరక బలాన్ని సరైన స్థాయిలలో ఉపయోగించి లంకిణీని ఓడించాడు. ఓటమిని అంగీకరించిన లంకిణీ, సీతాదేవి ఆచూకీని చెప్పగా, అశోకవనంలో సీతాదేవిని గుర్తించడం జరిగింది. సీతాదేవి లక్ష్మిదేవి అవతారము కావడం చేత, సీతాదేవిని గుర్తించడానికి ఎక్కువ సమయం కూడా పట్టలేదు హనుమంతునికి. నిజానికి హనుమంతుడు తప్ప ఎవరికీ సాధ్యంకాని అంశం, లంకను ఎదుర్కొని సీత జాడ తెలుసుకోవడం.*


*అక్షయకుమారుని సంహరణ :~*


*శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేసిన తర్వాత, హనుమంతుడు లంకలోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు. రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా, హనుమంతుడు అక్షయ కుమారుని హత్య గావించాడు. క్రమంగా రాజ్యంలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుని తన సభకు పిలిపించి, తోకను ముట్టించగా, అక్కడనుండి వెళ్ళిన హనుమంతుడు చివరకు లంక మొత్తాన్ని దహనం గావించాడు. రాముడి పరాక్రమాలను అతనికి పరిచయం చేయడానికే హనుమంతుడు ఈ చర్యకు ఒడిగట్టాడు. హనుమంతుడు మాత్రమే సమర్ధవంతంగా చేయగలిగిన అంశాలలో ఇది కూడా ఒకటి.*


*విశ్వసనీయ వ్యక్తైన విభీషణుని శ్రీరాముని వద్దకు తీసుకెళ్లడం :~*


*హనుమంతుడు, ఎవరో శ్రీరాముని పేరును ఉచ్చరిస్తూ వేడుకొంటున్నట్లుగా గ్రహించాడు. క్రమంగా అతనికడకు వెళ్ళిన హనుమంతుడు, అతన్ని రావణాసురుని తమ్ముడు విభీషణునిగా గుర్తించి, అతన్ని రాముడి అనుయూయుడిగా తెలుసుకున్నాడు. శ్రీరాముని కలిసేందుకు కోరికను కలిగిఉన్నట్లుగా తెలుపడంతో, ఎవ్వరూ అంగీకరించకపోయినా కూడా హనుమంతుడు విభీషణుని మీద గల నమ్మకంతో రాముని కడకు తీసుకుని వెళ్ళాడు. క్రమంగా ఈ చర్యే, సగం రామ – రావణ యుద్ధంలో రాముడు రావణుని సంహరించుటకు కారణమైంది.*


*సంజీవని పర్వతo ఆచూకీ కనుగొని తీసుకుని రావడం :~*


*శ్రీరాముడు మరియు రావణ సైన్యానికి మధ్య యుద్ధం జరిగే సమయంలో, రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణునిపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించగా, లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోవడం జరుగుతుంది. దీనికి సంజీవని మొక్క మాత్రమే పరిష్కారమని తెలియడంతో, హిమాలయాలలో సూచించిన పర్వతంనందు, సంజీవని గుర్తించడం కష్టసాధ్యమవడంతో పర్వతాన్నే పెకలించుకుని తీసుకుని వచ్చాడు హనుమంతుడు. ఈ పని ఏ ఇతరులూ చేయలేని అంశాలలో ఒకటిగా ఉంది.*


*అనేకమంది రాక్షసులు హనుమంతునిచే చంపబడ్డారు అంతేకాకుండా రావణుని కూడా ఒకసారి ఓడించాడు*


*యుద్ధ సమయంలో హనుమంతుడు అనేకమంది రాక్షసులను సంహరించాడు. దుమ్రాక్ష్, అంక్పన్, దేవాంతక్, త్రిసుర, నికుక్భ్ వంటి రాక్షసులు ప్రధానంగా ఇందులో ఉన్నారు. ఈక్రమంలో హనుమంతుడు, రావణునికి మద్య కూడా భీకరయుద్ధం జరిగింది. రావణుని ఓడించిన హనుమంతుడు, చంపకుండా విడిచిపెట్టాడు. దీనికి కారణం, రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే సంహరించబడాలన్న ఆలోచన. హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా ఋజువేముంటుంది.*


*అంతటి అఘటిత ఘటనా చతురుడు, అతి వీర పరాక్రముడు అయినందువలనే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమంతుడు అంటే ఒక ధైర్యం అనే నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఒక్కసారి హనుమంతుని తలచుకోవడం మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకుని, పరిస్థితులను అధిగమించే శక్తిని పొందగలరని భక్తుల నమ్మకం. ఏ దేవుడూ సాధించలేని ఘనకీర్తి, భయాలలో వెన్నంటి ఉంటాడనే నమ్మకం ఒక్క హనుమంతునికే సొంతం. ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నా, హనుమాన్ చాలీసా పఠనం తెలియని మానసిక ధైర్యానికి కారణమవుతూ, తమ యందు అన్ని వేళలా హనుమంతుని కృపా కటాక్షాలు ప్రసరింపజేస్తుంటాయని, క్రమంగా సుఖసంతోషాలతో జీవించగలరని ప్రతీతి.*


*ఓం నమో శ్రీ ఆంజనేయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

బాల పూజ

 బాల పూజ 

ఏ వయసుకి ఏ పేరుతో పిలిచి పూజ చేయాలి 

రెండు సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---కుమారి పూజ 

మూడు సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---త్రిమూర్తి పూజ 

నాలుగు సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---కళ్యాణి పూజ 

ఐదు సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---రోహిణీ పూజ 

ఆరు సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---కాళికా పూజ 

ఏడు సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---చండికా పూజ 

ఎనిమిది సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---శాం భవీ పూజ 

తొమ్మిది సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---దుర్గా పూజ 

పది సంవత్సరాల పిల్లలకి పూజ చేస్తే ---సుభద్రా పూజ

Inkoka Doctorni chusthaa ఇంకొక డాక్టెర్ని చుస్తా


 

*శ్రీ విరూపాక్ష దేవాలయం*

 🕉 *మన గుడి : నెం 448*






⚜ *కర్నాటక  : హంపి : విజయనగర*


⚜ *శ్రీ విరూపాక్ష దేవాలయం*



💠 హంపిని ఎప్పుడైనా సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా?  అయితే, హంపిలోని అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన విరూపాక్ష దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. 



💠 శివునికి అంకితం చేయబడిన విరూపాక్ష దేవాలయం, కర్ణాటకలోని పురాతన నగరం హంపిలో ఒక ప్రముఖ మైలురాయి. 

ఈ ఆలయం కేవలం మతపరమైన ప్రదేశం మాత్రమే కాదు, చారిత్రక మరియు నిర్మాణ అద్భుతం, ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తుంది. 


💠 విరూపాక్ష దేవాలయం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించబడింది, దీనిని ద్రావిడ శైలి అని కూడా పిలుస్తారు.


💠 హంపిలోని విరూపాక్ష దేవాలయం రూపకల్పన మరియు నిర్మాణంలో గణిత శాస్త్ర ఆలోచనలను ఉపయోగించడం అనేది కొంతమందికి మాత్రమే తెలిసిన అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి. 

 

💠 ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రౌడ దేవ రాయ అని కూడా పిలువబడే పాలకుడు దేవరాయ II ఆధ్వర్యంలోని నాయకుడు లక్కన్ దందేశ నిర్మించారు . 


💠 హంపిని పంపా క్షేత్రం, కిష్కింధ క్షేత్రం మరియు భాస్కర క్షేత్రం అని కూడా అంటారు.


🔆 ఆలయ చరిత్ర


💠 విజయనగర సామ్రాజ్యానికి పూర్వం నుండే ఈ విరూపాక్ష దేవాలయం ఉందని శీలా శాసనాలు ద్వారా తెలుస్తున్నది. 

చరిత్రకారులు దీనిని 10-12 శతాబ్దాలకు చెంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

చారిత్రక ఆధారాల ప్రకారం, ప్రధాన ఆలయాన్ని చాళుక్యులు మరియు హొయసలులు మార్పులు చేసారు, అయితే ప్రధాన ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు.

విజయనగర రాజుల పతనం తరువాత, దండయాత్రల వలన 16 వ శతాబ్ధానికి హంపి నగరం లోని అత్యద్భుత శిల్ప సౌందర్యం నాశనం చేయబడింది.


💠 విరూపాక్ష ఆలయంలో దేవునికి ధూపదీప నైవేద్యాలు నిరంతరాయంగా కొనసాగాయి. 19వ శతాబ్దం ప్రారంభంలో ఈ దేవాలయంపై కప్పు పై చిత్రాలకి, తూర్పు, ఉత్తర గోపురాలకి జీర్ణోద్ధరణ జరిగింది.


🔆 విరుపాక్ష దేవాలయ వర్ణన 


💠 ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. 9ఖానాలతో 50 మీటర్ల ఎత్తులో ఉన్న తూర్పు గోపురం లోని రెండు ఖానాలు రాతితో నిర్మించబడ్డాయి. 

మిగిలిన 7 ఖానాలు ఇటుకతో నిర్మించబడ్డాయి.


💠 తూర్పు ముఖంగా, విరూపాక్షాలయంలో 11 అంతస్తుల ఎత్తైన ప్రధాన రాజ గోపురం ఉంది. ఈ  రాజగోపురంపై స్త్రీ పురుషుల, జంతువుల శిల్పాలు చాలా ఉన్నాయి. 

గోపుర ద్వారం లోపల ఒక పక్క  పక్క మూడు తలల  నంది, ఇంకొక పక్క ఒక చిన్న నంది ఉన్నాయి. వీటికి ఎదురుగా మరో గోపురమున్నది.


💠 ఈ రెండో గోపురం మొదటి దానికన్నా చిన్నది. దీనిని రాయలవారి గోపురం అంటారు. దీనిని శ్రీ కృష్ణ దేవరాయల వారు నిర్మించినందున దీనిని రాయల గోపురం అని కూడా అంటారు. 

ఈ ద్వారం తర్వాత ఉన్నదే రెండో ఆవరణం.


💠 ఇందులో మధ్యన - ముఖమంటపం, దాని తర్వాత గర్భగుడి ఉన్నాయి. 

గర్భగుడి చుట్టూ ఉన్న వరండాలలో ఇతర దేవతా ఉప ఆలయాలు ఉన్నాయి.

 అవి పాతాళేశ్వర, ముక్తి నరసింహ మరియు శ్రీ వేంకటేశ్వరుడు వంటి దేవతల ఆలయాలున్నాయి.


💠 విరూపాక్ష స్వామి వారికి పంపాపతి అనే మరొక పేరు కలదు. 

పూర్వం పంపానదిగా పిలువబడినదే ఈనాటి తుంగభద్రనది. 

ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతాయి. ఈ ఆవరణంలో దీపస్తంభం, ధ్వజస్తంభం, నాలుగు కాళ్ల మంటపం ఉన్నాయి నాలుగు కాళ్ల మంటపంలో, మూడు' నందులున్నాయి.

తర్వాత ముఖమంటపం ఉన్నది. 

ముఖ మంటపంలోనికి ఎక్కేమెట్ల ప్రక్కన ఒక శిలాశాసనం పురాతన తెలుగులో రెండు వైపులా చెక్కి ఉన్నది. 

ముఖమంటపం అనేక స్తంభాలతో, వాటిపై అతి సుందర శిల్పాలతో మలచబడి ఉన్నది.


💠 గర్భగుడికి కుడిప్రక్కన కొంత ఎత్తులో స్వామి వారి బంగారు రత్న ఖచిత కిరీటం యొక్క చిత్రపటం ఉన్నది. 

ఈ అసలు కిరీటాన్ని శ్రీకృష్ణదేవరాయలవారు చేయించాడు.


💠 ప్రస్తుతం ఆ కిరీటం ప్రభుత్వ ఖజానాలో భద్రపరచబడి ఉన్నది. ఉత్సవాల సందర్భాలలో దాన్ని స్వామివారికి ధరింపజేస్తారు.


💠 విరూపాక్ష దేవాలయం దగ్గరలో గణపతి విగ్రహం ఉన్నది. ఈ గగణపతి విగ్రహం 15 అడుగుల ఎత్తు మరియు విగ్రహం పైభాగంలో  శనగబడలవలే బుడిపెలతో కూడుకొని ఉంటుంది. దీనిని శనగలరాయి గణపతి అని అంటారు. దీనికి సమీపంలోనే వేరొక విగ్రహం అతి చిన్న చిన్న బుడిపెలతో కూడుకొని 10 అడుగుల ఎత్తులో ఉంటుంది.

దీనిని ఆవాలరాయి గణపతిగా పిలుస్తారు. 


💠 ఈ ప్రాంతమే రామాయణంలో సుగ్రీవుడు నివసించిన కిష్కింద అని తన సోదరుడైన వాలి నుండి తప్పించుకోవడానికి ఇక్కడే ఒక గుహలో నివసించేవాడని, రామచంద్రమూర్తి సుగ్రీవుడిని ఇక్కడే కలిసాడని తెలియుచున్నది.


💠 గర్భగుడికి వెనుక ఉన్న ద్వారం గుండా బయటకు వెళితే అక్కడ శ్రీ విద్యారణ్యస్వామివారి మఠం, ఆలయం ఉన్నది.

ఈ విద్యారణ్యస్వామి 'విజయనగర సామ్రాజ్య నిర్మాణకర్త. 


💠 బెంగుళూరు నుండి 350 కి.మీ మరియు బళ్లారికి 75 కి.మీ. దూరంలో వుంది. 

కంబరామాయణం 104

: కంబరామాయణం 104

(పంచవటికి పయనం )


తాపసివేషంలో ఎందుకు సంచరిస్తున్నావు ? నీవు రాజ్యమును ఏలవలసినవాడవు కదా !! నీకు హాని చేసినవారు ఎవరు ? సుర,గరుడ,యక్ష,కిన్నర ,పన్నగ ,రాక్షసజాతులలోని వారెవరైనా సరే వారిని పట్టి పరిమార్చి నీ రాజ్యము నీకు దక్కేలా చేస్తాను అని పలికాడు జటాయువు !

...

రాముడు లక్ష్మణుని వైపు చూశాడు ! లక్ష్మణుడు జటాయువు ను చూసి జరిగిన వృత్తాంతము యావత్తూ పూసగ్రుచ్చినట్లు వివరించాడు !

...

ఆహా ! సవతితల్లికోరికదీర్ప తండ్రిమాట మీద అడవులకొచ్చావా ! నా తండ్రీ! నీవంటివాడు ముల్లోకాలలో లేడు అని పుత్రవాత్సల్యంతో రాముడి శిరస్సు చుంబించాడు జటాయువు !

...

రామా నీవలన నీతండ్రి ధన్యుడయ్యాడు ! నీ తండ్రి నా స్నేహితుడగుట చేత నేను ధన్యుడనయ్యాను ! 

...

నాయనా నీ వివాహమెలా జరిగింది అని ప్రశ్నించాడు జటాయువు ! 

..

తాటకవధ నుంచి శివధనుర్భంగము దాకా ఆ కధ చెప్పాడు లక్ష్మణుడు !

...

అందుకు జటాయువు సంతసించి నాయనా నీవు ఈ అరణ్యములో ఇక్కడే నివాసమేర్పరచుకో ! గడువు ముగిసిన వెంటనే ఇక్కడనుండే నీవు అయోథ్య కు వెళ్ళవచ్చు అంతవరకు నీవు నా రక్షణలో ఉందువుగాని ! అని చెప్పాడు !

...

అప్పుడు రాముడు ," అగస్త్యభగవానుడు గోదావరి ఒడ్డున గల ఒక అందమైన ప్రదేశములో నివాసమేర్పరచుకొమ్మని సూచించారు " వారి సూచన ప్రకారము అక్కడికే వెళతాము అని బదులిచ్చాడు !

...

అవును అది ఎంతో సుందరమైన ప్రదేశము! అది పంచవటి ! నాతో రండి ! ఆ తావు నేను మీకు చూపుతాను ! అని మెల్లగా విశాలమైన రెక్కలు విప్పి వాటినీడ వారిపై పడేటట్లుగా ఆకాశంలో నిలుచుని దారి చూపసాగాడు ! 

..

ఆ పక్షిరాజు విశాలమైన రెక్కల నీడలో పంచవటి వైపు నడక సాగించారు సీతారామలక్ష్మణులు

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 105

( పంచవటీతట సుస్థిత రాముడు )


...

పంచవటికి వారిని చేర్చాడు జటాయువు .

ఇక ఈరోజునుండి వీరి సంరక్షణ బాధ్యతనాది అని మనసులో దృఢపరచుకొని అటనుండి తన తావుకు వెళ్ళిపోయాడు జటాయువు ! ఆయనకు తెలుసు అది క్రూరరాక్షసులు మెసిలే చోటు అని ! 

...

గోదావరీ నది శీతలజలాలపైనుంచి వీచేగాలి వారి శరీరాలకు సుఖస్పర్శనందిస్తోంది !

..

 గొప్ప కవుల కలం నుండి జాలువారే మహాకావ్యంలా ఉన్నది గోదావరి ప్రవాహం !

..

తన జలాల నిండా విరిసిన కమలాలతో ఆ నదీమతల్లి వళ్ళంత కనులు చేసుకొని వీరినే చూస్తున్నట్లుగా ఉన్నది. 

...

 గోదావరి మాత వైకుంఠవాసుని అర్చన చేస్తున్నప్పుడు సమర్పించిన పూలవలె కొన్ని తామరలు గాలికి ఎగిరివచ్చి సీతారాముల పాదాలు తాకుతున్నాయి . 

..

గోదావరినదిలోని కమలాలమీద సయ్యాటలాడే చక్రవాకాలు సీతమ్మకు చూపి చిలిపిగానవ్వాడు రామయ్య ! 

..

నదిలో పైకి ఉబికిన ఇసుకదిబ్బలను రామయ్య భుజస్కంధాలను మాటిమాటికి మార్చిమార్చి చూసింది సీతమ్మ !

...

ఇసుకతిన్నెల మీద నడయాడే రాయంచలనడకలను, సీతమ్మ నడకలను పోల్చిచూసి మధురోహలతో మురిసి తడిసిపోయాడు రామయ్య !

...

నల్లకలువలను నీటిలో చూసి రామయ్య దేహాన్ని ఒకసారి చూసింది సీతమ్మ !

...

సుందరము మనోహరము అయిన ఆ ప్రాంతం వారినెంతో ఆకట్టుకున్నది ! 

...

ఎత్తైన ఒక ప్రాంతంలో పర్ణశాల నిర్మించాడు లక్ష్మణస్వామి !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 106

(శూర్పణఖ మనోవికారము)


ఆమె శూర్పణఖ ! నీలివజ్రపుదేహకాంతికల రాక్షసరాజు రావణాసురుడి చెల్లెలు !

..

 రాక్షసజాతిఅనే మహావృక్షాన్ని అంతమొందించటానికి పుట్టిన పెనుచీడ !

...

 కామజ్వరంతో సెగలుపుట్టే శరీరంతో , గాలిలో తేలియాడే రాగిరంగు కురులతో అది ఆ ప్రాంతంలో సంచరిస్తుంటుంది !

..

 స్వైరవిహారిణి ఆ స్త్రీ !

..

దాని కాలి అందెల ధ్వనులు తాపసులకు మృత్యుఘంటానాదాలు !

...

స్వేచ్ఛగా తిరుగుతూ తిరుగుతూ రామచంద్రుని పర్ణశాలను సమీపించింది !

...

ఆ క్షణంలో దానికి తెలియదు రాక్షసజాతి అంతానికి తానే నాంది పలుకబోతుందని !

...

రాముడిని చూసింది ! ఆయనే యోగనిద్రనుంచి మేల్కొని లోకాలను ఆవరించిన రాక్షసజాతి అనే తమస్సును పారద్రోలటానికి ఇనకులేశుడుగా ప్రభవించిన శ్రీమహావిష్ణువని ఎరుగదు అది !

...

మరలమరల రాముడినే చూస్తూ ," ఆహా ! మనుషుల మనసులలో తప్ప ఇతరత్రా ఆకారమే లేని మన్మథుడు తపస్సు చేసి ఈ రూపం ధరియించినాడా యేమి ?" అని అనుకొన్నది

...

ఏమి భుజములవి !! పుడమిని చుట్టివేయగల ఏనుగు తొండముల వలె ఎంత బలిష్ఠముగా ఉన్నవో !

.

అబ్బ ! సుందరమైన ఈ మానిసి వక్షస్థలమును చూతమన్న నా రెండుకనులు సరిపోవుటలేదు కదా !

...

ఈయన ముఖసౌందర్యమును వాడిపోయే పద్మముతో ,వృద్ధిక్షయములున్న చంద్రుడితో పోల్చటము సరికాదు !

తనివితీరా ఆ సౌందర్యమును చూసి అనుభవించవలసినదేగానీ లోకములో దానికి సరితూగు వస్తువేదీ లేదు కదా !

..

ఈ భూమి ఎంత అదృష్టము చేసుకున్నదో ఈ పురుషుడు తన మీద నడవడానికి ! బహుశా ఈయన నడకల వలననే ఇక్కడి పుడమికి పులకలు వచ్చి గడ్డిమొలచినట్లుగా ఉన్నది !

...

ఈతని దేహకాంతులు భరించలేక సూర్యుడు పైపైకి పోతున్నాడు !

...

ప్రాణములేని పగడములతో ఈతని అధర సౌందర్యము పోల్చటమెంతవరకు సబబు ?

...

అంబుధికన్నా లోతుగా ఆకాశముకన్నా ఎత్తుగా పెరుగుతున్న కామభావనలలో కప్పెట్టబడిపోయి చిత్తరువులా నిలుచుండిపోయింది శూర్పణఖ !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 107

(శూర్పణఖ హొయలు )

...

అరవిందాక్షుడైన ఈ సుందరపురుషుడి బాహువులలో ఒదగని బ్రతుకెందుకు ? 

మనసు తొందరపెడుతున్నది శూర్పణఖకు !

...

మరి ! ఈ రూపంలో తన వద్దకువెడితే కసిరివిసిరికొడతాడా పురుషపుంగవుడు ! వికారమైన ఈ రూపాన్ని చూసి ఏ మగవాడు మోహిస్తాడు ? అందుకే రూపం మార్చుకుంటాను !అని తనలో తను అనుకుని అపురూప లావణ్యంతో మిడిసిపడే ఒక స్త్రీరూపాన్ని ధరించింది ! 

..


మధురంగాపాడే పక్షిలాగ, విరబూసిన కల్పవృక్షంలాగ దానిమ్మపండురంగు పెదవులతో, నెమలిరంగుతో వయ్యారిభామలాగ ఆయన ముందుకు వెడతాను !

..

 

ఉండీ ఉండనట్లున్న నడుముతో పద్మములవంటి పాదములతో రాయంచనడకలు ,నెమలిహొయలు సంతరించుకుని వెన్నెలవెలుగులు వెదజల్లే తెల్లని విషకుంభము లాగ బయలుదేరింది ! 

..

దివినుంచి దిగివచ్చిన దేవకాంతవలె ఉన్నది శూర్పణఖ !

..

కరకంకణ నిక్వణాలు ,పదనూపుర నిస్వనాలు మధురమధురంగా వినవచ్చేటట్లుగా నడక సాగిస్తున్నది శూర్పణఖ !  

...

రామచంద్రుడి దృష్టి శబ్దం వినవచ్చిన దిక్కుగా మరలింది !

...

ఫలభారంతో వంగిన తరువులాగ వక్షోభారంతో వంగిన లేలేతనడుముగల ఒక స్త్రీ పాదమంజీరాల ధ్వని అది !

...

ఎవరీ లేమ ? ఈమె తనువంతా సౌందర్యసీమ ! ఎక్కడి స్త్రీ ఈవిడ ! దేవకన్యా? నాగకన్యా ? గంధర్వకన్యా ? ఎవరై ఉంటుంది ఈవిడ ? ఈ ఘోరారణ్యములో సంచరించే స్త్రీ ఎవరై ఉంటుంది ఇక్కడేమి పని ఈవిడకి ?

అని ఆలోచనలో పడ్డాడు రామచంద్రుడు !

..

నెమ్మదిగా రాముడిని సమీపించింది శూర్పణఖ ! చురకత్తులవంటి చూపులు విసిరి బెదిరే జింకవలె వచ్చి రామచంద్రుని ప్రక్కన నిలుచున్నది !

...

అమ్మా ! శుభాంగీ ఎవరు నీవు ? నీవెచటిదానవు ?నీవారెవ్వరు ? ఏ పనిమీద ఇచటకు వచ్చినావు అని గౌరవభావంతో ప్రశ్నించాడు రామచంద్రుడు !

...

మూర్ఖురాలైన శూర్పణఖ రామచంద్రుడి సౌందర్యాన్ని కనులతోనే జుర్రుకుంటూ ఇలా సమాధానమిచ్చింది !

....

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 108

(శూర్పణఖ కోరిక )

...

నేను త్రిలోకాధీశుడైన రావణుని చెల్లెలిని ! బ్రహ్మదేవుని మనుమడి కూతురుని ,కుబేరుడు నాకు అన్న ! నా పేరు "కామవల్లి" ! ....చెప్పింది శూర్పణఖ

...

నీవు రావణాసురుడి చెల్లెలు అయినచో రాక్షసస్త్రీవి ! మరి ఇంత దివ్యసౌందర్యము నీకెందువలన వచ్చినది ? నిజాయితీగా చెప్పు ! ప్రశ్నించాడు రామచంద్రుడు ! 

...

క్రూరుడు ,దుష్టుడు అయిన రావణుని చెంత జీవితం గడపడం ఇష్టం లేక ధర్మమార్గములో బ్రతకాలని నిశ్చయించుకుని ఇక్కడి మునులు ,ఋషుల సేవ చేసుకుంటూ మిగిలిన సమయంలో తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాను .. సాధుజనుల సేవ ,సజ్జన సాంగత్యము నా రూపు ను మార్చి వేశాయి ! అందుకే నాకు ఈ సుందరరూపము ! బదులు పలికింది శూర్పణఖ !

...

మరి ఒంటరిగా సంచరిస్తున్నావెందుకు ?

...

రాక్షసులతో కలవనప్పుడు ఒంటరితనమే కదా మిగిలేది !!!

...

నావలన నీకు ఏమి మేలు ఒనగూడాలో చెప్పు !!! ...రాముడు ప్రశ్నించాడు

...

రాముడి సమక్షములో రాముడినే చూస్తూ నిలుచున్న శూర్పణఖమీద మన్మథుడి శరముల తాకిడి హెచ్చింది !

..

 కనులు విప్పారుస్తూ ఒకసారి చికిలిస్తూ మరొకసారి , ఆహ్వానిస్తున్నట్లుగా చేతులను కదులుస్తూ మరొకసారి, పైట జారుస్తూ పెదవి నొక్కుతూ వికారపు చేష్టలు ప్రదర్శిస్తున్నది శూర్పణఖ !

...

సిగ్గు లజ్జ లేని స్వైరిణి ఈ స్త్రీ అని రాముడు నిర్ధారించుకుని నిశ్శబ్దంగా కూర్చున్నాడు .

..

రాముడి మౌనం చూసి శూర్పణఖ హృదయం వేగంగా కొట్టుకోవడం మొదలైంది ! తను వచ్చినపని సఫలమవుతుందో లేదో అనే అనుమనం హెచ్చింది ! 

..

నీలాంటి ఒకడు పుడమిమీద పుడతాడని నాకు ముందే తెలిసి ఉంటే నా యవ్వనం వృథా అయ్యేది కాదు నిరుపమానమైన నీ సౌందర్యం నన్ను నిలవనీయడం లేదు నీకైదండ నా తలగడగా అమర్చుకోవాలని నా కోరిక ! అని మదిలోని మాట బయటపెట్టింది శూర్పణఖ !

..

నీతినియమాలు ధర్మవర్తనము లేని స్త్రీ గా గ్రహించాడు రాఘవుడు ! ...ఓ పడతీ ! నీవు పుట్టిన వంశమునకు, నీ పూర్వీకుల చరిత్రకు అనుగుణముగా లేదు నీ మాటతీరు ! అయినా నీవు బ్రాహ్మణస్త్రీవి నేనో క్షత్రియుడను ! మానవులు రాక్షసులను వివాహమాడరాదు ....అని బదులిచ్చాడు రామచంద్రుడు !

....

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 110

( తిరస్కారం )


ఈ ఆడుది ఒక మోసగత్తె ! మాయలమారిది బహుశా ఒక రాక్షసి అయిఉండవచ్చును.

..

 కామరూపధారిణి కాకపోయిన ఎడల సృష్టిలో మునుపెన్నడూ నేనుగాంచని ఇంత అపురూపసౌందర్యంతో ఈ పడతి ఉండుట అసంభవం !

..

 కేవలం ఇచ్ఛారూపధారిణులయిన స్త్రీలు మాత్రమే ఇంతటి గొప్ప రూపం ధరించగలరు ! 

..

నాకు ఈవిడ వాలకము చూస్తే భయము కలుగుతున్నది కావున ఈవిడను ఇక్కడనుంచి పంపివేయుము ....అని శూర్పణఖ సీతమ్మను చూపుతూ రామచంద్రునితో పలికింది !

...

అలా పలుకుతూ సీతమ్మను చూసి ఓసిరాక్షసీ నీకిక్కడేమి పని నీ తావుకు నీవు వెళ్ళిపో అని పెద్దపెట్టున అరుస్తూ మీదమీదకు రాసాగింది ! 

..

శూర్పణఖ ను చూసి భయకంపిత అయిన సీతమ్మ పరుగున వచ్చి రాముడి బాహువులు ఆలంబనగా చేసుకొని నిలబడింది ! నల్లటివర్షమేఘమునకుమెరుపుఅంటినట్లుగా ఉన్నారు ఇరువురూ

...

రాక్షసుల ఎడ కించిత్ పరిహాసము కూడా పనికిరాదని అర్ధమయిన రామయ్య దృఢస్వరముతో ఆ రాక్షసిని హెచ్చరించాడు ...దుశ్చేష్టలు మాని వచ్చినదారిన మరలిపో నా సోదరుడు నిన్నిక్కడ చూడకమునుపే తిరిగివెళ్ళు లేని పక్షమున అతడు నీకు తీవ్రమైన దండన విధించగలడు !

...

నేనా ? మరలిపోవాలా ? నా సౌందర్యమును గాంచి ముల్లోకములలో మూర్ఛపోని వాడుండడు ! ఆ మాయావి కన్నా నేనెందులో తక్కువ ?

..

 రా ! నా చెంతచేరు దానిని విడిచిపెట్టు అని రాముని బ్రతిమిలిలాడుతూ సీతమ్మ ను బెదిరిస్తూ వస్తున్న శూర్పణఖ ను చూసి సీతారాములు దానిని పట్టించుకోకుండా తమ పర్ణశాలలోనికి వెళ్ళిపోయినారు .

..

ఆ నిర్లక్ష్యాన్ని భరించలేకపోయింది శూర్పణఖ !అవయవాలు పట్టుదప్పి ప్రాణం పోతున్నట్లుగా అయిపోయింది ! శ్వాస ఆడటం లేదు అక్కడే రాయిలా నిలుచుండి పోయింది చాలాసేపటివరకు !

...

ఈ కరిమబ్బువర్ణపు సుందరుడు వఠ్ఠి పనికిరానివాడు ! నీలకుంతల అంటే ఆ నీలమేఘశ్యాముడికి ఎందుకంత వలపో ! 

..

ఇక అక్కడ ఎక్కువ సేపు నిలబడలేక తన నివాసానికి మరలింది శూర్పణఖ !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 109

(రాముడి పరిహాసం )

...

రాముడిలో కాస్త పరిహాసం తొంగిచూసింది ! 

అవునూ ! నేను రాజవంశీకుడిని నీవు బ్రాహ్మణ వనితవు మనిద్దరికి పొత్తుకుదరదుకదా !! ఎట్లా ? 

..

లేదు లేదు ! మా తండ్రి వేదవేదాంగవేత్త అయిన బ్రాహ్మణుడే కానీ నా తల్లి మాత్రం రాజయిన సాలకటంకటుడి కూతురు అరుంధతీదేవి అంతటి పవిత్రమైనది !

..

రాముడప్పుడు కాస్త పరాచకమాడినాడు ! 

పెద్ద చిక్కే వచ్చిపడినది కదా ! మానవులు రాక్షసకాంతలని వివాహమాడరాదని పెద్దలు చెప్పగా విన్నాను నేను ! 

...

శూర్పణఖ తనలో తాను అనుకొన్నది ! అయ్యో ! రావణుని చెల్లెలను అని అనవసరంగా తొందరపడి చెప్పినానే !

ఎదురుగా ఉన్నవాడు శ్రీమహావిష్ణువంత అందంగా ఉన్నవాడు ! అతని పొందుదొరకని బ్రతుకూ ఒక బ్రతుకేనా అని మథన పడింది !అయినా ప్రయత్నం మానలేదు ! ....నేను నిన్ను పెళ్ళి చేసుకుంటే మా అన్నలు సగౌరవంగా ఆశీర్వదిస్తారు ! వారికి ఏ విధమైన అభ్యంతరము ఉండదు !

..

ఓహో బాగున్నది ! నీతో వివాహం నాకు లాభదాయకమంటావు ! ఒక ప్రక్క త్రిలోక విజేత రావణుడి అభయము మరొక ప్రక్క విశ్వంలోని అతిపెద్ద ఐశ్వర్యవంతుడు కుబేరుడి అండ లభిస్తుందంటావు!!! ...మరికొంత పరిహాసం తొంగి చూసింది రామయ్య మాటల్లో !

...

ఇంతలో సన్నజాజితీవలాంటి నారీశిరోమణి !ఒక సౌందర్యవతి మెరుపులీనే మేనితో పర్ణశాలలోపలినుండి వచ్చి రామయ్య చెంత నిలుచున్నది ! సొగసైన ఆ జంటను బ్రహ్మదేవుడు కూడా కనులు విప్పార్చి చూస్తాడు ! 

...

ఆమె సౌందర్యాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూసింది శూర్పణఖ !

...

ఓ ! ఈతడు తన భార్యతోటి ఉన్నాడన్నమాట ! ఎంత అందంగా ఉన్నది ఈ పడతి ! పద్మాన్ని విడిచి ఈ పురుషుడితో జీవించవచ్చిన పద్మగంధి ఈవిడ ! సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి కాదు కదా !

..

బహుశా బ్రహ్మదేవుడు తన సృష్టిలో ఇంతకు మించిన అందమైన జంటను వీరికి ముందు వీరితరువాత పుట్టించి ఉండడు గాక ఉండడు ! ఈ జంటయే మొదటిది చివరిది !  

..

ఒక ఆడుదానిని అయి ఉండి ఈమె సౌందర్యాన్ని చూస్తూ నేనే చూపు త్రిప్పుకోలేక పోతున్నాను ! ఆ అందానిని వర్ణించడానికి నాకు భాష రాదు ! అంత భాష ఎవరివద్దనూ ఉండదు !

...

అయినా ! ఈమె అతని భార్య ఎందుకయి ఉండాలి ? నాలాగా ఈ సుందరాకారుని మోహించి వచ్చిన మరియొక స్త్రీ అయి ఉండవచ్చు కదా .....ఊహలలోకి వెళ్ళిపోయింది శూర్పణఖ

....

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 112

(ముక్కు చెవులు కోయుట )


సీతమ్మ వైపు అడుగులువేస్తూ ఆవిడను పట్టుకోవాలని చేతులు చాచి గబగబ వెళుతున్న శూర్పణఖని చూశాడు లక్ష్మణుడు !

..

తను చేస్తున్న పనిని వదిలి పెట్టి ఏయ్ ఆగాగు అని గద్దిస్తూ ముందుకు ఉరికి వస్తున్నాడు ! 

వస్తూనే దాని జుట్టుబట్టుకొని లాగి ఒక్కతన్నతన్నాడు ! లక్ష్మణుడిని చంకలో ఇరికించుకొని పైకి ఎగరాలని చూసింది శూర్పణఖ ! దాని ఆలోచన గ్రహించి క్రింద పడద్రోసి కాలితో అదిమిపట్టాడు లక్ష్మణుడు .

...

 సర్రున కత్తిదూసి మెడనరకబోయి ఆగాడు ! స్త్రీ ని చంపటం పాపమని భావించి దాని ముక్కు, చెవులు ,స్తనాగ్రాలను కోసి వేశాడు .

...

బాధతో ఆ రాక్షసి వేసిన కేకలు ఆకాశానికి తాకాయి .ఆ రాక్షసి ముక్కునుండి రక్తం ఏరులై పారింది .

...

రావణుడి తల ఎగురకొట్టడానికి నాందిగా శూర్పణఖ ముక్కు చెవులు తెగగొట్టబడినాయి !

...

భయమంటే ఏమిటో తెలియని రాక్షసజాతిలో పుట్టిన స్త్రీ కి వెన్నులో చలి పుట్టించాడు ఇనవంశోద్భవుడు !

...

ఒక గుడ్డతో ముక్కును అదిమిపట్టింది ,తన వికారరూపాన్ని చూసుకున్నది !పడుతూలేస్తూ పరుగులు పెట్టసాగింది !

..

గాయాల తిమ్మిరితో తన బంధువర్గంలోని రాక్షసవీరులందరినీ పేరుపేరునా పిలుస్తూ గావుకేకలు వేయసాగింది .

...

ఏ రావణుని బాణపు దెబ్బకు భయపడి దేవేంద్రుడు పారిపోయినాడో  

ఏ రావణుని వలన కైలాసం ఎత్తబడెనో 

ఏ రావణుని కి శివుడు తన చంద్రహాసఖడ్గాన్ని బహుకరించినాడో 

ఏ రావణునికి దడిసి ముల్లోకాలలోని మునులు దేవతలు ముక్కుమూసుకొని కూర్చున్నారో 

...

నేడు ఆ రావణుని చెల్లెలుకు ఈ దీన స్థితి ప్రాప్తించుటయా ?

..

ఓ ఖరా ! హరుని కూడా యుద్ధములో ఎదిరించినావే 

ఎక్కడున్నావు నీవు ! రా ! వచ్చి చూడు ఈ శూర్పణఖ దీనస్థితి !

.

అని బిగ్గరగా కేకలు వేస్తూ రాముడి పర్ణశాల చుట్టూ పరుగులు పెడుతున్నది శూర్పణఖ

....

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 111

( విరహం )


...

తన తావుకు వెళ్ళిందన్నమాటేగాని తన తనువునిండా ఎగసిపడుతున్న కామజ్వాలలను అదుపు చేయలేక పడుకొని అటు ఇటుదొర్లుతున్నది శూర్పణఖ ! 

..

కాలనాగు కాటేయగా ఆ విషము తలను చేరి బాధభరించలేక సతమతమవుతున్నవానిలాగ నేలమీద చుట్టలు చుట్టుకొని దొర్లుతున్నది ! 

..

మన్మథుడిని నమిలివేయాలని చందురుడిని చిదిమివేయాలని పళ్ళుపటపట కొరుకుతున్నది ! కానీ ఇప్పుడు అశక్తురాలు ! వంట్లోని బలము ఉత్సాహము ఆతని తిరస్కారము చేత అడుగంటిపోయినాయి !

..

శూర్పణఖ వంటినుండి వెలువడే వేడివేడి సెగలను ఆర్పడానికి మంచుగడ్డలు తెచ్చి మీద ఉంచారు సేవకులు. కానీ అవి కాలే పెనంమీద వేసిన వెన్నముద్దవలే కరిగిపోతున్నాయి !

...

ఆడుసర్పము లాగ బుసలుకొడుతున్నది శూర్పణఖ ,తిరస్కారం భరించలేకపోతున్నది !

..

మలయపవనాలు ,శీతలోపచారాలు ,చల్లనిగంధపుమైపూతలు శూర్పణఖ శరీరపు వేడిని ఏమాత్రం తగ్గించలేక పోయాయి.

...

తన చలువరాతిభవనములో, స్ఫటిక మందిరములో కాలుగాలిన పిల్లిలా తిరుగాడుతూ నీలపు రంగులో కనపడిన ప్రతి స్తంభాన్ని రాముడనుకొని గాఢంగా కౌగలించుకుంటున్నది . దీనాతిదీనంగా బ్రతిమిలాడుకుంటున్నది 

...

ప్రళయాగ్ని జ్వాలలు చుట్టుముట్టి దిక్కతోచక తిరుగాడే దానివలె అటునిటు వేగముగా పరుగులు పెడుతున్నది శూర్పణఖ !

...

పోతేపోనీ వెధవప్రాణం! ఆ రాముడి పొందులేని బ్రతుకెందుకు అని కలవరిస్తూ కలతనిదురలోనే ఆ రాత్రి గడిచిపోయింది శూర్పణఖకు ! 

...

తెలతెలవారింది ! ఒకటే లక్ష్యం రాముడి పొందు ! అందుకు అడ్డం ఆ సౌందర్యరాశి ! ఈ రోజే ఆవిడను అంతం చేయాలని నిశ్చయించుకుని బయలుదేరింది 

...

రామచంద్రుడు సంధ్యావందనమాచరిస్తున్నాడు.

లక్ష్మణుడు ఎక్కడా కానరాలేదు ! 

సీతమ్మ రాముడికి కొంచెం దవ్వులో ఉన్నది !

...

ఇదే సమయమనుకొని సీతమ్మకు వెనుకవైపు చేరి గబగబ సీతమ్మ వైపు దుష్టపు ఆలోచనలతో అడుగులు వేసింది .

..

దూరంగా చెట్లతోపులో పండ్లు సేకరిస్తున్న లక్ష్మణస్వామి ఇది గమనించాడు...

...

వూటుకూరు జానకిరామారావు

...: కంబరామాయణం 114

(శూర్పణఖ బెదిరింపులు)


లక్ష్మణుడి మాటలు పూర్తిగాకముందే తాను మాట్లాడటం మొదలుపెట్టింది శూర్పణఖ ! 

...రాముడినుద్దేశించి ఓరాజా !

ఏ స్త్రీకయినా తాను వలచినవాడికోసం ఇంకొక స్త్రీ పోటీపడితే గుండెమండిపోతుంది .పోటీకి వచ్చిన స్త్రీ అడ్డు తొలగించుకోవాలని అనుకోవడం సహజం ! నేను అదే పని చేశాను .

...

అంత రాముడు శాంతగంభీరంగా ..‌ఓ వనితా ! మా రాకకు, మేమిచ్చట నివసించడానికి గల కారణం చెపుతాను విను . ఇచ్చట స్వేచ్ఛగా సంచరిస్తూ తాపసులను నానాక్షోభలకు గురిచేసే దుష్టరాక్షససంహారం మా లక్ష్యం కావున అనవసరపు మాటలు ,పనికిరాని చేష్టలు మాని నీవిచ్చటనుండి దూరంగా వెళ్ళిపో ! నీకు నీవారికి మేలు చేసినదానివవుతావు .

..

రాముని మాటలాలకించిన శూర్పణఖ ...ఓ! అంతటి మగధీరులా మీరు ! సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సైతం తలవంచి గౌరవించే రావణుడికి సవాలు విసరగల మగటిమి గలవారా ? ఏమనుకుంటున్నారు మీరు రావణుని గురించి ! ఆయన త్రిలోక విజేత . ఆయన చెల్లెలికి అపకారం చేసిన మిమ్ములను ఊరికే వదిలిపెడతాడనుకున్నారా ? చిత్రవధచేసి చంపుతాడు .ఆయన క్రోధాగ్ని జ్వాలలలోపడి 

నీవు నీవంశము సమూలంగా నాశనమవుతాయి 

..

రా ! నాతో సుఖించు, భోగించు ,తనివితీరా అనుభవించు ! రావణుని అభయహస్తం నీకు లభించేటట్లు నేను చేస్తాను .తద్విరుద్ధముగా జరిగినదా ? ముల్లోకములలో కూడా నీ మొర ఆలకించువాడొక్కండునూ ఉండడు .

...

శీలవతులైన పడతులు తమ గొప్పతనాన్ని తాము చెప్పుకోరు ,కానీ నీమీద గల ప్రేమతో నేను చెపుతున్నాను విను . నీ తమ్ముడికి కూడా చెప్పు దేవతలు సైతం ఊడిగం చేసే అత్యంత శక్తివంతుడైన ప్రభువు రావణబ్రహ్మ ! ఆతని చెల్లెలును నేను ! 

..

స్వర్గములో క్రీడించాలని ఉన్నదా? రా ! తీసుకువెడతాను ! పుడమి మీద కల సర్వశ్రేష్ఠమైన మధురఫలాలు భక్షించాలని ఉన్నదా ? అయితే నీ కోరిక నేను తీరుస్తాను !

వేయి మాటలేల ! నాతో ఉంటే ఇది ఉన్నది అది లేదు అనేది ఉండనే ఉండదు .

.‌

ముల్లోకాలలో నా వంటి స్త్రీ నీకు దొరకదు .గొప్పవంశము ,అరుదైన అందము,అమితమైనబుద్ధి ,అంతులేనిశక్తి ,నిత్యయవ్వనము ఇన్నిటిని ఒక్కదగ్గరచేరిస్తే "నేను ".

.‌

ఇప్పుడు నా ముక్కు చెవులు పోయి వికారరూపిణిని అయినానంటావా ? వాటిని తిరిగి తెచ్చుకోవడం నాకు చిటికెలోని పని . 

..

వచ్చిన అవకాశం చేజార్చుకోకు ఇక నేను మన్మథుని శరాలకు తాళలేను రా ! సుందరా రా ! మూర్ఖుడివి కాబోకు అని వదరుతున్న శూర్పణఖ ను చూసి రామచంద్రుడిలా అన్నాడు

..

దుష్టాత్మురాలా ! వెళ్ళు ఇక్కడనుండి ! వేయిఏనుగుల బలంతో మదించి తిరుగాడే తాటక గుండెలు బ్రద్దలుకొట్టిన బాణాలు ఇంకా నాతోనే ఉన్నాయి వాటి ములుకులకు అంటిన రక్తపు తడి ఇంకా ఆరలేదు వాటికి నీవు బలికావద్దు ,వెళ్ళిపో ! పాపపు ఆలోచనలు మాని వెళ్ళిపో !...

.

ఇక్ష్వాకుల ధీశక్తి ,భుజశక్తి ,తపోశక్తి నిన్ను దహించకమునుపే వెళ్ళిపో ! అని పలికాడు రాఘవుడు !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 113

(శూర్పణఖ విలాపము )

...


పిచ్చిపట్టినదానిలా పర్ణశాల చుట్టూ తిరుగుతున్నది ! గాయాలబాధకు పెద్దపెద్దగా కేకలు వేస్తూ రాక్షసవీరులను తన రక్షణకొరకు పిలుస్తూ పరుగులుపెడుతున్నది .

.

ఖరదూషణులను శాపనార్ధాలు పెడుతూ తనను కాపాడమని ఎలుగెత్తి అరుస్తూ పర్ణశాల మెట్లమీద జుట్టువిరబోసుకొని అడ్డముగా కూర్చున్నది శూర్పణఖ !

...

రాత్రి అంధకారాన్ని కూడా చీల్చివేయగల తళత్తళల కత్తులు ఉన్నది మీమీ ఒరలలో ఉంచుకోవడానికి కాదు , రండి ఈ నరాధములను కత్తికొక కండగా చీల్చివేయండి ఓ రాక్షస యోధులారా !అంటూ గావు కేకలు పెడుతున్నది .

...

గోదావరి నదికి వెళ్ళి స్నాన సంధ్యావందనాదులు పూర్తిచేసుకొని రామచంద్రుడు పర్ణశాలకు తిరిగి వచ్చాడు .

...

ఒక కంట రాముడి రాకను గమనించి తన స్వరాన్ని పెంచి పెద్దగా ఏడుస్తూ ....శృంగారవీరా వచ్చావా ! నా ప్రేమవ్యాధికి పెను ఔషధమా వచ్చావా ! ఇదుగో చూడు భుజబలగర్వంతో నీ తమ్ముడు చేసిన పని చూడు ! అంటూ వలవల ఏడుస్తూ రాముడికి మొరపెట్టుకున్నది !

...

వికారరూపముతో తన ముందు నిల్చిన స్త్రీ ఎవరో రాముడు గుర్తు పట్టలేదు !

...

ఎవరు నీవు ? అని అడిగాడు !

...

నన్ను గుర్తుపట్టలేదా నీవు ! నిన్ననే వచ్చి నీ పట్ల నాకు గల ప్రేమను వ్యక్తపరచినాను కదా ! అప్పుడే మరచిపోయినావా ! అని పలికింది శూర్పణఖ !

..

ఓహ్ నీవా ! ఆ విలాసినివి నీవేనా ?అప్సరసలను సైతం తలదన్నే ఆ సౌందర్య మేది ?ఈ వికారరూపమెటుల ప్రాప్తించినది నీకు ! ...అని అడిగిన రామచంద్రుని వైపు కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ చూసి ...ఇదుగో నీ తమ్ముడు నా ముక్కు చెవులు కోసివేసినాడు ! ఇంకెక్కడి సౌందర్యము ! ఇదుగోచూడు అంటూ రక్తమోడుతున్న వక్షోభాగాన్ని కూడా చూపింది శూర్పణఖ !

...

రామచంద్రుడు ప్రశాంతంగా తమ్ముని వైపు చూసి ,లక్ష్మణా ! ఈ స్త్రీ చేసిన నేరమేమిటి ? ఈ శిక్ష విధించావు !! అని అడిగాడు !

..

అన్నా ! ఈ స్త్రీ ఇచటికి ఆహారాన్వేషణకు వచ్చినదో లేక ఎవరైనా దురాత్ములచేత ప్రేరేపింపబడి వచ్చినదో తెలియదుగానీ వచ్చీ రావడమే వదినగారికి హానికలిగించు ఉద్దేశంతో ఆవిడ వెనుకగా వెళ్ళి ఆవిడను పట్టుకొని వెళ్ళడానికి ఉద్యుక్తురాలైనది! నేనది చూసి వారిస్తున్నా వినకుండా కదిలింది.....అంటూ చెపుతున్న లక్ష్మణస్వామి మాటలకు అడ్డం వచ్చింది శూర్పణఖ !

....

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 115

(శూర్పణఖ నిష్క్రమణం )


...

రాముడు గద్దిస్తున్నా వినకుండా అలాగే నిలబడి ఓ రామా ! నీకు నన్ను పెళ్ళిచేసుకోవడం కుదరకపోతే నీ తమ్ముడినైనా చేసుకొమ్మని చెప్పు !

...

ఓహ్ ! ముక్కు చెవులు లేనిదానితో ఎలా కాపురం చేస్తాడని సందేహించకు ! నడుములేని దానితో నీవెలా కాపురం చేస్తున్నావో అలాగే చేస్తాడతడు ! లేదంటావా ? మా రాక్షసుల చేతిలో మీకు చావు తప్పదు అని హెచ్చరించింది

..

నిర్భయంగా, నిర్లజ్జగా బెదిరిస్తూ మాట్లాడుతున్న శూర్పణఖను చూసి రాముడు ...." ఎంతమందిని వెంటబెట్టుకొని వస్తావో రా ! నీ కనులముందే వారిని యమపురికి సాగనంపుతాను....అని అన్నాడు.

..

రాముడి హెచ్చరికలను లక్ష్యపెట్టక తన కామవికారాన్ని ,సీతమ్మను భయపెట్టడమూ కొనసాగిస్తూనే ఉన్నది శూర్పణఖ !

...

దాని వైఖరికి విసుగూ కోపము కలగలిసిపోగా అన్నను చూసి లక్ష్మణుడు ," అన్నా అనుమతి ఇవ్వు ! ఈ రాక్షసికి మరణదండనే సరి అయినది ,ఇప్పుడే దీని కుత్తుక తెగనరుకుతాను . దీనిని చంపకుండా వదిలిపెడితే ఇది మనకు కలిగించే హాని ఊహించలేము" అని పలికాడు

..

ఆ మాటలకు రాముడి ముఖం వైపు చూసింది శూర్పణఖ ! అన్నదమ్ములిద్దరూ తన పట్ల ఇక ఏ మాత్రమూ కనికరము ప్రదర్శించరని దానికి అర్ధమయ్యింది ,వెనువెంటనే క్షణాలలో అక్కడనుంచి మాయమయిపోయింది !

...

వెళ్ళటము వెళ్ళటమే తన వికారరూపముతో ఖరుడిపాదాలవద్ద పెనుమేఘంలాగా రాలిపోయింది .కన్నీటితో ఖరుడి పాదాలను కడిగివేసింది .

 గుండెలనే పెద్ద డోలుగా చేసి బాదుకుంటూ ఏడుస్తుంటే ప్రళయవేళలో నరసంహారానికి బయలుదేరిన యముడి భటులు చేసే శబ్దంలా దశదిశలా వ్యాపించింది !

కార్చిచ్చును తప్పించుకోలేక దొర్లుతున్న పెద్ద కొండచిలువలాగ అటుఇటూ నేలమీద పడి దొర్లింది శూర్పణఖ !

...

శూర్పణఖ వేదనను రోదనను వికారరూపాన్ని చూసిన ఖరుడు ," ఎవరు ఒడిగట్టారీ దుస్సాహసానికి " అని ప్రశ్నించాడు !

...

వారు మునివేషంలో ఉన్న మహావీరులు ! ఇద్దరు అన్నదమ్ములు మన్మథాకారులు ! వారితోటి ఒక స్త్రీ ! ఆమె సౌందర్యము ఇంత అని వర్ణించలేనంత ! ఆమె రాక్షససార్వభౌముడి వద్ద మాత్రమే ఉండటానికి అర్హురాలని తలచి నేనామెను ఎత్తుకొని తీసుకు రావడానికి ప్రయత్నించగా ఆ అన్నదమ్ములు నాకీ దుస్థితి ప్రాప్తింపజేశారు .....నేను ఖరుడి చెల్లెలిని ,త్రిలోకవిజేత రావణుడు మా అన్న అని చెప్పినా వారు లక్ష్యపెట్టలేదు !

...

వారు దశరథకుమారులు...

...

అని ఖరునికి తెలిపింది శూర్పణఖ !

....

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 116

( మొదలైన సంహారం )


...

రక్తమోడుతూ భయంకరంగా ఉన్న శూర్పణఖ ముఖం చూశాడు ఖరుడు .కనులనుండి క్రోధంతో రక్తాశృకణాలు జలజలరాలాయి.

..

నాకా నరాధములను చూపు ఇప్పుడే కత్తికొక కండగా నరికి కాకులకు గద్దలకు ఆహారంగా వేస్తాను .నడువు అంటూ బయలుదేరాడు ఖరుడు.

...

ఖరుడి యుద్ధోత్సాహము చూసిన పదునాల్గుమంది అనుచరులు వెనువెంటనే అతని వద్దకు వచ్చి ,ప్రభూ ! నీవెందుకు వెళ్ళటము ! వారేమైనా దేవతలా లేక గంధర్వులా ? ఇద్దరు మానవమాత్రులను మట్టుపెట్టడానికి నీ అంతటివాడు పూనుకోవాలా ! 

..

రెప్పపాటుకాలం లో ఆ అన్నదమ్ములిరువురినీ వారి కుత్తుకలు తెగగోసి చంపి వేడివేడి రక్తము త్రాగి ఆ సుందరాంగిని తెచ్చి మీ ముందుంచుతాము అని పలికి శూర్పణఖ వెంటరాగా రాముడి పర్ణశాల వైపుగా కదిలారు.

...

వారి చేతులలో గద ,చక్రము వంటి ఆయుధాలు బరువైన విల్లమ్ములు ఉన్నాయి . ఒక్కొక్కడు ఒక మేరుపర్వతమంత ! పర్వతశిఖరాలనుకొని మేఘాలు వారి శిరస్సులపై కిరీటాల వలె నిలుచున్నాయి .

...

పర్ణశాలముందు ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చున్న పద్మదళాయతాక్షుడిని చూపి అదుగో అతనే రాముడు ! ఇంచుమించుగా అతనిలాగనే ఉన్న ఆ స్వర్ణదేహుడు లక్ష్మణుడు ! అని తనతో వచ్చిన యోధులకు చూపింది శూర్పణఖ !

...

వారంతా పెద్దపెట్టున అరుస్తూ రామలక్ష్మణులను మండలాకారంలో చుట్టుముట్టారు.

...

వదినగారిని జాగ్రత్తగా సంరక్షించమని లక్ష్మణస్వామి కి చెప్పి తాను పర్ణశాల బయటకు కదిలాడు రాముడు ! 

...

పర్వతమంత ధనుస్సు, అక్షయతూణీరముతో సింహంలా కదిలివస్తున్న రాముడిని చూసి రణోత్సాహంతో పెడబొబ్బలు పెట్టారు వారంతా !

...

ఒక మైదానప్రాంతంలో నిలుచున్నాడు రాముడు, ఆయనను చుట్టుముట్టి పదునలుగురు మహాకాయులైన యోధులు ! 

...

ఆయుధాలు చేతబూని పైకెత్తి రాముడివైపుగా కదలివస్తున్న ఆ వీరులు ఒక్కసారిగా ఉలికిపడ్డారు . తమతమ చేతులు రెండరెండుగా ఇరవైఎనిమిది చేతులు తమతమ దేహాలనుంచి వేరుచేయబడి భూమిమీద పడి ఉన్నాయి ! అవి ఎప్పుడు తెగి అవతల పడినాయో వారే గుర్తించలేనంత వేగంగా పడిపోయాయవి ...

...

తమ బాహువులు తెగగొట్టబడినా లెక్కచేయక తమ దేహాల క్రింద రాముడిని నలిపివేయాలనే ఊహతో కదిలి క్రమ్ముకంటూ వస్తున్న వారిని చూసిన రాముడు తన ధనుస్సునుండి ఒకేసారి పదునాలుగు బాణాలు సంధించి వదిలిపెట్టాడు.

గాలిని కోసుకుంటూ వచ్చిన ఆ నిశితశరాలు వారి శిరస్సులను వారివారి మొండెములనుండి వేరు చేశాయి.

...

రాముడి రణకర్కశత్వాన్ని కనులారాగాంచిన శూర్పణఖ మగ ఏనుగులను సింహం వేటాడగా చూసి భయవిహ్వలయైన ఆడుఏనుగు పరుగెత్తినట్లుగా పరుగులుపెట్టి ఖరుడిముందు నిలుచుంది !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 118

( రణకర్కశ రామ్ రామ్ )


..

రాక్షససైన్యం చుట్టుముట్టగానే చటుక్కున ధనుస్సువంచి చిటికెలో శరసంధానం గావించాడు రామచంద్రుడు.

వందలు వేలు పుంఖానుపుంఖాలుగా బయల్వెడలుతున్నాయి రాముడి ధనుస్సు నుంచి పదునైన బాణాలు .

.

వాడిగా ఉన్నబాణపు దెబ్బలకు వేడివేడి రక్తం చిమ్మించి కొడుతున్నది ఖరుడి సైనికుల శరీరాలనుండి .

..

పరుగులుతీస్తున్న గుర్రాలు నేలమీద కూలాయి ,అసంఖ్యాకమైన ఏనుగులు పెద్దపెద్ద కొండలవలె భూమిపై పడిపోయాయి .

..

క్షణకాలంలో అందరి చేతులలోని ఆయుధాలు నేలపై రాలిపడిపోయాయి . ఇరుసులు విరిగిన రథములు ,కాళ్ళు విరిగిన గుర్రాలు ,తలలు తెగి నాట్యమాడే సైనికుల మొండెములు రణరంగంలో ఒక భయానక దృశ్యం నెలకొన్నది !

..

ధనుస్సు ఎటువంచుతున్నాడో, బాణములెప్పుడు తీస్తున్నాడో, వాటిని ఎప్పుడు సంధిస్తున్నాడో ,ఎప్పుడు వదులుతున్నాడో ఎవరికీ తెలియడం లేదు .రాముడి చేతిలో కవ్వంలాగ గిర్రున తిరిగే ధనుస్సును కూడా చూడటం సాధ్యపడటం లేదు ఎవరికీ .

..

సర్రున దూసుకొచ్చే బాణాలు, గిర్రున తిరిగే ధనుస్సు మధ్యలో కాంతిపుంజము ! ఇంతే ఇదే కనపడుతున్నది చూపరులకు !

..

రాముడి శరసంధాననైపుణ్యము చెప్పటానికి పోల్చతగినదేదీ లేదు .మెరుపుకంటే వేగంగా పిడుగులు రాలుతున్నట్లు శత్రుసైన్యం మీద బాణపు వర్షం కురియగా వారి రక్తం ఏరులై పారింది.

..

అంతటి విధ్వంసాన్ని ఎప్పుడూ రుచిచూసి ఎరుగని రాక్షసవీరులు ఒకరిచేయి మరొకరుపట్టుకొని ఒకదండలాగ రాముని చుట్టుముట్టగా వారిని మట్టుపెట్టడానికి రాముడికి అరనిముషం పట్టలేదు !

..

నదిగా పారుతున్న రక్తంలో ఏనుగుల మొండెములు తేలతూ వెళ్ళిపోతున్నాయి .కాకులు గుంపులు గుంపులగా వచ్చి చనిపోయిన రాక్షసుల కనుగుడ్లను అత్యంత ఇష్టంగా తినసాగాయి.

..

ఆయుధాలన్నీ ఎగిరిపోగా రాక్షసవీరులు కొండలలోని పెద్దపెద్ద బండరాళ్ళను పెకిలించి ఒక్కసారిగా రాముడిమీద విసిరితే అవి ఆకాశాన్ని కప్పివేసి ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి.

...

సూర్యకిరణాలస్పర్శకు ఎగిరిపోయిన చీకట్లవలె రామధనుర్విముక్తశరాలు ఆ బండరాళ్ళను ఎగురగొట్టి గాలిలోనే పిండిచేశాయి.

..

రాముడి బాణపు వేగం ఎంతగా ఉన్నదంటే ...రాక్షసుల దేహాలనుండి నుండి ఎగురగొట్టబడిన తలలు ఆకాశంలోకి లేచి పైనుండి తమతమ మొండెములు చేసే నృత్యాన్ని తమ కనులతో వీక్షిస్తున్నాయి.

..

సంహారం ఇంకా సాగుతున్నది !

...

వూటుకూరు జానకిరామారావు

: #కంబరామాయణం 117

( కదిలిన ఖరుడి సైన్యం )


నిర్దాక్షిణ్యంగా జరిగిన రాక్షస సంహారం గురించి ఖరుడికి తెలిపింది శూర్పణఖ.

.

రాముడు వారిని ఎలా చంపాడో తెలుసుకున్న ఖరుడు ఒక్కసారిగా లేచి నిలుచుని పెద్దపెట్టున సింహనాదం చేశాడు .వాడి గర్జనలకు గుహలలోని సింహాలుకూడా బెదిరిపోయాయి.

.‌

తన రథాన్ని వెనువెంటనే సిద్ధం చేయమని సేవకులను ఆజ్ఞాపించాడు. 

...

కదిలాడు ఖరుడు!   

అతనివెనుక అపారసేనావాహిని కదిలింది.!

.

ఆ సేన పెద్ద మేఘముల సముదాయము వలె

పులుల గుంపులవలె

ఏనుగులమందలవలె కనపడుతున్నది

..

కొన్ని రథాలను సింహాలు

కొన్ని రథాలను ఎనుములు

మరికొన్నిటిని ఏనుగులు

ఇంకొన్నింటిని పులులు లాగుతున్నాయి .

యమకింకరులవలె కదిలారు ఖరుడి సైనికలు 

..

కత్తులు,గొడ్డళ్ళు ,కొడవళ్ళు,బరిశెలు,శూలాలు,ఖడ్గాలు,తోమరాలు,గదలు ,విల్లమ్ములు,పరిఘలు ఇలా సమస్త ఆయుధాలు ధరించి నడిచారు వారంతా !

...

పదునల్గురు సేనానాయకులు 

ఒక్కొక్కరి నాయకత్వాన లెక్కలేనంత సైన్యం ! 

...

క్రూరత్వానికి పరాకాష్ఠ అయిన ఆ సైనికులు ఒక్కొక్కడు ఒక్కొక్క పర్వతమంత ప్రమాణంలో ఉన్నాడు.

..

దేవాసురసంగ్రామాలలో పాల్గొన్న వారి వక్షస్థలాలన్నీ మానిన గాయాల గుర్తులతో వారి వారి వీరత్వానికి చిహ్నాలుగా నిలిచి ఉన్నాయి.

...

నల్లటి కాటుకకొండలాగ ఉన్న ఆ సైనికపటాలం ముందు కాలకూటవిషముకూడా తెల్లగా తేలిపోతున్నది.

..

పెద్దపెద్దగా వినిపిస్తున్న జ్యాటంకార ధ్వనులు ,రణన్నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగిపోతున్నది.

..

ఆ కోలాహలానికి భయపడిన పక్షులు గుంపులుగుంపులుగా లేచి రాముడి పర్ణశాల వెనుక వచ్చివాలాయి .

ఆయనే తమ రక్షకుడని తెలిసినట్లుగా !

...

పద్నాలుగు మంది రాక్షసులను మట్టుబెట్టి ఉప్పొంగే రణోత్సాహంతో "ఎవడొస్తాడో రండిరా " అని పిలుస్తున్నట్లుగా నిలుచున్న రాముడిని చుట్టుముట్టిందా సైన్యం !

..

వెనువెంటనే కవచం ధరించాడు రాముడు , అన్నా యుద్ధము నేను చేస్తాను అని ముందుకురుకుతున్న లక్ష్మణుడిని వారించి సీతాదేవి రక్షణబాధ్యతలు అప్పచెప్పి జూలువిదిలించిన సింహంలా కదిలాడు రఘువీరుడు

...

చేత వైష్ణవధనువు ,మూపున అక్షయతూణీరము నడుమున ఖడ్గము తో వీరమూర్తియై కదిలాడు రామచంద్రుడు.

..

అడుగో ! అతడే రాముడు ! చూపింది శూర్పణఖ !

...

అతడా! అతడిని చంపడానికి ఇంత సైన్యము అవసరము లేదు నేనొక్కడినే చాలు అంటూ ముందుకు కదులుతున్న ఖరుడిని చూసి అకంపనుడు అనే రాక్షసుడు వద్దని వారించాడు .

..

 అదుగో మేఘాలు రక్తాన్ని వర్షిస్తున్నట్లుగా ఎర్రగా మారాయి ,సూర్యుడిచుట్టూ కాంతిహీనమైన వలయాలు అలుముకున్నాయి ఇవి రాబోయే విపత్తుకు సూచన ! కావున నీవొక్కడివే కదలవద్దు అని హితవు పలికాడు .

...

అతని మాటలు విని హేళనగా నవ్వాడు ఖరుడు ! భుజాలు చరిచి రొమ్ములు చూపి బలప్రదర్శన చేశాడు.

..

రణసింగము రాముడిని రాక్షసులనే ఏనుగుల గుంపు చుట్టుముట్టింది !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 119

(దూషణ ,త్రిశిర సంహారం)

...


రాముడి బాణపు దెబ్బలకు తాళలేక పారిపోయే రాక్షసులను కూడగట్టుకొని బయలుదేరారు త్రిశిర,దూషణులు !

...

దేవతలతో సంగ్రామంలో కూడా మీరిలా పారిపోలేదే ? నేడెందుకిలా చేస్తున్నారు ! రండి రండి ఇతడు కేవలం మానవమాత్రుడు ! మీముందు నిలువలేనివాడు ఇతడు ! ఒక్కుమ్మడిగా ముట్టడించండి ఒక నిముషం పట్టదు అతనిని మట్టుపెట్టడం , అని ఎలుగెత్తి చెపుతూ వారిని ఉత్సాహ పరుస్తూ ముందుకు దూసుకు వచ్చాడు త్రిశిరుడు ! 

..

తన మీదమీదకు వస్తున్న త్రిశిరుడి రథచక్రాలు ధ్వంసం చేశాడు రాముడు .ఆ వెంటనే గాలిలోకి లేచిన వాడి కాళ్ళు రెండు బాణాలతో విరగగొట్టాడు .కాళ్ళు తెగి నేలమీద పడిపోతూ వాడు రాముడి మీద పడి ఆయనను నలిపివేయాలని చూడగా మూడు వాడిబాణాలతో వాడి మూడు శిరస్సులూ ఎగురగొట్టాడు రామచంద్రుడు !

..

త్రిశిరుడి సంహారాన్ని కనులారా గాంచిన ఖరుడి సోదరుడైన దూషణుడు కోపంతో కనులెర్రచేసి సైనికులను ఉత్సాహపరుస్తూ రాముడిమీద దాడికి దిగాడు .

క్షణాలలో వాడి సైన్యాన్ని బూడిదకుప్పగా మార్చివేశాడు శ్రీరాముడు.

..

దూషణుడు పర్వతాకారుడు ! వాడి రధానికి ఇరవైఅయిదు గుర్రాలు పూన్చి ఉన్నాయి . మహావేగంతో వస్తూ వాడు రాముడి నుదురు లక్ష్యంగా అత్యంతవేగంగా బాణాలు సంధించి వదిలాడు .

..

వాటిని మార్గమధ్యంలో తుత్తునియలు చేసి క్షణమాలస్యం చేయకుండా నాలుగునిశిత శరాలు వరుసగా వదిలాడు రాముడు .

..

మొదటిబాణం దూషణుడి రధచక్రాలను ధ్వంసం చేసింది ,రెండవది రధానికి కట్టిన ఇరవయిఅయిదు గుర్రాలను వరుసగా శిరస్సులను ఖండిస్తూ దూసుకుపోయింది ,మూడవది దూషణుడి ధనుస్సును విరగగొట్టగా నాల్గవది వాడి కవచాన్ని బదాబదలు చేసింది .

..

అద్భుతమైన రాముడి ధనుర్విద్యావిన్యాసాన్ని కనులప్పగించి చూస్తున్న దూషణుడి శిరస్సును ఆ వెంటనే వచ్చిన అయిదవ బాణం ఖండించివేసింది .

...

ఇక మిగిలినవాడు ఖరుడొక్కడే !

...

వూటుకూరు జానకిరామారావు

: కంబరామాయణం 120

( ఖరసంహారం )

...


రాముడి శరములు దూషణుడిని చంపటము కన్నులారా చూసిన ఖరుడు పట్టరాని కోపముతో రాముని ముట్టడించాడు ..

...

రథములు ,ఏనుగులు, గుర్రాలు నేల ఈనినట్లుగా వచ్చి రాముడిని చుట్టుముట్టాయి .

...

భూమ్యాకాశాలను బ్రద్దలు చేయగల రాముడి బాణాలకు ఎదురుగా ఉన్న సైన్యం పెద్దలెక్కలోనిది కాదు .

..

కనులుమూసి తెరిచేటంతలో తన సైన్యం మొత్తం శ్రీరామబాణాగ్నికి ఆహుతవ్వడం చూశాడు ఖరుడు .. కనులు నిప్పు కణాలు కురిపిస్తుండగా అతివేగంగా రామచంద్రుడిని బాణ వర్షంతో కప్పివేశాడు . 

...

ఖరుడు ధనుర్విద్యలో మహాపండితుడు రావణుడికి కుడిభుజము వంటివాడు ...

...

ఖర సంహారానికి తన చేతిలోని మామూలు ధనుస్సు సరిపోదని గ్రహించిన రాముడు వరుణుని స్మరించాడు .మరుక్షణం ఆయన కుడి చేతిలోనికి వైష్ణవధనుస్సు వచ్చి చేరింది ..

...

ఆ ధనుస్సునుండి వెలువడిన మొదటిబాణం అతివేగంగా వెళ్ళి ఖరుడి కుడి భుజాన్ని నరికి వేసింది . విజయసూచకంగా ధనుష్టంకారం చేసి నిలుచున్నాడు రామచంద్రుడు .

..

కుడిచేయిపోయినా ఏమాత్రం జంకకుండా ఎడమచేతిలో పొడవాటి రాయిని ఎత్తి రాముడిమీద విసిరాడు ఖరుడు ! రాముడి బాణపు దెబ్బకు అది మార్గమధ్యంలోనే తుత్తునియలయి నేలరాలింది .

...

ఇక ఆలస్యం చేయదలుచుకోలేదు రాముడు , యుద్ధాన్ని అక్కడితో ముగించాలని నిశ్చయించుకొన్నాడు.

..

కోరలుపీకినప్పటికీ కోపంతో బుసలుకొట్టే కాలనాగువలె నిలుచున్న ఖరుడి తలను ఒక నిశిత శరంతో ఎగురగొట్టాడు శ్రీరాముడు ...

...

ఉత్సుకతతో యుద్ధాన్ని తిలకిస్తున్న దేవతల ఆనందానికి హద్దేలేకపోయింది . ఎడతెగకుండా రాముడిపై పుష్పవృష్టి కురిపించారు .

...

తమ తపోదీక్షను భగ్నం చేసి తమను హింసించే క్రూరుడు ఖరుడు అంతమవ్వటంతో మునుల సంతోషం పరవళ్ళతొక్కింది .. రామచంద్రుడి చుట్టూ చేరి అభినందనలు, ఆశీస్సులు కురిపించారు ...

...

అప్పటివరకు సమీపంలోని కొండగుహలో లక్ష్మణుడి సంరక్షణలో ఊపిరిబిగబట్టి యుద్ధాన్ని చూస్తున్న సీతమ్మ పరుగుపరుగున వచ్చి రామచంద్రుడి శరీరానికి అంటిన రక్తపుమరకలను తనకొంగుతో తుడిచి ప్రేమపెల్లుబకగా తదేకంగా రాముడినే చూస్తూ ఉండిపోయింది .. లక్షణస్వామి అన్నగారి వళ్ళంతా శుభ్రంగా నీటితో తుడిచి వేశాడు ...

...

ఊహించని విధ్వంసాన్ని కనులారాగాంచిన శూర్పణఖ లంకలోని రాక్షసజాతిని అంతచేయడానికి కంకణం కట్టుకున్నదానిలా సుడిగాలివేగంతో లంకకు వెళ్ళింది ...

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 103

 కంబరామాయణం 103

( జటాయువు పరిచయం)


వీరులారా !ఎవరు మీరు ? అని అడిగాడు జటాయువు ! అందుకు ప్రతిగా " మేము దశరథచక్రవర్తి కుమారులము, పేర్లు రామ ,లక్ష్మణులు ! ఈమె నా భార్య సీత" అని బదులిచ్చాడు రామచంద్రుడు !

...

దశరథుని కుమారులని తెలియగానే పట్టరాని సంతోషంతో రయ్యిమని క్రిందకు దూకాడు జటాయువు ! తన రెండురెక్కలతో వారిని చుట్టేసి ఆలింగనం చేసుకున్నాడు !

...

తన ఛత్రఛాయలో లోకాలను చల్లగా పాలించే నా మిత్రుడు దశరథుడు క్షేమమే కదా ! అని ప్రశ్నించాడు జటాయువు !

...

తమ తండ్రి స్వర్గస్తుడయినాడని తెలిపాడు రామచంద్రుడు !

...

ఆ వార్త వినటంతోటే పిడుగుపాటుకు దెబ్బతిని నేలకూలినట్లుగా ఒక్కసారిగా పడిపోయాడు జటాయువు ,కనుల వెంట ధారాపాతంగా కన్నీరు కారుస్తూ పెద్దపెట్టున విలపించసాగాడు !

...

రామలక్ష్మణులు వెనువెంటనే ఆయనను లేవదీసి కనులనీరు తుడిచి దగ్గరకు తీసుకున్నారు !

...

ఓ రాజా ! ఓ చక్రవర్తీ ! అధర్మపరులకు అసత్యవాదులకు సింహస్వప్నమా ! నేడు నీవే స్వప్నమయి పోయినావా ! నాడు శంబరాసురునితో పోరుసలిపినప్పుడు ఒకరికొకరము బాసటగా నిలిచి రణములో నిలబడినామే ! నీ మరణవార్త తెలిసిన తదుపరికూడా నా కంఠములో ప్రాణమింకా నిలచియున్నదే ! ఏమి జన్మనాది ! అంటూ దుఃఖించసాగాడు జటాయువు !

...

కొద్దిసేపటి తరువాత నెమ్మదించి రామలక్ష్మణులవైపు చూసి నాయనలారా నాపేరు జటాయువు సూర్యభగవానుడి రధసారధి అరుణుడి పుత్రుడను ! నేను పుట్టి యుగాల గడచినవి ! నీ తండ్రికి నేను ప్రాణస్నేహితుడను ! నాకొక అన్నగలడు అతని పేరు సంపాతి ! నేను గరుడజాతి పక్షులకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు .

...

జటాయువులో తమ తండ్రిని చూసుకొని ఆనందించారు రామలక్ష్మణులు !

...

వారిరువురినీ కౌగలించుకొని ! నాయనలారా నా పుత్రులవంటివారు మీరు ! నా అంతిమసంస్కారములు మీరే జరిపించవలె ! అది నా కోరిక అని పలికిన జటాయువును చూసి ,తండ్రీ ! మా నాయనగారి మరణము నుండి కలిగిన దుఃఖము మా హృదయమునుండి ఆరిపోలేదు ! నీవు కూడా మమ్ములను విడిచి వెళ్ళినట్లయితే మాకిక దిక్కెవ్వరు ? అని కడుప్రేమతో పలికాడు రాముడు .


అంత జటాయువు రాముని జూచి ,నాయనా ! రాజ్యము నేలకుండా నీవు తాపసివేషములో అడవిలో సంచరించుటకు గల కారణమేమి అని ప్రశ్నించాడు 

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 102

 కంబరామాయణం 102

( జటాయువు )

...


మధురమనోహర రూపాన్ని తనివితీరా చూస్తూ "రామా" ! అంటూ తన్మయత్వంతో పిలిచారు అగస్త్యమహర్షి ! 

..

నాయనా ! ఇక్కడికి దగ్గరలోనే ఒక చిన్నపర్వతమున్నది ! సెలయేళ్ళు,మట్టిదిబ్బలు ,ఫలవృక్షాలతోపులతో మనోహరంగా ఉంటుందా ప్రదేశము ! 

..

 సీతమ్మ స్నేహం చేయటానికి అక్కడ రాయంచలు,రాచిలుకలు ఎన్నో ఉన్నాయి ! అక్కడ నివాసమేర్పరచుకొంటే బాగుంటుంది అని సూచించారు మహర్షి !

..

 ఆ ప్రాంతం పేరు పంచవటి

...

రాముడు మహర్షి వద్ద సెలవు తీసుకొని పంచవటి వైపు పయనం సాగించాడు !

...

సమున్నత పర్వతపంక్తులు ,వేగంగా పారే గొప్పనదులు దట్టమైన అరణ్యాలు దాటి నడుస్తున్నారు .

...

 ఒక కొండ మీద లేతబంగారు రంగులో ప్రకాశిస్తూ దివ్యకాంతులు ఆకాశంలోకి వెదజల్లుతున్న మరొక కొండ వారికి కనిపించింది ! 

..

అదేమిటో చూడాలనే కుతూహలంతో దగ్గరికి సమీపించారు వారు !

...

ఆ కొండ మరెవరో కాదు ! ఆకాశమంత విశాలమైన రెక్కలతో దివ్యప్రభలు వెదజల్లుతున్న ఒక గరుడపక్షి ! ఆ పక్షిపేరు జటాయువు ! సృష్టిలోని ఏ ప్రాణి చూడలేనంత దవ్వు తన చూపు ప్రసరించగల శక్తి ఆయన స్వంతం !

...

ఆ జటాయువు మెడలో  నవగ్రహాలను తలపించే నవరత్నాల మాల ధరించి ఉన్నాడు ! సూర్యుడే తన కిరీటమన్నట్లుగా ఠీవిగా కొండమీద ఆయన నిలుచున్నాడు ! ఆయన బరువు మోయలేక కొద్దిగా క్రుంగిపోయింది ఆ కొండ !

...

సూర్యభగవానుడి రధసారధి అరుణుడి( అనూరుడు ) కుమారుడు ఆయన ! 

ఇప్పటివాడా ఆయన ! ఎప్పటివాడో తెలియనంత పాతకాలము వాడు !

...

ఎవరై ఉంటారు ? తన నాశము కోరి మనలను సమీపించినవాడు కాకపోతే తప్పకుండా గరుడుడే అయి ఉంటాడు అని అనుకున్నారు రామలక్ష్మణులు !

...

సీతారామలక్ష్మణులను చాలాదూరం నుండి గమనిస్తున్నాడు జటాయువు !

..

 ఒకరు కాటుకకొండ మరియొకరు బంగరుకొండ ! వీరి కాలధూళికి కూడా సరితూగడా మన్మథుడు !


కాటుకకొండకు బంగరుమెరుపుతీగ చుట్టినట్లు అపురూపలావణ్యవతి అయిన స్త్రీ !

...

ఎవరు వీరు ?

...

వీరిని చూడగనే నా ప్రాణస్నేహితుడు దశరథుడు గుర్తుకు వస్తున్నాడే !!! అని తలపోశాడు జటాయువు !

....

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 101

 కంబరామాయణం 101

(అగస్త్యభగవానునిచే అస్త్రప్రదానము )

...

రామయ్యను చూడగనే అగస్త్యభగవానుడి ఆనందం అవధులు దాటింది ! 

ఆయన సామాన్యుడు కాడు ! సముద్రంలో దాక్కున్న అసురుల ఆచూకీ తెలియడం కోసం సముద్రాన్నే పుక్కిటపట్టిన అమిత తపఃసంపన్నుడు..వింధ్యపర్వత గర్వాన్ని అణచివేసినవాడు ! శివమహాదేవుడివలన ఉత్తరధృవము బరువై భూమి ఒరిగిపోతే తాను దక్షిణాన నిలుచుండి భూమియొక్క సంతులనాన్ని కాపాడినవాడు !

...

ఒక్కమాటలో చెప్పాలంటే మహావృక్షము దాగి ఉన్న మర్రివిత్తనము వంటివాడు అగస్త్యభగవానుడు !

...

అందరి అంతరంగాలలో కొలువైఉండి అంతటానిండి ఉండే సర్వవ్యాపకుడైన మహావిష్ణువు అవతారమైన రామచంద్రుడి కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నాడాయన !

...

ప్రపంచాన్ని పీడించే రాక్షసులనే విషానికి విరుగుడు రామచంద్రుడు ! ఆయనను సేవించిన మునులు ఆ విషము బాధనుండి విముక్తులైనారు !

...

తామరాకులనుండి నీటిబిందువులు జలజలరాలినట్లుగా రామచంద్రుని దర్శించగనే  తన కమండలములో కావేరిని దాచుకున్న అగస్త్యులవారి కనుకొలకులనుండి ఆనందబాష్పాలు అప్రయత్నంగా జాలువారాయి !

...

రామచంద్రుడు సీతాలక్ష్మి తో కూడి అగస్త్యులవారి పాదపద్మాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు !

...

ఆశ్రమం వేదఘోషతో ప్రతిధ్వనించింది !

..

దండకారణ్యంలో నివసించే నీవు నా వద్దకు వస్తావని ఎదురు చూస్తున్నానయ్యా రామా !

...

ఇదుగో ! నీకోసము ఈ ధనువు ! దీనిని స్వీకరించు !

ఇది విష్ణుభగవానుడి ధనుస్సు ! ఇదుగో అక్షయతూణీరము ! ఇదుగో ఎదురులేని అజేయ ఖడ్గము ! 

నీకు పాశుపతాన్ని కూడా ఇస్తున్నాను !

రామా ! ఎదురులేని ఈ అస్త్ర సంపద రాక్షస సంహారానికి నీకు ఉపయోగపడుతుంది అని అపురూపమైన అస్త్రసంపదను రామునికిచ్చారు మహర్షి !

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 100

 కంబరామాయణం 100

( దండకారణ్య నివాసము )


తపస్సాచరిస్తూ జీవించే మిమ్ములను కాపాడలేని నా ధనుస్సెందుకు ? నా ధనుర్విద్యానైపుణ్యమెందుకు ?

రాక్షసుడనేవాడు ఈ చుట్టుప్రక్కల కాలుమోపడానికి కూడా భయపడేలా చేస్తాను ! మీరు నిశ్చింతగా ఉండండి అని అభయమిచ్చాడు రామచంద్రుడు !

...

రామచంద్రా మా తోనే ఉండవయ్యా ! ఇక్కడే నీ అరణ్యవాసము పూర్తిచేయి స్వామీ అని మునులు ప్రార్ధించగా సరేనన్నాడు రామచంద్రుడు !

...

పది సంవత్సరాల కాలం గిర్రున తిరిగిపోయింది !

..

ఒకరోజున అగస్త్యభగవానుడిని కలవాలనే ఉద్దేశంతో బయలు దేరారు సీతారామలక్ష్మణులు !

...

సన్నటి అడవిదారులవెంట వెదురుపొదలను తప్పించుకుంటూ సాగుతూ సుధీక్షణ మహాముని ఆశ్రమం చేరుకున్నారు. 

..

రామచంద్రా నీ దర్శనమాత్రము చేత నా జన్మ తరించినదయ్యా ! అని సాదర స్వాగతం పలికారు మహర్షి ! 

..

మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశారు మువ్వురూ.

..

మహర్షి ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రికి అక్కడే విశ్రమించి మరునాడు అగస్త్యభగవానుడిని చూడాలనే ఆకాంక్ష వ్యక్తపరచాడు రామచంద్రుడు.

...

రామా ! నేను కూడా నీకు అదే విషయం చెబుదామనుకుంటున్నాను ,నీవే అడిగావు !

..

 ఆయనను చూసిన తరువాత ఇక నీవు చూడదగినది,చేరదగినది ఏవీ మిగలవు ! అంతటి మహాత్ముడాయన ! ఆయనకూడా నిన్ను చూడవలెనని ఆతురతతో ఉన్నాడు ! మీ ఇరువురి సమాగమం లోకకళ్యాణ కారకమవుతుంది వెళ్ళిరా నాయనా అని ఆశీర్వదించి పంపాడు మహర్షి !

..

మహావిష్ణువు లోకాలను తన పాదాలతో కొలిస్తే 

అగస్త్యుడు ద్రావిడభాషతో లోకాలను సుసంపన్నం చేశాడు !

....

సీతారామలక్ష్మణులు అగస్త్యాశ్రమం చేరుకున్నారు !

...

వూటుకూరు జానకిరామారావు

...

కంబరామాయణం 99

 కంబరామాయణం 99

( మునుల వేదన )

...


భారమైనహృదయాలతో శరభంగ మహర్షి ఆశ్రమం నుండి బయలు దేరారు మువ్వురూ !

...

సుందర పర్వతసీమలు ,మనోహర ఉద్యానవనాలు, కఠినశిలలు, ఉత్తుంగతరంగాలతో ఉధృతంగా ప్రవహించే నదీనదాలు, ఆకసం నుండి దూకుతున్నవా అన్నట్లున్న జలపాతాలు... ఎన్నింటినో దాటుకుంటూ వారి నడక సాగుతున్నది .

...

మునివాటికలకు చేరుకునే సమయానికి సూర్యుడు పడమటివైపు క్రుంగుతున్నాడు .

...

కార్చిచ్చులో కాలుతున్న అరణ్యంలో కారుమేఘాలు వర్షించినప్పుడు తిరిగి ఊపిరిపోసుకొన్న చెట్లవలే సీతారామలక్ష్మణులను చూడగానే ఆయాప్రాంతాలలో నివసిస్తున్న మునుల ప్రాణాలు లేచివచ్చాయి !

..

 క్రూరరాక్షసులు వారిని పెట్టే బాధలు చెప్పనలవిగాకుండా ఉన్నాయి . 

..

అడవిలో తప్పిపోయి విలవిలలాడే లేగదూడ తిరిగి తన తల్లిఆవును చేరినప్పుడు పొందే మనశ్శాంతి కనపడుతున్నది మునుల ముఖాలలో !

...

అడవిని విడిచిపెట్టలేరు, రాక్షసులను ఎదిరించనూలేరు ! వారి తపఃశక్తిని వృధాచేసుకొని రాక్షసులకు శాపమూ ఇవ్వలేరు ! ఇన్నాళ్ళకు వారి కష్టాలు కడతేరే మార్గం కనపడింది వారికి రాముని రూపంలో !

...

రామదర్శనమాత్రముచేత వారి హృదయాలు ప్రేమతో పొంగిపొర్లిపోయి రామయ్యమీద ఆశీస్సుల జడివానలు కురిపించారు  ! 

..

సీతారామలక్ష్మణులు బసచేయడానికి వీలుగా ఒక కుటీరాన్ని సిద్ధం చేసి వారికి అవసరమైన కందమూలఫలాలు అందించి అప్పటికి రాత్రి అయినది కావున రామయ్యను విశ్రమించమని చెప్పి వారివారి కుటీరాలకు వెళ్ళిపోయారు మునులంతా !

...

రాత్రిగడచి బాలభానుడి కిరణాలు పుడమిని తాకు సమయానికి స్నానసంధ్యాదులు పూర్తిచేసుకున్నారు రామలక్ష్మణులు !

మునులంతా వచ్చి వారి చుట్టూ కూర్చున్నారు ..

...

 రామచంద్రుడు వారినుద్దేశించి మాటాడుతూ ,ఆర్యులారా నేను చేయవలసిన కర్తవ్యాన్ని నాకు ఆదేశించండి అని పలికాడు.

...

జగద్రక్షకా రామచంద్రా ! ధర్మదూరులైన రాక్షసుల వలన మేము పొందే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు ! మమ్ములను మా తపస్సుకు దూరం చేసి అణచివేస్తున్నారు !పులల గుంపు మధ్యలో పడిపోయిన జింకలవలె అయినది మా పరిస్థితి ! ఎప్పుడు ఏమి జరుగుతుందో  తెలియకుండా ఉన్నది ! మా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని క్షణమొక యుగములాగ జీవిస్తున్నాము !

...

యజ్ఞములు లేవు ,వేదాధ్యయనము లేదు అన్నింటినీ ఆపివేసుకొని జీవచ్ఛవాలవలె నివసిస్తున్నాము ,చివరకు దేవేంద్రుడు సైతము వారి ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నాడు ! 

..

నీవుదప్ప మాకు వేరొండు దిక్కులేదు రామా! రక్షకా! మమ్ములను కాపాడు తండ్రీ అంటూ మొరవెట్టుకున్నారు మునులంతా !

....

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 98

 కంబరామాయణం 98

(పరమపదం చేరిన శరభంగ మహర్షి )


శరభంగ మహర్షి కుటీరములోనికి ప్రవేశించాడు రామచంద్రుడు !

(శరభంగ మహర్షి అనగా మన్మథుడి శరములను భంగము చేసి యుగముల పర్యంతము తపస్సునాచరించినవాడు )

...

రామచంద్రుడి దివ్యమంగళ విగ్రహాన్ని తనివితీరా చూసి పరవశత్వానికి లోనయి ఆయనను ప్రస్తుతించాడు దేవేంద్రుడు !

...

రామా ! వేదపురుషా ! జీవులలోని అంతఃప్రకాశము నీవే !బ్రహ్మాదిదేవతలు కూడా  తెలుసుకొనుటకు కష్టసాధ్యమయినవాడా ! ఆద్యంతరహితా !  నీకివే నా కైమోడ్పులు అంటూ నమస్కరించాడు దేవేంద్రుడు ! 

...

ఆ వెనువెంటనే మహర్షి వద్ద సెలవు తీసుకొని తిరిగి వెళ్ళిపోయాడాయన !

...

రామచంద్రుడు మహర్షికి సాష్టాంగ నమస్కారం చేశాడు.

...

మహర్షి ఆయనను లేవదీసి గాఢంగా తన కౌగిలిలో బంధించాడు !

..

తదుపరి సీతాదేవి, లక్ష్మణుడు కూడా కుటీరం లోనికి ప్రవేశించారు .

...

సీతారామలక్ష్మణులు ఆ రాత్రికి మహర్షి ఆశ్రమంలో విశ్రమించారు !

...

తెల్లవారింది ! సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకొని మహర్షి చెంతకు చేరారు వారు.

...

మహర్షి రామచంద్రుని చూచి ," రామా ! నీ సమక్షములో నా శరీరాన్ని యోగాగ్నిలో దగ్ధం చేసుకోవాలనుకుంటున్నాను అందుకు నన్ననుమతించవయ్యా " అని అడిగారు

...

నా సమక్షంలోనే ఎందుకు ? ప్రశ్నించాడు రామచంద్రుడు !

...

నేను వేలకొలది యజ్ఞాలు చేశాను యుగాలపర్యంతము తపమాచరించాను ! నీ రాకతో నాకున్న భవబంధాలన్నీ పటాపంచలైపోయినాయి ! ఇక నేనిక్కడ ఉండి చేయవలసిన పనులేవీ లేవు ! 

...

దేవేంద్రుడు వచ్చి సత్యలోకానికి రమ్మని బ్రహ్మదేవుడు పంపిన ఆహ్వానమందించాడు ! నేను చేరుకోవాలనుకున్నది పునరావృత్తిరహిత శాశ్వత పరమపదం ! కావున నాకు నీవు అనుమతినీయవలె అని అర్ధించాడు మహర్షి !

...

సీతారామలక్ష్మణుల సమక్షములో అర్ధాంగితో కూడి యోగాగ్నిలో భస్మమయి పోయి పరమపదం చేరుకున్నాడు మహర్షి !

...

మహావిష్ణువుకు గల వేల నామాలలో ఒక్కనామము పలికినా చాలు మనిషికి మోక్షం ప్రాప్తించడానికి ! మరి సాక్షాత్తూ ఆ మహావిష్ణువే తరలి తనముందుకు వస్తే తపస్సు ఫలించినట్లే పరమపదము సాధించినట్లే !!!!

....

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 97

 కంబరామాయణం 97

( శరభంగ మహర్షి )

...

దట్టమైన దండకారణ్యంలో నడకసాగిస్తున్నారు సీతారామలక్ష్మణులు .చాలా దూరం నడచిన తరువాత ఒక మనోహరమైన ప్రదేశం కనుపించింది వారికి .అందమైన చెట్లతోపులు ,సుందరజలపాతాలు కనువిందుచేసే పక్షితతులు నాట్యమాడే మయూరాంగనలు మధురంగా వినిపించే కోకిలమ్మపాటలు ! ప్రకృతి అంతా రసరమ్యంగా ఉన్నది !

...

ఎందుకు ఉండదూ ! అది మహాతపఃసంపన్నుడైన శరభంగమహర్షి ఆశ్రమమున్న తావు !

...

ఆశ్రమప్రాంగణంలోకి అడుగుపెడుతుండగా వారొక దివ్యపురుషుడిని చూశారు ! ఆయన శరభంగ మహర్షి ఆశ్రమంలోనికి వెళ్ళాడు ! త్రిమూర్తులకు తప్ప ఎవరికీ తలవంచని దేవేంద్రుడాయన !

..

బ్రహ్మదేవుడు పంపగా శరభంగమహర్షి వద్దకు వచ్చాడు దేవేంద్రుడు !

...

మహర్షికి వినయంగా నమస్కరించాడాయన ! తమ రాకకు కారణమేమిటి అని అడిగారు మహర్షి !

...

వేలసంవత్సరాల కఠోరమైన నీ తపస్సు తానుకూడా చేయలేనని భావించిన బ్రహ్మదేవుడు మిమ్ములను తన లోకానికి ఆహ్వానించారు మహర్షీ ! అని పలికాడు దేవేంద్రుడు !

...

దేవేంద్రా ! క్షణకాలంలో మాసిపోయి చిరిగిపోయే చిత్రాలవంటివి ఈ లోకాలు అనేవి ! నేనేమి చేసుకుంటాను వాటితో  ! బ్రహ్మలోక ప్రాప్తి కలిగినా ఒకటే నాకు కలుగకపోయినా ఒకటే ! ఎందుకు అన్ని లోకాలు ?నా తపస్సు ఎన్నోయుగాలనుండీ నడుస్తున్నది !

...

కాలానికి అతీతమైన ,మార్పులేనటువంటి , అనంతమైన ఒక దివ్యలోకం ప్రాప్తించాలని నా తపస్సు ! అని దేవేంద్రుడికి బదులిచ్చాడు మహర్షి

...

సీతారామలక్ష్మణులు అప్పుడే ఆశ్రమముఖద్వారం చేరుకున్నారు . వారికి లోపలనుండి ఎవరో మాటాడుకుంటున్న ధ్వని వినిపించింది !

...

రాముడొక్కడే లోనికి ప్రవేశించాడు ! సీతమ్మ ,లక్ష్మణస్వామి ఇరువురూ బయటనే నిలుచున్నారు .

...

వూటుకూరు జానకిరామారావు

కంబరామాయణం 96

 కంబరామాయణం 96

( విరాధ శాపవిమోచనం )

...

ఒక దివ్యపురుషుడు విరాధుడి కళేబరం నుంచి బయటకు వచ్చి ఆకాశాన నిలుచున్నాడు . అతడు కుబేరుడి శాపం కారణంగా రాక్షసరూపం ధరించిన గంధర్వుడు ! 

...

తనకు శాపవిమోచనం కలిగించినవాడు సాక్షాత్తూ వైకుంఠ వాసుడని ఎరిగిన విరాధుడు  రామచంద్రుని వేనోళ్ళ స్తుతించాడు !

...

శ్రీరఘురామా సీతారామా !

జయరఘురామా జానకిరామా!

 నను కరుణతో బ్రోచిన కమనీయ నామా రామా ! 

నీ దివ్యపాదారవిందాలు వామనావతారంలో లోకాలను ఆక్రమించి అద్భుతం చేశాయి ! మొన్నటికి మొన్న అహల్యాదేవికి నీ పాదమే శాపవిమోచనం కలిగించింది ! నేడు నీపాద స్పర్శతో నా జన్మతరించింది స్వామీ ! కమలాక్షా నీ కరుణార్ధ్రదృక్కులు నా పై సదా ప్రసరింపచేయుమయ్యా !

...

నీవే తల్లివి! నీవే తండ్రివి !నీవె తోడునీడ !

లోపలనీవే బయటనీవే విశ్వమంతటా నీవే !

..

తల్లి తెలియని దూడలేదు తన దూడను గుర్తుపట్టలేని తల్లిలేదు ! అదేమి చిత్రమో నీ సంతానమై ఉండి కూడా లోకులు నిన్నెరుగలేరు !

అని స్తుతిస్తున్న విరాధుడిని చూసి నీవెవరు ? నీకు రాక్షస రూపమెందువలన వచ్చింది అని అడిగాడు రామయ్య !

...

స్వామి పాదాలమీద వాలి చెప్పటం మొదలుపెట్టాడు విరాధుడు !

...

తండ్రీ ! నా పేరు తుంబురుడు ,నేనొక గంధర్వుడను మా రాజు కుబేరుడు !

రంభ నాట్యము, గానము చూసి మోహించి ఆమె ప్రేమలో పడి ఆమెతో రమిస్తూ ఇంద్రియాలన్ని వశము తప్పగా లోకాలన్నింటిని మరచి పోయాను .

...

కుబేరుడది చూసి నన్ను రాక్షసుడిని కమ్మని శపించాడు ! ఆయన కాళ్ళావేళ్ళాపడి శాపవిమోచన మార్గము కొరకు ప్రార్ధించగా ," రామచంద్రుడి పాద స్పర్శతో నీకు శాప విమోచనం కలుగుతుందని సెలవిచ్చాడు " అప్పటినుండి క్రూరత్వానికి మారు పేరయి ఈ అరణ్యములో అందరినీ బాధిస్తూ బ్రతుకుతున్నాను ! 

...

స్వామీ ! మీతో యుద్ధము చేసినందుకు ఈ దాసుడిని మన్నించి సెలవిప్పించండి అని కోరగా రాముడు విరాధునికి అనుమతినిచ్చాడు .

...

విరాధుడి నిష్క్రమణ తరువాత రామచంద్రుడు దండకారణ్యంలోనికి ప్రవేశించాడు !

...

వూటుకూరు జానకిరామారావు

*శ్రీ కాళహస్తీశ్వర శతకము*

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔


  🙏  *శ్రీ కాళహస్తీశ్వర శతకము* 🙏


*తలమీఁదం గుుసుమప్రసాద మలికస్థానంబుపై భూతియున్*

*గళసీమంబున తండ, నాసిక తుద న్గంధప్రసారంబు లో*

*పల నైవేద్యముఁ జేర్చు నేమనుజుడా భక్తుండు నీకెప్పుడుం*

*జెలికాఁడై విహరించు రౌప్యగిరిపై శ్రీకాళహస్తీశ్వరా!!!*


            *శ్రీ కాళహస్తీశ్వర శతకము - 54*


*తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! ఎవడైతే సదా తలమీద నీ నిర్మాల్యమును, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షలను, ముక్కుయందు నీ అభిషేకజల సుగంధమును, ఉదరములో నైవేద్యమును కలిగి ఉంటాడో అతడు వెండికొండపై నీ స్నేహితుడితో సమముగా వర్తించగలడు.....*


✍️🌷🌺🌹🙏

Vidyardhi విద్యార్ధి

 

విద్యార్థి 


సాధకుడు ప్రతి విషయంమీద శ్రర్ధ వహిస్తేనే కానీ సాధనలో ముందుకు పోలేడు. ఏరకంగా అయితే ఒక విద్యార్థి పరీక్షలముందు చదువు యందు చాలా శ్రర్ధ తీసుకొని తనకు ఎక్కువ మార్కులు రావటానికి ఏయే పాఠ్యముసాలని చదవాలి వాటిని ఎలా ఆకటింపు చేసుకోవాలి. ప్రతి రోజు యెంత సమయం కేటాయించాలి అని ఏంటో విశ్లేషణ చేసుకొని పరీక్షలకు ముందు ప్రిపేర్ అవటం మనం చూస్తాము. విద్యార్థి తానూ ముఖం కడుకుంటున్న, స్నానమాచరిస్తున్నాన్న, భోజనం చేస్తున్నాకూడా తానూ చేస్తున్న పనులు కాకతాళీయంగా చేస్తూ మనస్సు మాత్రం తానూ చదివిన విషయాలను మనననమ్ చేసుకోవటానికి మాత్రమే వినియోగిస్తుంటారు. అలా సంపూర్ణంగా విద్య యందె నిమగ్నుడైన విద్యార్థి పరీక్షలలో ఎక్కువ మార్కులను సంపాదించుకోవటం మనం చూస్తూవుంటాము. ఒక సాధారణ పరీక్షకోసమే ఒక విద్యార్థి అంతగా కష్టపడితే మరి ఎన్నో జన్మలనుంచు ప్రయత్నిస్తున్న పరీక్ష ఇది అదేమిటంటే మోక్షపదం చేరటం అంటే యెంత కష్టంగా ఉంటుందో యెంత కృషి సల్పాలో మనం వేరే చెప్పనవసరం లేదు. మోక్షార్ధి ఒక విద్యార్థి కన్నా ఎన్నో రేట్ల కష్టం, కృషి, శ్రమ చేస్తూ నిరంతరం జ్ఞానాన్వేషణలో ఉండి ఒక సత్ గురువు ద్వారా నిత్యానిత్య వివేకా జ్ఞానాన్ని పొంది నిత్యమూ సత్యము అనంతము అయిన ఆ పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించి సదా నిదిజాసలో వుంటూ ఉంటే మాత్రమే మోక్షసిద్ది కలుగదు.

ఉత్తిష్ఠతా జాగ్రతా ప్రాప్య వరన్నిబోధతా |
క్షురస్య ధరా నిశితా దురత్యయా దుర్గాం పాఠస్తత్కవయో వదంతి || 14 ||

నిద్రలెమ్ము సాధక అంటే అజ్ఞానం అనే నిద్రలో వున్నావు నీవు ఆ నిద్రను తొలగించి జ్ఞానానం అనే ప్రకాశం వైపు నడువు ఆ దోవ ఎటువంటిదంటే ఒక క్షురకుని పదునైన కత్తిమీద నడవటం వంటిది. అటువంటి కష్టసాధ్యమైన దానిని సాదించటానికి ఒక మంచి స్టేగురువును ఆశ్రయించు అని ఈ ఉపనిషత్ మంత్రం మనకు ప్రబోధిస్తున్నది. 

సద్గురువు ఎవరు: 

కలి ప్రభావం వలన మనకు అనేక మంది తమకు తామే సద్గురువులని చెప్పుకుంటూ అనేక ఆశ్రమాలను నిర్మిస్తూ ,లక్షలకొద్దీ శిష్యులను కలిగి నిరంతరం పాద పూజలు చేయించుకుంటూ, విలువైన వస్తువులను దక్షణలుగా తీసుకుంటూ మనకు అనేక మంది తారసపడుతున్నారు. విచిత్రమేమిటంటే వారు నిత్యం అనేక వేదాంత ఉపన్యాసాలను చేస్తూ అనేకులను ఆకాసర్షిస్తున్నారు. వారి దర్శనానికి ఫీజు, పాదపూజకు ఫీజు మనకు వారి భక్తులు చెపుతుంటారు మేము ఈ స్వామీజీని నమ్ముకున్నాము. ఆయనకు పాదపూజ జరిపిస్తే మాకు ఈ మంచి జరిగించి ఆయనకు పూజలు జరిపిస్తే అది జరిగింది. ఆయన సాక్షాత్తు ఫలానా దేముడి అవతారం. మీరు మీ కోరికలు తీర్చుకోండి అని చేసే ప్రచారాలకు, ప్రలోభాలకు ప్రలోభపడి అప్పుడప్పుడే ఆత్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్న సాధకుడు తనకు భక్తిమార్గమే శరణ్యం అని అనుకుంటూ ఇటువంటి గురువుల శిష్యుల మాటలకు ఆకర్షించబడి ఆ గురువు సేవనమే తన జీవిత పరమావధి భావంచి తన ఆమెయిల్యమైన జీవితమును వృధా చేసుకుంటున్నారు. సాధకులను త్రప్పుడు త్రోవ పట్టించి వారివద్ద వున్నా ద్రవ్యాన్ని తస్కరించి ఈ రకమైన గురువులు వారి సంపదను వృద్ధి చేసుకోవటమే కాకుండా పెద్దపెద్ద భవనాలలో అనేక ఆశ్రమాలను నిర్మించిప్రజా సేవ చేస్తున్నట్లుగా ప్రగల్బాలు పలుకుతూ తమ పగ్గం గడుపుకుంటున్నారు. విచిత్రం ఏమిటంటే మన హిందువులు మాత్రమే కాకుండా మహమ్మదీయుడైన ఒక సాదువుకూడా ఇటీవల బాబాగా ప్రసిద్ధి చెంది తన మరణానంతరము గుడులు,గోపురాలు కలిగి నిత్యం పూజలు అనుడుకోవటం మనం చూస్తూవున్నాము. బాబా భక్తీ మత్తులో వున్న వారిని తిరిగి హిందుత్వపు వైపు తీసుకొనిరావటానికి సాక్షాత్తు ఆదిశంకర భగవతపాదులకు కూడా సాధ్యం కాదేమో అని ఈ సాధకుని అనిపిస్తున్నది. ఎందుకంటె వారు బాబా మత్తులో అడిగే ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం మృగతృష్ణలోనుంచి నీటిని తోడటం వంటిది. 

ప్రతి సాధకుడు ముందుగా రెండు విషయాలు తెలుసుకోవాలి అవి సద్గురువు ఎవరు అనేది ముందుగా తెలుసుకోవాలి, రెండవది సద్గురువు కేవలం ఒక మార్గదర్శకుడిగా మాత్రమే తనకు ఉపకరిస్తాడు కానీ సద్గురువు మోక్షాన్ని ప్రసాదించే వాడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే గురువును మనం ఒక ఉపకారణంలాగా మాత్రమే చూడాలి కానీ గురువుచుట్టూ తిరుగుతూ జీవితాన్ని వృధా చేయకూడదు. మనం ఒక ప్రయాణం చేస్తూవున్నాము మధ్యలో ఒక నది వచ్చింది ఆ నదిని దాటటానికి ఒక పడవను ఉపయోగిస్తాము నది దాటినా తరువాత మనకు ఆ పడవతో నిమిత్తం లేదు మరల మన ప్రయాణం మనమే చేస్తూ మన గమ్యస్థానాన్నికి చేరుకుంటాము. ఇక్కడ మన ప్రయాణంలో పడవ ఎలా ఉపయోగ పడిందో అలానే మనకు సద్గురువు కూడా గురువు బోధనలను విని మన సందేహాలను నివృతి చేసుకొని తిరిగి మన సాధనను కొనసాగించాలి. అంటే కానీ జీవితాంతం గురువుకు సేవచేస్తూ జీవితాన్ని వృధా చేసుకోకూడదు. 

సద్గురువు ఎలా వుంటారు. సద్గురువు తనకు తానుగా ఆత్మా సాక్షాత్కారం పొందినవాడుగా ఉండాలి అటువంటివాని వల్లనే మనము జ్ఞ్యానాన్ని పొందగలము మనకు జ్ఞ్యానాన్ని ఇవ్వాలనే ముందుగా మన గురువు జ్ఞాని అయివుండాలి కదా. గురువు అరిషడ్వార్గాన్ని త్యజించిన వాడై ఉండాలి. అంటే ఆయనకు మన సామాజిక జీవనపు లక్షణాలు ఏవి వున్దకూడాదు. అంటే ఏ విషయాలమీద ఆసక్తి, అనురక్తి,మోహము, కామము లేని వాడై ఉండాలి. కేవలము బిక్షాటన చేస్తూ తనకు దొరికిన దానిని భుజిస్తూ పరుల సొమ్మును ఆశించని వాడు అస్సలు ఇతరులతో మాట్లాడని వాడు ఇతరులనుంచి ఏది కోరని వాడు. కౌపీనము (గోచీ) మాత్రమే ధరించే వాడు అయివుండాలి అటువంటి సత్ గురువు మీకు లభిస్తే వెంటనే ఆయన పాదాలను ఆశ్రయించి శిష్యత్వాన్ని సవీకరించండి

సాధకుడు ముందుగా ఒక భక్తుడిగా తన ఆధ్యాత్మిక జీవనాన్ని మొదలుపెడతాడు. అదే అతనికి ఒకరకంగా రెండవ జన్మగా మనం అభివర్ణించవచ్చు. దేవి దేవతల యందు భక్తి కలిగి నిత్యం దూప దీప నైవైద్యంతో పూజలు చేసే భక్తుడు తానూ త్రికరణ శుద్ధిగా ఆచరించే పూజల ఫలితంగా ముందుగా అంతకరణ శుద్ధి ఏర్పడుతుంది. కొంతకాలం పూజలు చేసిన తరువాత కొద్దీ కొద్దిగా వాక్సుద్ధి ఏర్పడుతుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఆ స్థితిలో సాధకునికి ఒక ప్రశ్న తలయెత్తుతుంది. తానూ చేసే పూజలు మాత్రము చాలవు ఇంతకన్నా ఎక్కువగా నేను ఏమైనా చేయాలి అనే ఉదయిస్తుంది. ఆ భావన కలగటమే జీవితంలో మలుపుకు దారితీస్తుంది. అప్పుడు తరువాత జపం,తరువాత ధ్యానం చేస్తూ సాధకుడు భగవంతునికి దగ్గరగా అవుతాడు. 

 నిత్యం భగవంతుని ధ్యానిస్తూ నిర్వికల్ప సమాధి స్థితిని పొందిన సాధకుడు బ్రతికి ఉండగానే మోక్షాన్ని సిద్దించుకున్న సిద్ధుడే. కాబట్టి సాధకులారా మీ అమూల్య మైన సమయాన్ని వృధా చేసుకోకుండా కుటింటిత దీక్షతో కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః    

మీ భార్గవ శర్మ 

 

గురు దక్షిణ

 ⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️⚛️


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



              *గురు దక్షిణ*

             ➖➖➖✍️


డు, ము, వు, లు ప్రధమా విభక్తి,

నిన్, నున్, లన్, కూర్చి, గురించి.. ద్వితీయా విభక్తి.


తెలుగు మాస్టర్ గారి పాఠం సాగిపోతోంది. సూది మొన పడినా వినపడేంత నిశ్శబ్దం క్లాస్ రూమ్ లో. 


తెలుగు మాస్టర్ గారంటే ఆక్లాస్ కే కాదు, స్కూల్ మొత్తం భయం. క్రమశిక్షణకు మారుపేరు మాస్టారు. అల్లరి చేసిన వాడి వీపు వంచి గుల్ల దెబ్బ ఒక్కటి వేసేరంటే చాలు, స్కూలు మొత్తం వినపడేది. ఆ శబ్దానికే పిల్లలకు చచ్చేంత భయం. కర్ర విరగాకూడదు, పాము చావాకూడదు అనేది ఆయన సిధ్ధాంతం. దెబ్బ తగిలేదు కాదు కానీ, ఆ శబ్దానికే బిక్క చచ్చి పోయేవారు కుర్రాళ్లంతా. 


“నేను ఈల వేస్తే గోలకొండ ఎగిరిపడతది..

నేను ఈలవేస్తే గోలకొండ అదిరిపడతది..

దివికి దివికి దిమాడి... గుబుకు గుబుకు గుమాడి... దివికి దివికి దిమాడి ... గుబుకు గుబుకు గుమాడి....”

అంటూ పెద్దగా ఈల వేసుకుంటూ, ప్లే గ్రౌండ్ లో వున్న ఉసిరి చెట్టెక్కి కోసిన ఉసిరికాయలు ఒక ముచ్చికవర్ లో వేసుకుని, క్లాస్ రూమ్ లోకి అప్పుడే ఎంటర్ అయిన శీను గాడు….


పాఠం చెబుతున్న తెలుగు మాస్టర్ గారిని చూసి గతుక్కు మన్నాడు. భయంతో బిక్క చచ్చిపోయేడు. వాడి పై ప్రాణాలు పైనే పోయేయి. తెలుగు మాస్టర్ గారు ఆరోజు సెలవు, స్కూల్ కి రారు అనుకున్న శీను గాడికి పాపం మాస్టర్ గారు లీవ్ క్యాన్సల్ చేసుకుని క్లాస్ కి వచ్చేరన్న విషయం తెలీదు. ఎంచక్కా తెలుగు పీరియడ్ ని ఉసిరి కాయలకోసం కేటాయించుకున్నాడు. 


“ఒరేయ్..ఇలా రారా!” మాస్టారి కళ్ళు చింత నిప్పుల్లా వున్నాయి. 

భయంతో ఉసిరికాయలన్నీ అక్కడే కిందన పడేసాడు. 

పిల్లలంతా ఒకింత భయంతోనూ, ఒకింత 

ఆతృతతోను చూస్తున్నారు , ఏం జరగబోతుందా అని!


అంతలోనే ధామ్...ధామ్ అంటూ గట్టిగా రెండు శబ్దాలు వినపడే సరికి శీను గాడి పని అయిపోయిందివాళ అనుకున్నారంతా. 


“వెధవా..! నీ తల్లి, తండ్రి అంతంత ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తుంటే, నువ్వు చేసే ఘన కార్యం ఇదా? చదువు లేకపోయినా ఫర్లేదు, క్రమశిక్షణ లేకపోతే ఎలా? పెద్దయ్యాక ఏం సాధిద్దామని? అంట్లు తోముకుని బతుకుదామని అనుకుంటున్నావా?” మాస్టర్ గారి తిట్ల సునామీ కి అడ్డుకట్టలేదు. అంత కోపం అతనిలో మునుపెన్నడూ చూడలేదు ఎవరూ. పిల్లలు క్రమశిక్షణ లేక చెడిపోతున్నారన్న బాధ, ఆయన కళ్ళల్లో రౌద్రమై తాండవిస్తోంది. శీను గాడు అది చూసి తట్టుకోలేకపోయేడు. ఒహటే ఏడుపు. 


ఇంతలో మిగిలిన క్లాస్ టీచర్స్, హెడ్ మాస్టర్ గారు వచ్చి తెలుగు మాస్టర్ గారిని శాంతింప చేయడంతో పరిస్థితి కుదుటపడింది. 


తుఫాన్ తరువాత ప్రశాంతత ఎలా ఉంటుందో ఆ క్లాస్ రూమ్ ని చూస్తే అర్ధం అవుతుంది. కానీ ఈ సంఘటన తరువాత మాస్టర్ గారు అన్యమనస్కంగా వున్నారు. మిగిలిన పాఠం చెప్పే మూడ్ లేక, పిల్లలికి ఏదో వర్క్ ఇచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోయేరు. 


ఈ ఘటన జరిగి చాలా రోజులైనా, శీను గాడికి మాత్రం మాస్టర్ గారిపై కోపం తగ్గలేదు. ఆయన అంటే బాగా అయిష్టం పెంచేసుకున్నాడు. ఆయనికి కనిపించకుండా తిరుగుతూ జాగ్రత్త పడుతుండేవాడు. ఏదో విధంగా టెన్త్ పరీక్షల్లో పాస్ అనిపించుకుని, స్కూల్ చివరి రోజున కూడా మాస్టర్ గారికి కనిపించకుండా, కనీసం పలకరించకుండా వచ్చేశాడు. 


ఆ తరువాత శీను వాళ్ళ నాన్న గారికి వేరే వూరు బదిలీ అవడంతో, ఆ వూళ్ళో కాలేజీలో చేరిపోయేడు.


రోజులు గడిచి పోతున్నాయి. క్యాలెండర్లు మారిపోతున్నాయి. అవి రోజులా....లేక కళ్ళాలు లేని గుర్రాలా అన్నట్టున్నాయి. 

*****************


తెలుగు మాస్టారి చిన్న అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. తను పనిచేసే రోజుల్లో యేవో లోన్లు అవీ పెట్టి మెల్లగా పెద్దమ్మాయి పెళ్లి చేసేశారు. ఇప్పుడు చిన్నమ్మాయి పెళ్లి కోసం,తను జాగ్రత్త చేసి కొనుక్కున్న కొంత భూమిని అమ్మేద్దామని నిర్ణయించుకున్నారు.


కానీ తను, తనతో పాటు కొంతమంది కలిసి కొన్న ఆ జాగా వున్న ఏరియాలో యేవో కొన్ని వివాదాల కారణంగా భూమిని అమ్మడానికి ప్రభుత్వ పరంగా కొన్ని అడ్డంకులు వున్నాయి. ఆ అడ్డంకులు తొలిగితే కానీ తాను అమ్మే పరిస్థితి కానరాకపోవడంతో, తెలిసిన వ్యక్తుల సలహా మేరకు జిల్లా కలెక్టర్ గారిని కలిస్తే పని జరగొచ్చు అని చెప్పడంతో కలెక్టర్ ని కలవడానికి అప్పోయింట్మెంట్ తీసుకున్నారు మాస్టర్ గారు. 


“అబ్బే... కుదరదండి. రూల్స్ ఒప్పుకోవు. ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం అస్సలు కుదరదండి!” అంటూ పంపేశారు కలెక్టర్ గారు. 


రెండు, మూడు సార్లు అతని చుట్టూ తిరగవలసి వచ్చింది మాస్టారికి.

“మీరు ఎన్ని సార్లు నా దగ్గరికి వచ్చినా ప్రయోజనం లేదు సార్! ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను. నా పరిధి దాటిపోయింది. మీ వలన అవుతుంది అంటే వెళ్లి మంత్రి గారిని కలవండి. ఏమైనా చెయ్యగలిగితే ఆయనే చెయ్యగలడు. దయచేసి వెళ్లిపోండి...” అంటూ ఖరాఖండి గ చెప్పేసేడు కలెక్టర్ శ్రీనివాస్.


చేసేది లేక మాష్టారు, మంత్రి గారి అప్పోయింట్మెంట్ కోసం ప్రయత్నిచసాగేరు. ఎట్టకేలకు తనకు వున్న పరిచయాల ద్వారా మంత్రి గారి అప్పోయింట్మెంట్ సాధించారు. 


“సర్.. ఎవరో రిటైర్డ్ తెలుగు మాస్టర్ గారంట. ఈ జాగా విషయమై అడ్డంకులు తొలగడానికి మీ అనుమతి కావాలంటున్నారు.. కుదరదంటే వినిపించుకోవట్లేదు. అమ్మాయి పెళ్లి అంట.. ఎలాగైనా మిమ్మల్ని కలవాలంటున్నారు. ఇదిగో ఇవి అతని వివరాలు.” అంటూ ఆ ఫైల్ ని మంత్రి గారి టేబుల్ పైన పెట్టి వెళ్ళిపోయేడు సెక్రటరీ. 


కాసేపు ఫైల్ ని క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మాస్టర్ గారిని లోపలికి పంపించ వలసిందిగా ఫోన్ చేసి సెక్రటరీ కి చెప్పారు మంత్రిగారు.


“రండి..! కూచోండి. మీ వివరాలన్నీ చూసాను.” అంటూ మాస్టర్ గారిని సాదరంగా ఆహ్వానించారు మంత్రివర్యులు. 


“ఈ భూమి విషయమై కొన్ని అడ్డంకులు వున్న మాట వాస్తవమయినా, మీ కేసు జెన్యూన్ కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాను. మరేమీ ఫర్లేదు...మీరు నిశ్చింతగా ఉండొచ్చు,” అంటూ ఫైల్ మీద సంతకాలు పెట్టి, సెక్రటరీని పిలిచి, త్వరగా క్లియర్ చెయ్యమంటూ ఆదేశాలు జారీ చేసారు మంత్రిగారు. 


మాస్టారు ఉప్పొంగిపోయేరు. “గత మూడు నెలలనించీ తిరుగుతున్నా పని కాలేదు. మీ దయ వలన ఇప్పుడు పూర్తయ్యింది.” అంటూ కృతఙ్ఞతా పూర్వకంగా నమస్కరించబోయేరు మాస్టర్ గారు. 


“అయ్యో... మీరు పెద్దవారు. మీరు నమస్కరించరాదు. మీ బోటి వారికి సేవ చెయ్యడమే మా లక్ష్యం!” అంటూ మాస్టర్ గారిని వారించారు మంత్రి గారు.


కృతఙ్ఞతా పూర్వకంగా ఆశీర్వదించి వెనుదిరిగి తలుపు తీసుకుంటూ వెళ్లబోయారు తెలుగు మాస్టారు. 


“చేతన్, చేన్, తోడన్, తోన్.. చేతనైన చేయూతనందించి తోడుగా నిలవడం....

తృతీయా విభక్తి...!”


“కొఱకున్, కై ... ప్రజల కొరకు, ప్రజల కోసం పోరాడటం.. చతుర్ధీ విభక్తి ...!”


“వలనన్, కంటెన్, పట్టి.....

ప్రజల వలన ఎన్నుకోబడిన నేను, వాళ్ళ కంటే గొప్పవాడినేమీ కాను, పట్టి పీడిస్తున్న సమస్యలను పరిష్కరించటమే.....

పంచమీ విభక్తి ....!”


“కిన్, కున్, యొక్క , లోన్, లోపల.....

వ్యవస్థ లోపల వున్న కలుపు మొక్కల్ని ఏరి పారేసి, సంఘం యొక్క మేలు కోరడమే..... షష్టీ విభక్తి...!”


“అందున్, నన్.......

అందుకు కట్టుబడి వుంటాను, ఆ విధంగా నన్ను నేను మలుచుకుంటాను.

సప్తమీ విభక్తి...!”


“ఇదే మాకు మా గురుదేవులు నేర్పిన పాఠం! అందుకే మా తెలుగు మాస్టారంటే మాకు అమితమైన భక్తి !!! ఆయన నేర్పిన క్రమశిక్షణే మాకు యెనలేని శక్తి!!!!”


అమాంతం వెనక్కి తిరిగి చూసిన తెలుగు మాస్టారి కళ్ళు నీటి కుండల్లా వున్నాయి. 


“అవును మాస్టారు... నేనే చిన్నప్పటి మీ శీను గాణ్ణి...” అన్నాడు మంత్రి శీనయ్య!!!


నీటి పొరలు కప్పేయడం వలన ఏమో, ఒకరికొకరు మసక, మసకగా కనపడుతున్నారు. తన శిష్యుడి ఉన్నతి చూసి మురిసిపోయేరు మాస్టారు. గట్టిగా కౌగిలించుకున్నారు.


కాలేజీ చదువులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటిగా జీవితం పాఠాలను నేర్పసాగింది మాస్టారు. అప్పుడు తెలిసి వచ్చింది మీరు క్రమశిక్షణపై ఎందుకు అంత శ్రద్ధ వహించేవారో, మమ్మల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడేవారో! ఆ నాడు మీరు నేర్పిన పాఠాలను నెమరు వేసుకుంటూ.....

నా బతుకు చిత్రాన్నేమార్చుకున్నాను. ప్రజాసేవ చేస్తూ దేశానికి ఎంతో కొంత ఋణం తీర్చుకోవాలనుకున్నా.....

చూస్తున్నారుగా......ఇపుడిలా”


“మీరేమీ అనుకోక పోతే అమ్మాయి పెళ్లి కి నాకు చేతనైనంత సహాయం చేసి, మీకు గురుదక్షిణగా చెల్లించుకుంటా.......

ఆ భూమిని మాత్రం అమ్ముకోవద్దు. 

మీ జీవిత భద్రత కోసం మీ దగ్గరే అట్టే పెట్టుకోండి ....”

“ఇది నా విన్నపం. కాదనకండి.” అంటూ అభ్యర్ధించాడు మంత్రి శీనయ్య ఉరఫ్ శీను.


గురుభక్తిని కాదనలేకపోయారు తెలుగు మాష్టారు. తన శిష్యుడు అంత ఎత్తుకి ఎదిగినందుకు సంబర పడిపోయారు.


“సార్ ..! మీ మొబైల్ అందుబాటులో లేనట్టుంది. మేడం గారు ఫోన్ చేసేరు. మీ చిన్నబ్బాయి స్కూల్ లో ఉసిరి చెట్టెక్కి కాయలు కోయబోతూ కింద పడ్డాడంట.”


“మరేమి ఫరవాలేదు ... హి ఈస్ ఆల్రైట్ అని ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసి చెప్పారంట ...” అంటూ మధ్యలో డిస్టర్బ్ చేసినందుకు క్షమాపణలు చెప్తూ... వచ్చి చెప్పాడు సెక్రటరీ.


“మరేమీ ఫర్వాలేదు ప్రిన్సిపాల్ గారిని వాడికి ఇంకో నాలుగు తగిలించమను. మరీ బుద్ధి లేకుండా తయారౌతున్నాడు ఈ మధ్య!” అంటూ ... తెలుగు మాస్టర్ గారి ముఖం లోకి చూసారు సదరు మంత్రి గారు.


ఆ ఇద్దరూ అంతలా పకా, పకా ఎందుకు నవ్వుతున్నారో ఓ పట్టాన అర్ధం కాలేదు సెక్రటరీ కి.....✍️


అంతర్జాల సేకరణ 

షరా: అలాంటి ఉపాధ్యాయుల్ని, విద్యార్ధుల్ని చూపించమంటే చూపగలను, కానీ అలాంటి మంత్రులను చూపమని అడగొద్దు. అసాధ్యం.✍️


🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కాలనేమినిహా

 👆 శ్లోకం 

కాలనేమినిహా శౌరిః.                            

శూర శ్శూరజనేశ్వరః|

త్రిలోకాత్మా త్రిలోకేశః                          

కేశవః కేశిహా హరిః||


ప్రతిపదార్థ:


కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.


వీర: - వీరత్వము గలవాడు.


శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.


శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.


త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.


త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.


కేశవ: - పొడవైన కేశములు గలవాడు.


కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.


హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.

మూక పంచశతి

 శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి

శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన

పాదారవిందశతకం

🙏🌸🙏🙏🙏🌸🙏

 

శ్లోకము:-

జగన్నేదం నేదం పరం                     

ఇతి పరిత్యజ్య యతిభిః.           

కుశాగ్రీయ స్వాంతైః                            

కుశలధిషణైః శాస్త్రసరణౌ |

గవేష్యం కామాక్షీ ధ్రువ.                  

 మకృతకానాం గిరిసుతే.                     

గిరా మైదంపర్యం తవచరణ                  మాహాత్మ్య గరిమా ||24||

 

 

భావము:

శాస్త్రపద్దతిలో కుశాగ్రంలా చురుకైన సూక్ష్మబుద్దులుకల మేధావులైన యతులు ఈ దృశ్యమైనది జగత్ కాదు. వేదములకు వాస్తవంగా అన్వేషాణీయం గిరిసుతయైన కామాక్షీదేవీ నీ దివ్య చరణముల మహిమాతిశయం మాత్రమే సుమా అని గ్రహించారు.

 

*********

 

🔱 ఆ తల్లి 

పాదపద్మములకు నమస్కరిస్తూ 🔱                                                                                                                                                                                             🙏🌸🌸🌸🌸🌸🙏

పంచాంగం 08.10.2024 Tuesday,

 ఈ రోజు పంచాంగం 08.10.2024 Tuesday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస శుక్ల పక్ష పంచమి తిధి భౌమ వాసర: జ్యేష్ట నక్షత్రం ఆయుష్మాన్ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 పంచమి పగలు 11:15 వరకు.

జ్యేష్ట రా. తె 04:06 వరకు .


సూర్యోదయం : 06:11

సూర్యాస్తమయం : 05:56


వర్జ్యం : పగలు 08:23 నుండి 10:06 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:32  నుండి 09:19 వరకు తిరిగి రాత్రి 10:50 నుండి 11:39 వరకు.


అమృతఘడియలు : సాయంత్రం 06:40  నుండీ రాత్రి 08:32 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30  వరకు.



శుభోదయ:, నమస్కార:

హైందవం వర్ధిల్లాలి 24*

 *హైందవం వర్ధిల్లాలి 24*


*ధర్మప్రచారకులు, ప్రవచనకారులు, ఆశ్రమాధిపతులు,  పీఠాధిపతులు,  హిందూ నాయకులు హైందవ జాగృతికై ప్రజలలోకి రావాలి*. v):-  భారతదేశ ప్రజలలో చైతన్యము మరియు ఐకమత్యము లోపించిందా అంటే లేదనే చెప్పాలి.  ఐకమత్యం  అర్థాలు లోగడ వ్యాసాలలో పరిశీలించాము. ప్రస్తుత పదం *చైతన్యం* యొక్క సాధారణ అర్థాలు చూద్దాము = ఎరుక, తెలివి,  స్పృహ, కదలిక,  జాగృతి, మెచ్చదగిన మార్పు. విశేష నిర్వచనము =  ప్రత్యేకమైన ఆలోచనలు, స్థిరమైన భావాలు, అవసరాలపై ప్రత్యేక అవగాహన. చైతన్యం ఎన్ని విధాలో చూద్దాం = ఆత్మ చైతన్యము, స్త్రీ చైతన్యము, కార్మిక చైతన్యము, సామాజిక చైతన్యము ఇత్యాది. ఐకమత్యం ఎన్ని విధాలో పరిశీలిద్దాము =  హక్కుల సంఘాలు,సహకార, గ్రహ, ఉద్యోగ, మహిళా, కార్మిక, వయోవృద్ధ ఈలా ఎన్నెన్నో సాధన సంఘాలు. 


ఈలా ఇవన్నీ నిర్మించుకోవడానికి ప్రవచనకారులు, ధర్మ ప్రచారకులు లాంటి పెద్దలెవరైనా *హితవు* పలికారా అంటే  లేదనే చెప్పాలి. ప్రజలలో ఇంత చైతన్యానికి, ఐకమత్యాన్నికి కారణం గమనిస్తే అవసరాలు, హక్కుల పోరాటానికి సన్నద్ధత, వారి వెనుక ఉన్న సంబంధిత కుశాగ్ర ధీశాలురు. ఈ పోరాట సంఘాలు దేశాన్ని ఏలా మరియు ఎంత స్పందింపజేస్తావో సర్వులకు విదితమే. హక్కులు సాధించే వరకు వారి ప్రయత్నాలు విరమించరు, జరిగే కాల, ధన, జన నష్టాన్ని గూడా ఖాతరు చేయరు. గత సంవత్సరం దేశ ముఖ్య పట్టణం "డిల్లీలో" వ్యవసాయదారుల  అసత్య దీక్షలు ఎంత సంచనలకరమో మనందరికీ విదితమే. *పెద్దలు అంటూ ఉంటారు చైతన్యము మరియు ఐకమత్యం "ఒక్కొక్కసారి" దుర్వినియోగం పాలవుతున్నదని*.

చైతన్యానికి  వృద్ధాప్యం ఉండదు, నిరంతరం ఈ స్రవంతి సాగుతూనే (ముందుకు) ఉంటుంది.


దేశం సంస్కృతి, సంప్రదాయాలు మరియు ధర్మానికి హాని జరుగుచున్నపుడు, మరియు తోటి జనుల జీవనం చిన్నాభిన్నమవుతున్నప్పుడు, వీటితో పాటు దేశ  శాంతి భద్రతలకు, ప్రతిష్టకు భంగం కల్గుతున్నప్పుడు పైన ఉదహరించబడిన  చైతన్య మరియు ఐకమత్య ధృఢ సంకల్ప ప్రజలలో *నీరసము, నిస్త్రాణత, ఉదాసీనము, స్థావరత, క్రియాశూన్యత, అనిర్ణీత, అయిష్టత, వ్యాకులతగా* చోటుచేసుకుంటున్నది.

 వారు దేశ పరిస్థితుల గురించి పట్టించుకోని వైనం  *ఆ సంఘ పెద్దలు మరియు మేధావులు ప్రజలకు తెలియజేయవల్సి ఉంటుంది*.  ఇంత పరపతి ఉన్న పెద్దలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలను సంప్రదించ వచ్చును. *హక్కులేనా ముఖ్యం బాధ్యతలు గూడా ముఖ్యమే గదా*. కావున మన హైందూ ధర్మానికి, సంస్కృతికి  ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి. 


ధన్యవాదములు.

*(సశేషం)*.