*9 రోజులపాటు ప్రతిరోజూ*
*సంక్షిప్త దివ్య రామాయణ పారాయణం*
*1 వ రోజు*
గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు
గురుదేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పర బ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః
***
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
****
శ్రీమద్ రామాయణం ఆదికావ్యం. వాల్మీకి మహర్షి, బ్రహ్మ అనుగ్రహంతో మానవాళిని తరింపచేయడానికి ఈ మహాకావ్యాన్ని మనకు అందించారు.
వాల్మీకి మహర్షి ఒకరోజు తమసా నదికి స్నానాకి వెళ్ళాడు. అక్కడ ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మమీద క్రీడిస్తూ ఆనందసాగరంలో ఉన్న ఒక పక్షుల జంటలోని మగపక్షిపై కిరాతుడు ఒకడు బాణం వేశాడు. అది విలవిలకొట్టుకుంటూ నేలరాలింది. ఆ బాణం దెబ్బతో ఆ మగపక్షి ప్రాణాలు విడిచింది. ఆ మగపక్షి చుట్టూ తిరుగుతూ ఆడపక్షి విలపిస్తుండడం చూసిన వాల్మీకి మహర్షి మనసు ద్రవించింది.
ఆయన హృదయ లోని శోకం, శ్లోకంగా మారింది.
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్| |
ఓ కిరాతుడా! క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపావు. అందువలన నీవు ఎక్కువకాలము జీవించియుండవు. (శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు) అని ఆ కిరాతుడిని, మహర్షి శపించాడు .
అదే క్షణంలో బ్రహ్మ ప్రత్యక్షమై నీ నోట సరస్వతి పలికింది. కవిత్వం జాలువారింది. నువ్వు రామాయణ మహాకావ్యాన్ని రచించి మానవాళిని తరింపచేయి . అది భూలోకంలో శాశ్వతంగా ఉంటుంది.,అని సూచించి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
*బాలకాండ*
కోసలదేశానికి రాజధాని అయోధ్య. శత్రువులు జయించడానికి వీలులేనిది కనుక దీనికి అయోధ్య అని పేరు. ఈ రాజ్యానికి అధిపతి దశరథుడు. ప్రజలను కన్నబిడ్డల వలె పాలిస్తున్నాడు, ధర్మాత్ముడు. దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి. తనకు సంతానం లేకపోవడంతో దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని తలపెట్టాడు. యాగం పరిసమాప్తమైన వెంటనే యాగ జ్వాలలనుంచి ఒక మహాపురుషుడు పాయసంతో కూడిన బంగార కలశంతో ప్రత్యక్షమై దానిని దశరథుడికి యాగఫలంగా అందించాడు. ‘ఇందులోని పాయసాన్ని నీ రాణులకు ఇవ్వు , వారి యందు నీకు సంతానం కలుగుతుంది’ అని దీవించి ఆ మహాపురుషుడు అదృశ్యమయ్యాడు. దశరథుడు పరమానందంతో ఆ పాయసంలో సగభాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగభాగంలో సగం సుమిత్రకు ఇచ్చాడు.మిగిలిన నాలుగవ వంతులో సగభాగం కైకేయికి ఇచ్చాడు. ఇంకా మిగిలిఉన్న ఎనిమిదవ భాగాన్ని మళ్లీ సుమిత్రకు ఇచ్చాడు. వారు దానిని దివ్య ప్రసాదంగా స్వీకరించారు.
*శ్రీరామ జననం*.....
ఆ తర్వాత సంవత్సరానికి చైత్రశుద్ధ నవమినాడు పునర్వుసు నక్షత్రంలో కౌసల్యాదేవి సర్వలక్షణ సంపన్నుడైన, తేజోవిరాజమూర్తి అయిన శ్రీరాముడిని ప్రసవించింది.
వెడ ద కన్నుల వాడు, విపులాంసముల వాడు, రాకేందు బింబ వక్త్రంబు వాడు, కంబు కంఠంబు వాడు, ఘన లలాటము వాడు , రమణీయ మృదు కపోలముల వాడు పీన వక్షమువాడు , పృథు నితంబము వాడు, సముదగ్ర చారు మస్తకము వాడు, దివ్యదేహమువాడు, దీర్ఘబాహులవాడు, కమనీయ శుభలక్షణముల వాడు, నీలమేఘశ్యాముడు సర్వలక్షణ సుశోభితుడు లోక రక్షకుడు శ్రీరామచంద్ర మూర్తి జన్మించారు. సత్య పరాక్రముడైన భరతుని, కైకేయీదేవి ప్రసవించింది. సకల శాస్త్ర పారంగతులైన లక్ష్మణ, శత్రుఘ్నులను సుమిత్రాదేవి ప్రసవించింది. లోకం పులకించి పోయింది.
*విశ్వామిత్రుడి* *ఆగమనం*.....
అయోధ్యానగరంలో శ్రీ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ధనుర్ విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తున్నారు.మహర్షుల యాగాలకు ఆటంకం కలిగిస్తున్న రాక్షసులను అంతం చేయడానికి దశరథమహారాజు సాయం కోరి విశ్వామిత్రుడు అయోధ్యా నగరానికి విచ్చేశాడు. రాజమందిర ద్వారం వద్ద నిలబడి తన రాకను దశరథ మహారాజుకు తెలియజేయమన్నాడు. విషయం తెలిసిన వెంటనే, దశరథుడు సకల మర్యాదలతో విశ్వామిత్ర మహర్షికి సాదర స్వాగతం పలికాడు. ఏం కావాలన్నా ఇస్తానన్నాడు. విశ్వామిత్రుడు తాను వచ్చిన పనిని వివరించాడు. మారీచ సుబాహువులనే రాక్షసులు తమ యజ్ఞయాగాలకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పాడు. రాక్షసులను శపించవచ్చు కానీ, యజ్ఞ క్రతువులో నిమగ్నమైనపుడు కోపం దరిచేరకూడదు కనుక రాక్షసులను శపించడం లేదని చెప్పాడు. ఇలాంటి పరిస్థితులలో యాగ రక్షణ జరగాలంటే శ్రీరాముడిని తన వెంట పంపాలని విశ్వామిత్రుడు దశరథ మహారాజు ను కోరాడు. ఈ మాట వింటూనే దశరథుడికి దిక్కుతోచలేదు. లేక లేక కలిగిన సంతానాన్ని ఇలా రాక్షస సంహారం కోసం పంపడమా? అని బాధపడ్డాడు. రాముడి బదులు తాను వస్తానన్నాడు.
ఏం కోరినా ఇస్తానని చెప్పి, ఇప్పుడు మాట తప్పుతావా? ఇది రాజధర్మమా? అని విశ్వామిత్రుడు దశరధుడిని సూటిగా ప్రశ్నించాడు . వశిష్ఠుల వారు గమనించారు. లోక కల్యాణం కోసమే ఇదంతా జరుగుతున్నదని, విశ్వామిత్రుడి వెంట రాముడిని పంపడం వల్ల రాముడి కీర్తి ,యశస్సు పెరుగుతాయని దశరథుడికి సూచించాడు.వశిష్టులవారి సూచన మేరకు ఎట్టకేలకు విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులను పంపడానికి దశరథుడు నిర్ణయించాడు. అలా విశ్వామిత్రుడి వెంట రామలక్ష్మణులు అయోధ్య దాటి, అరణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు. అలా తనను అనుసరిస్తున్న రామలక్ష్మణులకు సరయూ నదీతీరంలో - ఆకలి, దప్పికలు లేకుండా బల , అతి బల అనే విద్యలను విశ్వామిత్రుడు వారికి అనుగ్రహించాడు. దీనివల్ల వారికి ఎన్నటికీ ఆకలి , దప్పికలు ఉండవు. ఆ రాత్రి వారు అక్కడే విశ్రమించారు. మరునాడు ఉదయం తెల తెల వారుతుండగా ....
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ।
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ॥
కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుతోంది, దైవ సంబంధాలైన కార్యక్రమాలు చేయవలసి ఉంది. కనుక లెమ్ము, అంటూ ఆ శ్రీరామ చంద్రమూర్తిని, విశ్వామిత్ర మహర్షి మేల్కొలిపాడు.
మహర్షి మేల్కొలుపుతో లేచి, సంధ్యావందనాది కార్యక్రమాలు ముగించుకుని వారు అక్కడి నుంచి బయలుదేరారు. అలా నడుచుకుంటూ వారు మహారణ్యంలో ఒక జనపదం చేరారు. అక్కడ తాటక అనే రాక్షసి ఉంటున్నది. దాని గురించి రాముడికి తెలిపాడు మహర్షి. అగస్త్యుని ఆశ్రమ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తూ , జనాన్ని తింటూ ఇది బతుకుతున్నదని రాముడికి వివరించాడు. దీనికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుందని చెప్పాడు. తాటక స్త్రీ కదా దానిని చంపడం ఎలా అని సంకోచించకుండా , దుష్ట శక్తిని సంహరించమని విశ్వామిత్రుడు, రాముడికి సూచించాడు.
*తాటక వధ:*
రాముడు ధనుష్ఠంకారం చేశాడు. ఆశబ్దానికి తాటకి ఉగ్రురూపిణి అయి శబ్దం వచ్చిన దిక్కుగా వచ్చింది. రాముడు దాని చేతులు ఖండించాడు. సాయంత్రం అయితే దాని బలం ఇంకా పెరుగుతుంది కనుక వెంటనే దానిని సంహరించమన్నాడు విశ్వామిత్రుడు. రాముడు తాటకిని సంహరించాడు. వెంటనే విశ్వామిత్రుడు రాముడికి దివ్యాస్త్రాలు అనుగ్రహించాడు. దండచక్ర, ధర్మచక్ర, కాలచక్ర, విష్ణు చక్ర,బ్రహ్మాస్త్ర, కాలపాశ,ధర్మపాశ, వరుణపాశ, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇలా సమస్త్ర అస్త్రాలనూ అనుగ్రహించాడు. తాటకి వధతో లోకం లో పుష్ప వర్షం కురిసింది. అక్కడి నుంచి విశ్వామిత్ర మహర్షి తాము యాగం చేస్తున్న సిద్ధాశ్రమానికి వారంతా చేరుకున్నారు.
*మారీచ,సుబాహువుల వధ*:
విశ్వామిత్ర మహర్షి యాగం మొదలు పెట్టారు. అంతే రాక్షసులైన మారీచ సుబాహువుల అనుచరగణం అక్కడకు చేరుకుని యాగానికి ఆటంకం కలిగిస్తోంది. రాముడు బాణాల వర్షం కురిపించి వారిని హతమార్చాడు. తాటక కొడుకు మారీచుడిపై బాణం సంధించాడు. వాడు వందయోజనాల దూరంలో సముద్రంలో పోయి పడ్డాడు.
ఇక రాక్షసులు ఎవరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. యాగం నిర్విఘ్నంగా సాగిపోయింది.
ఆ తర్వాత వారు అక్కడ నుంచి మిథిలా నగరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వారు గౌతమ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. అక్కడ అహల్య శాప గాథను విశ్వామిత్రుడు రాముడికి తెలిపాడు. నీ పాద స్పర్శతో ఆమెకు పూర్వ రూపం వస్తుందన్నాడు. రాముడి దృష్టి పడగానే అహల్య పూర్వ రూపంతో లేచి నిలబడింది. రామలక్ష్మణులు ఆ సాధ్వీమతల్లికి నమస్కరించి ముందుకు సాగారు.
*సీతా స్వయంవరం:*
మిథిలా నగరంలో సీతా స్వయంవరం వార్త తెలుసుకుని విశ్వామిత్ర మహర్షి, రామలక్ష్మణులను మిథిలకు తీసుకువెళ్లాడు. శివధనస్సును విరిచి సీతమ్మతల్లిని స్వయంవరంలో రామచంద్రమూర్తి దక్కించుకున్నాడు. అయోధ్యలో ఉన్న దశరథుడికి కబురుపంపి సీతారామ కల్యాణానికి ఏర్పాట్లు చేశారు. లక్ష్మణ భరతశత్రుఘ్నులకూ వివాహాలు జరిపించారు. దశరథుడు కొడుకులు, కోడళ్లతో అయోధ్యకు బయలుదేరాడు. మార్గ మధ్యంలో పరశురాముడు ఎదురై, శివధనుస్సు విరిచినందుకు రాముడిపై ఆగ్రహించాడు. నూతన వధూవరులపై ఆగ్రహం తగదని దశరధుడు పరశురాముడిని వేడుకున్నాడు. అయినా కుదరదన్నాడు పరశురాముడు . తన దగ్గర ధనుస్సు తీసుకుని బాణం ఎక్కుపెట్టమని రాముడికి సవాలు విసిరాడు. రాముడు బాణం సంధించి వదిలాడు. అది దూసుకువస్తుండడంతో పరశురాముడు హడలిపోయాడు. వదిలిన బాణం లక్ష్యాన్ని ఛేధించక తప్పదు. నీ నడకను నిరోధించనా లేక నీవు తపస్సుతో ఆర్జించిన పుణ్యలోకాలను వదిలించనా అని పరశురాముడిని, శ్రీరాముడు అడిగాడు. పరశురాముడు తన ఎదురుగా ఉన్నది శ్రీమహావిష్ణువని గ్రహించాడు. పుణ్యలోకాలను వదిలిస్తే మళ్లీ తపస్సు చేసి సాధించుకుంటానని చెప్పి పరశురాముడు పుణ్యలోకాలను వదులుకున్నాడు . రాముడి శక్తి సామర్ధ్యాలను కీర్తించి పరశురాముడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇక అక్కడ నుంచి రథాలు అయోధ్య దిశగా కదిలాయి........
*****
యావత్ స్థాయన్తి గిరయ: సరితశ్చ మహీతలే
తావ ద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి
ఈ ప్రపంచంలో గిరులు ,నదులు ఉన్నంత కాలం రామాయణ కథ లోకంలో నిలిచి ఉంటుందని కవియైన వాల్మీకితో , బ్రహ్మదేవుడు అంటాడు.
శ్రీమద్రామాయణం లోని ప్రతి అక్షరం మోక్ష ప్రదమే ,పాపనాశమే.
ఇదం పవిత్రం పాపఘ్నం , పుణ్యం వేదైశ్చ సమ్మితమ్
య:పఠే ద్రామచరితం సర్వపాపై:ప్రముచ్యతే
రామకథ పవిత్రమైనది. పాపములను హరిస్తుంది. పుణ్యమైనది. వేదములతో సమానమైనది.
రామకథను పఠించువారు సర్వపాపాలనుంచి విముక్తులౌతారు అని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణ బాలకాండలో తెలుపుతారు.
****
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.
****
*శ్రీరామ రామ రామేతి*
*రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. రామనామ వరానే*
( బాలకాండ సమాప్తం)