12, మే 2022, గురువారం

ఉపాధ్యాయ ఉవాచ'

 మునిమాణిక్యం నరసింహారావు గారు వ్రాసిన 'ఉపాధ్యాయ ఉవాచ' లో ఒక విద్యార్థి తండ్రి తన కొడుకు తరుఫున వకాల్తా పుచ్చుకొని ఉపాధ్యాయుడిని యిలా ప్రశ్నించాడు.


ఏమిటి మాష్టారూ మా అబ్బాయి 'సింత పండు' అని చదివాడని కోప్పడ్డారట. నా కొడుకు ఎలా పలికితే మీకేమిటి? సింతపండు అంటే దాని పులుపు తగ్గిపోతుందా?అని నిలదీశాడు.

 

అయితే ఇది హాస్యానికి రాసిందే అయినా మనం మాత్రం ఉచ్చారణ మెరుగు పరుచుకోవాల్సిందే. 


సీతాన్వేషణ లో భాగంగా తొలిసారిగా ఆంజనేయుడు బ్రాహ్మణ వేషములో వచ్చి రామ లక్ష్మణులను కలిసి 

వారిని గురించి ఆరా తీస్తాడు. ఈ సంభాషణ లో రాముడు తమతో మాట్లాడుతున్న వ్యక్తి వ్యాకరణం బాగా తెలిసినవాడిలా వున్నాడు వేదం చదువుకున్నా వాడిలా వున్నాడు అని అనుకున్నాడు. 


ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి. దీనికి చిన్నతనం నుంచే శిక్షణ యివ్వాలి.

 

ఆంగ్లం లో ఉచ్చారణ సరిగ్గా లేకపోతే ఒప్పుకుంటున్నారా?ఒక్క స్పెల్లింగులో ఒక అక్షరం లోపించినా తప్పు 

పడుతున్నారు కదా! స్పెల్లింగు ఎలా వున్నా యిలాగే పలకాలి అంటే అలాగే పలుకు తున్నాము కదా ! మరి !

 

తెలుగులో కూడా ఉచ్చారణ సరిగ్గా వుండాలి కదా! వార్తలు చదివేటప్పుడు 'ఆశ్చర్యం' అనడానికి బదులుగా 'ఆచ్చర్యం', "నిశ్చయం" అనడానికి "నిచ్ఛయం" అని పలుకుతున్నారు. మరి ఎలా ఒప్పుకుంటున్నారు? యింకా ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు. హిందీ వార్తలు చదివే వాళ్ళు ఎంత విలక్షణంగా చదువుతారు. వినడానికి సొంపుగా వుంటుంది వార్తలే కాదు వాళ్ళు మాట్లాడినా ఉచ్చారణ బాగుంటుంది.


పాఠశాలలో చదివేటప్పుడే ఉచ్చారణ సరిగ్గా నేర్పించాలి. ఇప్పుడు బుల్లితెరలో వార్తలు చదివేవారు ఆంగ్లములో వ్రాసుకొని తెలుగులో చదువుతున్నట్టున్నారు. ఆచ్చర్యం, నిచ్ఛయం అంటూ తప్పుగా చదువుతున్నారు. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం.

 

ఎదుటి వ్యక్తికి మనపై సదభిప్రాయం కలగాలంటే మన ఉచ్చారణ సరిగా వుండాలి. దీనికి చిన్నతనం నుండే వాచకాల్లో పాఠాలను బయటికి స్పష్టంగా పలుకుతూ చదవాలి. అప్పుడే పదాలను పలకడం లో స్పష్టత సాధిస్తాం చదివే విధానం ఎలా ఉండాలో ఒక పద్యం లో వివరిస్తాడు 13 వ శతాబ్దికి చెందిన శివదేవయ్య (1250-1300)

 

వెనుకకు బోక ఈ(హా) యనక వేసట నొందక బంతి బంతిలో పెనుమక కానమిం బ్రెమసి బెగ్గిల కెంతయు మున్ను సూచుచున్ గనుకని యక్షరాక్షరము కందువు దప్పక యేక చిత్తుడై యనుపమ భక్తితో చదువు నాతని వాచకుండండ్రు సద్బుధుల్


చదవడం ప్రారభించాక చదువుతూ చదువుతూ వాక్యం మధ్యలో వెనక్కి పోగూడదు. ఆ,ఈ వూ అని అనకూడదు. విసుగు చెందకూడదు. ఒక ప్రవాహం లాగా ఆవిరళంగా సాగాలి. అంతేగానీ ముందున్న వాక్యాల్ని చూసి అమ్మో యింత కష్టంగా వుందేమిటని భయపడకుండా తొట్రుపాటు లేకుండా ఏ అక్షరాన్నీ వదిలి పెట్టకుండా ఏకాగ్రతతో సాటిలేని భక్తి శ్రద్ధలతో చదివేవాడిని, మాట్లాడేవాడిని మంచి వాచకుడు అని పండితులు అంటారు

 

ఎలా చదవాలో, సంభాషణ ఎలా చెయ్యాలో ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే తెలుగు కవులు వివరించారంటే మనది ఎంత గొప్ప సంప్రదాయమో అర్థమవుతూంది. ఇప్పటి తరానికి భాషను ఎలా ఉపయోగించాలో కూడా 

తెలియదు. చెప్పేవారు కూడా లేరు. ఉపాధ్యాయులు అలాగే వున్నారు, విద్యార్థులూ అలాగే వున్నారు. 

 

'పురుషార్థ సారం' లోని ఈ పద్యం రాజు కొలువులో లేఖలు, యితర విషయాలు చదివే వాళ్ళని ఉద్దేశించి వ్రాసిందే అయినా అందరికీ వర్తిస్తుంది.


(తెలుగువెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

మండోదరి

 రామ రావణ యుద్ధం ముగిసింది. రావణుని మరణ వార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగు తీసింది. 


రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవడం ఆమె నమ్మలేని కఠోర సత్యం అది. ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్టులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచిన వాడు. అల్పులైన మానవులు గెలవడం ఎలా సంభవం. సత్యమైనా జీర్ణయించుకునే మానసిక స్థైర్యం లేని స్థితి ఆమెది.


మండోదరి విడి పోయిన కొప్పు ముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయై పరుగు పరుగున వస్తుంది. మనసులో రాముని మీద కోపం. రాముని నిందించాలనే ఆత్రుత. రాముడిని ఇదివరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై 

ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. 


రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు. రావణ వధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి యుధ్ధ భూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా పడుతున్నది. దూరం నుండి వస్తున్న మండోదరి 

యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించిందతనికి. 


ఎవరో తెలియదు కాని నీడను 

చూస్తే ఆ ఆకారం స్త్రీ మూర్తిదని అతని కర్ధమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీమూర్తి నీడ తన  నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు.  


ఆ సన్నివేశాన్ని చూచిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో కూడా అతని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీ పై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టే రాముని పై తనకున్న క్రోధం ఆమెలో మాయమయింది. 


యుధ్దంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న. జయం అపజయం 

శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసింది వ్యక్తిత్వ వికాసం మాత్రమే. 

డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తు నిచ్చేవే. వ్యక్తుల నుండి 

విడదీసేవే. మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం 

అంటుంది రామాయణం. అలాంటి నాయక పాత్రకు ప్రతీక రాముడు.

 

అధమాః ధనమిచ్ఛంతి,

ధనం మానంచ మధ్యమాః

ఉత్తామాః మానమిచ్ఛంతి

మానోహి మహాతాం ధనం!

 

ధనం కోసం ఏమయినా చేసేందుకు వెనుకాడని వారు, ధనం మానం రెంటికై , 

యత్నించే వారు, మానం కోసమే జీవించే వారు ఈ మూడు రకాలయిన వ్యక్తులు 

సమాజంలో మనకు కనిపిస్తారు. మొదటి రకం అధములు, రెండవ రకం మధ్యములు. మూడవ రకం ఉత్తములు అంటున్నారు, సుభాషిత కర్త.

 

ఎలాగైనా గెలుపే పరమావధి అనుకోవడం Result oriented attitude కాగా ధర్మ 

బధ్దమైన రీతిలో విజయం పొందాలనుకోవడం Process oriented attitude. గెలుపు 

ఇతరులపై సాధించేది కాగా విజయం అందరి భాగస్వామ్యంతో పొందేది. గెలుపులో అసూయ ఉంటుంది, అభద్రత ఉంటుంది. విజయంలో శాంతి ఉంటుంది. సౌమనస్యత  ఉంటుంది. ఇదే రామాయణం మనకు బోధించే నీతి.

పొడుపు పద్యము

 ……  పొడుపు పద్యము  …...

ఆ. అందమైన పలుకు కైదక్షరమ్ములు 

రెండు, నాల్గు, మూడు పండు గగును 

అరయచూడ సర్ప మాద్యంతములుగూడ 

పదము తెలుప వలయు పసిడి బాల..!

చేతితో భోజనం

 *🙏చేతితో భోజనం ఎంత ఉపయోగమో!?🙏*


*డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.*

*తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..?*

*హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.*

*ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.*

*దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం..*

*చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.*

*అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం. ఇది చదివాక ఎక్కడున్నా…?*

*మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను*

*చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు......*


*1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.*


*2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.*


*3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.*


*4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.*


*6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.*


*7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.*


*8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.*


*9.చేతితో తినటం వల్ల ఎంత ఆహారం మనకు సరిపోతుందో తెలుస్తుంది.*


*10.శుభ్ర౦చేసిన చేతితో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు.*

*జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది.*

*ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది.*


*పురణాల పరంగా…*


*చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుందట.*


*బొటనవేలు:అగ్నితత్వం*


*చూపుడు వేలు:వాయుతత్వం*


*మధ్యవేలు:ఆకాశం*


*ఉంగరపు వేలు:భూమి*


*చిటికిన వేలు:జలతత్వం..*


*ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది.*

*ఫ్యాషన్ కి ఇచ్చినంత విలువ ..సంస్కృతికి ఇస్తే ...మానవ జీవనం కొంత సరళమవుతుందనుకుంటా...*

మునివాహన సేవ’

 హైదరాబాద్‌ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి సీఎస్‌ రంగరాజన్‌.. ఓ దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన ‘మునివాహన సేవ’తో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించారాయన

నోబెల్‌ గ్రహీత దలైలామా ప్రశంసలూ అందుకున్నారు. ఆ సేవ వైపు తనని నడిపించిందేమిటో ఇలా చెబుతున్నారు....


"నా బాల్య జ్ఞాపకాలన్నింటా చిలుకూరు వేంకటేశ్వరస్వామి ఆలయ పరిసరాలే పచ్చగా పరుచుకుని ఉంటాయి. 


తరతరాలుగా వస్తున్న అర్చకవృత్తిని చూస్తూనే నాన్న సౌందర్‌రాజన్‌ ఉన్నత చదువులు చదివారు. కామర్స్‌ లెక్చరర్‌గా మొదలుపెట్టి ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్‌ స్థాయికి ఎదిగారు. 


మా ఇంట్లో ముగ్గురం అబ్బాయిలమే. నేను నడిమివాణ్ణి. నేను చదువుకున్నదంతా క్రైస్తవ మిషనరీ బడుల్లోనే. అక్కడి దేవుని ప్రార్థనా గీతాలు అలవోకగా పాడేవాణ్ణి. టీచర్లు నా చేత సంస్కృత శ్లోకాలు చెప్పించుకుని ఆనందించేవాళ్లు. బడికి పెద్దగా నామాలు పెట్టుకునేవెళ్లేవాణ్ణి. క్రైస్తవ బడులైనా సరే ఈ విషయంలో అక్కడెవరూ నన్ను ఆక్షేపించింది లేదు. ఆ పరమత సహనమే నా వ్యక్తిత్వాన్నితీర్చిదిద్దిందని చెప్పాలి. 


చిన్నప్పటి నుంచీ వైద్యరంగంపైన ఆసక్తి ఉన్నా అప్పట్లో నాకు లెక్కల్లో మాత్రమే మంచి మార్కులొచ్చాయి. దాంతో ఇంజినీరింగ్‌ వైపే వెళ్లాల్సిన పరిస్థితి. 


అయినా వైద్యం మీద ఆశ చావక ఉస్మానియాలో ‘బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌’ తీసుకున్నా. చివరి ఏడాది థీసిస్‌ కోసం నేనూ నరేంద్రబాబూ అనే నా సహాధ్యాయీ కలిసి అతితక్కువ ఖర్చుతో తయారుచేయగల ‘సిరంజీ ఇన్‌ఫ్యూషన్‌ పంప్‌’ నమూనాని కనిపెట్టాం.


 డిగ్రీ పూర్తయ్యాక ఆ పరికరాన్నే భారీస్థాయిలో తయారుచేయాలనే కలతో నరేంద్రతో కలిసి ‘ఎన్‌ఆర్‌ బయోమెడికల్స్‌’ అనే కంపెనీ స్థాపించాను. 


మనస్పర్థలొచ్చాయి....


నరేంద్రతో నాకు చిన్నగా మనస్పర్థలు వచ్చాయి. తగవులు పడి విడిపోవడం ఇష్టం లేక ‘కంపెనీని నువ్వే చూసుకో’ అని చెప్పి నేను బయటకొచ్చేశా. అప్పుడే వైద్య పరికరాలు తయారుచేసే ‘మెడ్‌ ట్రానిక్స్‌’ సంస్థ నాకు అధికారిగా ఉద్యోగం ఇచ్చింది.


 చెన్నైలో ఉద్యోగం. అక్కడ పనిచేస్తున్నంత కాలం చిలుకూరికి దూరమవుతున్నాననే బాధ పీడిస్తూనే ఉండేది. ఆరేళ్లు గడిచాయి. ఇక ఉండబట్టలేక ఉద్యోగం మానేస్తానని చెప్పాను. దాంతో నాకోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ప్రాంతీయ కార్యాలయం ఒకటి తెరిచారు. 


దక్షిణాది మొత్తానికి నన్ను హెడ్‌గా నియమించారు. 1999లోనే సంవత్సరానికి పదిలక్షల రూపాయల జీతం! ఇక జీవితానికి ఏ ఢోకా లేదు అనుకుంటుండగానే.. ఓ సంక్షోభం మమ్మల్ని కుదిపేసింది. 


సర్కారు చట్టానికి నిరసనగా....


హైదరాబాద్‌ నగరానికి తాగునీళ్లిచ్చే ఉస్మాన్‌ సాగర్‌ చెరువులో ఉన్న ఓ చిన్న లంకే ఈ చిలుకూరు. ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహం వెలసిన కొన్నేళ్ల తర్వాత అహోబిల మఠం స్వామీజీ అక్కడికి వచ్చారట. 


ఆగమాల ప్రకారం అనునిత్యం ఇక్కడ దేవుని సేవచేయడానికి తన శిష్యుణ్ణీ, అతని కుటుంబాన్నీ ఇక్కడే ఉండిపొమ్మన్నారట. ఆ శిష్యుడే మా పూర్వీకుడంటారు. తర్వాతికాలంలో ఔరంగజేబు ఆక్రమణకీ, రజాకార్ల దాడులకీ ఎదురొడ్డి ఈ ఆలయాన్ని కాపాడుకున్నాం. 


ఇప్పటికీ ఆ దేవుణ్ణి మా ఇంటి పెద్ద కొడుకుగానే మేమంతా భావిస్తాం. అలాంటిది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1987లో 30/70 అనే దేవాదాయ చట్టంతో వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేస్తూ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మంది! 


నాన్నగారు చట్టరీత్యా పోరాడి సుప్రీం కోర్టు నుంచి కొత్త మార్గదర్శకాలు తెప్పించుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 1995 తర్వాత ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో దేవాదాయశాఖ దీన్ని సొంతం చేసుకోవాలనుకుంది.


 మా గుడిని యాదగిరిగుట్టకి అనుబంధ ఆలయంగా మార్చాలనుకుంది! అప్పుడు నాన్న మాకు వారసత్వ హక్కులు వస్తాయని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు చూపించి వాదించారు. 


అప్పుడే ఓ అధికారి.. 

‘సౌందర్‌రాజన్‌గారూ, మీ అబ్బాయిలు ముగ్గురూ ఇంజినీర్లు. వాళ్లు ఇక్కడికొచ్చి అర్చకత్వం ఎలాగూ చేయరు. ఇక దేనికండీ మీకీ ఆరాటం!’ అన్నారు. ఆ మాటలు నన్ను ఓ కొరడాలా తాకాయి. ఆ రోజే నిర్ణయించుకున్నా.. నాన్నగారి వారసత్వాన్ని నేనే ముందుకు తీసుకెళ్లాలని! 


అల్లకల్లోలమే....


నాకప్పుడు 35 ఏళ్లు. ‘మెడ్‌ట్రానిక్స్‌’ కంపెనీలో ఉన్నతాధికారి పదవి. ఒకట్రెండు సంవత్సరాల్లో దేశం మొత్తానికీ హెడ్‌ అయ్యే అవకాశాలూ ఉన్నాయి. అంత భవిష్యత్తున్న నేను ఇలా అర్చకవృత్తిలోకి రావాలనుకోవడం నాన్నకి అస్సలు ఇష్టంలేదు! కుటుంబంలో అల్లకల్లోలమే రేగింది. 


ఎవ్వరూ ఒప్పుకోలేదు. నేనూ నా నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు! రెండునెలల తర్వాత వాళ్లనెలాగోలా ఒప్పించాను. ఇక ఆఫీసులో అయితే నన్నెవరూ నమ్మలేకపోయారు. 


‘ఇంతమంచి ఉద్యోగం వదులుకుని అర్చకత్వం చేస్తారా!’ అని నవ్వారు. ఎవరేమన్నా, అర్చకుడిగా ఆహార్యం మార్చుకుని ఆలయంలోకి అడుగుపెట్టి హారతి పళ్లెం అందుకున్నాను! 


కొత్తదారిలో.. 

అర్చకుడిగా మారిన తొలిరోజుల్లోనే నాన్నగారితో మాట్లాడి ఆలయంలో హుండీని తీసేయించాను. వీఐపీ దర్శనాలూ, టికెట్లేవీ లేకుండా ఆలయానికి వచ్చే భక్తులందరూ సమానమేనని ప్రకటించాను. ఇప్పటికీ అదే తు.చ.తప్పకుండా పాటిస్తున్నాం. 


ఏ ఆదాయమూ లేదుకాబట్టి దేవాదాయ శాఖకి మా ఆలయం మీద ఆజమాయిషీ చలాయించే అవకాశం లేకుండా చేశాను. దేవాదాయ చట్టం 30/87 వల్ల తరతరాలుగా ఆలయాన్ని నమ్ముకున్న ఎన్నో అర్చక కుటుంబాలు 

ఎంతో నష్టపోయాయి.


 అందుకే ఆ చట్టంపై అన్నిరకాలా పోరాడుతున్నాను. 1990లకి ముందు మా ఆలయానికి వారం మొత్తం మీద వెయ్యిమంది వస్తే గొప్ప! ఇప్పుడు వారాంతాల్లో నలభైవేలమందిదాకా వస్తున్నారు. వాళ్ల ద్వారా సామాజికంగా మార్పులు తీసుకువచ్చే పనులు చేపట్టాలనుకున్నా.


 ఇవన్నీ కూడా నేను నమ్మే సనాతన ధర్మమనే చట్రంలోనే ఉండాలనుకున్నాను. సనాతన ధర్మమంటే మూఢాచారమో, స్త్రీలపై వివక్షో, అంటరానితనాన్ని ప్రోత్సహించడమో కానేకాదు. అవన్నీ నడమంత్రంగా వచ్చిన ఆచారాలు మాత్రమే. 


వాటిని పట్టుకుని వేలాడితే హిందూ మతానికే ముప్పు తప్పదు. అసలైన హిందూ ధర్మం మన చుట్టూ ఉన్న ప్రతి జీవినీ ప్రేమించడమే. మన వేదవేదాంగాల సారం అదేనని నేను నమ్ముతా! అందుకే నా వంతుగా ఇక్కడున్న సమస్యలూ, రుగ్మతలూ తీరేందుకు ఏమైనా చేయాలనుకున్నా. 


‘ఇదంతా నటన’ 


ఇక్కడి చేనేత కార్మికులు లాభపడేలా వారాంతాల్లో వచ్చే భక్తులందరూ చేనేత వస్త్రాలే ధరించి రావాలని కోరాను. అది మంచి ఫలితాన్నిచ్చింది. బాలికలపై అత్యాచారాలు జరగకుండా ఆ పసిపాపల్ని దేవతల్లాగే చూడాలని ‘కన్యావందనం’ అనే కార్యక్రమాన్ని చేపట్టాను.


 ప్రతి ఏటా ఫిబ్రవరిలో మేం ఇది చేస్తున్నాం! అమ్మాయిల గొప్పతనం చాటేలా ‘మహలక్ష్మీ’ పూజ అనీ చేస్తున్నాం. ఆరోజు పెళ్లికాని అమ్మాయిలకి కొత్తబట్టలుపెట్టి కాళ్లకి పారాణి రాస్తాం. వీటన్నింటి ద్వారా గుర్తింపుపెరిగి టీవీలో ఏ చర్చాకార్యక్రమాలు చేస్తున్నా నన్ను పిలవడం మొదలుపెట్టారు. 


నా మాటలు టీవీల్లో ప్రసారం కాగానే ‘మీదంతా నటన. అసలు పూజారులందరూ దుర్మార్గులు. అవినీతిపరులు. మీవల్లే దళితులపైన వివక్ష’ అంటూ కుప్పలుతెప్పలుగా లేఖలు వచ్చేవి. ‘ఎవరో కొందరివల్ల మొత్తం హిందూ అర్చకులనే చెడ్డవారంటే ఎలా?’ ఈ మథనం నాలో చాలారోజులుగా ఉండేది. 


అంత అంటరానితనమా? 


గత ఏడాది అయ్యప్పస్వామి పడిపూజకని పిలిస్తే వెళ్లా. కార్యక్రమం తర్వాత నా దగ్గరకి ఓ వ్యక్తి బిడియంగా వచ్చి ‘స్వామీ! ఈ అయ్యప్ప పూజలోనూ కులాల వివక్ష తప్పట్లేదు. నేను దళితుణ్ణని నా వంటని వేరుగా వండుకోమని చెబుతున్నాడు మా గురుస్వామి!’ అన్నాడు. 


నేను కోపంతో వణికిపోయా. గురుస్వామిని పిలిచి చెడామడా తిట్టేశాను. అప్పుడే ఓ దళిత సంఘం నన్నో సమావేశానికి పిలిచి ప్రసంగించాలని చెప్పింది. నేను దళితులని ఆలయ ప్రవేశం చేయించడం శ్రీవైష్ణవ సంప్రదాయంలో వేలాది సంవత్సరాలుగా ఉందంటూ ‘మునివాహన సేవ’ గురించి చెప్పాను. 


అప్పుడో సభ్యుడు లేచి ‘మీరయితే ఓ దళితుణ్ని అలా భుజాలపై మోసుకెళ్తారా!’ అని సవాలు విసిరాడు. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. చేసి తీరతాననే చెప్పాను. అలా ఏప్రిల్‌ 17న ‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే..’ అని పాడుకుంటూ ఆ హరిజన భక్తుణ్ణి మోసుకెళ్లాను. అంతర్జాతీయ మీడియా కూడా దీన్ని ప్రసారం చేసింది. సోషల్‌ మీడియా ఆ దృశ్యంతో హోరెత్తింది. 


దలైలామా మెచ్చారు....

 

నోబెల్‌ గ్రహీత దలైలామా కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిన రోజుని మరచిపోలేను! నేను మాట్లాడిన కొద్దిసేపటికే ఆయనో పెద్ద సందేశం పంపారు. ‘మీరు చేసిన పని ఆదర్శనీయం. సదా ఆచరణీయం. దేవుడి ముందు అందరూ సమానమేనని సోదాహరణంగా వివరించారు’ అంటూ సాగిందా లేఖ! 


ఇది నాకెంతో నమ్మకాన్నిచ్చింది. ఇది ఈ ఒక్క ఆలయ ప్రవేశంతో ఆగిపోదు. నగరాల్లోకంటే గ్రామాల్లోనే అంటరానితనం ఎక్కువ. కాబట్టి.. రెండు తెలుగురాష్ట్రాల్లోనూ పల్లె నుంచి పట్టణం దాకా ఓ ఉద్యమంలా దీన్ని నిర్వహించబోతున్నాం. 


ఇది జరిగాక ప్రముఖ రచయిత కొలకలూరు ఇనాక్‌, కవి గోరటి వెంకన్న వంటివారు ఫోన్‌ చేసి అభినందనల్లో ముంచెత్తారు. ఆ మధ్య తిరుమలకి వెళ్లాను. నా గురించి అప్పటికే టీవీల్లో చూశారు కాబట్టి ఎంతోమంది జనం చుట్టుముట్టారు. 


అప్పుడో ముసలాయన తచ్చాడుతూ వచ్చి ‘మా జాతిని మోసిన భుజాలు ఇవే నా బాబూ..!’ అంటూ వచ్చి ముద్దుపెట్టుకున్నాడు. ఎందుకో తెలియదు ఆ దేవుడే వచ్చి నన్ను తాకాడా అనిపించింది ఆ రోజు! బొటబొటా కన్నీళ్లొచ్చేశాయ్‌!!


ఆ విలాసాలు వదులుకుంది...


"సుధని.. నేను ఇంటర్‌ చదివేటప్పుడు అహోబిల మఠంలో మొదటిసారి చూశాను. ఆమె అక్కడ ‘నృసింహప్రియ’ పత్రిక సంపాదకుడి బంధువులమ్మాయి. చూడగానే ప్రేమలో పడ్డానుకానీ మనసులో దాచుకున్నాను.


ఆ పత్రికకి ‘ఫల్గుణ’ పేరుతో కథలూ, వ్యాసాలు రాయడం మొదలుపెట్టా. 

ఇంజినీరింగ్‌ ముగించాక ఇంట్లో విషయం చెప్పాను. వ్యతిరేకత లేదుకానీ.. పూర్తిగా అంగీకరించినట్టూ కాదు. ఎట్టకేలకు పెళ్ళైంది.


మాకు ఇద్దరు పిల్లలు. పెద్దాడికి ఏడేళ్లున్నప్పుడు అర్చకవృత్తిలోకి వెళ్లిపోతున్నానని చెప్పాను.  ‘బాగా ఆలోచించే ఈ పని చేస్తున్నావా..!’ అని పదేపదే అడిగింది. 


అర్చకుడిగా నా ఆహార్యం, రోజూ దేవుడికిచ్చిన నైవేద్యం మాత్రమే తినడం.. నన్ను చూసి వచ్చే కన్నీళ్లని దాచుకునేందుకు విఫలయత్నం చేసేది. 


ఆదాయం లేకపోవడంతో అప్పటిదాకా ప్రైవేటు బడుల్లో చదువుతున్న పిల్లల్ని తెచ్చి కేంద్రీయ విద్యాలయంలో చేర్చాను. మా పెద్దోడు సీఏ చేస్తున్నాడు. చిన్నబ్బాయి ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. 


వీటన్నింటి వెనక నా భార్య ఇచ్చిన నైతిక మద్దతు అంతాఇంతా కాదు. లక్షల రూపాయల జీతం ఇచ్చే విలాసాలు వదులుకుని భర్తవెంట నడవాలంటే ఎంత కృతనిశ్చయం ఉండాలో కదా! తన అంగీకారంతోనే, ఆ మధ్య నా ఇద్దరి పిల్లల్లో ఒకర్ని బాలాజీ సేవకే అప్పగించాలనే నిర్ణయం కూడా తీసుకున్నా!".....

రక్తదోషము

 రక్తదోషము నివారించి రక్తశుద్దిని కలిగించు దేశివాళి  టీపొడి తయారీ విధానం  - 


    నీడలో ఎండించిన పుదీనా ఆకు 200 గ్రాములు , మంజిష్ట చూర్ణం 50 గ్రాములు , మిరియాల చూర్ణం 10 గ్రాములు మోతాదులో సేకరించి వీటన్నింటిని కచ్చాపచ్చాగా చూర్ణం చేసుకుని ఒక డబ్బాలో నిలువ ఉంచుకుని ఈ చూర్ణమును ప్రతినిత్యం ప్రాతఃకాలం నందు 5 గ్రాముల మోతాదులో తీసుకుని పావులీటరు నీటిలో మరిగించి వడపోసి దానియందు తగుమాత్రము పాలు , పంచదార కలిపి టీకి బదులుగా ఈ పానీయం సేవించుచుండిన రక్తము శుభ్రపడి దుష్టరక్తము వలన కలుగు వ్యాధులు సమూలంగా అంతరించును. ముఖ్యముగా చర్మవ్యాధుల వారికి బాగా ఉపయోగపడును. 


           పైన చెప్పిన దేశివాళి టీపొడి తయారుచేసుకొని మామూలు టీ పొడి బదులు వాడుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 


   

          మరింత సమగ్ర సమాచారం కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                    9885030034

    

       ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  .  మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాలక్షేపంకబుర్లు

 శర్మ కాలక్షేపంకబుర్లు - కడవంతగుమ్మడి కాయ…….


ఛురికాకూష్మాండన్యాయం


”కడవంతగుమ్మడి కాయ కత్తిపీటకి లోకువ” అంటారు, అదే ఇది. ఛురిక అంటే చాకు కూష్మాండం అంటే బూడిద గుమ్మడి కాయ. చాకు చిన్నదే కాని చాలా పెద్దదయిన గుమ్మడికాయను ముక్కలు ముక్కలుగా నరకగలదు. దీనిబట్టి తెలిసేది ఆకారం, పరిమాణం కాదు ప్రధానం. మిరియపుగింజ, మిరపగింజ ఎంత ఉంటుంది? కొరికితే? అదనమాట సంగతి.ఏనుగు ఎంత పెద్దదయినా అంకుశానికి లొంగినట్లు మరోమాట చిన్న ఉదాహరణ ఆయనో పెద్ద రచయిత, గజారోహణం చేయించారు, కాని ఇంటి దగ్గర ఇల్లాలు మాత్రం కూరలో కరివేపాకులా తీసిపారేస్తుంది. ఆ( ఏనుగెక్కించి ఒక సారి ఊళ్ళో తిప్పి ఒక శాలువా కప్పేరు, అది కూటికా గుడ్డకా అని విదిలిస్తుంది, పాపం కడవంత గుమ్మడి కాయ కత్తిపీటకి లోకువే కదా! 


 సేకరణ : సుధాకర్ కురువాడ