15, జనవరి 2026, గురువారం

తటిల్లతా సమరుచిః

 🌹తటిల్లతా సమరుచిః🌹


అమ్మ మెరుపు తీగ వలె ప్రకాశిస్తుందని చెప్పుకున్నాం కదా. 

తటిల్లత అంటే శంపాలత, మెరుపుతీగ. రుచి అంటే కిరణము, కాంతి. 

అమ్మ ఆ సహస్రార స్థానంలో ఒక తటిల్లతా కాంతితో మెరిసిపోతూ దర్శనం ఇస్తూ ఉంటుంది. 

మెరుపు ఒక్క క్షణమాత్రం మెరిసి మాయమైపోతుంది. ఆ మెరుపులంత సౌందర్యం అమ్మది. 

క్షణం పాటు కనిపిస్తుంది కనుకే, అంత మహోత్కృష్టమైన కాంతితో మెరిసిపోతున్నా, 

ఆ మెరుపులని  మనం చూడగలుగుతున్నాము. మెరుపు ఎంత అందంగా వున్నా, 

ఎంత ప్రకాశంగా వున్నా, ఎంత మోహింపచేసేలా వున్నా, అది క్షణకాలం ఉంటేనే చూడగలం. 

ఒక్కోసారి మెరుపు దగ్గరగా వచ్చినప్పుడు, మనం వున్న ప్రాంతమంతా కూడా అద్భుతమయిన 

విద్యుత్ కాంతితో వెలిగిపోయి, దానిని చూసాక, కళ్ళు చెదరి, కొంత సేపు మరి ఏమీ కనపడవు. 

అటువంటి మిరుమిట్లు గొలిపే కాంతితో వెలిగిపోయే 

అమ్మను చూడటానికి ఈ చర్మ చక్షువులు చాలవు. 

అది కన్నులు తెరచి చేసే దర్శనం కాదు. కనులు మూసి మనోనేత్రంతో చేయవలసిన దర్శనం. 

చుట్టూ అజ్ఞానమనే నల్లని మేఘాలు, మధ్యలో తళుక్కుమని మెరిసి మాయమైపోయే జ్ఞానరేఖ. 

అదే అమ్మ దర్శనం. జీవితం తరించటానికి ఆ క్షణ మాత్ర దర్శనం చాలు. 

ఉపాసకులు, ఋషులు, ఇలా అమ్మ అనుగ్రహానికి పాత్రులైన ఏ కొద్దిమందో, 

అమ్మ అనుమతితో, తమ అంతః చక్షువులతో ఆ దర్శనం చేయగలరు. 

మెరుపు మెరిసే ముందు గట్టిగా ఉరుమే ఉరుములాగా, అమ్మ వాహనమైన సింహం 

గట్టిగా గర్జించి భక్తులను ఆ దర్శనానికి సమాయత్తం చేస్తుంది. 

ఆ గర్జన వల్ల  కొందరికి కళ్ళు తెరుచుకుంటే, కొందరిని ఆ గర్జనే భయపెట్టి కళ్ళు

మూసుకునేలా చేస్తుంది. ఆ గర్జన మన జగజ్జనని వాహనం చేసినదే అని తెలుసుకుని

వెనువెంటనే తళుక్కుమనే వెలుగులతో మెరిసిపోతున్న అమ్మను క్షణకాలమైనా మనసుల

దర్శించగలితే, అంతకన్నా కావలసిందేమిటి. అమ్మ తటిల్లతా కాంతులను చూడలేము కనుక,

ఆ తల్లి కాలివేలి గోటి కాంతులను మనసులో భావిస్తే, ఆ తల్లి కరుణించి దారి చూపుతుంది. 

సహస్రారం చేరి, తన దర్శనం కోసం ఆరాటపడే భక్తులకు,

తన అపురూపమైన తటిల్లతా రూపంతో కటాక్షిస్తున్న ఆ తటిల్లతాసమరుచి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

పంచాంగం



  

మూక పంచశతి

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 05*


*పంచశరశాస్త్రబోధన పరమాచార్యేణ దృష్టిపాతేన ı*

*కాంచీసీమ్ని కుమారీ కాచన మోహయతి కామజేతారమ్ ||*


*భావము :*


*అమ్మ క్రీగంటి చూపులు, కాముని దహించిన ఈశ్వరునే మోహింప చేయ గలిగాయంటే, ఆ చూపులు, కామ శాస్త్రమును బోధించుటలో ప్రవీణులైన గురువులవంటివే కదా.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


నేహాభిక్రమనాశోఽస్తి                               

ప్రత్యవాయో న విద్యతే ।

స్వల్పమప్యస్య ధర్మస్య                                

త్రాయతే మహతో భయాత్ ।। 40 ।।



ప్రతిపదార్థ:


న — కాదు; ఇహ — దీనిలో; అభిక్రమ — ప్రయత్నములు; నాశః — నష్టము; అస్తి — ఉండును; ప్రత్యవాయః — ప్రతికూల ఫలితములు; న — కాదు; విద్యతే — ఉండును; సు-అల్పం — ఏ కొంచెము; ఆపి — కూడా; అస్య — దీని; ధర్మస్య — ధర్మము యొక్క; త్రాయతే — కాపాడును; మహతః — గొప్ప; భయాత్ — ప్రమాదం నుండి.



  తాత్పర్యము :


ఈ దృక్పథంతో పనిచేసినప్పుడు, ఎలాంటి నష్టము కానీ వ్యతిరేక ఫలితములు కానీ కలుగవు. కొద్దిగా సాధన చేసినా అది మనలని పెద్ద ప్రమాదం నుండి కాపాడును.


 వివరణ:


మనం ఎదుర్కునే గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ శరీరం లభించక పోవచ్చు; బదులుగా, నిమ్న స్థాయి జీవ జాతులలోకి అంటే పశువులు, పక్షులు వంటివి, లేదా అధోలోక జీవజాతుల్లోకి వెళ్ళవచ్చు. మానవ జీవితం మనకు ఎలాగూ వచ్చేదేలే అని భావించలేము, ఎందుకంటే తదుపరి ఎలాంటి జన్మ ఉండాలో, మన కర్మలను బట్టి మరియు మన జ్ఞానం యొక్క స్థాయిని బట్టి నిర్ణయింపబడుతుంది.


84 లక్షల జీవరాశుల జాతులు ఉన్నాయి. మానవుల కంటే తక్కువ స్థాయిలో ఉన్న - జంతువులు, పక్షులు, చేపలు, పురుగులు, మరియు ఇతర అన్నీ – వాటికి మన మానవుల లాగా పరిణితి చెందిన బుద్ధి లేదు. అయినా అవి కూడా సాధారణ పనులైన తినటం, నిద్రపోవటం, రక్షించుకోవటం, మరియు సంభోగం వంటివి చేస్తుంటాయి. ఒక ఉన్నత ప్రయోజనం కోసం, తమను తాము ఉద్ధరించుకోటానికి ఉపయోగించుకోటానికి మానవులకు జ్ఞాన శక్తి ఇవ్వబడింది. ఒకవేళ మనుష్యులు తమ బుద్ధిని జంతువులు కూడా చేసే తినటం, నిద్రపోవటం, సంభోగం, మరియు రక్షించుకోవటం వంటి కార్యాలకే కానీ విలాస వంత రూపంలో చేయటానికి, ఉపయోగిస్తే అది మానవ శరీరాన్ని దుర్వినియోగం చేసినట్టే. ఉదాహరణకి తినటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంటే, వారికి ఒక పంది శరీరం సరిగ్గా సరిపోతుంది, ఆ ప్రకారముగా వారికి వచ్చే జన్మలో పంది శరీరం ఇవ్వబడుతుంది. ఒకవేళ నిద్ర పోవటం తమ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుడు వారికి పోలార్ ఎలుగుబంటి శరీరం మంచిగా సరిపోతుందని, అదే వారికి వచ్చే జన్మలో కేటాయిస్తాడు. కాబట్టి గొప్ప ప్రమాదం ఏమిటంటే మనకు వచ్చే జన్మలో మానవ జన్మ లభించక పోవచ్చు. వేదాలు ఇలా పేర్కొంటున్నాయి:


 


ఇహ చేదవేదీదథ సత్యమస్తి న చేదిహావేదీన్మహతీ వినష్టిః


(కేనోపనిషత్తు 2.5)


 


‘ఓ మానవుడా, మానవ జన్మ ఒక దుర్లభమైన అవకాశం. దీనిని నీవు నీ లక్ష్యం చేరుకోవటానికి సద్వినియోగం చేసుకోకపోతే, నీవు చాలా నష్టపోతావు.’ (కేనోపనిషత్తు 2.5). ఇంకా వేదాలు ఇలా పేర్కొంటున్నాయి:


ఇహ చేదశకద్ బోద్ధుం ప్రాక్ శరీరస్య విస్రసః

తతః సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే


(కఠోపనిషత్తు 2.3.4)


 


‘భగవత్ప్రాప్తి కోసం ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించక పొతే, నీవు ఎన్నో జన్మలలో 84 లక్షల రకాల జీవ రాశులలో పడి తిరుగుతుంటావు.’


కానీ, మనం ఒకసారి ఆధ్యాత్మిక సాధన యొక్క ప్రయాణం మొదలుపెడితే, దాన్ని ఈ జన్మలో పూర్తిచేయలేకపోయినా, భగవంతుడు మనకు ఆ ఉద్దేశము ఉంది అని గమనిస్తాడు. కాబట్టి, ఆ ప్రయాణాన్ని ఎక్కడ ఆగిపోయిందో అక్కడనుండే మొదలు పెట్టడానికి మానవ జన్మని తిరిగి ప్రసాదిస్తాడు. ఈ విధంగా, మనకు ఒక పెద్ద ప్రమాదం తప్పుతుంది.


అంతేకాక, ఈ మార్గంలో చేసిన ఏ ప్రయత్నం వలన ఎప్పటికీ ఎటువంటీ నష్టం కలుగదు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఎందుకంటే, ప్రస్తుత జీవితంలో మనము కూడబెట్టుకున్న భౌతిక సంపద అంతా మరణ సమయంలో ఇక్కడే వదిలి వేయాలి. కానీ, యోగపథంలో మనము ఏదేని ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తే, భగవంతుడు దానిని భద్రపరిచి, దాని ప్రతిఫలాలు వచ్చేజన్మ లో ఇచ్చి, మళ్లీ ఎక్కడ అయితే వదిలామో అక్కడినుండి తిరిగి పురోగతి సాధించేటట్టు చేస్తాడు. ఈ విధంగా అర్జునుడికి దాని ప్రయోజనము ఉపదేశించిన శ్రీ కృష్ణుడు ఇప్పుడు మమకారాసక్తి లేకుండా పని చేసే విజ్ఞానాన్ని గురించి ఇక చెప్పటం ప్రారంభిస్తున్నాడు .

శ్రీహరి స్తుతి 33*

  *శ్రీహరి స్తుతి 33*


*కం.శ్రీ రంగాయని తలచిన* 

*దూరంబగు కష్టమెల్ల దుఃఖముతొలగున్*

*చేరదు నే పాపంబును*

*నోరారా పిలుచుకొనుచు నోచిన చాలున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు. మిట్టాపల్లి**శ్రీహరి స్తుతి 32*


*కం‌. మార్గళి మాసపు దీక్షలు*

*దుర్గుణముల నుండి మనసు దూరము చేయున్*

*నిర్గుణుడగు పరమాత్ముడు* 

*మార్గంబును మార్చి వేయు మనుజుల కెల్లన్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి**శ్రీహరి స్తుతి 31*


*కం.వెంకట రమణుని సేవలు*

 *సంకటముల బాపుచుండు శాశ్వత రీతిన్*

*పంకజ నేత్రుని కరుణతో*

*శంకలు లేకుండ బ్రతుకు సాగుచు నుండున్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

సుభాషితమ్

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


    శ్లో𝕝𝕝   *భోగిజ్వాలే! త్వముత్పన్నా* 

             *యథా తుహి నసంహతిమ్|*

             *నివారయసి చిత్తేమే* 

             *తథావిద్యాం నివారయ* ||


తా𝕝𝕝 ....*ఓ భోగిజ్వాలా*! ...*నీవు భోగిపండగ నాడు ఉద్భవించి ఎలాగైతే మంచు పొరలను తొలగిస్తున్నావో*, అలాగే *నాలో వున్న అజ్ఞానాంధకారాన్ని తొలగించి తత్వజ్ఞానాన్ని కలిగించుమా*!


✍️💐🌹🌸🙏

ప్రశాంతత వ్యాపిస్తుంది.*

 ఒక సాయంత్రం, భర్త తలుపు దగ్గర నుండి అలా ఎప్పటిలాగే  పిలిచాడు:

“ పండూ , నేను కొంచెం సేపు  ఫ్రెండ్స్‌తో బయటికి  వెళ్ళొస్తా .”


బట్టలు మడుస్తూ ఉన్న భార్య అతని వైపు ఒక్కసారి చూసి,

“సరే. ఎంజాయ్ చేయండి,” అనింది.


అతనికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది.

సాధారణంగా ఆమె అతనికి — త్వరగా రావాలని, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, ఎక్కువసేపు బయట ఉండొద్దని — ఏదో ఒకటి చెప్పేది.

కానీ ఆ రోజు రాత్రి అదేమీ లేదు. ఉపన్యాసం లేదు, నిట్టూర్పు లేదు, ఎందుకు అన్న ప్రశ్న లేదు. కేవలం ఒక శాంతమైన “సరే.”తో  ఒప్పుకొంది.


కొన్ని గంటల తర్వాత, వారి టీనేజ్ కొడుకు చేతిలో ఒక పేపర్ పట్టుకుని కిచెన్‌లోకి వచ్చాడు. ముఖం స్పష్టంగా పసుపురంగులోకి మారింది.

“అమ్మ,” అని నెమ్మదిగా అన్నాడు, “నా మాక్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి… చాలా తక్కువ  వచ్చాయి.”


అతను నిలబడి, అమ్మ తిడుతారని ముందే ఊహించుకున్నాడు.

అతనికి తెలుసు — అమ్మ చదువుపై ఎంత శ్రద్ధ పెడుతుందో.

సాధారణంగా వచ్చే ఉపన్యాసం, టైమ్ వృథా చేశావు, నీ టాలెంట్ సరిగా వాడుకోవడం లేదు…అంటుందని  ఎదురుచూశాడు.


కానీ ఆమె తల ఊపి,“సరే,” అనింది.

అతను ఆశ్చర్యపోయాడు.

“కేవలం… సరే?”


“అవును,” అంది ఆమె మృదువుగా. “నువ్వు కష్టపడితే.  వచ్చే సారి బాగా వస్తాయి. లేకపోతే సెమిస్టర్ రిపీట్ చేయాలి. అది నీ నిర్ణయం. ఏది ఎంచుకున్నా నేను నీకు తోడుగా ఉంటాను.”


అతను  కన్ఫ్యూషన్తో  వెళ్లిపోయాడు. అమ్మ ఇంత శాంతంగా ఎప్పుడు మారిపోయింది  ? అని ఆశ్చర్యపడ్డాడు.


మరో రోజు మధ్యాహ్నం, వారి కూతురు భయంతో ఇంట్లోకి వచ్చింది. హాలులో కాసేపు ఆగి, లివింగ్ రూమ్‌లోకి అడుగు పెట్టింది.

“అమ్మ,” అంది తడబడి, “నేను… కారు ఢీకొట్టేశాను. పెద్దది కాదు కానీ డెంట్ వచ్చింది.”


అమ్మ కోపపడలేదు, అరవలేదు, కనుబొమ్మలు ఎత్తలేదు కూడా. కేవలం,

“సరే. రేపు రిపేర్ షాప్‌కి తీసుకెళ్లి సరిచేయించు,” అంది.


అమ్మకు కోపం రాకపోవడంతో కూతురు షాక్ అయ్యింది.

“మీకు… కోపం లేదా?” తల్లి చిరునవ్వు నవ్వింది.

“లేదు. కోపపడితే కారు మళ్లీ బాగవుదు కదా. ఇక నుంచి జాగ్రత్తగా డ్రైవ్ చెయ్యి అంతే.”


ఇప్పటికే ఇంట్లో అందరూ ఆందోళన పడడం మొదలుపెట్టారు.  ఇలా ఉండే మహిళ కాదు ఆమె. ఆందోళన, ఒత్తిడి, ఉపన్యాసాలు — ఇవన్నీ సాధారణం.

కానీ ఇప్పుడు? శాంతి, సమతుల్యత, ప్రశాంతత.


వాళ్లు తమలోనే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఏం జరిగింది? ఆరోగ్యం బాగోలేదా? ఏదైనా బాధ ఉందా?


ఆ సాయంత్రం, వాళ్లు ముగ్గురూ ఆమెను కిచెన్ టేబుల్ వద్ద కూర్చోబెట్టారు.


భర్త అడిగాడు,

“ పండూ … నువ్వు చాలా తేడాగా  ప్రవర్తిస్తున్నావు. ఏమైంది? బాగున్నావా?”


ఆమె తన కుటుంబాన్ని — ఎన్నేళ్లుగా తెలియకుండానే తన సహనాన్ని పరీక్షించిన ఈ మనుషులను — స్నేహంగా చూసి చిరునవ్వు నవ్వింది.


“ఏమీ కాలేదు. ప్రతిదీ బాగానే ఉంది. నేను కేవలం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను.”


వాళ్లు ఆగి ఆమె మాట కోసం ఎదురుచూశారు.


“ప్రతి మనిషి తన జీవితం గురించి పూర్తిగా తానే బాధ్యత వహించాలి అని తెలుసుకొనేందుకు  నాకు చాలా కాలం పట్టింది,” అని ఆమె చెప్పింది.


భర్త కాస్త అయోమయంగా,

“అంటే?” అని అడిగాడు.


ఆమె చేతులను టేబుల్‌పై ఉంచి చెప్పింది:

“ఇంతకాలం నేను అన్నింటికీ భయపడేదాన్ని. నువ్వు రావడం ఆలస్యమైతే భయం. పిల్లలకు మార్కులు తక్కువైతే  నిందించేదాన్ని. ఏదైనా పాడైతే కోపపడేదాన్ని. ఎవరు బాధలో ఉన్నా, నేను సరి చెయ్యాలని చూసేదాన్ని. అందరి సమస్యలను నా భుజాలపై మోశాను.

కానీ ఇంతకాలం తరువాత తెలుసుకున్నాను — *నా ఆందోళన వాళ్ల సమస్యలను పరిష్కరించదు. అది నా మనసుకే  నష్టం.”*


ఆమె కూతురు నిశ్శబ్దంగా వింటోంది.


ఆమె మరింత మృదువుగా కొనసాగించింది.:

“నా టెన్షన్ ఎవరికీ లాభం లేదు ?. నా ఒత్తిడి మీ జీవితాలను సరి  చేయదు — కేవలం నన్నే అలసటకు గురి చేస్తుంది. నేను మీరు చేయాల్సిందేమిటో చెప్పగలను, *ప్రేమించగలను, తోడుగా నిలబడగలను. కానీ మీ జీవితాలను నేను జీవించలేను. నిర్ణయాలు మీరు తీసుకోవాలి. ఫలితాలను మీరు ఎదుర్కోవాలి — మంచైనా, చెడైనా.”*


కాసేపు ఆగి, మళ్ళీ నవ్వింది.

“అందుకే, *నా నియంత్రణలో లేని విషయాలను వదిలేశాను.”*


కొడుకు అడిగాడు:

“అంటే… మాకు ఏమయినా మీకు పట్టదా?”


ఆమె తల ఊపి,

“ ఎందుకు పట్టదు, చాలా పట్టింది.  ప్రేమించడం.  నియంత్రించడం — ఇవి ఒక్కటి కాదు.

నేను శాంతిని కోల్పోకుండా ప్రేమించగలను .

మీ సమస్యలను నా భారం కాకుండా  మీకు తోడుగా ఉండగలను.”


గది నిశ్శబ్దమైంది.

వాళ్లందరిని ఒక్కొక్కరిని చూసి ఆమె చెప్పింది:

“నా పని మిమ్మల్ని  ప్రేమించడం, దారి చూపించడం, మీకు అవసరం ఉన్నప్పుడు ఉన్నాను అని చూపించడం .

కానీ *మీ పని — మీ జీవితాన్ని మీరు జీవించాలి . మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి.. ఫలితాలను మీరు ఎదుర్కోవాలి*. అని తెలుసుకొన్నా”


ఆమె కుర్చీలో అలా వెనక్కి వాలి, కళ్లలో మృదువైన కాంతితో అంది:

“ఏదైనా తప్పు జరిగితే, ‘ఇది నా పని కాదు’ అని నేను  గుర్తు చేసుకుంటాను. నేను ప్రశాంతముగా  ఉంటాను. మీరు నేర్చుకుంటారని నమ్ముతాను. ఎందుకంటే జీవితం అంటే — పాఠాల వరుస.”


కొంతసేపు ఎవరూ మాట్లాడలేదు.

కానీ ఇంట్లో ఏదో మారిపోయింది.


భర్త ఆమె చెయ్యిని పట్టుకుని,

“నువ్వు మాకు  కూడా  చాలా నేర్పావు  అనిపిస్తోంది,” అన్నాడు.


ఆమె నవ్వింది.

“కానీ నేను దీన్ని నేర్చుకోవడానికి చాలాకాలం పట్టింది.”


ఆ రాత్రి అందరూ ఆమె మాటలు బాగా గుర్తుతెచ్చుకొన్నారు .


కొడుకు పుస్తకాలు తీసుకుని చదవడం మొదలుపెట్టాడు — అమ్మ అరవకపోయినా, అది తన బాధ్యత అని గ్రహించి.

కూతురు కారు రిపేర్ షాప్‌కి అపాయింట్‌మెంట్ పెట్టి, ఇన్సూరెన్స్ ప్రాసెస్ నేర్చుకుంది.

భర్త ఇకపై బయటకు వెళ్తూ తప్పకుండా ఫోన్ చేసేవాడు — ఆమె అడిగినందుకు  కాదు , కానీ అతనికి చేయాలని అనిపించినందుకు.


మెల్లగా… ఆ ఇల్లు నెమ్మదిగా ప్రశాంతముగా కనిపించడం మొదలైంది.


ఎవరూ భయంతో  లేరు .

ఎవరూ కోపానికి ఎదురుచూడలేదు.

*ప్రతి ఒక్కరూ తమ సమస్యలను తామే ఎదుర్కోవడం మొదలుపెట్టారు —* భయంతో కాదు, *బాధ్యతతో . .*


ఎందుకంటే ఒకరు శాంతిని ఎంచుకున్నప్పుడు.  ఆ శాంతి  ఇల్లంతా అల్లుకుంటుంది..


*ఒకరు నియంత్రించడం ఆపినప్పుడు…*

మిగతావాళ్లు *తమను తాము నియంత్రించుకోవడం నేర్చుకుంటారు.*


*అలా ఒక ఇంట్లో ప్రశాంతత వ్యాపిస్తుంది.*

ONLINE HOMEOPATHY CONSULATATION

 

సంక్రాంతిపండుగ శుభాకాంక్షలు* 🪷

 🌸   *మిత్రులు, కవిపుంగవులు అందరికీ*   🌸

  🪷  *సంక్రాంతిపండుగ శుభాకాంక్షలు*  🪷


సీ॥

ముంగిళ్ళ దిద్దిన రంగవల్లులలోన 

గొబ్బిదేవతలెల్ల కూడియుండ 

సన్నాయి మేళముల్ సరిగంగిరెద్దులు 

హరిదాసు కీర్తన లందగించ 

చెఱకుదండమ్ములు చేబంతిక్రీడలు 

మంగళతోరణమాల లలర

పొంగారు పొంగళ్ళు పోతుపేరంటాలు 

క్రొత్తయల్లుళ్ళదౌ కోలహలము 

గీ॥ నింగినంటు గాలిపటల భంగిమలును 

బావమరదళ్ళ సరదాల భాషణములు 

నింత యంతయు గాదయ నెంతొ కలదు 

మకరసంక్రాంతి సందడి మరులు గొలుపు 


సీ॥

క్రొత్తబెల్లముతోడ క్రొత్తబియ్యముజేర 

సంక్రాంతి యయ్యెనో చందమలర 

ధనువు వీడిన రవి తా మకరము జేర 

సంక్రాంతి ప్రబలెనో సౌరులలర 

రైతుకష్టములెల్ల ప్రభవించ ధాన్యమై 

సంక్రాంతి ప్రసరించె శాలలలర 

బొమ్మలకొలువుల ముగుదపేరంటాళ్ళ 

సంక్రాంతి యరుదెంచె సరసతలర 

గీ॥ రంగులలముకొన్న వృషభరాజులెల్ల 

పూజలందగ సంక్రాంతి మోహరించ 

దివ్యసంక్రాంతిపర్వమ్ము తేజరిల్ల 

శుభదకామన లందరి కభయ మగుత! 

*~శ్రీశర్మద* 

*8333844664*

పంచాంగం 15.01.2026 Thursday,

 ఈ రోజు పంచాంగం 15.01.2026 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్య మాస కృష్ణ పక్ష ద్వాదశి తిథి బృహస్పతి వాసర జ్యేష్ఠ నక్షత్రం వృద్ధి యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 




అందరికీ సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు


  


శ్రాద్ధ తిథి: ద్వాదశి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 06*


*పరయా కాంచీపురయా పర్వతపర్యాయపీనకుచభరయా।*

*పరతంత్రా వయమనయా పంకజసబ్రహ్మచారిలోచనయా॥*


*భావము :*


*పర్వతములను పోలి, సర్వజగత్తుకు పోషణకారకములైన మాతృస్థానములతో, పద్మములవంటి కన్నులతో కాంచీపురములో వెలసిన మాతకు నేను దాసానుదాసుడను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురునందన ।

బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయోఽవ్యవసాయినామ్ ।। 41 ।।


ప్రతిపదార్థ:


వ్యవసాయ-ఆత్మికా — దృఢమైన; బుద్ధిః — బుద్ధి; ఏకా — ఒకటి; ఇహ — ఈ పథములో; కురు-నందన — కురు వంశీయుడా; బహు-శాఖాః — అనేక-శాఖలుగా; హి — నిజముగా; అనంతాః — అంతులేని; చ — మరియు; బుద్ధయః — బుద్ధి; అవ్యవసాయినామ్ — దృఢ సంకల్పం లేని.


  తాత్పర్యము :


 ఓ కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా/స్థిరంగా ఉంటుంది, మరియు వారి లక్ష్యము ఒక్కటే. కానీ, దృఢసంకల్పం లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది.


 వివరణ:


మమకారాసక్తి అనేది మనస్సు యొక్క లక్షణం. ఇదెలా వ్యక్తమవుతుందంటే, మనస్సు పదేపదే మమకార వస్తు/విషయం వైపు పరుగులు తీస్తుంది, అవి వ్యక్తులు, ఇంద్రియ విషయములు, ప్రతిష్ఠ, శారీరక సుఖాలు, పరిస్థితులు మొదలగునవి కావచ్చు. కాబట్టి ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క తలంపులు పదేపదే మనస్సుకు వస్తుంటే అది, దాని పట్ల మన మనస్సుకి అనుబంధం ఏర్పడిఉంది అన్నదానికి సూచన కావచ్చు. కానీ, అనుబంధం/మమకారాసక్తి ఏర్పరుచుకునేది మనస్సు అయినప్పుడు ఈ యొక్క అనుబంధం/మమకార విషయాలలో శ్రీ కృష్ణుడు బుద్ధిని ఎందుకు తీస్కోస్తున్నాడు? అనుబంధం/మమకారాలను తొలగించటంలో బుద్ధికి ఏమైనా పాత్ర ఉందా?


మన శరీరంలో సూక్ష్మమైన 'అంతఃకరణ' ఉంటుంది, వ్యావహారికంగా దానిని హృదయం అంటారు. ఇది మనస్సు, బుద్ధి, మరియు అహంకారం అనే వాటిని కలిగి ఉంటుంది. ఈ సూక్ష్మ యంత్రంలో ‘బుద్ధి’ అనేది 'మనస్సు' కంటే ఉన్నతమైనది. బుద్ధి నిర్ణయాలు చేస్తే, మనస్సు కోరికలను సృష్టించి, బుద్ధి నిశ్చయించిన ఆ విషయ వస్తువులతో అనుబంధం పెంచుకుంటుంది. ఉదాహరణకి, ఒకవేళ బుద్ధి గనక సంతోషానికి డబ్బే మూలం అని నిర్ణయిస్తే, మనస్సు డబ్బు కోసం వెంపర్లాడుతుంది. ఒకవేళ, పేరు ప్రఖ్యాతులే జీవితంలో ముఖ్యం అని బుద్ధి నిశ్చయిస్తే, అప్పుడు మనస్సు పేరుప్రతిష్ఠల కోసం వాంఛిస్తుంది. ఇంకో విధంగా చెప్పాలంటే, బుద్ధి యందు ఉన్న జ్ఞానం ప్రకారంగా, మనస్సు కోరికలను పెంపొందించుకుంటుంది.


రోజంతా మనం మనష్యులం మనస్సుని బుద్ధి ద్వారా నియంత్రిస్తూనే ఉంటాము. ఇంట్లో కూర్చున్నప్పుడు హాయిగా కాళ్ళు చాపుకుని మనస్సుకి నచ్చినట్టుగా కూర్చుంటాము. కానీ, కార్యాలయంలో (ఆఫీసు) లో కూర్చున్నప్పుడు అధికారికంగా కూర్చుంటాము. ఆఫీసు క్రమబద్ధత మన మనస్సుకి నచ్చి కాదు, దాని ఇష్టానికి వదిలేస్తే ఇంట్లో ఉండే అనధికార వాతావరణమే కావాలంటుంది. కానీ, ఆఫీసులో అధికారిక ప్రవర్తన అవసరము అని బుద్ధి నిర్ణయిస్తుంది. కాబట్టి, బుద్ధి అనేది మనస్సుని నియంత్రించటం వలన, మనస్సు యొక్క సహజ స్వభావానికి విరుద్ధంగా, కార్యాలయ మర్యాద కోసం, మనము రోజంతా నిబద్ధతతో ఆఫీసులో కూర్చుంటాము. ఇదే విధంగా, దాని ఇష్టానికి వదిలేస్తే, మనస్సు ఆఫీసు పని చేయటానికి ఇష్టపడదు, ఇంట్లో కూర్చుని టెలివిజన్ చూసేందుకే మొగ్గు చూపుతుంది. కానీ, జీవనోపాధి కోసం ఆఫీసులో పని చేయటం అవసరం అని 'బుద్ధి' నిర్ణయిస్తుంది. కాబట్టి, మళ్లీ మనస్సు యొక్క సహజ స్వభావాన్ని, బుద్ధి నియంత్రిస్తుంది, మరియు జనులు రోజుకి ఎనిమిది గంటలు లేదా ఆ పైగా పని చేస్తారు.


ఈ పై ఉదాహరణలు, మానవులగా మన బుద్ధికి మనస్సుని నియంత్రించే సామర్థ్యం ఉంది, అని నిరూపిస్తున్నాయి. ఈ విధంగా, మనం సరైన విజ్ఞానంతో బుద్ధిని పెంపొందించుకొని, సరైన దిశలో మనస్సుకి మార్గనిర్దేశం చేయడానికి దానిని ఉపయోగించాలి. బుద్ధి యోగము అంటే, అన్నీ పనులు భగవంతుని ప్రీతి కోసమే అని బుద్ధిలో దృఢ నిశ్చయం చేసుకోవటం ద్వారా కర్మ ఫలాల పట్ల ఆసక్తిరహితంగా ఉండగలిగే కళ. అలాంటి దృఢ సంకల్పం ఉన్న వ్యక్తి, లక్ష్యంపై ఏకాగ్రదృష్టితో, విల్లు నుండి విడిచిపెట్టిన బాణంలా ఈ పథంలో దూసుకెళ్తాడు. సాధనలోని పై స్థాయిలలో ఈ సంకల్పం ఎంత బలంగా అవుతుందంటే, ఇక ఏదీ కూడా సాధకుడిని ఆ పథం నుండి తప్పించలేదు. సాధకుడు/సాధకురాలు ఇలా అనుకుంటారు, ‘ఎన్ని కోట్ల అవాంతరాలు నా దారిలో వచ్చినా, ప్రపంచమంతా నన్ను ఖండించినా, నా ప్రాణాలే వదిలివేయాల్సి వచ్చినా, నా సాధనని మాత్రము విడిచిపెట్టను.’ అని. కానీ, ఎవరి బుద్ధి పలు-విధాలుగా ఉంటుందో వారి మనస్సు ఎన్నో దిశలలో పరిగెడుతుంటుంది. వారు ఈశ్వర పథంలో పయనించడానికి కావలసిన మనస్సు యొక్క ఏకాగ్రతని పెంపొందించుకోలేరు.