28, అక్టోబర్ 2022, శుక్రవారం

 


నాన్న కోప్పడితే

 /🍀🌺🍀🍀🍀🌺🍀🌺🍀🌺🍀


          *నాన్న..!*

       ➖➖➖✍️


*ఓ తండ్రి కష్టపడి తన కొడుకును బాగా చదివించాడు. తండ్రి కష్టం కళ్ళారా చూసిన తను కూడా రాత్రి పగలు కష్టపడి చదివి IAS సాధించాడు. ఓ జిల్లా కు కలెక్టర్ గా నియమింపబడ్డాడు.*


*కొడుకు కు బయటి భోజనం పడేది కాదు, రోజూ తన తల్లి ఇంట్లో చేసిన భోజనమే తినేవాడు, అందుకు తండ్రి రోజూ ఇంటినుండి తనే స్వయంగా భోజనం క్యారియర్ తీసుకుని వెళ్లేవాడు, అలా తీసుకువెళ్లి తనే స్వయంగా తన కొడుకు కు వడ్డించేవాడు, అలాచేయడం తన మనస్సుకు చాలా సంతోషంగా అనిపించేది.*


*ఓరోజు తండ్రి,కొడుకును అప్యాయంగా దగ్గర తీసుకుని  “ఈ ప్రపంచంలో అత్యంత సమర్ధవంతుడు,గొప్పవాడు ఎవరో చెప్పగలవా?” అన్నాడు.*


*“అది నేనే!” అన్నాడు తడుముకోకుండా.*


*ఆ సమాధానానికి తండ్రి నొచ్చుకున్నాడు, తన కొడుకులో అహంకారం మొదలైందని కాస్త అనుమానం కలిగింది. చివరకు ఉండబట్టలేక గది బయటకు వస్తూ కొడుకు వైపు చూసి మరోసారి అదే ప్రశ్న ను వేసాడు.*


*ఈసారి ఆ కొడుకు తడుముకోకుండా "నాన్న" అన్నాడు.*


*తండ్రి ఆశ్చర్యపోతూ… “ముందు ఇదే ప్రశ్న కు నేనే అన్నావు, ఇప్పుడు అదే ప్రశ్న కు నాన్న అంటున్నావు ఎలా?”*


*కొడుకు చిరునవ్వు నవ్వుతూ తన సీట్ లో నుండి లేచి తండ్రి ముందు మోకాళ్ళ మీద నిలబడి తన తండ్రి చేతులు పట్టుకుని “నాన్నా ! మీరు మొదటిసారి ప్రశ్న అడిగినప్పుడు మీ చేయి నా భుజం పై ఉంది. తండ్రి చేయి భుజంపై ఉన్న ఏ కుమారుడైనా ఈ ప్రపంచంలో సమర్ధవంతుడు, గొప్ప వాడు, మరియు అదృష్టవంతుడు కూడా.. “*


*”తరువాత మీరు గది తలుపు దగ్గర నిలబడి అదే ప్రశ్న వేసారు, అందుకు నేను నాన్న అని సమాధానం ఇచ్చాను..”*


*”ప్రపంచంలో     ఏ కొడుకుకైనా సమర్ధవంతుడు, గొప్ప వాడు తన తండ్రి కాక మరెవ్వరు ఉంటారు నాన్నా?”*


*”మీరే నా రియల్ హీరో! “*


*తండ్రి చమర్చిన కళ్ళతో   కొడుకును ఆలింగనం చేసుకుని తేలిక పడిన మనసు తో బయటికి నడిచాడు...*


*అమ్మ ‘నవ మాసాలు’ కడుపులో మోస్తే  తండ్రి జీవితాంతం నిన్ను తలలో మోస్తాడు!*


*అమ్మ ముద్దాడితే అర్థం ఉంటుంది, నాన్న కోప్పడితే పరమార్థం ఉంటుంది.*


*నీ గెలుపు కోసం    జీవితంలో గంట, గంటకు ఓడిపోయేవాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క నాన్న ఒక్కడే, అమ్మ ప్రేమ భూమి అంత అయితే, నాన్న ప్రేమ ఆకాశమంత!*✍️


 *నాన్న లకు అంకితం !*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏

*నాలుగో అధ్యయము

 _*కార్తీకపురాణం - 4 వ అధ్యాయము*_



🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉



*దీపారాధన మహిమ*

*శతృజిత్ కథ*



☘☘☘☘☘☘☘☘☘



ఈ విధముగా వశిష్టుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొందెదరని చెప్పుచుండగా జనకుడు *'మహితపస్విత ! తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తిరకున్నది. కార్తీక మాసము ముఖ్యమైనవి యేమేమి చేయవలయునో , ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు'* అని కోరగా వశిష్టుల వారు యిట్లు చెప్పదొడగిరి. 

జనకా ! కార్తీక మాసమందు సర్వ సత్కార్యములనూ చేయవచ్చును. దీపారాధన మందు అతి ముఖ్యము దీని వలన మిగుల ఫలము నొంద వచ్చును. సూర్యాస్తమయ మందు , అనగా , సంధ్య చీకటి పడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబునందు గాని దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంట ప్రాప్తి నొందుదురు. కార్తీకమాస మందు హరి హరాదులు సన్నిధిలో ఆవునేతితో గాని , కొబ్బరి నూనెతో గాని , విప్ప నూనెతో గాని , యేది దొరకనప్పుడు అముదముతో గాని దీపము వెలిగించి వుంచవలెను. దీపారాధన యే నూనెతో చేసిననూ మిగుల పుణ్యత్ములుగాను , భక్తి పరులగాను నగుటయేగాక అష్టైశ్వర్యములూ కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందు కొక కథ గలదు, వినుము.


*🌹శతృజిత్ కథ🌹* 


పూర్వము పాంచాల దేశమును పాలించు చున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి , తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించు చుండగా నచ్చుటకు 

పికెదుడను ఇడీముని పుంగవుడు వచ్చి *'పాంచాల రాజా ! నివెందుల కింత తపమాచరించు చున్నావు ? నీ కోరిక యేమి?'* యని ప్రశ్నించగా , *'ఋషిపుంగవా ! నాకు అష్ఠ ఐశ్వర్యములు , రాజ్యము , సంపదావున్ననూ , నావంశము నిల్పుటకు పుత్ర సంతానము లేక , కృంగి కృశించి యీ తీర్ధ స్థానమున తపమాచరించు చున్నాను'* అని చెప్పెను. అంత మునిపున్గావుడు *'ఓయీ ! కార్తిక మాసమున శివ సన్నిధిని శివ దేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన యెడల ని కోరిక నేర వేరగలదు'* యని చెప్పి వెడలిపోయెను.


వెంటనే పాంచాల రాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తి కై అతి భక్తి తో శివాలయమున కార్తీక మాసము నెలరోజులూ దీపారాధన చేయించి , దాన ధర్మాలతో నియమను సారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు , విడువకుండా నెలదినములూ అటుల చేసెను. తత్పుణ్య కార్యమువలన ఆ రాజు భార్య గర్భవతియై క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభ ముర్తుమున నొక కుమారుని గనెను. రాజ కుటుంబికులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి , బ్రాహ్మణులకు దానధర్మాలు జేసి , ఆ బాలునకు *'శత్రుజి'* యని నామకరణ ము చేయించి అమిత గారాబముతో పెంచుచుండిరి. కార్తీకమాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు , దీపారాధనలు చేయుడని రాజు శాసించెను.

రాకుమారుడు శత్రుజి దినదిన ప్రవర్థమానుడగుచు సకల శాస్త్రములు చదివి , ధనుర్విద్య , కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని , యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను , తల్లితండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్రీలకు బలాత్కరించుచు , యెదిరించిన వారిని దండించుచు తన కామవాంఛా తిర్చుకోను చుండెను.

తల్లితండ్రులు కూడా , తమకు లేక లేక కలిగిన కుమారుని యెడల చూచి చూడనట్లు - విని విననట్లు వుండిరి. శత్రుజి ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారలను నరుకుదున ని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మదునకైననూ శక్యము గాదు. అట్టి స్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయ్యబోమ్మవలె నిశ్చేష్టుడై కామవికరముతో నామెను సమీపించి తన కమవాంఛ తెలియచేసేను. ఆమె కూడా నాతని సౌదర్యానికి ముద్దురాలై కులము , శిలము , సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొనిపొయి భోగములను భావించెను. 


ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుటచేత వారు ప్రతి దినము నర్ద రాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసు కొనుచు తమ కామవాంచ తీర్చు కొనుచుండిరి. ఇటుల కొంత కాలం జరిగెను. ఎటులనో యీ సంగతి ఆమె మగనికి తెలిసి , పసిగట్టి , బార్యనూ , రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను.


ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని , యెవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి యెటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భ గుడిలో దాగి యుండెను. అ కాముకులిద్దరూ గుడిలో కలుసుకొని గాడాలింగన మొనర్చుకొను సమయమున ' చీకటిగా వున్నది, దీపముండిన బాగుండును గదా ,' యని రాకుమారుడనగా , ఆమె తన పైట చెంగును చించి అక్కడ నున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగెంచెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు వుద్యుక్తులగుచుండగా , అదే యదనుగా నామె భర్త , తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భర్యనూ , ఆ రాజకుమారుని ఖండించి తనుకూడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి , సోమవారమగుట వలనను , ఆ రోజు ముగ్గురునూ చనిపోవుట వలననూ శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకొని పోవుటకునూ - యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు ' ఓ దూతలార ! నన్ను తీసుకొని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు ? కామాంధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అ వ్యభిచారుల కొరకు శివ దూతలు విమానములో వచ్చుటేల ? చిత్రముగా నున్నదే ! అని ప్రశ్నించెను . అంత యమకింకరులు *' ఓ బాపడ ! ఎవరెంతటి నీచులైననూ , యీ పవిత్ర దినమున , అంగ , కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివునిసన్నిదిన దీపం వేలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నియును నశింఛిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివధూతలు వచ్చినారు'* అని చెప్పగా - యీ సంభాషణ మంతయు వినుచున్న రాజకుమారుడు *' అల యెన్నటికిని జరగనివ్వను. తప్పొప్పులు యెలాగునున్నపటికి మేము ముగ్గురమునూ ఒకే సమయములో ఒక స్థలములో మరణించితిమి. కనుక ఆ ఫలము మా యందరికి వర్తించ వలసినదే ' అని , తాము చేసిన దీపారాధన ఫలములో కొంత అ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమానమెక్కించి శివ సాన్నిద్యమునకు జేర్చిరి. 

వింటివా రాజా ! శివాలయములో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక , కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన , కార్తిక మాసములో నక్షత్రమాల యందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొందుదురు.




*ఇట్లు స్కాంద. పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి*

*నాలుగో అధ్యయము- నాల్గవ రోజు పారాయణము సమాప్తం.*




_*కిషోర్ శర్మ యాయవరం*_

విలక్షణ వ్యక్తిత్వం.

 ☘️☘️☘️🙏😄😄🙏☘️☘️☘️


 *విలక్షణ వ్యక్తిత్వం* .


దివంగత *కొణిజేటి రోశయ్య* శాసనసభలో గాని, మండలిలోగాని ఎంత క్లిష్ట సమస్యపైన మాట్లాడుతున్న తనదైన హాస్యం జత చేసేవారు. ఒకసారి మండలిలో *CM NTR* ‌ గురించి మాట్లాడుతూ మిమ్మల్ని చూస్తే నాకు *కావమ్మ మొగుడు కథ* గుర్తుకొస్తుంది అన్నారు. ఎన్‌టిఆర్‌ స్పందిస్తూ నాకు కథలంటే చాలా ఇష్టం చెప్పండి అన్నారు. రోశయ్య చెప్పిన కథ సంక్షిప్తంగా ఇదీ: 


ఒక ఊళ్ళో వైశ్య దంపతులు కూతురుకు 8 ఏళ్ళు రాగానే వివాహం చేసారు. తరువాత అల్లుడు వచ్చి మీ అమ్మాయిని కాపురానికి తీసుకువెళ్ళటానికి 2-3 ఏళ్ళు పడుతుంది, నేను దేశాటనచేసి వ్యాపారంలో డబ్బు, అనుభవం సంపాదించుకొని వస్తానన్నాడు. అత్తమామలు సంతోషంగా సరేనన్నారు. రెండేళ్ళు నాలుగేళ్ళయినా అల్లుడి రాలేదు. అత్తమామలు ఆందోళన చెందారు.


ఇలా ఉండగా ఒకరోజు ఉదయం అమ్మలక్కలు మంచినీళ్ళ కోసం బావి దగ్గరకెళ్ళారు. అక్కడ ఒక యువకుడు కాషాయ బట్టలు కట్టుకొని కనిపించాడు. అతనిని  చూసి ఒక స్త్రీ *కావమ్మ మొగుడులా* ఉన్నాడంటే మిగిలిన వారు కూడా అవునని  వెంటనే కావమ్మ తల్లిదండ్రులకు కబురు పంపించారు. వారు పరుగున వచ్చి, ఇంటికి తీసుకెళ్ళారు. స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి విందు భోజనంపెట్టి అమ్మాయితో శోభనం జరిపించారు. నెలరోజులు గడిచిన తరువాత అసలు భర్త వచ్చాడు. కంగుతిని ఎందుకు ఇలా చేశారని నిలదీశాడు. అత్తగారు వెళ్ళి ఆ దొంగవాడిని అదే మాట అడిగింది.


అందుకు అతడు కావమ్మ మొగుడంటే కామోసు అనుకున్నాను. కాదంటే నా కాషాయ బట్టలు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది అన్నాడు.


రోశయ్య చెప్పిన కథ విని ఎన్‌టిఆర్‌ తో సహ  సభ్యులందరూ నవ్వారు. తరువాత *ఎన్‌టిఆర్‌* తేరుకుని నాకూ కావమ్మ మొగుడికీ సంబంధం ఏమిటి? అనడిగారు.


మీరు విశ్వవిఖ్యాత నటసార్వభౌములు. సినిమాల్లో డబ్బు, కీర్తి అర్జించారు. 60 ఏళ్ళు  దాటాక రాజకీయాల్లోకి వచ్చారు. నటనలో ఉన్న అనుభవం పరిపాలనలో లేనందున అభివృద్ధి కుంటుపడింది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి నెగిటివ్‌ గ్రోత్‌ రికార్డు అయ్యింది. ధరలు పెరుగుతున్నాయి. విద్యుత్‌ ఉత్పత్తి తగ్గింది. పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీని ఫలితం ప్రజలపై పడటానికి సంవత్సరం పడుతుంది. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీరు– *నాకేం తెలుసు* మీరంతా ముఖ్యమంత్రి అంటే కామోసు అనుకున్నాను. కాదంటే చెప్పండి మళ్ళీ సినిమాల్లోకి పోతానంటారు...  అని ముక్తాయించారు *రోశయ్య* .


ఎవరినైనా బోల్తా కొట్టించగల నేర్పరితనం రోశయ్యకు ఉంది.


పి.వి. నరసింహారావు, రోశయ్య నంద్యాలలో ఒక సభలో ప్రసంగించారు. సభానంతరం వెళ్ళుతున్నప్పుడు నరసింహారావు... ఏమయ్యా రోశయ్య! జనం నీప్రసంగం చప్పట్లు, ఈలలు వేస్తూ విన్నారు. కానీ నేను ప్రసంగిస్తుంటే స్తబ్ధుగా ఉండిపోయారు. ఏమిటి కారణం???


దీనికి రోశయ్య బదులిస్తూ... అయ్యా, మీ ప్రసంగం *ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పాట కచేరీలా ఉంటుంది* . మరి నా ప్రసంగం *ఎల్‌ఆర్‌ ఈశ్వరి పాటలాగా* ఉంటుంది అని చెప్పి పీవీని నవ్వించారు.


అది ఆయన విలక్షణ వ్యక్తిత్వం.


ఎం. వెంకటేశ్వరరావు

జర్నలిస్ట్


🌺🌺🌺😛😛😛🌷🌷🌷

Bhagavatham

 : Srimadhandhra Bhagavatham -- 56 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

2. క్షీరసాగర మథనం:

పంచమి ఉండగా ఉన్న శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నింటికి ఐశ్వర్యమును ఇచ్చింది. దానివలన మొట్టమొదట అనుగ్రహమును పొందినవాడు దేవేంద్రుడు. మనము ఐశ్వర్యమునకు గాని, అధికారమునకు గాని, భోగలాలసతకు గాని, వైభోగమునకు కాని, ఇంద్రుణ్ణి ఒక హద్దుగా చెప్పుకుంటాము.

ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక అరణ్యప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆయన సురాపానం చేసి రంభతో కలిసి విహరిస్తున్నాడు. ఆ సమయంలో అటుగా దుర్వాసోమహర్షి వస్తున్నారు. ఆయన మహా బ్రహ్మజ్ఞాని. శంకరాంశ సంభూతుడు. ఇంద్రుడు ఆయనకు నమస్కారం చేశాడు. ఆయన చుట్టూ ఉన్న పరివారం దేవేంద్రుడిని కుశలం అడిగి దేవేంద్రుని ఆశీర్వచనం చేశారు. దుర్వాసోమహర్షి చేతిలో ఒక పారిజాత పుష్పం ఉన్నది.

ఆ పారిజాత పుష్పమును ఈయన కృష్ణ భగవానుడి దగ్గరకు వెళ్ళినప్పుడు ‘మహానుభావా! ఈ పుష్పమును స్వీకరించండి’ అని కృష్ణుడు ఇచ్చాడు. అది భగవంతునిచే స్వయంగా ఇవ్వబడినది. ఈశ్వర నిర్మాల్యం అంటారు. లక్ష్మీదేవి అందులోనే ఉంటుంది. ఇంద్రుడు సురాపానం చేసి మదోన్మత్తుడై ఉన్నాడు. ఆ పువ్వును తీసుకున్నాడు. పువ్వును తీసుకున్నప్పుడు కళ్ళకు అద్దుకుని పక్కన పెట్టాలి. ఈశ్వర నిర్మాల్యం అయినట్లయితే తలమీద కానీ, చెవిలో కానీ పెట్టుకోవచ్చు లేదా ఎవరూ తొక్కనిచోట దానిని భద్రం చేయవచ్చు. ఇంద్రుడు ఆ పువ్వును తీసుకొని ఐరావతం మీదకి విసిరాడు. ఆ ఐరావతం విశేషమయిన తేజస్సును సంతరించుకుంది. అది భగవంతుని నిర్మాల్యం. అది దాని శిరస్సు మీద పడింది. అది తేజస్సును పొంది ఇంద్రుడిని మోయడం మానివేసి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. దుర్వాసో మహర్షి ఇంద్రుడిని చూసి ‘నీవు ముకుంద పాదారవిందము నుండి వచ్చిన పారిజాత పుష్పమును తిరస్కరించావు కనుక నీవు ఉత్తరక్షణం ఐశ్వర్య భ్రష్టుడవు అయ్యెదవు గాక! స్వర్గలక్ష్మి ఇప్పుడే బయలుదేరి స్వస్థానమయినటువంటి వైకుంఠములో ఉన్న మహాలక్ష్మిలో ఐక్యం అయిపోతుంది. ఇక నీకు స్వర్గంలో ఐశ్వర్యం ఉండదు’ అన్నారు. ఈమాట వినగానే శత్రువులు వచ్చేస్తారు. ఐశ్వర్యం పోవడానికి ఒక కారణం ఉండాలి కదా! రాక్షసులు అందరూ వచ్చేశారు. చుట్టుముట్టి పడగొట్టేశారు. ఇంద్రుని ఐశ్వర్యం పోయింది. ఇంద్రునికి ఐశ్వర్యం పోవడానికి కారణం తెలిసింది. దేవతలు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మగారు ‘అప్పుడప్పుడు నీవు కండకావరంతో ప్రవర్తిస్తూ ఉంటావు. ఒకప్పుడు బృహస్పతి జోలికి వెళ్లావు. ఇవాళ దుర్వాసోమహర్షి జోలికి వెళ్లావు. అందువలన ఐశ్వర్యం పోయింది. నీకు మరల ఐశ్వర్యం ఆ పద్మనాభుడి అనుగ్రహంతోనే రావాలి. ఆయననే ధ్యానం చెయ్యాలి’ అని కన్నులు మూసుకుని ధ్యానమునందు ఉన్నవాడై ఆ పరమాత్మను ధ్యానం చేసి పరమ సంతోషంతో చిరునవ్వు నవ్వాడు. అనగా ధ్యానమునందు ద్యోతకమైన నారాయణుడు ఒక మార్గోపదేశం చేసాడు.

బ్రహ్మగారు ‘ నీకు ఐశ్వర్యము పోయినది కదా! నీవయినా నేనయినా మరల ఐశ్వర్యము ఇమ్మని శ్రీమన్నారాయణునే అడగాలి. ఆయన పాదముల మీద పువ్వును నీవు విసిరేశావు. అందుకు దుర్వాసునికి కోపం వచ్చింది. పరమాత్మకు కోపం రాదు. ఆయనా కోపం పెట్టేసుకుంటే ఇక లోకంలో ఉద్ధరించే వాడెవడు? పరమాత్మకి శాశ్వత కోపం ఉండదు. నీవు దుర్వాసుని నన్ను అర్థించడం వల్ల పరమాత్మ సంతోషిస్తున్నాడు. తప్పు చేసినవాడు తనకు ఎంత దగ్గర వాడయినా పరమాత్మ శిక్షిస్తాడు. ఆయన శాశ్వతంగా ఎవరి పట్ల శత్రువు కాదు. శాశ్వత మిత్రుడు కాదు. మీ నడవడిని బట్టి ఆయన మిత్రత్వము కాని, శత్రుత్వము కానీ ఆవిష్కరింప బడుతుంది. ఇంద్రా! నేను కాని, దుర్వాసుడు కానీ, సమస్త దేవతలు శ్రీమన్నారాయణుడికి మ్రొక్కి నమస్కరించినపుడు సంతోషిస్తాము. మాకు నమస్కరించి శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందడం కాదు. శ్రీమన్నారాయణునికి నమస్కరిస్తే మేమందరం నీకు ఆప్తులం అవుతాం. ఆయనను ప్రార్థన చేద్దాం’ అన్నారు.

బ్రహ్మగారు ఆమాట చెప్పగానే ఇంద్రునికి ధైర్యం వచ్చింది. తప్పు చేసిన వాడిని పరమాత్మ రక్షిస్తాడు అనే జ్ఞానం కలిగింది.పశ్చాత్తాప ప్రకటన జరిగిందంటే వెంటనే స్వామి వరం ఇచ్చేస్తాడు. దితి సంధ్యాకాలంలో తప్పు చేసింది -హిరణ్యకశిపుడు పుట్టాడు. భర్త దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాప పడింది. మనవడు ప్రహ్లాదుడు పుట్టాడు.తప్పు చెయ్యడం సహజం. పశ్చాత్తాప పడి మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉండడం మంచిమనిషి లక్షణం. అపుడు ఇంద్రుడు తాను చేసింది తప్పు పనే అని, తనను మన్నించమని మనస్సులో అనుకుని స్వామిని ప్రార్థించాడు. అంతే! ఎక్కడికో వెళ్ళి కూర్చుని జీవితాంతం తపస్సు చేసిన వాళ్లకి దొరకని పరమాత్మ దర్శనం పశ్చాత్తాపం కలగగానే ఇంద్రునికి దొరికింది. వెంటనే పరమాత్మ ఇంద్రుని ఎదుట ప్రత్యక్షం అయ్యాడు. అలా సగుణంగా కనపడగానే అందరూ చూడలేక కళ్ళు మూసేసుకున్నారు. ఎదురుగుండా ఉన్నదేదో అర్థం చేసుకోలేకపోయారు. చూడడానికి కూడా ఈశ్వరానుగ్రహమే ప్రసరించింది. ఆయనను చూడడానికి ఆయన అనుగ్రహం కావాలి. అంతటా వ్యాపించిన ఆయన ఈ కంటితో చూడడానికి వీలుగా ఎదురుగుండా ఈశ్వరానుగ్రహంతోనే చూసారు. పరమాత్మ ప్రత్యక్షం అయేసరికి వీరందరి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు పరమాత్మను ప్రార్థన చేశారు.

శ్రీమన్నారాయణుడు ఈ స్తోత్రం విని చాలా సంతసించాడు. ‘నీవు ఐశ్వర్యము పోయింది కదా అని విచారిస్తున్నావు. ఐశ్వర్యమేమిటి! ఈ శరీరమునకు యౌవనము పోకుండా మృత్యువు రాకుండా ప్రళయకాలమునందు మాత్రమే మరల లీనమయేలా వార్ధక్యం రాకుండా, ఐశ్వర్యం చెడకుండా, అనారోగ్యం రాకుండా, నిరంతరం తేజస్సుతో, కనురెప్ప పడకపోయినా సరే హాయిగా సమస్త తేజస్సును చూడగలిగి భూమికి పాదము ఆనకుండా అంతటా తిరగగలిగిన ఇన్ని శక్తులను ఇవ్వగలిగిన అమృతమును మీకు ఇస్తాను’ అని అన్నారు. అదీ ఈశ్వరానుగ్రహం అంటే. ఇంద్రుడు నోరు విప్పి ఏమీ అడగలేదు. పరమాత్మను మనసులో తలచుకొని ‘నాది తప్పే మహానుభావా’ అన్నాడు. పరమాత్మ అమృతమును ఇస్తాను అంటున్నాడు. ‘మీరు అనేక ఓషధులను తీసుకురండి. గడ్డి తీసుకురండి. పువ్వులు తీసుకురండి. ఇవన్నీ పట్టుకు వెళ్ళి పాలసముద్రంలో వెయ్యండి. మంధర పర్వతమును తీసుకువచ్చి కవ్వంగా మెల్లగా పాలసముద్రంలోకి దించండి. దానికి వాసుకిని త్రాడుగా చుట్టండి. దేవతలు, దానవులు దానిని అటుఇటు పట్టుకోండి. ఇపుడు మీకు ఐశ్వర్యం పోయింది కాబట్టి దానవులు మీమాట వినరు. నాగుపాము కూడా ఎలుకను పట్టుకోవాలంటే కలుగులో నుంచి వచ్చి కాసేపు పడుకుంటుంది. దానవులను మట్టు పెట్టడానికి మీరు కొంచెం ఓర్పు వహించి స్నేహం చేయండి. వారిని క్షీర సాగర మథనమునకు తీసుకు వచ్చి సాగరమును చిలకండి. అందులోంచి అమృతం పుడుతుంది. మొదట హాలాహలం వస్తుంది. అగ్నిహోత్రం వస్తుంది. భయపడకండి. పూనికతో మరల చిలకండి. చాలా గొప్ప గొప్ప వస్తువులు పుడతాయి. మనసు పారేసుకోవద్దు. నిగ్రహించుకోండి. నేను ఇస్తే పుచ్చుకోండి. లేకపోతే ఊరుకోండి. ఎవరికీ ఏది ఇవ్వాలో నాకు తెలుసు. అది వాడికి ఇస్తాను అంటే

దేవతలు శ్రీమన్నారాయణుని మాటలు శ్రద్ధగా విని తప్పకుండా అలా చేస్తాం అని చెప్పి వారు బయలుదేరారు. మొట్టమొదట మంధర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో పెట్టాలి. ఇపుడు దేవతలు త్వష్ట ప్రజాపతి దగ్గరకు వెళ్ళి తమకొక పెద్ద తవుకోలను తయారుచేసి ఇవ్వవలసినదని కోరారు. త్వష్టప్రజాపతి ఎందుకు? అని అడిగాడు. దేవతలు ‘మేము మంధర పర్వతమును కింద తవ్వేస్తాము. తరువాత దానిని ఊడబెరికి సముద్రం వద్దకు తీసుకువెడతాము. అలా చేయమని శ్రీమన్నారాయణుడు చెప్పాడని చెప్పారు. ఆయన వారు కోరిన విధంగా తవుకోలను చేసి ఇచ్చాడు. వారు దానిని తీసుకువెళ్ళి మంధరపర్వతం అడుగు భాగం చుట్టూ తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతుంటే పెద్ద గొయ్యి పడింది. మంధర పర్వతమును తీసుకువెళ్ళి సముద్రంలో దింపాలి. అందుకని కొన్ని తాళ్ళు వేసి దానిని ఊపుతున్నారు. అలా ఊపి మొత్తం మీద పర్వతమును అందరూ కలిసి పైకి ఎత్తారు. అయితే అది పక్కకి ఒరిగిపోయి పడిపోయింది. ఈ సందర్భంలో దానికింద పడి కొందరు మరణించారు. మిగిలిన వారందరూ ప్రక్కకు చేరి ఈ మంధరపర్వతమును సముద్రము వరకు తీసుకుని వెళ్ళడానికి మనం శ్రీహరి సహాయం అడగలేదు. అడిగి ఉంటే ఆయనే వచ్చి మనకు సహాయం చేసి ఉండేవాడు. ఆయన వస్తే ఎంత బాగుండునో’ అని అనుకున్నారు. వాళ్ళు ఈమాట అనుకునేసరికి బంగారురంగులో ఉన్న గరుడపక్షిమీద నుంచి శ్రీమన్నారాయణుడు క్రిందకి దిగి దేవతలను ఓదార్చి మంధరపర్వతమును బంతివలె నేర్పుతో చేతితో పట్టుకుని, దానిని తీసుకుని మరల గరుడవాహనం ఎక్కి వెళ్ళిపోయారు. శ్రీమన్నారాయణుడు పాలసముద్రం ఒడ్డున దిగి గరుత్మంతుడిని వెనక్కు పంపించి వేశాడు. చిలికేటప్పుడు వాసుకి శరీరం ఒరిసి పోకుండా మంధరపర్వతమును నునుపుగా చెక్కించారు. వాసుకిని తీసుకు వచ్చి పర్వతమునకు చుట్టి పాలసముద్రంలో పెట్టారు. ఇప్పుడు అది మునిగి పోకూడదు. దేవతలను పిలిచి వారిని వాసుకి తలవైపు పట్టుకొనమని రాక్షసులను పిలిచి వారిని తోకవైపు పట్టుకొనమని చెప్పాడు. వెంటనే దేవతలు అందరూ వెళ్ళి వాసుకి తలవైపు పట్టుకున్నారు. రాక్షసులు ‘మేము తోక పట్టుకోవడం ఏమిటి? మేము తలవైపు పట్టుకుంటాము’ అన్నారు. అందుకు స్వామి వెంటనే ఒప్పుకుని రాక్షసులను తలవైపు పంపి దేవతలను తోకవైపు పట్టుకొనమని చెప్పారు. దేవతలు మారు మాట్లాడకుండా వాసుకి తోకవైపు వెళ్ళి తోకను పట్టుకున్నారు. స్వామి మాటల పట్ల దేవతలకి గల విశ్వాసం వారిని అమృతం తాగేట్లు చేస్తుంది.



శాక్తేయ నాయనారు – నారదుడు మాయకు వశుడగుట


మనకు పెరియపురాణం అని ఒక గ్రంథం ఉన్నది. అది మనకి నాయనార్ల చరిత్రను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్నరోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలివున్నాయి.కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమభక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన పైకి శివార్చన చెయ్యనివాడిలా కనపడాలి లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలని ఒక మార్గము ఎంచుకుని ఆయన అటుగా వెళుతూ అన్నం తినేముందు కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని శివా! నీ పూజ చేయకుండా అన్నం ఎలా తినను? అని రోడ్డు మీద ఉన్న శివలింగం దగ్గరకు వెళ్లి, నీవు శివుడివా?” అని ఒక రాయి తీసుకొని దానిని చేమంతి పువ్వుగా మనస్సులో భావిస్తూ ఆ శివలింగం మీద పడేసేవారు. మరొక రాయిని తీసుకుని ‘నీవు శివుడివా? అని పైకి అంటూ మనసులో మాత్రం నేను మల్లెపువ్వును వేస్తున్నాను అనుకుంటూ శివలింగం మీదకి విసిరేవారు. నిజానికి అక్కడ జరిగింది ఆయన విసిరినా రాళ్ళకు బదులు చేమంతిపువ్వులు, మల్లెపువ్వులు పడ్డాయి. చూసేవాళ్ళందరూ ఆయన అక్కడి పరిస్థితులు ఆచారముల ననుసరించి శివలింగం మీద రాళ్ళు వేస్తున్నాడు. ఆయనను చాలా గౌరవంగా చూడాలి అనుకునేవారు. అతడు చేస్తున్న పూజ లోకమునకు అర్థం అవుతుందా –శివుడికి అర్థం అవుతుందా? శివుడికి అర్థం అవుతుంది. అదీ ఆయన పూజ! ఇది ఆర్తిలోనుంచి వచ్చిన పూజ.

ఒకరోజు ఆయన అన్నం తినడానికి కూర్చున్నాడు. అపుడు ‘శర్వతి’ అనే నామం జ్ఞాపకమునకు వచ్చింది. ‘ఈ అన్నమును నాకు పెట్టినవాడు శంకరుడు. లోపలి వెడితే దానిని జీర్ణం చేస్తున్న వాడు శంకరుడు. అగ్నిని ఆదేశించి అన్నమును ఉడికేటట్లు చేసేవాడు శంకరుడు. నేను పశువు తిన్నట్లు ఈ అన్నం తినడానికి వచ్చాను. ఈవేళ శివలింగం మీద నాలుగు పువ్వులు వెయ్యడం మర్చిపోయాను అని అన్నం పళ్ళెం దగ్గరనుంచి లేచి, భార్యకు చెప్పకుండా పరుగు పరుగున శివలింగం దగ్గరకు వెళ్లి ‘శివుడివా’ అని నాలుగు రాళ్ళు తీసి శివలింగం మీద విసిరాడు. ఇలా తప్ప మరొకవిధంగా నీకు పూజ చేయలేక పోతున్నా' ని మనస్సులో చెప్పుకుని కన్నుల వెంట నీరు కార్చాడు. వెంటనే ఈశ్వరుడు ఆయనకు నటరాజ మూర్తిగా సాక్షాత్కరించి తనలో కలిపేసుకున్నాడు. దీనిని బట్టి మహేశ్వరుడు అన్న శబ్దం చేత ఈశ్వరుడు మీ సంకల్పములను, మీ హృదయ శుద్ధిని, మీ చిత్తశుద్ధిని చూడగలిగిన వాడు. ఇదీ ఆయన స్వతంత్రత. లోపల ఏ భావనతో ఒక్క రాయి వేసినా దానిని భావనకు అనుగుణంగా తీసుకొని ఉద్ధరించి అన్నమును విడిచిపెట్టి నాలుగు రాళ్ళతో పూజ చేసిన మోక్షము ఇచ్చినవాడు శంకరుడు. అలా మోక్షమును ఇవ్వగల శక్తి ఈశ్వరునికి ఉన్నది. ఇది మహేశ్వర శబ్దముచేత ప్రతిపాదించబడుతుంది. ఈశ్వరుని శక్తియే మాయగా పరిణమించి ఈశ్వరుని కనపడకుండా చేస్తుంది. ఈ మాయ ఈశ్వర వాక్కువలన, ఈశ్వర స్వరూపులయిన గురువాక్కుల వలన తొలగుతుంది. నిరంతర గురు వాక్ శ్రవణమే మాయ తొలగేందుకు కారణం. అందుకే గురువులేని విద్య గుడ్డివిద్య. గురువు అనుగ్రహం ఉంటే తప్ప మాయ తొలగదు. మాయ వలన ఈశ్వర దర్శనమును విస్మరించి ‘ఇదంతా నా ప్రజ్ఞ’ అనుకుంటూ కామక్రోధములతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. చంద్రశేఖర పరమాచార్య తన 73వ ఏట ఇప్పటికీ నన్ను ఆశ అప్పుడప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంది’ అని చెప్పుకున్నారు. మహాత్ములు విషయములను దాచరు. శివమహా పురాణం ఈ జ్ఞానమును ఉపదేశించడానికి ఒక అద్భుతమయిన ఘట్టమును తీసుకువచ్చి మీకు బోధచేసే ప్రయత్నమును ప్రారంభం చేస్తోంది.

ఒకానొక సమయంలో నారదమహర్షి హిమవత్పర్వతము క్రింది భాగమునందు, గంగానది ప్రవహించే ప్రాంతంలో పరమశివుడు ఎక్కడ కూర్చుని తపస్సు చేశాడో, అటువంటి గుహలో కూర్చుని పరబ్రహ్మమును గూర్చి తపస్సు చేశారు. తపస్సు చేస్తున్నప్పుడు మనస్సు భగవంతునియందు మగ్నమై ఉండాలి. అది చంచలం అవుతున్నదీ లేనిదీ పరీక్ష చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఇంద్రుడు మన్మథుడిని పిలిచి ఒకమాట చెప్పాడు.

‘మన్మధా ! మహా సంయముడయిన నారదమహర్షి తపస్సు చేస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వెళ్ళి వికారములను, ఇంద్రియములకు చూపించి ప్రలోభపెట్టి, నారదుడు ఇంద్రియములకు వశుడవుతాడేమో చూడవలసినది అని చెప్పాడు. మన్మధుడు వెళ్ళి ప్రయత్నం చేశాడు. నారదుడు లొంగలేదు. నారదుని తపస్సు సఫలీకృతం అయింది. ఆయన ఎవరి గురించి తపస్సు చేశాడో ఆయనని సాకారంగా చూడడానికి కైలాస పర్వతానికి వెళ్ళి ‘ఈశ్వరా! హిమవత్పర్వత ప్రాంతంలో ఉండే గుహలో కూర్చుని నేను తపస్సు చేశాను. మన్మధుడు వచ్చి నామీద బాణములు వేసే ప్రయత్నం చేశాడు. నేను వాటిని లెక్కపెట్టలేదు. కామమును జయించి తపస్సునందు సిద్ధిని పొందాను’ అని చెప్పాడు. అంటే ఈశ్వరుడు చేసిన పనిని తాను చేశానని గొప్పగా చెప్పుకోవడం. ఎంతగా మాయ కమ్మేసిందో చూడండి. నారదుని మాటలు విన్న శంకరుడు నవ్వి ‘నారదా! నీవు కాముడినే జయించావా? కాముడిని జయించడం అంటే మాటలు కాదు. నా దగ్గర చెప్పినట్లు వైకుంఠంలో చెప్పకు’ అని చెప్పాడు. నారదుడు శంకరుని మాటలను పట్టించుకోలేదు. గురువుల మాటలను తిరస్కరించడం అంటే ఇదే. అది అనుష్ఠానములోనికి రానివిద్య. ఆ విద్య శ్రవణమునకు మాత్రమే పనికొస్తుంది. అనుష్ఠానంలో పెట్టని వేదాంత విద్యవలన ప్రయోజనం లేదు. నారదుడు వైకుంఠమునకు వెళ్తూ మధ్యలో బ్రహ్మ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో కూడా తన తపస్సు గురించి కాముని గెలిచినట్లు, సిద్ధిని పొందినట్లు చెప్పాడు. బ్రహ్మ తన కుమారుడితో అలా అనకూడదు అని చెప్పి నీవు తపస్సు చేసిన చోట ఇంతకుపూర్వం పరమశివుడు తపస్సు చేసి అక్కడకు మన్మథుడు వస్తే మూడవ కంటి మంటచేత కాల్చివేశాడు. ఆ ప్రాంతంలో మన్మథ బాణములు పనిచేయకపోవడానికి కారణం ఇంతకుపూర్వం అక్కడ శంకరుడు తపస్సు చేయడం. నీవు గెలిచావని చెప్పడంలో అర్థం లేదు. అది శివ ప్రజ్ఞ, నీ ప్రజ్ఞ కాదు.

నారదుడు తన తండ్రి మాటలను కూడా లెక్కలోకి తీసుకోలేదు. వైకుంఠమునకు వెళ్ళాడు. నారాయణుడు ఎదురువచ్చి స్వాగతించాడు. నారదుడు ‘స్వామీ! నేను తపస్సు చేశాను. మన్మథుడు నామీద బాణములు వేసినప్పటికీ నేను చలించలేదు. సిద్ధి పొందాను’ అని చెప్పాడు. నారాయణుడు ‘ఎంత గొప్పపని చేసావు. శివుని తర్వాత మరల నీవే చేసావు’ అని మెచ్చుకున్నాడు. నారదునికి లోపల జ్ఞానము బాగా నిలబడేటట్లుగా చేయవలసిన అవసరం ఏర్పడిందని నారదుని పంపించివేశాడు. ఇపుడు మాయ ప్రారంభమయింది.

నారదుడు బయలుదేరి ఒక రాజ్యంలోకి వెళ్ళాడు. ఆ రాజ్యమును శీలనిధి అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకు ఒక కుమార్తె, పేరు శ్రీమతి. నారదుడు శీలనిధి అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాజుగారు నారదునికి స్వాగతం చెప్పి పాదములు కడిగి కూర్చోపెట్టాడు. తన కుమార్తెను నారదుని వద్దకు తీసుకువచ్చి ఆమెచేత నారదునికి నమస్కారం చేయించి, తన కుమార్తెకు ఎటువంటి వరుడు వస్తాడో చెప్పవలసినది అని కోరాడు.

నారదుడు త్రికాలవేది. ఆయన లక్ష్మీదేవికి భర్త ఎవడో, ఎవడు సర్వవ్యాపకుడో ఎవడు నిరంతరం లోకం చేత పూజించబడుతూ ఉంటాడో, ఎవడు మహానుభావుడో అటువంటి శ్రీమహావిష్ణువుకు ఈమె ఇల్లాలు అవుతుంది’ అన్నాడు. అక్కడివరకు బాగానే చెప్పాడు కానీ ఆమెను చూడగానే ఆమె తన ఇల్లాలు అయితే ఎంత బాగుండని లోపల అనుకున్నాడు. ఈ అమ్మాయికి పెళ్లి ఎలా చేద్దామని అనుకుంటున్నావు అని రాజును అడిగాడు. స్వయంవరం పెట్టాము. స్వయంవరంలో ఈమె వరమాల వేస్తుంది. అని చెప్పాడు. అనగా విష్ణువు సాకారుడై ఈ సభలోకి వస్తాడని నారదుడు గ్రహించాడు. వెంటనే వైకుంఠమునకు వెళ్ళి విష్ణుమూర్తిని సమీపించి ‘ నామనస్సు ఆ శ్రీమతిని పెళ్ళి చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నది. ఆమె నాకు దక్కకపోతే మన్మథబాణముల చేత చచ్చిపోతాను’ అన్నాడు. ఇంతకు మునుపు మన్మథబాణములను జయించానని చెప్పిన నారదుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఇదీ మాయ అంటే. నేను బతకాలంటే నాకు నీరూపం కావాలి. అప్పుడు ఆమె నా మెడలో మాల వేస్తుంది. అందుకని దయచేసి నీ రూపమును నాకీయవలసినది’ అని అడిగాడు. శ్రీమహావిష్ణువు మహానుభావుడు. ఆయన హరి శరీరమునూ ఇచ్చాడు, శిరస్సునూ ఇచ్చాడు. హరి అనే పదమునకు రెండు అర్థములు – పాపములను హరించే శ్రీమహావిష్ణువు, హరి శరీరమును కిందవరకు ఇచ్చాడు, కోతి తలను పైన ఇచ్చాడు.

వెంటనే నారదుడు ఆలస్యం చేయకుండా స్వయంవర మండపమునకు వెళ్ళి అక్కడ గల ఒక ఆసనం మీద కూర్చున్నాడు. అతనికి అటూ ఇటూ రుద్రపార్షదులు కూర్చుని ఉన్నారు. ఈతని అలంకరణ చూస్తే మహావిష్ణువులా అలంకరించుకున్నాడు, పైన మాత్రం కోతి ముఖం. ఇతని మెడలో ఎలా మాల వేస్తుందని అనుకుంటున్నారు. పక్కవాళ్ళు అసూయతో అలా అనుకుంటున్నారని అనుకుంటున్నాడు నారదుడు. శ్రీమతి దండ పట్టుకుని దగ్గరకు వచ్చింది. ఆమె నారదుని వంక ఒకసారి చూసి భ్రుకుటి ముకుళించి ఈ కోతి శిరస్సు ఏమిటి? ఈ రూపమేమిటి? అనుకుని వెళ్ళిపోయింది. ఈలోగా రావలసిన శ్రీహరి రాజకుమారుడి వేషంలో వచ్చాడు. వరమాల తీసుకువెళ్ళి ఆయన మెడలో వేసింది. ఈవిడను తీసుకుని ఆయన వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.

అపుడు నారదునికి ఎక్కడలేని బాధా కలిగింది. పక్కన ఉన్న రుద్రపార్షదులు కోతిముఖం వాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అన్నారు. నారదుడు వారిద్దరినీ మీరు రాక్షస యోనులయందు జన్మించెదరు గాక అని శపించాడు. మాయా ప్రభావం కామక్రోధముల యందు ఎలా తిప్పుతుందో చూడండి. రుద్రపార్షదులు నారదుని తిరిగి శపించకుండా శివేచ్ఛగా భావించారు. వాళ్ళు మహాజ్ఞానులు. నారదుడు గబగబా వైకుంఠమునకు వెళ్లి “శ్రీమన్నారాయణా! ఎంత పని చేశావు. హరిరూపము ఇవ్వమని అడిగితే కోతి శిరస్సు పెట్టావు. ఆమెను నాకు కాకుండా చేశావు. నీవు ఒకానొకనాడు నరుడవై పుట్టి అందచందాలు కలిగిన భార్య దూరం అయితే అరణ్యంలో పడి ఏడిస్తే, ఈ కోతిముఖం ఉన్న వాళ్ళే వచ్చి సహాయం చేసి నీ భార్యతో నిన్ను కలుపుతారు. అలా నిన్ను శపిస్తున్నాను’ అన్నాడు. శ్రీమన్నారాయణుడు మహానుభావుడు కనుక ఆ శాపమును కూడా లోకమునకు ధర్మమార్గము నేర్పడానికి రామావతారమునందు సీతావియోగముగా తీసుకున్నారు. ఇప్పుడు నారదుని స్వస్థత కలిగింది. తాను ఏమిటి పొందాను అని ఆలోచించాడు. ఆత్మపరిశీలన చేసుకున్నాడు. మాయ తొలగింది. శ్రీమన్నారాయణుని చూసి

యుక్తాయుక్త విచక్షణ మరచి నేను మాట్లాడిన మాటలకి నా నాలుకను ముక్కలు ముక్కలుగా కత్తిరించెయ్యాలి. గరుత్మంతుడిని నీ ధ్వజమునకు చిహ్నంగా కలవాడా! ఇంకా ఎంత మాత్రము జాగు చెయ్యకుండా నీ చక్రధారల చేత నా నాలుకను కత్తిరించెయ్యి. అప్పుడు కాని నేను చేసిన పాపం పోదు అని కన్నీటి ధారలతో ఆయన పాదములను అభిషేకించి కాళ్ళమీద పడ్డాడు. నారదుడు కాబట్టి మరల అంత తొందరగా స్వస్తితిని పొందగలిగాడు. మనం అయితే మాయలో పడి కొన్ని కోట్ల జన్మలు తిరుగుతూ ఉంటాము. పరిశీలించినట్లయితే రామాయణంలో ఒక రజకుడి మాట సీతా వియోగమునకు కారణం అయింది. అదే రజకుడు మరల ద్వాపర యుగంలో రజకుడిగా వచ్చినపుడు, కృష్ణ భగవానుడు నాలుగు పంచెలు ఇవ్వమని అడిగితే ఆ రజకుడు నీకు రాజుగారి బట్టలు కావలసి వచ్చాయా అని గేలిచేసి మాట్లాడాడు. యుగం మారినా వాని బుద్ధి మారలేదు. అపుడు కృష్ణుడు వాని శిరస్సు మీద ఒక గుద్దు గుద్ది వేయిముక్కలు చేశాడు. ఏ మంచి పని చేసినా ఈశ్వర ప్రజ్ఞకు ముడిపెట్టాలి. ‘నేను’ అనేమాట అంటే మాత్రం ఇబ్బందిలోకి వెళ్ళిపోతారు. మొదట మనం మన వాక్కును దిద్దుకోవాలి. నారదుడు కాబట్టి అతి స్వల్పకాలంలో దిద్దుకున్నాడు. మనం ఎంతటి వాళ్ళము? ఇది మహేశ్వర శక్తి. ఆ మాయే అమ్మవారి స్వరూపము. మీరు గట్టిగా అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే ఆవిడే మిమ్ములను దగ్గరికి తీసి, మీకు ఈశ్వర భక్తిని ఇచ్చి మీచేత ఈశ్వర సేవ చేయించి, ఈశ్వరుడిలో కలుపుతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తిప్పిన కామపాశములు అమ్మవారి పాదములను ఆశ్రయిస్తే భక్తిపాశములుగా మారిపోతాయి. ఆవిడ మాయాశక్తి, స్వరూపిణి. మాయా పాశమును భక్తి పాశము చేస్తుంది. లోకమునందు పంచతన్మాత్రలను ఈశ్వరుని వైపు తిప్పేసి ఈశ్వరునిలో కలిపేస్తుంది. అది మహేశ్వరుని చేరుకోవడానికి మార్గం. ఆ మార్గమునకు మొట్టమొదటి పొరపాటు వాక్కునందు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడూ ఈశ్వర ప్రజ్ఞను ఈశ్వరానుగ్రహమును గుర్తెరిగి ప్రవర్తిస్తూ ఉండాలి.


facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

గాలి బుడగ జీవితం

 *గాలి బుడగ జీవితం అంటే ఇదే!!

*🫀🤌🫁🧠🤏🌺

శ్వాస రూపంలో మనం తీసుకున్న  వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి....

1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.

1.ప్రాణము:-  అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.

2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.

3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు.  ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.

4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.

5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.

శ్వాస - చక్రాలు:-

ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై 

➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు

➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు

➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు

➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు

➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు

➡️ ఆజ్ఞా చక్రము నందు  - 1000 సార్లు

➡️ సహస్రారము నందు - 1000 సార్లు 

అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.

శ్వాస - అంగుళాలు:-

సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు.  శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.

➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.

➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.

➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే -  బ్రహ్మానందం కలుగుతుంది.

➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.

➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.

➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.

➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.

➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే -  అదృశ్యం అవ్వగలరు.

   మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు.  అలాంటి వారు అమరులు అవుతారు.

శ్వాస - సృష్టి వయస్సు:-

 మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన

➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.

➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.

➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.

➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.

➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) -  43,20,000 సంవత్సరాలు.

శ్వాస - సాధన:-

సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.

     మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు.  ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు.  దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.

     84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.💐💐 💐💐💐💐

మహాస్వామి వారి మేధస్సు

 మహాస్వామి వారి మేధస్సు


ఈ విషయం నా దగ్గరకు చికిత్సకు వచ్చే కోయంబత్తూరు వ్యక్తి ఒకరు చెప్పారు. 1960లలో మహాస్వామివారు కోయంబత్తూరు విచ్చేసినప్పుడు దారిలో వస్తున్నా మహాస్వామివారికి ఈ వ్యక్తి పూర్ణకుంభం సమర్పించాడు. తరువాత స్వామివారితో, “పరమాచార్య స్వామివారికి బహుశా గుర్తులేదేమో, ముప్పై ఏళ్ల క్రితం ఇదే రోడ్డులో మీరు వచ్చినప్పుడు మా నాన్నగారు మీకు పూర్ణకుంభం సమర్పించారు” అని చెప్పాడు. అందుకు స్వామివారు, “అవును. కాని అప్పుడు మీరు ఎదురుగా ఉన్న ఇంటిలో ఉండేవారు. ఇప్పుడు ఉన్న ఇంటిలో కాదు కదా!” అని అన్నారు. అంతటి జ్ఞాపకశక్తికి సూపర్ హ్యూమన్ అన్న విశేషణం కూడా సరిపోదేమో!


ఒకసారి మేము కర్నూలులో అనుకోకుండా చరిత్ర, భూగోళం గురించిన పాఠం విన్నాము. మేము శ్రీమఠం మకాంచేసిన ప్రాంతంలోని ఒక కుటీరంనుండి ఒక ఉపాధ్యాయుడు కంబోడియా మరియు థాయ్ ల్యాండ్ దేశాల ప్రజలు, చరిత్ర, మతాలు, ఆచారాలు, వారి జీవన విధానం గురించిన పాఠం చెప్పడం లీలగా విన్నాము. మేమనుకున్నాము బహుశా ఎవరో వేదపండితుడు పాఠశాలలో చదువుతున్న తన కుమారునికి బోధిస్తున్నాడు అని. కొద్దిసేపటి తరువాత ఆ కుటీరం నుండి మహాస్వామివారు బయటకువచ్చారు. అప్పుడు మాకు అర్థం అయ్యింది. ఇప్పటిదాకా మహాస్వామివారు అంతకు కొద్దిరోజుల ముందే సన్యాసం స్వీకరించిన బాల పెరియవతో సంభాషిస్తున్నారని. అన్ని విషయాలపై మహాస్వామివారికున్న పట్టు చూసి ఆశ్చర్యపోయాము.


పరమాచార్య స్వామికున్న మేధస్సు, వివిధ విషయాలపై ఉన్న అవగాహన అసాధారణం. ఒకసారి కాంచీపురం దగ్గర ఉన్న శివాస్థానంలో మహాస్వామివారు మకాం చేస్తున్నారు. దర్శనానికి మేమి అక్కడకు వెళ్ళాము. ఒక భక్తుడు అక్కడకు వచ్చి భౌతికశాస్త్రానికి సంబంధించిన ఒక సిద్ధాంతం గురించిన వ్యాసం అచ్చువేయబడిన కాగితాలను స్వామి ముందు పెట్టాడు. మద్రాసు విశ్వవిద్యాలయానికి పి హెచ్ డి కోసం దీన్ని సమర్పిస్తున్నాని, స్వామివారి ఆశీస్సులు కావాలని తెలిపాడు. అది చాలా సాంకేతికమైన క్లిష్ట విషయం. స్వామి కొన్ని క్షణాలు ఇరవై పేజీలున్న ఆ పొత్తాన్ని చూసి దాన్ని పక్కన పెట్టి ప్రసాదం ఇచ్చి పంపారు. కొద్దిసేపటికి ఆ భక్తుడు వెల్లిపోయిన తరువాత న ఆవైపు తిరిగి,

స్వామివారు : “దీన్ని తీసుకుని, ఆ చెట్టు నీడలో కూర్చుని, దీన్ని జాగ్రత్తగా చదివి, దాని సారాశం నాకు చెప్పు”


నేను దాన్ని తీసుకుని ఒక అరగంట పాటు దాన్ని చెదివి స్వామివద్దకు తిరిగొచ్చాను.


స్వామివారు : దాన్ని చదివావా? అర్థం అయ్యిందా?


నేను దాని గురించి చెప్పడం మొదలుపెట్టాను. రెండు మూడు నిముషాల తరువాత స్వామివారు మధ్యలో ఆపారు.


స్వామివారు : నువ్వు చెబుతున్నది నేను అంగీకరించను. మొదటి పేజిలో ఉన్న రెండవ పేరా, నాల్గవ పేజిలో ఉన్న మొదటి పేరా ఒకదానికొకటి విరుద్ధంగా లేవూ? వెళ్ళు మరలా చదువు.


నేను ఆశ్చర్యపోయాను. నేను మరలా చెట్టు నీడకు వెళ్లి శ్రద్ధగా చదివాను. పరమాచార్య స్వామివారు చెప్పింది నిజం. అరగంట పాటు చదివినా నాకు కనపడని ఆ విషయం, కేవలం క్షణాల్లో భక్తులకు దర్శనం ఇస్తూ ఒకసారి అలా తిరిగేసిన స్వామివారికి కనపడింది.


నన్ను వారు పరీక్షిస్తున్నారు అని అర్థం అయ్యింది. బహుశా అహంకారమనే బుడగని సుతిమెత్తగా బద్దలుకొడుతున్నారు.


--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి.


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

సింగారించెద తిరిపెమ!






 కం.

సింగారించెద తిరిపెమ!
బంగరు నానాథ! దేవ! భద్రము శివుడా!
పొంగకు త్వరపడి భువిలో
చెంగటి కార్తీకమందు చిఱుకొలువులకున్
( *కొలువులు=సేవలు* )
కం.
తుంటరి మనుజులు చింతిలి
యొంటరి వానిగ నినుగని యుచితవరాలన్
కొంటెగ కోరగవ చ్చొక
కంటను కనుగొని మెలగుమ! కాశీనాథా!
*~శ్రీశర్మద* 

సింగారించెద




 

తగ్గేదేలేదని

 తగ్గేదేలేదని తలబిరుసయి మారక గొప్పేముంది,

పదిమంది బాగుకయ్ సాగని మనిషి గొప్పేముంది.

పదుగురి మేలు కోరిసాగే మహానది తప్పేముంది,

పొలాలకాలువగ పంటయిన నదివిలువ తగ్గేముంది.

Dr. Vedula'sirisha'

ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించుచున్నాను.🙏

 శ్లోకం:☝️అఘోర ముఖ ధ్యానం

*కాలాభభ్రమరాంజనద్యుతినిభం*

  *వ్యావృత్తపింగేక్షణం*

*కర్ణోద్భాసిత భోగిమస్తకమణి*

  *ప్రోద్భిన్న దంష్ట్రాంకురం l*

*సర్పప్రోత కపాలశుక్తి శకల*

  *వ్యాకీర్ణ సంచారగం*

*వందే దక్షిణమీశ్వరస్య కుటిల*

   *భ్రూభంగ రౌద్రం ముఖం ll*

   - శివపంచానన స్తోత్రం - 2


భావం: దట్టమైన మేఘాలు, తుమ్మెదల వలే నల్లని కాటుక కాంతితో ప్రకాశించేదియు, గోరోజన వర్ణముతో వెడల్పయిన కన్నులు కలదియు, చెవులకు ఆభరణాలుగా ఉన్న సర్ప శిరోరత్నములతో వాడియైన కోరలు కలదియు, సర్పములతో పాటు హారముగా కూర్చబడిన కపాలములు కలదియు, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుడు వంకరలుగా నున్న కనుల యొక్క కనుబొమల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించుచున్నాను.🙏