22, ఫిబ్రవరి 2026, ఆదివారం

Panchangam పంచాంగం

  


అర్చకుడు కావలెను.*

   

అనంతపురం జిల్లా,యల్లనూరు మండలం,తిమ్మంపల్లి గ్రామము నందు వెలసిన

 *శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం కి అర్చకుడు కావలెను.* 


నెల జీతం 15000 మరియు

హారతి డబ్బులు,

మంచి సౌకర్యం తో కొత్త ఇల్లు ఇవ్వబడును.

వివరములకు 

 *శేషగిరి శర్మ .తిమ్మంపల్లి. 9490481957.*

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


  శ్రీ భగవానువాచ ।

లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।

జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ।। 3 ।।



ప్రతిపదార్థ:


  -భగవాన్-ఉవాచ — భగవంతుడు పలికెను; లోకే — లోకములో; అస్మిన్ — ఈ యొక్క; ద్వి-విధా — రెండు విధముల; నిష్ఠా — నిష్ఠ/విశ్వాసము; పురా — ఇంతకు పూర్వము; ప్రోక్తా — చెప్పబడినవి; మయా — నా (శ్రీ కృష్ణుడు) చేత; అనఘ — పాప రహితుడా; జ్ఞాన-యోగేన — జ్ఞాన మార్గము ద్వారా; సాంఖ్యానాం — ధ్యాన నిష్ఠ యందు ఆసక్తి కలవారికి; కర్మ-యోగేన — కర్మ యోగము ద్వారా; యోగినాం — యోగులకు.    


 

 తాత్పర్యము :   



భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ పాపరహితుడా, భగవత్-ప్రాప్తికి (జ్ఞానోదయము) ఉన్న రెండు మార్గములు ఇంతకు పూర్వమే నాచే చెప్పబడినవి: ధ్యాన నిష్ఠయందు ఆసక్తి కలవారికి జ్ఞాన మార్గము; మరియు పనుల పట్ల ఆసక్తి కలవారికి కర్మ మార్గము.



 వివరణ:


2.39వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక సిద్ధి కొరకు రెండు మార్గములను ఉపదేశించెను. మొదటిది విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా ఆత్మ యొక్క నిజ స్వభావాన్ని మరియు అది శరీరము నుండి ఎలా వేరైనదో తెలుసుకోవటం. శ్రీ కృష్ణుడు దీనిని 'సాంఖ్య యోగం' అన్నాడు. తత్త్వ-విచారణ దృక్పథం ఉన్నవారు, మేధో విశ్లేషణ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారు. రెండవది, భగవంతునిపై భక్తి భావనతో పని చేయటం లేదా 'కర్మ యోగము'. శ్రీ కృష్ణుడు దీనినే, ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు 'బుద్ధి యోగం' అని కూడా అంటాడు. ఈ రకంగా పని చేయటం, అంతఃకరణాన్ని శుద్ది చేస్తుంది, మరియు నిర్మల మనస్సులో, జ్ఞానం సహజంగానే వృద్ధినొంది, అది జ్ఞానోదయ స్థితి వైపు దారితీస్తుంది.


ఆధ్యాత్మిక పథంలో ఆసక్తి ఉన్నవారిలో, ధ్యానము/విశ్లేషణ పట్ల మొగ్గు చూపే వారు ఉంటారు, మరియు, కర్మలు/పనుల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి, ఆత్మకి భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటినుండీ ఈ రెండు మార్గాలు ఉన్నాయి. తన ఉపదేశం అన్నీ రకాల జనులకూ ఉద్దేశించబడింది కాబట్టి శ్రీ కృష్ణుడు ఈ రెంటినీ గురించి వివరిస్తున్నాడు.

*శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 37*


*పుంజితకరుణముదంచితశింజిత మణికాంచి కిమపి కాంచిపురే।*

*మంజరితమృదులహాసం పింజరతనురుచి పినాకిమూలధనమ్॥*


*భావము :*


*కామాక్షి అపార దయాసముద్రురాలు. ఎరుపు, పసుపు వర్ణముల మిశ్రితమైన గౌర వర్ణముతో శోభిల్లు శరీర కాంతి కలది. ఆమె మొలకు కట్టబడిన చిరుగంటలు చక్కటి ధ్వనులు చేస్తుండగా, ఈశ్వరుని అలరించే మాత కాంచీపురములో స్థితురాలై ఉన్నది.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

22-02-2026 ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

22-02-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. మిత్రుల నుంచి ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


వృషభం


ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఆకస్మిక ధన లాభసూచనలున్నవి. నూతన వస్తు లాభాలు పొందుతారు. స్థిరాస్థి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి పొందుతారు.

---------------------------------------


మిధునం


అవసరానికి ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. మిత్రులతో విందువినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కర్కాటకం


ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. పనులలో తొందరపాటు చేసి ఇబ్బందికి గురి అవుతారు. కొన్ని వ్యవహారాలు వాయిదా వెయ్యడం మంచిది. దూరప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు.

---------------------------------------


సింహం


ఇతరుల నుండి రావలసిన సొమ్ము సకాలంలో చేతికందదు. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


కన్య


సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అప్రయత్న విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి.

---------------------------------------


తుల


వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ పరమైన పరిచయాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.

---------------------------------------


వృశ్చికం


గృహ నిర్మాణ పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారమున నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమాధిక్యం తప్పదు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బందు మిత్రులతో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


మకరం


ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


కుంభం


దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తివ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఊహించని సమస్యలు ఉంటాయి. సంతాన అనారోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సోదరులతో స్వల్ప వివాదాలు ఉంటాయి.

---------------------------------------


మీనం


ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విద్యార్థులు అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------

ఆంధ్రభాషాయోష నా మాతృభాష"*

  *"ఆంధ్రభాషాయోష నా మాతృభాష"*


సీ॥

ముత్యముల్ పఱచిన ముగ్ధమోహనరూప 

మాశైలి కమనీయ మద్భుతమ్ము 

వ్రాలు వృత్తాల దివ్యమ్ముగా నొదిగెడి 

ౘదల తారాడు నక్షత్రచయము 

పదముల గదలాడు పలునాట్యభంగిమల్ 

పలుకగ రాగాలు పలుకరించు 

పరిపూర్ణతను గల్గు వర్ణసందోహమ్ము 

సంగీతసాహిత్యసంగతమ్ము 

గీ॥ తెలుగు సంస్కృత భాషలు మెలగి చెలగి 

ఆంధ్రభాషగా వెలసిన సాంద్రభాష 

నాదు మాతృభాషాయోష నల్గడలను 

తేనెలొలికించు లెస్సగా దీప్తులెగయ 

*~శ్రీశర్మద*

పురాణాలలో మత ఉగ్రవాదం)

 శ్రీరామ (97)


                   

              (పురాణాలలో మత ఉగ్రవాదం)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                               ----------------


మతం అంటే అభిప్రాయం.

అనేకమంది అనేక అభిప్రాయాలను కలిగి యుంటారు.

ఒకే అభిప్రాయంగల అనేకుల సమూహం " మతం " గా ప్రస్తుతం చెలామణిలో ఉన్నది.

మా మతము గొప్పది,ఆచరణీయం అనుకోవడంలో తప్పులేదు.

కానీ అన్ని మతములకన్నా మా మతమే గొప్పది, అందరూ తదనుకూలంగా ఉండాలి అనేది మత తీవ్ర వాదం.

తమ మతం, తమ కులం, తమ భాష, తమ ప్రాంతం,ఇంకా చెప్పాలంటే తమ శాఖ, తమ సంప్రదాయములకు చెందని వారిని ద్వేషించడమే ఈ తీవ్రవాదుల మతం.

దానికి వారు యుక్తిగా అనేక కారణములు చెబుతారు.


కొందరు ఉన్మాదులు, మరికొంత ముందుకు వెళ్ళి తమ మతమునకు విరుద్ధంగా ప్రవర్తించే వారిని చంపివేయాలి అంటారు.

దీన్నే "మత ఉగ్రవాదం" అంటాము.

తాము సంహరిస్తున్న వారంతా " మత ద్రోహులు,అజ్ఞానులు,దుర్మార్గులు, నీచులు,వీరిని చంపితే గానీ సమాజం బాగుపడదు" అంటారు.


ఎంతమందిని చంపితే అంత ఎక్కువగా వారి దేవుడు సంతోషిస్తాడు అంటారు.


ఆత్మాహుతి దళాలను ఏర్పాటు చేస్తారు.


పరమత ద్వేషులైన మరికొందరు, సంప్రదాయ వేషధారులై శివ, విష్ణు, ద్వేషాలను సున్నితంగా రెచ్చకొడతూ అమాయకులను మభ్యపెడతారు.


వారు పైకి నవ్వుతూనే సమాజంలో

 "విషాన్ని" చిమ్మి, కొంతమంది మేధావులను లోబరచుకొని ప్రజలలో చీలికలు సృష్టిస్తారు.


ఇదంతా సత్యము, ధర్మము, అహింస, ప్రాణులందరి యందు సమభావము, లను బోధించే "సనాతన ధర్మము" నకు వ్యతిరేకమైన తీవ్రవాదమే.


 ప్రజలను అశాంతికి గురిచేసి, సమాజాన్ని సర్వ నాశనం చేసేది ఉగ్రవాదము.


ఆ ఉగ్రవాదానికి ప్రతీకే పురాణాలలో వర్ణించిన "హిరణ్యకశిపుడు".


తన మతానికి విరుద్ధంగా, ప్రహ్లాదుడు చేసిన విష్ణు ప్రశంశ, హిరణ్యకశిపుడు భరించలేక పోయాడు.


ఒడిలో నుండి పుత్రుని క్రిందికి త్రోసివేసి క్రోధావేశంతో అక్కడ ఉన్న మంత్రులతో ఇలా అన్నాడు.


"మంత్రులారా! ఈ ప్రహ్లాదునివంటి పితృద్రోహి, భూమండలంలో ఎవరైనా ఉన్నారా?


వీడియొక్క ‌పినతండ్రి హిరణ్యాక్షుని,వరాహ రూపంలో వచ్చి విష్ణువు సంహరించాడు.


వీడు సిగ్గు శరములు లేకుండా మన వంశ విరోధి అయిన ఆ విష్ణువునకు భజన చేస్తున్నాడు.


ప్రాణం పోయినంత బాధ నాకు కలిగిస్తున్నాడు. 

వీడిని ఏమాత్రం ఉపేక్షించ కూడదు,

అంటూ,

  రాక్షస భటులవంక తిరిగి వారిని ఈ విధంగా ఆజ్ఞాపించాడు.

శా// పంచాబ్దంబులవాడు, తండ్రినగు నా పక్షంబు నిందించి, య/

త్కించిద్భీతియు లేక విష్ణు, నహితుం గీర్తించుచున్నాడు,వ/

 ల్దంచుం చెప్పిన మాన డంగమున బుత్రాకారతన్

వ్యాధి జ/

న్మించెన్, వీని వధించి రండు దనుజుల్ మీ మీ పటుత్వంబులన్//

(రాక్షసులారా! వీడు చూస్తే ఐదేండ్ల పిల్లవాడు.

తండ్రి నైన నన్ను ధిక్కరించి,నా ఎదుటే, నా శత్రువైన విష్ణువును, నదురు,బెదురు, లేకుండా పొగడు చున్నాడు.

వద్దంటే నా మాట లెఖ్ఖ చేయడం లేదు.

వీడు నా కొడుకు కాదు. 

 "కొడుకు" అనే పేరుతో నా శరీరంలో జన్మించిన పెద్ద వ్యాధి.

మీ మీ శక్తి సామర్థ్యాలు చూపించి వీనిని తీసుకుని వెళ్లి వెంటనే వధించండి).


శా// అంగ వ్రాతములో జికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శే/

షాంగంబు రక్షసేయు క్రియ నీ యజ్ఞుం, గులద్రోహి, దు/

స్సంగుం, గేశవ పక్షపాతి, నధముం, జంపించి వీరవ్రతో/

త్తుంగ ఖ్యాతి జరించెదం,గులము నిర్దోషంబు గావించెదన్//


(ఓ రాక్షస భటులారా!

 శరీరంలో ఏదైనా ఒక అవయవం చెడిపోతే వైద్యుడు ఆ అవయవాన్ని శస్త్ర చికిత్సతో ఛేదించి, మిగతా దేహాన్ని రక్షిస్తాడు.

ఆ విధంగా " అజ్ఞాని, కులద్రోహి, దుర్మార్గులతో కూడిన వాడు, విష్ణు పక్ష పాతి, నీచుడు,అయిన ఈ ప్రహ్లాదుని సంహరించి,నా కులాన్ని నిర్దోషము చేస్తాను.

"పుత్రుని కూడా సంహరించి కులమును కాపాడాడు" అన్న మహాకీర్తిని సంపాదిస్తాను).

అన్నాడు.


హిరణ్యకశిపుని ఆజ్ఞానుసారం ఆ రాక్షసభటులందరు ఏకమై, శూలములు చేతుల్లో ధరించి, నిర్దయులై ప్రహ్లాదుని క్రూరంగా పొడిచి హింసించారు.

రాజకుమారుడు, అందరియడల దయగలవాడు, సాధువు, ప్రజలందరిచేత మన్నింపబడుతున్న వాడు, బాలుడు, చంపదగినవాడు కాడు, అనే ఆలోచనేదీ లేకుండా, వారంతా ఆ బాలుని చిత్రహింసలకు గురిచేశారు.


ఈ ఉగ్రవాదాన్ని చూచి, సాధుసంరక్షకుడైన భగవానుడు ఆగ్రహపరవశుడైనాడు.


భయంకరమైన నరసింహ రూపం ధరించాడు.

నిప్పులు కురిపిస్తున్న నేత్రాలతో హిరణ్యకశిపుని చూస్తూ అ దానవుడిపై లంఘించాడు.


మ// విహగేంద్రుం డహి వ్రచ్చు కైవడి, మహోద్వృత్తిన్, నృసింహుండు, సా/

గ్రహుడై,యూరవులందు జేర్చి, నఖ సంఘాతంబులన్ వ్రచ్చె, దు/

స్సహు,దంభోళి కఠోరదేహు,నచలోత్సాహున్,మహాబాహు, నిం/

ద్ర హుతాశాంతక భీకరున్, ఘనకరున్,దైత్యాన్వయ శ్రీ కరున్//


(ఆ హిరణ్యకశిపుడు సామాన్యుడు కాడు.

తన తపశ్శక్తితో ప్రపంచం సహించలేనంత శక్తి కలిగి ఉన్నవాడు.

వజ్రము వలె కఠినమైన దేహంతో కూడి ఉన్నవాడు.

అచంచలమైన ఉత్సాహంతో కూడి ఉన్నవాడు.

మహా బాహువు.

ఇంద్రుడు, అగ్ని, యముడు,మొదలైన దేవతలకు భీతి కలిగించిన వాడు,

దిగ్గజముల కుంభస్థలాలను పగులగొట్టగలిగిన బలమైన బాహువులు గలవాడు,

ముల్లోకాలను జయించి రాక్షస వంశానికి కీర్తి ప్రతిష్టలు చేకూర్చిన వాడు,

అటువంటి ఆ హిరణ్యకశిపుని "నృసింహుడు" మహాసంరంభంతో పట్టుకొన్నాడు.

తన తొడలమీద వేసుకొని,

మిక్కిలి ఆగ్రహపరవశుడై తన వాడి గోళ్లతో వాడి వక్షస్థలాన్ని చీల్చి వేశాడు)


                   ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

22-2-'26.