శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 16 )
🙏మీ అందరికి సకుటుంబంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏
ఈరోజు పరమపావనమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము.
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
(25-3-'26 'సాయంత్రం ' పోష్టు తరువాయి భాగము)
జగత్కళ్యాణ కారకమైన సీతా రామ కళ్యాణం నిశ్చయమైంది అని ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాము.
జరగబోయే తన కుమారుల వివాహ విషయాలు బంధువులతో ముచ్చటించుకొంటూ, దశరథమహారాజు మహదానందంతో ఆ రాత్రి గడిపాడు.
తెల్లవారింది.
ప్రాతః:కాలమే కర్మవేత్త అయిన దశరథ మహారాజు దైవ కార్యాలన్నీ నిర్వహించి,జనకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు.
శ్లో// యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః/
భ్రాతృభిః సహితో రామః కృత కౌతుక మంగలః/
వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి/
పితుః సమీప మాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః//
(విజయమనే ముహూర్తంలో, పెండ్లికొడుకును చేయడము, తోరణము కట్టుకోవడము మొదలైన మంగళ కార్యములు పూర్తి చేసుకుని, సర్వాభరణ భూషితులై,రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వశిష్ఠాదిమహర్షులను ముందు ఉంచుకొని యజ్ఞశాలలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చారు).
శ్లో// తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ /
కారయస్వ ఋషే సర్వమృషిభిః సహ ధార్మిక /
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో //
(పిమ్మట జనక మహారాజు ,లోకాభిరాముడైన రాముని వివాహం,విశ్వామిత్ర, శతానందాది మునీశ్వరుల సహాయంతో జరిపించమని వశిష్ఠ మహర్షిని,ఎంతో వినయంగా ప్రార్ధించాడు)
" అలాగే "అని వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని, శతానందుని, ముందిడుకొని,యథా శాస్త్రముగాను, మంత్రపూర్వకముగాను,వేదిని నిర్మించాడు.
ఆ వేదిని చక్కగా అలంకరించి, వేది చుట్టూ దర్భలను ఉంచాడు.
అగ్నిని ప్రజ్వలింపజేసి, ఆ వేదిలో హోమము చేసాడు.
శ్లో// తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితామ్/
సమక్ష మగ్నే:సంస్థాప్య రాఘవాభిముఖే తదా/
అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానంద వర్ధనమ్//
(ఆ శుభముహూర్తాన సీతాదేవిని సర్వాభరణములతో అలంకరించారు. జనకమహారాజు, ఆ భూజాతను అగ్ని సమక్షంలో రామునకు అభిముఖంగా నిల్చోబెట్టి, కౌసల్యాదేవికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించే ఆ రామచంద్రునితో ఇలా అన్నాడు).
శ్లో//ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ/
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా//
(ఓ రామా!ఇదిగో నా కుమార్తె అయిన సీత. ఇప్పటి నుండి నీకు సహధర్మ చారిణి అవుతున్నది.ఈమెను స్వీకరింపుము. నీ హస్తముతో ఈమె పాణిని గ్రహించుము ).
శ్లో//పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా/
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా//
(సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతయై ఎల్లప్పుడూ నీడ వలే నిన్ను అనుసరిస్తుంది.
జనకమహారాజు ఈ మాటలు అంటూ మంత్రములతో పవిత్రమైన జలమును వదలెను)
వెంటనే దేవతలు, ఋషులు "బాగు" "బాగు"అన్నారు.
దేవ దుందుభులు మ్రోగినై.
పుష్ప వర్షం కురిసింది.
(ఈ ఘట్టం స్కాంద పురాణం లోని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని తలపిస్తున్నది.
బ్రహ్మదేవుడు మంత్రము చెప్పుచుండగా, హిమవంతుడు,
"ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర/
భార్యార్థం ప్రతిగృహ్ణీష్వ మంత్రేణానేన దత్తవాన్//
అస్మై రుద్రాయ మహతే దేవదేవాయ శంభవే/
కన్యా దత్తా మహేశాయ గిరీంద్రేణ మహాత్మనా//
( ఓ పరమేశ్వరా! నేను ఈ కన్యను (పార్వతిని) నీకు సమర్పిస్తున్నాను. ఈమెను నీ భార్యగా స్వీకరింపుము,అని మంత్రము పఠించుచూ
మహాత్ముడు, దేవదేవుడు,రుద్రుడు, శంభువునగు శివునకు,గిరీంద్రుడైన హిమవంతుడు మంత్రపూతమైన జలముతో కన్యాదానమును చేసెను).
మంత్రోదక పురస్సరంగా సీతను ఈ విధంగా రామునకు ఇచ్చి ఎంతో ఆనందపడుతూ జనకుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు,
శ్లో// లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా/
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః//
(లక్ష్మణా!రమ్ము. నీకు క్షేమమగుగాక. నేనిచ్చుచున్న ఊర్మిళను స్వీకరింపుము.ఈమె పాణిని గ్రహింపుము.ఆలస్యము చేయవద్దు).
ఈ విధముగా లక్ష్మణునిచే ఊర్మిళ పాణిగ్రహణం చేయించి, జనకుడు,
శ్లో//తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత/
గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన//
(లక్ష్మణునితో ఇట్లు పలికి, జనకుడు భరతునితో,ఇట్లనెను. ఓ రఘునందనా,భరతా, నీ హస్తముతో మాండవి పాణిని గ్రహింపుము).
శ్లో// శత్రుఘ్నంచాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః/
శ్రుతకీర్త్యా మహాబాహొ పాణింగృహ్ణీష్వ పాణినా//
(పిమ్మటధర్మాత్ముడైన జనకమహారాజు శత్రృఘ్నునితోఇట్లనెను.ఓ మహాబాహూ!శ్రుతకీర్తి హస్తమును నీహస్తముతో పట్టుకొని పాణిగ్రహణముచేయుము).
జనకుని వాక్యము విని, ఆ నలుగురు రాజకుమారులు, వశిష్ఠుని అనుమతితో ఆ నలుగురు కన్యలయొక్క సుకుమారములైన హస్తములను, తమ హస్తములతో గ్రహించిరి.
శ్లో//అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవచ/
ఋషీంశ్చైవ మహాత్మాన స్సభార్యారఘుసత్తమాః/
యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్//
(మహాత్ములైన ఆ రఘుకుమారులు,
భార్యాసమేతులై అగ్నికి ప్రదక్షిణం చేశారు.
వేదికి,జనకమహారాజుకు, ఋషులకు, ప్రదక్షిణం చేసి, యధావిధిగా వివాహం చేసుకున్నారు).
అప్పుడు ఆకాశమునుండి గొప్ప ప్రకాశముతో కూడిన పుష్పవృష్టి కురిసింది.
దేవదుందుభులుమ్రోగినై.
గీత, మంగళ వాద్య ధ్వనులతో అప్సరసలు నాట్యం చేశారు.
గంధర్వులు మనోహరంగా గానము చేశారు.
ఆ వివాహ సమయములో ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్నవారంతా ప్రత్యక్షముగా చూసి ఎంతో ఆశ్చర్యము చెందారు.
పిమ్మట రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ భార్యలతో కూడి తమకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్లారు.
భార్యా సమేతులై అలా వెళ్తున్న పుత్రులను ఆనందంగా చూస్తూ, బంధు సహితుడైన,దశరథుడు వారిని అనుసరించాడు.
ఈ విధంగా వాల్మీకి మహర్షి, శ్రీమద్రామాయణం,బాలకాండలో, సీతా రామ కళ్యాణాన్ని వర్ణించారు.
స్వస్తి.
శ్లో//ధర్మ్యం యశస్య మాయుష్యం రాజ్ఞాంచ విజయావహం/
ఆదికావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం/
పఠేద్య: శృణుయాల్లోకే నర: పాపాత్ ప్రముచ్యతే//
(పూర్వము వాల్మీకిమహర్షి చేత రచింపబడిన ఈఆదికావ్యము,ధర్మసమ్మతమైనది.చదివినవారికి కీర్తిని ఇస్తుంది. రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది. ఋషికృతమైన ఈ ఆదికావ్యాన్ని చదివేవారు, వినేవారు,సమస్తపాపములనుండి
విముక్తులవుతారు).
రామాయణం చదివే వారికీ, వినేవారికీ, దీర్ఘాయుర్దాయము లభిస్తుంది.
కొరినకోరికలన్నీ తీరుతాయి.
అందరూ జీవపుత్రులవుతారు.
ఉత్తమమైన సంతానము లభిస్తుంది.
ఇంట్లో ఉండి, అశాంతిని కలిగించే భూతములు తొలగిపోతాయి.
పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు.
శ్లో//ఆయుష్య మారోగ్యకరం యశస్యం/
సౌభ్రాతృకమ్ బుద్ధికరం శుభంచ/
శ్రోతవ్య మేతన్నియమేన సద్భిః/
ఆఖ్యాన మోజస్కర మృధ్ధికామైః//
(ఆయుర్దాయమును, ఆరోగ్యమును, కీర్తిని, సోదరప్రేమను, సద్బుద్ధిని, శుభములను, తేజస్సును, వృద్ధి చేసే ఈ రామాయణమును సత్పురుషులు నియమపూర్వకముగా వినవలెను).
శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.
ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః
శ్లో// స్వస్తి:ప్రజాభ్య:పరిపాలయంతాం/
న్యాయ్యేన మార్గేణమహీం మహీశా:/
గో బ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం/
లోకా: సమస్తాః సుఖినో భవంతు//
(సశేషం)
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
26-3-'26.