26, మార్చి 2026, గురువారం

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ:  కర్మ యోగము.



తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।

గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ।। 28 ।।



ప్రతిపదార్థ:



.తత్త్వ-విత్ — సత్యమును ఎరిగినవాడు; తు — కానీ; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; గుణ-కర్మ — గుణములు మరియు కర్మలచే; విభాగయోః — తారతమ్యము గుర్తించును; గుణాః — ఇంద్రియ-మనస్సు రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; గుణేషు — ఇంద్రియ గ్రాహ్య వస్తువుల రూపంలో ఉన్న ప్రకృతి గుణములు; వర్తంతే — ప్రవర్తిల్లును; ఇతి — ఈ విధంగా; మత్వా — తెలుసుకొని; న, సజ్జతే — ఆసక్తితో ఉండరు.



 తాత్పర్యము : 


 ఓ మహా బాహువులున్న అర్జునా, జ్ఞానులు, ప్రకృతి-గుణములు మరియు కర్మ నుండి జీవాత్మను వేరుగా చూస్తారు. గుణములే (ఇంద్రియములు, మనస్సు వంటి రూపంలో ఉన్న) గుణముల (ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో) యందు కదులుతున్నవని తెలుసుకుని వాటి యందు ఆసక్తులు కారు.


  

 వివరణ:


 ఇంతకు పూర్వ శ్లోకం ఏం చెప్పిందంటే, 'అహంకార విమూఢాత్మా' (అహంకారంచే భ్రమకు లోనై తమను తాము శరీరమే అనుకునేవారు) తామే కర్తలము అనుకుంటారు. ఈ శ్లోకం తత్త్వ-విత్ (సత్యమును ఎరిగినవారు) ల గురించి చెపుతోంది. ఈ విధంగా అహంకారాన్ని నిర్మూలించుకున్న వారు శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛ పొంది, తమ ఆధ్యాత్మిక విలక్షణతని భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి వారు ప్రాపంచిక క్రియలకు తామే కర్తలమని మభ్యపడరు, బదులుగా, ప్రతి కార్యకలాపం కూడా మూడు గుణముల కదలిక వల్లనే జరుగుతున్నాయని తలుస్తారు. ఇటువంటి, భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు ఇలా అంటారు: ‘జో కరఇ సో హరి కరఇ, హోతా కబీర్ కబీర్’ - ‘భగవంతుడే అన్నీ చేస్తున్నాడు, కానీ జనులు నేను చేస్తున్నాననుకుంటున్నారు’

వాల్మీకి రామాయణం - 16 )

  శ్రీరామ ( వాల్మీకి రామాయణం  - 16 )


🙏మీ అందరికి సకుటుంబంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు🙏

ఈరోజు పరమపావనమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏



  (25-3-'26  'సాయంత్రం '  పోష్టు తరువాయి భాగము)


జగత్కళ్యాణ కారకమైన సీతా రామ కళ్యాణం నిశ్చయమైంది అని ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాము.


 జరగబోయే తన కుమారుల వివాహ విషయాలు బంధువులతో ముచ్చటించుకొంటూ, దశరథమహారాజు  మహదానందంతో  ఆ రాత్రి గడిపాడు.

తెల్లవారింది.

ప్రాతః:కాలమే కర్మవేత్త అయిన దశరథ మహారాజు దైవ కార్యాలన్నీ నిర్వహించి,జనకుని యజ్ఞశాలలో ప్రవేశించాడు.


శ్లో// యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః/

భ్రాతృభిః సహితో రామః కృత కౌతుక మంగలః/

వసిష్ఠం పురతః కృత్వా మహర్షీ నపరానపి/

పితుః సమీప మాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః//


(విజయమనే ముహూర్తంలో, పెండ్లికొడుకును చేయడము, తోరణము కట్టుకోవడము మొదలైన మంగళ కార్యములు పూర్తి చేసుకుని, సర్వాభరణ భూషితులై,రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వశిష్ఠాదిమహర్షులను ముందు ఉంచుకొని యజ్ఞశాలలో ఉన్న తండ్రి దగ్గరకు వచ్చారు).


శ్లో// తతో రాజా విదేహానాం వసిష్ఠ మిద మబ్రవీత్ /

కారయస్వ ఋషే సర్వమృషిభిః సహ ధార్మిక /

రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో //


(పిమ్మట జనక మహారాజు ,లోకాభిరాముడైన రాముని వివాహం,విశ్వామిత్ర, శతానందాది మునీశ్వరుల సహాయంతో జరిపించమని వశిష్ఠ మహర్షిని,ఎంతో వినయంగా ప్రార్ధించాడు)


" అలాగే "అని వశిష్ఠ మహర్షి, విశ్వామిత్రుని, శతానందుని, ముందిడుకొని,యథా శాస్త్రముగాను, మంత్రపూర్వకముగాను,వేదిని నిర్మించాడు.


ఆ వేదిని చక్కగా అలంకరించి, వేది చుట్టూ దర్భలను ఉంచాడు.


అగ్నిని ప్రజ్వలింపజేసి, ఆ వేదిలో హోమము చేసాడు.


శ్లో// తతః సీతాం సమానీయ సర్వాభరణ భూషితామ్/

సమక్ష మగ్నే:సంస్థాప్య రాఘవాభిముఖే తదా/

అబ్రవీ జ్జనకో రాజా కౌసల్యానంద వర్ధనమ్//


(ఆ శుభముహూర్తాన సీతాదేవిని సర్వాభరణములతో అలంకరించారు. జనకమహారాజు, ఆ భూజాతను అగ్ని సమక్షంలో రామునకు అభిముఖంగా నిల్చోబెట్టి, కౌసల్యాదేవికి ఎల్లప్పుడూ ఆనందాన్ని కలిగించే ఆ రామచంద్రునితో ఇలా అన్నాడు).


శ్లో//ఇయం సీతా మమ సుతా సహధర్మచరీ తవ/

ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా//


(ఓ రామా!ఇదిగో నా కుమార్తె అయిన సీత. ఇప్పటి నుండి నీకు సహధర్మ చారిణి అవుతున్నది.ఈమెను స్వీకరింపుము.  నీ హస్తముతో ఈమె పాణిని గ్రహించుము ).


శ్లో//పతివ్రతా మహాభాగా ఛాయే వానుగతా సదా/

ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా//


(సౌభాగ్యవతి అయిన ఈమె పతివ్రతయై ఎల్లప్పుడూ నీడ వలే నిన్ను అనుసరిస్తుంది. 

జనకమహారాజు ఈ మాటలు అంటూ మంత్రములతో పవిత్రమైన జలమును వదలెను)


వెంటనే దేవతలు, ఋషులు "బాగు"  "బాగు"అన్నారు.

దేవ దుందుభులు మ్రోగినై.

పుష్ప వర్షం కురిసింది.


(ఈ ఘట్టం  స్కాంద పురాణం లోని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని తలపిస్తున్నది.

బ్రహ్మదేవుడు మంత్రము చెప్పుచుండగా, హిమవంతుడు,

"ఇమాం కన్యాం తుభ్యమహం దదామి పరమేశ్వర/

భార్యార్థం ప్రతిగృహ్ణీష్వ మంత్రేణానేన దత్తవాన్//

అస్మై రుద్రాయ మహతే దేవదేవాయ శంభవే/

కన్యా దత్తా మహేశాయ గిరీంద్రేణ మహాత్మనా//


( ఓ పరమేశ్వరా! నేను ఈ కన్యను (పార్వతిని) నీకు సమర్పిస్తున్నాను. ఈమెను నీ భార్యగా స్వీకరింపుము,అని మంత్రము పఠించుచూ

మహాత్ముడు, దేవదేవుడు,రుద్రుడు,  శంభువునగు శివునకు,గిరీంద్రుడైన హిమవంతుడు మంత్రపూతమైన జలముతో కన్యాదానమును చేసెను).


మంత్రోదక పురస్సరంగా సీతను ఈ విధంగా రామునకు ఇచ్చి ఎంతో ఆనందపడుతూ జనకుడు లక్ష్మణునితో ఇలా అన్నాడు,


శ్లో// లక్ష్మణాగచ్ఛ భద్రం తే ఊర్మిళా ముద్యతాం మయా/

ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్కాలస్య పర్యయః//

(లక్ష్మణా!రమ్ము. నీకు క్షేమమగుగాక. నేనిచ్చుచున్న ఊర్మిళను స్వీకరింపుము.ఈమె పాణిని గ్రహింపుము.ఆలస్యము చేయవద్దు).


ఈ విధముగా లక్ష్మణునిచే ఊర్మిళ పాణిగ్రహణం చేయించి, జనకుడు,


శ్లో//తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత/

గృహాణ పాణిం మాండవ్యాః పాణినా రఘునందన//

(లక్ష్మణునితో ఇట్లు పలికి, జనకుడు భరతునితో,ఇట్లనెను. ఓ రఘునందనా,భరతా, నీ హస్తముతో మాండవి పాణిని గ్రహింపుము).


శ్లో// శత్రుఘ్నంచాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః/

శ్రుతకీర్త్యా మహాబాహొ పాణింగృహ్ణీష్వ పాణినా//


(పిమ్మటధర్మాత్ముడైన జనకమహారాజు శత్రృఘ్నునితోఇట్లనెను.ఓ మహాబాహూ!శ్రుతకీర్తి హస్తమును నీహస్తముతో పట్టుకొని పాణిగ్రహణముచేయుము).


జనకుని వాక్యము విని, ఆ నలుగురు రాజకుమారులు, వశిష్ఠుని అనుమతితో ఆ నలుగురు కన్యలయొక్క సుకుమారములైన హస్తములను, తమ హస్తములతో గ్రహించిరి.


శ్లో//అగ్నిం ప్రదక్షిణీకృత్య వేదిం రాజానమేవచ/

ఋషీంశ్చైవ మహాత్మాన స్సభార్యారఘుసత్తమాః/

యథోక్తేన తదా చక్రుర్వివాహం విధిపూర్వకమ్//


(మహాత్ములైన ఆ రఘుకుమారులు,

భార్యాసమేతులై అగ్నికి ప్రదక్షిణం చేశారు.

వేదికి,జనకమహారాజుకు, ఋషులకు, ప్రదక్షిణం చేసి, యధావిధిగా వివాహం చేసుకున్నారు).


అప్పుడు ఆకాశమునుండి గొప్ప ప్రకాశముతో కూడిన పుష్పవృష్టి కురిసింది.


దేవదుందుభులుమ్రోగినై. 


గీత, మంగళ వాద్య ధ్వనులతో అప్సరసలు నాట్యం చేశారు.

గంధర్వులు మనోహరంగా గానము చేశారు.


ఆ వివాహ సమయములో ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడ ఉన్నవారంతా ప్రత్యక్షముగా చూసి ఎంతో ఆశ్చర్యము చెందారు.

పిమ్మట రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు తమ భార్యలతో కూడి తమకు ఏర్పాటు చేసిన విడిదికి వెళ్లారు.

భార్యా సమేతులై అలా వెళ్తున్న పుత్రులను ఆనందంగా చూస్తూ, బంధు సహితుడైన,దశరథుడు వారిని అనుసరించాడు. 

ఈ విధంగా వాల్మీకి మహర్షి, శ్రీమద్రామాయణం,బాలకాండలో, సీతా రామ కళ్యాణాన్ని వర్ణించారు.


                                స్వస్తి.


శ్లో//ధర్మ్యం యశస్య మాయుష్యం రాజ్ఞాంచ విజయావహం/

ఆదికావ్యమిదం చార్షం పురా వాల్మీకినా కృతం/

పఠేద్య: శృణుయాల్లోకే నర: పాపాత్ ప్రముచ్యతే//


(పూర్వము వాల్మీకిమహర్షి చేత రచింపబడిన  ఈఆదికావ్యము,ధర్మసమ్మతమైనది.చదివినవారికి కీర్తిని ఇస్తుంది. రాజులకు విజయాన్ని చేకూరుస్తుంది. ఋషికృతమైన ఈ ఆదికావ్యాన్ని చదివేవారు, వినేవారు,సమస్తపాపములనుండి

విముక్తులవుతారు).


రామాయణం చదివే వారికీ, వినేవారికీ, దీర్ఘాయుర్దాయము లభిస్తుంది. 

కొరినకోరికలన్నీ తీరుతాయి.

అందరూ జీవపుత్రులవుతారు. 

ఉత్తమమైన సంతానము లభిస్తుంది. 

ఇంట్లో ఉండి, అశాంతిని కలిగించే భూతములు తొలగిపోతాయి. 

పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు.


శ్లో//ఆయుష్య మారోగ్యకరం యశస్యం/

సౌభ్రాతృకమ్ బుద్ధికరం శుభంచ/

శ్రోతవ్య మేతన్నియమేన సద్భిః/

ఆఖ్యాన మోజస్కర మృధ్ధికామైః//


(ఆయుర్దాయమును, ఆరోగ్యమును, కీర్తిని,  సోదరప్రేమను, సద్బుద్ధిని, శుభములను, తేజస్సును, వృద్ధి చేసే ఈ రామాయణమును సత్పురుషులు నియమపూర్వకముగా వినవలెను).

                                     

                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


        శ్లో// స్వస్తి:ప్రజాభ్య:పరిపాలయంతాం/

               న్యాయ్యేన మార్గేణమహీం మహీశా:/

               గో బ్రాహ్మణేభ్య:శుభమస్తు నిత్యం/

               లోకా: సమస్తాః సుఖినో భవంతు//


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

26-3-'26.

మహాభారతం

 🙏మహాభారతం _ శాంతి పర్వం 🙏

                     తొమ్మిదవ భాగం 

అప్పుడు ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! తినకూడనివి ఏవి ? త్రాగ కూడనివి ఏవి ? ఎవరు యోగ్యులు ? ఎవరు అయోగ్యులు ? వివరించండి " అని ఆడిగాడు. వ్యాసుడు బదులుగా " ధర్మనందనా ! గుర్రము, ఒంటె, గాడిద పాలు త్రాగ కూడదు. బ్రాహ్మణుడు ఆడగుర్రము, ఆడఒంటె, ఆడగాడిద దరిదాపులకు వెళ్ళ కూడదు. మనిషిపాలు అసలు త్రాగ కూడదు. ఈనిన పది రోజుల లోపల ఆవు పాలు త్రాగ కూడదు. ప్రేతము వెళ్ళిన ఇంటి భోజనం, పురుటి భోజనం, తలారి ఇచ్చిన భోజనం, కులట ఇచ్చిన భోజనం, స్త్రీ సంపాదన మీద బ్రతికేవాడు పెట్టిన అన్నం, ఆట పాటలతో జీవించేవాడు ఇచ్చే అన్నం, జూదరి ఇచ్చే అన్నం, పూలు అమ్ముకునేవాడు ఇచ్చిన అన్నం, ఊరి నుండి వెలివేసినవాడు ఇచ్చే అన్నం, అన్న కంటే ముందు వివాహంచేసుకునే వాడు ఇచ్చే అన్నం తినరాదు. అవి అభోజ్యములు. ఇతరులను పొగడుతూ జీవించేవాడు ఇచ్చిన అన్నం అత్యంతహేయం. నిలవఉన్న అన్నం పాచిపోయిన అన్నం తినరాదు. సురాపానంతో సంబంధించిన అన్నం తినరాదు. పులగము, పాయసం, అప్పములు, నువ్వులతో చేసిన వంటకములు, దేవుడికి అర్చనచేసి నివేదన చేసిన తరువాత కాని తినకూడదు. ఇవి మామూలుగా వండుకుని తినరాదు.


గృహస్థాశ్రమ ధర్మమును పాటించే వారు దేవతార్చన చేయకుండా దేవతలకు నివేదించక, పితృదేవతలకు పెట్టక, అతిథులకు పెట్టక తినరాదు. గృహస్థు అయిన వాడు భార్యాబిడ్డలు బంధువులతో సంచరిస్తూనే అంటీ అంటక ఉండాలి. వారి ప్రేమాభిమానాలాకు పూర్తిగా లొంగకూడదు. ధర్మనందనా ! ఇంక అయోగ్యుల గురించి చెప్తానువిను. పాటలుపాడుతూ నృత్యములు చేస్తూ జీవించేవారు. విదూషకులు, దుర్జనులు, నపుంసకులు, మోసగాళ్ళు, వేదం చదవనివాళ్ళు, తక్కువ కులమువాళ్ళు, ఇతరులకు హానిచేయడమే వృత్తిగాపెట్టుకున్న వాళ్ళు దానం స్వీకరించడానికి అనర్హులు. పేదవాళ్ళు, ఆపదలో ఉన్నవాళ్ళు, దానానికి అర్హులు. నీకు దానగుణం ఎక్కువగా ఉన్నా చెడ్డవాళ్ళకు దానం చేయకూడదు. దాని వలన ప్రయోజనం శూన్యం. అపాత్రాదానం మంచిది కాదు. అనర్హులకు చేసే దానం నపుంసకుడికి కన్యను ఇచ్చినట్లు, బూడిదలో నెయ్యిపోసినట్లు, ఓటికుండలో నీళ్ళుపోసినట్లు ఔతుంది. అర్హుడైనవాడికి చేసేదానం చేసినవాడికి పుచ్చుకున్న వాడికి ఇహ లోకసౌఖ్యం పరలోక సౌఖ్యం కలుగుతుంది. ధర్మజా ! నీకు నేను మంచీచెడు సంక్షిప్తంగా మంచిచెడు గురించి వివరంగా చెప్పాను. నా పలుకులు మన్నించి ధర్మబద్దంగా ప్రవర్తించు " అన్నాడు.


ధర్మరాజు వ్యాసుడితో " మహాత్మా ! మీరు చెప్పిన మాటలు నా మనసుకు చాలా హర్షం కలిగించాయి. మీరు ఆనతిచ్చిన ప్రకారం నేను ధర్మమార్గం అవలంబించి రాజ్యభారం వహించి అమంగళం కలగకుండా చూస్తాను. నా మీద కృపతో మీరు రాజధర్మములు వర్ణాశ్రమ ధర్మాలు ఆపద్ధర్మాలు నాకు తెలియ చెప్పండి. నాకు రాజధర్మం ధర్మాచరణ పరస్పర విరుద్ధం తోస్తుంది. అందుకని మిమ్ము ఇలా ప్రార్ధిస్తున్నాను " అన్నాడు. అప్పుడు వ్యాసుడు నారదుడిని చూసి " మహర్షీ ఈ మహారాజును భీష్ముడి వద్దకు తీసుకువెళ్ళాలి. భీష్ముడే ధర్మజుడికి సకల ధర్మములు చెప్పగల సమర్ధుడు " అన్నాడు. అప్పుడు నారదుడు " మహర్షీ ! మీరు చెప్పినది చాలా యుక్తంగాఉన్నది " అని అన్నాడు. అప్పుడు వ్యాసుడు ధర్మనందనుడితో " ధర్మనందనా ! భీష్ముడు కురువృద్ధుడు. ఇంద్రాదులకు కూడా పూజనీయుడు. కుటిలత్వం తెలియనివాడు. పరశురాముడి వద్ద విద్యలునేర్చి విలువిద్యా రహస్యాలను తెలుసుకున్న వాడు. పవిత్రగంగా గర్భమున జన్మించిన వాడు. సుగుణాలకు పుట్టిల్లు. ఆయనకు తెలియని ధర్మసూక్ష్మములు లేవు. చ్యవనుడు, మార్కండేయుడు, వశిష్ఠుడు మొదలగు మహర్షుల వద్ద ధర్మసూక్ష్మములు తెలుసుకున్న వాడు. తండ్రినుండి స్వచ్ఛందమరణం వరంగాపొంది తన ప్రాణములు మేనిలో నిలుపుకుని ఉన్నాడు. నీవంటే ఎంతో అభిమానం ఉన్న అంతటి మహానుభావుడి వద్దకు నీవు వెళ్ళి ప్రార్ధించిన అతడు నీకు అత్యంత వాత్సల్యంతో నీకు ధర్మసూక్ష్మములు తెలుపగలడు. దీనివలన నీవు ఎంతో కీర్తిమంతుడవు కాగలవన్నది మా అందరి అభిమతం. పైగా భీష్ముడికి అవసాన కాలం సమీపిస్తుంది. ఇంక ఆలస్యంచేయకు " అన్నాడు.


ధర్మరాజు వ్యాసుడితో " మునివర్యా ! ఎంతో మంది బంధువులను, మిత్రులను వధించిన వాడను ఆయన ఎదుట ఎలా నిలువగలను ? విలువిద్యా విశారదుడైన భీష్ముడిని కృత్రిమసమరంలో కూల్చిన పాతకుడిని తిరిగి ఆయన ఎదుట ఎలా నిలువగలను ఆయన మొహంచూసి ధర్మసూక్ష్మములు చెప్పమని ఎలా అడగను " అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు " ధర్మజా ! అలా అనుకోవడం ఎందుకు. నీవు వ్యాసమహాముని ఆజ్ఞమేరకు భీష్ముడి వద్దకు వెళుతున్నావు. కాని ఇంతశోకంతో భీష్ముని వద్దకు వెళ్ళకు ముందు నీవు రాజ్యానికి వెళ్ళు తరువాత భీష్ముడి వద్దకు వెళ్ళవచ్చు. నీకొరకు నీతమ్ములు, బ్రాహ్మణులు, పురజనులు ఎదురుచూస్తున్నారు. హస్థినాపురప్రవేశం చేసి వారందరికి ఆనందం కలిగించు " అని పలికాడు. ఈ ప్రకారం వ్యాసుడు, నారదుడు, శ్రీకృష్ణుడు, దేవలుడు చెప్పిన మాటలతో తన శోకమును వదిలిపెట్టిన ధర్మరాజుకు రాజ్యపాలన పట్ల ఆసక్తి కలిగింది. ధర్మరాజు ఆ మునులందరికీ ప్రదక్షిణంచేసి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఆ తరువాత మునులందరూ తమతమ స్థానాలకు వెళ్ళారు.


ధర్మరాజు దేవతలను బ్రాహ్మణులను పూజించాడు. తనదర్శనం కొరకు వేచిఉన్న సామంతులను కలుసుకుని వారిచ్చిన కానుకలను స్వీకరించాడు. మరునాడు వేకువనే లేచి అభ్యంగనం ఆచరించి తెల్లనివస్త్రములు విలువైననగలు అలంకరించుకున్నాడు. పదునారు తెల్లనిగుర్రములను కట్టిన రథమును అధిరోహించాడు. భీముడు సారథిస్థానమున కూర్చున్నాడు. అర్జునుడు వెనుక నిలబడి తెల్లనిగొడుగు పట్టుకున్నాడు. నకులసహదేవులు వింజామరలు వీస్తున్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి వెంటవస్తున్నారు. విదురుడు, కుంతీదేవి, ఇతర అంతఃపుర స్త్రీలు వారవారి వాహనములలో పల్లకీల మీద వస్తున్నారు. సామంతరాజులు తమతమ సైన్యములతో పక్కన వస్తున్నారు. ఇలా ధర్మరాజు హస్థినాపురానికి పయనమయ్యాడు.

                     సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ