12, మే 2026, మంగళవారం

హనుమజ్జయంతి

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే.


హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము,

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. 


సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. 


ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*

 *మే 12 న హనుమజ్జయంతి*


*సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*


శ్రీరామభక్త హనుమది ఒక విశిష్ట మైన అవతారం.

ఆయనకు సంబంధించిన వేర్వేరు పురాణగాథలను ఈ సందర్భంగా తెలుసుకుందాం.


ఆయన మాతృమూర్తి అంజనాదేవి, పూర్వజన్మలో పుంజికస్థల అనే పేరున్న అప్సరస.‌ఆమె లావణ్యానికి మోహితు డైన వాయుదేవుడు, కేసరి అనే వానర రూపంలో హనుమంతునికి తండ్రి అయ్యాడు. అందుచేతనే హనుమంతుడు, మనోజవం, మారుతతుల్య వేగం కలవా డయ్యాడు. జితేంద్రియుడు, బుద్ధిమంతుడూ ఐన హనుమను, "రామచరితమానస్" గ్రంథకర్త ఐన గోస్వామి తులసీదాసు, తనకు బుద్ధిబలాలను, విద్యనూ ప్రసాదించ మని ప్రార్థించాడు. బుద్ధిమంతుడే కాక హనుమ, అపారపాండిత్యం ఉన్నవాడు కూడా. శ్రీరామభక్తుడు కనుక, సమస్తజీవులకూ ఐహికసుఖాలను కలిగించే వాడని చెప్తారు.‌ ఆ పైన ఆధ్యాత్మికమార్గంలో నడిపించి, ముక్తినీ ప్రసాదిస్తాడు. 


నవనిధభక్తులలో హనుమది దాసభక్తి. నిరంతరమూ స్వామి సన్నిధిలో ఉండి,  రామకథను వినటం లోనే పరమానందాన్ని పొందిన భక్తాగ్రగణ్యుడు ఆంజనేయుడు.


*యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్*

*తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ l*

*బాష్పవారి పరిపూర్ణలోచనమ్*

*మారుతిమ్ నమత రాక్షసాంతకమ్ ll*


అని మారుతిని కీర్తిస్తారు. ఎక్క డెక్కడ శ్రీరామచంద్రునికి సంబంధించిన విషయాలు విన్నా, హర్షంతో పులకించిన శరీరం కలవాడు, తలపై చేతులు జోడించి నమనం చేసేవాడు, ఆనందబాష్పాలు నిండి జాలువారే కన్నులు కలవాడూ అయిపోతాడట! అంత గొప్ప భక్తి ఆయనది! 


కర్ణుడు లేని మహాభారతకథ లేనట్లుగానే, హనుమంతుడు లేని శ్రీరామాయణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. తులసీదాసు రచించిన "హనుమాన్ చాలీసా"ను ప్రతిదినమూ పారాయణ చేస్తూ హనుమను కొలవటం మనలో ఎందరికో అలవాటు. కార్యసిద్ధికి స్వామి చాలా త్వరగా తోడ్పడుతా డని ప్రసిద్ధి.


జంటనగరాలలో తాడుబందు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బోయినపల్లి, సిఖ్ విలేజ్ లకు వెళ్లే దారిలో ఉందీ దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం, స్వామి భక్తులకు కొంగు బంగార మైన వైనాన్ని తెలియజేస్తుంది. అతి ప్రాచీన మైన ఈ క్షేత్రంలో, ఆంజనేయస్వామిని జాబాలి మహర్షి ప్రతిష్ఠించా రని స్థలపురాణం చెబుతున్నది. 


ఇక్కడ వినిపించే గాథలలో, హనుమ ఆజన్మ బ్రహ్మచారి కాడు, సూర్యపుత్రిక సువర్చలకు భర్త అని తెలిపేది ఉంది. శ్రీరామసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వాయు

పుత్రునికి, తన కుమార్తె నిచ్చి పెళ్లి చేసి, ఆయన బ్రహ్మచర్యానికి భంగం కలుగకుండా వర మిస్తాడు సూర్యభగవానుడు. సువర్చలాదేవి కూడా ఆయన బ్రహ్మచర్య వ్రతానికి  భంగం రాకుండా ప్రవర్తిస్తుంది. రాబోయే కల్పంలో హనుమ నవబ్రహ్మ లలో ఒక డవుతాడు. అంటే బ్రహ్మ పదవిని అలంకరిస్తా డన్నమాట!  ఆ కల్పంలో, అప్పుడు, తాను సువర్చల తో కూడి ఉంటా నని మాట ఇస్తాడు ఆంజనేయుడు. ఈ ఆలయం లోని హనుమ‌ వాహనం ఒంటె. కేసరీనందనుని దివ్య లీలలను ప్రదర్శించే ఇక్కడి తైలవర్ణచిత్రాలు భక్తులకు కనుల పండుగ కావిస్తాయి.


ఆంజనేయుని అవతారానికి సంబంధించిన మరొక కథ ఉంది. పరమేశ్వరుని భక్తు డైన యాగాలుడు అనే రాక్షసుడు, మానవులకు కంటకుడుగా తయారవుతాడు. శ్రీమహావిష్ణువు, అతన్ని సంహరించ మని పరమేశ్వరుణ్ని కోరుతాడు. తన భక్తుడు కనుక తానా పని చేయలే నంటాడు పార్వతీ పతి. అంతే కాక, తన భక్తు డైన అతన్ని ఎవ్వరూ చంపలే రని కూడా అంటాడు. తాను తప్పకుండా యాగాలుణ్ని వధిస్తా నని, ఆ విధంగా చేయలేకపోతే, మహాశివునికి దాసుడి నవుతాననీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేస్తాడు. అదే జరిగితే, తాను విష్ణుదాసుడి నవుతానని మహాదేవుడూ ప్రతిన పూనుతాడు. ఆ తర్వాత మోహినీరూపంతో యాగాలుణ్ని మోహింపజేసి, అతని చేత సురాపానం చేయించి, స్పృహ పోయిన అతన్ని, విష్ణువు, వృకరూపంలో - తోడేలు - వధిస్తాడు. అప్పుడు పరమేశుడు వచ్చి, తాను విష్ణుదాసుడి నవుతానంటాడు. త్రిమూర్తులలో ఎవరూ ఎవరికీ దాసులు కారని విష్ణువు ఎంత చెప్పినా శివుడు వినడు. అప్పుడు విష్ణుమూర్తి, రామావతారంలో హనుమంతుడుగా పుట్టి, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకో మంటాడు. అదీ హనుమ, రామదాసుడు కావడానికి వెనుక ఉన్న రహస్యం!


మరొక గాథ ఇట్లా ఉంది -


పార్వతీపరమేశ్వరులు ఒకనాడు ఆకాశమార్గాన సంచరిస్తున్నారు. వేంకటాచలం వద్ద ఒక వానర మిథునాన్ని చూస్తుంది దేవి. ఆమె ఇంగితం గ్రహించిన పార్వతీపతి, ఆ విధంగానే ఆమె కోరిక తీరుస్తాడు. అతిశక్తిమంత మైన ఆ తేజస్సును భరించలేని దేవి, దాన్ని అగ్నిలో పడేస్తుంది. అగ్నిదేవుడు, వాయుదేవునికి ఇస్తే, వాయుదేవుడు అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి చేతికి ఇస్తాడు. అదేదో ఫలం అనుకుని, ఆమె స్వీకరిస్తే, ఆమెకు పుత్రుడు పుడతాడు. అంజనాదేవి సుతుడు కనుక, ఆంజనేయు డయ్యాడు.


ఈ తాడుబందు క్షేత్రంలో హనుమను ప్రతిష్ఠించిన జాబాలి మహర్షిని, శ్రీరాముడు శపిస్తాడు. హనుమద్విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఆ శాపం నుండి విముక్తి పొందుతారు జాబాలి మహర్షి. అందుచేత ఈ క్షేత్రాన్ని "పాశబంధహర పురం" అనీ వ్యవహరిస్తారు. అదే క్రమంగా "తాడుబొందు"గా మారింది. హనుమ జన్మ శనివారం నాడు జరిగింది కనుక, ఆ నాడు స్వామికి విశేషార్చనలు జరుగుతాయి. మంగళవారం కూడా ప్రత్యేకపూజలు చేస్తారు.‌ఈ రెండు దినాలూ ఈ క్షేత్రం, భక్తులతో కిట

కిటలాడుతూ ఉంటుంది.


కడప జిల్లాలో వెల్లాల అనే చోట మారుతిని "సంజీవరాయుడు"గా కొలుస్తారు. ప్రాణం పోసే ఓషధులను తెమ్మంటే, సంజీవని పర్వతాన్నే మోసుకు వచ్చి, లక్ష్మణస్వామికి ప్రాణదాత అయినవాడు ఆంజనేయుడు.‌ ఇక్కడి ఆలయాలకు చెందిన స్థల పురాణాలలో, ఈ కథకే అధిక ప్రాముఖ్యం. దర్శన మాత్రం చేతనే, సమస్తపాపాలనూ హరించి, కోరిందే తడవుగా కోరికలు తీర్చే దైవంగా పేరు పొందిన పావని, ఈ వెల్లాల సంజీవరాయ స్వామి!


ఈ స్థలమే త్రేతాయుగం నాటి దండకారణ్యం. సంజీవని కొరకు బయలుదేరిన ఆంజనేయుడు, సంధ్యాసమయానికి కుముద్వతీ నదీతీరానికి చేరుతాడు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. హనుమను గమనించిన అక్కడి ఋషులు, అక్కడే ఉండి తమకు ఆయన సేవాభాగ్యం కలిగించ మని ప్రార్థించారు. స్వామి కార్యం మీద వెళుతున్నాడు కనుక ఉండే వీలు లేదని చెప్పి, వారికి తన రూపం లోని ఒక ప్రతిమను అనుగ్రహించాడు, ఆ కపీశుడు. ఆ ప్రతిమే సంజీవరాయస్వామి.ఆయన అక్కడ స్నానం మాచరించిన గుండానికి "హనుమంత గుండం" అనే పేరు వచ్చింది. 


ఆలయం లోని ఆంజనేయుని ప్రతిమకు వెండి తొడుగు ఉంటుంది. ఈ విగ్రహం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేదట. స్వామి తల మీద రాగికలశాన్ని ఉంచిన పిదప, అట్లా పెరగడం ఆగిపోయిందట. ఈ సంజీవరాయుణ్ని సేవించు కునేందుకు, మన రాష్ట్రాల నుండే కాక, మొత్తం దక్షిణాది నుండి కూడా‌ భక్తులు వస్తుంటారు. నిత్య పూజలతో పాటుగా శ్రావణమాసంలో విశేషంగా పూజలు, ఉత్సవాలూ జరుగుతాయి. శ్రీరామనవమి, హనుమజ్జయంతి పండుగల దినాలలో గ్రామోత్సవాలూ చేస్తారు.


హనుమంతుడు మహావీరుడు, మహాభక్తుడు.‌ గొప్ప జ్ఞాని. మహా పండితుడు. వజ్రాంగబలుడు. అంటే ఆయన శరీరం వజ్ర మంత దృఢంగా, ఎంతో బలిష్ఠంగా ఉంటుంది. ఈ "వజ్రాంగబలి" పదమే ఉత్తరాది జనంలో "బజరంగబలి"గా మారింది. బజరంగబలిని ఉపాసించడం అంటే జ్ఞానోపాసన చేయడమే!


ఆంజనేయస్వామి పూజ శనిదేవునికి విరుగుడుగా భావిస్తారు. శనిగ్రహపు దుష్ప్రభావాల నుండి విముక్తి కలుగడానికి, సిందూరం, జిల్లెడు పూలు, తమలపాకులతో హనుమను పూజిస్తారు. ఆంజనేయుడు, తన భక్తులను శనిగ్రహం దుష్టవీక్షణం తగులకుండా రక్షిస్తా డని విశ్వసిస్తారు. రావణాసురుడు, నవగ్రహాలనూ తన అధీనం లోనికి తెచ్చుకుని, తన పాదాల కింద శనైశ్చరుణ్ని ఉంచి నలిపి వేస్తుంటాడు. రావణసభ లోనికి బంధితుడై వెళ్లిన హనుమంతుడు, రెప్పపాటు కాలంలో, శనిదేవుణ్ని తన వాలం - తోక - తో రావణుని పదఘట్టన నుండి చెప్పిస్తాడు. తనను విముక్తుణ్ని చేసినందుకు, శని, కృతజ్ఞతగా హనుమదుపాసకుల జోలికి వెళ్లడు అని చెబుతారు.


హనుమంతుడు స్వరూపంలో వానరుడే అయినా, జ్ఞానానికి మాత్రం  నిధి. ఖగోళం, వ్యాకరణం, సంగీతం మొద లైన వాటిలోనే కాక, వేద పురాణాలలోను, విజ్ఞానశాస్త్రాల లోను ఆయనకు తిరుగు లేదు! తొలి కలయిక లోనే శ్రీరామచంద్రుడు, హనుమ సంభాషణ చాతుర్యానికి పరవశించా డంటే, ఆయన ఎంతటి పండితుడో తెలుస్తూంది కదా! 


ఆధ్యాత్మ రామాయణంలో మారుతి, యోగాంజనేయుని రూపంలో దర్శనం అనుగ్రహిస్తాడు. అంటే ఒక గురువు స్థానం. ఆయన మరొక రూపం పంచముఖ ఆంజనేయుడు. ఈ రూపంలో ఐదు ముఖాలు, పది చేతులతో సాక్షాత్కరిస్తాడు. వానరరూపం, నారసింహం, గరుత్మంతరూపం, వారాహం, హయగ్రీవం - ఈ రూపాలను క్రమంగా ధైర్యబలాలకు; భయవిముక్తికి; మంత్రి తంత్ర సిద్ధి, సర్పదోష నివారణకు;  ఆరోగ్యం, భూతప్రేతాల నుండి రక్షణకు; శత్రువిజయం, జ్ఞానాలకు సేవించు కుంటారు. ఏకాదశరుద్రులలో ఒకడుగానూ కీర్తి పొందాడు వాయుపుత్రుడు.

పంచ ముఖ ఆంజనేయుణ్ని ఆశ్రయిస్తే, అన్ని కోరికలూ సిద్ధించినట్లే! సిందూరం జ్ఞానానికి చిహ్నం కనుకనే హనుమను సిందూరలేపనంతో అర్చిస్తారు.


వారణాసి లోని హనుమదాలయాన్ని తులసీదాసు నిర్మించాడు. శ్రీరామ భక్తుడుగా మన మనోమందిరాలలో స్థిరపడిన రూపాన్ని తీర్చిదిద్దిన వాడు తులసీదాసే! మరో విశేషం ఏమిటంటే, మన దేశంలో రామాలయాల కన్నా ఆంజనేయుని ఆలయాలే అధికంగా ఉండడం! 


"సుందరుడు" అనే పేరు హనుమకు ఉండడం చేతనే, ఆయన దివ్య, అద్భుత లీలలను వివరించిన శ్రీరామాయణంలో ఒక కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. 


*"సుందరే సుందరో రామః*

*సుందరే సుందరీ కథా l*

*సుందరే సుందరీ సీతా*

*సుందరే సుందరమ్ వనమ్ ll*


*సుందరే సుందరం కావ్యమ్*

*సుందరే సుందరః కపిః l*

*సుందరే సుందరమ్ మంత్రమ్*

*సుందరే కిం న సుందరమ్? ll*


ఈ శ్లోకాలు చెప్పుకోకపోతే, హనుమను గురించి పూర్తిగా చెప్పుకున్నట్లు కాదు.


శ్రీరామాయణం నాయకుడు రామచంద్ర ప్రభువు సుందరాతి సుందరుడు. సీతమ్మ‌తల్లి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ స్వరూపం. స్వామి మారుతి ఆత్మయోగి అయిన సౌందర్యరాశి. లంకలోని అశోకవనం ఎంతో అందంగా ఉంటుంది. ఇక లంకా పట్టణమూ బహుసుందరమే. మంత్రం సుందరం. ఇక వీటిలో సుందరం కాని దేమిటి? అన్నీ సౌందర్యభరితాలే! ఈ కారణం చేత మిగిలిన అన్ని కాండలకూ కథోచితంగా, యథోచితంగా పేర్లు పెట్టిన వాల్మీకుల వారు, ఈ కాండకు మాత్రం "సుందరకాండ" అని పేరు పెట్టారు.


మనమూ ఆ దివ్యశక్తిమంతు డైన హనుమను,

*"ఆంజనేయం అతిపాటలాననమ్*

*కాంచనాద్రి కమనీయవిగ్రహమ్ l*

*పారిజాత తరుమూల వాసినమ్*

*భావయామి పవమాన నందనమ్ ll"*


అని ప్రార్థించుకుందాం.


*జై హనుమాన్!*

పంచాంగం 12.05.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 12.05.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి తిథి భౌమ వాసర పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి యోగః భద్ర తదువరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.


ఈ రోజు హనుమజ్జయంతి 

  


శ్రాద్ధ తిథి: దశమి మరియు ఏకాదశి 


 

నమస్కారః , శుభోదయం

12-05-2026 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

12-05-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించినవి కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  

---------------------------------------


వృషభం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


సింహం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

---------------------------------------


కన్య


దూరప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------


తుల


పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. 

---------------------------------------


ధనస్సు


ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

---------------------------------------


మకరం


ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


కుంభం


కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

_*🚩 శ్రీ హనుమాన్ జయంతి🚩*_

 _*🚩 శ్రీ హనుమాన్ జయంతి🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.


*జననం*


పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. 


హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. 


అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. 


అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.


ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. 


ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.


ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.


భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. 


హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.


జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.    

                                     *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*


హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.


1. ప్రసన్నాంజనేయస్వామి.

2. వీరాంజనేయస్వామి.

3. వింశతిభుజాంజనేయ స్వామి.

4. పంచముఖాంజనేయ స్వామి.

5. అష్టాదశ భుజాంజనేయస్వామి.

6. సువర్చలాంజనేయ స్వామి.

7. చతుర్భుజాంజనేయ స్వామి.

8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.

9. వానరాకార ఆంజనేయస్వామి

తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!


దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.


*ఆయన అష్టసిద్ధులు*


1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.


2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.


3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.


4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.


5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.


6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.


7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.


8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.



*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?*


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. *'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా'* అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*


శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం


శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.


*ఆచరణ:* భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.


*అభిషేకం*


పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.


*ఆచరణ :* మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి


*మంగళ వార సేవ*


మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.


*శనివార సేవ*


హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.


*పంచ సంఖ్య*


హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.


*హనుమజ్జయంతి*


హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.


*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*


*ఆచరణ :* సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.