30, జులై 2022, శనివారం

లిఫ్ట్ ఇవ్వటం నేరం..

 *లిఫ్ట్ ఇవ్వటం నేరం.. ఫైన్ కట్టాల్సిందే* 


 రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం.. ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం… పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు. ఇదంతా కొంచెం దూరంలో చూస్తూ ఉన్న ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ గమనిస్తున్నాడు. లిఫ్ట్ అడిగిన వారిని నితిన్ కారులో ఎక్కించుకున్న వెంటనే కారు దగ్గరకు వచ్చేశాడు పోలీస్.

విషయం ఏంటని ట్రాఫిక్ పోలీస్ నితిన్ ను ప్రశ్నించారు. విషయం చెప్పాడు. అంతే చేతిలో రూ.1,500 చలానా పెట్టాడు. మైండ్ బ్లాంక్. ఎందుకు అన్నాడు. లిఫ్ట్ ఇస్తున్నందుకు అన్నాడు. లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతే తెలియని నితిన్.. ట్రాఫిక్ పోలీస్ ను మరోసారి గట్టిగా ప్రశ్నించాడు. సెక్షన్ 66/192 రూల్ ప్రకారం అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం.. రూ.1,500 చలానా కోర్టులో కట్టి.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లు అని వార్నింగ్ ఇచ్చి.. చేతిలో చలానా పెట్టి మరీ వెళ్లాడు. కారులో ఎక్కించుకున్న వారిని వారి వారి ప్రదేశాల్లో దింపి.. ఇంటికి వెళ్లాడు నితిన్. ఆ తర్వాత కోర్టుకి వెళ్లి జరిమానా కట్టాడు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నాడు. లిఫ్ట్ ఇచ్చిన పాపానికి ఓ రోజు అంతా టైం వేస్ట్ అయ్యింది అంటున్నాడు. అంతే కాదు.. తన 12 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవంలో ఇప్పటి వరకు ఇలాంటి రూల్ ఇందన్న సంగతి తెలియదని.. లిఫ్ట్ ఇచ్చేది అపరిచితులకే కదా అని అంటున్నాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఫేస్ బుక్ ద్వారా తెలియజేసిన నితిన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపారు. లిఫ్ట్ ఇవ్వటం నేరమా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

శాంతమ్మ గారు 🙏

 *✨సాహో... ప్రొఫెసర్‌* 

 *శాంతమ్మ గారు 🙏🎊*

🕉️🌞🌎🏵️🌼🚩


 *కుదిరితే పరిగెత్తు..లేకపోతే నడువు..అదీ చేతకాకపోతే పాకుతూ పో..అంతేకాని ఒకేచోట అలా కదలకుండా ఉండిపోకు’’.. అంటూ మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలను ఆమె అక్షరాలా అమలు చేస్తున్నారు. 93 ఏళ్ల వయసులోనూ మొక్కవోని దీక్షతో రోజూ రానూపోనూ 140 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ విద్యార్థులకు ఫిజిక్స్‌ పాఠాలు చెబుతున్నారు. కాలం ఎంతో విలువైనదని..దానిని ఎప్పుడూ, ఎవరూ వృథా చేయకూడదని చెబుతున్న ఆమె పేరు ప్రొఫెసర్‌ చిలుకూరి శాంతమ్మ.* 


 *పంచే కొద్దీ జ్ఞానం పెరుగుతుందని నమ్మే శాంతమ్మ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించగా విజయనగరం జిల్లా సెంచూరియన్‌ యూనివర్శిటీలో రెండు ఊత కర్రల సాయంతో నడుస్తూ... విద్యార్థులకు భౌతిక శాస్త్ర పాఠాలు బోధిస్తూ కనిపించారామె. వయసు మీదపడిందనే సంకోచం ఏమాత్రం ఆమెలో కనిపించలేదు. ఈ వయసులోనూ సంపూర్ణ ఆరోగ్యంతో అధ్యాపకురాలిగా సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న శాంతమ్మ తన జీవన ప్రయాణం గురించి ‘సాక్షిప్రతినిధి’కి చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే..* 

 

 *‘‘మా స్వస్థలం కృష్ణాజిల్లా మచిలీపట్నం..1929 మార్చి 8న జన్మించాను. నా తండ్రి సీతారామయ్య, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు. నేను ఐదు నెలల పసికందుగా ఉన్నప్పుడే ఆయన మా నుంచి దూరమయ్యారు. మా అమ్మ వనజాక్షమ్మ మాత్రం 104 ఏళ్లు జీవించారు. రాజమండ్రి, మదనపల్లి ప్రాంతాల్లో నా పాఠశాల విద్యాభ్యాసం గడిచింది. విశాఖపట్నం మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏవీఎన్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదివాను.* 


 *అప్పుడే మహారాజా విక్రమ్‌ దేవ్‌ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకున్నాను. ఫిజిక్స్‌ అంటే అంత ఇష్టం. అందులోనే బీఎస్సీ ఆనర్స్‌ చేశాను. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్‌ స్పెక్ట్రోస్కోపీలో పీహెచ్‌డీకి సమానమైన డీఎస్సీ పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా చేరాను. లెక్చరర్‌ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్, రీడర్‌ వరకూ అనేక బాధ్యతలు నిర్వర్తించాను.* 


 *ఇవన్నీ చేసే సరికి తెలియకుండానే 60 ఏళ్ల వచ్చేశాయి. 1989లో తప్పనిసరై పదవీ విరమణ చేశాను. విద్యార్థులకు ఇంకా పాఠాలు చెప్పాలనిపించింది. మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరాను. అక్కడే ఆరేళ్లు గడిచిపోయింది. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్, యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశాను.* 


 *పాఠాలు భోదిస్తూ...* 


 *వృత్తిలో భాగంగా చాలా దేశాలు వెళ్లొచ్చాను. యూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు హాజరయ్యాను. అటామిక్‌ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్‌ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన అంశాలపై చేసిన విశ్లేషణ 2016లో వెటరన్‌ సైంటిస్ట్స్‌ క్లాస్‌లో అనేక అవార్డులతో పాటు బంగారు పతకాన్ని సాధించిపెట్టింది. 12 మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేశారు.* 


 *నా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్లు ఆయన మంచంపైనే ఉన్నారు. అంతకు ముందు వరకూ రోజూ నన్ను ఎక్కడికైనా ఆయనే తీసుకువెళ్లేవారు. ఆయన తెలుగు ప్రొఫెసర్‌ కావడంతో నాకు ఉపనిషత్తుల గురించి బోధించేవారు. ఆయన వల్లనేమో పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఏర్పడింది. భగవద్గీత శ్లోకాలను ఆంగ్లంలోకి అనువాదం చేసి ‘భగవద్గీత ది డివైన్‌ డైరెక్టివ్‌‘ అనే పుస్తకాన్ని రచించే వరకూ వెళ్లింది.* 


 *వయసుతో వచ్చే సమస్యలు నన్నేమీ చేయలేకపోయాయి. రెండు మోచిప్పలకూ శస్త్ర చికిత్స జరిగి ఇరవై ఏళ్లయ్యింది. అయినా ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాను. చనిపోయేవరకూ చదువు చెప్పాలనేది నా సంకల్పం. నేను క్లాస్‌ తీసుకుంటే విద్యార్థులెవరూ మిస్‌ అవ్వరు. అలాగే క్లాస్‌కి ఆలస్యంగా వెళ్లడం నా డిక్షనరీలో లేదు. సెలవు రోజుల్లోనూ ప్రత్యేక క్లాసులకు వస్తుంటాను. ఎందుకంటే యూనివర్శిటీలోని విద్యార్థులే నా పిల్లలు.* 


 *పొద్దున్న 4 గంటలకే నిద్ర లేస్తాను. విశాఖపట్నంలో బయలుదేరి విజయనగరం చేరుకుంటాను. ఇక్కడి సెంచూరియన్‌ యూనివర్శిటీలో రోజుకు కనీసం ఆరు క్లాసులు తీసుకుంటాను. చిత్రమేమిటంటే ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, ఇప్పుడు సెంచూరియన్‌ యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్‌ జీఎస్‌ఎన్‌ రాజు నా దగ్గరే చదువుకున్నారు. ప్రపంచంలోనే పెద్ద వయసు ప్రొఫెసర్‌ను నేనేనట. గిన్నిస్‌బుక్‌ వాళ్లకు నా పేరును సూచిస్తానని నా శిష్యుడు రాజు ఈ మధ్యనే అన్నారు.* 


 *మాది🚩 ఆరెస్సెస్‌ 🚩నేపథ్యం ఉన్న కుటుంబం... డబ్బు, ఆస్తిపాస్తులపై మమకారం లేదు. మా వారు ఇంటిని కూడా వివేకానంద మెడికల్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చేద్దామంటే సరే అన్నారు. ఇప్పుడు అద్దె ఇంటిలో ఉంటున్నాను. మావారికి ఆరోగ్యం బాగోలేనప్పడు ఒక అబ్బాయి నాకు తోడుగా ఉండేవాడు. అతనిని చదివించి, పెళ్లి చేశాను. అతనికి ముగ్గురు పిల్లలు.. అతనితోపాటు అతని భార్య, పిల్లలు కలిపి ఇంట్లో మొత్తం ఆరుగురం. అందరం అదే అద్దె ఇంటిలో జీవిస్తున్నాం’’.* 


– బోణం గణేష్, సాక్షి, 


🕉️🌞🌎🏵️🌼🚩

జగన్మాత – జగత్పిత


            జగన్మాత – జగత్పిత

               ➖➖➖✍️


“వాగర్థా వివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే,

జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ”


మహాకవి కాళిదాసు రఘువంశం అనే కావ్యానికి మొదట ఈ మంగళ శ్లోకం రచించాడు. జగత్తుకు అనగా ప్రపంచానికి పార్వతీపరమేశ్వరులు తలిదండ్రులవలె ఉన్నారు, అని ఆ మహాకవి అన్నాడు. ఇదేవిధంగా భగవత్ పాదులవారున్నూ మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః, బాంధవా శ్శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్. అని ఒకచోట సెలవిచ్చారు.


ఆవు అనే పదము ఉన్నది. ఇందు రెండు అక్షరాలు ఉన్నవి. ఈ రెండక్షరాలనూ వినంగానే మనస్సులో ఒక రూపం పొడగట్టుతుంది. ఆ పదము నిర్దేశించే వస్తువుయొక్క రూపం జ్ఞప్తికి వస్తుంది. ఈ రెండక్షరాలూ ఒక గుర్తు లేక సంకేతం. ఆవు అనగానే గోవు జ్ఞప్తికి వస్తుంది, లేదా ఆవును చూడంగానే దానికి సంకేతమైన ఆవు అనే మాట మనస్సుకు తట్టుతుంది. వీనికి అవినాభావసంబంధం. అనగా ఒక దానిని మరియొకటి విడనాడని చెలిమి ఉన్నట్టున్నది. ఈ విషయాన్నే నామరూపాలని పేర్కొంటారు. వీనిలో ఒక దానినుండి మరొక దానిని వేరుచేయలేము. ఒకటి వాక్కు మరొకటి దాని అర్థము. ఈ వాగర్థాలు ఎలా సంపృక్తాలై ఉన్నవో అనగా ఒక దానిని మరొకటి వదలక చేరి ఉన్నవో, అట్లే పార్వతీపరమేశ్వరులు ఒకరి నొకరు వదలక, ప్రపంచానికి తలిదండ్రులై ఉన్నారనిన్నీ, వారికి నా వందనములనిన్నీ కాళిదాస మహాకవి మంగళాచరణం చేస్తున్నాడు. ఇదే అర్థ నారీశ్వర తత్త్వం. ఇటు చూస్తే అంబికా అటు చూస్తే అయ్యా లేక పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాషాభ్యాసం చేసే వారందరూ ఈ శ్లోకం చదివి మరీ నమస్కరిస్తారు.


మనకు రూపు ఇచ్చేవారు మన తల్లిదండ్రులు. దేహానికి కారణభూతులు తండ్రి. పుష్టి గలిగించే ఆహారమిచ్చి పోషించేది తల్లి. దేహానికి పుష్టి గలిగించే వస్తువు ఆహారము. కొరత లేకుండా ఆత్మకు పుష్టి ఇచ్చేవారు ఎవరు? ఆత్మ అనగా ప్రాణం, ప్రాణానికి పుష్టి ఏది? ఆనందం, జ్ఞానం.


దేహము ఏనాడు ధరించామో ఆనాటి నుండీ ప్రాణానికి కష్టాలే. అనగా ఈ కష్టాలన్నింటికీ కారణం జన్మ లేక దేహధారణ. ఇంకో జన్మ ఎత్తితే మరిన్ని కష్టాలు. కన్న తండ్రి ఏదో సంపాదించి ఇంత నిలువ చేసి పోయినాడని దేహానికి శ్రమ లేదనుకొన్నా ఆత్మకు ఎన్నో కష్టాలు, శ్రమలు, అవమానాలూ, దుఃఖాలు! 


దేహానికి గాని ఆత్మకుగాని ఏ విధమైన కష్టమూ ఉండగూడదని అనుకుంటే జన్మలేకుండాపోవాలి, జన్మ ఎత్తామో ఆనందం తక్కువ దుఃఖం ఎక్కువ.


దుఃఖ స్పర్శలేకుండా ఆరుగాలంలోనూ ఆనందంగా వుండేటట్టు చేసేది ఆత్మ. అందరి ఆత్మలకున్నూ పుష్టినీ, ఆనందాహారాలనూ ఇచ్చునది పరాశక్తీ పరమేశ్వరుడూ, ఆత్మ జగన్మాత, ఆయన జగత్పిత. వారికి శరణుపొందితేనే గాని జన్మ లేకుండా పోదు. జన్మ లేకుండా పోవడమంటే అవధి లేని ఆనందమే. జన్మ కలిగిందంటే ఆనందానికి ఒక కొరత అని అర్థం. ప్రాణానికి లేక ఆత్మకు, ఆహారం అంటే పుష్టి, ఏమిటీ అని ఆలోచిస్తే ఎప్పుడూ ఆనందంగా వుండడమే. ఈ ఆనందం ఇవ్వగలవారు తల్లిదండ్రులే. కొందరూ ఈశ్వరోపాసనా, కొందరు దేవ్యుపాసనా, మరికొందరు యిరువుర కూడిక ఐన శివశక్త్యుపాసనా చేస్తారు.


అయితే వీరి వద్దకు పోవలసిన అవసరం? జబ్బుతో తీసుకుంటున్న మనిషి వైద్యుని దగ్గరకు వెళతాడు. డబ్బులేని వాడు యాచనకో చేబదులుకో శ్రీమంతుని వెతుక్కుంటూ వెడతాడు. ఒక్కొక్క పని కోసం ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళవలసి వుంటుంది. మనకు అది లేదూ, ఇది లేదూ అనేకొరతా, ఫలానావాడు అవమానించాడు అనిన్నీ లేక తగిన మర్యాద చేయలేదు అనే దుఃఖమున్నూ జన్మతో వచ్చింది. ఈ కొరతలను పోగొట్టుకోవలెనంటే, మనసుకు ఒక పూర్ణత్వం సిద్ధించాలంటే పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళాలి.


మనస్సుకు ఎప్పుడూ ఏదో ఒక చింత. దీనికి కారణం ఏమిటీ? జన్మ. డబ్బులేని వాడు యాచనకు శ్రీమంతుని కడకు వెళ్ళినట్లే ''జన్మ ఇక మనకు వద్దు'' అని అనుకొన్నవాడు జన్మలేనివాని కడకు వెళ్ళాలి. అతని అనుగ్రహమాత్రాన జన్మరాహిత్యం సులభంగాసిద్ధిస్తుంది. జన్మ లేకపోతే చింతలేదు. అందువల్ల చావు పుట్టుకలులేని పార్వతీపరమేశ్వరుల కడకు మనము వెళ్ళాలి.


మనకందరికీ చావు పుట్టుకలున్నవని తెలుసు. పుట్టుకకు కారణం కామం. చావునకు కారణం కాలుడు. కామకారణంగా కలిగిన వస్తువు కాలగ్రస్తమై నశించిపోతూంది. కామ వీక్షణంతో మోడు కూడా చిగిరిస్తుంది. కాలదర్శనంతో ఎండిపోయి జీర్ణిస్తుంది. ''కాలో జగద్భక్షకః''. కాలంవచ్చిందంటే సూర్యచంద్రాదులున్నూ చూపులేకుండా పోతున్నారు.


కామం లేకపోతే పుట్టుక లేదు. కాలం లేకపోతే చావు లేదు. ఈ రెండింటినీ జయించాలంటే పరమేశ్వరుని వద్దకు వెళ్ళాలి. అసామాన్యమయిన ఇట్టి వరం అనుగ్రహించగల ఆ వర ప్రసాది ఎటువంటి వాడు?


''కాముని కంటితో నీఱుచేశాడట

కాలుని కాలితో తన్ని వేశా డట''


మన్మథుణ్ణి చూచి నంతమాత్రాన దగ్ధంచేసినవాడికీ, కాలుని కాలితో తన్నిన కాలకాలునికీ చావుపుట్టుకలులేవు. ఆయన అనుగ్రహం గనుక సంపాదించుకుంటే మనకు కూడా పుట్టటం గాని గిట్టటంగాని ఉండదు.


పరమేశ్వరుడు ఒక్కడు ఉంటే సరిపోదూ మరి అంబిక అవసరమేమిటీ? పార్వతీ పరమేశ్వరులు వాగర్థాలు కదా, ఈశ్వరుడు కాముని నిగ్రహించింది నొసలి కంటితో. అర్థనారీశ్వర ప్రకృతులగు వీరికి మూడోకన్ను ఉమ్మడి. దానిలో ఆయనకు సగబాలూ ఆమెకుసగబాలూ, కాలుని తన్నినది ఎడమకాలితో, ఆకాలు అంబికది. అందుచేత కామ విజయానికీ కామనిగ్రహానికీ అమ్మవారి అనుగ్రహంకూడా ఉండాలి. జన్మవద్దనుకుంటే మనం ఈ పురాణదంపతుల నిద్దరినీ చేర్చి ఉపాసనచేయాలి. ఏకశరీరులై ఉన్నందున మన పని చాలా తేలికయింది. వారి అనుగ్రహం ఉంటేచాలు చావుపుట్టుకల సంత మనకుండదు.


సంగీతంద్వారా భగవదుపాసనచేసినవారిలో ముత్తయ్య దీక్షితులు, త్యాగయ్య, శ్యామశాస్త్రి అనే మువ్వురు గాయక శ్రేష్ఠులు ఉన్నారు. దీక్షితుల వారు నవావరణ కీర్తనలను వీణమీద పాడి అమ్మవారిని ఆరాధించేవారు. శ్రీచక్రార్చన చేసేవారు. సంగీతమందు అభిరుచి ఉన్నవారికి ఈ విషయం తెలిసి ఉంటుంది. దీక్షితులవారు ఒకనాడు ఆలాపన చేస్తూ అందే మునిగిపోయి ఉన్నారు. ఆనాడు కార్తిక అమావాస్య ''శ్రీ శ్రీమీనాక్షీ మే ముదం దేహి'' అనే చరణం పాడుతున్నారు. పాట చివర ''పాశమోచనీ'' అని ఉంటుంది. 'ముదం దేహి పాశమోచని' అని పాడుతూండగా వారిశ్వాస అట్టే ఆగిపోయింది. మరణబాధే లేదు. సంకీర్తనచేస్తూ తన్మయులైపోయారు. ఎప్పుడూ దేనిని తలుస్తూ ఉన్నారో ఆ వస్తువే అయిపోయారు. మరణమనేది లేక ఆనందంలో లయం పొంది జనన మరణాలులేని స్థితినిపొందారు.


చావుపుట్టుకలు రెండున్నూ దుఃఖం కలిగించేవే. జనన నివృత్తిని వెతకికొంటూ ప్రపంచానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులను తలచుచూ ''జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ'' అని మనము వారికి శరణాగతి చెయ్యాలి.


--- “జగద్గురు బోధలు” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀