16, ఏప్రిల్ 2021, శుక్రవారం

oxygen levels are low.

 👆Camphor, lavang, ajwain , few drops eucalyptus oil. Make a potli and keep smelling it throughout the day and night . Helps increase oxygen levels and congestion.

This potli is also given to tourists in Ladakh when oxygen levels are low. Many ambulances are now keeping these too.

It's a home remedy .. kindly share and help.

కరోనా: కొన్ని ప్రశ్నలు



కరోనా: కొన్ని ప్రశ్నలు - సమాధానాలు 


1. వ్యాక్సిన్ కరోనా వైరస్ ని ఖతం చేస్తుంది అన్నారు, నిజమేనా?


సమాధానం: వ్యాక్సిన్ అనేది కరోనా వెంట్రుక కూడా పీకలేదు, పీకదు. 


2. మరి వ్యాక్సిన్ వలన ఉపయోగం ఏమిటి?


సమాధానం: వ్యాక్సిన్ అనేది మన శరీరం లో ఉన్న మన రక్షక కణాలు (యాంటీ బాడీస్) ని నిద్ర లేపుతుంది.


3. వ్యాక్సిన్ ని ఎలా తయారు చేస్తారు..?


సమాధానం: బతికి ఉన్న కరోనా వైరస్ లని తీసుకొని సుత్తి తో గట్టిగా కొడితే అది చచ్చి ఊరుకుంటుంది. చచ్చి పోయిన కరోనా వైరస్ నే వ్యాక్సిన్ గా ఇస్తారు. కొన్ని సార్లు వైరస్ ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ ని తీసివేసి ఆ ప్లేస్ లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్  వ్యాక్సిన్ గా ఇస్తారు. ఈ విధం గా రకరకాలుగా వ్యాక్సిన్ ని తయారు చేస్తారు.


4. భారత్ బయోటెక్ వాళ్ళ కొవాక్సిన్, ఆస్ట్రాజెనికా వాళ్ళ కోవిషీల్డ్ ఎలా తయారు చేశారు..?


సమాధానం: A. భారత్ బయోటెక్ కొవాక్సిన్: వీళ్ళు కరోనా వైరస్ ని తీసుకొని ఫార్మాల్డిహైడ్ ద్రావణం లో ముంచి చచ్చిపోయిన కరోనా వైరస్ ని వ్యాక్సిన్ గా ఇస్తారు.


B. ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్: వీళ్ళు ఎడినో వైరస్ ని తీసుకొని దానిలోని హానికర జీన్స్ తీసివేసి ఆ ప్లేస్ లో బ్యాక్టీరియా జీన్స్ పెట్టి వెక్టార్ వ్యాక్సిన్ ని తయారు చేశారు.


5. కొవాక్సిన్ ఎలా పనిచేస్తుంది.?


సమాధానం: ముందే చెప్పినట్లు కొవాక్సిన్ వ్యాక్సిన్ అంటే చచ్చిపోయిన కరోనా వైరస్ ని ఎక్కిస్తారు. మనం కొవాక్సిన్ వేసుకుంటే అంటే మన శరీరం లోకి చచ్చిపోయిన కరోనా వైరస్ ని ఎక్కిస్తే మన శరీరం లోని రక్షణ వ్యవస్థ బతికి ఉన్న వైరస్ నే వచ్చింది అనుకొని ఎక్కువ మొత్తం లో రక్షణ కణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా నిజమైన కరోనా వైరస్ వచ్చినా ముందే ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కానీ ఇంతక ముందు వచ్చిన చచ్చిపోయిన వైరస్ ని గుర్తుపట్టి ఇంకా ఎక్కువ మొత్తం లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి వైరస్ ని కుక్క ని కొట్టినట్లు కొడతాయి.


6. వ్యాక్సిన్ వేసుకుంటే 100% మనకి రక్షణ ఉంటుందా..?


సమాధానం: ఏ వ్యాక్సిన్ 100% ఎఫెక్టివ్ గా లేదు. ఒక వ్యాక్సిన్ 70%, ఇంకోటి 80% , మరొకటి 90% ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నై.


7. అంటే వ్యాక్సిన్ లో లోపం ఉన్నట్లా..?


సమాధానం: టెక్నికల్ గా వ్యాక్సిన్ తయారీ లోపం అని కూడా కాదు. వ్యాక్సిన్ కరక్ట్ ఉన్నా మన శరీరం లోని రక్షణ వ్యవస్థ బద్దకం గా ఉండొచ్చు. యాంటీ బాడీస్ ఉత్పత్తి కి సరైన వాతావరణం మన లోపల ఉండకపోవచ్చు. ఉదాహరణకి అగ్గిపెట్టె, అగ్గి పుల్ల ఉన్నా అగ్గిపెట్టె తడిచి ఉంటే ఉపయోగం ఉండదు. ఆ విధం గా ప్రతి ఒక్కరి శరీర తత్వం, లోపల ఉన్న పరిస్థితులని బట్టి వ్యాక్సిన్ పనిచేయటం ఉంటుంది. మరికొన్ని సార్లు వ్యాక్సిన్ ని సరైన ఉష్నోగ్రతల మధ్య నిల్వ చేయకపోయినా అది పని చేయదు. ఈ విధం గా చాలా కారణాలు ఉంటై 


8. ఒకసారి వ్యాక్సిన్ వేసుకుంటే ఎప్పటికీ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయా..?


సమాధానం: ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ 3 నెలలు ఉండొచ్చు, 3 సంవత్సరాలు ఉండోచ్చు, 3 రోజులే ఉండొచ్చు. అది వారి వారి శరీరం, తీసుకునే ఆహారం, హెల్థ్ ప్రొఫైల్, వయస్సు మొదలగు అంశాలపై ఉంటుంది.


9. ఒకసారి కరోనా వస్తే మళ్ళీ 100% ఖచ్చితం గా రాదా..?


సమాధానం:  ఒకసారి కరోనా వచ్చి తగ్గిపోయింది అంటే మన శరీరం లో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ ఆ వైరస్ ని జుట్టుపట్టుకొని కుక్కని కొట్టినట్లు కొట్టి బయటికి పంపించినట్లు. రెండో సారి ఒకేసారి కొన్ని లక్షల్లో వైరస్ లు వస్తే లేదా ఆ టైం లో మనలో యాంటీ బాడీస్ లేకపోతే మళ్ళీ కరోనా వస్తుంది. మంచి ఆహారం తీసుకొని డి విటమిన్, C విటమిన్ లాంటివి కరక్ట్ మోతాదులో ఉంటే యాంటీ బాడీస్ యాక్టివ్ గా ఉండి మరొక సారి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది.


10. ఒకసారి కరోనా వచ్చినవాళ్ళు, వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు సమానమేనా..? 


సమాధానం: మంచి ప్రశ్న. ఒక రకం గా ఇద్దరూ సమానమే అని చెప్పొచ్చు. కరోనా వచ్చిన వాళ్ళకి యాంటీ బాడీస్ ఉంటై, వ్యాక్సిన్ వేసుకొని అది పనిచేస్తే యాంటీ బాడీస్ ఉంటై. ఈ విధం గా చూస్తే ఇద్దరూ సమానమే  


11. వ్యాక్సిన్ వేసుకున్నాక అది పనిచేస్తుందో లేదో తెలుసుకోవటం ఎలా..?


సమాధానం: యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే తెలుస్తుంది. 


12. ఏ యే యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకోవాలి 


సమాధానం: IgG, IgM యాంటీ బాడీస్ టెస్ట్ 


13. నేను వ్యాక్సిన్ తీసుకోను, మంచి ఆహారం తీసుకుంటాను. ఆరోగ్యకరమైన జీవన విధానం పాటిస్తాను. వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఓకే నా..?


సమాధానం: ముందే చెప్పినట్లు వ్యాక్సిన్ మనలో ఉన్న రక్షణ కణాలని నిద్ర లేపుతుంది. మీ శరీరం లో ఉన్న రక్షక కణాలు ఆల్ రడీ జాగురుకతతో ఉంటే వ్యాక్సిన్ తీసుకోకపోయినా ఏమీ కాదు 


14. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..?


సమాధానం: కోవిషీల్డ్ వ్యాక్సిన్ అంటే ఎడినో వైరస్ ని ఎక్కించటం. కరోనా వైరస్ కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్, ఎడినో వైరస్ కి ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ ఒకటే. కోవిషీల్డ్ ద్వారా ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ మన శరీరం లో ఎక్కించినా అవే యాంటీ బాడీస్ నే ఉత్పత్తి అవుతాయి 


15. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేపించుకున్నాను. సెకండ్ డోస్ తర్వాత కొన్ని రోజులకి యాంటీ బాడీస్ టెస్ట్ చేపించుకుంటే ఏమీ లేవు. అంటే వ్యాక్సిన్ పనిచేయలేదా..?


సమాధానం: ఇక్కడ ఒక మతలబు ఉంది. మనం గతం లో ఎడినో వైరస్ కి గురి అయ్యి ఉంటే ఆ సమయం లో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యి ఆ వైరస్ మన రక్షణ కణాల మెమొరీ లో ఉంటుంది. ఈ సారి ఎడినో వైరస్ ఒకటో రెండో వ్యాక్సిన్ ద్వారా ఎక్కించినా వందలు, వేల సంఖ్యలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అవ్వవు. కానీ నిజం గా కరోనా వైరస్ కి గురి అయితే యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి. సో గతం లో ఎడినో వైరస్ వలన ఏదో ఒకటి వచ్చిన వాళ్ళకి ప్రస్తుతం కరోనా వచ్చినా త్వరగా తగ్గిపోవటానికి స్కోప్ ఉంటుంది 


16. వ్యాక్సిన్ ఒకొకరికి ఒకోలా ఎందుకు పనిచేస్తుంది..?


సమాధానం: చికెన్ కర్రీ చేసి 100 మందికి పెట్టి ఎలా ఉంది అంటే కొందరు ఉప్పు తక్కువ అయ్యింది అని, ఇంకొందరు ఉప్పు కొంచెం ఎక్కువైంది అలా కొన్ని చెప్తారు. నిజానికి అందరూ కరక్టే. వాళ్ళ శరీరం లోని కెమికల్స్ కాంబినేషన్స్ వలన అలా చెప్తారు. వ్యాక్సిన్ కూడా అంతే, ఎవరి శరీరం లో ఎంత కాల్సియం ఉంది, ఎంత D విటమిన్ ఉంది, ఎంత C విటమిన్ ఉంది ఇలాంటి వాటిని బట్టి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, చేయట్లేదు అనేది ఉంటుంది.


17. వ్యాక్సిన్ వేపించుకున్నాక సినెమా నటులు, రాజకీయ నాయకుల లాగా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అక్కడ గుంపు లు గుంపులు గా ఇష్టం వచ్చిన రీతిలో ఉండొచ్చా..?


సమాధానం: వ్యాక్సిన్ తీసుకున్నాం అంటే మన పక్కన ఇద్దరు అంగ రక్షకులు ఉన్నట్లు, అంతే. కరోనా దొంగలు ఒకేసారి 10 మంది, 20 మంది వస్తే మనం అవుట్. అందుకే వ్యాక్సిన్ వేసుకున్నా, వేసుకోకపోయినా మాస్క్ ధరించటం, జాగ్రత్తలు పాటించటం అన్నీ కంపల్సరీ.


18. వ్యాక్సిన్ వేసుకుంటే ఆహార అలవాట్లు మార్చుకోవాలా..?


సమాధానం: వ్యాక్సిన్ కి ఆహార అలవాట్లకి సంబంధం ఏమీ లేదు. ఇష్టం వచ్చిన పుడ్ తినొచ్చు. 


19. వ్యాక్సిన్ వేసుకుంటే మందు తాగకూడదా..? స్మోకింగ్ చేయకూడదా..? 


సమాధానం: సాధారణం గానే ఆల్కహాల్, స్మోకింగ్ మంచిది కాదు. మన రక్షణ వ్యవస్థ ని బలహీన పరుస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్న కొన్ని రోజులు కనీసం యాంటీ బాడీస్ ఉత్పత్తి అయ్యే కొన్ని రోజులు ఆల్కహాల్ కి, స్మోకింగ్ కి దూరం గా ఉంటే మంచిది.


20. వ్యాక్సిన్ వేసుకున్నాక కొన్ని రోజులకి తాగొచ్చా, స్మోకింగ్ చేయొచ్చా..?


సమాధానం: బంగారం లా తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు. ఉత్పత్తి అయిన యాంటీ బాడీస్ కొన్ని అయితే ఖచ్చితం గా తగ్గుతాయి కాని కం సెకం తాగొచ్చు, స్మోకింగ్ చేయొచ్చు 


21. కొవాక్సిన్ బెటర్ ఆ, కోవిషీల్డ్ బెటర్ ఆ..? 


సమాధానం: సాధారణం గా డెడ్ వైరస్ ఉన్న వ్యాక్సిన్ బెటర్ అంటారు కాని ఏది అయినా మీ మీ శరీర తత్వం, శరీరం లోని హెల్త్ ప్రొఫైల్, కెమికల్స్ ని బట్టి ఉంటుంది.అందరికీ ఒకేలా ఏదీ పనిచేయదు.


22. కొవాక్సిన్ సెకండ్ డోస్, కోవిషీల్డ్ ఎప్పుడు తీసుకోవాలి 


సమాధానం: ప్రస్తుత గైడ్ లైన్స్ ని బట్టి కొవాక్సిన్ 4-6 వారాలు, కోవిషీల్డ్ 6-8 వారాలు. 


23. వ్యాక్సిన్ వేసుకున్నాక ఏమైనా అవుతుందా.?


సమాధానం: మనిషి మనిషి ని బట్టి, అది పనిచేస్తుందా లేదా బట్టి, ఎంత మోతాదు లో పనిచేస్తుంది బట్టి, మీ మీ హెల్థ్ ప్రొఫైల్స్ ని బట్టి ఉంటుంది. కాని సాధారణం గా 2-3 రోజులు ఫీవర్, వ్యాక్సిన్ ఇంజెక్షన్ చేసిన దగ్గర నొప్పి ఉంటుంది. 


24. ఫీవర్ వస్తే పనిచేస్తుంది అని అనుకోవచ్చ..?


సమాధానం: అలా ఏమీ ఉండదు. పనిచేస్తున్నా ఫీవర్ రాకపోవచ్చు, పని చేయకపోయినా వేరే కారణాల వలన ఫీవర్ రావొచ్చు. సమాధానం, అవును మరియూ కాదు.


25. ఏ వయస్సు వారు వ్యాక్సిన్ వేసుకోవచ్చు ?


సమాధానం: ప్రస్తుతం 45 మరియూ ఆ పైన ఉన్న వారికి ఇస్తున్నారు . ముందు ముందు 18 ఆ పైన కూడా ఇవ్వొచ్చు 


26. వ్యాక్సిన్ స్టాక్ లేదు అంటున్నారు..?


సమాధానం: అది ప్రభుత్వాలని, కంపనీలని, వ్యాక్సిన్ సెంటర్స్ ని అడగాలి. 


27. బ్లడ్ గ్రూప్స్ ని బట్టి కరోనా తీవ్రత ఉంటుందా..? 


సమాధానం: ఉంటుంది. O బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం ఎక్కువ రక్షణ ఉంటుంది. A బ్లడ్ గ్రూపు వాళ్ళకి కొంచెం తక్కువ రక్షణ ఉంటుంది. అందుకే  A వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్త ఉండాలి. అయితే ఇది 1-10% మాత్రమే. ఎవరికైనా వస్తుంది, ఎవరు అయినా జాగ్రత్తగానే ఉండాలి, అందరూ ఈక్వల్ గానే జాగ్రత్తగానే ఉండాలి. 


28. సాధారణ జాగ్రత్తలు ఏమిటి..?


సమాధానం: D విటమిన్ కోసం రోజుకి 30 నిమిషాలు ఎండలో నిలబడటం లేదా డి విటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవటం, సి విటమిన్ ట్యాబ్లెట్స్ లేదా ఫ్రూట్స్ తగిన మోతాదులో తీసుకోవటం. మంచి ఫౌష్టిక ఆహారం, తగిన వ్యాయాయం, మార్నింగ్ నైట్ వేడి నీళ్ళు, మధ్యానం స్టీం మొదలగు సాధారణ జాగ్రత్తలతో పాటు బయటికి వెళ్తే మాస్క్ ధరించటం. బయట ఏమి ముట్టుకున్నా శానిటైజర్స్ వాడటం మొదలగునవి పాటించటం    


29. రక రకాల మనుష్యులు, పత్రికలు, TV లు, డాక్టర్లు రకరకాలుగా చెప్తున్నారు. ఏది నమ్మాలి..?


సమాధానం: చాలా మంది డాక్టర్స్ తో పాటు, మనుష్యులు, పత్రికలు, TV ల్లో  చాలా ఫేక్ సమాచారం ఉంది. ఎవరినీ పూర్తిగా నమ్మొద్దు నాతో సహా. మీకు మీరు సాధారణ జాగ్రత్తలు తీసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు కానీ అజాగ్రత్త మాత్రం అసలు వద్దు. 


30. చివరగా ప్రజలకి ఏమి చెప్తారు..?


సమాధానం: కారోనా వచ్చి సంవత్సరం దాటినా 138 కోట్ల మందిలో ఒక్కరు అయినా 100% జాగ్రత్తలు పాటించారా..? సెకండ్ వేవ్ మాత్రమే కాదు, ఈ విధం గా నిర్లక్ష్యం గా  ఉంటే థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ , ఫిఫ్త్ వేవ్ కూడా వస్తుంది.


ఎవరికి ఏమి చెప్పినా వినరు, మన దేశం లో ఉన్న 138 కోట్ల మందిలో అందరూ చెప్పే స్థితి లోనే ఉన్నారు, వినే స్థితిలో ఎవరూ లేరు సో ప్రజలకి చెప్పటానికి ఏమీ లేదు.  


ధన్యవాదాలు🙏


A post of 

Dr. Ashok Kumar Raj

న్యాచురల్ వెంటిలేషన్


న్యాచురల్ వెంటిలేషన్ ఎప్పుడూ ఇవ్వబడుచుండేది, కానీ అది ఇప్పుడు చెప్పటం మానేసారు. ఇవాళ పైసా ఖర్చులేకుండా, ఇంట్లోనే ఉండి సహజముగా వెంటిలేషన్ పొందవచ్చో చెప్తాను.  దీనిని సాధారణముగా 'ప్రోన్ వెంటిలేషన్" అంటారు.  ప్రోన్ అన్నది ఒకరకమైన భంగిమకు కూడా పేరు.  మెకానికల్ వెంటిలేటర్ కూడా ప్రోన్ భంగిమలో కూడా ఇవ్వబడుతుంది. ఈ భంగిమలో ఉంటే ఊపిరితిత్తుల గాలిపీల్చుకునే శక్తి పెరుగుతుంది. మరొక ముఖ్య విషయం.  ఈ సహజమైన ప్రోన్ వెంటిలేషన్ మెకానికల్ వెంటిలేషన్ కన్నా 70% అధిక సత్ఫలితాలనిస్తుంది. నిజం.  రోజుకి 10000/- నుండి 50000/- ఖర్చుపెట్టే మెకానికల్ వెంటిలేటర్ కన్నా ఈ ఉచిత వెంటిలేషన్ 70% ఫలకారి అని గుర్తుపెట్టుకోండి.  ఇంతకీ ఈ ప్రోన్ వెంటిలేషన్ ఏమిటి? ప్రోన్ వెంటిలేషన్ లో రోగిని పొట్ట మీద పడుకోపెట్టాలి.  తలక్రింద ఒక దిండు(మెత్త), పొట్టక్రింద రెండు దిండ్లు, అలాగే కాళ్ళక్రింద (మోకాళ్ళు - మడమల మధ్యలో) రెండు దిండ్లు పెట్టండి. దీనినే ప్రోన్ పొజిషన్ అంటారు. ఈ భంగిమలో 30 - 45 నిమిషాలు పడుకుంటే రోగి ఊపిరి తీసుకునే శక్తి పెరుగుతుంది. 

యఙ్ఞసూత్రములు

 సృష్టి చేయుట యఙ్ఞమని బ్రహ్మ తెలిసికొని యఙ్ఞసూత్రములు బాహ్యంగా తెలియక పదార్ధ పృకృతి గాన రాక మానసిక యఙ్ఞం చేయుట వలననే సృష్టి చేయు విధానం తెలిసినది. భాగవతం లో బ్రహ్మ యే నారదు నికి విశధీకరించినట్టు నారదుని చే శుకుడు శుకునిచే పరీక్షిత్తు పరీక్షిత్తు వలన సకల ముని వరులకు తెలిసి తద్వారా మనకు పోతనామాత్యులద్వారా పరంపరగా తెలిసినది. మానసిక యఙ్ఞ విధానమును బ్రహ్మ సూత్రములనబడు వాజపేయి పౌండరీక, ఆపస్తంబ,మౌద్గల్య వాజసనేయ మెుదలగు సూత్రములద్వారా చేయవచ్చునని ఎందరో మహానుభావులు తెలిపితిరి. ఇప్పటికీ అఘోర

సాంప్రదాయం కూడా వున్నట్టు మనకు ప్రత్యక్షంగా తెలియుచున్నది. యిది కొన్ని చోట్ల అఘోర ఋషిః అని అంగన్యాస కరన్యాస

 పధ్దితిలో ఆచరణలో కలదు. మహన్యాసంలో కూడా కలదని తెలియుచున్నది. ఏమి లేనప్పుడు మానసికమే శరణ్యం. ఏ విధంగానైనా తెలిసికొనవలెనని జిజ్ఞాస కావాలి. అనగా జిఙ్ఞాస జీవ ఙ్ఞానం తెలియుట. అనగా ప్ర ఙ్ఞానమే జీవ ఙ్ఞానం. యిదే బ్రహ్మ సూత్రం. దానివలననే సమస్త సృష్టి. అదియే గాయత్రీ మంత్ర స్వరూపము సృష్టి. అణవు వ్యాప్తం గాయత్రీ సూక్మంగా నుండి అండ రూపం తరువాత జలం తో వ్యాప్తం జలం వలన రస, రూప, గంధాదులు సృష్టికి బీజాలు.మనం అంతా ఆ విరాట్ స్వరూపమైన పరమేశ్వరుల  ప్రకృతిలోని వారమే.90 సెకన్ల పాటు కనక ప్రాణాయామంలో స్థిరంగా యిష్ట దైవాన్ని మనసులో ముద్రించి ఆనందించుట యెూగం. తెలుసుకుంటూనే వుందాం ఆచరిస్తూనే వుందాం.

అమ్మమ్మ-ఆవకాయ


అమ్మమ్మ-ఆవకాయ, నిజంగా జరిగిందే....


నేను ఎదో కొద్దిగా రాసి విసుగు పుట్టించను అని నమ్మిన తరువాత రాస్తున్నా...


మా అమ్మమ్మ గారు గంగా బాగీరధి సమానురాలైన కఫ్తూరి అనంతమ్మ గారు తెనాలి నాజరుపేటలోని మహలక్షమ్మ చెట్టు ఎంత ప్రసిద్దో ఆవిడా అంత ప్రసిద్ది..


తెనాల్లో ఏ రైల్వో స్టేషను,బస్ స్టాండు,సినిమా హాలు  దగ్గరో  రిక్షా మాట్లాడుకుని ఆవిడ పేరు చెబుతే చాలు తీరా తీసుకొచ్చి ఇంటి ముదరే దింపుతారు,మారు బేరం లేకుండా..


ఎంటా ప్రసిద్దంటారా..


ఆవడ ఆ పేటకే తల్లో నాలుక..ఆవిడ ఒకటేమిటి ఆవులకి,దూడలకి, పాలిచ్చే గేదలకి దిష్టి తగిలితే ఉప్పుతో మంత్రిచ్చి ఇచ్చేది..నోట్లో సర్పి,వళ్భంతా కురుపులు,గవద బిళ్లలు,మెడ పట్టటం,కాలు బెణకటం ఇలాంటి సమస్త నెప్పులకి చిటికలో మంత్రం వేసీది గరిక,ఆట్లకాడ లాంటి వస్తువులతో...ఆవిడ మంత్రం వేస్తుంటే అక్కడ వున్న వాళ్ళందరికి విపరీతమైన ఆవలింతలొచ్చేవి...ఇవన్ని మంత్రాలు పని చేసాయనటానికి ఉదాహరణ,ఆవిడ ఇల్లు ఎప్పుడు జనాలతో  కోలాహలంగానే వుండేది..


మా దొడ్డి కొనుక్కుని బంగ్లా కట్టుకున్న ప్రసిద్ధ డాక్టరు  శ్రీ కొడాలి వీరయ్య చౌదరి గారి భార్య భారి కాయంతో ఆడవారికి సంబంధించిన బాధలతో ఇబ్బుంది పడుతుంటే మామ్మ గార్ని చిట్కా అడుగు అనేవారట అంత డాక్టరైనా!!


ఇది గొప్పేమి కాదు కాని,  స్వర్గీయ ఆలపాటి వెంకట్రామయ్య గారు ఈవిడతో అరగంట మీటింగు పెడితే ఆ వార్డు మెంబరు బంపరు మెజార్టీతో గెలిచే వాడట..ఇదిట్లా వుంటే ఆయనే ఈవిడకు వార్డు మెంబరు ఇవ్వపోతే,నాకెందుకు నాయన మా తమ్ముడు డా.చంద్రమౌళి సత్యన్నారయణ ఇంటరెస్టు గా వున్నాడంటూ ఏకంగా మున్సిపల్  వైసు చైర్మను చేసిన ఘనత ఈవిడది..


ఇది ఆవిడ పరిచయం నాకు తెల్సి ఆరవై ఏళ్ళ క్రితం మాట..ఇప్పుడు అసలు కధకు వద్దాం..


మా అమ్మమ్మ ఇంటి ఎదురగా సమకాలీకురాలైన గంగా భాగీరథి సమానురాలైన వల్లూరి సుబ్బమ్మగారు మా అమ్మమ్మ గారంత కాదు కాని ఎదో కొంత ప్రసిద్ధే..

వీరా చుట్టు పక్కలవారు అంతా ఏమన్నా.. వీరు మాత్రం ఒకరు ఏ మాటన్నా ఇంకోరు తలాడిస్తూ మరే,మరే అనేవారు సమర్ధిస్తూ...


ఎంత ప్రాణ స్నేహితులంటే భానుమతి గారి సినిమా కొత్తది గాని,పాతది గాని వస్తే మూడోకంటి వాడికి తెలియకుండా రహస్యంగా రిక్షా మాట్లాడుకుని సెకండు షో సినిమాకి వెళ్ళేవారు..రెండింటికి తిరిగొచ్చి నాలుగ్గంటలకే లేచి ఏం తెలియనట్లు పనిలో పడి పోయేవారు ఆ బానుమతి గారికన్నా ఎక్కువ నటించేవారు....వీరి ఖర్మ కొద్ది చించిన టికెట్లో లేక సిగిరెట్టు వాసన కొట్టే విడిచిన చీరె వల్లో గుట్టురట్టైది..


వీరింతటి దోస్తులైనా ఆవకాయ పెట్టే విషయంలో మాత్రం బధ్ధ శత్రువులైపోయేవారు..కొత్త ఆవకాయ పెట్టే రోజుల్ల అస్సలు మాటలుండేవి కాదు..అసలు ఒకరి వంక ఇంకోరు చూసుకునే వారే కాదు..సుబ్బమ్మ గారు గోడ దగ్గర నిలబడి ఎవరితోనో మాట్లాడుతూ ఉందనుకోండి.. మా అమ్మమ్మ బయటకు వస్తుందని తెల్సి గబ,గబా లోపలకి వెళ్ళి తలుపేసుకునేది..మా అమ్మమ్మ అయితే ఆ ఇంటి కాకి ఈ ఇంటి మీద వాల నిచ్చేది కాదు..విషయాలు మాత్రం ఒకరింటి విషయాలు వేరే వారికి ఈసీగా తెల్సి పోయేవి పాలవాడు,కూరలమ్మి,పనిమనిషి..ఇద్దరికి ఒకరే అయిన బాడుగ రిక్షావాడు చేత గుఢాచారం చేయించి విషయం రాబట్టే వారు..


ఉదారణకి, సుబ్బమ్మ గారు అంగలకుదురు తోట నుంచి తెప్పించిన వంద  మామిడి కాయలు ఆవకాయ,ఎభైకాయలు మాగాయ కోసం  పెడుతుందని తెల్సిందనుకోండి..మా అమ్మమ్మ ఇంకో పది ఎక్కువగా మానాన్నని పురమాయించి మంతెన వెంకట్రాజు గారి కాలవ గట్టు మీద చెట్లనుండి మామిడికాయలు కొట్టించేది...


మా అమ్మమ్మ నాజరు పేట నరసింహ స్వామి ఆలయం పక్కనుప్న గానగ నుంచి పట్టించి మంచి నువ్వుల నూనె వాడితే..సుబ్బమ్మ గారు ఆవిడ పెద్ద కూతురు చేత రాజమండ్రి నుంచి పరమాయించి మరి పప్పు నూనె డబ్బా తెప్పించేది...


మా అమ్మమ్మ తెనాలి మారీసు పేట అద్దంకి సుబ్బారావు కొట్లో ఆవకాయ,మాగాయకి కావల్సిన బళ్ళారి మిరపకాయలు, ఆవాలు, శెనగలు మాగాయ తిరగమోతకి కావాల్సిన సరంజామా కొంటే.

సుబ్బమ్మగారు ఈ సుబ్బారావుకి వ్యాపారంలో బద్ధ శత్రవైన కొత్తమాసు రామకోటయ్య కొట్లో కొనేది..ప్రత్యేకించి బద్రాచలం మిరపకాయలు పురమాయించి మరీ కొనేది..వీరిద్దరు గుఢాచారం చేసి మరీ ఒకరి వివరాలు ఇంకోరు తెలుసుకోవాలనుకున్నా

వాళ్ళు వ్యపార లౌక్యం , ఇంకా తప్పించుకునే గుణం పుష్కలంగా వుండి ఆ వ్యాపారులు నోరు జారే వారు కాదు...కాని వీళ్ళు, గుమాస్తాల దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గరి నుంచి సమాచారం సేకరించేవారు...


అంతా బాగుండి ఈ ఆవకాయ పెట్టే విషయంలో ఎందుకు ఇంత గొడవలంటారా...చెబుతా..


ఆ రోజుల్లో గిన్నెల్లో పెట్టి,  కొత్త ఆవకాయ అందరికి ఉద్దారంగా పంచే వారు..ఎవరి ఆవకాయకి ఎంత రేటింగు వచ్చిందా అని ప్రసంసల రూపంలో తెల్సి పోయేది...ఈ ఇద్దరు మాలోకాలకు తెల్సేది కాదు..ఊరికే అబ్బడంగా తీసుకుని తిని, ఒకళ్ళుకి తెలియకుండా ఇంకోళ్ళని విపరీతంగా పొగుడుతారని తెలియదు...


ఉదాహరణకి మా అమ్మమ్మ దగ్గర ఆ సుబ్బమ్మ గారి ఆవకాయ గురించి బద్రాచలం కాయంటమ్మా.. మీ ఆవకాయ కన్నా రంగు తక్కువమ్మా..,నోటికి కూడ ఒర్రగా లేదు వెల,వెల పోతుందంటారు...సుబ్బమ్మ గారి దగ్గర మా అమ్మమ్మ ఆవకాయ గురించి.. ఏంచెప్పమంటారమ్మా...ముక్కలో పీచు తక్కువమ్మా..

నోట్లో పెట్టుకుంటే మీ ఆవకాయ రుచి అస్సలు లేదమ్మా అని షరా మామూలుగా పొగిడి మరి ఇంకింత తీసుకెళ్ళేవారు...


ఇలా అని ఆ కొత్త ఆవకాయ పాత పడే దాకానే వీరి వైరం...


మా ఇంట్లో మా అమ్మ అర్ధరాత్రి పురిటి నెప్పులు పడుతుందని హడావిడితో కనిపెట్టి పరుగునొచ్చి..నువ్వింట్లోనే పిల్ల గాబరా పడకుండా చూస్తుండు అని మా అమ్మమ్మ కి చెప్పి అర్ధరాత్రి ఒంటరిగా మంత్రసానిని పిలుచుకు రావటానికి పరుగు లాంటి నడకతో వెళ్ళి పిల్చుకురావటం, నేనెట్ల మర్చేపోతాను...


ఆవకాయ కలుపుని నోట్లో పెట్టుకుంటుంటే ఇప్పుడే గుర్తుకొచ్చారు..వాళ్ళకి కంటి నీటితోనే శ్రద్దాంజిలి చెబుతుంటే..మా ఆవిడ ఆవకాయ ఘాటుగా ఉందా అని అడుగుతోంది...

భగవంతుణ్ణి పొందాలంటే

 మనం భగవన్నామాన్ని మనస్ఫూర్తిగా జపించకుండా, ఏదో బాహ్యంగా పైపైన చేస్తూఉంటాము. బయటకు మాత్రం "ఓ భగవాన్! నేను నీ దాసుడను, నాకు నీవుతప్ప వేరే దిక్కులేదు"అంటూ ఉంటాము. కాని మన ప్రవర్తన అందుకు విరుధ్ధముగా ఉంటుంది.


మనస్సు అనేక ఇతర ఆలోచనలతో నిండి ఉంటుంది. నిజంగా మన మనస్సు, మాట ఒకటిగా ఉండదు. ఇలా ఉంటే భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకోగలుగుతాం ?. 


మనం బయటకు ఏం మాట్లాడుతామో, మన మనస్సులోని ఆలోచనలు కూడా అదేవిధంగా ఉండాలి. 

అంటే భగవన్నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఆ భగవంతుని గురించే చింతించాలి. 

భగవంతుని నామం, ఆయన రూపం వేరుకాదు .


భగవన్నామస్మరణలో ఆనందం అధికమౌతుంది. ఆయన ప్రేమమయుడు. ఆనందమయుడు.ఆయనను ఎంతగా ధ్యానిస్తామో అంతగా ఆనందాన్ని పొందుతాము .

        సాధారణంగా మన మనస్సు నానా విషయాల పట్ల పరుగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే మనస్సును నియంత్రించి భగవంతుని పై కేంద్రకరించడానికి ప్రయిత్నించాలి....!


సూదిబెజ్జంలోకి దారం ఎక్కించాలంటే దారం యొక్క పోగులన్నీ ఒక్కటిగా చేయాలి. దారపుపోగులు విడివిడిగా ఉంటే సూదిబెజ్జంలోకి దారం ఎక్కించడం అసాధ్యం"


అలాగే భగవంతుని యందు మనస్సును నిమగ్నం చేయాలంటే బాహ్యవిషయాల వైపు పరుగులు తీసే మనస్సును నియంత్రించి ఏకాగ్రం చేయాలి


ఇంద్రియనిగ్రహం లేనిదే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కాదు .

భగవంతుణ్ణి పొందాలంటే  పరితపించడమే పరమోత్తమ సాధన

కందుకూరి వీరేశలింగం పంతులు

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏* 

 *16-04-2021, శుక్రవారం* 

.*


*జాతి గర్వించదగ్గ నవయుగ వైతాళికుడి జన్మదినం..ఈరోజు* 


 *కందుకూరి వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కందుకూరు గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారు. వీరేశలింగానికి నాలుగేళ్ళ వయసులో తండ్రి చనిపోయాడు. పెద తండ్రి, నాయనమ్మల పెంపకంలో అల్లారుముద్దుగా పెరిగాడు. చిన్నప్పటి నుండి, అన్ని తరగతులలోనూ, ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు.* 


 *స్త్రీ విద్యకై ఉద్యమించి, ప్రచారం చెయ్యడమే కాక, బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించిన స్త్రీ పక్షపాతి. ఆడపిల్ల కన్నెత్తి మగవాడిని చూడటమే మాహాపాపంగా భావించే ఆ రోజుల్లో మగ పిల్లలతో ఆడపిల్లలు కలిసి చదువుకునే సహ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది కూడా ఆ మహానుభావుడే..అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టి, వారికి ఉచితంగా చదువు చెప్పడంతో బాటు పుస్తకాలు, పలకా బలపాలు కొనిచ్చేవారు.* 


 *తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త, మన తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి .తాను నమ్మిన సత్యాన్ని, సిద్దాంతాన్ని తు.చ. తప్పక్కుండా పాటించిన వ్యక్తి . సంఘ సంస్కరణకు, సామాజిక దురాచారాల నిర్మూలనకు,తెలుగు సాహితీ వ్యాసంగంలోనూ నిరుపమానమైన కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. యుగకర్త గా,హేతువాదిగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది.ఒక వ్యక్తిగా, సంఘసంస్కర్తగా, రచయితగా వీరేశలింగంకు అనేక విశిష్టతలు ఉన్నాయి. అనేక విషయాలలో ఆంధ్రులకు ఆయన ఆద్యుడు, ఆరాధ్యుడు. ఆధునికాంధ్ర సమాజ పితామహుడిగా కీర్తి గడించిన వ్యక్తి కందుకూరి.*


 *ఇంతటి మహనీయుల గురించి నేడు ఎంతమందికి తెలుసు..?? వారి పేరుని వారి సేవలని ప్రభుత్వం నాయకులు ప్రజలు గుర్తించి వారి ఆశయాలని నెరవేర్చనప్పుడే వారికి సరైన నివాళి.*

అష్టావక్రగీత' 11, 12 ప్రకరణల నుండి (269)*_

 *'అష్టావక్రగీత' 11, 12 ప్రకరణల నుండి (269)*_

🕉🌞🌎🌙🌟🚩


_*ప్రాంగు, కృంగులే అహంకార సంకేతాలు !!*_


_*అతి స్పందనలే అశాంతికి గుర్తు. కష్టంలో, సుఖంలోనూ స్పందన తప్ప ప్రతిస్పందనలు ఉండని మహానుభావుల జీవితాలు మనకు ఆ విషయాన్నే బోధిస్తున్నాయి. వారు చూపించే అభిమానం, అనురాగాల వెనుక సహజ ప్రేమ తప్ప ఏదీ ఆశించడం ఉండదు. వారు యుద్ధంచేసినా కర్తవ్యంతో తప్ప కక్షతో చేయరు. రాగద్వేషాలు లేని సామ్యక్  జీవనమే వారి బోధ. అంతపెద్ద కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు ఒక రథసారధిగా సాక్షిగా ఉండిపోయాడు. యుద్ధంలో అలసిపోయిన శత్రువు రావణాసురుడిని రేపు రమ్మని ప్రేమ చూపించాడు శ్రీరాముడు. సంతోష దుఃఖాల్లో వ్యక్తమయ్యే ప్రాంగు, కృంగులు అహంకార సంకేతాలు. ఆ ప్రాంగు, కృంగుల్ని పరిహరించగలిగితే సంతోషదుఖాలు రెంటిలోనూ చెదరని శాంతి నిండి ఉండటం గమనించ గలుగుతాము.*_     


🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన*

 *ఆచార్య సద్బోధన*


అల్పమైన వాటి కోసం పరుగులు పెడుతుంటే ఉన్నతమైన దానిని కోల్పోవలసి వస్తుంది.


అల్ప దృష్టి కలిగినవాని వివేచన అసంబద్ధంగానే ఉంటుంది. సమదృష్టితో అంతా పరికించినప్పుడే హుందాతనంతో కూడిన తీర్పు వెలువడుతుంది. తనని తాను శరీరంగా భావించుకునే వ్యక్తిలో ఆధ్యాత్మికత నిలవదు.


మన ఆలోచనలు ఒక ఉదాత్తమైన ఆశయం కేంద్రంగా నిర్మితమై ఉండాలి. వాటిని మరింతగా విస్తరించే ప్రయత్నం చేస్తూ, వాటిని వదలక అంటిపెట్టుకుని ఉంటే, జీవితంలో నూతన అధ్యాయం ఆరంభం అవుతుంది.


పారే ఏటిలో నీరు ఎప్పుడూ తాజాగానే ఉంటుంది, పాకుడు ఏర్పడదు. అదే విధంగా మనలో ఉన్నతమైన ఆలోచనా స్రవంతిని సదా ప్రవహింప చేయ గలిగినప్పుడు, శాశ్వతమైన పునరుద్ధరణ జరుగుతుంది.


*శుభంభూయాత్*

సందేశం

 💥🌹🙏


✍ *ఒక మంచి కాఫీ లాంటి సందేశం* 


🍥సోక్రటీసుకు మరణశిక్ష విధించారు. తన ఉపన్యాసాలతో యువకుల్ని నాశనం చేస్తున్నాడని అభియోగం. ఆయన్ని జైల్లో పెట్టారు. 


🍥ఆ వివేకవంతుడంటే అందరికీ గౌరవం. పేరుకు జైల్లో పెట్టారు కానీ అందరూ వచ్చి ఆయన్ని చూసి వెళుతున్నారు. శిష్య బృందమయితే అక్కడే ఉండి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కానీ ఆ తాత్వికుడు ఇదేమీ పట్టనట్లు నవ్వుతూ అందర్నీ పలకరిస్తూ కబుర్లూ చెబుతూ ఉన్నాడు. అందరూ ఆయన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. మరణమంటే లక్ష్యపెట్టని ఆ మహానుభావుణ్ణి చూసి విస్తుపోతున్నారు. మరణ శిక్ష అమలు కావడానికి రెండు గంటల సమయముంది. ఆ శిక్ష విషం తాగి మరణించడం. సమయం సమీపించే కొద్దీ అభిమానుల గుండెలు కొట్టుకుంటున్నాయి.


🍥 సోక్రటీస్‌ ఆ సంగతే పట్టనట్లు అది తనకు సంబంధించిన విషయమే కానట్లు ఉన్నాడు. అందరి ముఖాల్లో ఆందోళన దిగులు, ఆయన ముఖంలో ఆనందం వెలుగు. ఆయన కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చున్నాడు. బయట ఒక చెట్టు కింద బిచ్చగాడు కూచుని లైర్‌ వాద్యం వాయిస్తున్నాడు. ఆ తీగల్ని మీటుతూ పాడుతున్న పాట సోక్రటీస్‌ మనసుని తాకింది.


 🍥పరవశంగా కళ్ళు మూసుకున్నాడు. చల్లటి గాలి ఆ పాటను మోసుకొచ్చి పరిమళంలా సోక్రటిస్‌ హృదయాన్ని తాకింది. ఎప్పుడూ ఆనందంగా ఉండే అతను మరింత ఆనందపడ్డాడు.


🍥సోక్రటీస్‌ మెల్లగా కళ్ళు తెరచి జైలర్‌ని పిలిచాడు. జైలర్‌ ఎంతో గౌరవభావంతో దగ్గరికి వచ్చి ఏమికావాలన్నాడు. సోక్రటీస్‌ కిటికీలోంచి చూపించి ”మీకు అభ్యంతరం లేకుంటే ఆ బిచ్చగాణ్ణి తీసుకొస్తారా?” అని అడిగాడు.


 🍥జైలర్‌ ”అయ్యో!దాందేముంది?” అని వెళ్ళి ఆ బిచ్చగాణ్ణి తీసుకొచ్చాడు. 


🍥సోక్రటీస్‌ ఆ బిచ్చగాణ్ణి తనకాపాట నేర్పమన్నాడు. అతని దగ్గర నుంచి లైర్‌ వాద్యం తీసుకున్నాడు. ఆ బిచ్చగాడు పాటపాడాడు.


 🍥సోక్రటీస్‌ ఆ పాట పాడుతూ లైర్‌ వాద్యం వాయించాడు. ఇట్లా అరగంట సాధన తరువాత బిచ్చగాడి సాయం లేకుండానే ఆ పాట పాడాడు. 


🍥సోక్రటీస్‌ కృతజ్ఞతలు చెప్పి బిచ్చగాణ్ణి పంపేశాడు. ఆయన శిష్యులు, జైలర్‌ ఆశ్చర్యపోయారు. మరణశిక్షకు ఇంకా గంట మాత్రమే ఉంది కానీ సోక్రటీస్‌ ప్రవర్తన వాళ్లకు వింతగా అనిపించింది. 


శిష్యులు


 🍥”గురువుగారూ! ఇక గంటలో విషపాత్ర మీ చేతికి వస్తుంది. అది తాగి మీరు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళబోతున్నారు. 


🍥కానీ ఇప్పుడు మీరు లైర్‌ వాద్యంమీద ప్రాక్టీసు చేసి పాట నేర్చుకున్నారు? ఏమిటిది?” అని కన్నీళ్ళ పర్యంతమయ్యారు. సోక్రటీస్‌ నవ్వి ”జీవితమంటే నేర్చుకోవడం, మరణం గురించి ఆలోచించడం కాదు.


🍥 నేను నువ్వు ఇక్కడున్న అందరం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం. కానీ జీవించినన్నినాళ్ళు ప్రతిక్షణం విలువైందే. ఎప్పటికప్పుడు తెలియంది తెలుసుకోవడంలోనే ఆనందముంది.


 🍥గంటక్రితం నాకా పాట తెలీదు. ఇప్పుడు నేర్చుకున్నాను. 


🍥ఇంకా నాజీవితంలో గంట సమయముంది. 

.

🍥అంటే ఇప్పటికీ నేర్చుకోవడానికి నాకు అవకాశముంది” అన్నాడు.

శిష్యుల నోట మాట రాలేదు.


🍥" జీవితం అంటే  యేడుస్తూ కూర్చోడం కాదు.,  జీవితం  అంటే  - నాకు  ఇంతే రాసి పెట్టి వుంది - అనుకుని  - నా ఖర్మ  ఇంతే - అంటూ నిందించడం కాదు .,  జీవితం  అంటే  -  నేర్చుకోవడం." 


యద్భావం తద్భవతి అంటారు కదా....

ఓం తత్సత్

💥🌹🙏🙏🙏🙏🌹💥

రామాయణ* *పారాయ‌ణం*కిష్కింధ కాండ*

 శ్రీ‌శ్రీ‌శ్రీ‌

*సంక్షిప్త రామాయణ*    

      *పారాయ‌ణం*

*శ్రీ‌రామ‌న‌వ‌మి వ‌ర‌కు*

 ********

     *4వ రోజు పారాయ‌ణం* 

     🌸 *కిష్కింధ కాండ*🌸


 శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి

              

   ***


శ్రీ‌ రామ లక్ష్మణులు శబరి ఆతిధ్యాన్ని స్వీకరించిన తరువాత పంపా సరోవరం అందాలను చూస్తూ ముందుకు సాగారు. సీతాప‌హ‌ర‌ణం గురించి విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు.

శ్రీ‌రామా నువ్వు దుఃఖాన్ని విడిచిపెట్టు.ఉత్సాహం ఉంటే ప్ర‌పంచంలో సాధించ‌లేనిదంటూ ఏదీ లేదు. నీవు లోకైక వీరుడ‌వు. దుఃఖం, శోకం, భ‌యం, ప్ర‌తిభ‌ను బ‌య‌ట‌కు రాకుండా చేస్తాయి. ఈ అడ్డు తొల‌గించుకో, నీకు చెప్పేటంత‌టివాడ‌ను కాను. అన్న‌య్యా ఉత్సాహాన్ని పుంజుకో, ఈ బాధ  విడిచిపెట్టి జ‌ర‌గ‌వ‌ల‌సిన దాని గురించి ఆలోచించు అన్నాడు. త‌మ్ముడి మాట‌లు రాముడికి ఉత్సాహాన్నిచ్చాయి. 

 క్రమంగా వారు ఋష్యమూక పర్వతాన్ని సమీపించారు.


*శ్రీ‌రాముడి వద్దకు*

*హనుమ*..


తన అన్న వాలి కోపానికి గురై తరిమి వేయబడిన సుగ్రీవుడనే వానరుడు తనవారితో కలసి ఋష్యమూక పర్వతం పైననే  తిరుగుతున్నాడు.  మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు భ‌య‌ప‌డ్డాడు. వాలి వీరిని త‌న పైకి యుద్ధానికి  పంపాడేమోన‌ని సుగ్రీవుడి భ‌యం.  వారెవ‌రో తెలుసుకుని ర‌మ్మ‌ని హనుమంతుడిని పంపాడు.

హనుమంతుడు స‌న్యాసి రూపంలో  రామ‌ల‌క్ష్మ‌ణుల‌ను సమీపించాడు– 

ఓ పుణ్యపురుషులారా! తమరు, వేషధారణను బట్టి తాపసులవలెనున్నారు. ధరించిన ఆయుధాలను బట్టి సర్వ శత్రు సంహరణా దక్షుల వలె ఉన్నారు. నర నారాయణుల లాగా, సూర్యచంద్రులలాగా, అశ్వినీ దేవతల లాగా కనిపిస్తున్నారు. నేను సుగ్రీవుడు అనే వానరుని మంత్రిని. అతడు తన అన్న వాలి ఆగ్రహానికి గురై దీనుడై ఉన్నాడు.  సుగ్రీవుడు మీ స్నేహాన్ని కోరుతున్నాడు. నేను కామరూపుడను గనుక బ్ర‌హ్మ‌చారి వేషంలో మిమ్ములను కలవడానికి వచ్చాను. నేను వాన‌రుడ‌ను. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని మృదువైన మాటలతో అన్నాడు.


హనుమంతుని మాటలకు, వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. 

ల‌క్ష్మ‌ణుడివైపు తిరిగి రాముడు,....

 చూశావా ల‌క్ష్మ‌ణా....

 ఇత‌ని మాటలలో ఎక్కడా అనవసర శబ్దం గాని, అపశబ్దం గాని లేవు. వేదాలను, వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వానిని మంత్రిగా కలిగిన రాజు ఏద‌యినా సాధించగలడు అని చెప్పాడు.

రాముడి అనుమ‌తి తీసుకుని  లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు.


*శ్రీరామ, సుగ్రీవుల మైత్రి*:


హనుమంతుని ద్వారా  రామ ల‌క్ష్మ‌ణుల గురించి తెలుసుకుని  సుగ్రీవుడు  వారికి స్వాగ‌తం ప‌లికి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడతాన‌న్నాడు. కొద్దిరోజుల క్రితం ఒక స్త్రీ ని రాక్ష‌సుడు అప‌హ‌రించుకుపొతుండ‌గా చూశాం. ఆమె జారవిడచిన నగలు మావ‌ద్ద ఉ న్నాయి అని  వానరులు రామునికి చూపించారు. వాటిని చూచి రాముడు క‌న్నీళ్ల ప‌ర్యంతం అయ్యాడు. క‌న్నీళ్ల‌తో క‌ళ్లు మ‌స‌క‌బారాయి.

 ఈ ఆభ‌ర‌ణాలు మీ వ‌దిన సీత‌మ్మ‌వో కాదో చూడ‌మ‌ని,ల‌క్ష్మ‌ణుడికి చెప్పాడు రాముడు.


*నాహం జానామి కేయూరే* *నాహం జానామి కుండలే*

*నూపురేత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్*

 అన్న‌య్యా.... ఈ కేయూరాలు, కుండలాలను నేను గుర్తించలేను. కాని నిత్యం వదినకు పాదాభివందనం చేయడం వలన ఈ నూపురాలు ఆమెవని మాత్రం చెప్పగలను అన్నాడు . ఆ ఆభ‌ర‌ణాల‌ను చూస్తూ

 రాముడు ఇంకా దుఃఖిస్తున్నాడు. రామా చింతించ‌కు సీత జాడ తెలుసుకుని తెచ్చి అప్ప‌గించే బాధ్య‌త నాది అని అనున‌య‌వాక్యాలు ప‌లికాడు సుగ్రీవుడు.

 రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి కుదుర్చుకున్నారు.

 అన్న అయిన వాలితో సుగ్రీవుడికి వైరం ఎందుకు వ‌చ్చిందో రాముడు అడిగి తెలుసుకున్నాడు.


 కిష్కింధకు రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు.  ఒక సారి మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలంలోపలికి వెళ్ళాడు. బిలం వెలుపలే కాప‌లాగా ఉండమని వాలి తన తమ్ముడు సుగ్రీవునికి చెప్పాడు. ఒక నెల‌ గడచినా వారు వెలుపలికి రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని, రాక్ష‌సుడు బ‌య‌ట‌కు వ‌స్తాడ‌ని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగివచ్చాడు. మంత్రులు సుగ్రీవుడిని రాజును చేశారు.

కొంత‌కాలానికి వాలి బిలంలోంచి బ‌య‌ట‌కు వ‌చ్చి , సుగ్రీవుడు రాజ్యం కాజేయ‌డానికి బిలానికి బండ‌రాయిని అడ్డంగా పెట్టి వ‌చ్చాడ‌ని భావించి అత‌డిని నిందించాడు. సుగ్రీవుడి భార్య రుమ‌ను చేప‌ట్టి

 సుగ్రీవుడిని  రాజ్యంనుంచి తరిమేశాడు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన నలుగురు మంత్రులతో తలదాచుకొన్నాడు. మతంగమహర్షి శాపంవలన వాలి ఋష్యమూక పర్వతం సమీపానికి రాడు.


దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


*వాలి- సుగ్రీవుల పోరు*

రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీ కొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవ‌రో పోల్చుకోలేక రాముడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో  త‌న‌ను కాపాడ‌నందుకు  రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.


 వాలి , సుగ్రీవులు ఇద్ద‌రూ ఒకేరకంగా ఉండ‌డంవ‌ల్ల కాపాడ‌లేక‌ పోయానన్నాడు. మరో సారివెళ్ల మన్నాడు రాముడు. సుగ్రీవుడికి ధైర్యం చెప్పాడు.  ఈ సారి  ఒక పుష్ప‌మాల‌ను గుర్తుగా సుగ్రీవుని మెడలో వేసి పంపాడు . మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార అడ్డుకునింది. సుగ్రీవుడితో పోరు వ‌ద్ద‌ని వారించింది.  అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు వెంట‌నే  యుద్ధానికి వ‌స్తున్నాడంటే, రామ ల‌క్ష్మ‌ణుల‌ అండ చూసుకుని వ‌స్తున్నాడ‌ని గ్ర‌హించ‌మ‌నింది.  కాని వాలి త‌న భార్య తార మాట  వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.

అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు చెట్టు చాటునుంచి కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపైకిసంధించాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.

కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ క‌నిపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--


*రాముని వాలి నిందించుట*:

రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చాటుగా వేసిన బాణం వ‌ల్ల‌ నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, నీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా నన్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. ధ‌ర్మం త‌ప్పి వ్య‌వ‌హ‌రించావు అని రాముడిని నిందించాడు.

నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? – అని వాలి అన్నాడు.


*రాముని సమాధానం*

వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.


నేను వేట మిష మీద నిన్ను చంపలేదు. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. కిష్కింధ మా రాజ్యంలోదే నని మరువకు.

నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు అధిపతివైన నీకు తెలుసు.

ఇక చెట్టుమాటునుండి చంపానంటున్నావు... నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయం చేత నిన్ను కూల్చాను. పైగా నీది జంతు సంతతి .మాటు వేసి చంపడం సరయినదే.

అధ‌ర్మ వ‌ర్త‌నుడిని వధించడానికి యుద్ధ ధర్మాలు కూడా వర్తించవు. నీవు శిక్షార్హుడవు అన్నాడు. రాముడి స‌మాధానంతో వాలి తృప్తి చెందాడు. ధ‌ర్మ‌సూక్ష్మాల‌ను గ్ర‌హించాడు. 

 రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. అయితే  గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో,  సుగ్రీవుడు నా భార్య‌ తారను హింసించకుండా చూడు. నా  అపరాధాలనూ మన్నించు అని వాలి వేడుకున్నాడు.


తరువాత వాలి సుగ్రీవుని పిలిచి  ప్రాణాలు  పోయే లోగా తన మెడలోని కాంచనమాలను తీసి అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. తార మాట విననందువల్లే తనకు ఈ దుర్గతి పట్టిందన్నాడు.. రాముడికి ఇచ్చిన మాట నిల‌బెట్టుకోమ‌న్నాడు. అలక్ష్యం చేయవద్దన్నాడు.


పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని వాలి ప్రాణాలు వ‌దిలాడు.

 అనంతరం రాముడి ఆజ్ఞ‌పై  రాజుగా సుగ్రీవుడూ, యువరాజుగా అంగదుడూ అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు  సుగ్రీవ ప‌ట్టాభిషేకానికి కిష్కింధకు వెళ్ళలేదు.

 అప్ప‌టికే వ‌ర్ష‌రుతువు వ‌చ్చేసింది. వర్షఋతువులో సీతా అన్వేషణా యత్నం సాధ్యం కాదు గనుక నాలుగు మాసాలపాటు కిష్కింధలో సుఖభోగాలు అనుభవించమని, కార్తిక మాసం రాగానే. సీతాన్వేషణకు సిద్ధం కావాలని రాముడు సుగ్రీవుడికి చెప్పాడు.


*లక్ష్మణుని ఆగ్రహం*


వర్షా కాలం అయిపోయింది. ఆకాశం నిర్మలమయ్యింది. కాని సుగ్రీవుడు ధర్మార్ధ విముఖుడై రేయింబగళ్ళు కామభోగాలలోనే గడుపుతున్నాడు.  రామకార్యం మరచిపోయాడు .      ఆ సమయంలో హనుమంతుడు సుగ్రీవుని వద్దకు వెళ్ళి – మహావీరా! నీవు రాజ్యాన్ని పొందడానికి కారణమైన శ్రీరామ చంద్రుని కార్యాన్ని ఉపేక్షించడం తగదు. మిత్రకార్యాన్ని విస్మరిస్తే అనర్ధాలు తప్పవు. శ్రీరామ చంద్రునికి కోపం తెప్పించకు.  వెంటనే సీతాన్వేషణకు మమ్ములను ఆజ్ఞాపించు – అని మంచి మాట‌లు చెప్పాడు. సుగ్రీవునికి కర్తవ్యం స్ఫురణకు వచ్చింది. నీలుడిని పిలిచి, అన్ని దిశలనుండి వానరులను వెంటనే పిలిపించమన్నాడు. పదిహేను రోజుల్లోపు రాని వానరులకు మరణదండన అని శాసించాడు.


రాముడు సీతా వియోగంతో కుములుతున్నాడు. తాను చేసిన మేలు మరచి  సుఖభోగాలలో మునిగి తేలుతున్నా  సుగ్రీవుని ప్ర‌వ‌ర్త‌న రాముడికి మరీ బాధ కలిగించింది. అది చూసి లక్ష్మణునికి ఆగ్రహం పెల్లుబుకింది. ఆగ్ర‌హంతో కిష్కింధకు వెళ్ళాడు.  కోపంతో వచ్చిన లక్ష్మణుని చూచి వానరులు భయంతో వణికిపోయారు. అంగదుడు, మంత్రులు లక్ష్మణుని రాకను సుగ్రీవునికి తెలియజేశారు. వినయంతో మెలిగి ల‌క్ష్మ‌ణుడిని ప్రసన్నం చేసుకోమని హనుమంతుడు హితవు చెప్పాడు. భ‌యంతో సుగ్రీవుడు ముందుగా తార‌ను పంపాడు.

 తార వచ్చి సుగ్రీవుని త‌ప్పుని  మన్నించమనీ, అతడు తన మిత్ర ధర్మాన్ని తప్పక నెరవేరస్తాడనీ లక్ష్మణుని ప్రాధేయపడుతూ విన్నవించుకొని అతనిని శాంతింపజేసింది. దానితో సుగ్రీవుడు కాస్త ధైర్యం తెచ్చికొని తన అపరాధాన్ని మన్నించమని వేడుకొన్నాడు. సమస్త వానర గణాలనూ కిష్కింధకు రావాలని ఆజ్ఞాపించాడు. తన సేనా గణంతో లక్ష్మణుని వెంట శ్రీరాముని వ‌ద్ద‌కు వెళ్ళి రాముని పాదాలపై బడ్డాడు. అతనిని రాముడు ఆలింగనం చేసుకొన్నాడు. స్నేహితులిద్దరూ కలసి సీతాన్వేషణా పధకాన్ని సిద్ధం చేసుకొన్నారు.


*సీతాన్వేషణ ఆరంభం*


సుగ్రీవుని ఆజ్ఞపై తూర్పు, ప‌డ‌మ‌ర‌, ఉత్త‌ర దిక్కుల‌కు వాన‌ర సేన వెళ్లింది.. దక్షిణం వైపుకు నిర్దేశించిన బృందంలో అంగదుడు, జాంబవంతుడు, నీలుడు, హనుమంతుడు వంటి మహావీరులున్నారు. దక్షిణ దిశవైపు సీతను తీసికొని పోయిన రాక్షసుడు లంకాధిపతి రావణుడే కావచ్చునని సుగ్రీవుని అభిప్రాయం. అది గ్రహించిన రాముడు తన అంగుళీయాన్ని సీతకు ఆనవాలుగా ఇమ్మని హనుమంతునికిచ్చాడు.

ఒక మాసం కాలానికి తూర్పు, పడమర, ఉత్తర దిశలుగా వెళ్ళిన వానర సేనలు తమ అన్వేషణ ముగించి తిరిగి వచ్చారు. సీత జాడ తెలియ‌ద‌ని విచార వ‌ద‌నంతో మనవి చేశారు.


*దక్షిణ దిశలో అన్వేషణ*


దక్షిణ దిశగా వెళ్ళిన వీరులు ప్రతిచోటా గాలిస్తూ వింధ్య పర్వతం దాటారు.  అప్పటికే సుగ్రీవుడు పెట్టిన నెల గడువు ముగిసింది. సీతమ్మ జాడ కానరాలేదు. వట్టిచేతులతో కిష్కింధకు పోలేరు. ఇక మరణమే తమకు శరణమని అంగదుడూ అతని అనుచరులూ ప్రాయోపవేశానికి సిద్ధమయ్యారు. వారిలో వారు

రామ లక్ష్మణుల జననం నుంచి సీతా అపహరణమ్ వరకు గుర్తు చేసుకుంటూ బాధ పడుతున్నారు. అక్కడ కొండపైన ఉండే వృద్ద పక్షి సంపాతి ఇదంతా వింటున్నాడు. సంపాతి జటాయువు సోదరుడు. ముందు వానర మూకను తినవచ్చని అనుకున్నాడు. కానీ వారి మాటలలో వానరులు దశరధుడి కుమారుడయిన రాముడికి సహాయం చేస్తున్నారని గ్రహించాడు. దశరధుడి తో తనకు గల స్నేహం గుర్తు చేసుకున్నా డు. తమ్ముడు జటాయువు మరణ వార్త విని బాధపడ్డాడు. రావణాసురుడు సీతమ్మ ను అపహరించి ఆకాశ మార్గంలో లంకకు తీసుకుపోతుండగా సంపాతి చూసి వున్నాడు.

   రావణుడు సముద్రంలో నూరు యోజనాల అవతల లంకానగరంలోసీతమ్మని దాచాడని వారికి చెప్పాడు.


*హనుమంతుని సంకల్పం*


 సంపాతి ద్వారా సీత జాడ తెలిసి వానరులు ముందు సంబరపడ్డారు. అయితే సముద్రం దాటడం ఎలా అన్న ప్రశ్నతో ఉత్సాహం  నీరుగారిపోయింది. గజుడు పది ఆమడలు గెంతగలనన్నాడు. గవాక్షుడు ఇరవై ఆమడలూ, గంధమాదనుడు ఏభై ఆమడలూ, మైందుడు అరవై ఆమడలూ, ద్వివిదుడు డెబ్భై ఆమడలూ, సుషేణుడు ఎనభై ఆమడలూ లంఘించగలమన్నారు. వృద్ధుడైన జాంబవంతుడు తొంభై యోజనాలు మాత్రం ఎగురగలనన్నాడు. అంగదుడు నూరు యోజనాలు లంఘించగలను గాని తిరిగిరావడం కష్టమైతే పని చెడుతుందని అన్నాడు. అంద‌రిమాట‌లూ విన్న‌త‌ర్వాత‌....

జాంబవంతుడు హనుమంతునితో ఇలా అన్నాడు – నాయనా! ఈ కష్టాన్ని తరింపజేయడానికి నిన్ను మించిన సమర్ధుడు లేడు. గరుత్మంతునితో సమానమైన వేగ విక్రమాలు కలవాడవు. నీకు సమానమైన బలం, తేజం, బుద్ధి కుశలత, పరాక్రమం మరెవరికీ లేవు. నీ శక్తి నీకు తెలియదు. నీవు బహువర సంపన్నుడవు. వాయుపుత్రుడవు. ఈ సముద్రం దాటడం నీకు మాత్ర‌మే సాధ్యం. త్రివిక్రముడివై విజృంభించు, లేవయ్యా ఆంజనేయా! - అని ఉత్సాహపరచాడు.

ఆంజనేయుడు సముద్రంలా ఉప్పొంగిపోయాడు. 

దీర్ఘ దేహుడై విజృంభించాడు. జాంబవంతునికీ,  వానర ప్రముఖులకూ వందనం చేశాడు.సీతమ్మను చూచి రామకార్యాన్ని నెరవేరుస్తాను. అవసరమైతే లంకా నగరాన్ని పెళ్ళగించుకువస్తాను. అనేక శుభశకునాలు క‌నిపిస్తున్నాయి. మీరు నిశ్చింతగా ఉండండి.  అన్నాడు.


కార్య సాధకుడవై తిరిగి రమ్మని జాంబవంతుడు ఆశీర్వదించాడు. మహాకాయుడైన హనుమంతుడు వాయుదేవునికి మ్రొక్కి మహేంద్రగిరిపై కొంతసేపు విహరించాడు. అతడు కాలు పెట్టిన‌ చోట పర్వతం బీటలువారి కొత్త సెలయేళ్ళు పుట్టాయి.

శత్రు నాశన సమర్ధుడు,   వాయువేగంతో ప్ర‌యాణించ‌గ‌ల ధీరుడు అయిన  హనుమ లంకాపట్టణం చేరడానికి సంకల్పించి లంక వైపు తిరిగి నిలుచున్నాడు.


శ్రీ‌రామ రామ రామేతి 

రమే రామేమ‌నోర‌మే

స‌హ‌స్ర‌నామ త‌త్తుల్యం 

రామ‌నామ వ‌రాన‌నే

              *****

*మనోజవం మారుత తుల్యవేగం*

*జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం!*

*వాతాత్మజం వానరయూధ ముఖ్యం*

*శ్రీరామదూతం మనసా స్మరామి!!!*

         

(కిష్కింధ కాండ స‌మాప్తం)

మొగిలిచెర్ల

 *మంచి పాఠం..*


2011వ సంవత్సరం లో ఒక శుక్రవారం సాయంత్రం పూట..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం లో ఒక ప్రక్కగా కూర్చుని నేనూ మా సిబ్బందీ మందిరం తాలూకు వ్యవహారాలగురించి మాట్లాడుకుంటూ వున్నాము.."అయ్యా..రేపు శనివారం..ఎల్లుండి ఆదివారం..ఈరెండురోజులూ మనం అన్నదానం చేయాలి కదా..మీరు దాతల పేర్లు చెప్పలేదు..దాతల పేర్లు మీరు వ్రాసి ఇస్తే..రేపు ఉదయం బోర్డ్ మీద వ్రాస్తాము.." అన్నారు..అప్పటికి ఆ రెండురోజుల అన్నదానం కొరకు దాతలెవరూ ముందుకు రాలేదు..ఆ మాటే మా సిబ్బందితో చెప్పి.."మనం మందిరం తాలూకు డబ్బు నుంచి వాడుకుందాము..సరుకులు తెప్పించండి"..అన్నాను..సరే అన్నారు.."ఈ రెండు రోజుల అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుంది?.." అని వాళ్ళను అడిగాను..కొద్దిసేపు లెక్కలు వేసి.."మొత్తంగా పదకొండు వేల ఐదు వందల దాకా ఖర్చు అవుతుంది..అన్నీ కలుపుకొని.." అన్నారు..(ఆరోజుల్లో లెక్క అది..ప్రస్తుతం మామూలు రోజుల్లో ఒక పూటకు అంతకంటే ఎక్కువగా ఖర్చు అవుతోంది).."సరే లెక్క వ్రాసి పెట్టండి..మన స్వామివారి వద్ద అన్నదానం గురించి మనం చింత పడనక్ఖర లేదు..అన్నీ ఆయన చూసుకుంటాడు..మనకు అప్పచెప్పిన పని మనం చేసుకుందాము.." అన్నాను..అంతటితో ఆ సంభాషణ ముగించి..ఎవరి పనుల్లో వాళ్ళం ఉండిపోయాము..


ఆ ప్రక్కరోజు శనివారం ఉదయం తొమ్మిది గంటల వేళ..ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఇద్దరు భార్యా భర్త మందిరానికి వచ్చారు..వాళ్ళను చూడగానే బీదవాళ్ళు  అనిపించేటట్లుగా వున్నారు..వాళ్ళు కూడా స్వామివారి మందిరం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి..సర్వదర్శనం లైన్ లో వచ్చి..స్వామివారి సమాధికి నమస్కారం చేసుకొని..మంటపం లో ఓ మూలకు పోయి కూర్చున్నారు..వాళ్ళల్లో వాళ్లే ఏదో మాట్లాడుకుంటూ..మధ్య మధ్యలో మా సిబ్బంది వైపు చూస్తూ..మొత్తం మీద ఏదో తర్జన భర్జన పడుతున్నారు..మరో పది నిమిషాల తరువాత..ఇద్దరూ లేచి..మా సిబ్బంది కూర్చుని ఉన్న చోటుకు వెళ్లారు..ఇంకొక పదినిమిషాల తరువాత వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని మావాళ్ళు నా వద్దకు వచ్చారు.."ఏమిటి విషయం..?" అని అడిగాను..

"అయ్యా..వీళ్ళది కట్టకిందపల్లె..యానాది కులం వాళ్ళు..నాలుగేళ్ళ క్రిందట మన గుళ్ళోనే పెళ్లి చేసుకున్నారట..పెళ్ళైన రెండు నెలలకు మళ్లీ ఇక్కడికి వచ్చి మొక్కుకున్నారట..తమకు ఎక్కడన్నా పని దొరికితే..స్వామికి ముడుపు కట్టుకుంటాము.." అనుకున్నారు..పక్క నెలలోనే నెల్లూరు దగ్గర ఒక ఆసామి తన పొలం చూసుకోవడానికి పనివాళ్లకోసం వెతుకుతుంటే..వీళ్లకు ఆయన పరిచయం కావడం..ఆయన పొలం లో కాపలా కు చేరిపోడం జరిగాయి..ఆరోజునుంచీ తమ కూలీ డబ్బుల్లో కొద్దీ కొద్దిగా స్వామివారి కోసం ఒక మట్టి ముంతలో దాచుకున్నారట..అది తీసుకొని వచ్చారు..దానిని ఎలా ఇవ్వాలో తెలీక..మథన పడుతున్నారు..మా దగ్గరకు వచ్చి వివరం అడిగారు.." అన్నారు..


"ఆ ముంతలో ఉన్న డబ్బు దేనికి ఖర్చుపెట్టాలని అనుకున్నారు?.." అని ఆ దంపతులను అడిగాను..నిజానికి నాకు అంత ఆసక్తి లేదు..ఎందుకంటే..వాళ్లిద్దరూ పేద వాళ్ళు..ఎంత కూడబెట్టుకుంటారు?..మహా అయితే ఓ ఐదారు వందల రూపాయలు వుంటుంది..అనే భావనతో అడిగాను.."నలుగురికి అన్నం పెట్టు స్వామీ..మేము పేద వాళ్ళం..అందులో ఎంత ఉంటే..అంతా తీసుకొని..అన్నం పెట్టు స్వామీ.." అన్నాడు.."అలాగేలే.." అని మా వాళ్ళ తో ఆ ముంత లో ఉన్నది లెక్కగట్టి..వాళ్ళ పేరుతో రసీదు ఇవ్వండి.." అన్నాను..సరే అని చెప్పి వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకొని మంటపం లోకి వెళ్లారు..అక్కడ ఒక చాప పరచి..ఆ చాప మీద ఆ ముంత లో ఉన్న చిల్లర పోశారు..మా సిబ్బందిలో ముగ్గురు కూర్చుని..ఓ అరగంట పాటు లెక్కబెట్టి..మళ్లీ వాళ్ళిద్దరినీ తీసుకొని నా వద్దకు వచ్చారు..ఆ ముంతలో వచ్చిన డబ్బు ఒక చేతిలో పట్టుకొని వున్నారు.."సార్..మొత్తం పదకొండు వేల ఆరువందల పదహారు రూపాయలు..ఉంది.." అన్నారు..ఒక్కక్షణం నాకు అర్ధం కాలేదు.."ఎంత వున్నది..?" అన్నాను.."పదకొండు వేల ఆరువందల పదహారు రూపాయలు.." మళ్లీ చెప్పాడు..శని ఆదివారాలు రెండురోజులు వచ్చే భక్తుల అన్నదానం కోసం అంతకు ముందురోజు మేము లెక్కగట్టిన మొత్తం పదకొండు వేల ఐదువందల రూపాయలు..దానిపై మరో నూట పదహారు రూపాయలు ఉన్నాయి..ఎంత చులకన గా అనుకున్నాను?..నాలో ఉన్న ఆ చులకన భావాన్ని స్వామివారు ఎంత సున్నితంగా ఎత్తి చూపారో అర్ధం అయింది..


"మీరు కూడబెట్టిన డబ్బు ఇంత ఉంది..ఈ మొత్తాన్ని ఏమి చేయమంటారు?.." అని మళ్లీ వాళ్ళను అడిగాను.."స్వామీ..ఆ డబ్బు మాదికాదు..అంతా ఆ స్వామిదే..దాంతో అన్నం పెట్టు.." అన్నారు భక్తిగా..వాళ్లిద్దరూ భక్తి గానే వున్నారు..కానీ..అప్పటిదాకా ఆ భక్తిని గుర్తించలేని స్థితిలో నేను వున్నాను..స్వామివారి సమాధి గది ముందు నిలబడి మనసులోనే క్షమాపణ చెప్పుకున్నాను..ఆ దంపతులు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టు వున్నారు..ఆరోజు రాత్రికి నిద్రచేసి..ప్రక్కరోజు స్వామివారి సమాధి దర్శించుకొని వెళ్లిపోయారు..ఎవ్వరినీ చులకనగా చూడకూడదు అని మాకు ఒక మంచి పాఠాన్ని  స్వామివారు సమాధి లో కూర్చుని నేర్పారు..


సర్వం..

శ్రీ దత్తకృప


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగిలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..వయా కందుకూరు..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్ : 94402 66380 మరియు 9908973699)