26, ఏప్రిల్ 2021, సోమవారం

మృత్యుంజయ మంత్రం*

 *మహా మృత్యుంజయ మంత్రం*

=======================


*ఓం త్య్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం* |

*ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్* || *ఓం* ||

(శుక్ల యజుర్వేద సంహిత, 3.60)


సుగంధం వెదజల్లే అన్నాన్నిచ్చి పోషించేవాడు, త్రినేత్రుడూ అయినా పరమశివుడిని ఆరాధిస్తూ- 

ఈశ్వరా! తొడిమ నుంచి దోస పండులా సంసారబంధం నుంచీ, మరణం నుంచీ, అశాశ్వతం నుంచీ నన్ను విడిపించు ఆత్మస్థితి నుంచి మాత్రం వీడిపోకుండా చూడమని ప్రార్థిస్తుందీ మంత్రం. మహామృత్యుంజయమంత్రంగా చెప్పబడిన ఈ మంత్రంలో అద్భుత అంతరార్థం దాగుంది. 

మృత్యుంజయమంటే మరణాన్ని జయించడం అని అర్థం. జీవితం జనన మరణ బంధనం. *మరణాన్ని జయించడమంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం కాదు.* శరీరం నుంచి ప్రాణం వీడిపోవడం మరణం. కానీ జీవించి ఉన్నప్పుడే బుద్ధిపూర్వకంగా ప్రాణం అశాశ్వతం అనీ, ఆత్మయే శాశ్వతమనే అనుభూతిని పొంది, తమతమ కర్తవ్యాలను నిర్వర్తించడమే మరణాన్ని జయించడం. భ్రమల్లో బతుకుతూ, కాలయాపన చేస్తూ జీవిత సత్యాన్ని మన అంతరాత్మ పదేపదే గుర్తుచేస్తున్నా పట్టించుకోకుండా అసంతృప్తితోనే జీవితమంతా బతుకుతాం. అశాంతితోనే మరణాన్ని ఆశ్రయిస్తాం. ఆత్మ ఒక్కటే శాశ్వతమని గుర్తించగలిగితే తారతమ్యాలూ, విభేదాలకు తావుండదు. సర్వసమానత్వ భావనతో ప్రపంచమంతా ఏకమై జీవిస్తుంది.

కర్మకు బాధ్యులు

 **మనము చేసే - కర్మకు బాధ్యులు - ఎవరు???...*

ఈ విషయంలో మానవునికే కాదు, జగజ్జనని అయిన పార్వతీ దేవికి కూడా అనుమానం కలిగింది...


ఒక రోజు పార్వతీదేవి ఈశ్వరుని తో... 

మానవులు కర్మలు చేస్తుంటారు కదా.. ఆకర్మలను మానవుల చేత దేవుడు చేయిస్తుంటాడా?.. లేక వారంతట వారు సంకల్పించి చేస్తుటారా అని అడిగారు... 


*అప్పుడు పరమశివుడు ఇలా చెప్పారు...*


పార్వతీ ! దేవుడు ఏ పనీ చెయ్యడు, దేవుడు కేవలం సాక్షిభూతుడు మాత్రమే... కాని దేవుడు మానవుడి కర్మలకు తన సహాయము అందిస్తాడు. 

మానవుడు చేసే కర్మలకు తగిన ఫలము అందిస్తాడు, ఏ పని చెయ్యాలో నిర్ణయించి కర్మలు చేసేది మానవుడే...

ఇందులో దైవప్రమేయము ఏదీయు లేదు, పూర్వజన్మ కర్మఫలితంగా మానవుడు తను చేయవలసిన కర్మలను నిర్ణయించి కర్మలుచేస్తాడు...


మానవుడు పూర్వజన్మలో చేసే పనులు దైవములు అయితే, ఈ జన్మలో చేసే పనులు పౌరుషములు అనగా అవే పురుషప్రయత్నములు...


"ఒక పని చెయ్యడానికి మనిషి చేసే ప్రయత్నములు వ్యవసాయము వంటిది, దైవ సహాయము మొక్కకు అందించబడే గాలి, నీరు వంటిది."


నేలను తవ్వితే భూగర్భము నుండి నీరు ఉద్భవిస్తుంది. 

అలాగే ఆరణి మధిస్తే అగ్ని పుడుతుంది, అలాగే ఏ పనికైనా పురుషప్రయత్నము ఉంటేనే దైవము కూడా తోడై చక్కటి ఫలితాలను అందిస్తాడు. పురుషప్రయత్నము లేకుండా దైవము సహాయపడతాడని అనుకుంటే కేవలము దైవము చూస్తాడని ఊరకుంటే దేవుడు ఫలితాన్నివ్వడు...


_కనుక పార్వతీ ! ఏ పని సాధించాలని అనుకున్నా పురుషప్రయత్నము తప్పక కావాలి, అప్పుడే దేవుడు సత్పఫలితాలను ఇస్తాడు...

                        *🌹శుభమస్తు🌹_*

       🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

అరచేతిలో తీర్ధాలు

 *🤲అరచేతిలో తీర్ధాలు🤲*



అగ్నిపురాణంమన అరచేతిలో 5 తీర్థాలున్నాయని చెబుతున్నది.

ఈ ఐదు తీర్థస్థానాలను పంచతీర్థాలని అంటారు.


కుడిచేతి బొటనవ్రేలిని వంచి దానిపై చూపుడు వ్రేలిని వంచి ఉంచి, ఆ విధంగా ఏర్పడిన పల్లపు ప్రదేశంలో నిలిచేట్టు పోసే జలం తీర్థం అని అంటున్నాము. అలా నీటిని


"ఓమ్ కేశవాయస్వాహా, "

"ఓమ్ నారాయణాయస్వాహా, "

"ఓమ్ మాధవాయస్వాహా ",

అని జపిస్తూ తీసుకోవడాన్ని ఆచమించడం అంటారు. 

ఈ సందర్భంలోని


ఐదు స్థానాలను పంచతీర్థాలని అగ్నిపురాణం అంటున్నది.


చూపుడు వ్రేలి క్రింది ప్రదేశాన్ని బ్రహ్మస్థానం అని దాన్నే

బ్రహ్మతీర్థం అని అంటారు. 


చిటికెన వ్రేలి మూలస్థానం ఋషితీర్థం అని ప్రజాపతి స్థానమనీ, ప్రజాపతి తీర్థం అని అంటారు.


అరచేతి మధ్య పల్లపు ప్రదేశాన్ని అగ్ని స్థానమని 

దాన్ని అగ్ని తీర్థం అని అంటారు. 


చూపుడు వ్రేలినుంచి, చిటికెన వ్రేలి వరకు ఉన్న వ్రేళ్ళ

కొనల భాగం దేవస్థానాలని అవే దేవతీర్థాలు అని అంటారు.


ఎడమ అరచేతిలోని పల్లపు ప్రదేశాన్ని సోమతీర్థం అంటారు.


ఆచమనం చేసేప్పుడు మణికట్టువైపు బొటనవ్రేలి క్రింద ఉండే ప్రదేశం నుండి నీటిని గ్రహిస్తాము. కనుక దీన్ని కూడ బ్రహ్మతీర్థం అంటారు.


సంధ్యవార్చే వ్రేళ్ల చివరలనుంచి తర్పణం జలాన్ని విడుస్తాం కాబట్టి ఇదికూడ దేవతీర్థం అవుతున్నది. పితృకర్మలలో తర్పణాలకు వదిలే జలం 

పితృతీర్థం అనబడుతున్నది.


ఇవండీ అగ్నిపురాణంలోని పంచతీర్థాలు మన అరచేతిలో.

🙏🏻

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

  

*మాలకొండ లో తపస్సాధన..*


*(తొమ్మిదవ రోజు)*


"ఏకేన చక్రమపరేణ కరేన శంఖం

అన్యేన సింధు తనయా మవలంబ్య తిష్ఠన్

వామేతరేణ వరదాభయ హస్తముద్రాం

శ్రీ లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం౹౹"


"ఒకచేత సుదర్శన చక్రము, వేరొకచేత పాంచజన్య శంఖము, ఇంకొక చేత లక్ష్మీదేవిని చుట్టి, తన ఎడమ తొడపై కూర్చుండబెట్టుకొని, తన కుడిచేతితో అశేష భక్తకోటికి అభయం ఇస్తూ దర్శనం ఇచ్చే శ్రీ లక్ష్మీ నరసింహా!..నాకు చేయూత నివ్వు!!" 


అని శ్రీ ఆదిశంకరాచార్యులు చేసిన స్తోత్రం లోని శ్లోకాన్ని గుర్తుచేసుకుంటూ..శ్రీ స్వామివారు మాలకొండ కు చేరి, ముందుగా ఆ లక్ష్మీనృసింహుడి సన్నిధిలో కొంత సేపు గడిపారు..మాలకొండ లో ఉగ్రరూపంతో వుండే ఆ లక్ష్మీ నరసింహుడు..ఈ యువక యోగి పట్ల ప్రసన్నుడై..తన అక్కున చేర్చుకున్నాడు..


శ్రీ స్వామివారు మాలకొండలోనే ఉత్తరంగా కొద్దిగా దిగువున, రెండు పెద్ద బండరాళ్లు చీలి ఏర్పడిన దారితో, ఒకే పెద్ద గొడుగు లాటి రాతి కింద వున్న శివాలయం వద్దకు వచ్చారు..ఆ శివాలయానికి మరికొద్ది దిగువున ఉన్న పార్వతీదేవి మఠం చూసారు..తన ఆవాసానికి ఆ అమ్మవారు కొలువైయున్న మఠం సరైనదని నిర్ణయానికి వచ్చారు..శివాలయం..దానిపైన వున్న రాతి గుహలు తన తపస్సుకు అనువైన ప్రాంతాలని నిర్ధారించుకున్నారు..


ఒకవైపు సాక్షాత్తూ వైష్ణవావతారం నృసింహుడు..మరో ప్రక్క ఆది దంపతులైన శివ పార్వతులు..తనకు ఇంతకంటే రక్షణ ఇచ్చే ప్రదేశం మరోటి ఎక్కడుంది?..ఇది తన మోక్షమార్గాన్వేషణలో మరో మజిలీ..ఇప్పటిదాకా తాను చేసిన సాధన ఒక ఎత్తు..ఇక చేయబోయేది మరో ఎత్తు!..గురువు బాలబ్రహ్మం చెప్పినట్లు, ప్రకృతి అనుక్షణం మాయను ప్రదర్శిస్తుంది..అందులో చిక్కకుండా ఏకాగ్రచిత్తంతో సాధన చేయాలి..ఎల్లవేళలా జాగురూకత తో ఉండాలి..దేహాభిమానాన్ని త్యజించాలి..మమకారాన్ని మనసులోంచి తుడిచివేయాలి..తానింతకాలం ఏ మోక్షం కోసం తపించి సాధన చేస్తున్నాడో అందుకు అనువైన ప్రదేశం కూడా లభించిందని సంతోషపడ్డారు..


పార్వతీదేవి మఠం లో నివాసం ఏర్పరుచుకున్నారు..మితాహారం భుజించడం..సాధన చేసుకోవడం..ఇవి రెండే కార్యక్రమాలు..మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం నాడు మాత్రమే భక్తుల కొరకు తెరచి ఉంటుంది..ఆ ఒక్కరోజు శ్రీ స్వామివారు శివాలయం పైనున్న గుహలలోకి వెళ్లిపోయేవారు..అక్కడ ఏకాంతంలో తపోసాధన చేసుకునేవారు..మిగిలిన ఆరు రోజులూ నరసంచారం వుండదు కాబట్టి, ఎక్కువభాగం శివాలయం లోనే తన తపస్సు కొనసాగించేవారు..


కానీ..కుతూహలం తో కూడిన మానవులున్న లోకం ఇది..ఎవరో యువక యోగి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడని..మాలకొండ క్రింద ఉన్న గ్రామస్థులు పసిగట్టేశారు..వాళ్ళు కొండపైనున్న అడవి కర్రలు ఏరుకొచ్చి అమ్ముకునే వాళ్ళు..శ్రీ స్వామివారు శివాలయానికి వెళ్ళేటప్పుడు..తిరిగి పార్వతీదేవి మఠానికి వచ్చేటప్పుడు గమనించడం మొదలెట్టారు..వాళ్లలో వాళ్ళు శ్రీ స్వామివారి గురించి చర్చించుకోవడం కూడా జరుగుతోంది..శ్రీ స్వామివారిని చూసినప్పుడు పలకరించడం చేయసాగారు..తాను మౌనం లో వున్నప్పుడు చిరునవ్వే వారికి సమాధానం!..మౌనం వీడినప్పుడు..ముక్తసరిగా సమాధానం చెప్పి, వారిని పంపించివేసేవారు..ఇలా కాలం గడచిపోతోంది..


మాలకొండకు పశ్చిమంగా కొంత దూరం లో కంబాలదిన్నె అనే గ్రామం ఉంది..ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చెక్కా కేశవులు గారు వైశ్య కులస్థుడు.. ఆయన మాలకొండ లక్ష్మీనృసింహ స్వామి వారి భక్తుడు..విజయవాడ లో వ్యాపారం చేస్తున్నారు..తన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నప్పుడల్లా మాలకొండకు వచ్చి, శ్రీ లక్ష్మీనృసింహ స్వామి దర్శనం చేసుకొని వెళుతూవుండేవారు..అదొక నియమం తో కూడిన ప్రక్రియ వారికి..అలా వస్తూ పోతున్న సమయం లో ఒకసారి శ్రీ స్వామివారిని చూడటం తటస్థించింది..శ్రీ స్వామివారిలో ఉన్న తేజస్సు, చెక్కా కేశవులు గారిని కట్టిపడేసింది..క్రమంగా శ్రీ స్వామివారిని తరచూ చూడటం..మెల్లిగా పలకరించడమూ చేశారు..శ్రీ స్వామివారు సైతం చెక్కా కేశవులు గారితో మాట్లాడారు..కేశవులు గారికి నమ్మకం కలిగింది..శ్రీ స్వామివారు, ఇలా ఎటువంటి సరంజామా లేకుండా..భూశయనం చేయడం..కేశవులు గారికి నచ్చలేదు..శ్రీ స్వామివారు నెత్తి నోరు కొట్టుకొని వారిస్తున్నా వినకుండా..ఒక ఇనుప మంచాన్ని, దోమతెరను..కప్పుకోవడానికి దుప్పట్లు వగైరా అంతా పార్వతీదేవి మఠం కు చేర్చారు..


"నాయనా!..ఇవన్నీ నాకు వద్దు..నేను సర్వసంగపరిత్యాగిని..అన్నీ వదిలేసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను..నన్ను మళ్లీ సంసారబంధం లోకి లాగకు..నీ కోరిక ఏమిటి?.." అని లాలనగా అడిగారు..


చెక్కా కేశవులు గారు చాలాసేపు తటపటాయించి..ఎట్టకేలకు తన మనసులోని కోరికను బయటపెట్టారు..విన్న స్వామివారు ఫక్కున నవ్వారు..


చెక్కా కేశవులు గారి అనుభవం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).