Mantra - 31 ARUNAM 4 anuvaakam
అజ్ఞానమనే పొర నీ కంటిని కప్పి ఉంచినంత కాలం నీకు సత్యం కనిపించదు. సాధన ద్వారా ఆ పొరను తొలగించుకున్నప్పుడు, నీ బుద్ధి నిర్మలమై (విప్రసన్నే), నీవు ఏకత్వాన్ని దర్శిస్తావు అని పూర్వ మంత్రం ఉపదేశిస్తే, ఈ క్రింది మంత్రం సూర్యుడిని జీవన ప్రదాతగా కొలుస్తుంది.
"కనకాభాని వాసాగ్ంసి।
అహతాని నిబోధత|
అన్నమశ్నీత మృజ్మీత।
అహం వో జీవనప్రదః||”
ఇది సూర్యారాధనలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణించ బడుతుంది. ఎందుకంటే ఇది భగవానువాచ. పరమాత్మ స్వయంగా చెప్పిన మాట ‘వలే’ ఈ మంత్రంలో ఉంది. ఇక్కడ సూర్య భగవానుడు స్వయంగా మానవాళికి తన ఉనికిని, రక్షణను మరియు జీవనాధారాన్ని వివరిస్తున్నట్లుగా ఉంటుంది.
‘కనకాభాని వాసాగ్ంసి’ - సూర్యుడు అంటున్నాడు - "’నేను బంగారు కాంతితో మెరిసిపోయే వస్త్రాలను ధరించిన వాడిని’ అని. ఇక్కడ వస్త్రాలు అంటే సూర్యుడి చుట్టూ ఉండే కిరణాలు లేదా ఆయన తేజస్సు అని అర్థం. సూర్యుడు బంగారు రంగులో ప్రకాశిస్తూ లోకాన్ని కప్పుతాడు.
“అహతాని నిబోధత” - ఆ సూర్యుని వస్త్రాలు (కాంతి పుంజములు) ఎప్పటికీ చెక్కుచెదరనివి (అహతాని - కొత్తవి లేదా నశించనివి) అని తెలుసుకోండి. సూర్య కాంతి ప్రతిరోజూ నూతనంగా, స్వచ్ఛంగా ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన కాంతిని గుర్తించమని (నిబోధత) వేదం చెబుతోంది.
"అన్నమశ్నీత మృజ్మీత” - సూర్యుడు అంటున్నాడు - ‘అన్నాన్ని భుజించండి, పరిశుద్ధులుగా ఉండండి’ అని. (మృజ్మీత - స్నానాదుల ద్వారా లేదా అంతఃశుద్ధి ద్వారా నిర్మలమవ్వడం)’. భగవంతుడు ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరిస్తూ, శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవాలని దీని అర్థం.
“అహం వో జీవనప్రదః" - సూర్య భగవానుడు స్వయంగా చెపుతున్నాడు - ‘నేనే మీకు జీవనాన్ని ప్రసాదించేవాడిని’ - అని. సూర్యుడు లేనిదే సృష్టిలో ప్రాణం లేదు. ఆయనే సకల ప్రాణకోటికి ఆహారాన్ని (photosynthesis ద్వారా), శక్తిని, ఆయుష్షును ఇచ్చే 'జీవనదాత'.
ఈ మంత్రం సూర్యుడిని 'ప్రత్యక్ష నారాయణుడు' గా స్థాపిస్తుంది. మనం తినే అన్నం (Energy) సూర్యుడి నుండే వస్తుంది కాబట్టి, ఆయనకు కృతజ్ఞతగా ఈ మంత్రాన్ని పఠిస్తాము. సూర్యుడు - జీవనదాత.
‘మృజ్మీత’ అనే పదం కేవలం బాహ్యమైన స్నానమే కాకుండా, సూర్యరశ్మి ద్వారా కలిగే ఆరోగ్య శుద్ధిని కూడా సూచిస్తుంది. ఆరోగ్యం మరియు శుద్ధి కారకుడు.
అరుణప్రశ్నలోని ఈ మంత్రాలను చదువుతున్నప్పుడు, సూర్యరశ్మి మన శరీరంపై ప్రసరించేలా చూసుకుంటే అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా (ప్రాణశక్తి మరియు Vitamin D) ఎంతో మేలు జరుగుతుందని సదాచార సంపన్నులు అందరూ చెబుతుంటారు. భౌతిక భావన చూసాము. ఇంక…
తత్వాన్ని విచారిస్తే…
అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం జీవుడికి మరియు పరమాత్మకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తుంది:
‘కనకాభాని’ - హిరణ్మయ పురుషుడు, -
బంగారం ఎలాగైతే స్వచ్ఛతకు, వికార రహిత తత్వానికి సంకేతమో, పరమాత్మ కూడా అలాగే ఉంటాడు. ఉపనిషత్తులు పరమాత్మను 'హిరణ్మయ పురుషుడు' (బంగారు కాంతి గలవాడు) అని వర్ణిస్తాయి. ‘హిరణ్మయః పురుషుః’ - నారాయణోపనిషత్; హిరణ్మయేన పాత్రేణ - ఈశావాస్యోపనిషత్)
ఇక్కడ 'వస్త్రాలు' అంటే సూర్యుడి కిరణాలు మాత్రమే కాదు, సృష్టిలోని అనంతమైన శక్తులు.
అద్వైత దృష్టిలో, బంగారం నుండి తయారైన నగలు ఎలా బంగారమే అవుతాయో, ఆ హిరణ్మయ పురుషుడి నుండి వచ్చిన ఈ జగత్తు కూడా ఆ పరమాత్మ స్వరూపమే.
‘అహతాని’ - అవ్యయ తత్వం - 'అహత' అంటే దెబ్బతిననిది లేదా చిరగనిది. లౌకికమైన వస్త్రాలు పాతబడిపోతాయి, కానీ సూర్యుడి ప్రకాశం లేదా పరమాత్మ చైతన్యం ఎప్పటికీ పాతబడదు. అది నిత్య నూతనం. ‘నిబోధత’ అని అనడం ద్వారా—బయట కనిపించే అనిత్యమైన వస్తువుల మీద కాకుండా, ఎప్పటికీ నశించని (అహత) ఆత్మ తత్వం మీద దృష్టి పెట్టమని వేదం బోధిస్తోంది.
‘అన్నమశ్నీత మృజ్మీత’ - ఉపాధి ధర్మం - అద్వైతం ప్రపంచాన్ని మిథ్య అని చెప్పినా, శరీరమనే ఉపాధిని నిర్లక్ష్యం చేయమని చెప్పదు. ‘అన్నమశ్నీత’ (అన్నం తినండి) అంటే దేహాన్ని సక్రమంగా (bare minimum) ఉంచుకోమని అర్థం. ఎందుకంటే *శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం*—ఆత్మ విచారణ చేయాలన్నా ఈ శరీరం ఒక సాధనం. ‘మృజ్మీత’ అంటే శుద్ధి. కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, జ్ఞానమనే నీటితో అంతఃకరణను (మనస్సును) శుద్ధి చేసుకోవడం. శుద్ధమైన మనస్సులోనే సత్యం ప్రతిబింబిస్తుంది.
‘అహం వో జీవనప్రదః’ - అద్వైత సిద్ధాంతం ప్రకారం,
ఇక్కడ 'అహం' Pure I, Pure consciousness, నేను - అనేది సూర్యమండల మధ్యవర్తి అయిన పరమాత్మను సూచిస్తుంది. అద్వైతంలో 'అహం' అంటే పరిమితమైన అహంకారం (ego) కాదు, అది సర్వవ్యాప్తమైన 'నేను' (The Universal Self).
‘మీ అందరికీ జీవనాన్ని ఇచ్చేది నేనే’ అని చెప్పడం ద్వారా - జీవుడిలో ఉన్న ప్రాణ శక్తి, పరమాత్మ చైతన్యం కంటే వేరు కాదని స్పష్టమవుతోంది. సూర్యుడు లేనిదే ప్రాణం లేదు, ఆత్మ లేనిదే ఉనికి లేదు.
బంగారు కాంతితో నిరంతరం వెలిగే ఆత్మ వస్త్రం (చైతన్యం) నీలోనే ఉంది. నీవు తీసుకునే అన్నం, నీవు చేసే కర్మలు అన్నీ ఆ పరమాత్మ శక్తి వల్లే సాధ్యమవుతున్నాయి. నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు. ఆ ఏకత్వాన్ని గుర్తించి, పరిశుద్ధమైన మనస్సుతో జీవించు అని మంత్ర భావన. ఈ చిన్న మంత్రంలో ఊహకి అందని భావం ఎంత ఉందో కదా!