4, ఫిబ్రవరి 2025, మంగళవారం

హిందూ వివాహప్రక్రియలో

 🙏హిందూ వివాహప్రక్రియలో ముఖ్య ఘట్టాలు 🙏

                         రెండవ భాగం 

మంగళసూత్రం:- సకల మంగళాలకు ఆలవాలమైన సూత్రం మంగళసూత్రం. పరిణయ బంధానికి చిహ్నం ఈ సూత్రం. ఉభయకుటుంబాల వంశాచారానికి తగినట్లు తయారుచేసిన బంగారు మాంగళ్యాలను పసుపుత్రాటితో గ్రుచ్చి మంగళదేవత గౌరీదేవి, లక్ష్మీదేవిలను ఆవాహనం చేస్తూ పూజించిన తర్వాత పురోహితుడు, పెద్దలు, ముత్తైదువలు శుభాన్ని కాంక్షిస్తూ మంచిహృదయంతో దానిని తాకుతారు. అటుపై వరుడు వధువు మెడలో వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలనడుమ పెద్దల ఆశీర్వాదముల సాక్షిగా ఈ మంత్రాన్ని చెప్తూ -

"మాంగల్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతమ్ "


భావం:- నా సుఖజీవనానికి హేతువులైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవూ నూరేళ్ళు వర్ధిల్లు. అని మూడు ముళ్ళు వేస్తాడు.

తలంబ్రాలు:- వధూవరులు ఒకరితలపై మరొకరు పసుపుతో తడిపిన లేక తెలుపు అక్షితలను దోసిళ్ళతో పోసుకోవడంను తలంబ్రాలు అంటారు. ఇక్కడ చెప్పే మంత్రాలలో కూడా ఓ పరమార్ధముంది. వరుడు వధువు దోసిట్లో ఎండుకొబ్బరిచిప్పతో అక్షతలను పోసి నేతితో ప్రోక్షిస్తాడు. తర్వాత పురోహితుడు వరుని దోసిట్లో అదే మాదిరిగా అక్షితలను పోసి నేతితో ప్రోక్షించి వధువుదోసిలిపై వరునిదోసిలి పెట్టి ఈ మంత్రాలను చదువుతాడు -

కపిలాగ్o స్మారయన్తు, బహుదేయం చాస్తు, పుణ్యం వర్ధతామ్, శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, దంపత్యో: సగ్రహే సనక్షత్రే సహా సోమేన క్రియేతాం, శాంతి రస్తు.

భావం:- కపిలవర్ణ ఆవులను స్మరించండి, అనేక దానాలను చేయండి, పుణ్యం వృద్ధిపొందాలి, శాంతి పుష్టి తుష్టి వృద్ధి కలగాలి, విఘ్నాలు తొలగిపోవాలి, ఆయుస్సు ఆరోగ్యం కలగాలి, క్షేమం మంగళం కలగాలి, సత్కర్మలు వృద్ధి పొందాలి, గ్రహాలవలన నక్షత్రాలు వలన సోమునివలన దాంపత్యం సరిగా జరగాలి. శాంతి కలగాలి. 

ఆపై వరుడు 'ప్రజామే కామ స్సమృధ్యతామ్' (నేను కోరే సంతానం సమృద్ధిగా ఉండాలి) అని అంటూ వధువుతలపై తలంబ్రాలు పోస్తాడు. అటుపై వధువు 'పశవో మే కామ స్సమృధ్యతామ్' (వారి పోషణకై నేను కోరిన పశు సమృద్ధి ఉండాలి) అని అంటూ వరునితలపై తలంబ్రాలు పోస్తుంది. 'యజ్ఞో మే కామ స్సమృధ్యతామ్' ( నేను కోరిన త్యాగం సమృద్ధిగా ఉండాలి) అని మరల వరుడు తలంబ్రాలు వేస్తాడు. ఇలా వధూవరులు బాసలు చేసుకుంటూ ఆనందంతో ముచ్చటగా మూడుసార్లు పోసుకున్నతర్వాత ఇద్దరు కలిసి 

'శ్రియో మే కామ స్సమృధ్యతామ్' (మాకు కావాల్సిన సిరిసంపదలు సమృద్ధిగా ఉండాలి) 'యశో మే కామ స్సమృధ్యతామ్' (మేము కోరిన కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా ఉండాలి) అని అంటూ ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు. 

బ్రహ్మముడి:- వధువు చీరఅంచును వరుని ఉత్తరీయంఅంచును కలిపి ముడివేయడంను బ్రహ్మముడి అంటారు. పురోహితుడు ఇద్దరి కొంగులు ముడివేస్తూ ఈ మంత్రాన్ని చెప్తాడు -

'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి: / ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్ //

భావం:- దాంపత్యసామ్రాజ్యాన్నిఅనుభవించే మీకు, రాజైన వరుణుడు, దేవుడు బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని నిశ్చలత్వాన్ని కలగజేయాలి. 


పాణిగ్రహణం:- వివాహమందు ఇదీ ఓ ప్రధానఘట్టమే. వధూవరులు పరస్పరం ఒకరిచేతిని ఒకరు పట్టుకుంటారు. 'నా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు సవిత అనే దేవతలు నా గృహస్థాశ్రమం కోసం నిన్ను గృహిణిగా చేస్తున్నారు అని అంటూ వధువుకు తన కుడిచేతిని అందిస్తాడు. వధువు వరునిచేతిని పట్టుకోవడంలో కూడా ఓ విశేషత ఉందని పెద్దలు చెప్తుంటారు. మొదట మగపిల్లవాడు కావాలంటే వరుడి బొటనవేలు మాత్రమే వధువు పట్టుకోవాలి. చిటికినవేలు పట్టుకుంటే ప్రధమ సంతానం ఆడపిల్ల అవుతుందని అంటారు. అందుకే ఆడమగ సంతానం అభిలాషిస్తూ అన్నివేళ్ళు కలిపి పట్టుకోమని అంటుంటారు.

సప్తపది:- పాణిగ్రహణం చేసిన తర్వాత వరుడు వధువుతో కల్సి తూర్పుకుగాని, ఉత్తరందిశగా గాని ఏడడుగులు వేయడాన్నే సప్తపది అంటారు. దీనివలన ఇద్దరిమద్య స్నేహబంధం ఏర్పడుతుంది. ఇక్కడ వరుని వెంట వధువు వేస్తున్న ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క ప్రయోజనం వుందని వరుడు వధువుకి ఇలా వివరిస్తాడు - నీవు నా వెంట నడు. విష్ణుమూర్తి, నీవు నాతో వేసిన మొదటి అడుగు వలన అన్నాన్ని, రెండవఅడుగువలన బలాన్ని, మూడవఅడుగువలన మంచికార్యాలను, నాల్గోఅడుగువలన సౌఖ్యాన్ని, ఐదోఅడుగువలన పశుసమృద్ధిని, ఆరోఅడుగువలన రుతుసంపదలను, ఏడోఅడుగువలన ఏడుగురు హోతలను నీకు అనుగ్రహించుగాక! 

ఏడడుగులు వేసిన తర్వాత వరుడు వధువుతో మరల ఇలా అంటాడు...

                     సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్

 


శ్రీభారత్ వీక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే మనిషికే కాదు, ఏ ప్రాణికైనా  ఆరోగ్యాన్నిచ్చేది ఆ సూర్యుడే. సూర్య రశ్మి సోకితేనే చైతన్యం మొదలవుతుంది. అందుకే సూర్యుని ప్రత్యక్ష దైవం అంటారు. రథసప్తమి సూర్యుని పూజించే పండుగ. నిత్యం పూజించినా, రథసప్తమి వ్రతం చేసే రోజు ఇది. ఆ వ్రత విశేషాలను, సూర్య మహిమను చక్కగా వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. సూర్యునికి ఎన్ని పేర్లు ఎలా వచ్చాయో కూడా వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

వరమౌ లోకహితార్థ

 మ.వరమౌ లోకహితార్థ దీక్షలవి సంభావింప నేకాగ్రతన్

తరియింపం జను పాప పంకిలపు నంతస్తాప దౌర్గత్య దు

ర్భర దారిద్ర్యపు వేదనల్ హితమతిన్ వర్ధిష్ణులం గొల్వ నె

త్తరి మేలుం దగఁ గూర్చ నెంచుట మహద్భాగ్యంబునౌ భారతీ!౹౹25 


శా.నేరారోపిత శిక్షయే వినుతమౌ నిత్యార్థ సంసిధ్ధిగన్

భారమ్మయ్యెడు చండ పాశమె ఘన స్వాతంత్ర్య రోచిస్సుగన్

కారాగార నివాసమే విదిత సత్కార్యాళి ప్రాప్తింగనన్ 

పోరాటమ్మును జేసినట్టి మణులన్ పూజించెదన్ భారతీ!౹౹ 26

తలచిన తక్షణమ్మె

 చ.తలచిన తక్షణమ్మె తమ ధారణఁ గల్మిని  చాతురి ప్రభా 

కలిత మనస్కులై వినుత గమ్యముఁ జేరు తెలుంగు తేజముల్

లలిత హితార్థ  సన్మతి విలక్షణమౌ బహుళార్థ సాధన

మ్ములఁ గనిపెట్టి గాంచెదర పూర్వ మహోన్నత కీర్తి భారతీ!౹౹ 23


మ.మహనీయుల్ తమ జీవితమ్ములను సన్మార్గైక లక్ష్యమ్ముతో

బహుళార్థమ్ము లొసంగ నెంచి భువి నిస్వార్థైక యత్నమ్ములన్

విహితమ్మైన విశిష్ట యోచనల దీప్తిన్  సత్య ధర్మమ్ములన్

సహనమ్మున్ మది నమ్మి కూర్చిరి ఘన స్వాతంత్ర్యమున్ భారతీ!౹౹ 24

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - సప్తమి - అశ్వనీ -‌‌ భౌమ వాసరే* (04.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కోతి ఉపవాసం

 కోతి ఉపవాసం ........... [నాకొక పాఠం ]



ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పరవదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయటానికి నిశ్చయించుకుంది.పని అంతా పూర్తి చేసుకుంది. కూర్చొని జపం మొదలుపెట్టింది.


ఉన్నాట్టుండి దానికొక సందేహం వచ్చింది .ఈరోజంతాఉపవాసం ఉండి జపం చేస్తుంటే,రేపు నాకు చాలా నీర్సంగా వుంటుందేమో! అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే ! ఎలా? ఏమీ చెయ్యలేనేమో ?

ఈ ఆలోచన వచ్చాక ,కోతి జపం చేయటం ఆపింది. అప్పటికప్పుడు లేచి చెట్టూపుట్టా గాలించి మరుసనాటికి సరిపడే ఆహారాన్ని సేకరించింది. దానిని ఒక మూల భద్రపరచింది.మళ్ళీజపం కొనసాగించింది.

మరికొంత సేపటికి కోతికి ఇంకో ఆలోచనవచ్చింది. "రేపు నీరసం వల్ల నేను నడవలేక పోతేనో? ఆహారం ముందేవుంచుకుని కూడా ఆకలితో అలమతించి పోతాను కాబోలు! ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడి పోయింది.

వెంటనే లేచింది. ఆహారాన్ని తన చేతికి అందుబాటులో వుంచుకుంది. మళ్ళీ జపం ఆరంభించింది.

ఆకోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. "ఒకవేళ నేను మరీ నీరసించి పోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెటుకోలేక పోతేనో" అంటూ జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే వుంచుకుని ఉపవాసం చేయాలనుకుంది. ఆవిధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది. కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలాచేస్తుంది?

చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది."భోజనం నోట్లో వుంచుకోవడం ఎందుకు?ఇప్పుడైతే ఏమిటి ?రేపైతే ఏమిటి? ఎలాగూ అది నేను తినవలసినదేకదా! అందువల్ల ఈఆహారాన్ని ఇప్పుడే తినేసి కూర్చుని,సుఖం గా జపం చేసుకుంటాను." అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్పాఅలోచనకు ఎంతగానో మురిసి పోయింది. ఆహారం తీసుకుంది.నిద్ర ముంచుకొచ్చింది. స్వామీజీ ఉపన్యాసం మరచిపోయింది. పక్కపరుచుకుంది. హాయిగా నిదురపోయింది.



[ఈరోజు పిల్లలకు ఈకథచెబుతుంటే ,ఎందుకో ఎవరో చర్నాకోలతో కొట్టినట్లు చురుక్కుమన్నది. నాసాధనకూడా ఇంతేనేమో నని.]