20, ఏప్రిల్ 2021, మంగళవారం

తపశ్శక్తి

 *తపశ్శక్తి...!*

                  ➖➖➖✍️



*మనిషి స్వప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెబుతారు పెద్దలు.*


*తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెబుతాయి*


*నరనారాయణులు సైతం తపస్సు ఆచరించారట.*


*పరమశివుణ్ని పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భువికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సు చేసి సాధించారని మన పురాణాలు చెబుతాయి.*


*రామ నామం రామ పాదం రామ కార్యాలనే తపస్సుగా చేసుకుని, ఒక వానరుడు సముద్రాన్నే లంఘించగలిగాడు.*


*సీతాన్వేషణలో సఫలమై రావణ వధకు నాంది పలికాడు. రుద్రావతారుడిగా కీర్తి గడించాడు. హనుమ అనే ఈ వానర వీరుడి సుందర లీలల వర్ణనే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకత సంతరించుకుంది.*


 *పఠించిన ఉత్తర క్షణం భక్తులను అనుగ్రహించే పారాయణ గ్రంథమైంది. మహిషాసుర, భస్మాసుర, హిరణ్యకశిపుల వంటి ఎందరో రాక్షసులూ ఘోర తపస్సుతోనే శక్తులను, వరాలను పొందగలిగారు.*


✅*తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం.*✅


*మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది.*


*మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా పెద్దలు చెబుతారు. *


*ఒక వస్తువుపై మనసున నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది.*

 

*మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది.*


*మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.*


*మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య.*


*మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది.*


*మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి. బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.*


*మనిషిలోని మనోబలాన్ని,సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి- అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది. *


*లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది.*


*మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.*


*తపస్సు,తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం.*


*దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే.*


*చిత్తశుద్ధి కోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతీపని తపస్సే అవుతుంది. సాధనా తపస్సే, సేవా తపస్సే.*


*తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే. మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి. మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి...✍️*

           *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                           🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

కన్యాశుల్కం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

   *తొలి తెలుగు నాటకం*    

       *‘కన్యాశుల్కము'* 

               🌷🌷🌷

🚩

అభినవ ఆంధ్ర సాహితీ వైతాళికుడు, తెలుగు కథ

ఆద్యుడు #గురజాడ అప్పారావు గారు (21-09-1862 & 30-11-1915) పూర్తిస్థాయి వాడుక భాషలో రాసిన తొలి తెలుగు నాటకం ‘కన్యాశుల్కము’.   ప్రపంచ నాటకాల్లో కన్యాశుల్కానికి ఒక ప్రముఖ స్థానం ఉంది.


🚩

 *‘కన్యాశుల్కముకథ !* 


#విజయనగరంలో #మధురవాణి అనే వేశ్య బహుజాణ.  ఆమెకన్నా జాణతనం కలిగిన #గిరీశం అనే ఇంగ్లీషు చదువుకున్న జిత్తులమారి యువకుడు ఒక పూటకూళ్లమ్మ ఇంట్లో వుంటూ మధురవాణితో స్నేహం కలుపుతాడు. రామచంద్రాపురం అగ్రహారంలో పెద్దమనిషిగా చలామణి అయ్యే#రామప్పంతులు బ్రహ్మచారి, వేశ్యాలోలుడు. మధురవాణి దగ్గరకి వస్తుంటాడు.  అదే ఊళ్లో # *లుబ్ధావధానులు* అనే అరవయ్యేళ్ల లక్షాధికారి ఉన్నాడు.  అతని డబ్బు గుంజే ప్రయత్నంలో రామప్పంతులు అతనిని పునర్వివాహం చేసుకోమని వుసిగొల్పుతాడు. వార్ధక్యంలో పెళ్లెందుకని కూతురు మీనాక్షి వారించినా లుబ్దావధానులు వినడు.  ఆ రోజుల్లో డబ్బులకు ఆశపడి, కన్యాశుల్కము పుచ్చుకొని నోరెరుగని బాలికలను భార్యలేని ముసలివాళ్లకు కట్టబెట్టడం పరపాటి. కృష్ణరాయపుర అగ్రహారంలో వుండే #అగ్ని హోత్రావధానులు అలా పిల్లల్ని అమ్ముకోవడంలో ఘనాపాఠి. అతని పెద్దకూతురు బుచ్చమ్మ చిన్నప్పుడే భర్తను కోల్పోయింది.  చిన్నకూతురు సుబ్బమ్మకు తొమ్మిదేళ్లు. ఆ పిల్లను పద్దెనిమిది వందల కన్యాశుల్కానికి రామప్ప పంతులు ద్వారా లబ్ధావధాన్లకు అమ్మడానికి అగ్నిహోత్రావధానులు నిశ్చయిస్తాడు. అమాయకురాలైన అతని భార్య వెంకమ్మ అడ్డుపడి పోట్లాడుతుంది.  అయినా ఖాతరు చెయ్యడు.


విజయనగరంలో అప్పులబారి నుండి విముక్తి కాలేక, జిత్తులమారి గిరీశం తన వద్ద ఇంగ్లిష్‌ పాఠాలు నేర్చుకునే అగ్నిహహోత్రవధానులు కొడుకు వెంకటేశంను తీసుకొని కృష్ణరాయపుర అగ్రహారం చేరుకుంటాడు. వాళ్ల ఇంట్లో వున్న విధవరాలైన బుచ్చమ్మను చూసి మోహించి ఆమెను లేవదీసుకెళ్లి వివాహం చేసుకోవాలని పన్నాగం పన్నుతాడు.  ఇంతలో అగ్ని హోత్రావధానులు భార్య ‘‘పుత్తడిబొమ్మ పూర్ణమ్మ’ అనే వీధి గాయకుల పాటవిని, తన చిన్న కూతురు బ్రతుకు కూడా విధవరికానికే దారితీస్తుందని దుఃఖించి నూతిలో పడుతుంది.  అక్కడే వున్న గిరీశం ఆమెను రక్షిస్తాడు.  ఈ విషయం అగ్నిహోత్రావధానులు బావమరిది కరటకశాస్త్రికి తెలిసి ఎలాగైనా బాల్యవివాహాన్ని ఆపి, కన్యాశుల్కము రాబట్టాలనే బావగారి ఆశలకు చరమగీతం పాడాల్సిందేనని నిశ్చయిస్తాడు.  స్వయంగా రంగస్థల నటుడు కావడంతో మధురవాణి సహకారంతో తన శిష్యుడు మహేశంకు ఆడపిల్ల వేషం వేసి రామప్పంతులు వద్దకు తీసుకెళ్లి అతనికి లంచమిస్తానని ఆశపెట్టి, అగ్నిహోత్రావధానుల అమ్మాయితో నిశ్చయించిన పెళ్లిని ఆపించమని అందుకు ప్రతిగా ఆడవేషంలో ఉన్న మహేశంతో వివాహం జరిపించమని నాటకమాడుతాడు.  మధురవాణి రంగంలోకి దూకి మహేశంతో పెళ్లి తంతు జరిపిస్తుంది. లుబ్ధావధానులకు అసలు విషయం తెలిసి పశ్చాత్తాపం చెందుతాడు.  ఇదే అదునుగా గిరీశం బుచ్చమ్మను లేవదీసుకొని విశాఖపట్నం చేరుకొని సౌజన్యరావు (గుమ్మడి) అనే సంస్కారవంతుడైన వకీలును కలిసి సాయం కోరతాడు. ఈలోగా వీరిని వెదుక్కుంటూ అందరూ విశాఖపట్నం చేరుకుంటారు.  మధురవాణి జరిగిన విషయాన్ని సౌజన్యరావుకు విశదీకరిస్తుంది.  సౌజన్యరావు గిరీశాన్ని మందలించి

వెళ్ళ గొడతాడు

 *"డామిట్ కధ అడ్డం తిరిగింది"* అంటూ గిరీశం నిష్క్రమిస్తాడు.

🚩

తెలుగునాట సాంఘిక నాటకం అంటే మొదట గుర్తొచ్చేది గురజాడ వారి కన్యాశుల్కం నాటకమే. కన్యాశుల్కం పేరు చెప్పగానే గుర్తొచ్చేది గిరీశం.


డామిట్ కధ అడ్డం తిరిగింది . (గిరీశం)


*తాంబూలాలు ఇచ్చేశాను ఇక తన్నుకు చావండి.* (అగ్నిహోత్రావధాన్లు),


*విద్యవంటి వస్తువు లేదు* (రామప్పంతులు),


*బుద్ధికి అసాధ్యం ఉందేమో కాని డబ్బుకు లేదు* (మధురవాణి), 

ఇలా ఎన్నో సంభాషణలు ఇప్పటికీ జనం నాలుకమీద ఆడుతూ ఉంటాయి.


ఆ నాటకానికే సినిమాకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి ‘కన్యాశుల్కం’ చిత్రాన్ని నిర్మించారు వినోదా సంస్థ అధినేత డి.ఎల్.  ఈ చిత్రానికి పి.పులయ్య దర్శకత్వం వహించారు. 1955 ఆగస్ట్ 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది.


*‘కన్యాశుల్కం’* నాటకం తెలుగువారు ఉన్న చోటల్లా పేరు సంపాదించుకుంది. ఈ నాటకంలో తొలి డైలాగ్ *‘సాయంత్రమయింది’* అన్నది, చివరి డైలాగ్ *‘డామిట్ కథ అడ్డంగా తిరిగింది’* అనేది. ఈ రెండూ గిరీశం నోట వెలవడతాయి. 

ఆ డైలాగులు తెలుగువారికి కంఠోపాఠంగా ఉండేవి.


🔻🔻🔻🔻🔻🔻🔻🔻

రామాయ‌ణం యుద్ధ కాండ‌*

 *రామాయణ దివ్యకథా పారాయణం*

*శ్రీ‌రామ‌న‌వ‌మి ప‌ర్విదినం వ‌ర‌కు* 

          *8 వ  రోజు*


*రామాయ‌ణం యుద్ధ కాండ‌*

        🌸🌸🌸🌸🌸


శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం 

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి




ఆకాశాన్ని పోల్చడానికి ఆకాశమే సరి. సముద్రాన్ని

 సముద్రంతోనే పోల్చగలం. అలాగే రామ రావణుల యుద్ధాన్ని

 మరి దేనితోను పోల్చడానికి వీలు లేదట.


*గగనం గగనాకారం సాగరం సాగరోపమం*

*రామ రావణయోర్యుద్ధం రామరావణయోరివ*


*కుంభ‌క‌ర్ణుడి ప్ర‌వేశం*

అవమాన భారంతో కృంగిన రావణుడు తన సోదరుడైన కుంభకర్ణుని నిద్ర‌లేప‌మ‌ని మంత్రులను పంపాడు.  శూలాలతో పొడిచి, ఏనుగులతో త్రొక్కించి,  కుంభకర్ణుని నిద్ర‌నుంచి లేపారు. 

రావణుడు కుంభకర్ణుడికి జరిగిన విషయం వివరించాడు. అనాలోచితంగా రావణుడు చేసిన చెడ్డపనులను సోదర ప్రేమతో నిందించాడు కుంభకర్ణుడు. స‌రే జ‌రిగింది జ‌రిగిపోయింది, ఇక తాను రామలక్ష్మణులను, సకల వానర సేనను భక్షించి పరిస్థితిని చక్కదిదద్దుతానని, రావణుడికి మాట యిచ్చి, కోట గోడను ఒక్క అడుగులో దాటి యుద్ధానికి బయలుదేరాడు. ఆరు వందల ధనువుల యెత్తూ, వంద అడుగుల కైవారం ఉన్న ఆ మహాకాయుని చూస్తూనే వానర సేనలు పారిపోసాగాయి. ధైర్యం చెప్పి వారిని అతికష్టంమీద అంగదుడు నిలువరించాడు.

కుంభకర్ణుడు వానరులను కరకర నమలి మ్రింగుతూ, ఎండు అడవిని అగ్ని కాల్చినట్లుగా వానరసేనను నాశనం చేయసాగాడు. రామ లక్ష్మణుల బాణాలు కుంభకర్ణుని ఆయుధ విహీనుడిని చేశాయి. . రాముడు వాయువ్యాస్త్రంతోను, ఐంద్రాస్త్రంతోను వాడి చేతులు నరికేశాడు. రెండు మహిమాన్విత బాణాలతో తొడలు కూడా నరికేశాడు. అయినా నోరు తెరుచుకొని  వస్తున్న  కుంభ‌కర్ణుడిని ఐంద్రాస్త్రంతో చంపేశాడు. వాడు పర్వతంలా క్రిందపడ్డాడు. వాడి క్రింద పడి ఎందరో వానరులు, రాక్షసులు కూడా నశించారు.


హనుమ ఓషధి పర్వతాన్ని తెచ్చుట


పుత్రుల, సోదరుల మరణానికి చింతాక్రాంతుడై యున్న రావణుడికి ధైర్యం చెప్పి, ఇంద్రజిత్తు యుద్ధరంగానికి వెళ్ళాడు. హోమం చేసి అస్త్రాలను అభిమంత్రించి అదృశ్యరూపుడై వానర సేనను  చీల్చి చెండాడ సాగాడు. ఇక ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. దానితో అందరూ మూర్ఛిల్లారు. రామ లక్ష్మణ హనుమంతులు కూడా బ్రహ్మాస్త్రాన్ని మన్నించక తప్పలేదు. అందరూ మరణించారనుకొని సింహనాదం చేసి ఇంద్రజిత్తు విజయోత్సాహంతో లంకలోకి వెళ్ళాడు.


మృత ప్రాయులై ఉన్నవారిలో బ్రతికినవారికోసం విభీషణుడు, హనుమంతుడు వెదకసాగారు. అప్పుడు జాంబవంతుడు కొద్దిగా తెలివి తెచ్చుకొని "అంజనాకుమారుడు ఆంజనేయుడు చిరంజీవిగానే ఉన్నాడు గదా?" అని అడిగాడు. అలా అడిగినందుకు విభీషణుడు ఆశ్చర్యపడగా జాంబవంతుడు ఇలా అన్నాడు "హనుమంతుడు సజీవుడుగా ఉంటే వానరసేన చచ్చినా బతికి తీరుతుందన్నమాటే. దీనికి వ్యతిరేకంగా జరిగితే మేము బ్రతికిఉన్నా మృతులమే! వేగంలో వాయువుతోనూ, పరాక్రమంలో అగ్నితోనూ సరిసమానుడయిన హనుమంతుడుంటేనే మాకు ప్రాణాలపై ఆశ ఉంటుంది" అని జాంబవంతుడు అన్నాడు.  హిమాలయపర్వతం మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం మీది మృత సంజీవని, విశల్యకరణి, సౌవర్ణకరణి, సంధాన కరణి అనే ఔషధాలను తీసుకు రమ్మని హనుమను కోరాడు.


జాంబవంతుని కోరికపై హనుమంతుడు రామ చంద్రునికీ, సాగరునికీ నమస్కరించి, తానే ఒక పర్వతంలా పెరిగి సుదర్శనంలా ఆకాశంలోకి దూసుకుపోయాడు. ఆకాశమార్గాన సంజీవని పర్వతం మీదికి వెళ్లి ఓషధులకోసం వెదకసాగాడు. ఓషధులు కనిపించనందున హనుమ ఆ పర్వతాన్నే సమూలంగా ఎత్తిపట్టుకొని, నింగిలో మరో సూర్యునిలా, యుద్ధరంగానికి వచ్చాడు. రామ లక్ష్మణులూ, వానరులూ సృహలోకి వచ్చారు. విగతులైన వానరులు కూడా పునరుజ్జీవితులైనారు. అయితే ఎప్పటికప్పుడు మరణించిన రాక్షసులను సముద్రంలో త్రోసివేయమని రావణుడు ఆజ్ఞనిచ్చినందువలన రాక్షసులకు ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. తరువాత మళ్ళీ పర్వతాన్ని తీసికొని వెళ్ళి హనుమంతుడు యథాస్థానంలో ఉంచి వచ్చాడు.


*ఇంద్రజిత్తు మరణం*


రాక్ష‌స‌వీరులు వంద‌లు ,వేల కొద్ది మ‌ర‌ణిస్తుండ‌డంతో రావ‌ణుడు, 

 ఇంద్రజిత్తును ఆశీర్వదించి యుద్ధరంగానికి పంపాడు. హోమం చేసి, శస్త్రాస్త్రాలు ధరించి యుద్ధరంగానికి వచ్చి అదృశ్యరూపంలో వానరసేనను, రామలక్ష్మణులను కల‌వ‌ర‌పెడుతున్నాడు. లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం వేద్దామంటే రాముడు అతనిని వారించాడు. ఇంతలో దృశ్యరూపుడై మాయాసీత తలను అందరి యెదుటా తెగనరికాడు. అది చూసి అంతా శోకంలో మునిగిపోయారు. రావణుని తత్వం తెలిసిన విభీషణుడు అది కేవలం మాయ అని వారికి నచ్చచెప్పాడు. ఇంద్రజిత్తు నికుంభిలా యాగం చేయడానికి వెళుతున్నాడు. అతని చుట్టూ రాక్షసులు వ్యూహం తీరి కవచంలా ఉన్నారు.


యాగం చేయడడానికి ఇంద్రజిత్తు నికుంభిలకు వెళ్ళకుండా ఎవరు ఆపగలరో వారిచేతులోనే ఇంద్రజిత్తు చావు రాసిపెట్టి ఉందని విభీషణుడు అస‌లు ర‌హ‌స్యం చెప్పాడు. రాముని అనుజ్ఞ తీసుకొని, లక్ష్మణుడు ఆయుధ ధారియై, హనుమంతుని భుజాలపై కూర్చుని జాంబవంత, విభీషణ, అంగదాది వీరులతో కూడి నికుంభిలవైపు కదిలాడు. భయానక సంగ్రామానంతరం చుట్టూరా ఉన్న రాక్షసులను ఛేదించి ఇంద్రజిత్తును ఎదుర్కొన్నారు.  "ఇక్ష్వాకు వంశీయుడు రాముడు ధర్మస్వరూపుడూ, సత్యవ్రతుడూ అయితే ఈ మహేశ్వరాస్త్రం ఇంద్రజిత్తును వధించుగాక" అని సమంత్రకంగా ల‌క్ష్మ‌ణుడు అస్త్రాన్ని విడిచాడు. ఇంద్రజిత్తు తల తెగిపడింది. రాక్షసులు పారిపోయారు. వానరులు లక్ష్మణస్వామికి జయం పలుకుతూ  రాముని వ‌ద్ద‌కు  చేరుకొన్నారు.


*రామరావణ యుద్ధం ఆరంభం*


ఇంద్రజిత్తు మరణంతో రావణుడు తెలివితప్పి పడిపోయాడు. లేచి, కోపంతో సీతను చంప బోయాడు. సుపార్శ్వుడు అనే బుద్ధిమంతుడైన అమాత్యుడు అతనిని వారించి, వీరోచితంగా యుద్ధంచేసి విజయుడవు కమ్మని చెప్పాడు. ఇక రావణుడు అన్నింటికీ తెగించి సైన్యంతో ఉత్తర ద్వారంగుండా యుద్ధరంగంలో అడుగుపెట్టాడు.

మ‌రోవైపు వాన‌ర వీరులు  "శ్రీరామచంద్రునికి జయం", "లక్ష్మణునికి జయం", "సుగ్రీవునికి జయం", "ఆంజనేయునికి జయం", "అంగదునికి జయం", "జాంబవంతునికి జయం" అని పేరుపేరునా జయజయ ధ్వానాలు చేస్తూ, ఉత్సాహంతో పరవళ్ళు తొక్కుతూరాక్షసులనెదుర్కోవడానికి ముందుకు దూకారు.


లక్ష్మణ మూర్ఛ, మారుతి సేవ


రావణుడు తన వాడి బాణాలతో రామలక్ష్మణాదులను వేధించ సాగాడు. లక్ష్మణుడు రావణుని సారథి తల యెగురగొట్టాడు. ధనస్సు విరిచేశాడు. 

రావణుడు విసిరేసిన శక్తి , వక్షస్థలానికి తగిలి లక్ష్మణుడు మూర్ఛపోయాడు. సోదరుని అవస్థకు పరితపిస్తూనే ప్రళయాగ్నిలా రాముడు రావణునిపై బాణవర్షం కరిపించసాగాడు. కొంత సేపటికి శక్తి లక్ష్మణుని విడచిపెట్టింది. అప్పుడు రాముడు తనవారిని ఉద్దేశించి - "మీరు సౌమిత్రిని రక్షిస్తూ, యుద్ధం చూస్తూ ఉండండి. నేను రాముడంటే ఏమిటో చూపిస్తాను. జగత్తు అరావణం క‌నాలి" అన్నాడు. రామ రావణ సంగ్రామం చెలరేగింది. ఎంతో సమయం యుద్ధం చేసిన రావణుడు గాలిలోకి ఎగిరి మేఘంలోకి దూరిపోయి లంకలోకి వెళ్ళిపోయాడు.


యుద్ధభూమిలో అచేతనంగా పడిఉన్న లక్ష్మణుని చూసి రాముడు విలపించసాగాడు. లక్ష్మణుడు కేవలం మూర్ఛిల్లాడని ధైర్యం చెప్పి సుషేణుడు మరల హనుమను మళ్లీ గిరిశిఖరానికి వెళ్ళమన్నాడు. హనుమంతుడు గరుడగమనంతో వెళ్ళాడు. మూలికలను గుర్తించలేక పర్వతాన్నే పెకలించుకొని ఓషధులతో సహా తెచ్చేశాడు. సుషేణుడు మూలికలను ఏరి రసం తీసి లక్ష్మణుని నాలుకపై పోశాడు. తెలివి వచ్చిన లక్ష్మణుని రాముడు గుండెల‌కు హ‌త్తుకున్నాడు.. లక్ష్మణుడు లేచి నిలబడి,

 "అన్నా! ముందు నువ్వు ప్రతిజ్ఞ చెల్లించుకో.  అన్నాడు.

రాముడు చిరున‌వ్వు న‌వ్వాడు. కీల‌క ఘ‌ట్టంస‌మీపిస్తున్న‌ది.

వాన‌ర సేన జ‌య జ‌య‌ధ్వానాలు మిన్నుముట్టుతున్నాయి. యుద్ధం కొన‌సాగుతున్న‌ది..........


                 

 *రావణ సంహారం*


అదే సమయంలో ఇంద్రుడు పంపగా మాతలి దివ్యమైన రథంతో రాముడికి సారథిగా వచ్చాడు. అగ్ని సమానమైన కవచం, ఐంద్రచాపం, సూర్య సంకాశాలైన శరాలు, తీక్ష్ణమైన శక్తి కూడా ఆ రథంలో ఉన్నాయి. రాముడు సంతోషించి ప్రదక్షిణం చేసి రథం ఎక్కాడు. రావణుడు వజ్రసదృశమైన శూలాన్ని చేతబట్టి మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. రావణుడు విసిరేసిన శూలం ఎదురుపడి రాముని బాణాలు కాలిపోయాయి. అప్పుడు రాముడు మాతలి తెచ్చిన ఇంద్రశక్తిని విసిరేశాడు. అది రావణుని శూలాన్ని నిర్మూలించింది. రావణుడు కూడా శరపరంపరతో రాముని ముంచెత్తాడు. రాముడు విడచిన తీవ్ర బాణాలతో రావణుడి శరీరం రక్తసిక్తమయ్యింది. చివరకు అస్త్రవిహీనుడైన రావణుని పరిస్థితి గమనించి రావ‌ణుడిసారథి, రథాన్ని దూరంగా తీసుకుపోయాడు.


అగస్త్యుడు అక్కడికి వచ్చి యుద్ధ పరిశ్రాంతుడై యున్న రామునకు సనాతనము, పరమ రహస్యము అయిన "ఆదిత్య హృదయము"ను ఉపదేశించాడు.


*ఆదిత్య హృదయం పుణ్యం

 సర్వశత్రు వినాశనం ।

జయావహం జపేన్నిత్యం

 అక్షయ్యం పరమం శివం ॥


సర్వమంగళ మాంగళ్యం

 సర్వ పాప ప్రణాశనం ।

చింతాశోక ప్రశమనం

 ఆయుర్వర్ధన ముత్తమం ॥ 5 ॥


రశ్మిమంతం సముద్యంతం

దేవాసుర నమస్కృతం ।

పూజయస్వ వివస్వంతం

 భాస్కరం భువనేశ్వరం 


 సమస్త లోక సాక్షి అయిన సూర్యుని స్తుతించే ఆ మంత్రం జయావహం. అక్షయం. పరమ మంగళకరం. సర్వపాప ప్రణాశనం. చింతా శోకప్రశమనం. ఆయుర్వర్ధనం. సమస్త ఆపదాపహరణం. రాముడు ఆచమించి ఆ మంత్రరాజాన్ని మూడు మార్లు జపించాడు. జ్యోతిర్గణాధిపతి, దినకరుడు, జయభద్రుడు, సహస్రాంశుడు, తమోఘ్నుడు, శత్రుఘ్నుడు అయిన ఆదిత్యునకు నమస్కరించాడు. ధనుస్సు ధరించి యుద్ధానికి సిద్ధపడ్డాడు. రావణ సంహారానికి దీక్ష పూనాడు.


*శ్రీరామ జయం*

రావణుని సారధి మళ్ళీ రధాన్ని రాముని ముందుకు తెచ్చాడు.

 సకలాయుధ సంపన్నమై, ఒక గంధర్వ నగరంలా ఉన్న ఆ రథం అప్రదక్షిణంగా వచ్చింది. ఇక రావణుని మరణం తప్పదని గ్రహించిన రాముడు తమ రధాన్ని ప్రదక్షిణ మార్గంలో పోనిమ్మని మాతలికి చెప్పాడు. సర్వ శక్తులనూ ఒడ్డి రాముడు, రావణుడు శరవర్షాన్ని కురిపింప సాగారు. వారి బాణాలు ఆకాశాన్ని కప్పేశాయి. "రామరావణ యుద్ధం రామరావణ యోరివ" - వారి యుద్ధానికి మరొకటి పోలిక లేదు - అని దేవగణాలు ఘోషిస్తున్నాయి. వారి రథాలు యుద్ధరంగమంతా కలియదిరిగాయి. రాముని బాణాలకు రావణుని పతాకం కూలింది. గుర్రాలు తొలగిపోయాయి.


మహా సర్పాలవంటి రాముని బాణాలకు రావణుని తల తెగిపడింది.

 కాని వెంటనే మరొకటి మొలిచి ఉంది. ఇలా నూటొక్కసార్లు రావణుని తలలు తెగగొట్టినా మరల మరల మొలుస్తూనే ఉన్నాయి. "రామా! ఇలా కాదు. బ్రహ్మాస్త్రాన్ని సంధించు" అని మాతలి అన్నాడు.

 అప్పుడు రాముడు తనకు అగస్త్యుడిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. అది బుసలు కొడుతున్న సర్పంలా ప్రకాశిస్తున్నది. దాని వేగ సాధనములైన రెక్కలలో వాయువు, ములికిలో అగ్ని సూర్యులు, బరువులో మేరు మందర పర్వతాలు అధిష్టాన దేవతలుగా ఉన్నారు. దాని శరీరం బ్రహ్మమయం.

 రాముడు ఆ దివ్యాస్త్రాన్ని వేదోక్తంగా అభిమంత్రించి, ధనుస్సును బాగుగా లాగి సావధాన చిత్తుడై విడచాడు. 

వజ్ర సంకల్పంతో, రాముని వజ్ర హస్తాలనుండి విడివ‌డిన‌ బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణుని గుండెను చీల్చి,  భూమిలో ప్రవేశించి, సావధావంగా తిరిగి వచ్చి రాముని అమ్ముల పొదిలో చేరింది. 

రాముడు ఎరుపెక్కిన కన్నులతో, శరదళితదేహంతో, కోటి సూర్యుల ప్రకాశంతో, ధనుస్సును నేలకానించి, మరో చేత బాణాన్ని త్రిప్పుతూ వీరశ్రీబంధురాంగుడై త్రిదశపతినుతుడై శోభిల్లాడు. సకలదేవతలు రామునకు అంజలి ఘటించారు. సుగ్రీవ విభీషణ అంగదాదులు, లక్ష్మణుడు, ఇతర సహమిత్రులు విజయోత్సాహంతో రణాభిరాముడైన రాముని యధావిధిగా పూజించారు.

           

*సీత అగ్ని ప్రవేశం*


భీకరంగా జరిగిన యుద్ధంలో రావణుడు కడతేరాడు. 

రాముని ఆనతిపై విభీషణుడు రావణునికి అంత్య క్రియలు చేశాడు. పిదప విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. విభీషణుని అనుజ్ఞతో హనుమ లంకలోనికి వెళ్ళి, విజయవార్తను సీతకు నివేదించాడు. విభీషణుని అంతఃపుర పరివారం సీతమ్మ‌కు మంగళ స్నానం చేయించి, పల్లకీలో రాముని వద్దకు తీసికొనివచ్చారు.

లోకానికి సీత‌మ్మ పాతివ్ర‌త్యాన్ని తెలియ‌జేయాల‌నుకున్నాడు శ్రీ‌రాముడు. అందుకు చిన్న‌స‌న్నివేశాన్ని సృష్టించాడు.

"సీతా,.... ఇక్ష్వాకుకుల ప్రతిష్ఠకోసం నేనీ యుద్ధం చేశాను.

 రావణుడు నిన్ను దుష్టదృష్టితో చూశాడు గనుక నేను నిన్ను స్వీకరించలేను.  నువ్వు యధేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళవచ్చును." అని అన్నాడు. ఆ మాట‌లు సీత‌కు పిడుగుపాటు లా అనిపించాయి.


సీత లక్ష్మణునివైపు తిరిగి "లక్ష్మణా,   అగ్నిని ప్రజ్వలింపజేయి" అన్నది.  రామునకు, దేవతలకు, దిక్పాలురకు మ్రొక్కి "నా హృదయం సదా రామచంద్రుడినే పూజిస్తున్నట్లయితే సర్వభక్షకుడైన అగ్ని నన్ను పునీతురాలిని చేయుగాక‌" అని పలికి మంటలలోనికి నడచింది. 

అందరూ హాహాకారాలు చేశారు. అప్పుడు బ్రహ్మ రాముని సమక్షంలో నిలిచి "రామా నువ్వు లోక కర్తవు. ఉత్తమ జ్ఞానివి. అలా చూస్తూ ఊరుకుంటావేం? ప్రాకృతునిలా సీతను ఉపేక్షిస్తావేమీ" అన్నాడు. నీవు విష్ణువు అవతారానివని చెప్పాడు.


అగ్ని, సీతను వెంటబెట్టుకొని రాముని వద్దకు వచ్చాడు.

 సీత అప్పుడు ఉదయసూర్యబింబంలా ఉంది.

 "రామా! ఇదిగో నీ సీత. ఈమె పునీత. పాపహీన. నిన్నే కోరిన సాధ్వి.

 ఈమెను అవశ్యం పరిగ్రహించు. " అని చెప్పాడు.

 అప్పుడు  రాముడు ,"సీత పరమపవిత్రురాలని నేనెరుగుదును. కాని దశరధ పుత్రుడనైన నేను కామాతురుని వలె ప్రవర్తింప జాలను. ఈమె మహిమను లోకం గుర్తించాలని అగ్ని ప్రవేశాన్ని మౌనంగా వీక్షించాను. నా పట్ల వాత్సల్యం కలవారు గనుక మీరు చెప్పినట్లే చేస్తాను" అని తన దక్షిణ హస్తాన్ని చాచి సీత చేతినందుకొన్నాడు.

 ఆకాశం నుంచి పుష్ప‌వ‌ర్షం కురిసింది.


*అయోధ్యకు పునరాగమనం*



, యుద్ధంలో చనిపోయిన వానరులందరినీ రాముని కోరికపై ఇంద్రుడు బ్రతికించాడు. సైన్యమంతా సంబరాలలో మునిగిపోయింది. అయోధ్య చేరాలన్న ఆతురతలో ఉన్న రాముడు విభీషణుని సత్కారాలను తిరస్కరించాడు. విభీషణుడు రాముని అనుజ్ఞతో వానరులను సత్కరించాడు.

 విభీషణుడు, వానరులు తోడు రాగా పుష్పక విమానంపై సీతారామలక్ష్మణులు అయోధ్యకు తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో తమ లంకా యుద్ధ, సీతాపహరణ, వనవాస ప్రదేశాలను చూసుకొంటూ కిష్కింధను, గోదావరిని, యమునను, గంగను దాటి భరద్వాజ ముని ఆశ్రమం చేరుకొన్నారు. వానరుల సంతోషం కోసం అకాలంలో కూడా వృక్షాలన్నీ తియ్యటి పళ్ళతో విరగబూసేటట్లుగా రాముని కోరికపై భరద్వాజ ముని వరమిచ్చాడు.


ముందుగా హనుమంతుడు నందిగ్రామం చేరుకొని హనుమంతుడు భరతునికి సీతారామలక్ష్మణుల పునరాగమన సందేశాన్ని అందించాడు. ఆనందంతో భరతుడు అయోధ్యను అలంకరింపమని ఆనతిచ్చాడు. రాముని పాదుకలు శిరస్సుపై ధరించి పరివారసహితుడై ఎదురేగి రామునికి, సీతకు, లక్ష్మణునికి ప్రణమిల్లాడు. సుగ్రీవాది వీరులను ఆలింగనం చేసుకొన్నాడు. సౌహార్దంవల్ల తమకు సుగ్రీవుడు ఐదవ సోదరుడని పలికాడు. రాముని పేరుతో తాను రాజ్య సంరక్షణ చేస్తున్నానని, రాజ్యభారాన్ని తిరిగి చేప‌ట్ట‌మ‌ని శ్రీరాముని ప్రార్థించాడు. గోశాలలు, ధాన్యశాలలు, ధనాగారం, సైన్యాలను పరీక్షించుకోమని కోరాడు. భరతుడే సారథ్యం వహించగా, శత్రుఘ్నుడు శ్వేతచ్ఛత్రం పట్టగా, లక్ష్మణ విభీషణులు వింజామరలు వీయగా, వానరవీరులు వెంటరాగా సీతారాములు పరివార సమేతులై శంఖభేరీ భాంకారాలతోఅయోధ్యలోనికి ప్రవేశించారు. తల్లులకు, పెద్దలకు, గురువులకు మ్రొక్కారు. వనవాస విశేషాలు, సీతాపహరణం, కిష్కింధలో సుగ్రీవుని మైత్రి, హనుమంతుని అసమాన కార్య సాధన, విభీషణ శరణాగతి, లంకాయుద్ధాది వివరాలు విని అయోధ్యాపౌరులు అత్యాశ్చర్యభరితులయ్యారు.

   

                *****

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


      *****


రామవిశాల విక్రమ పరాజితభార్గవరామ సద్గుణ

స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద

శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో

ద్ధామ విరామ

 భద్రగిరి  దాశరథీ కరుణాపయోనిధీ!*

         ***

మనోజవం మారుత తుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం ,వానర యూధ ముఖ్యం

శ్రీరాందూతం మనసా స్మరామి


*(రేపు శ్రీరామ పట్టాభిషేక ఘట్టం)*

మొగలిచెర్ల

 *ఆదిత్య హృదయం అప్పజెప్పడం..*


*(మూడవరోజు)*


శ్రీధరరావు, ప్రభావతి దంపతులు ఆ యోగీశ్వరుడి ముందు స్థిమితంగా కూర్చున్నారు..వాళ్ళిద్దరినీ చిరునవ్వుతో చూస్తూ.."అమ్మా!..నన్ను మొదటి పిలుపులోనే "నాయనా"! అని పిలిచావు కదా?..నాలో నీ బిడ్డను చూసావా?.."అన్నారు..మొట్ట మొదటగా ఆ దంపతులిద్దరితో అడిగిన ప్రశ్న అది..


"ఔను నాయనా!..మా పెద్దబ్బాయిని చూసిన అనుభూతి కలిగింది..పైగా వయసుతో సంబంధం లేకుండా నాయనా అని పిలవడం నాకలవాటు.." చెప్పారు ప్రభావతి గారు..


"ఓహో!.. అమ్మా..ఈ మధ్య కాలంలో శ్రీధర రావు గారు నన్ను ఎన్నో మార్లు కలిశారు..నేను మౌనంలో వున్నా కానీ..ఆయన నాతో చాలా విషయాలే చెప్పారమ్మా..నీకు పూజలు ఎక్కువగా చేసే అలవాటు ఉందనీ..తెల్లవారుఝామునే లేచి..స్నానాధికాలు ముగించుకొని పూజ మొదలుబెడతావనీ..చెప్పారమ్మా..అంత ఘనంగా ఏ పూజలు చేస్తావు తల్లీ?.." అన్నారా యోగి..


ప్రభావతి గారికి లోపలినుంచి ఒక గర్వం బైటకు తన్నుకు వచ్చింది..తాను రోజూ ఎంతో నిష్ఠగా పూజ చేస్తాననే అహంకార పూరిత అజ్ఞానం ఆవిడను నిలువెల్లా కప్పేసింది..తాను చేస్తున్న పూజల లెక్క గబ గబా గుర్తుకుతెచ్చేసుకున్నది.."ఒకటేమిటి నాయనా!..తెల్లవారుఝామున స్నానం చేసి ఆదిత్య హృదయం మొదలుకొని..ఎన్నో సహస్రనామ స్తోత్రాలు..అష్టోత్తరాలు..అన్నీ నోటికి వచ్చు..విష్ణు, లలితా సహస్ర నామాలు..మా ఇలవేల్పు ఈ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడి అష్టోత్తర, సహస్ర నామ, కవచాలు.. నోటికి వచ్చు..అన్నీ కూడా పనీ పాటా చేసుకుంటూ నాలో నేను చదువుకుంటూ వుంటాను..రోజు మొత్తంమీద ఓ పదో పదకొండో సహస్రనామ స్తోత్రాలు..అష్టోత్తర స్తోత్రాలు చేస్తాను నాయనా..ప్రతి స్తోత్రమూ నోటికొచ్చు కాబట్టి..సులభంగా చేస్తాను.." అని చెప్పారు..        ఈ "నోటికొచ్చు.." అన్నమాట పదే పదే గర్వంగా చెప్పారు..


ఆ యోగి..(ఇకనుంచీ "శ్రీ స్వామివారు" గా వ్రాస్తాను!) తాను కూర్చున్న అరుగుమీద నుంచి లేచి నుంచుని..అదే చిరునవ్వుతో.."అమ్మా!..అన్ని స్తోత్రాలూ ఔపోసన పట్టానన్నావు కదా..మొదట ఆదిత్య హృదయం తో నీ పూజ మొదలవుతుందని చెప్పావు కదా?..ఏది తల్లీ..ఒక్కసారి ఆ ఆదిత్య హృదయం నాకు వినిపించు..ఒక్కసారి చదువమ్మా.." అన్నారు..


ప్రభావతి గారు శ్రీధరరావు గారిని చూసారు.."చెప్పమంటారా?"..అన్నట్లు గా ఆయన ను కళ్ళతోనే సైగ చేసి అడిగారు..


ఆయన వెంటనే.."చదువు ప్రభావతీ..నీవు రోజూ చేసేదేగా!.." అన్నారు..


ప్రభావతి గారు మళ్లీ ఒక్కసారి సర్దుకు కూర్చుని..


"తతో యుద్ధ పరిశ్రాంతం..సమరే చింతయాస్థితం.."


అని చెప్పబోయారు..అంతే!..శ్లోకం అంతకంటే ముందుకు గుర్తురావటం లేదు..


మళ్లీ.."తతో యుద్ధ పరిశ్రాంతం..సమరే...."


అక్కడే ఆగిపోతోంది..ఆవిడ నాలుక మొద్దుబారి పోయినట్లు..అంతకంటే ఒక్క ముక్క కూడా ఆ శ్లోకం లో గుర్తుకురావటం లేదు..మళ్లీ..మళ్లీ...ఊహూ!..ఏమీ గుర్తులేదు..ప్రతిరోజూ చేసే ఆ స్తోత్రం..మొదటి శ్లోకంలోని మొదటి పాదం వద్దే ఆగిపోయింది..నిద్రలో లేపి అడిగినా..టక టకా చెప్పే ప్రభావతి గారికి వాక్భందం జరిగినట్లు మాట రాక ఆగిపోయారు..ఐదు నిమిషాల పాటు తంటాలు పడ్డారు..ఏమీ లాభం లేదు..


ప్రక్కనే ఉన్న శ్రీధరరావు గారు నిర్ఘాంతపోయి చూస్తున్నారు..ప్రతిరోజూ..ఇంట్లో పని చేస్తూ..పశువులకు మేత వేస్తూ..పాలు పితుకుతూ..మజ్జిగ చిలుకుతూ..ఇలా తన పని తాను చేసుకుంటూ కూడా అనుక్షణం స్తోత్రాలు వల్లే వేసే తన భార్య..ఇక్కడ ఈ నిమిషంలో..ఈ యోగిపుంగవుడి ముందు..ఏ స్తోత్రమూ అప్పజెప్పలేక సతమతమవుతోంది..ఏమిటీ మాయ?..అని ఆయన ఆలోచనలో పడ్డారు..


ఇక ప్రభావతి గారికైతే..తనకేమైందో తెలీదు..మొట్టమొదటి శ్లోకం కూడా గుర్తురానంతగా తన మెదడు మొద్దుబారిపోయింది..మెల్లిగా ఆవిడ అహంకారపు పొర తొలిగింది.."నాయనా!..నేను చెప్పలేకపోతున్నాను..నన్ను ఏదో శక్తి అడ్డగిస్తోంది..నేను అశక్తురాలినై పోయాను.."అని చెప్పి మౌనంగా కూర్చున్నారు..


అప్పటిదాకా వాళ్ళిద్దరి ముందూ నిలుచుని ఉన్న శ్రీ స్వామివారు..మళ్లీ పార్వతీదేవికి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చి..అరుగుమీద పద్మాసనం వేసుక్కూర్చున్నారు..


ఇప్పుడు ఆయన మొహంలో ఒక తేజస్సు ఉట్టిపడుతోంది...


మంత్రోచ్ఛారణ..తత్వం..గురించిన బోధ రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).