31, ఆగస్టు 2022, బుధవారం

నేను లేకపోతే

 *నేను లేకపోతే?*


అశోక వనంలో రావణుడు సీతమ్మ వారి మీదకి కోపంతో కత్తి దూసి ఆమెను చంపటానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు 'ఎవరి నుంచైనా కత్తిని తీసుకుని  రావణాసురుని తలను ఖండించాలి' అని


కానీ మరుక్షణంలోనే హనుమంతుడు  మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు! 


హనుమంతుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. 'నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతను ఎవరు రక్షించే వాళ్ళు అని భ్రమలో నేను ఉండేవాడిని' అనుకున్నాడు హనుమంతుడు! 


బహుశా మనం కూడా ఎన్నోసార్లు ఇలానే అనుకుని ఉంటాం,  'నేను లేకపోతే ఎలా?' అని. 

అయితే ఇక్కడ ఏం జరిగింది చూద్దాం... 


సీతామాతను రక్షించే పనిని, ప్రభువు రావణుని యొక్క భార్యకు అప్పగించాడు. 


అప్పుడు హనుమంతుడు కి అర్థమైంది  'ఎవరి ద్వారా ఏ కార్యాన్ని  చేయించుకోవాలో వారి ద్వారానే ప్రభువు ఆపని చేయించుకుంటాడు' అని. 

**

మరింత ముందుకు వెళితే త్రిజట 'తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుంది. అది లంకను కాల్చివేస్తుంది..దాన్ని నేను చూశాను.' అని చెప్పింది. 

అయితే హనుమంతుడికి ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మన్నాడు, అంతేకానీ లంకను కాల్చి రమ్మని చెప్పలేదు. 


అయితే త్రిజట ఇది తన స్వప్నంలో చూశాను అని చెప్పింది. హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి ప్రభువు ఇచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకున్నాడు. 

*

హనుమంతుని చంపడానికి రావణుని సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమి చేయలేదు. అలా నిలబడ్డాడు. 

అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి 'అన్నా! దూతను చంపటం నీతి కాదు' అన్నాడు. 

అప్పుడు హనుమంతునికి తెలిసింది తనను రక్షించే భారం ప్రభువు విభీషణుని  పై ఉంచాడు అని. 


ఆశ్చర్యానికి పరాకాష్ట ఎక్కడంటే  విభీషణుడు ఆ మాట చెప్పినప్పుడు రావణుడు వెంటనే ఒప్పుకుని 'కోతిని చంపొద్దు. అయితే కోతులకు తోకంటే మహా ఇష్టం కాబట్టి తోకకు నిప్పు పెట్ట' మని చెప్పాడు. 


అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమైంది త్రిజట స్వప్నం నిజం కాబోతుంది అని. లేకపోతే నేను ఎక్కడి నుంచి నూనె తీసుకురావాలి, ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిప్పు తీసుకురావాలి, ఎప్పుడు లంకను తగలబెట్టాలి! 


కానీ గమనించండి...పరమాశ్చర్యం ఏంటంటే వాటన్నిటి ఏర్పాటు రావణుడే స్వయంగా చేయించాడు. 

అంటే, రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తన నుండి తనకు కావలసిన పనిని చేయించుకోవడంలో ఆశ్చర్యం ఏముంది! 

**

అందుకే ప్రియ భక్తులారా! ఒకటి గుర్తుంచుకోండి ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతోంది అని అనుకోండి. మనమంతా కేవలం నిమిత్తమాత్రులం అని గుర్తు పెట్టుకుని మసలండి. 

అందువల్ల *ఎప్పుడు కూడా నేను లేకపోతే ఏమవుతుందో?* అన్న భ్రమలో ఎప్పుడు పడవద్దు 

'నేనే గొప్పవాడి'నని అనుకోవద్దు. *భగవంతుని కోటాను కోట్ల దాసులలో అతి చిన్నవాడను* అని ఎఱుక కలిగి ఉందాం.

జై శ్రీరామ🙏

☘️🍂


(హిందీ రచనకు స్వేచ్ఛానుసరణ)

వినాయకచవితి ని జరుపుకుంటున్నారు

 పార్ధసారధి పోట్లూరి


.


మనకి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా పరిష్కరించాల్సిన సమస్యలు ఎన్నో ?


మొదటి సారిగా బెంగుళూరు ఈద్గా మైదానంలో వినాయకచవితి ని జరుపుకుంటున్నారు ! గత 75 ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు ఇతర రాజకీయ పార్టీలు తేల్చకుండా


వదిలేసిన సమస్య 'ఈద్గా మైదాన్ "! ఈ రాజకీయ పార్టీలకి వోట్లు పోతాయనే భయంతో ఈద్గా మైదాన్ విషయంలో కప్పదాటు ధోరణిని ప్రదర్శించి సమస్యని జటిలం చేసి వెళ్లిపోయాయి. ముస్లిం రాజకీయ నాయకులని ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక సమస్యని నాన్చి మరింత జటిలం చేశాయి. ఇది మరీ ముఖ్యంగా సుదీర్ఘ కాలం కర్ణాటకని పాలిచిన కాంగ్రెస్ పార్టీ నిర్వాకం. గత ఆగస్ట్ 15 న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ పేరిట స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరపాలని నిర్ణయించి బెంగుళూరు లోని చామరాజ పేట లో ఉన్న ఈద్గా మైదానం ని దానికి వేదిక చేసుకోవాలని నిర్ణయించుకొని చామరాజ పేట లోని స్థానికులు ఈద్గా మైదానం లో చిన్న సమావేశం నిర్వహించారు. అయితే స్థానిక ఎంఎల్ఎ అయిన జహీర్ అహ్మెద్ వచ్చి ఈద్గా మైదానం తమది అని ఇక్కడ రంజాన్, బక్రీద్ ల సందర్బంగా నమాజు చేయడానికి మాత్రమే అనుమతిస్తామని ఇతర కార్యక్రమాలకి అనుమతించమని వాగ్వివాదానికి దిగాడు స్థానీకులతో ! అయితే బిజేపి నాయకులు 75 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి ప్రభుత్వ అనుమతిని కోరారు! ప్రభుత్వం అనుమతి ఇచ్చి పోలీసు బందోబస్తు మధ్యన స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిపోయింది.


తాజాగా ఆగస్ట్ 31 న వినాయ చవితి పండుగని జరుపుకోవడానికి అనుమతి ఇవ్వమని ప్రభుత్వాన్ని


 కోరారు గణేష్ ఉత్సవ నిర్వహుకులు. ఇక్కడ సమస్య మొదలయ్యింది మళ్ళీ. ఈద్గా మైదాన్ లో కేవలం ముస్లిం మత పరమయిన కార్యక్రమాలకే అనుమతి ఇస్తామని

 గణేష్ పూజకీ అనుమతి ఇవ్వమని స్థానిక ఎంఎల్ఎ జహీర్ అహ్మెద్ మళ్ళీ అభ్యంతరం పెట్టాడు. ఈద్గా మైదాన్ తమదే అని తమకి సంబంధించిన స్థలంలో మా అనుమతి లేకుండా ప్రభుత్వం అనుమతి ఎలా ఇస్తుంది అంటూ వాదనకి దిగాడు జహీర్ అహ్మెద్. 


BBMP అధికారులు ఈద్గా మైదాన్ కి యాజమాన్యమ్ కి సంబంధించి డాక్యుమెంట్లు చూపించమని అడిగారు. కానీ వాళ్ళ దగ్గర ఎలాంటి యాజమాన్య హక్కులని నిర్ధారించే డాక్యుమెంట్స్ లేవు. అదేసమయంలో BBMP దగ్గర కూడా ఈద్గా మైదాన్ కి సంబంధించి ఎలాంటి రికార్డులు లేవని తెలిసింది మొదటిసారిగా !


కానీ కర్ణాటక రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర మాత్రం 2 ఎకరాల 10 గుంటల భూమికి సంబంధించి అది ప్రభుత్వానిదే అని నిర్ధారించే రికార్డులు ఉన్నాయి. దాంతో కర్ణాటక ప్రభుత్వం అది ప్రభుత్వ స్థలం కాబట్టి గణేష్ ఉత్సవ నిర్వహకులకి వినాయక చవితి పండుగని జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చింది.


దీనిమీద ఈద్గా మైదాన్ తమదే అని వాదిస్తూ వచ్చిన జహీర్ అహ్మెద్ హై కోర్టు ని ఆశ్రయించాడు. తన పిటిషన్ లో ఈద్గా మైదానం లో గణేష్ ఉత్సవాన్ని నిర్వహించుకుండా స్టే ఆర్డర్ ఇవ్వాలని కోరాడు. ప్రభుత్వ తరపున ఈద్గా మైదాన్ నిర్వహుకుల వాదనలు విన్న కర్ణాటక హై కోర్టు గణేష్ ఉత్సవం నిర్వహించడాన్ని ఆపమని కోరిన పిటిషన్ ని కొట్టివేస్తూ చట్ట ప్రకారం ఎలాంటి అనుమతులు ఇవ్వవచ్చో వాటిని ఇవ్వమని


ప్రభుతాన్ని ఆదేశించింది! ఆగస్ట్ 31 న మొదటిసారిగా ఈద్గా మైదాన్ లో వినాయకచవితి


ఉత్సవాలు జరగబోతున్నాయి అన్నమాట ! గత దశాబ్దాలుగా ఈద్గా మైదాన యాజమాన్య హక్కులు తమవే అని వాదిస్తూ వచ్చిన వాళ్ళని కనీసం భూ యాజమాన్య హక్కులకి సంబంధించి పత్రాలు ఉన్నాయా ? లేవా ? అని అడిగిన పాపాన పోలేదు. ఏ రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వాలు కాని ! చామరాజ పేట లోని 2 ఎకరాల 10 గుంటల భూమి విలువ ఇప్పుడు హీన పక్షం 500 కోట్లు ఉంటుంది కానీ కేవలం వోట్ బాంక్ రాజకీయాలతో ఎలాంటి పత్రాలు లేని వాళ్ళకి ఇన్నాళ్ళూ అక్కడ మేకలు, గొర్రెలు అమ్ముకోవడానికి సంతని నిర్వహించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి ? వందల సంఖ్యలో జనావాసాల మధ్య మేకలని, గొర్రెలని పెంచుతూ వాటి దుర్గంధం ని స్థానికులు అభ్యంతరం పెడుతూ వచ్చినా ఎందుకు ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాల్సి వచ్చింది ?


తమది కానీ భూమిలో జాతీయ జెండాని ఎగురవేయడానికి అనుమతి ఇవ్వము అని చెప్పేంత ధైర్యం వాళ్ళకి ఎవరు ఇచ్చారు ? ఇలాంటి సమస్యలు బహుశా దేశ వ్యాప్తంగా కొన్ని వేలు ఉండి ఉండవచ్చు ! జైహింద్ !

30, ఆగస్టు 2022, మంగళవారం

సాధకుడు జీవితం

 సాధకుడు తన జీవితంలో ఎలా వుండాలి


కమలం బురదలో పుడుతుంది, నీటిపైన జీవిస్తుంది...

ఈ రెండింటిని తనలో చేర్చు కోదు, ఆడవారు కంటికి పెట్టుకునే కాటుక గ్రుడ్డు కు అంటదు...

పచ్చళ్లు, కూర్మాలూ, ఎన్ని తిన్నా గాని నాలుకకు జిడ్డు అంటదు...

అట్లే సాధకుడు, జగత్తులో ఉన్నప్పటికీ, జగత్తు మనలను అంటకూడదు...

సుఖ దుఃఖములు, సంయోగ వియోగములతోనూ, మనకు సంబంధముండకూడదు...


అభిమాన, అహంకారములున్నచోట, దైవభక్తి ఉండజాలదు...

నేను కీర్తనలు బాగా పాడుతున్నాననీ, నా పూజా మందిరాన్ని రంగుల దీపాలతో బాగా అలంకరించాననీ గర్వపడవద్దు...

మన అలవాట్లల్లో వైఖరిలో మంచి పురోగతి ఉండాలి...

అది లేనప్పుడు సాధన వ్యర్థమైన కాలక్షేపమే...

కలి మహత్మ్య మేమో కానీ ఈరోజు ఆడంబర భక్తి తాండవ మాడుతోంది...

దైవము దేనినీ ఆశించడు, పరోపకారం, దీన ప్రాణులకు చేతనైనా సహాయ సహకారాలు అందించడం స్మరణ అనేది ఒక స్టాంపు, మననం అనేది ఒక చిరునామా, నామమును స్మరించాలి, ఆయన రూపమును ధ్యానించాలి... అంతేచాలు. అదే ఆయనను చేరుతుంది

వినాయక చవితి సందేశాలు

 ॐ          వినాయక చవితి సందేశాలు 

      

                   -----------------------     


                                  సందేశం - 1         


ఏకవింశతి (21) పత్రి  


    వినాయక చవితి రోజున వినాయకుణ్ణి మనం 21 రకాల పత్రితో  పూజిస్తాం. 

    ఆ పత్రికీ, వాటి వృక్షభాగాలకీ అనేక ఔషధ విలువలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుందాం.  

  (ముఖపుస్తకం నుంచి చొప్పకట్ల సత్యనారాయణగారి సౌజన్యంతో)


21 రకాల పత్రి - ఔషధ గుణాలు


1) మాచీపత్రం : ఇది మన దేశంలో ప్రతి చోట కనిపిస్తుంది. 

    మన ఇళ్ళ చుట్టుప్రక్కల, రోడ్ల మీద ఇది విపరీతంగా పెరుగుతుంది. కానీ ఇది గొప్ప ఆయుర్వేద మూలిక. 

    ఇది నేత్రరోగాలకు అద్భుత నివారిణి. మాచీపత్రి ఆకుల్ని నీళ్ళలో తడిపి కళ్ళకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి. 

    ఇది చర్మరోగాలకు మంచి మందు. ఈ ఆకును పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మవ్యాధి ఉన్న చోట పైపూతగా రోజు రాస్తూ ఉంటే వ్యాధి తొందర్లో నివారణ అవుతుంది. 

    రక్తపు వాంతులకు, ముక్కు నుండి రక్తం కారుటకు మంచి విరుగుడు.


2) బృహతీ పత్రం. 

    భారతదేశమంతటా విస్తారంగా ఎక్కడపడైతే అక్కడ పెరుగుతుంది బృహతీ పత్రం. 

    దీనినే మనం 'వాకుడాకు', 'నేలమునగాకు' అని పిలుస్తాం.     

    ఇది కంఠరోగాలను, శరీర నొప్పులను నయం చేస్తుంది. ఎక్కిళ్ళను తగ్గిస్తుంది. కఫ, వాత దోషాలను, ఆస్తమానీ, దగ్గునూ, సైనసైటిస్‌నూ తగ్గిస్తుంది. 

    అరుగుదలను పెంచుతుంది,     

    గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.     

    బృహతీపత్ర చూర్ణం దురదలకు, నొప్పులకు పనిచేస్తుంది. 

    బృహతీ పత్రం యొక్క కషాయంతో నోటిని శుభ్రరపరచుకుంటే నోటి దుర్వాసన తొలగిపోతుంది. 

    రక్తశుద్ధి చేయగల శక్తి బృహతీపత్రానికి ఉంది. 

    ఇంకా బృహతీపత్రానికి అనేకానేక ఔషధీయ గుణాలున్నాయి.


3) బిల్వపత్రం : దీనికే మారేడు అని పేరు. శివుడికి అత్యంత ప్రీతికరం. బిల్వ వృక్షం లక్ష్మీస్వరూపం. 

    ఇది మధుమేహానికి (షుగర్‌కు) దివ్యౌషధం. ఈ వ్యాధి గలవారు రోజు రెండు ఆకులను నిదానంగా నములుతూ ఆ రసాన్ని మింగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

    మారేడు గుజ్జును ఎండబెట్టి పోడిచేసుకుని, రోజూ ఒక చెంచా పొడిని మజ్జిగలో వేసుకుని త్రాగితే వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


4) దూర్వాయుగ్మం(గరిక) : గణపతికి అత్యంత ఇష్టమైనవస్తువు గరిక. ఒక్క గరిక సమర్పిస్తే చాలు, మహాసంతోషపడతాడు బొజ్జగణపయ్య. 

    తులసి తరువాత తులసి అంత పవిత్రమైనది గరిక. 

    దూర్వాయుగ్మం అంటే రెండు కోసలు కలిగివున్న జంటగరిక. ఇది ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది. 

    ఈ గరిక మహాఔషధమూలిక. గరికను పచ్చడి చేసుకుని తింటే మూత్రసంబంధిత వ్యాధులు నయమవుతాయి. 

    మగవారికి సంతాన నిరోదకంగా కూడా పనిచేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది. 

    చర్మ, రక్త సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. 

    ముక్కునుండి రక్తం కారుటను నిరోధిస్తుంది. 

    గరికను రుబ్బి నుడిటి మీద లేపనం వేసుకోవడం ద్వారా పైత్య దోషం వలన కలిగిన తలనొప్పి తగ్గిపోతుంది. 

    హిస్టీరియా వ్యాధికి ఔషధం గరిక.            


5) దత్తూర పత్రం : దీనిని మనం ఉమ్మెత్త అని కూడా పిలుస్తాం. 

    ఉష్ణతత్వం కలిగినది. కఫ, వాతా దోషాలను హరిస్తుంది. కానీ 'నార్కోటిక్' లక్షణాలు కలిగినది కనుక వైధ్యుని పర్యవేక్షణ తీసుకోకుండా ఉపయోగించకూడడు. 

    మానిసక వ్యాధి నివారణకు పనిచేస్తుంది. మానసిక వ్యాధి ఉన్నవారికి గుండు చేయించి, ఈ ఉమ్మెత్త ఆకుల రసాన్ని రెండు నెలల పాటు మర్దన చేయిస్తే స్వస్థత చేకూరుతుంది.      

    దీని ఆకులు, వ్రేర్లు, పువ్వులు అమితమైన ఔషధ గుణములు కలిగినవే అయినా, దీని గింజలు(విత్తనాలు) మామూలుగా స్వీకరిస్తే విషంగా పనిచేస్తాయి. 

    జ్వరాలు, అల్సర్లు, చర్మరోగాలకు, చుండ్రుకు ఉమ్మెత్త ఔషధం.


6) బదరీ పత్రం : దీనినే రేగు అని పిలుస్తాం. బదరీ వృక్షం సాక్షాత్తు శ్రీ మన్నారాయణ స్వరూపం. 

    చిన్నపిల్లల వ్యాధుల నివారణకు పనిచేస్తుంది. 3 ఏళ్ళ పైబడి 12 ఏళ్ళలోపు వయసులో ఉన్న పిల్లల్లో సామాన్యంగా వచ్చే అన్ని రకాల సాధారణ వ్యాధులకు ఉపయోగిస్తారు. 

    ఒకటి లేదా రెండు రేగు ఆకులను వ్యాధిగ్రస్తుల చేత వ్యాధి నివారణ అయ్యేంతవరకు తినిపించాలి, 

    కానీ రేగు ఆకులు ఎక్కువగా తింటే కఫం వచ్చే ప్రమాదముంది. 


7) అపామార్గ పత్రం: దీనికే ఉత్తరేణి అని వ్యవహారనామం. 

    దీని కొమ్మలతో పళ్ళు తోముకుంటే దంతవ్యాధులూ, ఆకులు నూరి పైపూతగా రాస్తే చర్మవ్యాధులూ నివారణమవుతాయి. 

    దీని పుల్లలు యజ్ఞయాగాదుల్లో, హోమాల్లో వినియోగించడం వలన హోమగుండం నుంచి వచ్చిన పొగను పీల్చడం చేత శ్వాసకోశ సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. 

    స్తూలకాయానికి, వాంతులకు, పైల్స్‌కు, ఆమం(టాక్షిన్స్) వలన వచ్చే వ్యాధులకు మంచి ఔషధం ఉత్తరేణి. 

    ఉత్తెరేణి ఆకులను రుబ్బి గాయాలపై రాయడం వలన గాయాలు త్వరగా మానిపోతాయి. నొప్పి తగ్గిపోతుంది. 

    పిల్లలు చెడుమార్గంలో వెళ్తున్నారని, చెడ్డ అలవాట్లకు లోనవుతున్నారని బాధపడే తల్లిదండ్రులు ఉత్తరేణి మొక్కను పూజించి, దాని వేర్లను పిల్లల మెడలో కడితే బుద్ధిమంతులవుతారు. 

    రోజు ఉత్తరేణి కొమ్మలతో పళ్ళు తోముకునే అలవాటు ఉన్నవారు ఎక్కడకు వెళ్ళినా, ఆహారానికి లోటు ఉండదు. ఆహరం దొరకని ఎడారిలో కూడా ఎవరో ఒకరు పిలిచి భోజనం పెడతారట. అది ఉత్తరేణి మొక్క మహిమ. 

    ఇంకా ఉత్తరేణికి అనేక ఔషధ విలువలు ఉన్నాయి. 

    ఇంత గొప్ప ఉత్తరేణి మన దేశంలో ఎక్కడపడితే అక్కడ పెరుగుతుంది.


8) తులసి: 'తులానాం నాస్తు ఇతి తులసి' - ఎంత చెప్పుకున్నా, తరిగిపోని ఔషధ గుణములున్న మొక్క తులసి. పరమ పవిత్రమైనది, శ్రీ మహాలక్ష్మీ స్వరూపం, విష్ణు మూర్తికి ప్రీతికరమైనది. తులసి మొక్క లేని ఇల్లు ఉండరాదు అంటుంది మన సంప్రదాయం. అంత గొప్ప తులసి గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం.


    కఫ, వాత, పైత్య దోషాలనే మూడింటిని శృతిమించకుండా అదుపులో ఉంచుతుంది తులసి. 

    కాలుష్యాన్ని తగ్గిస్తుంది, తులసి వాసనకు దోమలు దరిచేరవు. 

    తులసి ఆకులు, వేర్లు, కొమ్మలల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. 

    చర్మరోగాలను నయం చేస్తుంది. 

    తులసి ఆకులు నమలడం చేత పంటి చిగుళ్ళకున్న రోగాలు నయమవుతాయి. 

    అరుగుదలను, ఆకలిని పెంచుతుంది. కఫం వలన వచ్చే దగ్గును, ఆస్తమాను తగ్గిస్తుంది. 

    తులసిరసాన్ని తేనెలో కలిపి తీసుకోవడం వలన ఎక్కిళ్ళు తగ్గిపోతాయి. 

    తులసి శరీరంలో ఉన్న ఆమాన్ని(టాక్సిన్స్/విషాలను) విశేషంగా తీసివేస్తుంది. 

    ఈ మధ్య జరిగిన పరిశోధనల ప్రకారం ఒక్క తులసి చెట్టు మాత్రమే రోజుకు 22 గంటల పాటు ప్రాణవాయువు(ఆక్సిజెన్)ను విడుదల చేస్తుందని తేలింది. 


    కానీ పురాణ కధ ఆధారంగా గణపతిని తులసిదళాలతో ఒక్క వినాయక చవితి నాడు తప్ప ఇంకెప్పుడు ఆరాధించకూడదు. 


9) చూత పత్రం : మామిడి ఆకులను సంస్కృతంలో చూత పత్రం అని అంటారు. మామిడి మంగళకరమైనది.


    లేతమామిడి ఆకులను పెరుగులో నూరి సేవిస్తే అతిసారం తగ్గుతుంది.   

    మామిడి జిగురులో ఉప్పు చేర్చి వేడిచేసి ఔషధంగా పూస్తే కాళ్ళపగుళ్ళు, చర్మవ్యాధులు ఉపశమిస్తాయి. 

    చిగుళ్ళ వాపు సమస్యతో బాధపడేవారికి మామిడి లేత చిగురు మంచి ఔషధం. 

    చెట్టు నుంచి కోసిన కొన్ని గంటల తరువాత కూడా ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడుదల చేయగల శక్తి మామిడి ఆకులకుంది. 

    మామిడి దేవతావృక్షం. అందువల్ల ఇంట్లో ఏ దిక్కులో మామిడి చెట్టున్నా మంచిదే. ఆఖరికి ఈశాన్యంలో మామిడి చెట్టున్నా, అది మేలే చేస్తుంది. 

    మామిడి చెట్టును సాధ్యమైనంతవరకు కాపాడాలని, ఇంటి ఆవరనలో పెరుగుతున్న మామిడి చెట్టును నరికేస్తే, ఆ ఇంటి సభ్యుల అభివృద్ధిని నరికేసినట్లేనని వాస్తు శాస్త్రం గట్టిగా చెప్తోంది. 

    ఏ శుభకార్యంలోనైనా, కలశ స్థాపనకు ముందు కలశంలో 5 రకాల చిగుళ్ళను వేయాలి. అందులో మామిడి కూడా ఒకటి.


10) కరవీర పత్రం : దినినే మనం గన్నేరు అని పిలుస్తాం. గన్నేరుకు శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది. 

    సాధారణంగా పూజకు కోసిన పువ్వులు, అవి చెట్టు నుంచి కోసే సమయంలో చెట్టు మొదట్లో క్రింద పడితే ఫర్వాలేదు కానీ, మరొకచోట(అది దేవుడుముదైనా, పూజ స్థలంలోనైనా సరే) క్రింద పడితే ఇక పూజకు పనిరావు. కానీ గన్నేరు పూలకు ఈ నిబంధన వర్తించదు. గన్నేరు పూలు మరే ఇతర ప్రదేశంలో క్రింద పడినా, నీటిని చల్లి పరమాత్మకు అర్పించవచ్చు. 

    గన్నేరు చెట్టు తప్పకుండా ఇంట్లో ఉండాలి. గన్నేరు చెట్టు నుంచి వచ్చిన గాలి పీల్చినా చాలు, అది అనేక రోగాలను దూరం చేస్తుంది.


11) విష్ణుక్రాంత పత్రం : మనం వాడుకభాషలో అవిసె అంటాం. 

    దీని ఆకును నిమ్మరసంతో కలిపి నూరి తామరవ్యాధి ఉన్న చోట పూస్తే తామరవ్యాధి నశిస్తుంది. 

    ఆకును కూరగా చేసుకుని భుజిస్తే రక్తదోషాలు నివారణావుతాయి. 

    విష్ణుక్రాంతం మేధస్సును పెంచుతుంది.


12) దాడిమీ పత్రం : అంటే దానిమ్మ. భారతదేశమంతటా పెరిగే చెట్టు ఇది. లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసుమప్రభ' అనే నామం కనిపిస్తుంది. 

    దానిమ్మ రసాన్ని శరీరం మీద రాయడం చేత అలర్జీలు, కిటకాలు కుట్టడం వలన వచ్చిన పొక్కులు మానిపోతాయి. 

    దానిమ్మ పండు తొక్క గాయాలకు ఔషధం, వాపును అరికడుతుంది. పైత్య దోషాన్ని అదుపులో ఉంచుతుంది. 

    దానిమ్మ పండు ఆకలిని, అరుగుదలను పెంచుతుంది. విరోచనాలను తగ్గిస్తుంది. గొంతురోగాలకు ఔషధం దానిమ్మ. 

    దానిమ్మ పళ్ళు, పువ్వులు, ఆకులు, వేర్లు అన్ని ఔషధ గుణాలు కలిగినవై ఉంటాయి.

    దానిమ్మ ఆకులను కొద్దిగా దంచి కాచి కషాయం చేసి దాన్లో తగినంత చక్కెర కలిపి సేవిస్తే ఉబ్బసం, అజీర్తి వంటి దీర్ఘకాలిక రోగాలు, దగ్గు, వడదెబ్బ, నీరసం ఉపశమిస్తాయి. 

    దీని ఆకులకు నూనె రాసి వాపు ఉన్నచోట కడితే కల్లవాపులు తగ్గుతాయి.


13) దేవదారు : ఇది వనాలలో, అరణ్యాలలో పెరిగే వృక్షం. పార్వతీ దేవికి మహాఇష్టమైనది. చల్లని ప్రదేశంలో, ముఖ్యంగా హిమాలయ పర్వతాల వద్ద పెరుగుతుంది ఈ వృక్షం. 

    దేవదారు ఆకులను తెచ్చి ఆరబెట్టి, తరువాత ఆ ఆకులను నునెలో వేసి కాచి, చల్లార్చిన తరువాత నూనె తలకి రాసుకుంటే మెదడు, కంటి సంబంధ రోగాలు దరిచేరవు. 

    దేవదారు మాను నుంచి తీసిన నూనె చుక్కలను వేడినీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయి.


14) మరువక పత్రం : మనం దీన్ని వాడుక బాషలో మరువం అంటాం. ఇది అందరి ఇళ్ళలోనూ, అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నవారు కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మంచి సువాసనం కలది. 

    మరువం వేడినీళ్లలో వేసుకుని ఆ నీటితో స్నానం చేస్తే శరీరానికున్న దుర్వాసన తొలగిపోతుంది.


15) సింధువార పత్రం : వావిలి ఆకు. ఇది తెలుపు-నలుపు అని రెండు రకాలు. 

    రెండింటిలో ఏదైనా వావిలి ఆకులను నీళ్ళలో వేసి మరిగించిన నీటితో బాలింతలకు స్నానం చేయిస్తే బాలింతవాతరోగం, ఒంటినొప్పులు ఉపశమిస్తాయి. 

    ఈ ఆకులను దంచి దానిని తలమీద కట్టుకుంటే రొంప, శిరోభారం ఉపశమిస్తాయి.


16) జాజి పత్రం: జాజి పత్రానికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది అన్ని చోట్ల లభిస్తుంది. జాజిపూలు మంచి సువాసన కలిగి మనిషికి ఉత్తేజాన్ని, మనసుకు హాయిని కలిగిస్తాయి. 

    ఈ సువాసన డిప్రేషన్ నుంచి బయటపడడంలో బాగా ఉపకరిస్తుంది. 

    జాజి ఆకులు వెన్నతో నూరి ఆ మిశ్రమంతో పళ్ళుతోముకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. 

    జాజి కాషాయన్ని రోజు తీసుకోవడం వలన క్యాన్సర్ నివారించబడుతుంది. 

    జాజి చర్మరోగాలకు దివ్యౌషధం. 

    కామెర్లను, కండ్లకలకను, కడుపులో నులుపురుగులను నయం చేయడంలో జాజిపూలు ఉపయోగిస్తారు. 

    జాజిమొగ్గలతో నేత్రవ్యాధులు, చర్మరోగాలు నయం చేస్తారు.


17) గండకీపత్రం: దీనిని మనం దేవకాంచనం అని పిలుస్తాం. 

    థైరాయిడ్ వ్యాధికి ఔషధం గండకీ పత్రం. 

    అరణ్యాలలో లభించే ఈ గండకీ చెట్టు ఆకు మొండి, ధీర్ఘవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. 

    చర్మరోగాలను, పైత్య రోగాలను హరిస్తుంది. దగ్గు, జలుబును హరిస్తుంది.


18) శమీ పత్రం: దేని వ్యవహార నామం జమ్మి. మహాభారతంలో విరాటపర్వంలో పాండవులు దేనిమీదనే తమ ఆయుధాలను దాచిపెడతారు. 

    జమ్మి ఆకుల పసరు తీసి దానిని పుళ్ళు ఉన్నచోట రాస్తే కుష్ఠువ్యాధి నశిస్తుంది. 

    జమ్మిపూలను చక్కరతో కలిపి సేవించడం వలన గర్భస్రావం జరగకుండా నిరోధించబడుతుంది. 

    జమ్మి చెట్టు బెరడు దగ్గు, ఆస్తమా మొదలైన వ్యాధులకు ఔషధంగా పనిచేస్తుంది.


19) ఆశ్వత్థపత్రం: సంస్కృతంలో అశ్వత్థం అంటే, తెలుగులో రావి అంటాం. 

    తులసి లేని ఇల్లు, వేపలేని వీధి, ఒక్క రావి చెట్టు కూడా లేని ఊరు ఉండరాదన్నది మన పెద్దలమాట. 

    రావి సాక్షాత్ శ్రీ మహావిష్ణుస్వరూపం. పరమాత్మయే తనును తాను రావిచెట్టుగా చెప్పుకున్నాడు. 

    రావిమండలను ఎండబెట్టి, ఎండిన పుల్లలను నేతితీ కలిపి కాల్చి భస్మం చేసి, ఆ భస్మాన్ని తేనేతో కలిపి సేవిస్తూ ఉంటే శ్వాసకోశవ్యాధులు నివారణ అవుతాయి. 

    అందుకే యజ్ఞయాగాదులు, హోమాల్లో రావికొమ్మలను సమిధలుగా వాడుతారు. 

    రావి వేర్లు దంతవ్యాధులకు మంచి ఔషధం. 

    దీని ఆకులను హృద్రోగాలకు వాడతారు. 

    రావి ఆకులను నూరి గాయాలపై మందుగా పెడతారు. 

    రావి చర్మరోగాలను, ఉదరసంబంధ వ్యాధులను నయం చేస్తుంది, రక్తశుద్ధిని చేస్తుంది.


20) అర్జున పత్రం: మనం దీనినే మద్ది అంటాం. ఇది తెలుపు-ఎరుపు అని రెండు రంగులలో లభిస్తుంది. 

    మద్ది చెట్టు హృదయ సంబంధిత జబ్బులకు మంచి ఔషధం. హృదయానికి సంబంధించిన రక్తనాళాలను గట్టిపరుస్తుంది. 

    భారతదేశంలో నదులు, కాలువల వెంట, హిమాలయాలు, బెంగాలు, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో విరివిగా ఇది పెరుగుతుంది. 

    ఇది శరీరానికి చలువ చేస్తుంది. 

    కఫ, పైత్య దోషాలను హరిస్తుంది కానీ, వాతాన్ని పెంచుతుంది. 

    పుండు నుంచి రక్తం కారడాన్ని త్వరగా ఆపుతుంది. 

    మద్ది బెరడును రుబ్బి, ఎముకలు విరిగినచోట పెడితే గాయం త్వరగా మానిపోతుంది. 

    దీని బెరడును నూరి, వ్రణమున్న ప్రదేశంలో కడితే, ఎలాంటి వ్రణములైనా తగ్గిపోతాయి.


21) అర్క పత్రం: జిల్లేడు ఆకు. 

    జిల్లేడు చెట్టు గణపతి స్వరూపం. 

    జిల్లేడు పాలు కళ్ళలో పడడం వలన కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది, కానీ జిల్లేదు ఆకులు, పూలు, వేర్లు, కొమ్మలు, పాలు అన్నీ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. 

    ఆస్తమా, దగ్గు మొదలైన వ్యాదులకు జిల్లేడు పూలను వాడటం ఆయుర్వేద గ్రంధాల్లో కనిపిస్తుంది. 

    జిల్లేడుతో చేసిన నూనె చెవుడుకు ఔషధం. జిల్లేడు రక్త శుద్ధిని చేస్తుంది. 


                   =x=x=x= 


    — రామాయణం శర్మ

              భద్రాచలం

28, ఆగస్టు 2022, ఆదివారం

నల్లటి మచ్చలు ,మంగు నివారణ -

 స్త్రీల సౌందర్యానికి చిట్కాలు - 


 నల్లటి మచ్చలు ,మంగు నివారణ -


 *  జాపత్రిని మంచినీటితో మెత్తగా నూరి రాత్రిపూట ముఖానికి లేపనం చేసుకొని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపర్చుకొనుచున్న అతిత్వరలోనే ముఖము పైన కల మంగు ,నల్లమచ్చలు మాయం అగును . 


 *  మిరియాలు గోరోజనముతో కలిపి నూరి పైకి లేపనం చేయుచున్న మొటిమలు తగ్గును . మచ్చలు పోవును . 


 *  బాదం పప్పును నీటితో నూరి వడకట్టగా వచ్చిన పాలను ముఖంపై మర్దన చేయుచున్న క్రమంగా నల్లమచ్చలు , మంగు , మొటిమలు త్వరలోనే హరించును . 


 *  ధనియాలు , వస , సుగంధపాల ఈ మూడింటిని సమభాగాలుగా తీసుకుని మెత్తటి చూర్ణముగా చేసి ఈ చూర్ణమును ఒంటికి నలుగు పిండిలా పట్టించుచున్న నల్లటి మచ్చలు , మొటిమలు తగ్గును . 


 *  నిమ్మరసమును పాలతో కలిపి రాత్రిపూట ముఖానికి మర్దన చేసుకుని తెల్లవారిన తరువాత లేవగానే గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుగుకొనవలెను . సబ్బు వాడరాదు . ఇలా క్రమం తప్పకుండా చేయుచున్న మచ్చలు , మంగు పోయి ముఖం కాంతివంతం అగును . 


 *  తులసి ఆకుల రసములో కొద్దిగా టంకణం ( Borax ) కలిపి పైకి లేపనం చేయుచున్న ముఖం పైన మచ్చలు , మంగు హరించును . 


 *  మంజిష్ట చూర్ణమును ఆవుపాలతో కలిపి అరగదీసి అందులో కొంచం తేనె కలిపి ముఖమునకు లేపనం చేయుచున్న నల్లమచ్చలు , మంగు హరించును . 


         

నమ్మి చెడినట్టివారు లేరు

 🌴దైవమును నమ్మక చెడినవారలున్నారు కానీ నమ్మి చెడినట్టివారు ఎవరూ లేరు, లేరు, లేరు. ఈ జగత్తంతా నమ్మకంపై ఆధారపడి నడుస్తోంది.  డ్రైవరు ఎవరో తెలియకపోయినా అతను మనల్ని సురక్షితంగా గమ్యం చేరుస్తాడని విశ్వసించి మనం బస్సుకానీ, ట్రైను కానీ ఎక్కి ప్రయాణం సల్పుతున్నాము. ఎవరో తెలియని వంటవాడిని నమ్మి, భోజనశాలకు వెళ్ళి అతను వండిన పదార్థాలను తృప్తిగా భుజిస్తున్నాము. ఈరీతిగా నిత్య జీవితంలో మనం చేసే ప్రతి పనీ నమ్మకంతోనే ముడిపడి ఉంది. అది లేకపోతే ఈ లోకంలో మనుగడ సాగించలేము. మనుషుల్ని ఇంతగా నమ్మే మనము భగవంతుని మాత్రం ఎందుకు నమ్మకూడదు?! ఎందుకు నమ్మడం లేదు?!! నిజంగా పరిపూర్ణమైన ప్రేమతో భగవంతుణ్ణి విశ్వసిస్తే, ఆ భగవంతుడే మన జీవనయానాన్ని సజావుగా సాగేలా చేయడా! మానవునిపై పెట్టుకున్న విశ్వాసము మాధవునిపై పెట్టుకుంటే మన జీవితాలను సుఖసంతోషాలతో నింపి, మనల్ని గమ్యం చేరుస్తాడు కదా!. కానీ మనం ఇలా చేస్తున్నామా? ఆయనపైనే శతకోటి సందేహాలు పెంచుకుంటున్నాం. దేవునిపై పెంచుకోవలసింది సందేహాలను కాదు, విశ్వాసమొక్కటే! ఆయనపై ప్రగాఢమైన విశ్వాసాన్ని మన గుండెల్లో  నింపుకున్నపుడు మనభారం అంతా ఆయనే చూసుకుంటాడు. చెడడం అనే మాటే ఉండదు.. జీవితం అంతా ఆనందమయమే అవుతుంది.🌴

గౌరవము

 *వస్త్రేణ వపుషావాచా విద్యయా వినయేచ*

*వకారైః పంచభిర్లుప్తోనరో నాప్నోతి గౌరవమ్*


మనుష్యులకు లభించే గౌరవము ఐదు స్థాయిలలో ఉంటుంది......


ఆ గౌరవాన్ని ఇచ్చే మనుష్యులను కూడా ఐదు వర్గాలుగా విభజించవచ్చును.....


1. అతిసాధారణస్థాయి మనుష్యులు (వస్త్రసౌందర్యం): 


ఈ స్థాయివారు మనుష్యులను వారు ధరించిన వస్త్రములను చూచి గౌరవిస్తారు....  ఇటువంటి ప్రేక్షకులే ఫ్యాషన్ షోలకు, వస్త్రవ్యాపారుల ధనార్జనకు ఆధారం...


2. సాధారణస్థాయి మనుష్యులు (శరీరసౌందర్యం):


ఈ స్థాయివారు మనుష్యులను వారివారి శరీరసౌందర్యం చూసి గౌరవిస్తారు.... వీరు నోరువిప్పి మాట్లాడితే వినబడే భాష చాలాసార్లు అనాగరికంగా డండడంవలన దానిని  మనము వినలేము. ...


ఈ విగ్రహపుష్టిని, దానిని గౌరవించే వీరాభిమానులను మనము సినిమా పరిశ్రమలోను, ఫ్యాషన్ పరిశ్రమలోనూకూడా చూడగలము....


ఈ మొదటి రెండు స్థాయిలూ బాహ్యసౌందర్యానికి సంబంధించినవి...


3. మధ్యమస్థాయి (వాక్సౌందర్యం)


ఈ వాక్చతురతకలవారి మాట ప్రేక్షకులను ఎంతో అలరిస్తుంది... నేడు వివిధరంగాలలో ప్రజ్ఞాపాటవాలు కలవారికన్న వాక్చాతుర్యం కలవారు ఎక్కువగా రాణిస్తున్నారన్నది సర్వవిదితమే...


ఈ  స్థాయి మనుష్యులను గౌరవించేవారు మధ్యమస్థాయికి చెందిన శ్రోతలు...


4. ఉత్తమస్థాయి (విద్యాపాండిత్యం):


కేవలం వాక్చాతుర్యం కలవారికన్న వివిధరంగాలలోని పండితులు ఇంకా గొప్పవారు.... 


"స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అన్న సూక్తిననుసరించి వీరు విద్యవిలువ తెలిసినవారందరిచేతా గౌరవింపబడతారు...


5. అత్యుత్తమస్థాయి (వినయసౌందర్యం):


కేవలం విద్యాపాండిత్యం సర్వోత్తమస్థాయి కాదు... ఎందుకంటే సద్గురుకృపలేని విద్యాపాండిత్యం జ్ఞానాన్నికాక గర్వాన్ని కలుగజేస్తుంది...


కావున సద్గురుకృపాప్రసాదంచే విద్యాసంపన్నులైనవారు వినయభూషణులై ఉత్తమస్థాయి పెద్దలచే గౌరవింపబడుతారు...


తక్కిన సాధారణస్థాయివారు వీరి విలువను సాధారణంగా అర్థంచేసుకోలేరు..


కాని నిజముగా తెలుకుంటే ఇదియే సర్వోత్కృష్టమైన గౌరవము....


- సేకరణ

మంచి స్వభావం

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏.                     🌹 మంచి స్వభావం మరియు మంచి ప్రవర్తన శారీరక అందం కంటే గొప్పవి.. జీవితంలో ఎప్పుడు రిలేషన్ మెయింటైన్ చేయడానికి ప్రయత్నించకూడదు🌹మన రిలేషన్ లో జీవితాన్ని నింపటానికి ప్రయత్నించాలి.. అది జీవితాన్ని అందంగా మారుస్తుంది🌹 ఆనందం అనేది పోర్టబుల్ లాంటిది మనం ఎక్కడికి వెళ్లి తీసుకు వెళ్ళాలి🌹 ఆందోళన మన మనసులను అందుడిని చేస్తుంది... సత్యాన్ని మరియు వాస్తవాన్ని చూడకుండా నిరోధిస్తుంది🌹 మంచి పోటీదారుడు నిరాశలో ఉన్న వారి కంటే తక్కువ ప్రమాదము.. గెలిచి ఓడడం కంటే ఓడి గెలవడం మంచిది🌹 లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు.. నీ లక్ష్యాన్ని ఆత్మవిశ్వాసం కృషి తోడైతే నీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు🌹 సాధించే వాడికి కోరిక మాత్రమే ఉంటుంది విమర్శించే వాడికి తీరిక ఎక్కువ ఉంటుంది🌹🌹🌹మీ అల్లంరాజుభాస్కర రావు 

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం 🚍స్టాండ్

Rajhamundry

9440893593🙏 🙏🏻🙏🙏🏻

సహధర్మచరీ

 శ్లోకం:☝️

*ఇయం సీతా మమ సుతా*

    *సహధర్మచరీ తవ |*

*ప్రతీచ్ఛచైనాం భద్రం తే*

   *పాణిం గృహ్ణీష్వ పాణినా ||*

*పతివ్రతా మహాభాగా*

    *చాయేవానుగతా సదా ||*


భావం: "ఈమె నా బిడ్డ సీత ఈమెను సహధర్మచారిణిగా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి కష్టనష్టాలలో అయినా నీకు నీడలా వెన్నంటి ఉండే పతివ్రతను నీ చేతిలో పెడుతున్నాను. నేటి నుండి మీరు ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకే మాటగా నిలవాలి." అని జనక మహరాజు గారు సీతమ్మ కి రామయ్య తో పాణిగ్రహణం జరిపించారు. కన్యాదాన సమయంలో జనకుడు చెప్పిన ఈ శ్లోకాన్ని, కళ్యాణం కన్యాదాన సమయంలో భక్తులందరిచేతా ఆచార్యులు చెప్పిస్తారు.🙏

27, ఆగస్టు 2022, శనివారం

ప్రసాదం

 🎻🌹🙏స్వామివారి ప్రసాదం-ప్రత్యేకత....


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


అన్నవరం శ్రీ సత్యనారాయణ  స్వామివారి ప్రసాదం చాలా ప్రత్యేకంగా తయారుచేస్తారు. 


గోధుమనూక, నెయ్యి, పంచదారతో తయారుచేసే ఆ ప్రసాదానికి అలయ ప్రసాద రుచి మన ఇంటిలో చేస్తే రానేరాదు. 


ఆ రుచికి కారణం స్వామివారి మహిమే. స్వామివారి ప్రసాదం ఫలప్రదం అగుటకు ఎన్నో ఉదాహరణలు చెప్తారు.


 స్వామివారి వ్రతం చేసుకున్న తరువాత మర్చిపోకుండా తీర్థ ప్రసాదాలు తీసుకోవలెను. 


అన్నవరం ప్రసాదాన్ని ఎర్ర గోధుమనూక, ఆవు నెయ్యి, పంచదార, యాలకులపొడితో తయారుచేస్తారు.


ఈ ప్రసాదం సుగంధభరితంగా ఉంటుంది. చిన్నపాటి ఎండిన విస్తరాకులో ఈ ప్రసాదాన్ని పెట్టి అందిస్తూ ఉంటారు.


దూరప్రాంతాలకు తీసుకువెళ్ళేందుకు వీలుగా గోధుమ రవ్వతో బంగి ప్రసాదంగానూ (గట్టి ప్రసాదం) తయారుచేస్తూంటారు.


అయితే, భక్తులు బంగి ప్రసాదం కన్నా రవ్వ ప్రసాదాన్నే ఎక్కువ ఇష్టపడతారు.


ప్రసాదాన్ని తయారుచేసే భవనానికి భూతాది అని పేరు. వంటవారు తెల్లవారుజామున 3 గంటలకు పని ప్రారంభించి తయారుచేస్తారు. ఒక్కో తయారీ యూనిట్‌లో 68 మంది సిబ్బందితో 20 కళాయిల్లో ఈ ప్రసాదం తయారీచేస్తూ ఉంటారు. 


సాధారణ రోజుల్లో మొత్తం 100 కళాయిల్లో ప్రసాదాలు తయారుచేస్తారు. రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో 250 కళాయిలతో పనిచేస్తారు. గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు 270 కళాయిలతో పనిచేసింది రికార్డు అని వంట బృందానికి నేతృత్వం వహించే మధుబాబు చెప్పారు.


 ఒక్కో కళాయికి 80 కేజీల ప్రసాదం తయారవుతుంది. 15 కేజీల గోధుమ నూక, 30 కేజీల పంచదార, 6 కేజీల ఆవునెయ్యి, 5 కేజీల యాలకుల పొడి ఉపయోగిస్తారు. నీళ్ళు వేసి బాగా మరిగించి, అందులో మొదట గోధుమ నూక, తర్వాత పంచదార వేస్తారు. 


ఆ మిశ్రమం రంగుమారేదాకా ఉడికించి ఆవునెయ్యి కలుపుతారు. చివరిలో యాలకుల పొడి ప్రసాదంపై చల్లుతారు.


2021 ఆగస్టులో దాతల సహకారంతో ఈ ప్రక్రియలో కొంత భాగాన్ని చేసేందుకు దేవస్థానం యంత్రాలను ప్రవేశపెట్టింది. మూడు వేర్వేరు గొట్టాల ద్వారా వేడి నీరు, గోధుమ నూక, రెండు విడతలుగా పంచదార కళాయిలో పడేలా ఈ యంత్రంలో ఏర్పాటుచేస్తుంది.


 ఉడికిన తర్వాత నెయ్యి కలిపి, యాలకుల పొడి చల్లడం వంటవారు చేయాల్సి ఉంటుంది. కళాయికి రెండువైపులా ఉన్న చక్రాలను తిప్పితే పూర్తైన ప్రసాదం ప్యాకింగ్ కోసం తీసుకువెళ్ళేందుకు మరో తొట్టిలో పడుంతుంది. 


45 నిమిషాల్లో కళాయి ప్రసాదాన్ని వండేందుకు ఈ కొత్త ప్రక్రియ వీలు కల్పిస్తోంది. అలా స్వామివారి ప్రసాదం స్వామి నుండి మన చెంతకు వస్తుంది..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

గురు దక్షిణ

 


గురు దక్షిణ  :---


“తప్పదు నాన్నా.  అంతకన్నా నాకు వేరే దారి లేదు". కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవ రావు. జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. తల్లీ, తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్.

రాజేష్ వెళ్ళిన రెండు నిముషాల వరకూ భార్యా, భర్తా ఇద్దరూ అలానే గుమ్మం కేసి చూస్తూ ఉండిపోయారు.  ముందుగా జానకమ్మ తేరుకుని నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది. రాఘవ రావు కండువా భుజమ్మీద వేసుకుని పార్కుకి బయల్దేరాడు. పదినిముషాలలో పార్కుకి చేరుకున్నాడు.  అప్పటికే అతని మిత్రులు పరమేశం, సుబ్బారావు బెంచి మీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు పక్కకు జరిగి ‘రా రాఘవా’ అని ఆహ్వానించాడు.

మ్లానవదనంతో కూర్చున్న రాఘవరావు ని చూసి , ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు మిత్రులు ఇద్దరూ.  కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళు ఇద్దరూ. తర్వాత పరమేశం అన్నాడు “చూడు రాఘవా, నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నావు.

నీ బాధ నీ సన్నిహితులుతో పంచుకుంటే కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది.  మన ముగ్గురి మధ్యా రహస్యాలు లేవుగా.”  రాఘవ రావు దీర్ఘంగా నిట్టూర్చి “మా అబ్బాయి ఇల్లు అమ్మేయమంటున్నాడు.” అన్నాడు.  “కారణం?” అడిగాడు సుబ్బారావు. “ఎనభై లక్షల, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అరవైకే వస్తోందట. మళ్ళీ ఈ అవకాశం రాదుట.  నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు, వాడి దగ్గర ఉన్న డబ్బు కలిపి ఆ ప్లాట్ కొంటాడట.  అదీ సంగతి.” అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవ రావు.  మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.  కాసేపటికి సుబ్బారావు అడిగాడు “మీ ఆవిడ ఏమంది?”

“తల్లి ప్రేమ కదా, కొడుకు వైపే మాట్లాడింది.  ఎలాగూ చివర దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా అని అంది.”

“రాఘవా, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ మమకారం ఉంటుంది. కానీ పరిస్తితుల్ని బట్టి మనం నడచుకోవాలి.  నీకు ఒక్కగానొక్క కొడుకు.  అతణ్ణి

కాదని అంటే, రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో ఆలోచించు.  ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా” అన్నాడు పరమేశం.  సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు.  ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవ రావు. అన్యమనస్కంగానే భోంచేసి పడుకున్నాడు.  కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు.  గతం పదే పదే గుర్తుకు వస్తోంది .

పంచాయతీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాల్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని, మాస్టార్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. అందరూ రెండు వందల గజాలు స్థలం తీసుకుంటే, రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు. జానకమ్మకు మొక్కలంటే ప్రాణం. అందుకే స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు. రాఘవరావు స్కూల్ లో ఉంటే, జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది.  పనివాళ్ళతో సమంగా తానూ ఎండలో నిలబడి వారిచేత పనులు చేయించేది.  వాస్తవానికి, రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్ట పడింది.  ఒక ఆదివారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కడియం వెళ్లి రక రకాల పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా మొక్కలు చిన్న వాన్ మీద తెచ్చుకున్నారు.  మిగతా మాస్టర్లు

‘వాళ్ళిద్దరికీ చాదస్తం అని’  విమర్శించినా వాళ్ళ ఇల్లు నందన వనంలా పెరిగాక అభినందించ కుండా ఉండలేక పోయారు. అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్నా, రాఘవరావు మాత్రం నుయ్యి తవ్వించుకున్నాడు .

నూతి పళ్ళెం దగ్గరనుండి తూములు ఏర్పాటు చేసి నీళ్ళు మొక్కలకు చేరేటట్లు చేసాడు. ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి, సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు. మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దది అయ్యాకా దానికి సిమెంట్చప్టా చేయించాడు.  రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టుకింద ఉన్న చప్టా మీద కూర్చుంటే, జానకమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇచ్చేది.  ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు.  సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టుకిందే.  వేసవికాలం సాయంత్రాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఆ చెట్ల మధ్యే కూర్చుని మాట్లాడుకునే వారు.  టీచర్స్ కాలనీ లో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునే వారు.  సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులు అందరకు పంపించేవాడు.  రెండు పడక గదులు, ఒక హాలు, వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు.

పాతిక ఏళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ.  ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి.  వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేక పోతున్నాడు.  కానీ తప్పదు.

కొడుకు కోరిక తీర్చాలి. ఏం చేస్తాం? అని మధనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు.


కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.  ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.  ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.  భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు.

“మాస్టారు, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.  మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”


రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.  అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”  ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.

అతను వెళ్ళాకా భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం.  మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”

ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.  మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.  నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.

కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా , నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు.  జానకమ్మ ఎంతో

సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్ లో టీచర్గా చేరింది.  వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.  వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని. 

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు. ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.  మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.

శీతాకాలం వచ్చింది.  టైల్స్ మీద చాప వున్నా జానకమ్మ చలికి తట్టుకోలేక పోతోంది.  అది చూసి రాజేష్ బజారు నుండి చిన్న పరుపు తీసుకు వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ.  ఒకసారి సుమిత్ర తల్లి తండ్రులు హైదరాబాద్ వచ్చారు. రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేసాడు.  పిల్లల పడకలు తల్లి తండ్రుల గదిలోకి మారాయి. రాజేష్, మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు.  రాఘవరావు, జానకమ్మ

యధావిధిగా హాలు లోనే పడుకున్నారు. మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే పడింది.  సుమిత్ర , తల్లి తండ్రులు వారం రోజులు ఉన్నారు.  జానకమ్మ వళ్ళు హూనం ఐపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది. ‘బావ గారు, అక్కయ్య గారు అదృష్టవంతులు. చక్కగా కొడుకు దగ్గర వుండి సుఖ పడుతున్నారు’ అని.  అమ్మమ్మ, తాతయ్య వెళ్లి పోగానే మనవలు మల్లీ వాళ్ళ గదిలోనే పడుకో

సాగారు.  దాంతోరాఘవరావు, జానకమ్మ లకు ఒక విషయం పూర్తిగా అర్ధమయ్యింది.  కొడుకు, కోడలు కావాలనే తమని హాలు లోకి పంపించారని.  ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలా సేపు బాధపడ్డారు.  శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేసామని.  రెండేళ్ళు గడిచాయి. వంటరి తనంతో రాఘవరావు, పని ఎక్కువై , విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలి పోతున్నారు వాళ్ళిద్దరూ.  ఈ మధ్యనే పరమేశం కూతురు దగ్గరకు వచ్చి రాఘవరావుని చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు.  ఆ సమయానికి రాజేష్ ,సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు.  పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు.  రాఘవరావు, జానకమ్మలను చూసిఆశ్చర్య పోయాడు, ఆపై బాధ పడ్డాడు.


 “ఏమిటి రాఘవా ఇది?  ఇద్దరూ ఇలా అయి పోయారేమిటి? ఏమిటి అనారోగ్యం? డాక్టర్కి చూపించు కున్నారా?“ “ఆ ఏమీలెదు, కొద్దిపాటి నీరసం. అంతే.” అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం. ఈ లోగా పిల్లలు ఇద్దరూ వచ్చారు.  వాళ్లకు టిఫిన్ పెట్టి, పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ.  ఒక పావుగంట ఉండి వెనుదిరిగాడు పరమేశం.  శివపురం వచ్చాకా సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం. “మన రాఘవ పరిస్తితి ఏమీ బాగోలేదు.  ఇద్దరూ చిక్కి పోయారు.  కొడుకు వాళ్ళని

పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది.  చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరూ. కాళ్ళూ, చేతులూ ఆడుతున్డగానే ఇలా ఉంటే, రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్తితి ఎంత దుర్భరమో అనిపిస్తోంది.”

కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు.  తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు. ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు.

రెండు నెలలు గడిచాయి.  ఒకరోజు రాజేష్ ఇంటికి మిదున్, సాత్విక్ వచ్చారు.  “మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గిర చదువుకున్నాము.  వచ్చే ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్ధుల సమావేశం ఉంది.  ఆ రోజున మా గురువులు అందరినీ సన్మానించాలని నిర్ణయించాము. మాస్టారికి ఆహ్వానం పత్రిక ఇద్దామని వచ్చాం.” చెప్పాడు మిదున్.  నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, కూర్చోమని చెప్పి లోపలకు వెళ్ళాడు రాజేష్. పదినిముషాలకు రాఘవరావు హాలులోకి వచ్చాడు.  మిదున్, సాత్విక్ లేచి రాఘవరావు కి నమస్కరించి, తాము వచ్చిన

పని చెప్పారు.  “నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు?” అడిగాడు రాఘవరావు.

“పరమేశం గారు చెప్పారు సర్ . వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని, మేడం గారిని తీసుకుని వెళ్లి, తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం” వినయంగా చెప్పాడు మిదున్.  తప్పకుండా వస్తానని వాగ్దానం చేసాడు రాఘవరావు.

ఆరు రోజులు గడిచాకా శనివారం ఉదయమే మిదున్, సాత్విక్ ఇద్దరూ ఏ.సి. కారు తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్ మెంట్ కి వచ్చారు. ఫంక్షన్ అయ్యాకా వెంటనే వచ్చేయమని రాజేష్ , సుమిత్ర మరీ మరీ చెప్పారు.  అలాగే అని చెప్పి కారు ఎక్కారు రాఘవరావు, జానకమ్మ.  వాళ్ళు ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.  శివపురంలో అందరిని కలవ వచ్చని, రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని.  పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు’ రెండురోజులూ మా ఇంట్లోనే ఉండాలని’.  చిన్న పిల్లలు పండగకు తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో, రాఘవరావు, జానకమ్మ కూడా అంత హుషారుగాను ఉన్నారు.  విజయవాడలో భోజనాలుచేసి, సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురూ.  పరమేశం ,గిరిజ ఏంతో ఆదరంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకువెళ్ళారు. మిదున్, సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు.  ఒక అరగంటకు సుబ్బారావు, పద్మలత వచ్చారు.  మిత్రులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాడు పరమేశం.  మూడు జంటలూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోజనం చేసారు. మిత్రులు ముగ్గురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కదలాడాయి.  “నేను హైదరాబాద్ వెళ్ళాకా ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది” అన్నాడు రాఘవరావు.  మిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేసారు.  ఆ రాత్రి రాఘవ రావు, జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒక స్తిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ.  మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.  అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.  పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.   వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు. తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.  రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ” మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.

అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.  రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి

పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి

మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ

ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.  కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు

తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.  వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.  తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.

“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.

ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.


""పైసజారనీకు ప్రాణమున్నంతకు

పైసపోయెనేని ప్రాణమాగు

పైసలోనగలదు పరమార్ధమంతయు,

పైసెయిలనువెలసె ప్రాణమగుచు!!


అదీ కథలోని నీతి!

 విశ్రాంతజీవులందరూ,

తస్మాత్ జాగ్రత....


మీ కంటు చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచు కొండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు... చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులు గా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది.... ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ... ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్న లు,అత్త మామలు... ఆర్నెల్ల ముందు ఫైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది.. 6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరూ పిల్లలు అలా లేరు... కొందరు మాత్రమే...? సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి...

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 మన ప్రాచీన భారతీయ విజ్ఞానులు ఉపయోగించిన పుష్పకవిమానాల గురించి వివరణ -


    ఈ ప్రపంచం లో ఎన్నో విచిత్రమైన , రహస్యమైన ప్రదేశాలు ఉన్నాయి. మనిషి ఈ ప్రపంచాన్ని జయించాను అని అనుకుంటున్నాడు. కాని ఇప్పటివరకు తెలుసుకున్నది ఒక్క శాతమే . వాటిలో ముఖ్యమైనది పుష్పకవిమానాలు . ప్రస్తుతం చాలా వీడియోలు మనకి అందుబాటులో ఉన్నాయి . కాని వాటి గురించి పూర్తి సమాచారం ఎవ్వరికి అందుబాటులో లేదు . నా పరిధిని అనుసరించి కొంతసమాచారం నేను సేకరించాను . అది ఇప్పుడు మీకు తెలియచేస్తాను.  


      ఒకనాటి భారతీయ చక్రవర్తి సామ్రాట్ అశోకుడు తొమ్మిది మంది గుర్తుతెలియని వ్యక్తులతో ఒక రహస్య విభాగాన్ని ఏర్పరిచాడు. ఇందులోని వ్యక్తుల అపర మేధావులు వీరి ప్రధాన విధి వివిధ రకాల శాస్త్రాలు శోధించి మధించడం . దీనికి ప్రధాన కారణం అంతకు ముందు జరిగిన యుద్ధాలలో జరిగిన దారుణ మారణహోమం , రక్తపుటేరులు చూసి మనస్సు చలించి బౌద్ధమతం స్వీకరించాడు . ఈ సమయంలో తను అంతకు ముందు నియమించిన రహస్య శాస్త్రవేత్తలు భారతీయ వేదాలు , ప్రాచీన గ్రంధాలు కాచివడబోసి రూపొందించిన ఆధునిక వైజ్ఞానిక సమాచారం బయటకి పొక్కితే దానిని యుద్ధం వంటి దుష్ప్రయోజనాలకి వాడతారేమో అని అశొకుడు భయపడ్డాడు . అందుకే రహస్య విభాగంలోని శాస్త్రవేత్తల కార్యకలాపాల్ని అత్యంత రహస్యముగా ఉంచాడు. 


         అశోకుడు నియమించిన ఈ తొమ్మిది మంది వ్యక్తులు తొమ్మిది వేరువేరు అమూల్యమైన గ్రంథాలు రచించారు. వాటిలో ఒక అద్బుత గ్రంథం " గురుత్వాకర్షణ శక్తి రహస్యాలు " దీని గురించి చరిత్రకారులు కు తెలుసు కాని వారు దాన్ని ఎప్పుడూ చూడలేదు . ఈ పుస్తకం ప్రధానంగా "గురుత్వాకర్షణ శక్తి నియంత్రణ" సమాచారం కలిగి ఉంటుంది. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కడో ఒక రహస్య గ్రంధాలయంలో ఉంటుంది అని చరిత్రకారులు భావిస్తున్నారు .దీనికోసం చాలామంది రహస్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ గ్రంథం టిబెట్ లేదా భారతదేశంలో ఎక్కడైనా ఉండవచ్చు.  


          కొన్ని సంవత్సరాల క్రితం టిబెట్ లోని లాసాలో కొన్ని ప్రాచీన తాళపత్రాలు చైనీయులకు లభించాయి. అవి ప్రాచీన సంస్కృతంలో ఉన్నాయి . వాటిని అనువాద నిమిత్తం భారతదేశంలోని చండీగఢ్ విశ్వవిద్యాలయానికి పంపించారు. వాటిలో గ్రహాంతర అంతరిక్ష వాహనాల నిర్మాణానికి సంబంధించిన సూత్రాలు ఈ పత్రాలలో ఉన్నాయి అని చండీగఢ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలియచేసారు. 


           లాసాలో లభ్యమైన పత్రాలలో అంతరిక్ష వాహనాలను అస్థ్రాలుగా పేర్కొన్నారు . ప్రాచీన భారతీయులు సదరు వాహనాలలో కొందరు యోధులను ఇతర గ్రహాలకు పంపించి ఉండవచ్చు అని ఈ తాళపత్రాలను పరిశీలించిన డాక్టర్ రైనా తెలియజేసారు. అదృశ్య గ్రాహక శక్తికి పరాకాష్టగా చెప్పుకొనే "యాంటిమ" చిన్న వస్తువుని సైతం కొండంత బరువుగా మార్చే "గరిమ" , పెద్ద వస్తువుని సైతం బరువుతక్కువ గా చేయగల "లగిమ" రహస్యాలు కూడా ఈ ప్రాచీన తాళపత్రాలలో నిగూఢంగా ఉన్నాయి.


         చైనా ఈ తాళపత్ర గ్రంథాలు పంపినప్పుడు భారతీయ పరిశోధకులు అంత సీరియస్ గా తీసుకోలేదు . ఈ ప్రతుల్లోని కొంత డేటా తమ అంతరిక్ష పరిశోధనల్లో చేరుస్తున్నాం అని చైనా ప్రకటించడంతో అప్పుడు ఆ పత్రాల విలువ భారతీయ పరిశోధకులకు తెలిసివచ్చింది . యాంటి గ్రావిటీ గురించి పరిశోధిస్తున్నాం అని ఒక ప్రభుత్వం ప్రకటించడం ఇదే తొలిసారి .


          గ్రహాంతర ప్రయాణం అంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అని ప్రాచీన తాళపత్రాలు లో అంత వివరంగా లేదు . కాని మొత్తంమీద చూస్తే చంద్రుడిపైకి మాత్రం ఒకసారి యాత్ర జరిగినట్టు వివరిస్తున్నాయి . భారతీయ ప్రాచీన కావ్యం అయిన రామాయణంలో ఒక విమానంతో చంద్రుడి పైకి అంతరిక్ష యాత్ర చేసినట్టు ఉంది . రావణుని మరణం తప్పించడం కోసం మండోదరి అమృత బాండాన్ని చంద్రుడి పైకి వెళ్లి సాధించుకొని వచ్చి రావణుడికి కూడా తెలియకుండా విభీషణుని సహాయంతో రావణుని ఉదరభాగంలో ప్రతిష్టించింది . ఇది రామాయణంలో నేను కూడా చదివాను. 


           నిజానికి ఈ పత్రాలు భారతీయులు ఉపయోగించిన యాంటీ గ్రావిటీ , ఏరోస్పేస్ టెక్నాలజీ కి సంబంధించిన ఇటీవల లభ్యమైన చాలా స్వల్పమైన సాక్ష్యాధారాలు మాత్రమే . వారి పూర్తిపరిజ్ఞాన్ని మనం అర్ధం చేసుకోవాలి అంటే మనం కాలచక్రంలో చాలా వెనకకి వెళ్లవలిసిందే . 


            ఉత్తర భారతదేశం ,పాకిస్తాన్ లో ఉండేది అని చెబుతున్న "రామరాజ్యం" పదిహేను వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో వికాసం చెందింది. ఈ రాజ్యంలో చాలా పెద్ద ఆధునిక నగరాలు ఉండేవి. వీటిలో చాలామటుకు నగరాలను పాకిస్తాన్ , ఉత్తరపశ్చిమ భారత ఎడారుల్లో ఇంకా కనుగొనవలసి ఉంది. అట్లాంటిక్ మహాసముద్రం మద్యభాగంలో "అట్లాంటియన్ " నాగరికత విలసిల్లిన సమయంలో ఇక్కడ భరత ఖండంలో రాముడు రాజ్యం చేసాడు .రామరాజ్యంలోని గొప్ప నగరాలు మన పురాణాల్లో "సప్తఋషి" నగరాలుగా ప్రసిద్ది చెందాయి. ఈ నగరాల్లో నివసించే ప్రజలు విమానాలుగా పిలిచే యంత్ర వాహనాలు ఉపయోగించే వారని ప్రాచీన బారతీయ గ్రంథాలలో ఉన్నది . భారతీయ పురాణాలు విమానాన్ని అంతర్గత నిర్మాణంలో రెండు అంతస్తులు , పైభాగాన గుమ్మటం ( డోము ) బయట చుట్టూరా రంధ్రాలు ఉండే వృత్తాకార వాహనంగా తెలియచేశాయి .   


           ఈ విమానం అనేది వాయువేగంతో గగనతలంలోకి దూసుకెళ్తూ ఇంపుగా ఉండే హృద్యమైన శబ్దాన్ని వెలువరించేది అని ఆ గ్రంథాలలో పేర్కొనబడినది. అప్పట్లో కనీసం నాలుగు రకాల విమానాలు ఉండేవి . ఈ విమానాల్ని తయారుచేసిన ప్రాచీన భారతీయులు ఆ విమానాలని ఎలా నడపాలో ఫ్లైట్ మాన్యువల్స్ కూడా రూపొందించారు. ఈ విమానాల్లో కొన్ని సాసర్ ఆకారంలో మరికొన్ని సిగిరెట్ ఆకారం లో నిలువుగా కూడా ఉండేవి . 


        విమాన వాయు ప్రయాణం పైన సంపూర్ణంగా వివరించిన అత్యంత ప్రాచీన గ్రంథం "సమరసూత్రధార" ఈ గ్రంధంలో విమానం తయారి , అది బయలుదేరే తీరు , వేలాది మైళ్ళు ప్రయాణించుటకు కావలిసిన వివరాలు , బలవంతంగా దానిని కిందకి దించే విధానం , ఆఖరికి ప్రయాణ సమయంలో పక్షులతో ఢీకొట్టటానికి ఉన్న అవకాశాలతో సహా ప్రతి విషయాన్ని విశదపరిచే 230 శ్లోకాలు ఈ గ్రంధరాజంలో ఉన్నాయి. 


         క్రీస్తు పూర్వం 4 వ శతాబ్దంలో భరద్వాజ మహర్షి రాసిన అద్బుత గ్రంథం "భరద్వాజ వైమానిక శాస్త్రం" ఈ గ్రంధాన్ని 1875 వ సంవత్సరం లో ఒక ఆలయంలో కనుగొన్నారు. విమానాల పనితీరుపైన ఇందులో చాలా ఆసక్త్తికరమైన ముఖ్యవిషయాలు ఉన్నాయి . విమానాన్ని ఎలా నడపాలి , దూరప్రాంతానికి ప్రయాణించేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హఠాత్తుగా విరుచుకుపడే పిడుగులు , మెరుపులు నుంచి విమానాన్ని ఎలా రక్షించుకోవాలి వంటి ముఖ్యవిషయాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. 


                  భరద్వాజ మహర్షి రాసిన వైమానిక శాస్త్రం అనే గ్రంథంలో చాలా వివరాలు విపులంగా రాసి ఉన్నాయి . విమానం నడిపేటప్పుడు ఇంధనం ఉపయోగించి మాత్రమే కాకుండా మరోక ఉచిత ఇంధన వనరుని కూడా ఉపయోగించుకోవడం పై విస్కృత సూచనలు ఉన్నాయి . బహుశా ఆ ఉచిత ఇంధనవనరు యాంటి గ్రావిటి కావొచ్చు అని పరిశోధకుల అభిప్రాయం . ఇదే వైమానిక శాస్త్రంలో ఇంధనం నుంచి సౌరశక్తి ఉపయోగించి విమానం నడపడం గురించి కూడా సూచనలు ఉన్నాయి . 


        "వైమానిక శాస్త్ర " లో నిప్పంటుకోని,విరగని సామగ్రి , పరికరాలతో సహా మూడు రకాల విమానాల వర్ణనలు , బొమ్మలతో కూడిన ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి . ఈ వాయువాహనాల్లో ని 31 ప్రధాన భాగాలను , వాటి తయారీకి ఉపయోగించే 16 పదార్థాలు , సామాన్లను కూడా ఈ శాస్త్రం వివరిస్తుంది. ప్రధాన భాగాల తయారికి ఉపకరించే సామాన్లు , పదార్థాలు వేడిమికి , మంటలకు తట్టుకునే కోవకి చెందినవి అని అందుకే విమాన తయారీలో ఈ పదార్థాలు వాడాలి అని స్పష్టంగా సూచించాడు . 


          ఈ విమానాలు ఒక రకమైన యాంటి గ్రావిటీ తో పనిచేస్తాయి అనేందుకు ఎటువంటి సందేహాలు అక్కరలేదు అని చెప్పుకోవచ్చు. విమానాలు నిలువుగా గాలిలో లేచేవి . ప్రాచీన కాలంలో గగనవిహారం పైన దాదాపు 70 మంది సాధికార వ్యక్తులు , 10 మంది నిపుణులను భరద్వాజ మహర్షి తన గ్రంథంలో ప్రస్తావించారు.కాని వారు లిఖించిన గ్రంథాలు ప్రస్తుతం లభించడం లేదు . 


         విమానాలని విమానగృహాలుగా చెప్పబడే వాటిలో భద్రపరచేవారు. విమానాలను కొన్నిసార్లు పసుపుఛాయతో ఉండే తెల్లనిద్రవంతో మరికొన్నిసార్లు ఒకరకమైన పాదరస సమ్మేళనంతో నడిపేవారు అని తెలుస్తుంది . ఈ ఇంధనం విషయంలో చాలమంది పరిశోధకులు సరైన అవగాహనకి రాలేకపోయారు . ఈ విమానాలలో ఈ ప్రత్యేక ఇంధనం ఉపయొగించుటకు పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేసి ఉంటారు .


          ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నాజీలు తమ V -8 "బజ్ బాంబులు" కోసం మొట్టమొదటిసారిగా పల్స్ జెట్ ఇంజిన్ లను తయారుచేశారు . ప్రాచీన భారతావని , టిబెట్ అంటే నాజీలు , వారి అధినాయకుడైన హిట్లర్ కు పడిచచ్చేంత ఆసక్తి చూపేవారు . ఈ దేశాల్లోని ప్రజలు ప్రాచీన కాలంలోనే మంచి వైమానిక పరిజ్ఞానం సాధించారు అని హిట్లర్ కి నమ్మకం . 


            ప్రాచీన భారతావని మరియు టిబెట్ లోని ప్రాచీనులు మంచి వైమానిక పరిజ్ఞానాన్ని సాధించారు అని హిట్లర్ కి అత్యంత గాఢ విశ్వాసం . ఈ నమ్మకంతోనే అందుకు కావలసిన "రహస్య సాక్ష్యాధారాలు" కోసం వాటిని సేకరించడానికి 30 వ దశకం మొదలుకొని ప్రతి ఏడాది ఈ రెండు దేశాలకు రహస్యంగా ప్రతినిధి బృందాలను పంపేవాడు.


         మహాభారతంలోని ద్రోణ పర్వంలో మరియు రామాయణంలో ఒక విమానాన్ని వర్ణించిన తీరు ఈ విధంగా ఉన్నది. విమానం గుండ్రంగా ఉన్నది. పాదరసం వెలువరించే శక్తితో అది గొప్ప వాయువేగంతో దూసుకెళ్లేది చోధకుడు దానిని అన్నివైపులా తిప్పగలిగేలా ఉండేది . మరో ప్రాచీన గ్రంథం "సమర" లో లో పేర్కొన్న విమానాలు ఇనుముతో చక్కగా చేసినవి . వెనుక భాగంలో మండే అగ్నికీలల్ని వెలువరిస్తూ మండే పాదరసం నుంచి వెలువడే శక్తితో పనిచేసేవి అని రాయబడి ఉన్నది. 


      " సమరాంగణ సూత్రధార " ఈ వాహానాలని ఎలా నిర్మించారో వర్ణించింది. పాదరసానికి విమాన చోదనకు మధ్య ఏదో బలీయమైన సంభంధం ఉన్నది. నేను చదివిన ఒక తాంత్రిక గ్రంథంలో కోడిగుడ్డులో పాదరసం నింపి ఎండలో ఉంచిన అది గాలిలో ఎగురును అని రాసి ఉన్నది.


      సోవియట్ పరిశోధకులు తుర్కుమెనిస్థాన్ మరియు గోబీ ఎడారులలో గల ప్రాచీన గుహల్లో కొన్ని అపూర్వమైన పరికరాలు కనుగొన్నారు . వాటిని పూర్తిగా పరిశీలించినప్పుడు అవి ఎగిరే వాహనాలలో ఉపయోగించేవిగా నిర్ధారణ అయ్యింది . ఈ పరికరాలు గాజు మరియు పోర్సోలిన్ తో తయారుచేసిన అర్ధగోళాలు వీటిచివర్లు మొనదేలి ఉన్నాయి . లోపల కొన్నిచుక్కల పాదరసం లభించింది. 


        రామరాజ్యంలో సప్తఋషి నగరాలలో ఒకటిగా భావిస్తున్న మొహంజదారో కనుగొన్న లిపి వంటిదే ప్రపంచంలో మరో ప్రాంతంలో కూడా లభ్యం అయ్యింది .కాని ఆ లిపి యొక్క అర్థం ఇప్పటివరకు కనుగొనలేకపోయారు. మొహంజదారోలో లిపిని పోలిన లిపి లభించిన ప్రాంతం ఈస్టర్ ఐలాండ్ ఇక్కడ ఈ లిపి ని రాంగో లిపి అంటారు. ఈ రెండు లిపిలకు చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి.


   భవభతి రచించిన మహావీర ప్రాచీన పతులు అనే గ్రంథం ఎనిమిదోవ శతాబ్దం నాటిది . ఈ గ్రంథంలో అయోధ్య ప్రాంతంలోని ఒక విమానం గురించి విపులంగా ఉన్నది. అదే విధంగా వేదాలు కూడా ఈ విమానాల గురించి వాటిలో ఉండే రకాలు ఆకారాలు గురించి ఎన్నో విషయాలు తెలియచేశాయి . అట్లాటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన ఎన్నో భయంకర యుద్ధాలు గురించి చాలా చక్కగా వివరణ ఉన్నది. 


              భారతీయ వేదాలు అత్యంత ప్రాచీన ప్రతులుగా పేరుగాంచాయి. ఇవి హిందూ ప్రాచీన శ్లోకాల మణిహారాలు . ఇవి వివిధ ఆకారాల్లో , పరిమాణాల్లో ఉన్న విమానాల గురించి పలురకాలుగా వివరించాయి.  


      "అగ్నిహోత్ర విమానం" రెండు ఇంజన్ల తో ఉంటుంది. "గజవిమానం" అనేక ఇంజన్లతో ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ విమానాల్ని యుద్ధాలకొరకు ఉపయోగించారు అట్లాంటిస్ నగర వాసులు ఉపయోగించిన విమానాల కంటే ప్రాచీన భారతీయులు ఉపయోగించిన విమానాలు శక్తివంతం అయినవి. పరిశోధకుల అబిప్రాయం ప్రకారం ఇవి 80,000 హార్స్ పవర్ శక్తితో నడిచేవి . 


        పది నుంచి పన్నెండువేల సంవత్సరాల క్రితం అట్లాంటిస్ మరియు రామరాజ్యం మధ్య జరిగిన భయంకర సంగ్రామం గురించి ప్రాచీన భారతీయ గ్రంథాలలో విపులంగా ఉన్నది. ఆనాటి యుద్ధంలో భయంకరమైన విద్వంసక ఆయుధాలు ఉపయోగించారు . వాటిలో అప్పుడు జరిగిన యుద్దం గురించి ఈ విధంగా వివరణ ఉన్నది. 


      " ప్రయోగించిన ఆయుధం విశ్వమంతటి శక్తిని నింపుకొని ఉన్నది. కొన్ని క్షణాల తరువాత ఎక్కడ చూసినా మేఘాలుని ఆవరించిన పొగ ...ఒక్కసారిగా వేయి సూర్యబింబాలు ఉదయించినట్టుగా జ్వాలవంతమైన వెలుగులతో నిండిన అగ్నికీలలు ...మహోగ్రమైన ఉరుముల గర్జన బ్రహ్మన్దమైన మృత్యుసందేశ వాణి ఇవన్ని కలిసి అంధకుల జాతి సమస్తాన్ని సమూలంగా తుడిచిపెట్టాయి " .


       పంటలు మంటల్లో గుర్తుపట్టలేనంతగా మండిపోయాయి. మట్టివస్తువులు ,ఇళ్లు తునాతునకలు అయ్యాయి మిన్ను మన్ను ఏకమైపోయాయి. పక్షులు తెల్లటి రంగులో మారిపోయాయి. కొన్ని గంటల తరువాత ఆహారపదార్థాలు అన్ని ఆ ప్రళయ బీభత్సానికి గురిఅయ్యాయి. దానిబారి నుంచి రక్షించుకొనుట కొరకు , తమ దేహాలు , ఆయుధాలు, వస్తుసామాగ్రి శుభ్రపరచుకోవడం కొరకు సైనికులు మడుగులు , కాలువల్లోకి దూకారు . ఇది అంతా చూస్తుంటే మహాభారతం అణు యుద్ధాన్ని గురించి వివరిస్తున్నట్టుగా ఉన్నది. 


        గత శతాబ్దంలో పురాతత్వ శాస్త్రవేత్తలు మహేంజదారో నగరంలో తవ్వకాలు జరిపినప్పుడు ఏదో విలయం హఠాత్తుగా విరుచుకుపడి విధ్వంసం సృష్టించింది అన్నట్టుగా ఆ నగరం వీధుల్లో చెల్లాచెదురుగా పడిఉన్న అస్థిపంజరాలు కనిపించాయి. ఆ అస్థిపంజరాలలో కొన్నిటికి చేతులు ముడుచుకొని ఉండటం గమనించారు. వాటిని పరీక్షించినప్పుడు ఈ భూమ్మీద ఇప్పటివరకు కనుగొన్న అత్యంత ఎక్కువ రేడియో ధార్మిక ప్రభావానికి గురి అయ్యినట్టుగా తేల్చారు. ఇటుకలు, గాజు కరిగి ముద్దలా పడివున్నాయి . ఒకరకంగా చెప్పాలి అంటే హిరోషిమా , నాగసాకి నగరాల మీద ప్రయోగించిన అణుబాంబులు కంటే కూడా శక్తివంతమైన అణుబాంబుల ప్రయోగం జరిగింది.ఇలాంటి పరిస్థితుల గల నగరాలు ప్రాన్స్ , టర్కీ , స్కాట్లాండ్ దేశాలలో కూడా కనిపించాయి . 


      మహేంజదారో వీధులలో గాజు గోళాల వంటి నల్లటి పదార్థం పెద్దమొత్తంలో పేరుకొనిపోయింది. వీటిని పరిశీలించగా అత్యంత వేడిమిదగ్గర కరిగిన మట్టికుండలు అని తేలింది . ఇక్కడ ఇంకొ ఆసక్తికరమైన అంశం ఇంకొకటి ఉన్నది . మహాసామ్రాజ్య అధినేత అలెగ్జాండర్ రెండువేల సంవత్సరాల క్రితం భారతదేశం పైన దండయాత్రకు వచ్చినపుడు అలెగ్జాండర్ సైన్యం పైన పళ్లెం వంటి ఆకారాలు కలిగిన వాయువాహనాలు విరుచుకుపడ్డాయి అని కాని ప్రమాదకర ఆయుధాలు ప్రయోగించలేదని గ్రీకు చరిత్రకారుల తమ గ్రంథాలలో రాశారు. 


        ఆధునిక పరిశోదకుల అబిప్రాయం ప్రకారం ఈ ప్రాచీన విమానాలు అంతరించలేదు అని వాటిని కొన్ని ప్రత్యేకమైన రహస్య ప్రదేశాలలో ఉంచి వాటిని కొన్ని రహస్య సంఘాలలో సభ్యులు కాపలాగా ఉంటున్నారు అని భావిస్తున్నారు. పశ్చిమ చైనా దేశంలోని లాపనార్ ఎడారి ఈ విమానాలకు మిస్టరీ ప్రదేశంగా ఉన్నది . బహుశా ఈ ఎడారిలోనే చాలా విమానాలని రహస్యంగా దాచి ఉంచారు అని చెప్పుకుంటారు. 


               పూర్తి వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు . 


    గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

పొలాల అమావాస్య

 పొలాల అమావాస్య విశిష్టత ఇదే !


శ్రావణమాసం.. పూర్తవుతుంది. అమావాస్య ఈ రోజునే పొలాల అమావాస్య అంటారు. ఈరోజు పలుప్రాంతాలలో అనేక రకాలుగా వ్రతం, పూజలు చేస్తారు. ఈ పండుగ విశేషాలు తెలుసుకుందాం..




పొలాల అమావాస్య ఎందుకు చేసుకొంటారు? ఇది ఎలా చెయ్యాలి..?

శ్రావణ అమావాస్య


శ్రావణ బహుళ అమావాస్య రోజును పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క, బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నివేదిస్తారు.


వ్యవసాయదారులు గోవులను పాలించువారు తమ ఆవులు ఎద్దులకు ఈ రోజున విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. గ్రామాల్లో ఆవులు ఎద్దులకు కడుపునిండా తిండి నీరు తాగించి ఎలాంటి పనులు చేయించకుండా బాగా మేపే అమావాస్యగా పెద్దలు చెబుతారు. భారతీయ సంస్కృతిలో ఆవులు ఎద్దులను పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి సాంప్రదాయాలను నేటికీ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగగా జరుపుకుంటారు. పార్వతీదేవి విషయమై నంది తనకు చేసిన సాహసాన్ని మెచ్చి శివుడు శ్రావణ బహుళ అమావాస్య రోజున వృషభాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని అనుగ్రహించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఏరువాక పున్నమి (జ్యేష్ఠ పున్నమి) మొదలు శ్రావణమాసం వరకు వ్యవసాయ పనులతో ఎద్దులకు తీరికలేకుండా పని ఉంటుంది. శ్రావణమాసానికి విశ్రాంతి దొరుకుతుం ది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన ఏ పనీ చేయకుండా పూజ మాత్రమే జరపడం సాంప్రదాయంగా వస్తుంది.


– శ్రీ

జ్ఞానసుధా

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

        *శ్రీ దత్త జ్ఞానసుధా....*          

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


కన్నతల్లి కడుపులోంచి బయటపడి తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా సాగే ప్రస్థానం పేరే...‘నేను’!


ఈ నేను- ప్రాణశక్తి అయిన ఊపిరికి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా ‘నేను’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జనన మరణాల మధ్యకాలంలో సాగే జీవన స్రవంతిలో ఈ ‘నేను’ ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.


ఈ ‘నేను’ లోంచే ‘నాది’ అనే భావనా పుడుతుంది.


’నాది’లోంచి నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, నా ఆస్తి, నా ప్రతిభ, నా ప్రజ్ఞ, నా గొప్ప... అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ ‘నేను’ అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి. ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చిన ‘అహం’గా ప్రజ్వరిల్లుతుంది.


’అహం’ అనే మాయపొర కమ్మేసిన స్థితిలో ఈ ‘నేను’ ‘నేనే సర్వాంతర్యామిని’ అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది. పంతాలతో పట్టింపులతో, పగలతో ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.


బాల్య, కౌమార, యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ‘నేను’ అనే ప్రభ... ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.


వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.


సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.


సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ‘నేను’- చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.


కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.


రుద్రభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది. మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.


నేనే శాసన కర్తను, నేనే ఈ భూమండలానికి అధిపతిని, నేనే జగజ్జేతను... అని మహోన్నతంగా భావించిన ‘నేను’ లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. రోజు మారుతుంది.


ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన నేను కథ అలా సమాప్తమవుతుంది. అందుకే ఊపిరి ఆగకముందే నేను గురించి తెలుసుకో.


చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది శ్మశానవైరాగ్యం మాత్రమే. అది శాశ్వతం కానే కాదు. నేను గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది.

🌹🌹🌹🌹🌹🌹🌹

జై గురు దత్త 🙏🙏. 

చమత్కార శ్లోకం

 #కొత్త_మితృల_కోసం


ఒక చమత్కార శ్లోకం చూడండి ...


"అంబలి ద్వేషిణం వందే


 చింతకాయ శుభ ప్రదమ్


 కూరగాయ కృత త్రాసం


 పాలనేతి గవాం ప్రియమ్"


తెలుగూ, సంస్కృతమూ కలగూరగంపలా కలగలిసి పోయిన ఈ శ్లోకం చూసారా ? 


కవిగారి అభావ చేష్ఠ అని పోనీ లెమ్మని సరి పెట్టుకుందామంటే అర్ధం కూడా అదోలా లేదూ?


అంబలిని ద్వేషించే వాడికి వందనమట. 

చింతకాయ చాలా శుభ దాయకమట.

 కూరగాయ భయోత్పాతకమట. 

ఆవు పాల నేయి ప్రియమైనదట. 


ఏమిటీ కారు కూతలూ అనుకుంటున్నారా ?


అం+బలి = బలిని అణచి వేసిన వాడు


చింతక+ఆయ = నామ స్మరణ చేసే వారికి సకల శుభాలు ఇచ్చేటి వాడు


కు+ఉరగాయ = దుష్ట సర్పమును ( కాళీయుని) అణచి వేసిన వాడు


పాలన+ఇతి = గోవులను కాచునట్టి వాడు (అయినట్టి) ( శ్రీ కృష్ణునికి )


వందే = నమస్కరించుచున్నాను.


#ఇది_శ్రీ_కృష్ణ_నామ_స్మరణ_చేసే_శ్లోకం.


🌸🌸🌸🌸🌸🌸🌸

మలిగిన శ్రావణం

 ✡️       మలిగిన  శ్రావణం        ✡️


సీ॥

సిగపూల ముచ్చట్ల చిద్విలాసము ముగిసె 

          మైపూత ఘుమఘుమల్ మాటు చెందె 

పసిడిచీరలు దాగె భవ్యభూషలుం దాగె 

          చిఱుజల్లులన్ గాచు చెంగు లొదుగ 

పసుపు నిండిన మేలి పాదాల సవ్వడి 

          మార్గాల నినదింప మరచి పోయె 

ఇంటింట పేరంట మింపు సేయగ మానె 

          బడలెనో శనగల వాయనాలు 

గీ॥

శ్రీల రూపమై నడయాడు శ్రీమతు లిల 

శ్రావణార్భటి తోడ సై యనంగ 

సందడించిన శ్రావణ సన్నుతాంగి 

మెల్లగా చనుదెంచె నీ మేది నుండి 

*~శ్రీశర్మద*

క్షమించు

 🙏🕉️శ్రీ మాత్రే నమః శుభోదయం 🕉️🙏. ❣️ మౌనం ఎప్పుడు అర్దం లేనిది కాదు..చేటకానిది అంత కన్నా కాదు..కొన్ని వేల ప్రశ్నలకి సమాధానం కొన్ని వదల సమస్యలకు పరిష్కారం మౌనం దాగి ఉంటుంది❣️నేను నా శత్రువులతో కూడా మాట్లాడుతాను కానీ! జరిగిన గతాన్ని మర్చిపోను..ఎందుకంటే జరిగిన గతంలో నా జీవితం ఉంది❣️నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి..అబద్ధాలు ఎప్పుడూ తియ్యగానే ఉంటాయి❣️ దురదృష్టం ఏమిటంటే నిజాలు మాట్లాడేవారు చెడ్డవారు అయిపోతారు అబద్ధాలు ఆడేవారు మాత్రం మంచివారు అవుతారు..ఇదే లోకం తీరు❣️ ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధ పడాలని ఎప్పుడూ కోరుకికు..తెలియక బాధ పెడితే క్షమించు❣️ తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు..నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు❣️మనిషి కన్నా విలువైనది మనసు..అవేశం కన్నా విలువైనది ఆలోచన..కోపం కన్నా విలువైనది జాలి..స్వార్దం కన్నా విలువైనది త్యాగం.. వీటన్నింటి కంటే విలువైనది* నమ్మకం* ❣️❣️❣️ మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593🙏🙏🙏🙏

సంప్రదాయాలు

 సైకిలు పెడలు - సంప్రదాయాలు 


(పరమాచార్యులవారు చెబుతుండగా 1947లో వ్రాయబడిన వ్యాసం)


ఎవరైనా సైకిలు నడుపుతుంటే అతను కాళ్ళతో పెడలు తొక్కుతాడు. తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలును త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిలు మాత్రం పట్టుకుని ఉంటాడు. వాడు పెడలు త్రొక్కకపోయినా సరే, అంతకుముందు త్రొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా, సైకిలు ముందుకు వెడుతుంది.


ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు. ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు, బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతిభకు కావలసిన మార్కులకంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు. అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్నివందలరెట్లు ఎక్కువగా ఉంటుంది.


ఇలా జరుతుండటానికి ఏదో కారణం ఉండి ఉంటుంది. ప్రస్తుతం ఏ విశేష కారణమూ కనిపించటంలేదు. ఆచారాలూ, అనుష్టానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకూ ఇతరుల పిల్లలకూ ఏమీ తేడా ఉండట్లేదు. పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లలకంటే ఇతరులే బాగా ఉంటున్నారు. మరి బ్రాహణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ కనపచటానికి మూలకారణం ఏదయ్యుంటుంది ? మనం దాన్ని కనుగొనాలి.


భగవంతుడు పక్షపాతి కాడు. బ్రాహ్మణులు ఆచారాలూ, అనుష్టానాల విషయంలో ఇతరులకన్నా వేరు కాకపోయినా, కొన్ని విషయాలలో ఇతరులకన్నా దిగదుడుపే అయినా, భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు ?

పూర్వీకులు సైకిలు త్రొక్కడం చేత. 


మనకు మూడుతరాల క్రితం జీవించిన మన పూర్వీకులు, జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందటానికి అవసరమైనదానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అనే సైకిలు త్రొక్కారు. ఈరోజు మనం ఏ కర్మానుష్టానమూ లేకుండా కేవలం హ్యాండిలు పట్టుకుని వారి (మన పూర్వీకుల) మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాము.


వాళ్ళు బ్రహ్మముహూర్తంలో 4 గంటలకు నిద్రలేచేవారు. మనం సాధారణంగా సూర్యోదయం తరువాతే నిద్ర లేస్తాం. వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది. మన కాలంలో సకాల సంధ్యావందనం చేసే వాడిని వెతకవలసి వస్తోంది.


వారి కాలంలో ఉదయ సాయంకాలాలలో జనులు సంధ్యావందనములకై గుమికూడేవారు. మన కాలంలో ప్రొద్దున్న ఒక క్లబ్బులోనూ సాయంత్రం వేరే క్లబ్బులోనూ గుమికూడతాము. ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము. ఆత్మశక్తిని కోల్పోయి, ఆత్మను బలహీనం చేస్తాము.


ఈ భూమిలోని ఇతర మతస్తులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం, కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్ధ్యాలతో, అకారణంగా మన వద్దనుండి మొత్తం రాజ్యం లాగివేసుకున్నారు.

బుక్కరాయల గురువైన విద్యారణ్యస్వామి, శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు, కర్మానుష్టానపరులు, భగవదనుభవం అయినవారు. వారు మన ధర్మాన్ని పాడుచేసిన విదేశీయుల కరాళనృత్యాన్ని నాశనంచేసి, మన ధార్మికమైన రాజ్యాన్ని పునః స్థాపించారు.


నాగరికతా ? జంతుప్రవర్తనా ? 


మనకు మూడుతరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోనివారు లేరు. మట్టి, నీటిపాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి. మనం నాగరీకులమయ్యాము. మల, మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదలివేశాము. మనం జంతువులమయ్యాము. ఇది మన నాగరీకత.


ప్రథమ ఆచారమైన శౌచం వదలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా, బూడిదలో (అగ్నికి బదులు) హోమంచేయటంతో సమానం.


మూడుతరాల క్రితం వారు త్రొక్కిన ఫలం ఎంతవరకూ ఉంటుంది ? త్రొక్కకుండా ఉన్న సైకిలు ఎంత దూరం పరిగెడుతుంది ? వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది. మా చిన్నప్పుడు బ్రాహ్మణుల పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళల్లో కనిపించుటలేదు. అలాగే చదివే సామర్థ్యమూనూ.


కాబట్టి, తరువాతి తరాల వారు భగవదనుగ్రహమూ, బ్రహ్మ తేజస్సూ, మేధాశక్తీ కోల్పోకుండా ఉండాలంటే, మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే, మనం "ధర్మశాస్త్ర సైకిలు" లోని "కర్మానుష్టాన చక్రమును", "ప్రవర్తన పెడలు" త్రొక్కడం ద్వారా త్రిప్పుతూ ఉండాలి.

అన్నదానం

 అన్నదానం మహిమ చెప్పే కథ.


ఒక కథ ప్రకారం పూర్వ కాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీ యాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు, సరైన రహదారి వ్యవస్థ ఇంతగా లేనందున కాశీ చేరడానికి వారున్న ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రిళ్లు బస చేస్తూ వెళ్లేవారు.

ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యం కారణంగా చీకటిపడే సమ యానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలే పోయాడు. చీకటిపడింది. ఏమి చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు కనబడింది. అక్కడ ఆశ్రయం కోరాడు. శంబరుడు అనే ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకుని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందున దానిలో పడుకోమని, తాను బయట కాప లాగా

ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అదను చూసి దాడి చేసి చంపి వేసి దేహాన్నితీసుకుపోయింది. బ్రాహ్మణుడు బిక్కచచ్చిపోయాడు. కోయవాని మరణానికి చింతించి తన దారిన తాను వెళ్లాడు.

కాశీ చేరాడు. దైవ దర్శనం చేసు కున్నాడు. ఈ బ్రాహ్మణునికి ఎప్పటి నుంచోె అన్న దానం అంత గొప్పదా అన్న అను మానం ఉండేది. తన ఇష్ట దైవమైన విశ్వేశ్వరుడు ఆ సందేహం తీరిస్తే బావుండునని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతనికి కలలో కనిపించి నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెడతావు. అక్కడి రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువును ఏకాంతంగా ఆశీర్వ దించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు.

రాజ కుమారుణ్ణి ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్లాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మ ణున్ని చూసి నవ్వి, ఓయీ బ్రాహ్మణా, నన్ను గుర్తు పట్టావా. నేను కోయవాణ్నౖన శంబరుణ్ని. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వల్ల ఈ జన్మలో నాకు రాజ యోగం సిిద్ధించింది అన్నాడు. మరు క్షణం అతనికి మళ్లిd పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుల మాదిరి ఆడుకోవడం మొదలెట్టాడు. బ్రాహ్మణుని సంశయం తీరింది. అది ఎలా ఉన్నా అన్నదాన మహిమ ఎంతటి గొప్పదో ఈ కథ చెబుతుంది.


అన్నం గురించి ఓ ఉపాఖ్యానం వుంది.

అన్నం వండేవారు ఏ మనస్సుతో, ఏ భావంతో వండుతారో, దాని ప్రభావం ఆ అన్నం మీద , దాన్ని తినేవారి మీద కూడా ఉంటుంది. అందుకనే దేవుడికి నైవేద్యం వంట చేసేవారు కనీసం దాని రుచిని ఆఘ్రాణించను కూడా ఆఘ్రానించరు. అలా మనసా, వాచా, కర్మణా కూడా తయారైన నైవెద్యాన్ని దేవుడికి నివేదించడం వల్ల దాన్ని దేవుడు ఆరగించటంవల్లే నైవేద్యానికి అంత రుచి వస్తుంది.

25, ఆగస్టు 2022, గురువారం

ఆచార్య నాగార్జునుడు

 ఆచార్య నాగార్జునుడు  - 


      నాగార్జునుడు ప్రపంచ ప్రసిద్ది చెందిన మహా పురుషుడు . ఆయన విద్యావేత్త , రసవేత్త , మంత్రవేత్త , తంత్రవేత్త , యంత్రవేత్త , ప్రజావేత్త  మరియు కాయసిద్ధి పొంది జరా మరణాలు ను జయించి అతీంద్రియ శక్తులు సాధించి అదృష్యరుపుడు అయ్యి సంచరిస్తున్న అమరవేత్త. ఆయన జననం గురించి వాదోపవాదాలు ఉన్నా ఆయన పక్కా ఆంద్రుడు అనే వాదన బలంగా ఉంది. 


         గౌరనకవి రచించిన నవనాధ చరిత్ర అనే ద్వీపకావ్యంలో సిద్ద నాగార్జుని చరిత్ర వర్ణింప బడినది. దాని ప్రకారం నాగార్జునుడు ఒక రాజపుత్రుడు. ఒకనాడు వేటకి పోయి విధివశాన సర్పరూపమ్ పొంది మద్దిచెట్టు తొర్రలో దాగినాడు. శాపం నుండి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుండగా కొంతకాలానికి అటుగా వచ్చిన ప్రసిద్ధ రసశాస్త్రవేత్త మీననాధుడు అనే రసయోగి నాగార్జునిని గమనించి శాపనివ్రుత్తి చేసాడు. ఆనాటి నుండి ఆయన నాగార్జున నామముతో మీననాధ మహర్షికి ప్రియశిష్యుడు అయినాడు. గురువు వద్ద అణిమాది అష్టసిద్దులను అభ్యసించి అదేవిదంగా ఔషద , తంత్ర, మంత్ర , యంత్ర రహస్యాలు అభ్యసించి గురువు ఆనతిమేరకు లోకసంచారానికి బయలుదేరాడు నాగార్జునుడు సిద్ధి పొందడం వలన సిద్ధనాగార్జునుడు అయ్యాడు.


              ఈయన శాతవాహన రాజుల గౌరవం పొంది వారి రాజ్యంలోని నేటి నాగార్జున కొండ వద్ద ఒక మహావిశ్వ విద్యాలయాన్ని స్థాపించి విద్యాబోధన చేశాడు . ఆ సమయంలో శాతవాహన రాజులు ఆర్ధిక ఇబ్బందులకు గురికాగా తన రసవిద్యా నైపుణ్యంతో శ్రీ పర్వతమును బంగారంగా మార్చివేశాడు. అప్పుడు కాళికా దేవి ప్రత్యక్షం అయ్యి సృష్టి స్వభావానికి విరుద్దం అయిన కార్యం తగదు అని వారించగా నాగార్జునుడు మళ్లి ఆ బంగారుకొండ ని రాతికొండగా మార్చివేశాడు . 


              ఆ తరువాత ఈయన టిబెట్ మరియు చైనా మొదలయిన ప్రాంతాలలో పర్యటించి బౌద్ధ సన్యాసిగా అనేకమందికి విద్యాదానం చేశాడు . అచ్చట 200 సంవత్సరాలు గడిపి దక్షిణ భారతదేశంలో మరొక 200 సంవత్సరాలు గడిపి ఆ తరువాత నేటి శ్రీశైలం కొండపైన 120 సంవత్సరాలు గడిపాడు అని టిబెట్ ఆచార్యుడు తారానాధ పండితుడు పేర్కొన్నాడు . 


              మన్దాన భైరవుడు రచించిన ఆనంధకంధం అనే గ్రంథంలో సిద్ధనాగార్జుని వంటి ఎందరెందరో సిద్ధులు , భైరవులు  అతిమానుష ప్రజ్ఞ సంపాదించిన వారై జీవన్మ్రుతులుగా పవన భక్షులుగా గగన వీధుల్లో సంచరిస్తున్నారు అని వివరించబడింది.


  సిద్ధనాగార్జునుడు రచించిన గ్రంథాలు  - 


 *  సుశ్రుత ఉత్తర తంత్రం .


 *  రసవైశేషిక సూత్రం 


 *  లోహశాస్త్రం .


 *  కచ్చపుట తంత్రం.


 *  రస కచ్చపుట .


 *  ఆరోగ్య మంజరి.


 *  యోగాసారం .


 *  రసేంద్ర మంగళం 


 *  రతి శాస్త్రం . 


 *  సిద్ధ నాగార్జునీయం .


          మొదలయిన అధ్బుత గ్రంథాలు రచించారు.


      ఈయన అతి సులువయిన , ఔషద ప్రక్రియలని రూపొందించి ఆనాటి అనేక పట్టణాలలో , గ్రామాలలో ప్రజల ఉపయోగార్ధం ఆ ప్రక్రియలను రాతి పలకాల మీద చెక్కిన్చాడని నేటికి దొరుకుతున్న అనేక శాసనాల వల్ల తెలుస్తుంది.


  

 

24, ఆగస్టు 2022, బుధవారం

మగువ "ముక్కుపుడక

 👆

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *మగని ప్రేమకు గుర్తు*             

    *మగువ "ముక్కుపుడక"*           

  (చొప్పకట్ల సత్యనారాయణ గారు)

                  🌷🌷🌷

'మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక' అన్నాడో కవి. ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.


ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి టుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.ముక్కు, చెవులకు రంధ్రాలు చేయడం శరీరారోగ్యానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.


కొండగాలి తగలడం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన రొంప, పార్శ్వ నొప్పి, ముక్కు దిబ్బడ, సైనస్‌లు పూడుకుపోవడ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుంచి రక్షణ కోసం గిరిజన మహిళలు ముక్కుపుడక వంటివి విధిగా ధరిస్తారు.మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.


ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.


అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.


పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు .

                             స్వస్తి!

 #పిప్పలాదుడు


#పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!

#జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు

#మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది.  ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు.  తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

   

#ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు.  నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-

#నారదుడు- నువ్వు ఎవరు?

#అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

#నారదుడు- నీ తండ్రి ఎవరు?

#అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

# అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి!  నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి.  నీ తండ్రి అస్తిక తో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు.  మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

#అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?

 #నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.

 #పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?

 #నారదుడు- శనిదేవుని మహాదశ.

   

#ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.

 #నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు.  బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు.  విశ్వంలో కలకలం రేగింది.  సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.


#సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి  అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-


 1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.


 2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది.  కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

 

దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని

 "శనిః చరతి య: శనైశ్చరః" అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.

        శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.


#సర్వోజనా సుఖినోభావంత్

చేబదులు

 "నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 


ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 


కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి 

టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! 


అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !


సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 


ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 


చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు ! 


లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 


వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 


ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!


దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 


ముఖ్యమంత్రి పదవి అంటే  తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి  ముఖ్యమంత్రిని చూడగలమా ? 

చూడగలమా ? 


అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 


ఆ తరం వేరు 

నేటి తరం వేరు !


ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు ! 


డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు  రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !


దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !


ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

23, ఆగస్టు 2022, మంగళవారం

కాఫీగురించి

 *కాఫీగురించి రెండుపద్యాలు.....*  



కప్పు కాఫిని లొట్టలేయుచు కాంక్ష తోడుత త్రాగగా 

సిప్పు సిప్పున మోదమందుట చిత్రమౌట నటుంచుమా!

ఎప్పుడైన పరాయి యిండ్లకు నేగ కాఫిని పోయమిన్ 

చిప్పమోమట దిక్కుగా మన సిగ్గు పోవదె తల్చగా 


చింతజేయగ కాఫి త్రావుట చిత్రమౌ వ్యసనమ్ముగా 

వింతచేష్టలు పుట్టి వ్రేల్చును వేళలందున త్రావమిన్ 

గొంతు లెండును జీరవోవును క్రుంగిపోవును ప్రాణముల్ 

సుంతయైనను శాంతముండదు స్రుక్కి త్రెళ్ళుగ మానవుల్ 

*~శ్రీశర్మద*

నిత్య సంతోషపరుడు

 

నిత్య సంతోషపరుడు

ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని సదా కోరుకుంటాడు కానీ ఎంతమంది సంతోసహాయంగా ఉన్నారు అని విచారిస్తే ప్రతి వారు తాను సంతోషంగా లేను అనే అంటారు.  ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పరు. దీనికి కారణం ఏమిటో విచారిద్దాం. ఒక విద్యార్థి దగ్గరకు వెళ్లి అడిగితే తాను పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానో  లేదో అనే దిగులు వుంది అందుకే నేను సంతోషంగా లేను అంటారు.  ఒక గృహస్తు వద్దకు వెళ్లి అడిగితే తన సంపాదన తన అవసరాలకు సరిపోవటం లేదు అందుకే నేను సంతోషంగా లేను అని అంటాడు .  ఇలా ప్రతివానికి ఏదో ఒక దిగులు, వెలితి జీవితంలో చోటు చేసుకుంటుంది.  లేని వారికి లేదని దిగులు.  ఉన్నవానికి ఉన్న దాన్ని కాపాడుకోవడం ఎలా అనే దిగులు.  ఇలా చెప్పుకుంటూ పోతే దిగులు, విచారం, అసంతృప్తి లేని మనిషి లేనే లేడనేది సత్యం.  ఎన్ని బాధలు ఉన్నా తాను సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు.  అంతేకాక తాను సంతోషంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు కూడా. ఒక ప్రయత్నం తరువాత ఒక ప్రయత్నం సాగిస్తూనే వుండాడు.  కానీ జీవితం విచిత్రమైనది ఒకటి సాధిస్తే మనస్సు దాని తర్వాత ఇంకొకటి కోరుతుంది.  అదే అవసరాలు, కోరికలు.  ఈ ఆధునిక యుగంలో ఎన్ని వున్నా కూడా మనిషి ఇంకా ఇంకా ఇంకొకటి కావాలని కోరుకుంటున్నారు. గతంలో నీకు లేనిది ఇప్పుడు వచ్చింది కదా మరి దానితో నీవు సుఖంగా ఉండొచ్చు కదా అంటే లేదు నీకు వెంటనే ఇంకొకటి కావాలని కోరిక కలుగుతుంది. నీకు ఫాను కావలి గాలి ఆడడం లేదు అన్నావనుకో ఫ్యాను పొందితే చల్లని గాలి కావలి ఏరుకులర్ కావలి అంటావు.  అది వచ్చిన తర్వాత ఎయిర్ కండిషనర్ కావాలి అంటావు.  అంటే మనిషి ఒకటి పొందిన తరువాత దానితో తృప్తిగా లేకుండా అంతకన్నా మెరుగైనది ఇంకొకటి కావాలనే వాంచ కలుగుతున్నది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఏదీ కూడా నిన్ను సంతోష పెట్టటం లేదు ఇంకొకటి ఉంటే సంతోషంగా వుంటాను అనుకుంటావు కానీ అది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వటంలేదు. మరి నీవు ఎప్పుడు సంతోషంగా వున్నావు అంటే భవిష్యత్తులో ఉండొచ్చేమో అని అంటావు. "తృప్తస్య భవిష్యామి" నిజానికి బౌతికంగా వున్నది ఏదైనా కొంతకాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది.  అది ఒక నిమిషమో, రోజో లేక కొన్ని రోజులో ఇంకా అయితే కొన్ని సంవత్సరాల్లో.  కానీ యదార్ధం ఏమిటంటే ఏది కూడా నీకు జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు. 

ఈ సృష్టిలో ఒక నియమం వున్నది అదేమిటంటే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది.  ఆ మార్పు అభివృద్ధి వైపు కావచ్చు లేక వినాశనం వైపు కావచ్చు. ముందుగా అభివృద్ధి వైపు అయితే అవ్వ వచ్చు కానీ కాలాంతరంలో వినాశనం వైపుకు మళ్లుతుంది. అదే విధంగా మనిషి జీవితంలో కూడా ఒక వయస్సులో సంతోషాన్ని ఇచ్చేది కాలాంతరంలో వయస్సు పెరిగినప్పుడు అదే వస్తువు సంతోషాన్ని ఇవ్వలేదు. అదే అంటే అదే కాదు అలాంటిదే ఇంకొక క్రొత్తవస్తువు కూడా.  ఉదాహరణకు నీవు చిన్నగా వున్నప్పుడు మూడు చక్రాల చిన్న సైకిలు నీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  నీవు కొంత పెరిగి రెండు చక్రాల సైకిలు తొక్కటం అలవాటు అయినప్పుడు నీకు మూడు చక్రాల సైకిలు అస్సలు నచ్చదు.  మరి రెండు సంవత్సరాల క్రింతం వరకు అది నీకు ఇష్టమైన వస్తువు కదా మరి ఇప్పుడు ఎందుకు కాదు అంటే. ఇప్పుడు నీవు దానికన్నా సౌకర్యంగా వున్న వస్తువు నిన్ను ఆకర్షించింది.  అంతే కాదు నీవు ఇంకా కొంత పెరిగిన తరువాత మోటారు సైకిలు ఫై నీ మనస్సు ఆకర్షితం అవుతుంది.  అది లభిస్తే సైకిలు నీకు నచ్చదు.  అంటే ఎప్పుడు నీవు ఉన్నదానికన్నా మెరుదైనదే ఆనందాన్ని ఇస్తున్నది. దీనిని బట్టికూడా మనకు బాధపడేది ఏమిటంటే మన కోరికలు మారుతున్నాయి.  అంటే ఉన్నదానికన్నా మెరుగైనది మనస్సు సదా కోరుకుంటున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

ఈ ప్రపంచాన్ని చుస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ ప్రతిదీ మారుతున్నది.  మారేది ఏది నీకు శాశ్విత సుఖాన్ని ఇవ్వటంలేదు. ఇంకొక సత్యం కూడా నీకు అవగతం అవుతుంది నీకు సుఖాన్ని ఇచ్చింది కాలాంతరంలో దుఃఖదాయకంగా మారుతున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

సృష్టిలో సదా మారకుండా ఉండేది ఏదైనా ఉంటే అది నీకు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వవచ్చు.  మరి సృష్టి నియమమే మార్పు కదా మరటువంటప్పుడు మారకుండా ఉండేది ఏది.

ఆ శోధన ఫలితమే మనకు మన మహర్షులు ప్రబోధించిన ఉపనిషత్ జ్ఞ్యనం. అఖండ జ్ఞ్యాన సంపన్నులైన మహర్షులు వారి వారి అనుభవాలతో తెలుసుకున్న సత్యాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మనకు ఇచ్చిన జ్ఞ్యానమే బ్రహ్మ జ్ఞ్యానం ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం.  సాధకుడు నిత్య సాధనతో తెలుసుకోవలసిన సత్యమే బ్రహ్మ జ్ఞ్యానం. కాబట్టి ప్రతి సాధకుడు తనకు తానుగా తెలుసుకోవలసింది బ్రహ్మ జ్ఞ్యానం మాత్రమే. కాబట్టి సాధక ఇప్పుడే మేల్కొని నిత్యసాధన పరుడవు కమ్ము సదా సంతోషపరుడవు కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

 

బాదరాయణ సంబంధాత్

 బాదరాయణ సంబంధం:: కథ చెబుతా...

 

మనకి "వేలు విడిచిన సంబంధాలు ", "బీరకాయ పీచు సంబంధాలు" లాగానే "బాదరాయణ సంబంధం" ఒకటి ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బాదరాయణ సంబంధం మీద కొన్ని కథలున్నాయి. అందులో ఒకటి ఇదిగో....

 

కోనసీమలో కేశనకుర్రు అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామం లో అమాయక బ్రాహ్మణ కుటుంబం ఒకటి. భార్య, భర్త- ఇద్దరే కుటుంబ సభ్యులు. మరీ సంపన్నులు కాక పోయినా కాస్త సంపన్నులే! దేనికీ లోటు లేదు. అతిథి మర్యాదలు సాదరంగా చేస్తారని ఆ పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు. యజమాని పేరు కామయ్య. 


 

ఓరోజు కామయ్య గారి ఇంటి ముందు ఓ గుర్రబ్బండీ ఆగింది. నిగనిగలాడుతూ జరీ పంచె, కండువాతో ఉన్న ఓ పెద్ద మనిషి దిగేడు. బండి తోలే మనిషి పెట్టె తెచ్చి హాల్లో పెట్టేడు. వెనుకనే హుందాగా నడచి వచ్చాడీ పెద్ద మనిషి. బండి తోలే మనిషి తిరిగి వచ్చి గుర్రానికి గడ్డి వేసి బండి లోనే కూర్చున్నాడు. కామయ్య ఏదో పని మీద పై ఊరుకెళ్ళేడు. పెరట్లో పని చేసుకుంటున్న భార్య సీతమ్మ ఈ పెద్దమనిషి ని చూసి హడావుడిగా హాల్లోకొచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ. 


"అబ్బాయి ఇంట్లో లేడేమిటమ్మా?" అన్నాడు పెద్ద మనిషి సావకాశంగా కాళ్ళు జాపుకుని కండువా తీసి కుర్చీ మీద పెట్టి. 

"పై ఊరు పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు." అని వినయంగా చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. 


ఆమె వివాహమై కొద్ది కాలం మాత్రమే అయింది. పెళ్ళి లో చూడని భర్త తరుఫు బంధువనుకుంది ఆమె. 


కాళ్ళు కడుక్కుని, ఆమె పెట్టిన పలహారం సుష్టుగా తాను సేవించడమే కాకుండా బండివాడికి కూడా పెట్టించాడు పెద్ద మనిషి. 


ఇంతలో కామయ్య తిరిగి వచ్చాడు." ఇదిగో, ఆయన వచ్చారు. " ఆమె లేచి నిలబడింది అంతవరకు పిచ్చాపాటి కబుర్లు చెప్తున్న సీతమ్మ .

"రావోయ్, అల్లుడూ. ఉదయమే ఎక్కడికో వెళ్లి పోయావ్!" అంటూ చనువుగా పలుకరించాడు. 


 

"అర్జెంటుగా పని పడింది. పక్కూరు వెళ్ళేను. కాఫీ, పలహారం సేవించారా?" అని అభిమానంగా అడిగేడు కామయ్య. 


"అన్నీ చక్కగా పెట్టింది అమ్మాయి. అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తూ అన్నపూర్ణ!" అన్నాడు సీతమ్మ ని మెచ్చుకోలుగా చూస్తూ. 


"నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళవలసి ఉంది. మీరు కాస్త విశ్రమించండి. భోజనం వేళకు వచ్చేస్తాను. కలసి భోంచేద్దాం. ఏమీ అనుకోకండి. " అని నొచ్చు కుంటూ లేచాడు కామయ్య. 


"భలే వాడివే! నిరభ్యంతరంగా వెళ్ళి రా. " నీతో కలసి భోంచేసాక నేను కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను." అన్నాడు పెద్ద మనిషి పత్రిక తిరగేస్తూ. 


అతని బాధ్యత  భార్య కప్పజెప్పి వడివడిగా బయటకెళ్ళిపోయాడు కామయ్య. అతడు దినపత్రిక తిరగేస్తూ కూర్చోగా సీతమ్మ వంట పనిలో పడింది. 


ఆమె వంట పూర్తి అయ్యేసరికీ బయటకెళ్ళిన కామయ్య తిరిగి వచ్చేసాడు. 

ఇద్దరికీ వెండి కంచాలలో వడ్డన చేసింది సీతమ్మ. సుష్టుగా భోజనం చేశాడు పెద్ద మనిషి. అరుగు మీద బండీవాడు కూడా భోంచేశాడు. 


పెద్ద మనిషి గదిలో బయలుదేరడానికి సిద్ధమౌతూండగా, "మీ బంధువు మంచి భోజన ప్రియుడే సుమీ. " పెరట్లో మెల్లగా అన్నాడు భార్య తో కామయ్య. 

"మా బంధువు అంటారేమిటి? ఆయన మీ తరుఫు వారు కాదూ?" అంది సీతమ్మ విస్తుపోతూ. 

 

"అబ్బే, మావైపు వారు కాదు. " అన్నాడు కామయ్య. 


దంపతులు ఇద్దరూ హాల్లోకి వచ్చే సరికి పెద్ద మనిషి పెట్టె బండి లోనికి చేర్చడమూ, అతను బయలుదేరడానికి సిద్దంగా ఉండడమూ గమనించారు. 


"వస్తానోయ్. కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను. వస్తాను తల్లీ. మంచి భోజనం పెట్టేవు. " అని బండి వైపు నడిచాడు పెద్ద మనిషి. 


అతడి వెనుకనే నడచి వెళ్ళి, "అయ్యా, తమరు ఎవరో పోల్చుకోలేకపోయాను.  మన సంబంధం....." నసుగుతూ సందేహం వెలిబుచ్చాడు కామయ్య. 


గట్టిగా ఓ నవ్వు నవ్వి, "మనది బాదరాయణ సంబంధమోయ్. " అన్నాడు పెద్ద మనిషి. ఇతడు తెల్ల ముఖం పెట్టడం చూసి, "అర్థం కాలేదూ? బదరి అంటే రేగు. నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు రేగు చెట్టు తో చేసినవే! అదే మన సంబంధం!" అని బండి ఎక్కేసాడు పెద్ద మనిషి. అంతే కాదు, కొసమెరుపు గా...


"శ్లో: అస్మాకం బదరీ చక్రం 

       యుష్మాకం బదరీ తరుః

       బాదరాయణ సంబంధాత్ 

       యూయం యూయం వయం వయం. " 

 

అని ఓ శ్లోకం కూడా వదిలేడు. బండి కదిలింది. బండి మలుపు తిరిగే వరకూ నిర్ఘాంతపోయి నిలిచి చూస్తూ ఉండిపోయారా అమాయక దంపతులు!

 

                    🤣🙏

ధర్మాకృతి

 ధర్మాకృతి : గిణి


సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఉద్యోగధర్మాన శ్రీస్వామినాథన్ బాల్యము విల్లుపురము, తిండివనం చిదంబరం, ఫిరంగిపేట, వికరవాండి మొదలైన గ్రామాల్లో గడిచింది. ముందు జీవితమంతా గ్రామగ్రామంగా విజయం చేయబోతున్నారనేందుకు సూచనేమో ఈ త్రిప్పట.

పెద్దకుమారుడు కలిగిన తొమ్మిదేళ్ళ తరువాత ఇక పుత్రులు కలగరేమో బెంగపడుతున్న సమయంలో పుట్టిన వారవడంతో శ్రీస్వామినాథన్ అంటే తల్లిదండ్రులకు ఎంతో ముద్దు, గారాబం. డానికి తోడు చురుకుదనం, మంచి నడవడి, చక్కదనం, మంచి మాటకారితనం, ఇవన్నీ కలసి వారిపై మరింత ఆదరాన్ని కలుగజేశాయి. ఇన్ని వన్నెలున్న తమ కుమారుని పంచవన్నెల రామచిలుకకు కన్నడ పర్యాయపదమైన ‘గిణి’ అనే పేరుతో పిలుచుకోసాగారు. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం