3, జులై 2026, శుక్రవారం

పునర్జన్మ

  సనాతన ధర్మం - పునర్జన్మ

                 

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు.


అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు…


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు.   కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెప్పాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర ‘కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలోకి వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా?’ అని అడిగారు.


అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు, అని అనుకున్నాడు.


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు.


అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు,” అని తన కారులో వెళ్ళిపోయాడు. 


సాయత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందుకు వచ్చాడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు.


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చేసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.


స్వామివారు అతన్ని చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు…

”వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు.” అని చెప్పాడు.


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం” అని చెప్పారు.


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వు నవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ।। 19 ।।



ప్రతిపదార్థ:


ఇహ-ఏవ — ఈ జన్మ లోనే; తైః — వారిచే; జితః — జయింపబడును; సర్గః — సృష్టి (జగత్తు); యేషాం — ఎవరైతే; సామ్యే — సమభావము నందు; స్థితం — ఉందురో; మనః — మనస్సు; నిర్దోషం — దోషరహితమై; హి — నిజముగా; సమం — సమ దృష్టి యందు; బ్రహ్మ — భగవంతుడు; తస్మాత్ — కాబట్టి ; బ్రహ్మణి — పరమ సత్యము నందు; తే — వారు; స్థితాః — స్థితులై ఉందురు.


 

తాత్పర్యము : 



సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.



వివరణ:


శ్రీ కృష్ణుడు 'సామ్యే' అన్న పదం వాడాడు, అంటే, ఇంతకు క్రితం శ్లోకం లో చెప్పినట్టు, అన్ని ప్రాణుల యందు సమ భావమును కలిగినవాడు, అని. అంతేకాక, సమ-దృష్టి అంటే, ఇష్టాయిష్టాలకు, సుఖ-దుఃఖాలకు, కీర్తి-అపకీర్తిలకు అతీతంగా ఉండటం కూడా. ఈ విధంగా ఉండగలిగిన వారు, పదేపదే వచ్చే జనన-మరణ సంసారాన్ని దాటేస్తారు.


మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, ఈ సమత్వ దృష్టి అనేదాన్ని పొందలేము, ఎందుకంటే, శారీరక ఆహ్లాదము మరియు కష్టముల పరంగా కోరికలు, ద్వేషాలు అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి. యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి, ప్రాపంచిక బంధాలని త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:


 


సేవహిఁ లఖను సీయ రఘుబీరహి, జిమి అబిబెకీ పురుష సరీరహి


‘ఒక అజ్ఞాని తన శరీరానికి సేవ చేసినట్టుగా, లక్ష్మణుడు సీతారాములకు సేవ చేసాడు.’


 


ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో, శారీరక సుఖ-దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతుడై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటాడు. స్వార్థ పూరిత శారీరక కోరికలని త్యజించటం ద్వారా వచ్చే ఈ నిశ్చలతత్త్వం, వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది. మహాభారతం ఇలా పేర్కొంటున్నది: యో న కామయతే కించిత్ బ్రహ్మ భూయాయ కల్పతే, ‘కోరికలను త్యజించిన వాడు ఈశ్వరుడిలా అవుతాడు.