14, మే 2026, గురువారం

శ్రీ కృష్ణ కుచేల

               శ్రీ కృష్ణ కుచేల 


సతి మాటల్ విని  భూసురాన్వయుడు 

           శ్రీ సర్వేశునిన్ జూడగన్

నతి వేగంబుగ నేగె ద్వారకకు

           నానా ప్రాంతముల్ దాటియున్ ,

గతి యింకన్ తన  కీజగంబునను

         యా కంసారియే నంచు తా

మతిలో దల్చుచు భక్తితో మధు రి

          పున్ మాధుర్య ముప్పొంగగన్      17* 


కతిపయ దినములు నడచియు

యతులితమగు   భక్తి తోడ  యా భూసురుడున్

శృతి వంద్యు డైన కేశవు

నతి వేగము తోడ కలువ నగరము జేరెన్.  18** 


అటజని కాంచె భూమిసురు

           డంబరచుంబిత భర్మహర్మ్యముల్ ,

భటయుత రాజమార్గములు ,

           భాసుర దివ్య వికాస పణ్యముల్ ,

నటు నిటు  దిర్గు పౌరులను ,

           నవ్య శుభాంగుల దివ్య కాంతులన్ ,

స్పుటతర చారుసుందరపు

         శోభల నచ్చట ద్వారకాపురిన్       19** 


సర్వ మెరిగిన కృష్ణుడు సమ్మతమున

బాల్య మిత్రుని రాకకు పరవశించి

గురుకులంబున విషయముల్ గుర్తురాగ

పలికె నీరీతి సతులతో బాల్యసరళి.       20** 


✍️గోపాలుని మధుసూదనరావు🙏

చేయవలసిన పనిని

  ☘☘☘☘☘☘☘☘☘☘☘☘

                    *ధార్మికగీత - 126*

                      ***************

       *శ్లో:- ఉపేక్ష్య సమయే కార్యే౹*

              *భగ్నే చింతా నిరర్థకా ౹*

              *నిర్గతే సలిలే తత్ర ౹*

              *సేతు బంధో నిరర్థకః ౹౹*

                             *****

    *భా:- చేయవలసిన పనిని తగిన సమయములో చేయ కుండా, తరువాత ఆ పని పాడయి పోయినదని విచారించడం వలన ప్రయోజనం ఉండదు. నీరు పారు తున్నప్పుడే గట్టు కట్టాలి. తరువాత గట్టు కడితే లాభం ఏమిటి? గత జల సేతుబంధనం అంటే ఇదే!*

☘☘☘☘☘☘☘☘☘☘☘☘

🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

*గురువారం 14 మే 2026*


*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం -10వ రోజు **🌹


నిన్న మనం హనుమంతుని విద్యా చాతుర్యాన్ని, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న ఆతురతను తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు శ్రీరాముని కథను వినడానికి ఎంతటి మక్కువ చూపుతారో మరియు ఆయన హృదయంలో సీతారామ లక్ష్మణులు ఎలా కొలువై ఉంటారో ఈ ఎనిమిదవ చౌపాయి ద్వారా తెలుసుకుందాం.


    **ఎనిమిదవ చౌపాయి**


 **ప్రభు చరిత్ర సునిబే కో రసియా |**

**రామ లఖన సీతా మన బసియా ||**


           **ప్రతిపదార్థం**


          * **ప్రభు చరిత్ర**  


తన ప్రభువైన శ్రీరామచంద్రుని కథలను/చరిత్రను


  * **సునిబే కో** 

        వినడానికి


  * **రసియా:** 


మిక్కిలి ఆసక్తి కలిగినవాడు (ఆనందాన్ని పొందేవాడు)


  * **రామ లఖన సీతా**


 శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మ


  * **మన బసియా**


(ఆయన) మనస్సులో ఎల్లప్పుడూ నివసిస్తారు.


**విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. ప్రభు చరిత్ర సునిబే కో రసియా (రామకథా ప్రేమికుడు)**


ఆసక్తి దేనియందు ఉంటుందో అది రసికత. ప్రభు చరిత్ర వినడం లో రసికుడు స్వామి.రామకథను వినడంలో ఆయనకు ఎప్పుడూ తృప్తి కలగదు. "ఎక్కడ రామకథ జరుగుతుందో అక్కడ హనుమంతుడు అంజలి ఘటించి రెండు చేతులు శిరసు మీద పెట్టుకొని పరమ ఆర్ద్రత తో కన్నీరు కారుస్తూ వింటాడు" 


రామచంద్రమూర్తి అయోధ్య వాసులందరికి ముక్తినిస్తూ సరయూనదిలోకి వెళుతూ హనుమంతుని మాత్రం నువ్వు చిరంజీవి కనుక ఇక్కడే ఉండాలన్నాడు. నీ కథ ఉన్నంతకాలం ఉంటానన్నాడు హనుమ. ఆయనకు రామకథ అంటే అంత ఆసక్తి సర్వవ్యాపకమైన పరమేశ్వరస్వరూపం కనుక ఇప్పటికీ ఎక్కడ రామకథ జరిగితే అక్కడ ఉంటాడు ఆంజనేయస్వామి


శ్రవణం ఒక యోగం, భగవత్ కథలు ఏడు రోజుల విన్నంత మాత్రాన ముక్తి పొందాడు పరీక్షిత్తు. రసికత ఉంటే వెంటనే ఆ యోగం వస్తుంది.


ప్రుధు చక్రవర్తి అనేక యాగాలు చేసి సాక్షాత్ శ్రీమన్నారాయణుని ప్రత్యక్షం చేసుకుని కోరిన వరం ఏమిటో తెలుసా ఎల్లప్పుడూ నీ కథలు వినడానికి పది వేల చెవులు ఇవ్వమని. అంటే ఎల్లప్పుడూ నీ కథలు వినే భాగ్యం కావాలి అని కోరడం.


సంస్కారం ఉన్నవారికి భగవత్కథలు వింటూ ఉంటే విసుగు రాదు, ఇంకా వినాలనిపిస్తుంటుంది. వారు ఎన్నిమార్లు వింటామని కాకుండా ఎన్నిమారైనా వింటారు. హనుమంతుడు ఎన్నో మార్లు విన్నాడు... ఇప్పటికీ వింటూనే ఉంటున్నాడు. రామకథలో రసజ్ఞత ఉన్నది.


మనం చదివితే కొంతే మనసులోకి వెళ్తుంది,అదే వింటే అనేక విషయాలు వస్తాయి,మనం చదువుకునేది హనుమాన్ చాలీసా కానీ ఇందులో రామాయణం వస్తుంది, పరాశర సంహిత వస్తుంది, అక్కడక్కడ భారతం వస్తుంది, భాగవతం వస్తుంది అందుకే శ్రవణం ఒక యోగం.


రెండు చేతులూ శిరస్సు మీద పెట్టుకుని, కనుల ఆనందబాష్పాలు రాల్చుతూ తన్మయుడై వింటాడు అలా విన్నవాడు ఎవడైనా కనిపిసే వాడే హనుమంతుడు మహాత్ములు ఎప్పుడు ప్రచ్ఛన్నంగా వస్తారు. అలాంటి వారిని పోల్చడం కూడా మహాకష్టం


రామకథ జరిగేచోట హనుమంతుడు ఉంటాడు. తులసీదాసుకు ఇది అనుభవము. అందుకే రామకథ జరిగేటప్పుడు ప్రయత్నపూర్వకంగా వెళ్ళాలి. హనుమంతుడు ఉన్న చోటులో మనం కూర్చుంటాం. ఆ మహాత్ముని శక్తి తరంగాలు వ్యాపించిన ప్రాంగణంలో కూర్చుంటే సమస్త పాపాలూ నశించిపోతాయి. రామకథారసజ్ఞుడు హనుమంతుడు. అది 'ప్రభుచరిత్రసునివేకోరసియా'


ఇది భక్తుడికి ఉండవలసిన 'శ్రవణ భక్తి'కి నిదర్శనం. జ్ఞానం ఎంత పెరిగినా భగవంతుని లీలలను వినడం వల్ల కలిగే ఆనందం అంతటిది.


**2. రామ లఖన సీతా మన బసియా (హృదయ పీఠం)**


హనుమంతుని హృదయం ఒక దివ్యమైన కోవెల. అక్కడ సీతారామ లక్ష్మణులు నిరంతరం కొలువై ఉంటారు అని ఒక భావం. ఇది సత్యమే కానీ తులసి దాసు గారు హృదయం ఇది కాదు అని పెద్దలు చెపుతారు.సీతా, రామ లక్ష్మణుల హృదయాల్లో ఉన్న హనుమను ఇక్కడ తులసి దాసు గారు దర్శించారు.


దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్


రామచంద్రమూర్తికి దక్షిణం వైపు లక్ష్మణుడు, ఎడమవైపు సీతమ్మ ఉన్నారు. ముందు హనుమ ఉండి ఆ ముగ్గురినీ హృదయంలో నిలుపుకుని ధ్యానిస్తున్నాడు. కానీ ఆ ముగ్గురి హృదయంలో హనుమంతుడు ఉన్నాడని ఇక్కడ చెప్పారు. అంటే హనుమంతుడు ఎంత రామభక్తుడో సీతారాములు అంత హనుమద్భక్తులు అనే విషయాన్ని ప్రమాణంతో చెప్పుకున్నాం.


రామచంద్ర మూర్తి ఇసుమంత ఉపకారం చేస్తేనే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు.వేలకొలది అపకారాలు చేసినా మర్చిపోతాడు. అది రామచంద్రమూర్తి గొప్ప వ్యక్తిత్వం. అంత వ్యక్తిత్వం కలవాడు మహోపకారం చేసిన హనుమను మర్చిపోతాడా...? ఎప్పుడూ హృదయంలోనే పెట్టుకున్నాడు.


ఇక సీతమ్మ హనుమ ను ఎప్పుడు మర్చిపోదు పట్టాభిషేక సమయంలో కూడా రాముడు ప్రేమతో ఇచ్చిన ముత్యాల హారం హనుమ కి ఇచ్చింది తల్లి. అంతటి కృతజ్ఞతా భావం.


సంజీవని తెచ్చి ప్రాణం కాపాడిన హనుమను, సంజీవ రాయుడుగా ఎల్లప్పుడూ హృదయం లోనే పెట్టుకున్నాడు.


అందుకే 'రామలషన సీతా మన బసియా' అనే ఒక్క మాటలో సీతారామలక్ష్మణులు హనుమంతుడి నుంచి పొందిన ఉపకారం, ఆ ఉపకారాన్ని నిరంతరం మనస్సులో పెట్టుకోవడాన్ని స్పష్టంగా చూపిస్తున్నారు.


అటు తర్వాత మరొక అద్భుతమైన చౌపాయీలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడినుంచి రెండు చౌపాయీలు హనుమ యొక్క అద్భుతమైన రూపాలను చూపిస్తుంటాయి. వాటిని రేపు దర్శించబోతున్నాం. ఇవి అత్యంత ముఖ్యమైన చౌపాయీలు.


**తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా భక్తి మార్గంలో రెండు ముఖ్యమైన సూత్రాలను చెప్పారు:


*1. **వినడం (Listening)** 


ఆధ్యాత్మిక ఉన్నతికి భగవంతుని గుణగణాలను నిరంతరం వినడం అవసరం.


*2. **ధ్యానం (Meditation)** 


మనస్సును భగవంతుని నివాసంగా మార్చుకోవాలి.

మనం కూడా హనుమంతుని వలె రామకథా రసికులమైతే, మన మనస్సులో కూడా ఆ పరమాత్మ స్థిరంగా కొలువై ఉంటాడని ఈ చౌపాయి అంతరార్థం.


*జై శ్రీరామ్! జై హనుమాన్!*       

       🍁🌹🙏🌷🍁


          *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

విషములువిషములు

విషములు వాని లక్షణములు  - 


 మహా విష సర్పములు  - 


 శ్మశానము , రచ్చ చావిళ్ళు, పాడుబడిన యజ్ఞ స్థానములు, పాడుబడిన ఇండ్లు, నాలుగు దోవలు కలిసిన తావు, నీళ్ల గట్టు, పాడు తోటలు, మాణి తొర్రలు, పాలమాను, వేపచెట్టు, సెలయేళ్ళు, గుహలు, వీనియందు ఉండు సర్పములు , జడలు ధరించిన సర్పములు , చత్రరేఖలు, మత్స్యరేఖలు, కుంభ రేఖలు , త్రిశుల రేఖలు , గల సర్పములు , ఎర్ర ముఖము , ఎర్ర కన్నులు గల సర్పములు కరచిన యెడల వీనికి కాల నియమం లేదు . విషము ఎక్కుటకు క్రమము లేదు . ఈ విషమును తిప్పుటకు మంత్ర ఔషదములు లేవు . ఒకవేళ బలి, నమస్కార , జప, శాంతి, మంత్ర ఔషధుల చేత ఎవడన్నా బ్రతికినా రూపము చెడును. అంగవైకల్యం కలుగును.


 స్థాన విధి దోషము  - 


 శ్మశానము, రచ్చ మాకులు వీని యందు పంచమి, పక్ష సంధులు, అష్టమి, నవమి, సంధ్యలు, అర్ధరాత్రి ఈ కాలముల యందు ఎట్టి పాము కరిచినను విషం ఎక్కును.


 నక్షత్ర దోషము  - 


 భరణి, కృత్తిక, ఆశ్లేష, విశాఖ, పుబ్బ, పుర్వాబాద్ర, పుర్వాషాడ , మఖ, శతబిషం , నైర్రుత ముహూర్తం , పర్వములు వీని యందు పాము గరిచిన యెడల మనుష్యుడు జీవించుట దుర్లభం .


 విష సాధ్య లక్షణములు  - 


  పాము కరిచిన వానికి తలవెంట్రుకలు రాలుట , మూర్చ, శ్వాసము, వెక్కిళ్ళు, దగ్గు , వాంతి , రొమ్ము బరువు, వణుకు, వికారము , వేదన, కన్నులు ఎరుపు ఎక్కుట , గొంతు పట్టుట, పండ్లు నేరేడు పండ్లు వలే నల్లనగుట, నవ రంధ్రముల నుండి రక్తము కనిపించుట, నోట నురుగు వచ్చుట, కాళ్ళు, చేతులు నల్లగా అగుట ఈ లక్షణాలు కనిపించిన ఆ మనుష్యుడు బ్రతకడు. 


 తేలు విషము  - 


  సర్ప శరీరములు మురగిన యెడల తేళ్ళు జనించును.మరియు పేడ లొను , శ్మశాన దగ్ధ స్థలముల యందు బుట్టును. వీని విశములు మంత్ర ఔషధములకు సాద్యం కాదు. అవి తెలుపు,ఎరుపు,నలుపు వర్ణములు కలిగియుండును. వీని విషం ఎక్కినవానికి నాలుక మంధమేక్కును , మిక్కిలి నొప్పి , ముక్కున నెత్తురు వచ్చుట, శరీరం చెమర్చుట, మూర్చ, నోరెండుట కలుగును. 


 గర విష లక్షణము  - 


 స్త్రీలు పురుషులను వశపరుచుకోనుటకు , అట్లే పురుషులు , స్త్రీలను వశపరుచుకోనుటకు నానా జంతువుల బస్మ, మల, మూత్రాదులు, ఔషధములను , అల్ప వీర్యములు గల విషములు మొదలగు వానితో కుడా చేర్చి అన్నపాన తాంబూలం, మద్యపానం తో నోసంగేదరు. దీనినే గర విషము , పెట్టుడు మందు అనికూడా అంటారు. 


 పెట్టుడు మందు లక్షణము  - 


 ముఖము తెల్లగా అగుట,ఓడలు చిక్కుట, అగ్నిమాంద్యము, దగ్గు , ఉబ్బసము , వాత ప్రకోపము, మహోదరము, గుండెలలో నొప్పి , బలహీనత, హీన స్వరము, మోహము, కడుపు ఉబ్బారము, నిద్ర యందు భ్రమ. స్వప్నం నందు నక్క,పిల్లి, ముంగీస, పాము , కోతి, ఎండిన గుంటలు, కాలిన మానులు , వీనిని చూచుట, తన దేహము నానా వర్ణములు గా కనిపించుట, ముక్కు విరిగినట్టుగా ఉండుట, కన్నులు గుంటలు పడుట ఈ లక్షణములు పెట్టుడు మందు వలన కలుగును. ఇవి కనిపించిన వెంటనే చికిత్స చేసిన బ్రతుకును. లేనిచో మరణం తప్పదు. 


 విషాన్న లక్షణము  - 


 విషముతో కూడిన అన్నము తేలికగా నుండక దట్టముగా ఉండును.చిరకాలమునకు పక్వమగును. పక్వమైన అన్నము చద్ది అన్నము వలే ఉండును. అన్నం ఉడుకుతున్నప్పుడు దాని మీద ఆవిరి నెమలి కంట మ్ రంగు వలే ఉండును. ఆ అన్నం చూసినప్పుడు మొహము, మూర్చ , నోట నీళ్ళను కనిపించును. వర్ణము, వాసనయు హీనమగును. ఆవిరి యందు తళుకులు కలిగి ఉండును. 


 విషము కలిపిన కూరలు  - 


 విషముతో కలిసిన కూరలు ఎండి నట్టు ఉండును. కాషాయ వర్ణం కలిగి రుచిహీనమై వేరొక వికారm చెందును. ఆ కూరల పైన నురుగు వలెను , సీమంత రేకల వలెను , బుగ్గల వలెను కనపడును. ఇలా ఉండిన కూరల యందు విషం కలిసినట్టు . 


 విషాన్న పరీక్ష  - 


  విషముతో కూడిన అన్నమును అగ్నిలో వేసిన జ్వాల పుట్టాక ఉండును. పొగ , దుర్గంధం పుట్టును. ఆ అన్నం మీద ఈగలు వాలిన చచ్చును. కాకి చూచినా హీన స్వరముగా కూయును . నెమలికి మంద దృష్టి కలుగును . చిలుకలు, గోరువంకలు చూచిన మిక్కిలి కూయును . కొతి మలం జార్చుకోనును. కావుణ బుద్ధిమంతుడు అయిన వాడు పరీక్షించి తినవలెను. 


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .